Jump to content

అమృతా షేర్-గిల్

వికీపీడియా నుండి
అమృతా షేర్‌ గిల్‌
జననం(1913-01-30)1913 జనవరి 30
బుడాపెస్ట్, హంగేరీ
మరణం1941 డిసెంబరు 5(1941-12-05) (వయసు: 28)
లాహోర్, బ్రిటీషు రాజ్యం (ప్రస్తుత పాకిస్తాన్)
జాతీయతభారతీయురాలు
రంగంచిత్రకారులు
శిక్షణGrande Chaumiere
École des Beaux-Arts (1930–34)

అమృతా షేర్‌ గిల్‌ (ఆంగ్లం: Amrita Sher-Gil) (30 జనవరి 1913[1] - 5 డిసెంబరు 1941[2]) 20వ శతాబ్దానికి ప్రముఖ భారతీయ చిత్రకారిణి. అమృత తన చిత్రపటాలలో తరచూ స్త్రీలు, వారు పడే కష్టాలను చిత్రీకరిస్తూనే, ఆధునిక భారతీయ చిత్రకళ తోడ్పడుతూ, చిత్రకళలో చేరగని ముద్ర వేసింది. మెక్సికో కు చెందిన చిత్రకారిణి తో పోలుస్తూ, అమృత భారతదేశపు ఫ్రీడా కాహ్లోగా వ్యవహరించబడింది. భారతదేశంలో అత్యంత ఖరీదైన పెయింటింగ్ లను చిత్రీకరించిన మహిళా చిత్రకారిణి అమృత కావటం విశేషం. 1938లో గోరఖ్‌పూర్ లోని తన ఎస్టేట్‌లో గీసిన ‘ఇన్‌ ది లేడీస్‌ ఎన్‌క్లోజర్‌’ చిత్రం ఒక వేలంలో రూ.37.8 కోట్లకు అమ్ముడుపోయింది.[3] భారతీయ కళాకారుల చిత్రాలకు సంబంధించి ప్రపంచ వేలంలో దక్కిన రెండో అత్యధిక ధర ఇది.  అమృతా షేర్‌ గిల్‌ చిత్రాల్లో ఇప్పటివరకూ అత్యధిక ధర పలికింది కూడా ఇదే. 2021లో శాఫ్రాన్‌ఆర్ట్‌ సంస్థ ఈ వేలం నిర్వహించింది.[3]

2023 సెప్టెంబరు 16న జరిగిన సాఫ్రోనార్ట్ వేలంలో 1938 లోనే అమృత చేతులతో చిత్రీకరించబడ్డ అందమైన ఆయిల్ పెయింటింగ్ ‘ది స్టోరీ టెల్లర్’ రూ. 61.8 కోట్లకు ($7.4 మిలియన్లు) ధర పలికింది.[2] దీంతో సయ్యద్ హైదర్ రజా గీసిన ‘జెస్టేషన్’ పెయింటింగ్ నెలకొల్పిన ప్రపంచ రికార్డును ఆమె బద్దలుకొట్టినట్టయింది. ఒక భారతీయ పేయింటర్‌ వేసిన చిత్రానికి లభించిన అత్యధిక ధర ఇదే అవడం విశేషం.[2]

బాల్యం , విద్యాభ్యాసం

[మార్చు]
Young Girls

సిక్కు రాచవంశానికి చెందిన సంస్కృత, పర్షియన్ పండితులు ఉమ్రావో సింఘ్ షేర్-గిల్ మజితియా, హంగేరికి చెందిన ఒపేరా గాయని మేరీ ఆంటోనియట్ గోటెస్ మన్ కు అమృత తొలి సంతానం.[1] అమృతకు ఒక సోదరి, ఇంద్రాణీ షేర్-గిల్. అమృత బాల్యం చాలా మటుకు బుడాపెస్ట్ లో గడిచింది. అమృత తన చిన్నతనం నుండే చిత్రకళ పై ఆసక్తి చూపిస్తూ ఉండేది.

తన ఐదవ ఏటి నుండే అమృతా చిత్రలేఖనం చేస్తున్ననూ, ఎనిమిదవ ఏటి నుండి చిత్రలేఖనం పై అధిక దృష్టిని కేంద్రీకరించింది. ఆర్థిక ఇబ్బందుల వలన అమృత కుటుంబం 1921 లో సిమ్లా లో కొంత కాలం ఉన్నారు. పియానో నేర్చుకోవటం, చెల్లితో కలసి నాటకాలు వేయటం వంటివి అమృత చేసేది. బాల్యం లోనే అమృత నాస్తిక ధోరణి కలిగి ఉండేది. [4]

ఇటలీ లో తొలి కళాభ్యాసం

[మార్చు]

తన కళాభ్యాసానికి అనువుగా ఉంటుందని 1923 - 1924 వరకు అమృతా తల్లితో బాటు ఇటలీలో లోని ఫ్ల్రారెన్స్ లో ఉంది.[4] అక్కడి కళాకారులను, వారి కళాఖండాలను గమనించింది. కానీ స్త్రీలను నగ్నంగా చిత్రీకరిస్తోందని, అక్కడి కళాశాల వారు అమృతను వెళ్ళగొట్టారు.[1] 1924 లో మరల భారతదేశం తిరిగివచ్చింది.

ఫ్రాన్స్ లో చిత్రకళ మెళకువలు

[మార్చు]

భారతదేశంపై, ఇక్కడి సంస్కృతి-సాంప్రదాయలపై గౌరవం కలిగిన (ఇండాలజిస్ట్) ఎర్విన్ బాక్తే అమృతకు మేనల్లుడు. స్వయానా చిత్రకారుడు అయిన ఆయన, 1926 నుండి అమృత చిత్రాలకు విమర్శకుడిగా ఉంటూ చిత్రకళలో ఆమె ప్రావీణ్యతకు పునాదులు వేశారు.[2] వారి ఇంటిలోని పనిమనుషులనే తన చిత్రకళకు మాడల్ లుగా అమృత కళను అభ్యసించేది. [4]

తన పదహారవ ఏట అమృత ఒక గొప్ప చిత్రకారిణి అవ్వబోతోంది అని ఆమె తల్లి మేరీ గుర్తించింది.[2] దానితో వారి కుటుంబం అక్కడి నుండి ఫ్రాన్స్ కు తరలి వెళ్ళారు. 1929 లో అక్కడి Ecole Nationale des Beaux Arts లో పియర్రీ వేయిలియంట్, లుసియెన్ సైమన్ వద్ద శిష్యురాలుగా చేరింది.

ఆమె పై అక్కడి చిత్రకళానిపుణుల యొక్క ప్రభావం ఆమె మొదటి చిత్రపటాల (1930ల) లోనే బహిర్గతమైనది. కళను అభ్యసించే సమయంలో అడ్డదారులు వెదుక్కోక, అమృత చాలా క్రమశిక్షణతో ఉండేది. కళ తనని పూర్తిగా ఆక్రమించే అభిరుచిగా అమృత పరిగణించేది. అందులోనే ఆధ్యాత్మిక పారవశ్యాన్ని పొందేది. [5] తను చిత్రీకరించే రూపాలలో, రంగులలో అమృత అసాధారణ ఆలోచనాశైలిని, సాంకేతికతను, పరిణతిని కనబర్చేది. తన చిత్రపటాలలో భ్రమలకు చోటు ఉండేది కాదు. వాటిలో ఎక్కడో తీవ్రమైన విషాదం తొణికిసలాడేది.

మొదటి గుర్తింపు

[మార్చు]

తన తొలినాళ్ళలో అమృత చిత్రపటాలలో పాశ్చాత్య ప్రభావం ఎక్కువగ ఉండేది. పారిస్ లో తన స్వంత జీవితాన్ని, తన స్వంత చిత్రపటాలను, తన స్నేహితులను చిత్రీకరిస్తూ ఉండేది. [4]

1932లో తను చిత్రీకరించిన Young Girls అనే కళాఖండం, ఆ సంవత్సరపు ఉత్తమ చిత్రలేఖనం గా గుర్తించబడింది. ఆ గుర్తిపు దక్కినవారిలో అమృత అందరికంటే చిన్నది. దీనితో గ్రాండ్ సలోన్ లో అసోసియేట్ గా ఎన్నుకోబడ్డది. ఈ ఎంపికలో తొలి భారతీయురాలు కూడా అమృతే. [1]

తన చిత్రపటాలలో విరివిగా వాడిన రంగులు గమనించిన ఆమె గురువు ఒకరు, అమృత కళ తూర్పు దేశాలలో ఎక్కువ ఆదరణకు నోచుకుంటుందని అభిప్రాయపడ్డాడు. అకస్మాత్తుగా భారతదేశం తిరిగిరావాలనే తన కోరిక వలన అమృత మళ్ళీ ఇక్కడికి రావటంతో, ఆమె గురువుగారి అభిప్రాయం నిజమైంది.[4]

భారతదేశాన్ని తన చిత్రలేఖన అంశంగా ఎంచుకొన్న అమృత

[మార్చు]
భారతదేశపు మట్టిపై నా కాలు మోపగనే, నా చిత్రకళలో చాలా మార్పు వచ్చింది, ఈ మార్పు కేవలం నా కళాంశం, దాని ఆత్మలోనే కాదు, సాంకేతిక భావోద్వేగం లో, నన్ను నేను ఒక ప్రాథమిక భారతీయురాలిగా మార్చుకోవటంలో కూడా వచ్చింది. నా కళ యొక్క లక్ష్యం ఏంటో అప్పుడే నాకు బోధపడింది: భారతీయుల జీవితాలను, ప్రత్యేకించి పేద భారతీయుల జీవితాలను చిత్రాత్మకంగా తెలపాలని, ఆ నిశబ్ద ప్రతిబింబాల అనంత శరణాగతి/ ఓపికలను, కోణాకార గోధుమవర్ణ దేహాలను, అందవిహీనం లో కూడా ఆశ్చర్యకరంగా అందంగా ఉండగలగటాన్ని, వారి విషాద నేత్రాల ప్రభావాన్ని నా కాన్వాస్ పైకి తేవాలని. [1]

1934 లో సిమ్లా లో ఉంటూ, అక్కడి గిరిజనులను కలిసి గ్రామాలను పట్టుకు తిరుగుతూ వారి లోని సహజ సౌందర్యానికి సమ్మోహితురాలు అయ్యింది. వారిని చిత్రీకరించిన చిత్రపటాలు ఢిల్లీ, బొంబాయి వంటి మహానగరాలలో ప్రదర్శించింది.[1]

వృత్తిలో ప్రగతి

[మార్చు]

ముదురు రంగు ఉన్న శరీరాలు, ముఖాలలో విషాదాలు, బక్కపలుచగా ఉన్న స్త్రీ-పురుషులు, కూటి కోసం వారు చేసే జీవన పోరాటాలు చిత్రీకరించటానికి అమృత తహతహలాడేది. అంతులేని విషాదాలను నిశబ్దంగా అనుభవిస్తున్న ప్రతిబింబాలు ఆకలి ప్రభావాలను సృష్టించేవి, విధివంచితులు, ఇటువంటి అంశాలను తన చిత్రపటాలలో అమృత ఆవిష్కరించేది. [5]

కళ నా వృత్తి కాదు, నా కళను నేనే, నా గురించి నాకు మాత్రమే తెలుసు!

భారతీయ చిత్రకళ ప్రభావాలు

[మార్చు]

అజంతా గుహలు దర్శించిన ఆమృత అక్కడి చిత్రలేఖన శైలికి ముగ్ధ మోహనురాలు అయ్యింది. ఈ శైలికి తాను పారిస్ లో నేర్చుకొన్న ఆయిల్ పెయింటింగ్ సాంకేతికను జోడించింది. సమకాలీనులు, బెంగాలీ శైలి చిత్రకళ నిపుణులు అయిన అబనీంద్రనాథ్ ఠాగూర్, అబ్దుర్ రహ్మాన్ చుగ్తాయ్, నందలాల్ బోస్ ల శైలికి ఇది వ్యత్యాసంగా ఉండేది. ఆ కాలానికి బెంగాలీ శైలి వెనుకబడి, స్తబ్దుగా ఉన్నదని, తాను అంచనా వేసినట్టు తెలిపింది.[2] దక్షిణ భారతదేశపు స్త్రీ పురుషులను చూసి అజంతా లో చిత్రలేఖనాలకు, ఇక్కడి ప్రజల రంగురూపులకు సామ్యం ఉన్నట్లు కనుగొంది. శైలి మారింది, కానీ భావం, భావావేశం మాత్రం అదే! [5] దక్షిణ భారతీయ ప్రజలను చిత్రీకరించే ప్రక్రియలో అమృత అమితమైన భావోద్రేకానికి గురయ్యేది.

అజంతా, ముఘల్ శైలి చిత్రకళలకు అమృత ముగ్ధురాలైనది.

ప్రేమ

[మార్చు]

1935లో అమృత ఆంగ్ల విలేఖరి మాల్కం మగ్గరిడ్జ్ ను షిమ్లాలో కలిసినది. తన ప్రేమికుడి చిత్రపటాన్ని అమృతా వేసింది. వారు కొంతకాలం సహజీవనం చేశారు. కార్ల్ ఖండాల్వాలా ఆమె భారతీయ మూలాలను కనుగొనమని ఇచ్చిన స్ఫూర్తితో ఆమె యాత్రలు మొదలుపెట్టినది.

దక్షిణ భారతదేశం లో చిత్రకళ

[మార్చు]

1937 లో దక్షిణ భారతదేశం బయలుదేరినది.[2] కనీస సౌకర్యాలకు కూడా నోచుకోని అక్కడి గ్రామీణ ప్రజల బాధాతప్త జీవితాలను చూసి చలించి పోయింది.[4] Bride's Toilet, Brahmacharis, South Indian Villagers Going to Market ఆమె కుంచె నుండి జాలువారినది అప్పుడే. అప్పటి రియలిస్టు వాటర్ కలర్ పెయింటింగులకు ఇవి పూర్తి భిన్నంగా ఉన్నాయి.

శాస్త్రీయ భారతదేశపు కళ వైపే ఆమె అధిక శ్రద్ధ చూపేది. అప్పటి వరకు పేదరికం, నిరాశలు మాత్రమే తొణికిసలాడే భారతీయ చిత్రకళలో, ఈ చిత్రపటాలతో ఆమె వర్ణాల పట్ల, భారతీయ సూక్ష్మాల పట్ల దాగి ఉన్న భావోద్వేగాలతో నింపివేసింది. ఈ సమయానికల్లా అమృతా వృత్తిలో పరివర్తన వచ్చింది. తన కళాత్మక ధ్యేయం, కేవలం భారతీయ ప్రజల జీవన విధానాన్ని తన కాన్వాస్ ద్వారా వ్యక్తపరచటం మాత్రంగానే దిశానిర్దేశం చేసుకొన్నది. ఒకానొక లేఖలో అమృతా ఈ విధంగా పేర్కొన్నది.[5]

నేను భారతదేశంలో మాత్రమే చిత్రపటాలను వేయగలను. ఐరోపా పికాసో, మాటిస్సే, బ్రేక్వీకి చెందినది... కానీ భారతదేశం, నాకు మాత్రమే చెందినది.[2]

భారతదేశంలో తన మజిలీ తనలోని కళను కొత్త పుంతలను త్రొక్కించింది. యుద్ధం జరుగుతున్నప్పుడు తాను ఐరోపాలో ఉన్నప్పటి కళకి, ప్రత్యేకించి హంగేరీ చిత్రకారుల ప్రభావం ఉన్న తన కళకీ; ఈ కళకీ చాలా వ్యత్యాసం ఉన్నట్లు అమృతా గుర్తించింది.

వివాహం

[మార్చు]

1938 లో తన తల్లి వైపు బంధువు అయిన వైద్యుడు విక్టోర్ ఈగాన్ ను అమృతా వివాహమాడినది.[1] సిమ్లాలో కొద్దిరోజులు ఉన్నారు. కానీ అక్కడ ఆర్థిక ఇబ్బందులు రావటంతో ప్రస్తుత పాకిస్తాన్ లోని లాహోర్ కు తరలి వెళ్ళారు. 17వ శతాబ్దపు మొఘల్ చిత్రకళ ను అమృత వంటబట్టించుకొంది.[2]

తన మెట్టినింట ఉన్నపుడే అమృతా తీరికగల గ్రామీణ జీవితాలను అంశాలుగా తీసుకొని Village Scene, The Story Teller, Ganesh Puja, Hill Side, Hill Scene, In the Ladies' Enclosure, Siesta వంటి చిత్రపటాలను చిత్రీకరించింది. [1]

1941లో విక్టర్, అమృతా లాహోర్ కు వెళ్ళారు. అవిభాజిత భారతదేశానికి అప్పట్లో అది సాంస్కృతికత/కళాక్షేత్రం. అమృతాకు అనేక స్త్రీపురుషులతో లైంగిక సంబంధాలుండేవి. వీరిలో చాలామంది చిత్రపటాలను తర్వాతి కాలంలో ఆమె చిత్రీకరించినది కూడా. Two Women అనే పేరుతో తాను వేసిన చిత్రపటం, తాను, తన ప్రేమిక అయిన మేరీ లూయిస్ లదే అని ఒక అభిప్రాయం ఉంది.[4]

మృతి

[మార్చు]

1941లో లాహోర్ లో అత్యంత భారీ కళా ప్రదర్శన ప్రారంభించే కొద్ది రోజుల ముందు, అమృతా తీవ్రమైన అనారోగ్యం బారిన పడి కోమా లోకి వెళ్ళిపోయింది. 1941 డిసెంబరు 6 అర్థరాత్రిన చేయవలసిన ఎంతో కృషిని మధ్యంతరంగా వదిలివేసి కన్ను మూసినది. తన అనారోగ్యానికి కారణం ఇప్పటికీ తెలియలేదు. గర్బస్రావం, తదనంతర పరిణామాలే కారణాలుగా భావించబడుతోన్నది. అమృతా తల్లి విక్టర్ నే తప్పుబట్టినది. ఆమె మృతి తర్వాతి రోజునే ఇంగ్లండు ఆస్ట్రియా పై యుద్ధం ప్రకటించి, అతనిని దేశ శతృవుగా భావిస్తూ అదుపులోకి తీసుకొన్నారు. 1941 డిసెంబరు 7 న లాహోర్ లోనే అమృతా అంత్యక్రియలు జరిగినవి.

ఆధునిక భారతీయ చిత్రకళ

[మార్చు]

తను చిత్రీకరించే గ్రామీణ నేపథ్యాలలో మొఘల్ చిత్రకళ ను పోలినట్టు రంగులను ధారాళంగా వాడటం, ఎరుపు రంగును అత్యధికంగా వినియోగించటంతో అమృత చిత్రపటాలు ఆధునిక భారతీయ చిత్రకళ నిర్మాణ శైలికి అడుగులు వేశాయి. ఆధునిక భారతీయ చిత్రకళ అవతరణ లో తోడ్పడ్డాయి. [5]

ఇతర చిత్రపటాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 1.7 Great Minds Archived 27 నవంబరు 2020 at the Wayback Machine, The Tribune, 12 March 2000.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 2.6 2.7 2.8 "Amrita Sher-Gil | Indian Modernist Painter, Life, Works, & Biography | Britannica". Encyclopedia Britannica (in ఇంగ్లీష్). Retrieved 2026-03-25.
  3. 3.0 3.1 "భారతీయ చిత్రకారిణి కళాఖండానికి రూ.37.8 కోట్లు". EENADU. Retrieved 2022-01-21.
  4. 4.0 4.1 4.2 4.3 4.4 4.5 4.6 "Amrita Sher-Gil Biography - Paintings, Artworks, Achievements & Facts" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2026-03-25.[permanent dead link]
  5. 5.0 5.1 5.2 5.3 5.4 Waves OTT, by Doordarshan India, Prasar Bharati. "Amrita Sher Gill". wavespb.com.{{cite web}}: CS1 maint: multiple names: authors list (link)