పంచతంత్రం

వికీపీడియా నుండి

ప్రపంచ సాహిత్యానికి భారత దేశం అందించిన గొప్ప రచనలలో ఎన్నదగినది పంచతంత్రం . క్రీ. శ. 5 వ శతాబ్దంలో విష్ణుశర్మ అనే గురువర్యుడు సంస్కృత భాషలో రచించిన ఈ గ్రంధం ఎన్నో ప్రపంచ భాషలలోకి అనువదింపబడి, ఎంతో ప్రాచుర్యం పొందింది. తన వద్ద నేర్చుకోదలచిన విద్యార్ధులకు పాఠ్యగ్రంధంగా ఈ పుస్తకాన్ని ఆయన రచించాడు. ఐదు భాగాలుగా విభజించిన ఈ పుస్తకం అనేక చిన్నచిన్న కథల సమాహారం. మానవ జీవితంలో అవసరమైన ఎన్నో ధర్మాలను, నీతి సూత్రాలను చక్కటి కథల రూపంలో, ఆసక్తికరమైన కథనంతో విష్ణుశర్మ బోధించాడు. (మొయిద్ సిద్దికి అనే రచయిత తన "కార్పొరేట్ సోల్" పుస్తకంలో విష్ణుశర్మ, ఆర్య చాణక్యుడు ఒక్కరే అని రాశాడు.)

విషయ సూచిక

[<small>మార్చు</small>] నేపథ్యం

దక్షిణ భారతాన మిహిలారోప్యము అనే రాజ్యానికి అమరశక్తి రాజు. ఆతనికి బహుశక్తి, ఉగ్రశక్తి, అనంతశక్తి అని ముగ్గురు కొడుకులు. ఆ ముగ్గురు చదువుసంధ్యలు లేక మూర్ఖుల వలె తయారయ్యారు. ఎంత ప్రయత్నించినప్పటికీ వారికి చదువుపై శ్రద్ధ కలుగలేదు. మనోవేదన చెందిన రాజు తన బాధను మంత్రుల వద్ద వ్యక్తపరచి తరుణోపాయం సూచింపుమన్నాడు. ఒక మంత్రి విష్ణుశర్మ అనే గురువు గురించి చెప్పి అతనికి రాకుమారులను అప్పగింపుమని సలహా ఇచ్చాడు.

రాజు విష్ణుశర్మను పిలిపించి, రాకుమారుల చదువు విషయమై తన వేదనను వివరించి, 'నా బిడ్డలకు విద్యా బుద్ధులు నేర్పండి, మీకు తగిన పారితోషికం ఇస్తాను' అని అన్నాడు. విష్ణుశర్మ బదులిస్తూ 'నేను విద్యను అమ్ముకోను, నీ బిడ్డలను నీతిశాస్త్ర కోవిదులను చేస్తాను, నాకేవిధమైన పారితోషికం అవసరం లేదు' అని చెప్పి రాకుమారులను తీసుకొని వెళ్ళాడు.

వారికి బోధించదలచిన పాఠ్య ప్రణాళిక ప్రకారం కొన్న్ కథలను స్వయంగా రచించి, బృహత్కథ నుండి కొన్ని కథలను గ్రహించి, పంచతంత్రమును రచించాడు. ఆ కథలను వారికి చెప్పి, నీతిని బోధించి ఆరు నెలలలో వారిని నీతిశాస్త్ర కోవిదులను చేసి, రాజుకిచ్చిన మాటను చెల్లించుకున్నాడు.

[<small>మార్చు</small>] విశిష్టత

విషయ పరిజ్ఞానం, బోధనా సామర్థ్యం, చక్కని పాఠ్య ప్రణాళిక ఉంటే, చదువంటే ఇష్టము, ఆసక్తి లేని వారికి కూడా బోధించి విద్యావంతులను చెయ్యవచ్చని 5 వ శతాబ్దం లోనే విష్ణుశర్మ నిరూపించాడు. 1500 సంవత్సరాల నాటి ఈ రచన ఈనాటికీ ప్రతి సమాజానికీ అనుసరణీయమే, ఆమోదయోగ్యమే! అదే పంచతంత్రం యొక్క విశిష్టత.

పంచతంత్రం 5 విభాగాల, 69 కథల సంపుటి. కథలలోని పాత్రలు ఎక్కువగా జంతువులే. పాత్రల పేర్లు వాటి మనస్తత్వాన్ని, సహజ ప్రవృత్తినీ, నడతను సూచిస్తూ ఉంటాయి. కథనం సరళంగా ఉంటూ, సామెతలు, ఉపమానాలను గుప్పిస్తూ, ఎంతో ఆసక్తికరంగా సాగుతుంది. సమాజం గురించి, వ్యవస్థ, మనుష్య ధర్మం గురించిన ఎన్నో విషయాలు కథలలో మిళితమై వస్తాయి. పంచతంత్రం ఒక ప్రాంతానికి, ఒక కాలానికి పరిమితం కాని, చిరస్థాయిగా నిలిచిపోయే సార్వత్రిక విజ్ఞానం.

[<small>మార్చు</small>] భాగాలు

పంతంత్రం 5 విభాగాలుగా ఉన్న చక్కని ఆకృతి గల రచన. ప్రతి విభాగానికి ఒక విశిష్టమైన, విలక్షణమైన లక్ష్యం కనపడుతుంది. విభాగాల పేర్లు, ఒక్కొక్కదానిలోని కథల సంఖ్య ఇలా ఉన్నాయి.

భాగం పేరు కథల సంఖ్య
1 మిత్రభేదము 22
2 మిత్ర సంప్రాప్తి 6
3 కాకోలూకీయము 16
4 లబ్ధ ప్రణాశము 11
5 అపరీక్షిత కారిత్వము 14

మొదటి నాలుగు భాగాలలో జంతువులు ప్రధాన పాత్రలు కాగా, ఐదవ దానిలో మనుష్యులు ప్రధాన పాత్రలు

[<small>మార్చు</small>] అనుకరణలు

14 వ శతాబ్దం ప్రాంతాలలో నారాయణుడు అనే పండితుడు వివిధ గ్రంధాలనుండి సేకరించిన కథలతో హితోపదేశము అనే గ్రంధాన్ని సంస్కృతంలో రచించాడు. అందులో మిత్రలాభము, సుహృద్భేదము, విగ్రహము, సంధి అనే నాలుగు భాగాలు ఉన్నాయి. ఈ పుస్తకం కూడా పంచతంత్రం వలెనే ప్రారంభమై అలాగే సాగుతుంది. దీనిలో కూడా విష్ణుశర్మ అనే పండితుడు రాకుమారులకు వివిధ కథల ద్వారా విద్యాబోధన చేస్తాడు. అక్కడక్కడా కథా స్థలాలు, పాత్రల పేర్లలో మార్పులు తప్పించి, గ్రంధం పూర్తిగా పంచతంత్రం పోకడలోనే ఉంది.

హితోపదేశం అచ్చు పంచతంత్రం లాగానే ఉండటంతో కాలక్రమేణా పంచతంత్రం విషయం లోని విభాగాలు ఏవి అనే విషయంపై కొన్ని సందిగ్ధాలు ఏర్పడ్డాయి.

[<small>మార్చు</small>] తెలుగు అనువాదాలు

తెలుగులో నాలుగు అనువాదాల వరకు వచ్చినట్లు తెలుస్తోంది. వాటి రచయితలు:

  1. బైచరాజు వేంకటనాథుడు
  2. దూబగుంట నారాయణ కవి
  3. పరవస్తు చిన్నయసూరి
  4. వేములపల్లి ఉమామహేశ్వరరావు

చిన్నయసూరి తన అనువాదానికి నీతి చంద్రిక అని పేరు పెట్టాడు. తెలుగులో ప్రసిద్ధి పొందిన అనువాదం ఇదే. కానీ ఈ అనువాదం పంచతంత్రాన్ని కాక నారాయణుడి హితోపదేశాన్ని అనువదించినట్లుగా కనిపిస్తుంది. పరవస్తు చిన్నయసూరి నీతిచంద్రిక రెండు భాగములను మాత్రమే రచించగా, మిగిలిన భాగాలను కందుకూరి వీరేశలింగం పంతులు రచించాడు. తెలుగు సంప్రదాయంగా విరామచిహ్నాలు లేకుండా సాగిన వేములపల్లి ఉమామహేశ్వర రావు అనువాదం కూడా చదవదగ్గది.

[<small>మార్చు</small>] పంచతంత్రం ధారావాహికగా

పంచతంత్రం ధారావాహికగా తెలుగులో ప్రచురించిన ఘనత చందమామ పత్రికకు దక్కింది. సరళమైన తెలుగులో, ఆకర్షణీయమైన బొమ్మలతో కొన్ని సంవత్సరాల పాటు, పంచతంత్రం ధారావాహికగా ప్రచురించారు.

[<small>మార్చు</small>] మూలాలు

ఈ వ్యాసం లోని పలు విషయాలకు మూలం: వేములపల్లి ఉమామహేశ్వర రావు అనువాదం - జూన్‌ 1989

పేజీకి సంభందించిన లింకులు