రాజసులోచన

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాజసులోచన

జన్మ నామంరాజీవలోచన
జననం (1935-08-15)1935 ఆగస్టు 15
విజయవాడ, కృష్ణా జిల్లా
మరణం 2013 మార్చి 5(2013-03-05) (వయసు 77)
India మద్రాసు, భారతదేశం
భార్య/భర్త సి. ఎస్. రావు
ప్రముఖ పాత్రలు పాండవ వనవాసం
బభృవాహన
భాగ్యదేవత

రాజసులోచన (ఆగష్టు 15, 1935 - మార్చి 5, 2013) అలనాటి తెలుగు సినిమా నటి, కూచిపూడి, భరత నాట్య నర్తకి. తెలుగు సినిమా దర్శకుడు చిత్తజల్లు శ్రీనివాసరావు భార్య. ఈమె విజయవాడలో సాంప్రదాయ కుటుంబంలో జన్మించింది, కానీ విద్యాభ్యాసం అంతా తమిళనాడులో జరిగింది.

రాజసులోచన తండ్రి భక్తవత్సలం నాయుడుకు మద్రాసుకు బదలీ కావడంతో, రాజసులోచన చిన్న వయసులోనే అక్కడకు వెళ్ళిపోయారు. చెన్నైలోని ట్రిప్లికేన్‌ ప్రాంతంలో ఆమె బాల్యం గడిచింది. అక్కడి తోపు వెంకటాచలం చెట్టి వీధిలో 1939లో స్థాపించిన ప్రసిద్ధ శ్రీసరస్వతీ గాన నిలయంలో ఆమె నాట్యం నేర్చుకున్నది. కష్టపడి తల్లిదండ్రుల్ని ఒప్పించి సరస్వతీ గాన నిలయంలో నాట్యం నేర్చుకున్నది. ఈమె 1963లో పుష్పాంజలి నృత్య కళాకేంద్రం అనే శాస్త్రీయ నృత్య పాఠశాల ప్రారంభించింది. అది ఇప్పటికీ నడుస్తున్నది.

సినీ జీవితం[మార్చు]

స్టేజీ మీద రాజసులోచన నాట్య ప్రదర్శన చూసి కొందరు నిర్మాతలు సినిమాల్లో నటించే అవకాశం ఇచ్చారు. రాజసులోచన 1953లో కన్నడ చిత్రం 'గుణసాగరి' ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది. కన్నతల్లి చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయ్యారు. అంతకు ముందు 'గుణసాగరి' అనే కన్నడ చిత్రంతో పాటు 'సత్యశోధనై' అనే తమిళ చిత్రంలో నటించారు. తొలిసారి హీరోయిన్ గా ఎన్.టి.ఆర్. సరసన ఘంటసాల నిర్మించిన సొంతవూరు (1956) చిత్రంలో నటించింది. తన చిత్రాలకు నృత్య దర్శకులైన పసుమర్తి కృష్ణమూర్తి, వెంపటి పెదసత్యం, వెంపటి చినసత్యం, జగన్నాథశర్మ మొదలైన వారి వద్ద కూచిపూడి నృత్యంలోని మెళకువలు నేర్చుకున్నారు. ఈమె తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాల్లో కలిపి దాదాపు 275 చిత్రాల దాకా అందరు మేటి నటుల సరసన నటించారు[1]. ప్రతి భాషలోను తన పాత్రకు స్వయంగా డైలాగ్స్ చెప్పుకునేవారు.

నృత్య కళాకేంద్రం[మార్చు]

మద్రాసు నగరంలో 1963 సంవత్సరంలో 'పుష్పాంజలి నృత్య కళాకేంద్రం' స్థాపించారు. దీని ద్వారా విభిన్న నృత్యరీతుల్లో ఎన్నో నృత్య ప్రదర్శనలను మన దేశంలోను, వివిధ దేశాల్లో ప్రదర్శించారు. ముఖ్యంగా విదేశాల్లో జరిగే ఫిల్మోత్సవ్ లలో వీరి ప్రదర్శనలు విరివిగా జరిగాయి. ఈ ప్రదర్శనలలో భామా కలాపం, అర్థనారీశ్వరుడు, శ్రీనివాస కళ్యాణం, అష్టలక్ష్మీ వైభవం లాంటి ఐటమ్ లకు మంచి ఆదరణ, ప్రశంసలు లభించాయి. వీరు అమెరికా, జపాన్, చైనా, శ్రీలంక, రష్యా, సింగపూర్ తదితర దేశాల్లో నాట్య ప్రదర్శనలనిచ్చారు.

వ్యక్తిగత జీవితం[మార్చు]

ఈవిడ దర్శకుడు చిత్తజల్లు శ్రీనివాసరావును వివాహం చేసుకొంది. వీరికి కవల పిల్లలు.

మరణం[మార్చు]

ఈవిడ అనారోగ్యంతో బాథపడుతూ చెన్నై లోని తన స్వగృహంలో 2013, మార్చి 5, తెల్లవారుజామున మరణించింది[2]

చిత్ర సమాహారం[మార్చు]

మూలాలు[మార్చు]

  • నాట్యలోచని, రాజసులోచన ఆంధ్రప్రభ విశేష ప్రచురణ 1999 'మోహిని' కోసం రాసిన వ్యాసం.
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-05-12. Retrieved 2020-02-19.
  2. http://telugu.greatandhra.com/cinema/march2013/artist_sulochana_5.phప్[permanent dead link]

బయటి లింకులు[మార్చు]