సుబ్రహ్మణ్య షష్ఠి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Murugan by Raja Ravi Varma.jpg
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి

సుబ్రహ్మణ్య షష్ఠి లేదా సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి దీపావళి పండుగ తర్వాత జరిగే ఉత్సవం. దీనినే సుబ్బరాయషష్ఠి అని, స్కందషష్ఠి అని కూడా అంటారు. సుబ్రహ్మణ్యేశ్వరుడు జన్మించిన రోజును ఈ పండుగగా జరుపుకుంటాము. ముఖ్యముగా తమిళనాడు లోను, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలు, కుమారస్వామివార్ల దేవాలయాలు కల ప్రతి చోటా ఈ రోజు విశేష పూజలు జరుపుతారు. ఆలయ సమీపంలో తిరునాళ్ళు వినోద కార్యక్రమాలు జరుపుతారు.

సుబ్రహ్మణ్యస్వామి విశేషాలు[మార్చు]

జన జీవనంలో పలు రకాలుగా ప్రచారంలో ఉండి భక్తుల పాలిట కల్పవల్లిగా ఈ పర్వదినం అలరారుతుంది. తెలుగునాట ఈ పండుగ వల్లనే సుబ్బమ్మ, సుబ్బారాయుడు, సుబ్బి, సుబ్బారావు, సుబ్రహ్మణ్యం, బాల సుబ్రహ్మణ్యం లాంటి పేర్లు విస్తృతంగా పెట్టుకోవటం జరుగుతోంది. శివుడి రెండో కుమారుడైన సుబ్రహ్మణ్యస్వామిని ఈనాడు ఆరాధిస్తారు. ఈ స్వామినే కార్తికేయుడు అని, స్కందుడు అని, షణ్ముఖుడు అని, గుహుడు, కుమారస్వామి అనే పేర్లతో కూడా పిలుస్తుంటారు. తారకాసుర సంహార నేపథ్యం ఈ కుమారస్వామి జననానికి సంబంధించిదే. మహా బలిష్టుడైన తారకాసురుడిని కుమారస్వామి జయించగలిగాడు కనుక జయాన్ని కోరి ముందుకు నడిచేవారు ఈ స్వామిని పూజించుకోవటం, తలచు కోవటం కన్పిస్తుంది. అతి సామాన్య ప్రజల నుంచి ఉన్నత కులీనుల దాకా సంతానం కోసం, శత్రు విజయాల కోసం ఈ స్వామిని మార్గశిర శుద్ధ షష్ఠినాడు ప్రత్యేకంగా పూజిస్తుంటారు. సంప్రదాయకంగా పాము మంత్రాలను సాధన చేసేవారు ఈ రోజున ఉపవాసం ఉండి ఆ మంత్రాన్ని మరింతగా జపిస్తుంటారు.

పండుగ విశేషాలు[మార్చు]

ఈనాడు ఉదయాన్నే స్నానం చేయటం, ఏ ఆహారమూ తీసుకోకుండా తడి బట్టలతో సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి వెళ్ళి పువ్వులు, పండ్లు, పడగల రూపాలలాంటివి అక్కడ అర్పిస్తుంటారు. ఇదంతా నాగపూజకు సంబంధించినదే. పురాణాలలో సుబ్రహ్మణ్యస్వామి వివాహితుడుగా కనిపిస్తాడు. వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యస్వామి కళ్యాణాలను అందుకే ఈ షష్ఠినాడు చేయటం కనిపిస్తుంది. "సుబ్బరాయుడి పెళ్లి చూచి వద్దాం రండి" అన్న పాట పిల్లలు ఈ సందర్భంగానే పాడేవారు.

అయితే కొంతమంది వివాహం కాకముందు బ్రహ్మచారిగా ఉన్న సుబ్రహ్మణ్యస్వామి మూర్తిని ఆరాధించే పద్ధతి కూడా ఉంది. ఆ పద్ధతిలో భాగంగానే ఈ రోజున బ్రహ్మచారికి (కొన్ని ప్రాంతాల్లో ముగ్గురు లేదా ఐదుగురు బ్రహ్మచారులకు) పూజ చేయటం, వస్త్రాలు సమర్పించి భోజనం పెట్టి గౌరవించటం జరుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో, షష్ఠి నాటి ఉపవాసం ఉండి మరుసటి సప్తమి నాడు బ్రహ్మచారి బ్రాహ్మణుడికి భోజనం పెట్టడం కూడా ఆనావయితీ.

తమిళ ప్రాంతాలలో ఈ రోజున కావడి మొక్కును తీర్చటం కనిపిస్తుంది. షష్ఠినాడు కుమారస్వామి ఆలయానికి కావడి మోసుకుని పోవటమే దీనిలోని ప్రధానాంశం. ఈ కావడిలో ఉండే కుండలను పంచదారతోనూ, పాలతోనూ నింపుతారు. కావడి పంచదారతోనూ, పాలతోనూ అనేది మొక్కును బట్టి ఉంటుంది. ఈ పండుగ బాగా ప్రసిద్ధికెక్కింది.

సుబ్రహ్మణ్య షష్ఠి వెళ్ళగానే వానలు కూడా వెనక్కు తగ్గుతాయని కొందరి నమ్మకం. అలా వానలో తగ్గాక చేసుకోవలసిన పనులను చేసుకోవటానికి అనువైన కాలంగా రైతులు దీన్ని భావిస్తారు. సుబ్రహ్మణ్య ప్రతిష్ఠ చేసిన వారికి సంతానం కలుగుతుందనే నమ్మకం ప్రజల్లో ప్రచారంలో ఉంది.

ఉపవాసం ఉండి సర్ప మంత్రాన్ని ఈ రోజున దీక్షగా చేస్తే మళ్ళీ సంవత్సరం వరకూ గొప్ప శక్తితో అది పనిచేస్తూ ఉంటుందని కూడా ఓ నమ్మకం ఉంది.

సుబ్రహ్మణ్య షష్ఠి వ్రతం వల్ల సామాజిక ప్రయోజనం ఏమిటి? అని అనేవారికి ఈ వ్రత విధిలోని దానాలే సమాధానం చెబుతుంటాయి. మార్గశిర మాసమంటే చలి పులిగా మారి పీక్కుతినే మాసం. ఈ మాసంలో చలి బాధను తోటివారు పడకుండా చూడమని సందేశం ఇస్తుంది. ఈ వ్రతం అందుకే ఉత్తరీయాలు, కంబళ్ళు, దుప్పట్లు లాంటివి వత్రంలో భాగంగా దానం చేయాలని పెద్దలు చెబుతుంటారు. మార్గశిర షష్ఠినాడే చంపా షష్ఠి, ప్రవార షష్ఠి లాంటి వ్రతాలను కూడా చెయ్యాలని వ్రత గంథాలు పేర్కొంటున్నాయి.

సుబ్బరాయుడు బాలుడైన బాల సుబ్రహ్మణ్యంగా పెద్దవాడైన సుబ్రహ్మణ్యంగా, స్కందుడుగా, షణ్ముఖుడుగా ఇలా అనేక రకాలుగా, అనేక రూపాలలో ఈ షష్ఠినాడు పుజలందుకోవటం జరుగుతుంది.

మూలాలు[మార్చు]

ఈనాడు దినపత్రిక - 10 జూలై 2008 సంచికలో డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు గారి వ్యాసము నుండి కొంత భాగము తీసుకొనబడింది.

పండుగలు - పరమార్థములు (రచయిత ఆండ్రశేషగిరిరావు), తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి