కేశవపంతుల నరసింహశాస్త్రి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆకాశవాణిలో సంస్కృత పరిచయం కార్యక్రమం ద్వారా తమ గంభీర స్వరంతో ' అమరవాణి ' ని వినిపించి, కే. ఎన్. శాస్త్రిగా తెలుగువారికి సుపరిచితులైన వ్యక్తే కేశవపంతుల నరసింహశాస్త్రి.

స్వస్థలం[మార్చు]

మహబూబ్ నగర్ జిల్లా మానోపాడ్ మండలంలోని పల్లెపాడు వీరి స్వగ్రామం.

జీవన కాలం[మార్చు]

రామలక్ష్మమ్మ, తిప్పాజ్యోసులకు శాస్త్రి 14.07.1919 లో జన్మించారు. ఏడు దశాబ్దాల జీవితాన్ని గడిపిన శాస్త్రి 02.01.1991 లో మరణించారు.

చదువు[మార్చు]

శాస్త్రి విద్వాన్, శిరోమణి పరీక్షలలో ఉత్తీర్ణులయ్యారు. గీర్వాణ భాషలో అపార పండిత్యాన్ని సంపాదించారు.

సాహితీ కృషి[మార్చు]

కేశవపంతుల నరసింహశాస్త్రికి చిన్నతనంలోనే ఆశు కవితాధార అబ్బింది. పదహారు సంవత్సరాల వయసులోనే వనపర్తి రాజుల పూర్వపు రాజధాని అయిన శ్రీరంగాపురంలోని శ్రీరంగనాథస్వామి నిర్వహించే కవిగాయక సభలలో పాల్గొని, నాటి రాజు తృతీయ రామేశ్వరరావుపై పద్యాలు వినిపించి, మెప్పు పొందాడు. నాటి నుండి మొదలుకొని సుమారు దశాబ్దం పాటు ప్రతియేడు ఆ సభలలో పాల్గొని వార్షిక సన్మానాలు పొందిన కవివరేణ్యులు. మహబూబ్ నగర్ జిల్లాలో సాహితీ పోషణలో పేరెన్నికగన్న గద్వాల, ఆత్మకూరు, జటప్రోలు తదితర సంస్థానాలలో కూడా తమ పాండిత్యాన్ని ప్రదర్శించి గౌరవ సత్కారాలు పొందాడు. శాస్త్రి ప్రౌడకవిగానే కాకా సద్విమర్శకులు కూడా. రఘువంశంపై వీరి వ్యాఖ్యానం వీరి విమర్శనా ప్రతిభకు గీటురాయి. ప్రబంధ పాత్రలు అను వీరి రచన సాహిత్య శాస్త్రంలో వీరెంత ప్రవీణులో, వీరికెంత సూక్ష్మపరిశీలనా శక్తి ఉందో తెలియజేస్తుంది. ' సంస్థానాలు- సాహిత్య పోషణ ' అను వీరి గ్రంథం సంస్థానాలతో వారికిగల పరిచయాన్ని, అనుబంధాన్ని తెలియజేస్తుంది.[1] శాస్త్రిగారు కవి, విమర్శకులే కాదు గొప్ప వక్త కూడా. గంభీరస్వరంతో పద్యాలను ధారాళంగా పాడుతూ గంటలకొద్ది ఉపన్యసించేవారట. సురభి మాధవరాయ ప్రభు సంస్కృతంలో రాసిన చంద్రికా పరిణయము కావ్యాన్ని శాస్త్రి తెలుగులోనికి అందరికీ అర్ధమయ్యే విధంగా అనువదించారు.

రచనలు[మార్చు]

ముద్రిత రచనలు[మార్చు]

  • బాలబ్రహ్మేశ్వర సుప్రభాతం
  • రత్నలక్ష్మీ శతకం
  • ప్రబంధ పాత్రలు
  • సంస్థానాలు - సాహిత్య పోషణ
  • త్యాగధనులు
  • రఘువంశ వ్యాఖ్యానం
  • చంద్రికా పరిణయము (సంస్కృతం నుంచి అనువాదం) [2]

అముద్రిత రచనలు[మార్చు]

  • హనుమత్సందేశం
  • ఉదయ సుందరి
  • మధుర నిశీథం
  • మంగళ సూత్రం
  • సూర్యనారాయణ శతకం

మూలాలు[మార్చు]

  1. పాలమూరు ఆధునిక యుగకవుల చరిత్ర,, రచన: ఆచార్య ఎస్వీ రామారావు, పసిడి ప్రచురణలు, హైదరాబాద్,2012, పుట-61
  2. నరసింహశాస్త్రి, కేశవపంతుల. చంద్రికా పరిణయము.