భారతదేశపు బ్రిటిష్ సామ్రాజ్య అస్తమయం

వికీపీడియా నుండి
(భారతదేశపు బ్రిటిష్ సామ్రాజ్యఅస్తమయము నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
భారత ఉపఖండం
జనాభాసుమారు 1.8 billion
నివసించేవారుSouth Asian
Desi (local; traditional)
దేశాలు
List:
ఆధారపడేవారు British Indian Ocean Territory
పెద్ద నగరాలు

16వ శతాబ్దమునుండి అనేక దేశములలో బ్రిటిష్ వలస రాజ్యములు స్థాపింపబడి బ్రిటిష్ సామ్రాజ్యము విస్తరింపబడిన చరిత్రాంశములు చాల చిత్రమైనవి. ఈ భుగోళముపై 19వ శతాబ్దమునాటికి యున్న బ్రిటిష్ వలసరాజ్యములు దిశదిశలా యుండుటవలన “ బ్రిటిష్ సామ్రాజ్యములో సూర్యడస్తమించడు” (Sun never sets on British Empire) అనేటటువంటి అతిశయోక్తి బ్రిటిష్ సామ్రాజ్యము విస్తరించియున్న స్థితిని తెలుపుతున్నది. బ్రిటిష్ సామ్రాజ్యము స్థాపించిన రీతి, స్థాపించుటకు ఉద్దేశము, ప్రేరణ హేతువులు అనేకము గానుండి కాలానుగుణ అబిమతములు కలిగిన సార్వభౌమత్వమైనందున చరిత్రలోని అనేక సామ్రాజ్యములు స్థాపింబడిన రీతిగా బ్రిటిష్ సామ్రాజ్యము స్థాపింపబడలేదనిపించక తప్పదు. ఇంగ్లండు దేశములోని బ్రిటిష్ ప్రభుత్వమువారు సరాసరి ఇతర దేశములపై సైనికచర్యచేసి రాజ్యాక్రమణచేయలేదు. చరిత్రలో అప్పటివరకూ కనీవినీ ఎరుగని రీతిగ వ్యక్తిగత సంస్థలు అనేక దేశములకు వలస పోయి అచ్చట రాజ్యస్థాపనచేయుటవలన బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణకు దోహదమైనవి. అనాదిగా బ్రిటిష్ ప్రజలు అనేక దేశములకు వాణిజ్యముకోసము వ్యక్తిగతముగను, సంస్థలుగ వలసపోయిరి. భూగోళములో ఏ ఖండములో ఎక్కడనున్నను తమ బ్రిటిష్ ప్రజానీకమునకు రక్షణకల్పుటయే సూత్రమని ఇంగ్లండు లోని రాజు గారి పేరట పరిపాలించు బ్రిటిష్ ప్రభుత్వము తమ జాతీయప్రజారక్షణ పేరట రక్షక దళములు నియమించిరి. అనేక దేశములకు వలసపోయిన బ్రిటిష్ వ్యక్తిగత సంస్థలు రాజ్యములు స్ధాపించి ఇంగ్లండు లోని వారి జాతీయప్రభుత్వమునకు లోబడి వలసరాజ్యములలో రాజ్యాధికారము చెలాయించి క్రమేణ పరిపాలనా యంత్రాంగములను ఇంగ్లండు లోని బ్రిటిష్ ప్రభుత్వపరముచేయుటవలన బ్రిటిష్ సామ్రాజ్యము విస్తరించింది. ఇతరదేశములలో జరిగినటులనే భారతదేశములో కూడా వారి వాణిజ్యసంస్థ చే స్ధాపించబడ్డ వలసరాజ్యమును ఇంగ్లండు లోని బ్రిటిష్ ప్రభుత్వమువారు క్రమక్రమముగా నియంత్రణలోకి తీసుకునుటవలన భారతదేశములో క్రి.శ 1600 సంవత్సరములో వాణిజ్యసంస్థగా వచ్చిన బ్రిటిష్ వారు ఒక శతాబ్దము తరువాత 1707లో ఔరంగజేబు మరణించి మొగలాయి సార్వభౌమత్వము తిరస్కరించబడుచున్న కొలదికాలమునకే రాజ్యతంత్రములు, కుంతంత్రములతో వంగరాష్ట్రములో మొట్టమొదటగా 1765 లో బ్రిటిష్ వలస రాజ్యస్థాపన చేసి తదుపరి రాజ్యాధికారములు చేపట్టిరి (చూడు: రాబర్టు క్లైవు- వారన్ హేస్టింగ్సుల రాజ్యతంత్రములు ). కాలక్రమేణ బ్రిటిష్ సంస్థవారి రాజ్యధికారము యావద్భారతదేశానికి విస్తరింపజేసిరి. వాణిజ్య సంస్తవారు చెలాయించిన రాజ్యాధికారమును 1858 లో ఇంగ్లండు లోని వారి జాతీయ ప్రభుత్వపరముచేసిరి. వాణిజ్యసంస్థ వారి ఇంగ్లండులోనుండిన నిర్దేశకులు తమసంస్తల అభివృధ్దికి రాజ్యాధికారము, రాజస్వము అవసరమని చెప్పిన సంగతులు చరిత్రలోకి వచ్చినతరువాత బ్రిటిష్ రాజ్యము భారతదేశములో అప్రయత్నముగా స్థాపించిరన్నది సరికాదని తెలిసింది. బ్రిటిష్ సామ్రాజ్యములోని బానిసరాజ్యములలోకల్ల అత్యంత విలువైనదని గుర్తింపుపొందినది భారతదేశము (చూడు:లార్డ్ కర్జన్ ) దాదాపు రెండు వందల సంవత్సరములు బానిసరాజ్యముగనేలిన భారతదేశానికి పూర్తి స్వతంత్రత పరిపాలననివ్వక అనేక సంస్కరణల పేరట విభజించి పరిపాలించమన్న సూత్రముతో కొద్దికొద్దిగా ప్రజాపరిపాలనా పద్ధతులు ప్రవేశపెట్టి ఉపశమన కార్యక్రమమలుచేసిరే గాని పూర్తిగా స్వరాజ్యమిచ్చుటకిష్టపడలేదు. అటువంటి వైఖరిలో 20వశతాబ్దముదాకా నడపిన శక్తివంతమైన బ్రిటిష్ సామ్రాజ్యము 1945 లోఅకస్మాత్తుగా భారతదేశమును విడచిపెట్టుటకు నిశ్చయించిన చరిత్రాంశములు తెలుసుకోదగ్గవి, చాల విశేషమైనవి. అప్పటినుండియె బ్రిటిష్ సామ్రాజ్యము అస్తమించుట ప్రారంభమైనదని చరిత్రకారులు నిర్ధారించిరి. భారతదేశమునకు స్వతంత్రమిచ్చుటవలన కలిగిన మహత్తర పర్యవసానము ‘సామ్రాజ్యము’ అను శబ్దమును వారు వ్వవహారికమునుండి మాటుచేసి కామన్ వెల్త్ (Common Wealth) అను వ్యవహారికనామము విస్తరింపచేసిరి.[1][2].

బ్రిటిష్ సామ్రాజ్యము ఎదుర్కొన్న వడుదుడుకులు. 19-20 వశతాబ్దపు చరిత్రాంశములు కొన్ని[మార్చు]

16వ శతాబ్దమునుండి 20వ శతాబ్దాంతమువరకు దాదాపు 500 సంవత్సరములు ప్రపంచములో ఖండ ఖండాతరములలోనున్న తమ వలస రాజ్యములపై లండన్ నగరమునుండి బ్రిటిష్ సార్వభౌమత్వము సాగించిన అతిపెద్ద సామ్రాజ్యమని ఖ్యాతి గడించినప్పటికి బ్రిటిష్ సామ్రాజ్యముయొక్క ఖ్యాతి శిఖరాగ్రముకెక్కినిలచినది స్వల్పకాలమె. 19వశతాబ్దారంభమునుండి ఎప్పటినుంచి భారతదేశమును ఇంగ్లీషు రాజ్యమకుటములోకి చేర్చి బ్రిటిష్ రాణిగారి పేరట లండన్ లోని బ్రిటిష్ ప్రభుత్వము రాజ్యాధికారముతో భారతదేశమును పరిపాలింపమొదలుపెట్టినప్పటినుండి (1858) స్వతంత్రమిచ్చి విడచిపెట్టినంతవరకూ (1947) గల కాలపరిధిలోనే (దాదాపు ఒక శతాబ్దమపాటే) బ్రిటిష్ సామ్రాజ్యముయోక్క పలుకుబడి శిఖరాగ్రమునుండినదని చెప్పవచ్చును. సామ్రాజ్యములు విస్తరించి కాలక్రమేణ క్షీణించి అస్తమించిన చారిత్రక సత్యమును త్రోసిబుచ్చిన బ్రిటిష్ రాజకీయనాకులు బ్రిటిష్ సామ్రాజ్యము మాత్రము అంతమవదనీను ఇంగ్లండునదలి సార్వభౌమత్వము విశాల ప్రపంచమునకు అనివార్యమైనదని గట్టిగా నమ్మియుండిరి. వీరి సామ్రాజ్యము భూగోళములో ఏవిధముగా క్షీణించినది తెలుసుకొనుటకు 19వ శతాబ్దమునుంచి జరిగిన ప్రపంచ చరిత్రాంశములు కొన్ని సింహావలోకనము చేయవలసియున్నది. భారతదేశములో బ్రిటిష్ సామ్రాజ్యము స్థాపించినది ఆర్థిక లాభాపేక్ష అయియుండుటవలన భారతదేశమువంటి అమూల్యమైన లాభసాటి వలసరాజ్యమును 1945 దాకా వదలిపెట్టుటకు ఇష్టపడని కారణములు వెలిబుచ్చుటకు 20 వశతాబ్దపు బ్రిటిష్ ఇండియా చరిత్రాంశములు ప్రపంచ రాజకీయ పరిస్థితులతో అనువదించి చెప్పవలసియున్నది.

ప్రపంచ స్థాయి చరిత్రాంశములు[మార్చు]

ప్రపంచ చరిత్రలో 19- 20 శతాబ్ద కాలమందు జరిగిన మూడు గొప్ప చారిత్రక అంశములు: నెపోలియన్ ఓటమి (1815), మొదటి ప్రపంచ యుధ్దము (1911-1916), రెండవ ప్రపంచయుధ్దము (1939-1945) బ్రిటిష్ సామ్రాజ్య రూపురేఖలను మార్చినవి. ...సశేషం

బ్రిటిష్ ఇండియా చరిత్రాంశములు[మార్చు]

19-20వ శతాబ్దములో జరిగిన ఐదు ప్రముఖమైన బ్రిటిష్ ఇండియా చరిత్రాంశములు వాటి పరిణామములు: (1) 1857 సిపాయిల విప్లవ ఫరిణామములు (2) 1911-1914 లో మధ్య జరిగిన మొదటి ప్రపంచ యుద్ధము యొక్క ప్రభావము (3) 1915-1920 మధ్య జతీయ కాంగ్రెస్సు కార్యక్రమములు, 1920 నుండి గాంధీజీ ప్రవేశపెట్టిన సత్యాగ్రహోద్యమముల ప్రభావము (4) 1939-1945 మధ్య జరిగిన రెండవ ప్రపంచయుధ్ద ప్రభావము (5) రెండవ ప్రపంచ యుద్ధానంతరము భారతదేశములో జరిగిన ప్రముఖ ఘటనల పరిణామములు. ఈ ఐదు చరిత్రాంశములు భారతదేశపు బ్రిటిష్ సామ్రాజ్యము అస్తమింపజేసినవని చెప్పవచ్చును.

1857 సిపాయిల విప్లవముతో వచ్చిన రెండు ప్రముఖ మార్పులు[మార్చు]

(1) బ్రిటిష్ ఈస్టు ఇండియా వాణిజ్యసంస్థ పరిపాలన అంతమొందించి ఇంగ్లండు రాణి గారిపేరట లండన్ నగరమందున్న బ్రిటిష్ ప్రభుత్వము రాజ్యాధికారము వహించి ఈస్టు ఇండియా వాణిజ్య సంస్థ నే తమ ప్రతినిధి పరిపాలకుగా నియమించిరి (1858). (2) భారతదేశపు సైనిక సిబ్బందిలో భారతీయుల సంఖ్య తగ్గించి బ్రిటిష్ సైనికుల సంఖ్య అధికముచేయబడుటయే గాక బ్రిటిష్ నౌకా దళమును కూడా భారతసముద్ర తీరప్రాంతములు అవసరానికి అందుబాటుగా నుంచుటవలన కేవలము భారతఉపఖండముపైనే కాక ఆసియా ఖండములోని చుట్టుపట్ల ఇతరదేశములను హిందూమహా సముద్రములోని పర్షియన్ గల్ఫ్ దాకా కూడా సైనికబలగముతోను, నౌకాదళముతోను బెదరించగల శక్తి బ్రిటిష్ సామ్రాజ్యమునకు కలిగెను. భారతదేశములోనుంచిన తమ సైనిక, నౌకాదళములకగు ఖర్చులు భరించు బాధ్యత భారతదేశమే భరించుటవలన ఇంగ్లండు భరించవలసిన భారమును భారతదేశముపై మోపిరి. సైనికముగనే గాక బ్రిటిష్ ఇండియా వలన ఉపలబ్ధి అయిన వాణిజ్య శక్తితో ఇతరదేశములలోని తమ బ్రిటిష్ వలసరాజ్యముల వ్యాపారము, ఎగుమతి దిగుమతుల స్తోమత పెంపోందెను. బ్రిటిష్ దేశ సంవృధ్దికి తోడ్పడుచున్న భారతదేశమును విడిచి పెట్టుటకిష్ట పడకపోవటానికి అవికొన్ని బలమైన కారణములుగ విశదమగుచున్నవి.

ప్రపంచ యుధ్దముల పరిణామములు, జాతీయ కాంగ్రెస్సు కార్యక్రమముల ఫ్రభావము[మార్చు]

జాతీయకాంగ్రెస్సు వారిచ్చిన ప్రోద్బలముతో భారతసైనికులు మొదటి ప్రపంచ యుద్ధంనందు బ్రిటిష్ వారిపక్షమున నిలచిపోరాడి బ్రిటిష్ విజయమునకు అమూల్య సహాయము చేసిరి. ఆ విశ్వాసముతో బ్రిటిష్ వారు తదనంతరము స్వాతంత్ర్యమిచ్చెదరని ఆశించిన భారతీయులకు సంస్కరణల పేరట 1919 రాజ్యాంగ చట్టము (చూడు: మాంటేగు-షెమ్సఫర్డు రాజ్యాంగ సంస్కరణ చట్టము ) చేసి ఉపశమనముచేయ ప్రయత్నించిరి. జాతీయకాంగ్రెస్సు వారు గాంధీజీ నాయకత్వములో 1920నుండి అమలుచేసిన సహాయనిరాకరణోద్యమము వల్ల భారతదేశ ప్రజలు బ్రిటిష్ సార్వభౌమత్వమును తిరస్కరించమొదలిడిరి. 1935 నాటికి జాతీయ కాంగ్రేస్సుతో ముస్లింలీగు తీవ్ర విభిన్నత చూపుచుండినందువల్ల 1935 లో ఆఖరి సారిగ నింకొక రాజ్యాగ సంస్కరణ చట్టము చేసి (చూడు: 1935 వ సంవత్సరపు ఇండియా రాజ్యాంగ చట్టము ) భారతదేశమున కేంద్రీకృత రాజ్యముగ చేసి (Federal Dominion) బ్రిటిష్ సార్వభౌమత్వముక్రిందనే వుంచుటకు చేసిన ప్రయత్నము విఫలమైనది. సంపూర్ణస్వరాజ్యముకోసము జాతీయకాంగ్రెస్సు వారు చేయు ఆందోళన వుధృతమగుచున్న సమయములో బ్రిటిష్ సామ్రాజ్యము 1939 నుండి రెండవ ప్రపంచ యుద్ధం యొక్క వత్తిడి పరిస్థితులనెదుర్కొనవలసివచ్చింది. బ్రిటిష్ ఫ్రభువులు ఆ రెండవ ప్రపంచ యుధ్దారంభములో భారతదేశ సహాయము కోరక పోయనప్పటికినీ 1940 తరువాత యుధ్ధతీవ్రత, యుధ్దవిస్తరణ ఊహింపని మలుపులు తిరుగుటవల్ల భారతదేశ సమీప దేశమైన జపాన్ శత్రుపక్షమైన జర్మనీతో చేతులు కలిపి యుద్ధము చేయటవల్ల బ్రిటిష్ సామ్రాజ్యములోనుండిన మిడిల్ ఈస్టు, ఫసిఫిక్ మరియూ ఆగ్నేయ ఆసియా దేశములు (Southeast Asia) కు ముప్పువాటిల్లి బ్రిటిష్ నియంత్రణ కోల్పోవునన్న పరిస్థితులలో నిరంకుశుడైన హిట్లర్ బారినుండి ప్రపంచమును ముక్తిచేయవలయునన్న రాజ్యతంత్రయుతమైన ఘోషణలుచేసి 1940-41 లో జాతీయ కాంగ్రెస్సువారి సహకారము, సమ్మతము పొంది భారతీయ సైనికులను అధిక సంఖ్యలో ఆ రెండవ ప్రపంచ యుధ్దమున వినియోగించక తప్పలేదు. బ్రిటిష్ వారి టక్కరి రాజ్యతంత్రములనెరిగియున్న కాంగ్రెస్సు పూర్ణస్వరాజ్యముకోసము గట్టిపట్టు పట్టి సమయమిదేనన్నటుల అధిక రాష్ట్రములలో అప్పటిలో అధికారములోనున్న తమ కాంగ్రెస్సు ప్రభుత్వ యంత్రాంగమును స్థంబింపచేసియూ 1942 ఆగస్టులో క్విట్ ఇండియా (Quit India) అను ఉద్యమమును ప్రవేశపెట్టి సహాయనిరాకణ తీవ్రతహెచ్చించి బ్రిటిష్ అధికారులపై అత్యధికముగ వత్తిడి చేసిరి. ఒక ప్రక్క భారతదేశములోని అల్పసంఖ్యలోనున్న బ్రిటిష్ అధికారావర్గపు పరిపాలనా సిబ్బంది తీవ్ర తాకిడికిలోనైయుండగా అదే సమయములో (1941-42) రెండవ ప్రపంచయుద్ధమున బ్రిటిష్ సామ్రాజ్యమునకు ప్రముఖప్రమాదము జపాను దేశము వల్లగలిగినది. బ్రిటిష్ ఇండియాలో భాగమైన బర్మా నె కాక భారతదేశ దరిదాపునయున్న బ్రిటిష్ స్థావరములైన సింగపూర్ మరియూ మలయా దేశములను గూడా ముట్టడించిన జపాను దేశము భారతదేశమును గూడా అతిత్వరలోనే ముట్టడించునన్న సంభావన బ్రహ్మాండమైన తాకిడి కలిగించింది. భారతదేశపు జాతీయకాంగ్రెస్సు తద్వారా భారత ప్రజల సహకారము తప్పనిసరై లండన్ లోని బ్రిటిష్ ప్రబువులు కాంగ్రెస్సుకోరిక ప్రకారము మరింత స్వతంత్రతాయుక్తమైన పరిపాలననిచ్చుటకు నిశ్చయించిరి. తను ప్రధానమంత్రిగా నుండగా బ్రిటిష్ సామ్రాజ్యఅంతముచేయుట జరుగదన్న విన్ స్టన్ చర్చిల్ మొండివైఖరి చరిత్రలో కెక్కినది. చర్చిల్ తరువాత 1945 లో క్లెమెంట్ అట్లీ (Clement Atlee) ప్రధానమంత్రిగ రాగనే భారతదేశానికి స్వతంత్రమియ్యవలెనని నిశ్చయించి, ఎట్టి పరిస్థితులోనూ 1948 లోపలే రాజ్యాదికారము అప్పగించు కార్యక్రమము పూర్తియగునని వెల్లడిచేసి ముందుగ క్రిప్సు మిషన్ (Cripps Mission) పంపించెను. (చూడు: హిందు మహాసభ ) తదనంతరం భారతదేశపు ఆంతరంగిక రాజకీయ వడుదుడుకులతో వైస్రాయి లార్డు మౌంట్‌బాటన్ హయాములో చివరకు 1947 సంవత్సరములో బ్రిటిష్ సామ్రాజ్యము భారతదేశమునుండి అస్తమించింది.[2]

ఆకస్మిక నిర్యాణమునకు దోహదమైన సంయుక్త పరిస్థితులు, క్లెమెంటు అట్లీ చెప్పిన కారణము[మార్చు]

1946 లో భారతదేశమున వైస్రాయి మౌంట్ బాటన్ పర్యవేక్షణలో రాజ్యాధికారము వప్పచెప్పుటకు అర్హులగు భారతీయ నాయకులతో చర్చలు, తగు సన్నాహములు జరుగుచుండెను. ముస్లింలీగు అధ్యక్షుడు జిన్నా రెండు దేశముల సిధ్దాంతముతో హింసాత్మకచర్యలకు కూడా వెనుకాడవలదని ప్రోత్సహించుటవలన తీవ్రమైన హిందు ముస్లిముల ఘర్షణలు, అశాంతి నెలకొన్న పరిస్థితులలో బ్రిటిష్ పరిపాలక సిబ్బంది చాల వత్తిడికి లోనైయుండిరి. అదే సమయములో బ్రిటిష్ ఇండియా సైన్యాధిపతి (Claude Auchinleck) ఆదేశములమేరకు బ్రిటిష్ ఇండియా సైన్యమునువదలిపోయి రెండవ ప్రపంచ యుద్దసమయములో (1940-1945) సుభాస్ చంద్రబోసు నెలకొల్పిన భారతజాతీయ సైన్యములో చేరిన దాదాపు 6000 మందికి సైనిక నిబంధనల ప్రకారము దండశిక్ష విధించుటకు నవంబరు 1945నుండి మె 1946 మధ్యన ఢిల్లీలోని ఎర్రకోటలో బహిరంగ సైనిక కోర్టులు నెలకొలిపి విచారణ చేయ ప్రారంభించెను. అందుకు జాతీయ కాంగ్రెస్సు అభ్యంతరము తెలిపినప్పటికినీ లెఖ్కచేయక ముందుకుసాగిరి. దేశంకోసం త్యాగముచేసిన సైనికులను దేశ ద్రోహలుగ పరిగణించి శిక్షార్హులుగచేయుట సహింపమని నిరసన ప్రదర్శనలు, ఆందోళన చేసిరి. అంతేకాక సాటి సైనికులకు అన్యాయపు దండశిక్ష విధించబడుచున్నందుకు నిరసనగా అప్పటి బొంబాయి లోని నౌకాదళము తమ అధికారుల ఆజ్ఞలను తిరస్కరించి 1945 ఫిబ్రవరిలో విప్లవము సృష్టించిరి. అట్టి ప్రమాద పరిస్థితులలో భారతనౌకాదళ విప్లవ చర్యలను అదుపుచేయుటకు స్రీలంక నుండి ( Ceylon or Sri lanka) బ్రిటిష్ వైమానిక ధళము ( Destroyer) ) కదలించి బొంబాయి తీరమునకు తీసుకువచ్చిరి. రెండవ ప్రపంచయుద్ధమువలన ఇంగ్లండు లోని ప్రభుత్వ పరిపాలనా సిబ్బంది కొరత కలగటమే గాక ఆర్థిక కొరత కూడా ఎదురైనది. అంతేకాక రెండవ ప్రపంచయుద్ధములో విజయము సాధించిన ప్రాముఖ్యత, పలుకుబడి రష్యా, అమెరికాదేశములకు దక్కగా బ్రిటిష్ సామ్రాజ్యము యొక్క పలుగు బడి ప్రభావము అధోగతిలోనుండినది. ఇంగ్లండు లోని పరిస్థితులటులుండగా భారతదేశమునందు అప్పటికే 1942 నుండి గాందీ ప్రవేశపెట్టిన క్విట్ ఇండియా ఉద్యమము ఒకప్రక్కనుంచి విస్తృతమైన వత్తిడి కలుగజేయుచుండగా 1945 ఫిబ్రవరిలో వచ్చిన నౌకాదళ తిరుగుబాటు చేదోడైనది. 1942-43 ల మద్య బెంగాలులో వచ్చిన విపరీత కరవుపరిస్తితుల నివారణకు బ్రిటిష్ ప్రభువుల నిర్లక్ష్యభావము ప్రపంచనాయకుల దృష్టికి వచ్చినవి. ఉపశమనార్ధము కెనడా, ఆస్ట్రేలియా, అమెరికా దేశములునుండి వచ్చిన బియ్యము, గోదుమ ఆహార ధాన్యములను భారతదేశ స్వతంత్రపోరాటమునణచుటు నెలకొలిపిన సైనికులకై కేటాయించుట, బ్రిటిష్ ప్రధానమంత్రి వినస్టన్ చర్చిల్ కు భారతీయులపట్ల కలిగియున్న హీన అభిప్రాయము తోటి నిర్లక్ష్య భావము కలిగియుండుట విశదమైన చరిత్రాంశములు.అమెరికా రాష్ట్రపతి రూజువెల్టు(Franklin Delano Roosevelt) భారతదేశము పట్ల చాల సానుభూతిపరుడైయుండి చర్చిల్ తో అనేక సార్లు బెంగాల్ కు ఆహార సహాయార్దముచేయుటకై ఓడలను సమకూర్చుటయేగాక భారతదేశ స్వాతంత్రమును గుర్చి చర్చించినప్పటికిని చర్చిల్ ప్రధానిగానున్నంతకాలము వారి పైఖరి మారలేదు. చివరకు రెండవ ప్రపంచయుద్దములో ప్రముఖ పాత్రవహించిన అమెరికా దేశములోని నాయకులు యుద్దానంతరము బ్రిటిష్ సామ్రాజ్యము తిరిగి పురోగమించకుండా అస్తమించవలెనన్న నిర్ణయమునకు వచ్చిరి.[3] వీటన్నటి ప్రభావము వల్ల బ్రిటిష్ సామ్రాజ్యము అస్తమించినదని చరిత్రకారులంచనా. కాని, స్వాతంత్ర్యముచ్చిన కొలది కాలమునకు 1956 లో మాజీ బ్రిటిష్ ప్రధాన మంత్రి క్లెమెటు అట్లే అప్పటి బెంగాల్ రాష్ట్ర గవర్నర్ పి. వి. చక్రబర్తికి అతిధిగా కలకత్తా వచ్చినప్పుడు వెలిబుచ్చిన విశేషములు; గాంధజీ అహింసా సిధ్దాంతము (Non-violence movements) శక్తివంతమైన బ్రిటిష్ ప్రభుత్వమును కలవరపెట్టినవా అన్న ప్రశ్నకు సమాధానములో గాందీ సహాయనిరాకరణోద్యమములను అణచుటకు వారికొక` పెద్ద సమస్యకాలేదనీ రెండవ ప్రపంచ యుధ్ధానంతరము ఇంగ్లండులో ఆర్థిక సామాజక నైతిక స్ధోమత తగ్గినందువల్ల వారు భయపడిందల్లా నౌకాదళ తిరుగుబాటులాంటి సైనిక విప్లవములని. అటువంటివాటిని నియంత్రణచేయుటకు వారికి తగు సరంజామా లేకపోవడం వల్ల భారతదేశమునుండి నిష్క్రమించుటకు ఆకస్మిక నిర్ణయముచేసితిరని తెలియవచ్చింది.[4]

మూలాలు[మార్చు]

  1. “The British Rule in India” దిగవల్లి వేంకట శివరావు (1938) ఆంధ్రగ్రంధాలయ ముద్రాక్షర శాల, బెజవాడ
  2. 2.0 2.1 “Unfinished Empire”John Darwin(2012) Allen Lane an imprint of Penguin books pp342-386
  3. "Churchill's Secret War" Madhusree Mukerjee (2010) An Imprint of TRANQUEBAR WESTLAND LTD pp192-240
  4. "The Longest August" Dilip Hiro(2015) Nation Books pp76-77