నాగభూషణం (నటుడు)

వికీపీడియా నుండి
నాగభూషణం

తెలుగు సినిమాలలో ప్రత్యేకంగా సాంఘిక చిత్రాలలో ప్రతినాయకులకు గుర్తింపు తెచ్చిన నటుల్లో ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన నటుడు నాగభూషణం. ఎస్.వి.రంగారావు కొన్ని సాంఘిక చిత్రాలలో ప్రతినాయకుని వేషం వేసినా అవి సంఖ్యాపరంగా చాలా తక్కువ. ఆర్.నాగేశ్వరరావు, రాజనాల, సత్యనారాయణలు కథానాయకునితో ఫైటింగులు చేసే ప్రతినాయకులు. విలనిజానికి ఒక ప్రత్యేక పంథా ను ప్రవేశపెట్టి, కామెడీ టచ్ ఇచ్చిన నటులు నాగభూషణం. ఈయన హీరోతో ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొనరు. ఆయన తరఫు వారంతా హీరోతో పోరాడాక మహా ఐతే ఒకటి రెండు దెబ్బలు తినేవారు. 1952లో పల్లెటూరు చిత్రంతో ప్రవేశించి తొంభయ్యవ దశకం వరకూ చిత్రాలలో నటించారు. ఏది నిజం చిత్రంలో హీరోగా నటించినా మంచి మనసులు(1962) చిత్రంతో గుర్తింపు పొంది రెండు దశాబ్దాల పాటు ఉజ్వలంగా ప్రకాశించారు. ఈయన సృష్టించిన ఒరవడి తరువాత రావు గోపాలరావు, నూతన్ ప్రసాద్, కోట శ్రీనివాసరావు ద్వారా కొనసాగింది.

విషయ సూచిక

నాటకాలు [మార్చు]

చిన్నతనం నుండి నాటక రంగంపై మక్కువ పెంచుకున్నారు. చదువుకొనేటప్పుడు, ఉద్యోగ జీవితంలోను (రైల్వే), నటజీవీవితంలోను (ఉన్నతస్థాయి ఉన్నప్పుడు కూడా) నాటకరంగాన్ని విడిచిపపెట్టలేదు. ప్రత్యేకంగా ప్రస్తావించవలసింది "రక్తకన్నీరు" నాటకం గురించి. రక్తకన్నీరు నాగభూషణం ఇంటిపేరుగా మారిపోయింది. ఎమ్.ఆర్. రాధా తమిళ నాటకాన్ని తెలుగులో రక్త కన్నీరు పేరుతో వ్రాయించి సుమారు రెండు వేల ప్రదర్శనలు ఇచ్చారు. రవి ఆర్ట్స్ థియేటరు (1956 నుండి) పేరు మీద అనేక నాటకాలు వేసి 30కుటుంబాలకు ఉపాధి కల్పించారు.

సినీ జీవితం [మార్చు]

నటజీవితపు తొలిరోజుల్లో నటించిన చిత్రాలు అంత పేరు తేలేదు. పల్లెటూరు (1952), అమరసందేశం (1954), పెంకి పెళ్లాం (1956), మాయాబజార్ (1957)లో సహాయక పాత్రలు, ఏది నిజంలో హీరో పాత్ర ధరించారు. కొంత కాలం డబ్బింగు ఆర్టిస్టుగా పనిచేశారు. ఐతే మంచి మనసులు (మూలచిత్రం ‘కుముదం’లో ఎం.ఆర్‌. రాధ పాత్ర) చిత్రం ద్వారా మంచి గుర్తింపు లభించింది. విలక్షణమైన సంభాషణా విధానంతో ప్రత్యేక గుర్తింపు పొందారు. పౌరాణిక పాత్రల్లో శివుడు (భూకైలాస్), సాత్యకి (మాయాబజార్), పౌండ్రక వాసుదేవుడు (శ్రీకృష్ణవిజయం), శకుని (కురుక్షేత్రం) మొదలైన పాత్రలు ధరించారు.

నిర్మాతగా [మార్చు]

నాటక సంస్థ రవి ఆర్ట్‌ థియేటర్స్‌ పేరుతో నాటకాల రాయుడు (1969), ఒకే కుటుంబం (1970) చిత్రాలు నిర్మించారు నాగభూషణం. నాటకాల రాయుడుకి భగవాన్ హీరోగా నటించిన ‘అల్‌బేలా’ (1951) హిందీ చిత్రం ఆధారం. (హిందీ పాట' నిందియా ఆజారే ఆజా '(సి. రామచంద్ర స్వరరచన) వరుసలోనె తెలుగులో 'నీలాల కన్నుల్లో మెలమెల్లగా నిదుర రావమ్మా రా' స్వరపరచారు.) ఒకే కుటుంబంకు తమిళచిత్రం ‘పాపమన్నిప్పు’ ఆధారం. ఇదే చిత్రం మొదట పాప పరిహారం పేరుతో తెలుగులో డబ్బింగు చేశారు. అందులో ఎం.ఆర్‌. రాధకి నాగభూషణమే డబ్బింగ్‌ చెప్పారు. అదే చిత్రాన్ని మళ్ళీ ఎన్.టి.ఆర్, కాంతారావులతో తిరిగి నిర్మించారు.

నటనా శైలి [మార్చు]

నాటకీయతో కూడిన తనదైన ప్రత్యేకశైలితో ‘నాగభూషణం మార్కు’ను ఆయన సృష్టించారు. ఈ శైలి తరువాత అనేక మందిచే అనుకరించబడింది. దాసరి నారాయణరావు ఒక చిత్రంలో పూర్తిగా నాగభూషణం బాణీలో నటించారు. విలన్‌ పాత్రలతో పాటు ఆడపిల్లల తండ్రి (74) లాంటి సినిమాల్లో కరుణ రసాత్మకమైన పాత్రలు వేశారు. అమ్మమాట, కథానాయకుడు, అడవిరాముడు చిత్రాలలో నాగభూషణం నటనను గమనిస్తే తర్వాత కాలంలో రావు గోపాలరావు ధరించిన అనేక పాత్రలలో నాగభూషణం ముద్ర కనిపిస్తుంది. (అడవి రాముడు -వేటగాడు చిత్రాలలో పాత్రలు ప్రత్యేక గమనార్హం). ఆయన అడవి రాముడు చిత్రంలోచెప్పిన 'చరిత్ర అడక్కు చెప్పింది విను' 'షేక్ చినమస్తాన్‌లా' మొదలైన సంభాషణలు చాలాకాలం ప్రేక్షకుల నోళ్ళలో నానాయి.

విశేషాలు [మార్చు]

  • అటు సినిమాల్లోనూ, రంగస్థలం మీదా ఏకకాలంలో ‘బిజీస్టార్‌’ అనిపించుకున్న ఏకైక నటుడుగా నాగభూషణానికి పేరుంది.
  • ఒక్క ‘రక్తకన్నీరు’ నాటకాన్నే ఆయన దాదాపు రెండువేల ప్రదర్శనలు ఇవ్వగలిగారు.
  • బిజీస్టార్‌ కాకముందు ఒకే మాసంలో ముప్పయ్‌ ప్రదర్శనలు ఇవ్వగలిగిన ఘనతా, ఒకే రాత్రిలో రెండు ప్రదర్శనలు ఇవ్వగలిగిన ఘనతా ఆయన సాధించారు.
  • సినిమాలకి సంబంధించీ, నాటకాలకి సంబంధించీ - రెండువేపుల నుంచీ ఆయనకి సత్కారాలూ, గౌరవాలూ చాలా లభించాయి.
  • ప్రముఖ నటీమణులు వాణీశ్రీ, శారద మొదట్లో ఆయన నాటక బృందంలో వుండేవారు.

వనరులు [మార్చు]