ముష్టిపల్లి వేంకటభూపాలుడు

వికీపీడియా నుండి
(ముష్టిపల్లి వేంకట భూపాలుడు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

ముష్టిపల్లి వేంకటభూపాలుడు మహబూబ్ నగర్ జిల్లాలోని గద్వాల సంస్థానంలో విలీనమైన రాజవోలు (రాజోలి) ప్రాంతాన్ని ఏలిన ప్రభువు. రాజకవి. 17 వ శతాబ్దికి చెందినవాడు. పాకనాటివారు. మిడిమిళ్ళ గోత్రజులు. ముష్టిపల్లిని ఇంటిపేరుగా కలిగినవారు. గద్వాల సంస్థాన ప్రభువులకు బంధువులు. ఈ రాజకవి దివ్యదేశ మహాత్మ్య దీపిక, రాజవోలు వేంకటేశ్వర శతకం, వేంకటేశ్వర కీర్తనలు మొదలగు రచనలు చేశారు.

దివ్యదేశ మహాత్మ్య దీపిక[మార్చు]

దివ్యదేశ మహాత్మ్య దీపిక నూట ఎనిమిది దివ్య స్థలాలను, వాటి మహాత్మ్యాలను తెలుపు ద్విపద కావ్యం. వేంకటభూపాలుడు దీనిని 23 తాళపత్రాలపై రచించాడు. ఈ గ్రంథంలో ఈ రాజకవి తన వంశ క్రమాన్ని వివరించాడు. ఈ గ్రంథాన్ని వీరి కుల ఇలవేల్పైన కేశవస్వామికి అంకితమిచ్చాడు.

రాజవోలు వేంకటేశ్వర శతకం[మార్చు]

ముష్టిపల్లి వేంకటభూపాలుడు రచించిన మరో గ్రంథం రాజవోలు వేంకటేశ్వర శతకం. 109 కంద పద్యాలతో కవి దీనిని తాళపత్రాలలో రచించాడు. ఈ గ్రంథం రాజవోలు శ్రీవేంకటేశ్వరస్వామికి అంకితమివ్వబడింది. ఈ శతకాన్ని కవి ఈ పద్యంతో మొదలుపెట్టాడు.... కం. శ్రీరమణీ ప్రాణేశ్వర/ వారిజ లోచన మురారి.....నమ/ స్కారమిదె రాజవోలి వి/ హారుని వలె కరుణ వెంకటాచల రమణా! చివరి పద్యం నరవర యెప్పుడు చాలా/ నిరతము మది నమ్మినవాడ నీ దాసుని గన్/ మరువకుము రాజవోలీ/ హరిలీలను కరుణ వెంకటాచల రమణా!

శతకం యొక్క విశిష్టత

ఈ శతకంలో మొత్తం 109 కంద పద్యాలలో కవి మొదటి 56 పద్యాలను ' ర ' ప్రాసతో రాశాడు. తరువాత 57 పద్యాల నుండి 66 వరకు గల పద్యాలను ' న ' ప్రాసతోను, 67 నుండి 86 వరకు గల పద్యాలను 'ల ' ప్రాసతోను, 87 నుండి 106 వరకు గల పద్యాలను బిందు పూర్వక ' ద ' కార ప్రాసతోను, మిగిలిన మూడు పద్యాలను ' ర ' ప్రాసతోను పూర్తిచేశాడు.

వేంకటేశ్వర కీర్తనలు[మార్చు]

ఈ రాజకవి శ్రీ వేంకటేశ్వరస్వామిని కీర్తిస్తూ మూడువేల నాలుగువందల డెబ్బైయారు సంకీర్తనలు రచించాడు[1]. ఇవి వేంకటేశ్వరుని కీర్తనలైనా అక్కడక్కడ శివ పరముగా కూడా రాయబడినవి. కారణం ఈ ప్రభువులు మొదట ప్రోల్గంటి సోమేశ్వరుని భక్తులు కావడం. ఈ కీర్తనలలో అక్కడక్కడ ద్విపద పంక్తులు కూడా ఉన్నాయి. ఈ కీర్తనలలో మొదటిది.... మారువ రాగం - ఆది తాళం రామ రామ మిము నమ్మిన దాసుల/ రక్షించగ ఇక ఎవరున్నారు/ స్వామి పరాకు............/ పై నేమి నేరములు గల్గిన నైన......

మూలాలు[మార్చు]

  1. గద్వాల సంస్థాన తెలుగు సాహిత్య పోషణం, రచన:డాక్టర్ కట్టా వేంకటేశ్వర శర్మ, సునందా పబ్లికేషన్స్, మ. నగర్, 1987, పుట-96