చింతం ప్రవీణ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చింతం ప్రవీణ్‌
జననం1981, నవంబర్ 10
శివనగర్,వరంగల్ అర్బన్ జిల్లా
నివాస ప్రాంతంశివనగర్, వరంగల్
ఇతర పేర్లుడా.చింతం ప్రవీణ్‌ కుమార్‌
వృత్తికాకతీయ విశ్వవిద్యాలయంలో తెలుగు అధ్యాపకుడు
ప్రసిద్ధితెలుగు సాహితీవేత్త, బి.సి. అస్తిత్వవాద సాహిత్యోద్యమకారుడు
మతంహిందూ
భార్య / భర్తజ్యోతి
పిల్లలుతరుణ్, పల్లవి
తండ్రిరాజేశ్వర్
తల్లియాదమ్మ

చింతం ప్రవీణ్ ప్రముఖ వర్థమాన యువ తెలుగు సాహితీవేత్త.[1] విద్యార్థి రాజకీయాల నుంచి.. ఉద్యమాల నుంచి.. పదునెక్కిన చైతన్యంతో.. తన జాతి కోసం బహుజన అస్తిత్వాన్ని భుజానికెత్తున్న ఈ తరం సాహిత్యోద్యమకారుడు.

జననం[మార్చు]

చింతం ప్రవీణ్ 10 నవంబర్ 1981న వరంగల్ జిల్లా లోని శివనగర్ ప్రాంతంలో యాదమ్మ, రాజేశ్వర్ దంపతులకు రెండవ సంతానంగా జన్మించాడు. ప్రవీణ్ కు ఒక తమ్ముడు(గిరి), ఇద్దరు అక్కాచెల్లెళ్లు(కరుణ, కవిత) ఉన్నారు.

కుటుంబ నేపథ్యం[మార్చు]

ప్రవీణ్ తల్లి బీడీ తయారీ కార్మికురాలు, తండ్రి ఆర్.టి.సి. డ్రైవర్, సీ.ఐ.టీ.యూ. మెంబర్. వీరిది సాధారణ దిగువ మధ్యతరగతి కుటుంబం. వీరి పూర్వీకులు కరీంనగర్ జిల్లా మంథని మండలం ఖమ్మంపల్లికి చెందిన వారు.

బాల్యం[మార్చు]

ప్రవీణ్ బాల్యమంతా శివనగర్ ప్రాంతంలోనే గడిచింది. అత్యంత వెనుకబడిన ప్రాంతమైన శివనగర్ ప్రాంతం నుండి కాకతీయ విశ్వవిద్యాలయం దాకా ఎదగడం వెనకాల తన చిననాటి మిత్రుల సహకారం ఎంతో ఉందని చెబుతారు ప్రవీణ్. ఆ మిత్రుల సహకారంతోనే ఇవ్వాళ కవిగా డాక్టోరేట్ గా నిలబడగలిగానని సూటిగా చెబుతారు ప్రవీణ్.

విద్యాభ్యాసం[మార్చు]

ప్రవీణ్ ప్రాథమిక, మాధ్యమిక విద్యాభ్యాసం శివనగర్ లోని వందన హైస్కూల్ లో, ఎస్.ఎస్.సి. విద్యాభ్యాసం ఆర్య వైశ్య హైస్కూల్ లో జరిగింది. అనంతరం హన్మకొండలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియేట్ విద్య అభ్యసించాడు. ఆ తర్వాత ఉన్నత చదువులను హన్మకొండలోని కాకతీయ విశ్వవిద్యాలయంలో కొనసాగించాడు. ఎం.సి.జె., ఎం .ఎ.(తెలుగు సాహిత్యం) లో పట్టభద్రుడయ్యాడు. జర్నలిజం పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో ఆ విశ్వవిద్యాలయ టాపర్ గా నిలిచాడు. ఆ తర్వాత అదే విశ్వవిద్యాలయంలో తెలుగు విభాగం నందు ఆచార్య డా. పంతంగి వెంకటేశ్వర్లు గారి సమక్షంలో పీ.హెచ్ డి. చేసి పట్టా పొందాడు. అతను పీహెచ్.డీ చేసింది సింగరేణి కార్మిక వర్గం మీద కథలు రాసిన పి.చంద్ గారి రచనల మీద. 2016లో యూనివర్సిటీ గ్రాంట్ కమీషన్, న్యూ ఢిల్లీ యొక్క డా. సర్వేపల్లి రాధాకృష్ణ పోస్ట్ డాక్టోరియల్ ఫెలోషిప్ సాధించాడు. NETలో ఐదు సార్లు ఉత్తీర్ణుడయ్యాడు.

ఉద్యోగం[మార్చు]

విద్యాబ్యాసం అయిపోగానే 2006 తర్వాత ప్రజాశక్తి, ఆంధ్రజ్యోతి, ఐ న్యూస్, నవ తెలంగాణమొదలగు సామాజిక పత్రికల్లో, టీవీ ఛానల్లలో పనిచేశాడు. ఆ తర్వాత ఒక ప్రైవేట్ కళాశాలలో 5 సంవత్సరాల పాటు తెలుగు అధ్యాపకుడిగా పనిచేశాడు. ఆ తర్వాత మహబూబాబాద్ లోని ఓ పి.జి. కళాశాలలో మూడున్నర యేండ్లు తెలుగు అధ్యాపకుడిగా పనిచేశాడు. ప్రస్తుతం పోస్ట్ డాక్టోరియల్ ఫెలోగా కొనసాగుతూ కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు.

రాణిస్తున్న రంగాలు[మార్చు]

సాహితీ కృషి[మార్చు]

తను పుట్టి పెరిగిన వాతావరణం, పేదరికం ప్రవీణ్ ను సాహితీకారుడిగా ఎదిగేలా ప్రేరేపించాయి. ప్రవీణ్ కు స్టూడెంట్ ఫెడరేషన్ అఫ్ ఇండియా ద్వారా సాహిత్యం చదివే అవకాశం కలిగింది. ఆ భావజాలంతో సమాజంలోని అసమానతలు, అంతరాలు అర్థం చేసుకునే అవకాశం కలిగింది. మొదట ప్రేమ, సమాజం, అంతరాల మీద కవిత్వం రాసిన తను ఆ తర్వాత ప్రపంచీకరణ గురించి కవిత్వం రాసాడు. ముఖ్యంగా తెలంగాణ స్వరాష్ట్ర సాధనోద్యమంలో పాల్గొని తన రచనల ద్వారా ఉద్యమస్పూర్తిని రగిలించాడు.తెలంగాణ ఉద్యమం మలచిన కవిగా తను తాను పేర్కొంటాడు ప్రవీణ్.

ప్రజల కోసం, ప్రజల సంఘర్షణ కోసం, అస్తిత్వం కోసం సాహిత్యం కృషి చేయాలి అని భావించే ప్రవీణ్ నిస్వార్థంగా సాహిత్య కృషి చేస్తున్నాడు. తన స్వీయ కవిత్వాన్ని 3 సంకలనాలుగా వెలువరించాడు తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా కాకతీయ విశ్వవిద్యాలయంలో, శివనగర్ లో పాల్గొంటూనే ఆ భావజాలంతో తన తొలి కవితా పుస్తకం నెగడు వెలువరించాడు. ఆ తర్వాతి కాలాల్లో సామాజిక అంశాల నేపథ్యంతో షాడో, గ్లోబలి కవితా పుస్తకాలు ప్రచురించాడు.[2] అలాగే నర్సు, జిందాబాద్ వంటి కథలు కూడా రచించి ప్రముఖుల ప్రశంసలందుకున్నాడు. కాలేజీలో చదువుతున్న రోజుల్లో ప్రేమ విలువ అనే నవల కూడా రాశాడు. కానీ అదింకా ముద్రణా రూపంలోకి రాలేదు.

2015లో బి.సి. రైటర్స్ వింగ్ అనే సాహిత్య సంస్థను స్థాపించి, దానికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు. ఆ సంస్థ యొక్క మొదటి వార్షికోత్సవం సందర్భంగా 2016లో అతని సంపాదకత్వంలో బిసి అస్తిత్వవాద యువ కవిత్వం సమూహం అనే పుస్తకంగా వెలువడింది. ఈ పుస్తకం సంచలనం సృష్టించింది. 38 మంది యువ కవుల కవితలతో ఈ పుస్తకం రూపొందించాడు ప్రవీణ్. ఈ 38 మంది కవులు "సమూహం కవులు"గా పేరుగాంచారు. తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలోని పూలే దంపతుల విగ్రహాల సమక్షములో వెలువడి స్వేఛ్చా ప్రతిరూపంగా పరిగణింపబడే అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దాకా దాదాపు పదివేల కిలోమీటర్లు వ్యాప్తి చెంది ఖండాతర కీర్తినార్జించింది ఈ పుస్తకం. "బీసీలకు రాజ్యాధికారం సిద్ధించాలి" అనే నినాదంతో సమూహంను ఇంతగా వ్యాప్తి చేయడం జరిగింది. ఈ పుస్తకం సంపాదకుడిగా ప్రవీణ్ కు మంచి పేరు ఆపాదించింది.

2017లో పెరిక కుల చరిత్ర అనే పుస్తకం ప్రచురించాడు.

తమ సాహిత్యాన్ని ప్రచురించుకోలేక పోతున్నామనే బాధ గల సాహితీకారుల వేదనను చూసి చలించిపోయి 2017లో సమూహం అనే అంతర్జాల సాహిత్య పత్రికను స్థాపించి దానికి సంపాదకుడిగా వ్యవహరిస్తూ సాహితీ సేవ చేస్తున్నాడు.

ప్రవీణ్ 2017 డిసెంబర్‌ 10న బి.సి. రైటర్స్‌ వింగ్‌ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన బి. సి. లిటరరీ ఫెస్టివల్‌ సాహిత్య చరిత్రలోనే ఒక మైలురాయిలాంటి కార్యక్రమం. భారత దేశంలోనే ఇది తొలి బి. సి. లిటరరీ ఫెస్టివల్ కావడం విశేషం.

పాత్రికేయ కృషి[మార్చు]

ప్రజాశక్తి, ఆంధ్రజ్యోతి, ఐ న్యూస్, నవతెలంగాణల్లో దశాబ్ద కాలం పాటు జర్నలిస్టుగా తను చూసిన సంఘటనలు, పొందిన అనుభవాలు సాహిత్య పరంగా అతనికి బాగా పనికొచ్చాయి. పిల్లల హక్కులు, గుడుంబా నిషేధం మొదలగు సామాజిక సమస్యల మీద 30 కి పైగా వ్యాసాలు, సాహిత్య విషయ సంభందిత వ్యాసాలు 112కి పైగా రాసి పత్రికలలో ప్రచురించాడు.

ప్రచురించిన పుస్తకాలు[మార్చు]

  • నెగడు (తెలంగాణ కవితా సంకలనం ) - 2012
  • షాడో (తత్వ కవితా సంకలనం) - 2013
  • గ్లోబలి (ప్రపంచీకరణ అంశంతో రాసిన కవితా సంకలనం) - 2015
  • సమూహం (బి.సి. అస్తిత్వవాద యువ కవితా సంకలనం) - 2016
  • పెరిక కుల చరిత్ర - 2017
  • బొడ్రాయి (వ్యాసాల సంకలనం)
  • బీసీ చౌక్ (బి.సి. సంబంధ వ్యాసాల సంకలనం)
  • ప్రవాహం (సమూహం కవితా సంపుటి పై ప్రముఖుల విశ్లేషణా వ్యాసాల సంకలనం)

అముద్రిత రచనలు[మార్చు]

  • ప్రేమ విలువ (నవల)

సామాజిక సేవ[మార్చు]

తన తమ్ముడు గిరితో కలసి నవసమాజ్ సేవా సమితి అనే సంస్థ స్థాపించి దాని సారధ్యంలో సూమారు లక్ష పుస్తకాలను గ్రంథాలయాలకు పంపిణీ చేసాడు. మహబూబాబాద్ లోని విశ్వవిద్యాలయ పి.జి. కళాశాలలో దాదాపు ఐదు వేల పాఠ్య పుస్తకాలతో నవసమాజ్ గ్రంథాలయంను స్థాపించాడు.

నిర్వహిస్తున్న పదవీ భాధ్యతలు[మార్చు]

  • బి.సి. రైటర్స్ వింగ్ వ్యవస్థాపక అధ్యక్షులు
  • బి.సి. స్టడీ ఫోరమ్ కన్వీనర్
  • నవ సమాజ్ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు
  • సమూహం వెబ్ సాహిత్య పత్రిక వ్యవస్థాపక సంపాదకుడు 

అందుకున్న అవార్డులు/ పొందిన గొప్ప సన్మానాలు[మార్చు]

తన పుస్తకాలు, అవార్దులతో ప్రవీణ్
  • ఉత్తమ కవి అవార్డు - ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(2012)
  • ఉత్తమ యువ సాహితీవేత్త అవార్డు - భారత సర్వీసుల శాఖ-నెహ్రూ యువ కేంద్రం, తెలంగాణ ప్రభుత్వం (2015)
  • కాకతీయ విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ (2015)
  • రాష్ట్రస్థాయి విశిష్ట సాహిత్య పురస్కారం - దళిత రచయితల సంఘం(2017)
  • మహాత్మ జ్యోతిరావు ఫూలే అవార్డు - (2017)

మూలాలు[మార్చు]

  1. one India. "అస్తిత్వ ఉద్యమంలో నవీన కెరటం: చింతం ప్రవీణ్‌తో ఇంటర్వ్యూ." Archived from the original on 21 ఆగస్టు 2017. Retrieved 19 August 2017.
  2. నవ తెలంగాణ. "'గ్లోబలి' సాహిత్యానికి షాడో"". Archived from the original on 27 జూన్ 2017. Retrieved 19 August 2017.

ఇతర లింకులు[మార్చు]