దసరా

వికీపీడియా నుండి
(దుర్గా పూజ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

దసరా హిందువుల ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగను నవరాత్రి, శరన్నవరాత్రి అని అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతిదేవికి తరువాతి మూడు రోజుల లక్ష్మీ దేవికి తరువాత మూడురోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు. ముఖ్యముగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు. బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. ఆలయాలలో అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో అలంకారం చేస్తారు. పదవరోజు పార్వేట ఉంటదసరా పండుగ విజయదశమి నాడు జరుపుకోవడం జరుగుతుంది. తెలుగు వారు దసరాని పది రోజులు జరుపుకుంటారు. ముందు నవరాత్రులు దుర్గ పూజ ఉంటుంది. తెలంగాణాలో ఈ తొమ్మిది రోజులు అమావాస్య నుంచి నవమి వరకు బతుకమ్మ ఆడుతారు. తెలంగాణా పల్లెల్లో ప్రతి అమావాస్యకి స్త్రీలు పట్టు పీతాంబరాలు ధరించడం ఆనవాయితీ. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణుని పై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టు పై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భమున రావణ వధ, జమ్మి ఆకుల పూజా చేయటం రివాజు. జగన్మాత అయిన దుర్గా దేవి, మహిషాసురుడనే రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి జయాన్ని పొందిన సందర్భమున 10వ రోజు ప్రజలంతా సంతోషముతో పండగ జరుపుకున్నారు, అదే విజయదశమి. దేవీ పూజ ప్రాధాన్యత ఈశాన్య భారతదేశములో హెచ్చుగా ఉంటుఆర్.యస్.యస్. సంస్థాగత స్థాయిలో వారు అధికారికంగా జరుపుకునే ఆరు పండుగలలో ఇది ఒకటి. ఇతర ఐదు పండుగలు హిందూ సామ్రాజ్య దినోత్సవం, మకర సంక్రాంతి, ఉగాది, గురుపూర్ణిమ, రక్షాబంధన్ మహోత్సవ్గా ఉన్నాయి.[1]

మహిషాసురమర్ధిని

కలకత్తా ఉత్సవాలలో ప్రతిష్ఠించిన మహిషాసుర మర్దిని దుర్గామాత విగ్రహం

దైత్యవంశానికి ఆశాదీపంలా జన్మించిన ‘మహిషాసురుడు’ తన ఆంతరంగిక మిత్రులతో, సచివులతో సమాలోచన చేసి, మరణంలేని జీవనం కోసం మేరుపర్వతశిఖరం చేరి బ్రహ్మదేవుని గూర్చి ఘోరతపస్సు ప్రారంభించాడు. కాలం కదలికలో అనేక వేల సంవత్సరాలు కదిలి వెళ్లిపోయాయి. మహిషాసురుని అచంచల తపస్సుకు సంతసించిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, ‘మహిషాసురా.., ఇంక తపస్సు చాలించి ఏ వరం కావాలో కోరుకో’ అన్నాడు.‘పితామహా.,నేను అమరుణ్ణి కావాలి. నాకు మరణం లేని జీవితాన్ని ప్రసాదించు’ అని కోరాడు మహిషాసురుడు. అప్పుడు బ్రహ్మదేవుడు ‘మహిషాసురా..పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు.., గిట్టిన ప్రాణి మరల పుట్టక తప్పదు. జననమరణాలు సకలప్రాణికోటికి సహజ ధర్మాలు. మహాసముద్రాలకూ, మహాపర్వతాలకూ కూడా ఏదో ఒక సమయంలో వినాశం తప్పదు. ప్రకృతివిరుద్ధమైన నీ కోరిక తీర్చుట అసంభవం. కనుక,నీ మరణానికి మృత్యువుకు ఒక మార్గం విడిచిపెట్టి, మరే వరమైనా కోరుకో’ అన్నాడు. అప్పుడు మహిషాసురుడు ‘విధాతా..అల్పమైన కోరికలకు ఈ మహిషాసురుడు ఆశపడడు. సరే.. ఆడది నా దృష్టిలో అబల..ఆమెవల్ల నాకే ప్రమాదమూ రాదు. కనుక.,పురుషుడి చేతిలో నాకు మరణం రాకుండా వరం అనుగ్రహించు’ అని కోరాడు. బ్రహ్మదేవుడు ఆ వరాన్ని మహిషాసురునికి అనుగ్రహించి అంతర్ధానమయ్యాడు. బ్రహ్మదేవుని వరాల వలన వరగర్వితుడైన మహిషాసురుడు దేవతల్తో ఘోరమైన యుద్ధము చేసి వారిని ఓడించి ఇంద్రపదవి చేపట్టాడు. దేవేంద్రుడు త్రిమూర్తులతో మొర పెట్టుకొనగా మహిషునిపై వారిలో రగిలిన క్రోధాగ్ని ప్రకాశవంతమైన తేజముగా మారింది. త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీరూపమై జన్మించింది.

శివుని తేజము ముఖముగా, విష్ణు తేజము బాహువులుగా, బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె 18 బాహువులను కలిగి ఉంది. ఆమెకు శివుడు శూలమును, విష్ణువు చక్రమును, ఇంద్రుడు వజ్రాయుధమును, వరుణ దేవుడు పాశము, బ్రహ్మదేవుడు అక్షమాల, కమండలము హిమవంతుడు సింహమును వాహనంగాను ఇచ్చారు. ఇలా సర్వదేవతల ఆయుధములు సమకూర్చుకొని మహిషాసురుని సైన్యంతో తలపడి భీకరమైన పోరు సల్పింది. మహిషాసురుని తరఫున పోరు సల్పుతున్న ఉదద్రుడు, మహాహనుడు, అసిలోముడు, బాష్కలుడు, బిడాలుడు మొదలైన వారిని సంహరించిన తరువాత మహిషాసురునితో తలపడినది. ఈ యుద్ధములో ఆదేవి వాహనమైన సింహమూ శత్రువులను చీల్చి చెండాడింది. దేవితో తలపడిన అసురుడు మహిషిరూపము, సింహరూపము, మానవరూపముతో భీకరముగా పోరి చివరకు తిరిగి మహిషిరూపములో దేవిచేతిలో హతుడైనాడు.ఈ విధంగా అప్పటి నుండి మహిషుని సంహరించిన దినము దసరా పర్వదినంగా ప్రజలచే కొనియబడింది.

ముఖ్య ఆచారాలు

ఈ రోజులలో వివిధ దేవుళ్ళ వేషధారణ చేసి ఇంటింటికి తిరిగి గృహస్తులు ఇచ్చినది పుచ్చుకోవడం కొందరు వృత్తిగా ఆచరిస్తారు. వీటికి దసరా వేషాలు లేదా పగటి వేషాలు అంటారు. ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులను వెంట పెట్టుకొని విద్యార్థుల అందరి ఇళ్ళకు వెళ్ళి మామూలు పుచ్చుకోవడం మామూలే. ఈ సమయంలో వెదురు కర్రతో చేసి రంగు కాగితాలతో అలంకరించిన బాణాలు విద్యార్థులు పట్టుకుని అయ్యవారి వెంట వస్తారు. విద్యార్థులు ఏదయా మీ దయా మామీద లేదు, ఇంత సేపుంచుటా ఇది మీకు తగునా .. అయ్యవారికి చాలు అయుదు వరహాలు, పిల్ల వాళ్ళకు చాలు పప్పు బెల్లాలు అంటూ రాగయుక్తంగా పాడుకుంటూ అయ్యవారి వెంట వస్తారు. గృహస్తులు అయ్యవారికి ధనరూపంలోనూ, పిల్ల వాళ్ళకు పప్పు బెల్లం రూపంలోనూ కానుకలు ఇస్తారు. సంవత్సర కాలంలో సేవలందించిన వారు గృహస్తును మామూళ్ళు అడగటం వారు కొంత ఇచ్చుకోవడమూ అలవాటే. దీనిని దసరా మామూలు అంటారు. కొత్తగా వివాహం జరిగిన ఆడపడచుని భర్తతో సహా ఇంటికి ఆహ్వానించి అల్లుడికీ కూతురికీ తలంటి తలకు పోసి నూతనవస్త్రాలు కానుకలు ఇచ్చి సత్కరించడం కూడా అలవాటే.

వివిధ ప్రదేశాలలో దసరా

దసరా ఉత్సవాలను దేశమంతా వివిధ రూపాలలో జరపుకుంటారు. మైసూరు, కలకత్తా, ఒడిషా, తెలంగాణా, విజయవాడ, ఖానాపూర్లలో ఒక్కో చోట ఒక్కో విధంగా జరుపుకుంటారు. ఇవే కాక ఊరి ఊరికీ కొన్ని ప్రత్యేక ఉత్సవాలు జరుపుకుంటారు. ఖానాపూర్, ఒంగోలులో కళారాలు రూపంలో అమ్మవారిని ఆరాధించి చివరి రోజున ఉత్సవంగా అమ్మవారు వెళ్ళి రాక్షససంహారం చేసే ఘట్టాన్ని ప్రదర్శిస్తారు.

మైసూరు

మైసూరు దసరా ఉత్సవాలలో ఏనుగుల ఊరేగింపు

మైసూరు మహారాజు పాలన కాలం నుండి వైభవంగా దసరా ఉత్సవాలను జరపటం ఆనవాయితీ. మహారాజు వారి కులదైవం అయిన చాముండేశ్వరీ దేవిని ఆరాధించి ఏనుగులపై ఊరేగింపుగా రావడం అలవాటు. ఆ సమయంలో వీధులలో కోలాహలంగా చేసే అనేక కళా ప్రదర్శనలు చూడటానికి దేశం నలుమూలల నుండి ప్రజలు వస్తుంటారు. ఆ సమయంలో రాజభవనం ప్రత్యేకంగా అలంకరించ బడుతుంది. ఆ సమయంలో ఫ్లోటింగ్ కారు (floating car) ఉత్సవాలు ప్రాధాన్యత సంతరించుకున్నవే. ఏనుగుల అలంకరణా ప్రత్యేకమే. రాజుగారి ఆయుధ పూజ వైభవంగా జరుగుతుంది.

కలకత్తా

దసరాను దుర్గాపూజ పర్వదినంగా బెంగాలీయులు జరుపుకుంటారు. సప్తమి, అష్టమి, నవమి తిథులలో దుర్గామాతకు పూజ చేసి తొమ్మిదవ రోజున కాళికామాతను దర్శిస్తారు. ఆ రోజు కాళీమాతను లక్షలమందిని దర్శించడం విశేషం. తొమ్మిది రోజులూ రాష్ట్రమంతా హరికథలు, పురాణ శ్రవణం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. చివరి రోజున దుర్గామాతను హుగ్లీ నదిలో నిమజ్జనం చేస్తారు. ఆరోజున నదీతీరంలో కుమారీ పూజలు చేయడం బెంగాలీల ప్రత్యేకత.

ఒడిషా

ఒడిషా పౌరులు దసరా సమయంలో దుర్గామాతను ఆరాధిస్తారు. కటక్ కళాకారులు రూపొందించిన దుర్గామాత విగ్రహాలను వీధివీధిలో ప్రతిష్ఠిస్తారు. స్త్రీలు మానికలో వడ్లు నింపి లక్ష్మీ దేవిగా భావించి పూజలు నిర్వహిస్తారు. మార్గశిర మాసంలో కూడా ఈ చిహ్నంతో వారు లక్ష్మీదేవి ఆరాధించడం సంప్రదాయం. దీనిని వారు మాన బాన అంటారు. ఒడిషా ప్రజలు విజయదశమి నాడు విజయదుర్గను ఆరాధిస్తే అన్నిటా విజయం సిద్ధిస్తుందని ప్రజల ప్రగాఢ విశ్వాసం. చివరి రోజున 15 అడుగుల రావణ విగ్రహాన్ని బాణసంచాతో తయారు చేసి మైదానంలో కాలుస్తారు. ఈ రావణ కాష్టం చూడటానికి ప్రజల తండోపతండాలుగా వస్తారు.

తెలంగాణా బతుకమ్మ

బతుకమ్మ ఆట

తెలంగాణా ప్రజలు దసరా సమయంలో బతుకమ్మ ఉత్సవాలు చేస్తారు. బతుకమ్మ పండుగ' తెలంగాణా రాష్ట్రములో ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. ఈ బతుకమ్మ (గౌరి) పండగ లేదా సద్దుల పండుగ దసరాకి రెండు రోజుల ముందు వస్తుంది. నవరాత్రి మొదట రోజున బతుకమ్మను పూలతో అలంకరించి తొమ్మిది రోజులు ఒక చోట స్త్రీలంతా చేరి ఆటపాటలు పాడి ఆనందిస్తారు. చివరి రోజున బతుకమ్మను నిమజ్జనం చేసిన తరువాత పండుగ చేసుకుంటారు. ఇది తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమయిన పండుగ. ఈ రోజుల్లో ఆడపడుచులు అందరూ అత్తవారింటి నుంచి కన్నవారింటికి చేరుకుంటారు. ఈ వారం రోజులలో వీరు రోజూ చిన్న బతుకమ్మలు చేసి, ప్రతీ సాయంత్రం దాని చుట్టూ తిరుగుతూ ఆడుతారు. ఆ తరువాత దగ్గరలో ఉన్న జలాలలో నిమజ్జనం చేస్తారు.

అయితే చివరి రోజు అత్యంత మనోహరంగా ఉంటుంది. ఆ రోజు మగవారంతా పచ్చిక బయళ్ళలోనికి పోయి తంగేడి, గునుక పూలను భారీగా ఏరుకుని వస్తారు. ఆ తరువాత ఇంటిల్లపాదీ కూర్చుని ఆ గునగ పూలు, తంగేడు, కలువ, ఇతర రకాల పూలతో బతుకమ్మని తయారు చేస్తారు. ఇందులో గునగ పూలు, తంగేడు పూలు ముఖ్య భూమికను పోషిస్తాయి. ఈ పూలని జాగ్రత్తగా ఒక రాగి పళ్ళెం (తాంబలం) లో వలయాకారంగా, రంగులు మార్చుకుంటూ పేరుస్తారు. ముందుగా తంగేడు ఆకులు, పూలు పళ్లెంలో లేదా తాంబోలంలో పేర్చుతారు, ఆపై తంగేడు పూలతో కట్టలుగా కట్టిన కట్టలను చివరలు కోసి రంగులతో అద్దిన వాటిని పేర్చుతారు. మధ్య మధ్యలో ఇతర రకాల పూలను ఉపయోగిస్తారు. పేర్చడం అయ్యాక పైన పసుపుతో చేసిన గౌరి మాతను పెట్టి చుట్టు దీపాలతో అలంకరిస్తారు. దీనిని గృహంలో దైవ స్థానంలో అమర్చి పూజిస్తారు. ఇలా తయారు చేసిన బతకమ్మల చుట్టూ తిరుగుతూ పాటలతో గౌరి దేవిని కీర్తిస్తూ ఆడవారు పాడుతారు. ఆడవారు వారికి ఉన్న అన్ని రకాల ఆభరణాలను ధరించి కొత్త బట్టలు కట్టుకుంటారు. ఇలా చాలాసేపు ఆడాక మగవారు వాటిని చెరువులో నిమజ్జనం చేస్తారు. ఆపై ఆ పళ్లెంలో తెచ్చిన నీటితో ఆడవారు వాయినమమ్మా వాయినం అంటూ వాయినాలు ఇచ్చి పుచ్చుకుంటారు. ఆపై ఇంటి నుండి తీసుకువచ్చిన పెరుగన్నం, సత్తుపిండి ( మొక్కజొన్నలు, లేదా వేరుశనగ లేదా పెసర విత్తనాలను దోరగ వేయించి వాటిని పిండి చేసి వాటితో చక్కెర పిండి లేదా బెల్లం, నెయ్యి తగినంత కలిపి తయారు చేస్తారు) లను ఇచ్చి పుచ్చుకొని తింటారు

కరీంనగర్

దసరా సమయంలో కరీంనగర్ వాసులు అకాడా"గా నిర్వహిస్తారు. ఇక్కడ గనిలో పనిచేసే కార్మికులు ఈ పండుగను గ్రామీణ వాతావరణం ఉట్టిపడేలా చేసుకుంటారు. క్షత్రియుల ఆయుధ విన్యాసాలు పోలిన విన్యాసాలను ప్రదర్శించడం ఇక్కడి సంప్రదాయం. ఇక్కడి నెహ్రూ స్టేడియంలో నరకాసుర వధ ఘట్టాన్ని ప్రదర్శించడంతో పండుగ మొదలౌతుంది. హనుమాన్ అకాడా, దుర్గా అకాడా' ల లాంటి దేవతల రూపాలతో ఇనుప బెల్టు, త్రిశూలం మొదలైన ఆయుధాలను పట్టుకొని విన్యాసాలు చేస్తూ ఊరంతా తిరుగుతూ ప్రజలను ఆనందింప చేస్తారు. కర్రసాము ఈ ప్రదర్శనలో భాగమే. జమ్మి ఆకులను ఒకరికొకరు ఇచ్చి శుభాకాంక్షలు చెప్పుకుంటారు. కనుల విందుగ దుర్గమాత (వమస్థలిపురము) ]]

గుజరాత్

దసరా సమయంలో గుజరాతీయులు పార్వతిదేవి ఆరాధన చేస్తారు. ఇంటింటా శక్తి పూజ చేయడం గుజరాతీయుల ఆచారం.ఇంటి గోడల మీద శ్రీ చక్రాన్ని, త్రిశూలాన్ని, శక్తి ఆయుధాన్ని పసుపుతో చిత్రించి పూజిస్తారు.ఆ గుర్తుల సమీపంలో పొలం నుండి తీసుకు వచ్చిన మట్టితో వేదిక తయారు చేసి దానిపై బార్లీ, గోధుమ విత్తనాలను చల్లి, దానిపై మట్టి ఉండ పెట్టి, దానిని నీటితో నింపి, పోకచెక్క వెండి లేక రాగి నాణెం వేస్తారు. ఆ మట్టికుండను వారు దేవిగా భావిస్తారు. దానిని వారు కుంభీ ప్రతిష్ట అంటారు. అష్టమి రోజున యజ్ఞం నిర్వహించి దశమి రోజున నిమజ్జనం చేస్తారు. అమ్మవారి వద్ద పెట్టిన ప్రమిదను గుడిలో సమర్పిసారు. తరువాత పౌర్ణమి వరకూ జరిగే గర్భా అనే ఉత్సవాలలో స్త్రీలు ఉత్సాహంగా పాల్గొంటారు.

విజయవాడ భేతాళ నృత్యం

విజయవాడలోని ప్రధాన ఆలయాలలో బెజవాడ కనక దుర్గమ్మ ఒకటి. ఇది ఆంధ్ర రాష్ట్రం అంతటా ప్రాముఖ్యం ఉన్న ఆలయం. నవరాత్రి తొమ్మిది రోజులు వైభవంగా ఉత్సవాలు నిర్వహించి విజయదశమి నాటికి కృష్ణా నదిలో తెప్పోత్సవం చేస్తారు. ఈ ఉత్సవంలో అమ్మవారు తెప్పపై మూడు సార్లు ఊరేగి భక్తులకు దర్శనమిస్తుంది. తర్వాత విజయవాడ నగర పోలీసులు అమ్మవారిని పాతబస్తీలో ఉరేగిస్తారు. 1వ టౌన్ పోలీసు స్టేషను వద్దకు రావడంతో ఊరేగింపు ముగిస్తుంది. దసరా సందర్భంలో చివరి రోజు ప్రభలు ఊరేగింపుగా వస్తాయి. ఈ ప్రభలలో భేతాళ నృత్యం ప్రదర్శిస్తారు. ఈ భేతాళ నృత్య ప్రదర్శన విజయవాడ ప్రత్యేకత.

వీరవాసరం ఏనుగుల సంరంభం

పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో దసరా సమయంలో సుమారు వంద సంవత్సరాల నుండి ఏనుగు సంబరాలు జరపడం ఆచారం. దసరా మొదటి రోజున ఏనుగుగుడి లో భేతాళుడిని నిలబెడతారు. భేతాళుడంటే వయసైన బ్రహ్మచారి. తొమ్మిది రోజులు భేతాళుడు అమ్మవారి పూజలు నిర్వహిస్తాడు. ఈ తొమ్మిది రోజులు భేతాళుడు నియమ నిష్ఠలను ఆచరిస్తాడు. మొదటి రోజునుండి నూరు సంవత్సరాల క్రితం వెదురు కర్రలు గడ్డి కొబ్బరిపీచుతో చేసిన ఏనుగును నూతనంగా అంబారీతో అలంకరిస్తారు. తెల్లని వస్త్రానికి రంగుల లతలు, కాగితంపూలు, తగరంతో అలంకరణలు చేసి అంబారీ చేస్తారు. అలాగే నూతనంగా చిన్న ఏనుగును తయారు చేసి అలంకరించి చివరి రోజున బోయీలచే ఊరేగింపుగా తీసుకు వెళతారు. ఈ ఊరేగింపులో పిల్లలను ఏనుగు కింద నుండి దాటిస్తారు. అలాదాటిస్తే పిల్లలు రోగ విముక్తులై ఆరోగ్యంగా ఉంటారని విశ్వసిస్తారు. రాత్రి ఆరు గంటలకు ప్రారంభించి తెల్లవారి ఆరుగంటల వరకూ సాగి తూపు చెరువు కట్టకు చేరుకొని ఈ ఉత్సవాన్ని ముగిస్తారు.

విజయనగరం సిరిమాను

విజయనగరంలో దసరా సమయంలో గజపతుల ఆడపడుచైన పైడి తల్లి'కి పూజలు చేస్తారు'. ఈ దేవికి దసరా వెళ్ళిన తరువాత మొదటి మంగళవారం నాడు జాతర జరుపుతారు. ఈ ఉత్సవంలో భాగంగా పూజారిని సిరిమాను ఎక్కించి అమ్మవారి గుడి ఉన్న మూడు లాంతర్ల సెంటర్ నుండి కోట వరకు మూడు సార్లు ఊరేగిస్తారు. ఈ ఉత్సవం చూసేందుకు చుట్టు పక్కల పల్లెలనుండి ప్రజలు ఎడ్లబండిలో మూడురోజుల ముందుగా వచ్చి రోడ్డు ప్రక్కన గుడారాలు వేసుకుని ఉత్సవం చూసి ఆనందిస్తారు. అడవిలో నుండి ఒక నిటారైన చెట్టును నరికి తీసుకు వచ్చీ మొదలు భాగాన్ని లాగుడు బండికి కట్టి చివరి భాగంలో ఊయలకట్టి అందులో పూజారిని కూర్చో పెట్టి ఊరేగింపుగా కోటకు తీసుకు వస్తారు . అక్కడ గజపతులు అమ్మవారికి లాంఛనాలు ఇచ్చి పూజిస్తారు.

వీపన గండ్లలో రాళ్ళయుద్దం

కర్నూలు జిల్లాలోని వీపనగండ్లలో దసరాసమయంలో రాళ్ళయుద్ధం చేసుకుంటారు. దసరా రోజున సాయం వేళలో ప్రజలు కాలువ ఒడ్డున కాలువకు అటూఇటూ చేర కంకర రాళ్ళను గుట్టగా పోసుకుని ఒకవైపు రామసేన ఒకవైపు రావణ సేనగా ఊహించి రాళ్ళను విసురుతూ యుద్ధం చేసుకుంటారు. ఇది అధర్మంపై ధర్మం యుద్దంచే విజయం చేసినట్లు భావిస్తారు. దీనిని వాళ్ళు వాళ్ళు రామ రావణ యుద్ధంగా అభివర్ణిస్తారు. ఎంత ఎక్కువగా దెబ్బలు జరిగితే అంత ఎక్కుగా ఉత్సవం జరిగినట్లు విశ్వసిస్తారు. ఇదే సమయంలో ఇదే జిల్లాలోని దేవరగట్టు గ్రామంలో కూడా బన్ని ఉత్సవం జరుగుతుంది. మాలమల్లేశ్వరస్వామి విగ్రహాన్ని తమ గ్రామానికి తీసుకువెళ్లేందుకు దాదాపు 18 గ్రామాల ప్రజలు, దేవరగట్టు నెలవై ఉన్న రెండుగ్రామాల పరిధిలోని ప్రజలతో కొట్లాడతారు. స్వామిని తీసుకువెళ్లేందుకు ఓ వర్గం, తమ గ్రామంలోనే ఉండేలా చూసుకునేందుకు మరో వర్గం ఎదురుపడి ఇనుప తొడుగులు తొడిగిన వెదురుకర్రలతో విపరీతంగా కొట్టుకుంటారు. ఎంత గాయాలైనా పట్టించుకోరు. అనాదిగా జరుగుతున్న ఈ రక్తపాతానికి అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు, ప్రభుత్వం ఎంతగా ప్రయత్నించినా సఫలం కాలేకపోతున్నారు.

సంగారెడ్డిలో రావణ దహనం

మెదక్ జిల్లా సంగారెడ్డిలో దసరా సందర్భంలో తొమ్మిది రోజులు దేవిని ఆరాధించి చివరి రోజున రావణ కుంభకర్ణ బొమ్మలను దగ్ధం చేస్తారు. ఈ బొమ్మలను వారు బాణసంచాతో తయారు చేసి అగ్ని బాణాలతో దగ్ధం చేస్తారు. రామ లక్ష్మణ వేషదధారులు బాణాలను సంధిస్తారు. ఈ ఉత్సవం మునిసిపల్ గ్రౌండులో నిర్వహిస్తారు. చుట్టుపక్కల గ్రామాల నుండి వేలకొలది భక్తులు హాజరై ఉత్సవానికి వన్నె తీసుకు వస్తారు.

బందరు శక్తి పటాలు

కృష్ణా జిల్లాలో ఉన్న రేవుపట్టణం బందరులో దసరా సందర్భంలో శక్తి పటాల ఊరేగింపు నిర్వహిస్తారు. దాదాపు నూరు సంవత్సరాల క్రితం కలకత్తా నుండి బొందిలీలకు చెందిన సైనికుడు మచిలీపట్నం ఈడేపల్లిలో కాళీమాత ప్రతిష్ట చేసాడు. అప్పటి నుండి దసరా సమయంలో శక్తి ఆలయం నుండి శక్తి పటాన్ని పట్టుకుని పురవీధులలో ఊరేగింపుగా తీకుసుకు రావడం ప్రారంభం అయింది. ఊరేగింపు సమయంలో పట్టాన్ని వీపుకు కట్టుకుని ముఖానికి అమ్మవారి భయంకర ముఖాకృతిని తగిలించుకుని నాట్యమాడుతూ వీధులలో తిరుగుతారు. తొమ్మిది రోజులు ప్రభలలో ఇలా ఆన్ని వీధులలోని ఇంటింటికీ తిరుగుతారు. వారి వారి ఇంటికి వచ్చినపుడు వారి మొక్కుబడులు తీర్చుకుంటారు. పటం ధరించిన వారు డప్పు శబ్ధానికి అనుగుణంగా వీరనృత్యం చేస్తూ భయంకరాకృతిలో ఉన్న రాక్షసుని సంహరిస్తున్నట్లు అభినయిస్తారు. చివరిరోజున మచిలీపట్నం కోనేరు సెంటరుకు తీసుకు వచ్చి జమ్మి కొట్టడంతో ఉత్సవం ముగుస్తుంది.

ఒంగోలు కళారాలు

దసరా సమయంలో ప్రకాశం జిల్లా ఒంగోలులో ఉత్సవాలలో భాగంగా కళారాలను ఊరేగిస్తారు. ఈ కళారాలను దసరా సమయానికి చక్కగా అలంకరించి సిద్ధం చేస్తారు. కళారాలంటే బృహత్తర ముఖాకృతి. ఇక్కడ కాళికాదేవికి, మహిషాసుర మర్ధినికి, నరసింహ స్వామికి కళారాలున్నాయి. వీటికి ఈ తొమ్మిది రోజులు విశేషంగా పూజలు చేసి తొమ్మిది పది రోజులలో ఒక్కోరోజు కొన్ని కళారాలకు ఊరేగింపు చేస్తారు. కళారాన్ని బండి మీద ఎక్కించి ఆటూఇటూ పట్టుకోవడానికి అనివిగా కొయ్యలను అమర్చి వాటి సాయంతో కళారాన్ని అటూ ఇటూ ఊపుతూ డప్పుల మోతలతో ఊరేగింపు నిర్వహిస్తారు. కళారం వెనుక భాగంలో ఒకరు అమ్మవారి ప్రతి రూపంగా చీరను ధరించి వీరనృత్యం చేస్తూ కళారాన్ని ఊగ్రంగా ఊపుతూ ఉంటాడు. ఉగ్రరూపంలో ఉన్న కళారం భీతిని కలిగిస్తుందని గర్భిణీ స్త్రీలకు ఈ ఉత్సవ దర్శనం మంచిది కాదని పెద్దలు సూచిస్తారు. ఇలా కళారాన్ని ఊరి నడిమధ్యకు తీసుకు వచ్చి అక్కడ రాక్షస సంహారం ఘట్టాన్ని ప్రదర్శిస్తారు రవిందర్

ఉస్మానియ విశ్వవిద్యాలయం

ఇక్కడ దసర రోజు మహిషాసురుని వర్దంతిని దళిత-బహుజనులు ఘనంగా జరుపుతారు. మూలవాసులను చంపిన ఆర్యుల కుట్రలను బయటి ప్రపంచానికి తెలియజెస్తారు. దుర్గాదేవి, రాముడు, కృష్ణుడు అసురులను వధించి వారిని రాక్షసులుగా చిత్రీకరించారు. మూలవాసుల చరిత్ర ఎల వక్రికరించబడ్డది. దానికి బ్రాహ్మణీయ సమాజం రచయితలు చేసిన కుట్రలు ఏమిటి అనే అంశాలపై వక్తలు మాట్లాడుతారు. ముగ్గురు దేవుళ్ళు కలసి ఒక వ్యక్తిని ఎదుర్కొన లేక ఒక స్త్రీ సహాయముతో వంచనతో, మోసంతో, కుట్రతో మహిషాసురుని అంతమొందిచ్చారని దళితులు, శూద్రులు నమ్ముతున్నారు. అయ్యవార్ల అడుక్కోవడానికి, చందాలకు, దందాలకు, ఆడపిల్లల తల్లిదండ్రులను అల్లుళ్ళు వేధించడం వంటి సామాజిక రుగ్మతలకు విజయదశమి వేదిక కావడాన్ని మేధావులు, హేతువాదులు ప్రశ్నిస్తున్నారు. మానవతా వాదులు అసహ్యించుకొంటున్నారు.

నవరాత్రులు

ఆశ్వయుజ శుక్ల పాడ్యమి మొదలుకొని నవమి వఱకు కల తొమ్మిది రాత్రులను నవరాత్రులు అయిన వ్యవహరిస్తారు. కృతయుగమున సుకేతనుడు అనే రాజు తన జ్ఞాతులచే రాజ్యభ్రష్టుడై భార్యతో కూడా అడవులు తిరుగుచు కష్టాలను అనుభవించుచుండగా అంగీరసుడు అనే ఋషి అతనికి నవరాత్రి పూజావిధులను ఉపదేశించాడు. అతడు మహర్షి చెప్పిన విధంగా పూజ చేసి మరల తన ఐశ్వర్యమును పొందెనని ఐతిహాసిక కథ ఉంది. ఈ కథను బట్టి ప్రజలు దుర్గ, లక్ష్మి, సరస్వతి వీరిలో ఒక్కొక్కదేవిని మూడేసి దినములు పూజింతురు. ఈ తొమ్మిది రాత్రులయందును ఆ దేవతలను పూజించుటకు వీలుకానిచో చివరి రోజైన నవమి నాడు విద్యాపీఠమున పుస్తకములను పెట్టి దేవీత్రయమును కల్పవిధిప్రకారము పూజింతురు. అట్లు పూజించుటచే ఆ దినము మహానవమి అనియు, సరస్వతీదేవిని పూజించుటచే సరస్వతి పూజాదినము అని, ఆయుధములను పెట్టి పూజించుటచే ఆయుధపూజాదినము అనియు చెప్పబడును. మఱునాటి దశమి తిథికి విజయదశమి అని పేరు.

నవరాత్రి ఉత్సవాలలో, ఆలయాలలో పార్వతీదేవికి రోజుకు ఒక అలంకరణ చేస్తారు. ఇలా ఒక్కోప్రాంతంలో ఒక్కోలా నామాలు ఉంటాయి. కొన్ని ప్రాంతాలలో మొదటి రోజు శైల పుత్రి, రెండవ రోజున బ్రహ్మచారిణి, మూడవ నాడు చంద్రఘంటాదేవి, నాల్గవ రోజున కూష్మాండాదేవి, అయిదవ రోజున స్కంధమాత, ఆరవ రోజున కాత్యాయినీ, ఏడవరోజున కాళరాత్రి, ఎనిమిదవ రోజున మహాగౌరి, తొమ్మిదవ రోజున సిద్ధిధాత్రిదేవిగా పూజిస్తారు. కొన్ని ప్రదేశాలలో పార్వతీ దేవిని కనకదుర్గగా, మహాలక్ష్మిగా, అన్నపూర్ణగా, గాయత్రిగా, బాలాత్రిపురసుందరిగా, రాజరాజేశ్వరిగా, మహిషాసుర మర్ధినిగా ఆరాధిస్తారు.

దసరా సందర్భంగా .... వనస్థలిపురంలో దుర్గా మాతా ముందు చేస్తున్న యాగం.

దసరాలో ఎన్ని పండుగలు ఉన్నాయి

స్వాతంత్ర్య సాధనలో

1757లో జరిగిన ప్లాసీ యుద్ధంలో రాబర్ట్‌ క్లైవ్‌ సారథ్యంలోని ఈస్టిండియా కంపెనీ సేన బెంగాల్‌ నవాబు సిరాజుద్దౌలాను ఓడించి బెంగాల్‌పై పట్టు సంపాదించింది. భారత్‌లో తొలి విజయానికి ప్రతీకగా దుర్గామాతకు పూజచేసి విజయోత్సవం జరుపుకున్న ఈ ఉత్సవాలు క్రమంగా జాతీయోద్యమానికి ఊతమయ్యాయి. అంతకుముందు ఇళ్లకే పరిమితమైన ఈ దసరా నవరాత్రులు క్రమంగా సామాజిక రూపం దాల్చటం కీలక పరిణామం. ఈస్టిండియా రాకతో బెంగాల్‌లో కీలకభూమిక పోషించిన జమీందార్లు, సంపన్నులు తమ ఆధిపత్యాన్ని, ప్రభుత్వంలో పట్టును, దర్పాన్ని చాటడానికి ఈ ఉత్సవాలను వేదికలుగా చేసుకున్నారు. తమ అధికారానికి కూడా ఈ ఉత్సవాలు దోహదం చేస్తుండటంతో ఈస్టిండియా కంపెనీ అధికారులూ ప్రోత్సహించారు. గవర్నర్‌ జనరల్‌ లార్డ్‌ వెస్లీ కాళీమాతకు గౌరవ ప్రదంగా తొమ్మిది తుపాకుల శాల్యూట్‌ను ప్రవేశపెట్టారు. అలా జమీందార్ల పర్యవేక్షణలో సాగిన దుర్గా పూజ జాతీయోద్యమం ప్రభావంతో సామాన్య ప్రజల ఉద్యమంగా మారింది. 1919లో జమీందార్లకు సంబంధం లేకుండా సామాన్య ప్రజానీకం దుర్గాపూజ నిర్వహించింది. దీన్ని బరోయారి (12 మందితో చేసిన) పూజ అంటారు. బాగ్‌బజార్‌లో సర్వజనపూజ మొదలైంది. వీటిలో క్రమంగా జాతీయోద్యమ నాయకులు, విప్లవనాయకులు కూడా ప్రవేశించారు. 1930లో కోల్‌కతా మేయర్‌గా ఉన్న నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ సర్వజన పూజను ముందుండి నడిపించారు. జాతీయోద్యమ ప్రచారానికి, స్వదేశీ వస్తువుల ప్రోత్సాహానికి ఈ ఉత్సవాలు వేదికగా మారాయి.

మూలాలు

  1. "June 4- Hindu Samrajya Diwas or Hindu Empire Day". Janam TV National (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-06-04. Archived from the original on 2020-09-20. Retrieved 2020-08-02.

బాహ్య లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=దసరా&oldid=3627581" నుండి వెలికితీశారు