ఆర్.వి.ఎస్.పేరిశాస్త్రి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రుద్రభట్ల వెంకట సూర్య పేరిశాస్త్రి
8 వ భారత ప్రధాన ఎన్నికల కమిషనరు
In office
1986 జనవరి 1 – 25 November 1990
అంతకు ముందు వారుఆర్.కె.త్రివేది
తరువాత వారువి.ఎస్.రమాదేవి
వ్యక్తిగత వివరాలు
జాతీయత Indian

రుద్రభట్ల వెంకట సూర్య పేరిశాస్త్రి భారతదేశ 8 వ ప్రధాన ఎన్నికల కమిషనరుగా పనిచేసాడు. ఆయన హయాంలోనే 1989 సాధారణ ఎన్నికలు జరిగాయి. 1986 జనవరి 1 నుండి 1990 నవంబరు 25 న క్యాన్సర్‌తో మరణించే వరకు ఆ పదవిలో ఉన్నాడు.[1]

పేరిశాస్త్రి 1929 ఫిబ్రవరి 1న ఆంధ్రప్రదేశ్‌లోని భీమునిపట్నంలో జన్మించాడు. మద్రాసు విశ్వవిద్యాలయం పరిధిలోని మద్రాసు క్రిస్టియన్ కళాశాల నుండి ఆంగ్లంలో మాస్టర్స్ డిగ్రీని పొందాడు. ఆ తర్వాత, అనంతపురం, మధ్యప్రదేశ్‌లోని రాయ్‌పూర్‌లలో ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. ఢిల్లీ యూనివర్శిటీలోని ఫ్యాకల్టీ ఆఫ్ లాలో బిసిఎల్, ఎల్‌ఎల్‌ఎమ్ చేసాడు. అక్కడి విశ్వవిద్యాలయంలో కూడా బోధించాడు. 1956-57లో, అతను లా కమిషన్ ఆఫ్ ఇండియాలో జూనియర్ లా ఆఫీసర్‌గా చేరాడు. ఆ తర్వాత భారత ప్రభుత్వ న్యాయ మంత్రిత్వ శాఖకు మారి అక్కడ వివిధ పదవులను నిర్వహించాడు. 1978లో భారత ప్రభుత్వ కార్యదర్శి పదవికి ఎదిగాడు. పేరిశాస్త్రి అనేక సంవత్సరాలు భారత ప్రభుత్వానికి ప్రధాన శాసన ముసాయిదాదారుగా ఉన్నాడు. అతను భారత రాజ్యాంగానికి అనేక సవరణలు, 1950 నాటి రోడ్ కార్పొరేషన్స్ ఆఫ్ ఇండియా చట్టం,[2] ది షుగర్ డెవలప్‌మెంట్ ఫండ్ యాక్ట్ 1982, ఢిల్లీ సేల్స్ టాక్స్ యాక్ట్ 1975తో సహా అనేక ముఖ్యమైన బిల్లులను రూపొందించాడు.

పేరిశాస్త్రి ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా ఉన్న సమయంలో, భారత ప్రభుత్వం 1989 సాధారణ ఎన్నికల సందర్భంగా ఇద్దరు ఎన్నికల కమిషనర్‌లను నియమించడం ద్వారా కమిషన్‌ను బహుళ సభ్యుల సంఘంగా మార్చడానికి మొదటి ప్రయత్నం చేసింది. ఎన్నికలు నిర్వహించే సమయం పైన, నిర్వహించే విధానం పైనా ప్రభుత్వం తెచ్చిన వత్తిడిని వ్యతిరేకించిన కారణంగా పేరిశాస్త్రి అధికారాలను తగ్గించే ప్రయత్నమే ఈ చర్య అని మాజీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అయిన CG సోమియా తన పుస్తకం ది హానెస్ట్ ఆల్వేస్ స్టాండ్‌లో రాసాడు. విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రభుత్వంలో దినేష్ గోస్వామి న్యాయ మంత్రిగా ఉన్న సమయంలో, పేరిశాస్త్రి విస్తృతమైన ఎన్నికల సంస్కరణలను సిఫార్సు చేశాడు. ఆయన ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా ఉన్న సమయంలో ఓటింగ్ వయస్సును 18 ఏళ్లకు తగ్గించారు. అలాగే, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల వినియోగంపై తొలి అడుగులు కూడా ఆయన హయాంలోనే పడ్డాయి.

మూలాలు[మార్చు]

  1. "The Indian Express - Google News Archive Search". news.google.com. Retrieved 2024-05-08.
  2. The Road Corporations of India Act, 1950.