కులదైవం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కులదైవం
(1960 తెలుగు సినిమా)
దర్శకత్వం కబీర్‌దాస్
తారాగణం గుమ్మడి వెంకటేశ్వరరావు, అంజలీదేవి, రామమూర్తి, కొంగర జగ్గయ్య, కృష్ణకుమారి
సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు
నేపథ్య గానం ఘంటసాల, పి.సుశీల, జమునారాణి, చిత్తరంజన్
గీతరచన సముద్రాల, కొసరాజు
నిర్మాణ సంస్థ శ్రీ సారథి స్టూడియోస్
భాష తెలుగు

కులదైవం 1960, మార్చి 4వ తేదీన విడుదలైన తెలుగు సినిమా. ఇదే పేరుతో తమిళంలో 1956లో ఎస్.వి.సహస్రనామం, పండరీబాయి జంటగా విడుదలైన సినిమా, 1957లో బలరాజ్‌సహానీ, పండరీబాయిలు జంటగా హిందీలో విడుదలైన బాబీ చిత్రాలు ఈ సినిమాకు మూలం. ఈ సినిమాలన్నీ బెంగాలీ రచయిత్రి ప్రభావతి సరస్వతి రచించిన ఒక కథా ఆధారంగా నిర్మించబడ్డాయి.

కృష్ణకుమారి

నటీనటులు[మార్చు]

కథ[మార్చు]

‘పయనించే ఓ చిలుకా’ పాటతో టైటిల్స్ ప్రారంభమవుతాయి. మందుతో పరుగెడుతూ ఓ యువకుడు ఇల్లు చేరతాడు. తండ్రి మరణించటంతో ఆ యువకుడు రత్నం కఠిన నిర్ణయం తీసుకుంటాడు. అతనికి ముగ్గురు తమ్ముళ్లు రామూ, రాజూ, గోపీలను చదివించటం కోసం తాను చదువుమానేసి తండ్రి స్నేహితుడు ధర్మారావు (వక్కలంక కామరాజు) సాయంతో బట్టల వ్యాపారం మొదలుపెడతాడు. బెజవాడలో రత్నం బ్రదర్స్ బట్టలషాపు ఓనర్‌గా ఆస్తిపరుడౌతాడు. రత్నం (గుమ్మడి) భార్య ఓ బిడ్డను కని మరణిస్తుంది. మేనత్త (రమాదేవి) వారందరినీ కనిపెట్టుకుని ఉంటుంది. ఆమె సలహాపై రత్నం, శాంత (అంజలీదేవి)ను స్వీకరిస్తాడు. శాంత బిఏ చదువుకన్నా, ఆ విషయం తెలియనీయక ఎంతో ఒద్దికతో సంసారం చక్కబెడుతుంటుంది. ఆమె చెల్లెలు లత (గిరిజ) ఏడో యేటే వివాహం జరిగి బాల వితంతువైనా, ఆమెకెవరూ ఆ విషయం చెప్పకపోవడంతో రత్నం ఇంట్లోనే అక్కతోపాటుగా ఉంటూ గోపీ (చలం)ని తమాషాగా ఆటపట్టిస్తూ చలాకీగా ఉంటుంది. పెద్దతమ్ముడు రామూ (కృష్ణారావు) బిఎల్ చదివి, ధర్మారావువద్ద అప్రెంటీస్ చేస్తూ వాళ్లమ్మాయి అరుణ (కృష్ణకుమారి)పై ప్రేమ పెంచుకుంటాడు. రత్నానికి పరిచయస్తుడైన శేషయ్య (పెరుమాళ్లు) కూతురు ప్రభావతి (ఆదోని లక్ష్మి) అంతగా చదువుకోకపోయినా, తన రెండో తమ్ముడు రాజు (జగ్గయ్య)తో పెళ్లి నిశ్చయించి, రామూ, రాజుల వివాహం జరిపిస్తాడు రత్నం.

పెళ్లిలో లత కారణంగా ప్రభావతి ద్వేషం చూపటం సహించలేని రాజు, పట్నంలో హాస్టల్‌లో మెడిసిన్ చదువు కొనసాగిస్తుంటాడు. ప్రభ నోటి దురుసువలన ఆ కుటుంబంలో కష్టాలు మొదలవటం, పురిటికి పుట్టింటికి వెళ్లిన అరుణ, ఆస్తిలో భాగంకోసం భర్తను ఒప్పించి ఆమె తమ్ముడు ప్రకాష్‌కు బాధ్యతలు అప్పగించేలా చేస్తుంది. లత తాను విడో అని తెలిసి అత్తవారింటికి వెళ్తుంది. ప్రకాష్ కుట్రవలన ఆస్తి పంపకాలు జరిగడంతో రత్నం బ్రదర్స్ షాపు మూతపడుతుంది. అది భరించలేని రత్నం అనారోగ్యం బారినపడి పాత ఇంటికి చేరతాడు. గోపి బొంబాయి ఉద్యోగానికి, రాజు మిలటరీ ఉద్యోగానికి వెళ్లిపోవటంతో మనోవేదనకు గురై రత్నం మరణిస్తాడు. విడిపోయిన వారంతా ధర్మరావు, శేషయ్యల వలన చేసిన పొరబాట్లను గ్రహిస్తారు. రత్నం కోరిక ప్రకారం లత, గోపీల వివాహం జరిపిస్తుంది శాంత. రత్నం ఫొటోముందు అంతా నమస్కరించటంతో చిత్రం ముగుస్తుంది.[1]

పాటలు[మార్చు]

  • ఆడి పాడేను - పి.సుశీల
  • కోటు బూటు వేసిన బావా - కె.జమునారాణి
  • గారడి చేసే నీ కనులు ఆరడి నేయును నా మనసు - పి.సుశీల
  • నమ్మరాదు అసలే నమ్మరాదు - పి.బి.శ్రీనివాస్
  • పయనించే ఓ చిలుకా ఎగిరిపో పాడైపోయెను గూడు - ఘంటసాల . రచన:సముద్రాల జూనియర్
  • పాట పాడవే వయ్యారి - ఘంటసాల, జమునారాణి . రచన: కొసరాజు.
  • రావే రావే వయ్యారి ఓ చెలీ...నా గారాల జిలిజిలి జాబిలీ - పి.సుశీల, ఎం.చిత్తరంజన్

మూలాలు[మార్చు]

  1. సి.వి.ఆర్.మాణిక్యేశ్వరి (20 April 2019). "ఫ్లాష్ బ్యాక్ @50 కులదైవం". ఆంధ్రభూమి దినపత్రిక. Retrieved 17 May 2019.
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=కులదైవం&oldid=3960136" నుండి వెలికితీశారు