Coordinates: 16°15′35″N 80°15′55″E / 16.2597°N 80.2653°E / 16.2597; 80.2653

కొండవీడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రెవెన్యూ గ్రామం
పటం
Coordinates: 16°15′35″N 80°15′55″E / 16.2597°N 80.2653°E / 16.2597; 80.2653
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాపల్నాడు జిల్లా
మండలంయడ్లపాడు మండలం
Area
 • మొత్తం17.25 km2 (6.66 sq mi)
Population
 (2011)
 • మొత్తం7,407
 • Density430/km2 (1,100/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి973
Area code+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్522529 Edit this on Wikidata


కొండవీడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పల్నాడు జిల్లా, యడ్లపాడు మండలానికి చెందిన గ్రామం. చరిత్రలో రెడ్డి రాజుల రాజధాని. ఇక్కడి పురాతన కోట వలన ప్రముఖ పర్యాటక కేంద్రం. చారిత్రక పరిశోధకులు ప్రజాకవి వేమన ఈ ఊరిలో జన్మించారని లేక కొంతకాలం నివసించారని భావిస్తారు.[1]ఇది మండల కేంద్రమైన యడ్లపాడు నుండి 17 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన చిలకలూరిపేట నుండి 29 కి. మీ. దూరంలోనూ ఉంది.

సి.ఆర్.డి.ఎ. పరిధిలో చేరిక[మార్చు]

ఈ గ్రామం నూతనంగా ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) ఈ గ్రామ పరిధిలోని పూర్తి విస్తీర్ణం (1725 హెక్టార్లు) ను ఆంధ్రప్రదేశ్ రాజధాని నగర (అమరావతి) ప్రాంత పరిధిలోకి 2014 డిశెంబరు 30 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

సమీప గ్రామాలు[మార్చు]

రేపూడి 4 కి.మీ, ఫిరంగిపురం 5 కి.మీ, సొలస 6 కి.మీ, కండ్రిక 6 కి.మీ, చౌడవరం 6 కి.మీ.

జనగణన వివరాలు[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1963 ఇళ్లతో, 7407 జనాభాతో 1725 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 3755, ఆడవారి సంఖ్య 3652. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1402 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 618. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 590198.[2]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం జనాభా మొత్తం 6600,పురుషుల సంఖ్య 3353,మహిళలు 3247. నివాసగృహాలు 1649.

విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఐదు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాల ఒకటి, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి ఉన్నాయి.బాలబడి యడ్లపాడులోను, మాధ్యమిక పాఠశాల సొలసలోనూ ఉన్నాయి. సమీప జూనియర్ కళాశాల యడ్లపాడులోను, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల చిలకలూరిపేటలోనూ ఉన్నాయి. సమీప మేనేజిమెంటు కళాశాల ఫిరంగిపురంలోను, వైద్య కళాశాల, పాలీటెక్నిక్‌లు గుంటూరులోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం చిలకలూరిపేటలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల గుంటూరు లోనూ ఉన్నాయి.

భూమి వినియోగం[మార్చు]

కొండవీడులో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • అడవి: 1150 హెక్టార్లు
  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 61 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 70 హెక్టార్లు
  • బంజరు భూమి: 443 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 324 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 188 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు[మార్చు]

కొండవీడులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.ఆకాశం నుండి జాలువారే ప్రతి నీటి చుక్కా, చెరువులలో చేరేలాగా అప్పటి రాజులు చూపించిన నైపుణ్యం, నేటితరం ఇంజనీరులను సైతం అబ్బురపరచుచున్నది. అందుకు సజీవసాక్ష్యాలుగా కొండవీడుపైన ఉన్న ఈ మూడు చెరువులూ ఇప్పటికీ నిలిచి ఉన్నవి:- 1.ముత్యాలమ్మ చెరువు, 2.పుట్టాలమ్మ చెరువు, 3,వెదుళ్ళ చెరువు.కొండలపై పడిన వర్షపు నీరు, ఒకదాని తరువాత మరొక చెరువు నిండేలాగా చేసిన ఈ మూడు చెరువుల రూపకల్పన అద్భుతం. ఈ చెరువులు ఇప్పటికీ వేసవిలో గూడా జలకళతో కనువిందు చేయుచున్నవి.[4]

  • కాలువలు: 60 హెక్టార్లు
  • బావులు/బోరు బావులు: 127 హెక్టార్లు

ప్రధాన పంటలు[మార్చు]

వరి, ప్రత్తి, మిరప

దర్శనీయ ప్రదేశాలు[మార్చు]

కొండవీడు కోట[మార్చు]

కొండవీడు దుర్గం 1804లో చిత్రించిన దృశ్యం

ఇక్కడ ఒక పురాతన కోట ఉంది. కోటకు వెళ్లేందుకు రెండువైపుల నుంచి నేలమెట్లు ఉన్నాయి. కొండ మీద మూడు చెరువులున్నాయి. ఒకటి నిండగానే నీరు వృథా కాకుండా, రెండు చెరువులోకి వెళ్లే సౌకర్యం ఉంది. కొండకింద ఉన్న కత్తుల బావి (వేణునాథస్వామి దేవాలయం), శ్రీకృష్ణదేవరాయలు ప్రతిష్ఠించిన ధ్వజస్తంభం, ఆలయం లోపల, బయట గోడల మీద అపరూప శిల్ప సంపదలున్నాయి. కొండమీద చారిత్రక ఆనవాళ్లుగా నిలచిన అనేక కట్టడాలు, 44 కోట బురుజులు, 32 మైళ్ల ప్రాకారాలు, రెండు ధాన్యాగారాలు, 5 దేవాలయాలు, గుర్రపు శాలలు, ఆయుధశాల, నేటికొట్టు, మసీదు, ఖజానా, వంటి చారిత్ర సంపద ఉంది. కొండవీడు కోటను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రక్షిత కట్టడంగా గుర్తించింది.[3]

కోటకు వెళ్లేందుకు రెండువైపుల నుంచి నేలమెట్లు ఉన్నాయి. సరాసరి కొండమీదకు వెళ్లేవారి కోసం నిర్మించాల్సిన ఘాట్‌రోడ్డుకు సర్వే పూర్తి కావస్తోంది. కొండమీద మూడు చెరువులున్నాయి. ఒకటి నిండగానే నీరు వృథా కాకుండా, రెండు చెరువులోకి వెళ్లే సౌకర్యం ఉంది. కొండకింద ఉన్న కత్తుల బావి (వేణునాథస్వామి దేవాలయం), శ్రీకృష్ణదేవరాయలు ప్రతిష్ఠించిన ధ్వజస్తంభం, ఆలయం లోపల, బయట గోడల మీద అపరూప శిల్ప సంపదలున్నాయి. కొండమీద ఉపయోగించుకునే అవకాశం ఉన్న భూమి విస్తీర్ణం అయిదు చదరపు కిలోమీటర్లు.కొండమీద చారిత్రక ఆనవాళ్లుగా నిలచిన అనేక కట్టడాలు, 44 కోట బురుజులు, 32 మైళ్ల ప్రాకారాలు, రెండు ధాన్యాగారాలు, 5 దేవాలయాలు, గుర్రపు శాలలు, ఆయుధశాల, నేటికొట్టు, మసీదు, ఖజానా, వంటి చారిత్ర సంపద ఉంది.ఘాట్‌రోడ్డు కొత్తపాలెం వైపు నుంచి, అయిదో నెంబరు జాతీయ రహదారికి సమీపంలో గల కోట, కొండవీడు గ్రామాల వైపు నుంచి అభివృద్ధి చేసుకుంటూ వస్తూ మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. కొండవీడు కోటను రాష్ట్ర ప్రభుత్వం రక్షిత కట్టడంగా గుర్తించింది.కొండవీడు కోటను పురావస్తు శాఖ రక్షిత కట్టడంగా జి.ఒ.1535 తేదీ 2-11-1966న నిర్ణయించారు.ఇక్కడో కందకం (అగడ్త)ఉండేది. 37 ఎకరాల విస్తీర్ణం గల ఈకందకానికి చారిత్రక కొండవీటికొండ మీద నుంచి వర్షాకాలంలో నీరు జాలువారుతుంది. కందకంలోకి చేరిన నీటిని కొండవీడు పరిసరాల్లోని ఐదు గ్రామాల భూముల రైతులు సాగునీరుకు వినియోగించు కుంటున్నారు. చాలా కాలంగా సరైన మరమ్మతులు లేకపోవటంతో కందకం అడవి మాదిరిగా తయారైంది. భూగర్భ జలాల పెరుగుదలకు ఉపయోగపడుతుందని అధికారులు నివేదికలు రూపొందించారు.20 సెంట్ల కందకం ప్రాంతాన్ని పూర్తిగా ఆక్రమించి రూపురేఖలు మార్చారు.ఎనిమిది అడుగుల లోతు గల కందకాన్ని పెద్ద పెద్ద బండరాళ్లు, మట్టితో పూడ్చి వేసి చదునుచేశారు. కందకం పరిధిలో ఒకటి రెండు చోట్ల ఇళ్ల నిర్మాణం చేపట్టారు.

కొండవీడు దుర్గంలో బౌద్ధం ఆనవాళ్ళు

ఇప్పటి వరకూ దుర్గం రెడ్డిరాజుల కోటగానే గుర్తింపు ఉంది. ఐతే, ప్రస్తుతం వారి పరిపాలనకు ముందు సుమారు రెండు వేల సంవత్సరాల క్రితమే అక్కడ బౌద్ధనాగరికత ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. గుంటూరు సర్కిల్‌ అటవీశాఖ అధికారి అనూప్‌సింగ్‌ సతీమణి రుచిసింగ్‌, కేంద్రీయ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ కె.వి.రావుతో కలసి ఇక్కడ ఈ మధ్య నిధుల కోసం తవ్వకాలు జరిపిన శివాలయం పరిసరాల్లో బౌద్ధ స్థూపాన్ని గుర్తించారు. స్థూపం సుమారు 12 అడుగుల వ్యాసార్థంతో ఉంది. నిర్మాణానికి లేత ఆకుపచ్చ, నాపరాళ్లు, నలుపు రంగు రాళ్లు వాడారు.స్థూపం పైన శివాలయం నిర్మించారని తేల్చారు.

కొండవీడు కొండల మీద టెర్రాస్‌ స్థూపాలు కన్పిస్తున్నాయి. ఈ స్థూపాలు వేదికలాగా ఉంటాయి. ఇవి శాతవాహనుల కాలం నాటి పెద్దపెద్ద ఇటుకలతో నిర్మితమయ్యాయి. అలాగే బౌద్ధ విహారాల పైకప్పుల కోసం ఉపయోగించుకొనే పెంకులు, మట్టిపాత్రల శకలాలు కూడా ఇక్కడ దొరికాయి. కొండవీడు కొండలు సముద్ర మట్టానికి పదిహేడు వందల ముఫ్పై అయిదు అడుగుల ఎత్తులో ఉన్నాయి.శాతవాహనులు క్రీస్తు పూర్వం 1, 2 శతాబ్దాల నాటికి ధాన్యకటకాన్ని ముఖ్య పట్టణంగా చేసుకొని పరిపాలించారు.కొండవీడు కొండల మీద కూడా శాతవాహనుల కాలంలోనే బౌద్ధం వ్యాపించిందన్నందుకు ఆధారాలు దొరికాయి. ఈ కొండల మీద కాలిబాటకు రెండు వైపులా పైభాగంలో కూడా బౌద్ధ స్థూపాలను నిర్మించిన ఆధారాలు దొరికాయి. ఎత్తయిన కొండల మీద ఏటవాలుగా ఉన్న ప్రదేశాల్లో వేదికల మీద నిర్మించిన స్థూపాలను టెర్రాస్‌ స్థూపాలని అంటారు. గుంటూరు జిల్లాలోని అమరావతి, భట్టిప్రోలు, మల్లెపాడు (తెనాలి) లాంటి ప్రాచీన బౌద్ధక్షేత్రాల దగ్గర మాత్రమే అతి పెద్ద పరిమాణంలో యాభై ఎనిమిది సెంటీమీటర్ల పొడవు, ముప్ఫయి సెంటీమీటర్ల వెడల్పు, పది సెంటీమీటర్ల మందం కలిగిన పెద్ద ఇటుకలు దొరికాయి. అలాగే కొండవీడు కొండపైన చైనా దేశానికి చెందిన సెల్‌డన్‌వేర్‌గా పేరున్న కొన్ని పింగాణీ పాత్రలకు చెందిన ముక్కలు కూడా లభించాయి.[4]

వెన్నముద్దల వేణుగోపాలస్వామి విగ్రహం[మార్చు]

కొండకిందనే ఛంఘీస్‌ఖాన్‌ పేటలో కృష్ణుని దేవాలయం ఉంది. ఇక్కడ గల చేత వెన్నముద్ద, చెంగల్వ పూదండ, మెడలో పులిగోరుతో సాధారణ బాలుడిగా చిన్ని కృష్ణుడు విగ్రహం ప్రపంచంలో మరెక్కడా లేదు.[5]

కత్తులబావి[మార్చు]

కొండవీడు కోట పరిధిలో అత్యంత గుర్తింపు కలిగిన ప్రాంతం కత్తులబావి. దీన్నే గోపీనాథ దేవాలయం అని కూడా అంటారు. ప్రస్తుతం ఈ ఆలయంలో కూల్చివేతలు కొనసాగుతున్నాయి.రాజుల హయాంలో అక్కడ మణులు, మాణిక్యాలు, బంగారం తదితర విలువైన లోహాలను భద్రపరచి ఉంటారనే అంచనాలతో చారిత్రక నిర్మాణాల తొలగింపునకు పాల్పడుతున్నారు. ఇప్పటికే మొదటి మండపం కప్పునకు ఉన్న పెద్ద రాళ్లను తొలగించేశారు. అంతరాలయంలో ఉత్తర మండపానికి పక్కనున్న కుంభాకార స్తంభాన్ని కూడా తొలగించారు. కుంభాకార స్తంభం పునాదిని తవ్వుతున్నారు. అక్కడ ఏమైనా విలువైన వస్తువులు ఉండవచ్చనే దురాశతోనే అలా చేస్తున్నారని తెలుస్తోంది. అంతరాలయం పైకప్పును తొలగించారు. గర్భగుడినే కత్తులబావిగా భావించి విలువైన లోహాల కోసం విచ్చలవిడిగా తవ్వకాలను కొనసాగిస్తున్నారు.కత్తులబావిలో తవ్వకాల గురించి తెలుసుకున్న చంఘిజ్‌ఖాన్‌పేట, కోట, కొత్తపాలెం, హౌస్‌గణేష్‌ వాసులు అప్రమత్తులయ్యారు.కోటలో అభివృద్ధి పనులు ప్రారంభమై, ఒక కొలిక్కి వచ్చేంతవరకు రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది.

కొండవీడు దర్గా[మార్చు]

కొండవీడులో సయ్యద్‌ ఖుదాదే ఫకిర్‌ షాఔలియా (దాదాపీర్‌) బాబా ఉరుసు జరుగుతుంది. వివిధప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారు. కొండవీడు నుంచి బాబా గంధ మహోత్సవం ఊరేగింపుగా బయల్దేరి తెల్లవారుజామున దర్గా వద్దకు చేరుతుంది.

వారసత్వ ప్రదర్శనశాల[మార్చు]

ఫిరంగిపురం-హౌస్ గణేష్ గ్రామాల మధ్యలో, ఒక ఎకరం విస్తీర్ణంలో రెడ్డి రాజుల వారసత్వ ప్రదర్శనశాల 2019 అక్టోబర్ 12 న ప్రారంభించబడింది. అఖిల బారతీయ రెడ్డి సామాజిక సంఘం 8 కోట్ల పెట్టుబడితో ప్రభుత్వ-ప్రైవేట్ సహకార పద్ధతిలో దీనిని నిర్మించింది. 30,000 చదరపు అడుగుల విస్తీర్ణంగల ప్రదర్శనశాలలో కొండవీడు కోట మాదిరి, రెడ్డివంశపు 70 పురాతన విగ్రహాలు,15 శతాబ్దపు నంది, శిలాశాసనాలు, 150 పురాతన నాణేలు, రెండు తాళపత్ర గ్రంథాలు, రెండు ఫిరంగులు, ఛాయాచిత్రాలు వున్నాయి.[6][7]

గ్రామాభివృద్ధికి ప్రణాళికలు[మార్చు]

ఇస్కాన్‌ పధకాలు[మార్చు]

కొండవీడులో నీరు, గాలి, వాతావరణం అనుకూలంగా ఉంటుందని ప్రపంచంలో ఎక్కడా కనిపించని వెన్నముద్దల వేణుగోపాలస్వామి విగ్రహం ఉన్న చెంఘీజ్‌ఖాన్‌పేట దేవాలయం ప్రాంతాన్ని రూ.150 కోట్లతో విశ్వవిఖ్యాత పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం (ఇస్కాన్‌) తెలిపింది.

  • దేవాలయం:150 ఎకరాల్లో నిర్మించే వాటిలో అతి పెద్ద దేవాలయం నిర్మాణానికే ప్రాధాన్యం. శ్రీ కృష్ణుని లీలా వినోదాలు కళ్ళకు కట్టేలా అందర్జాతీయ స్థాయి నమూనాతో రూపొందించే దేవాలయం
  • అంతర్జాతీయ పాఠశాల:- కోట, కొండవీడు, చెంఘీజ్‌ఖాన్‌పేట ఈ మూడు గ్రామాల పరిధిలో ఏర్పాటు చేస్తారు.
  • వైద్యశాల: ఉచిత వైద్య సౌకర్యాన్ని అందించే వైద్యశాల నిర్మిస్తారు.
  • థీమ్‌ పార్కు: కోట, కొండవీడు, చెంఘీజ్‌ఖాన్‌పేట గ్రామాల పరిధిలో థీమ్‌పార్కు ఏర్పాటు చేస్తారు.జలాశయాలు, నీటి ఫౌంటేన్లు ఆకర్షణీయంగా రూపొందిస్తారు.
  • ప్రదర్శనశాలలు: 2 ప్రదర్శన శాలలు నిర్మిస్తారు. ఆధునిక, డిజిటల్‌ సౌకర్యాలతో కళ్ళు మిరుమిట్లు గొలిపే విద్యుత్తు కాంతుల మధ్య ప్రదర్శనలకు భారీ ఏర్పాట్లు చేస్తారు.ఆడిటోరియం నిర్మిస్తారు.
  • ఆహారం: ప్రపంచ పర్యాటక కేంద్రంగా రూపొందించే కార్యక్రమానికి అనువుగా ఆహారశాలలు ఏర్పాటు చేస్తారు.చిన్నారులకు, విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం నిర్వహిస్తారు. వీధి బాలల కోసం గురుకులం నిర్మించి ఉచితంగా విద్య అందిస్తారు.
  • గ్రామాల దత్తత: కొన్ని గ్రామాలను దత్తత తీసుకుని తీర్చిదిద్దుతుంది.
  • కోటలో మ్యూజియం:కొండవీడును పరిపాలించిన అనేక మంది రాజుల వివరాలు ఆధ్యాత్మిక భావనలు, కళా సాంస్కృతిక రంగాల ఆదరణ వివరించే విధంగా కోట గ్రామంలో భారీ మ్యూజియం ఏర్పాటు చేస్తారు.
  • నల్లనయ్యకు పెద్ద కోవెల: వెన్నముద్దతో ముద్దులొలికే బాల గోపాలుని విగ్రహం ప్రపంచంలో మరెక్కడా లేదని నిర్ధారించుకున్న ఇస్కాన్‌ చెంఘీజ్‌ఖాన్‌పేటలో గల ఈ విగ్రహం ఉన్న ప్రస్తుత దేవాలయాన్ని ప్రపంచస్థాయి అద్భుత కళానైపుణ్యంతో నిర్మించేందుకు ఈ పథకం రెండో దశలో మూడు గ్రామాలను కలుపుతూ అనేక పధకాలు రూపొందించింది. చెంఘీజ్‌ఖాన్‌పేటలో ప్రస్తుతం దేవాలయం ఉన్నచోట 50 ఎకరాల విస్తీర్ణంలో తమిళనాడులోని వెల్లూరులోగల స్వర్ణదేవాలయం నమూనాతో వేణుగోపాలస్వామికి ఆలయం నిర్మిస్తుంది. దీంతోపాటు వేద పాఠశాల వైదిక పారాయణ, ఉపాధ్యాయులకు నివాస గృహాలు కూడా ఏర్పాటు చేస్తారు. రామాయణం, మహాభారతం ఇతివృత్తాలను ఆకర్షణీయంగా ప్రతిరోజూ ప్రదర్శించేలా ఏర్పాట్లు చేస్తారు.

పురోగతి[మార్చు]

ఈ పనులు మధ్యంతరంగా ఆగిపోయాయి. [8] [9]

మూలాలు[మార్చు]

  1. పి.వి.మురళీకృష్ణ, ed. (2006). వేమన పద్యరత్నాలు. రాజమండ్రి: గొల్లపూడి వీరాస్వామి అండ్ సన్స్. p. 8.
  2. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  3. "తెలుగు రాష్ట్రాలలో చారిత్రక కట్టడాలు !!". Nativeplanet. 2015-11-27. Archived from the original on 2016-11-12. Retrieved 26 October 2016.
  4. జూలై 16, 2010 ఈనాడు గుంటూరు జిల్లా అనుబంధం
  5. మరెక్కడాలేని విగ్రహం:ఫిబ్రవరి 21, 2010 ఈనాడు గుంటూరు జిల్లా అనుబంధం
  6. "Ministers inaugurate Rs 8 crore museum on heritage of Reddy Kings". New Indian Express. 2019-09-13. Retrieved 2022-03-01.
  7. P. Samuel Jonathan (2014-03-18). "Kondaveedu to get a fort museum". The Hindu. Retrieved 2022-03-01.
  8. "'కొండవీడి'న ఆధ్యాత్మిక సౌందర్యం, (ఈనాడు, విజయవాడ సంచిక. పేజి: 16)". ఈనాడు. 2022-02-28. Retrieved 2022-03-01.
  9. "ISKCON project caught in a bind". The Hindu. 2015-09-30. Retrieved 2022-03-01.

వెలుపలి లంకెలు[మార్చు]


"https://te.wikipedia.org/w/index.php?title=కొండవీడు&oldid=3877864" నుండి వెలికితీశారు