Coordinates: 13°19′N 75°46′E / 13.32°N 75.77°E / 13.32; 75.77

చిక్కమగళూరు జిల్లా

వికీపీడియా నుండి
(చికమగలూరు జిల్లా నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
  ?చికమగలూరు
చిక్‌మగళూరు
కర్ణాటక • భారతదేశం
కుద్రేముఖ్ పర్వతం
కుద్రేముఖ్ పర్వతం
కుద్రేముఖ్ పర్వతం
అక్షాంశరేఖాంశాలు: 13°19′N 75°46′E / 13.32°N 75.77°E / 13.32; 75.77
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)


చిక్‌మగళూరు : (ఆంగ్లం: Chikkamagaluru కన్నడ:ಚಿಕ್ಕಮಗಳೂರು) భారతదేశం లోని కర్ణాటక) రాష్ట్రం లోని ఒక జిల్లా, పట్టణం. భారతదేశం లోనే మొట్టమొదటిగా చిక్‌మగళూరులో కాఫీ తోటలు పెంచబడ్డాయి. చిక్‌మగళూరు జిల్లాలో ఉన్న పశ్చిమ కనుమల పర్వతశ్రేణులలో తుంగ, భద్ర నదులు పుడుతున్నాయి. ఈ జిల్లాలోనే ఉన్న ముల్లాయనగిరి పర్వత శ్రేణులు కర్ణాటక రాష్ట్రంలో అత్యంత ఎత్తులో ఉన్న పర్వతశ్రేణులు. ప్రకృతి రమణీయ దృశ్యాలు కలిగిన కెమ్మనగుండి, కుద్రేముఖ్ కొండలు, మాణిక్యధార, కల్లథిగిరి జలపాతాలు పర్యాటకుల నేత్రాలకు విందు కలిగిస్తాయి. శంకరాచార్యులు అద్వైత ప్రచారం కోసం స్థాపించిన శారదా పీఠం ఈ జిల్లాలో ఉన్న శృంగేరిలో ఉంది. ఆ తరువాతి కాలంలో భారతీ కృష్ణ తీర్థ స్వామిచే తన ముందు పీఠాధిపతి అయిన విద్యాశంకర స్వామి స్మారక నిమిత్తం నిర్మించబడిన విద్యాశంకర దేవాలయం కూడా శృంగేరిలో ఉంది. దక్షిణ భారత దేశాన్ని పరిపాలించిన పెద్ద సామ్రాజ్యాలలో ఒకటైన హొయసల రాజులు అమృతపురలో నిర్మించిన హొయసల దేవాలయం ఈ జిల్లాలోనే ఉంది. వన్యప్రాణి సంరక్షణ మీద ఆసక్తి ఉన్నవారు ఈ జిల్లాలో ఉన్న కుద్రేముఖ్ జాతీయ వనం, భద్ర అభయారణ్యం దర్శించి తీరవలసిందే.

జిల్లా పేరు వెనుక కథ[మార్చు]

జిల్లాకి చిక్‌మగళూరు పేరు జిల్లా రాజధాని చిక్‌మగళూరు పట్టణం నుండి వచ్చింది. చిక్‌మగళూరు అంటే కన్నడ భాషలో చిన్న కూతురు ఊరు అని అర్థం (చిక్క=చిన్న, మగళు=కూతురు, ఊరు=ఊరు). సేక్రపట్న రాజైన రుక్మాంగద చిన్న కూతురుకు కట్నంగా ఇవ్వబడడం వల్ల ఈ పట్టణానికి చిక్‌మగళూరు అని పేరు వచ్చిందని చెబుతారు.[1]. రుక్మాంగద పెద్ద కూతురు పేరు మీద చిక్‌మగళూరుకు 5 కి.మీ దూరంలో హిరెమగళూరు ఉన్నది (హిరె=పెద్ద మగళూరు కూతురు ఊరు.)

జిల్లా చరిత్ర[మార్చు]

ఎకకుంట, అమృతేశ్వర దేవాలయం,1196, అమృత‌పుర

హొయసల రాజులు తమ సామ్రాజ్య విస్తరణ జరపడానికి పూర్వం ఇక్కడే గడిపారు. ఇతిహాసం ప్రకారం హొయసల రాజవంశాన్ని స్థాపించిన శాల తన జైన గురువు శుదత్త అనుజ్ఞతో ఈ జిల్లాలో సొసివురు (ఇప్పటి ముడిగిరి తాలుకా లోని అంగడి గ్రామం) లోని ససంతిక దేవి గుడిలో పులిని చంపాడని చెబుతారు. ప్రాచీన కన్నడలో హొయ=విసరడం, హొయసల అంటే శాల చేత విసరబడడం.[2]. ఈ కథ మీద కొన్ని అనుమానాలు కూడా లేక పోలేదు.[3]. హొయసల రాజులలో ప్రముఖుడైన రెండవ వీర బల్లాల (1173-1220) తరికెరి తాలుకాలో అమృతపురలో అమృతేశ్వర దేవాలయాన్ని నిర్మించాడని చెబుతారు.

1670 సంవత్సరంలో చిక్‌మగళూరు జిల్లాలోని బాబు బుడాన్‌ గిరి కొండల పై భారతదేశం లోనే మెట్ట మెదటి సారిగా కాఫీ తోటలు పెంచారు. కాఫీ పెంపకం గురించి ప్రాచుర్యంలో ఉన్న కథ ప్రకారం బాబా బుడాన్ (బాబా బుర్హాన్ లేదా దాదా హయాత్ కలందర్) మక్కా యాత్రకు వెళుతూ యెమెన్‌ దేశం లోని మొఛా నౌకాశ్రయం నుండి ప్రయాణం చేస్తున్నప్పుడు మెదటిసారి కాఫీని రుచి చూశాడు. కాఫీ రుచిని భారత దేశానికి అందించే ప్రయత్నంలో ఏడు కాఫీ గింజలు తనతోబాటు అరబ్‌ దేశాల నుండి తీసుకొని వచ్చాడు. బాబా బుడాన్ భారతదేశానికి తిరిగి వచ్చాక చిక్‌మగళూరులో ఈ గింజలు పాతాడు. బాబా బుడాన్ పై గౌరవానికి గుర్తుగా ఈ కొండలను బాబా బుడాన్ (బాబా బుర్హాన్) కొండలని పిలుస్తారు.

1978 సంవత్సరం భారత పార్లమెంటు లోక్‌ సభ ఎన్నికలలో భారత మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ చిక్‌మగళూరు నుండి పోటీ చేసి గెలుపొందారు.

భౌగోళిక స్వరూపం[మార్చు]

ప్రస్ఫుటంగా కనిపిస్తున్న భాగం కర్ణాటక రాష్ట్రంలోని చిక్‌మగళూరు జిల్లాను సూచిస్తోంది

చిక్‌మగళూరు జిల్లా రాజధాని చిక్‌మగళూరు కర్ణాటక రాజధాని బెంగళూరు నుండి 251 కి.మీ దూరంలో బాబా బుడన్‌ కొండల మధ్య అభయారణ్యాల మధ్య ఉంది. ఈ జిల్లా 75° 04´ 46´´ - 76° 21´ 50´´ తూర్పు రేఖాంశాల మధ్య 12° 54´ 42´´ and 13° 53´ 53´´ ఉత్తర అక్షాంశాల మధ్య ఉంది. జిల్లా తూర్పు నుండి పశ్చిమానికి పొడవు 138.4 కి.మీ., ఉత్తరం నుండి దక్షిణానికి పొడవు 88.5 కి.మీ. కర్ణాటక రాష్ట్రంలోనే అత్యున్నత పర్వత శిఖరం ముల్లాయనగిరి కొండలు సముద్రమట్టానికి 1926 మీటర్ల ఎత్తులో ఉంది.జిల్లా సగటు వర్షపాతం 1925 మి.మీ.ఈ జిల్లా 30% (2108.62 km²) అరణ్యాలతో నిండి ఉంది.[4]. ఈ జిల్లాకు ఉత్తరాన షిమోగా, ఈశాన్యాన దావణగెరె, తూర్పున చిత్రదుర్గ, తుమకూరు, దక్షిణాన హాసన్, నైఋతి దిక్కున దక్షిణ కన్నడ, పశ్చిమాన ఉడిపి జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి. ఈ జిల్లాలో భద్ర, తుంగ, హేమవతి, నేత్రావతి, వేదవతి నదులు సంవత్సరం పొడవునా ప్రవహిస్తుంటాయి. ఈ జిల్లాలో ఇనుము, మాంగనైటు, గ్రానైటు గనులు ఉన్నాయి. బాబా బుడాన్ కొండ ప్రాంతం నల్లరేగడి భూములు ఉండగా, జిల్లా దక్షిణ భాగంలో ఎర్ర మట్టి నేలలు ఉన్నాయి.

రవాణా వ్యవస్థ[మార్చు]

రోడ్డు సౌకర్యం[మార్చు]

చిక్‌మగళూరు జిల్లాలో రహదారుల అభివృద్ధి, నిర్వహణ అంతంత మాత్రంగానే ఉంది.[5][6]. దీన స్థితిలో ఉన్న రోడ్లు మార్గాలు, రైలు సౌకర్యం లేకపోవడం వల్ల జిల్లాలోని కొన్ని గ్రామాలు అభివృద్ధి చెందలేదు.[7]. జిల్లాలో మొత్తం రోడ్ల పొడవు 7264 కి.మీ[4]. ఈ జిల్లా భూభాగంపై రెండు జాతీయ రహదార్లు వెళుతున్నాయి. మంగళూరు-షోలాపూర్ జాతీయ రహదారి-13 శృంగేరి కొప్ప పట్టణాల మీదుగా వెళుతుంది. బెంగళూరు-హొన్నవర జాతీయ రహదారి 206 కడూరు, బీరూరు, తరికెరి మీదుగా పోతుంది. రాష్ట్ర రహదార్లు శృంగేరి-హసన్, తరికెరి-బేలూరు, కడూరు-మంగళూరు అభివృద్ధి చేయాలనే ప్రణాళికలో భాగంగా చిక్‌మగళూరు రహదార్లు అభివృద్ధి చెందుతాయనే ఆశ ఉంది.[8].

రైలుమార్గం[మార్చు]

కడూరు, తరికెరి తాలుకాల మీదుగా రైలు మార్గం ఉంది. జిల్లాలో రైలు మార్గం పొడవు 91 కి.మీ (51 కి.మీ కడూరు తాలూకా, 40 కి.మీ తరికెరి తాలూకా). బీరూరు రైలుస్టేషన్ ఒక పెద్ద జంక్షన్‌. బెంగళూరు నుండి వచ్చే రైలు మార్గం ఇక్కడే (బీరూర్) విభజించబడి ఒక మార్గం షిమోగాకు మరోమార్గం హుబ్లికి వెళ్తుంది. జిల్లా రాజధాని చిక్‍మగళూరుకి రైలు సౌకర్యం లేదు. క్రొత్తగా ప్రణాళికలో ఉన్న కడూరు - సక్లేష్‌పుర రైలు మార్గ నిర్మాణం జరిగితే చిక్‌మగళూరుకి మిగతా కర్ణాటక పట్టణాలతో రైలు మార్గం ద్వారా కలిసే అవకాశం ఉంటుంది.[9].

విమాన సౌకర్యాలు[మార్చు]

చిక్‌మగళూరు జిల్లాకు విమానాశ్రయం లేదు. దగ్గరలో ఉన్న విమానాశ్రయాలు మంగళూరు, బెంగళూరు, హుబ్లి. చిక్‌మగళూరుకి 10 కి.మీ. దూరంలో ఉన్న మార్లే గ్రామంలో విమానాశ్రయం నిర్మించాలనే ఒక ప్రణాళిక ఉంది.[10].

విద్యా రంగం[మార్చు]

2001 సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం చిక్‌మగళూరు జిల్లా అక్షరాస్యత శాతం 72.63; ఇందు పురుషుల అక్షరాస్యత 80.68, స్త్రీల అక్షరాస్యత 64.48% కర్ణాటక రాష్ట్ర అక్షరాస్యతతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. చిక్‌మగళూరు జిల్లాలో శృంగేరి తాలూకా 80.78% అక్షరాస్యతతో మెదటి స్థానంలో ఉంటే, కడూరు తాలూకా 68.33%తో చివరి స్థానంలో ఉంది.

ప్రాథమిక-ప్రాథమికోన్నత విద్య[మార్చు]

2001 సంవత్సర లెక్కల ప్రకారం చిక్‌మగళూరు జిల్లాలో 1,51,923 మంది విద్యార్థులతో 1,620 ప్రాథమిక పాఠశాలలు, 34,607 మంది విద్యార్థులతో 235 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి.[11]. ప్రాథమిక పాఠశాలల విషయంలో 414 ప్రాథమిక పాఠశాలలతో (42,774 విద్యార్థులు) చిక్‌మగళూరు తాలూకా మెదటి స్థానంలో నిలిస్తే, శృంగేరి తాలూకా 80 ప్రాథమిక పాఠశాలల (5,822 విద్యార్థులు) తో చిక్‌మగళూరు జిల్లాలో చివరిస్థానంలోఉన్నది. ప్రాథమికోన్నత పాఠశాలల విషయానికి వస్తే కడూరు తాలూకా 74 ప్రాథమికోన్నత పాఠశాలలతో (9,990 విద్యార్థులు) మెదటి స్థానంలో ఉంటే, శృంగేరి తాలూకా 9 ప్రాథమికోన్నత పాఠశాలలతో (1,492 విద్యార్థులు) జిల్లాలో చివరి స్థానంలో ఉంది.

ఉన్నత విద్య[మార్చు]

చిక్‌మగళూరు జిల్లాలో 2001 జనాభా లెక్కల ప్రకారం 46 కళాశాలలు (4,711 విద్యార్థులతో) ఉన్నత విద్య అందిస్తున్నాయి.[11]. కడూరు తాలుకాలో 12 ఉన్నత విద్యా పాఠశాల-కళాశాలలు (1,324 విద్యార్థులు) ఉండగా, శృంగేరి తాలుకాలో 160 విద్యార్థులతో 2 ఉన్నత విద్యా పాఠశాల-కళాశాలు మాత్రమే ఉన్నాయి.

పట్టభద్ర విద్య[మార్చు]

2001 లెక్కల ప్రకారం 4,615 విద్యార్థులతో 13 పట్టభద్ర కళాశాలు డిగ్రీ విద్య అందిస్తున్నాయి.[11]. చిక్‌మగళూరు తాలూకాలో 4 పట్టభద్ర కళాశాలు ఉండగా, కొప్ప, ముడిగిరె, నరసింహరాజపుర, తాలూకాలలో ఒక్కొక్క పట్టభద్ర కళాశాల ఉంది.

సాంకేతిక విద్య[మార్చు]

  • ఇంజనీరింగ్‌: చిక్‌మగళూరు జిల్లాలో శ్రీ ఆది చుంచునాగిరి ఇనిస్టిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనే ఇంజనీరింగ్ కళాశాల చిక్‌మగళూరు పట్టణంలో ఉంది. ఈ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్‌, కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌, ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌, ఇన్‌ఫర్మేషన్‌ సైన్స్ అండ్‌ టెక్నాలజీ, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్‌ ఇంజనీరింగ్‌, సివిల్‌ ఇంజనీరింగ్‌ వంటి విభాగాలలో ఇంజనీరింగ్‌ పట్టా చేయడానికి కోర్సులు ఉన్నాయి. ఈ కళాశాల బెల్గాంలో ఉన్న విశ్వేశ్వరయ్య టెక్నలాజికల్‌ విశ్వవిద్యాలయానికి అనుసంధానించబడి ఉంది.
  • పాలిటెక్నిక్‌ కళాశాలలు: జిల్లాలో 3 పాలిటెక్నిక్‌ కళాశాలలు డిప్లమా కోర్సులు అందిస్తున్నాయి.[12]. They are:
    • ఆది చుంచునాగిరి పాలిటెక్నిక్‌ కళాశాల, చిక్‌మగళూరు: ఈ కళాశాల ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్ విభాగాలలో డిప్లమా కోర్సులు అందిస్తోంది.
    • డి.ఎ.సి.జి. (DACG) పాలిటెక్నిక్‌ కళాశాల, చిక్‌మగళూరు: సివిల్‌ ఇంజనీరింగ్‌, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌, మెకానికల్‌ ఇంజనీరింగ్‌, ఆటోమొబైల్‌ ఇంజనీరింగ్‌లో డిప్లమా కోర్సులు అందిస్తోంది.
    • యస్‌.జె.యం.యం.విద్యాపీఠ్ పాలిటెక్నిక్‌ కళాశాల, బీరూరు : ఈ కళాశాల సివిల్‌, టెలీకమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్‌ విభాగాలలో డిప్లమా కోర్సులు అందిస్తోంది.
  • పారిశ్రామిక శిక్షణా కేంద్రాలు: జిల్లాలో 7 పారిశ్రామిక శిక్షణా కేంద్రాలు (Industrial Training Institure) ఉన్నాయి.[12].

అవి:

    • ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా కేంద్రం, చిక్‌మగళూరు
    • ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా కేంద్రం, కడూరు
    • యస్‌.డి.యం. పారిశ్రామిక శిక్షణా కేంద్రం, సంసె, ముడిగిరె తాలూకా
    • యస్‌.డి.ఆర్. పారిశ్రామిక శిక్షణా కేంద్రం, బాళెహన్నూరు, నరసింహరాజపుర తాలూకా
    • యస్‌.జె.యం. పారిశ్రామిక శిక్షణా కేంద్రం, బీరూరు, కడూరు తాలూకా
    • కర్ణాటక పారిశ్రామిక శిక్షణా కేంద్రం, చిక్‌మగళూరు
    • లక్ష్మీసింహ పారిశ్రామిక శిక్షణా కేంద్రం, దేవనూరు, కడూరు తాలూకా.
    • మారుతి పారిశ్రామిక శిక్షణా కేంద్రం, కడూరు

వైద్య విద్య[మార్చు]

చిక్‌మగళూరు జిల్లాలో పాశ్చాత్య వైద్య విద్యా కళాశాలలేవీ లేవు కానీ ఒక ఆయుర్వేద వైద్య కళాశాల ఉంది. అది కొప్పలోని అర్రూర్ లక్ష్మీనారాయణ రావు మెమోరియల్ ఆయుర్వేద కళాశాల. ఈ కళాశాల, ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఆయుర్వేద వైద్య విధానములో పట్టభధ్ర డిగ్రీలు (బాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ) ప్రధానము చేస్తోంది.

పర్యాటక కేంద్రాలు[మార్చు]

పర్వత కేంద్రాలు[మార్చు]

కెమ్మనగుండికి వెళ్ళే మధ్యభాగంలో అద్భుతమైన ప్రకృతి రమణీయ దృశ్యాలు
  • కెమ్మనగుండి: బాబా బుడన్ కొండల మధ్య చిక్‌మగళూరు పట్టణానికి 55 కి.మీ దూరంలో కెమ్మనగుండి పర్వత కేంద్రం ఉంది. కెమ్మనగుండి పర్వత కేంద్రంలో వాడేయార్ రాజు కృష్ణరాజ వాడేయార్ వేసవి విడిది చేసేవాడు కావున ఈ పర్వతశ్రేణులను కె.ఆర్. కొండలు అని కూడా పిలుస్తారు. ఈ పర్వత కేంద్రం సముద్ర మట్టానికి 1,434 మీటర్ల ఎత్తులో దట్టమైన అరణ్యాల మధ్య సంవత్సరం పొడవునా సెలయేళ్ళతొ హరితంగా ఉంటుంది. పూల తోటలతో, కొండలోయలతో ఉండే ఈ పర్వత కేంద్ర సౌందర్యం వర్ణణాతీతం. అరణ్యాలు అన్వేషణ జరిపే వారికి ఈ పర్వత కేంద్రం నుండి అనేక మార్గాలు ఉన్నాయి. ఈ కొండ ప్రాంతంలో వివిధ ప్రదేశాల నుండి సూర్యాస్తమయాన్ని తిలకించవలసిందే. కేంద్రం పైన గులాబీ తోటలు అనేకం ఉన్నాయి. పర్వతం నడిబొడ్డు నుండి పది నిమిషాల నడకలో వచ్చే జెడ్-పాయింట్ నుండి చూస్తే రమణీయంగా ఉండే పశ్చిమ కనుమలలోని శొల గడ్డి భూములు కనిపిస్తాయి.
  • కుద్రేముఖ్, కుద్రేముఖ్ జాతీయ వనం : కుద్రేముఖ్ జిల్లా రాజధాని చిక్‌మగళూరుకు 95 కి.మీల నైఋతి దిశలో ఉంది. కన్నడ భాషలో కుద్రే=గుర్రం ముఖ్=ముఖం. ఈ పర్వతశ్రేణులు గుర్రపుముఖం ఆకారంలో ఉండడం వల్ల కుద్రేముఖ్ అని పిలుస్తారు. ఈ కుద్రేముఖ్ పర్వతకేంద్రంలో కుద్రేముఖ్ జాతీయ ఉద్యానవనం ఉంది. అరేబియా సముద్రం వైపు ఉన్న ఈ పర్వత శ్రేణుల పరంపర లోతైన లోయలు, ఎత్తైన శిఖరాలతో చాలా సుందరంగా ఉంటుంది. సముద్రమట్టానికి 1,894.3 కి.మీ. ఎత్తులో ఉన్న ఈ పర్వత కేంద్రం కుద్రేముఖ్ లో అపారమైన ఇనుప గనులు ఉన్నాయి. కుద్రేముఖ్ లో ఉన్న కుద్రేముఖ్ ఉక్కు కర్మాగారంలో ఉక్కు కొద్దిగా శుద్ధి చేసి గొట్టాల ద్వారా మంగళూరు పణంబూర్ నౌకాశ్రయానికి సరఫరా చేయబడుతుంది.
  • ముల్లయనగిరి: ముల్లయనగిరి బాబు బుడాన్ కొండలలో ఒక భాగం. ఈ కొండ చిక్‌మగళూరు పట్టణానికి 16 కి.మీ దూరంలో ఉంది. సముద్రమట్టానికి 1930 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ పర్వతశ్రేణులు కర్ణాటక రాష్ట్రం లోనే ఎత్తైన పర్వత శ్రేణులు. ఈ పర్వత శిఖరం సూర్యాస్తమయం వీక్షించడానికి చాలా ప్రసిద్ధి. చిక్‌మగళూరు నుండి సితలయనగిరి వెళ్ళే మార్గంలో ఉన్న శివుడి గుడిలో లింగం నిరంతరం నీటిలో ఉంటుంది. నీటి మట్టం ఏ సమయంలో నైన ఒకే లాగ ఉంటుంది. అక్కడ నుండి ముల్లయనగిరికి వెళ్ళే రహదారి చాలా సన్నగా ఉండి రెండు ప్రక్కల వాహనాలు పోవడానికి వీలు లేకుండా ఉంటుంది. ముల్లయనగిరి కొండ చాలా వాలుగా ఉండడం వల్ల పైకి పూర్తిగా వాహనాల మీద చేరుకోలేరు. ముల్లయనగిరి కొండకు ఎక్కే మధ్య భాగంలో ఒక చిన్న గుడి కూడా ఉంది. ముల్లయనగిరి కొండల నుండి ఆకాశం నిర్మలంగా ఉన్న రోజులలో అరేబియా సముద్రం కనిపిస్తుంది. పర్వత శ్రేణులను అధిరోహించాలని ఆసక్తి ఉన్నవారికి ఈ కొండ చాలా మంచి ప్రదేశం.
  • దత్త పీఠం (బాబా బుడాన్ గిరి)  : చిక్‌మగళూరుకు ఉత్తరాన బాబా బుడాన్ కొండలు ఉన్నాయి. వీటికి చంద్ర ద్రోణ పర్వత అనే పేరు కూడా ఉంది. ఈ కొండలకు చాలా పురాతన చరిత్ర ఉంది. ఈ కొండలు హిమాలయాలకు నీలగిరి కొండలకు మధ్య ఉన్న ఎత్తైన కొండలలో ఇదిఒకటి. ఈ కొండకు ఈ పేరు 150 సంవత్సరాల క్రితం నివసించిన ముస్లిం ఔలియా, సూఫీ అయిన బాబా బుడాన్ (దాదా హయాత్ కలందర్) వల్ల వచ్చింది.

జలపాతాలు[మార్చు]

బాబా బుడాన్ గిరి కొండల వద్ద నున్న మాణిక్యధార జలపాతం
హనుమాన్ గుండి జలపాతం
మాణిక్యధార జలపాతం

ఈ జలపాతం బాబా బుడాన్ గిరి దత్తాత్రేయ పీఠంకి దగ్గరలో ఉంది. ఈ జలపాతం పడేటప్పుడు నీరు ముత్యాల వలే కనిపిస్తూ చూపరులకు, జలక్రీడలు ఆడేవారికి అమిత అనందాన్ని కలిగిస్తోంది.

కళ్ళహతిగిరి జలపాతం

కెమ్మనగుండి నుండి 10 కి.మీ దూరంలో ఉన్న కల్లహతగిరి జలపాతాన్ని కాళహస్తి జలపాతం అనికూడా పిలుస్తారు. 122 మీటర్ల ఎత్తులోనున్న చంద్ర ద్రోణ పర్వతం నుండి పడే ఈ జలపాతం చాలా రమణీయంగా ఉంటుంది. జలపాతం పడే రాళ్ళ మధ్య శివునిగా అర్చించబడే వీరభద్ర దేవాలయం ఉంది.

హెబ్బే జలపాతం

కెమ్మనగుండి పర్వత కేంద్రం నుండి 10 కి.మీ దూరంలో ఉన్న ఈ జలపాతం 168 మీటర్ల ఎత్తు నుండి పడుతుంది. ఈ జలపాతం రెండు గతిపథులుగా పడుతుంది. దొడ్డ హెబ్బే ( పెద్ద హెబ్బె) జలపాతం, చిక్క హెబ్బే (చిన్న హెబ్బె) జలపాతం

శాంతి జలపాతం

కెమ్మనగుండి నుండి జెడ్-పాయింట్ కి వెళ్ళే మార్గంలో ఈ జలపాతం వస్తుంది.

హనుమాన్‌ గుండి జలపాతం

కలసాకి 32 కి.మీల దూరంలో ఉన్న ఈ జలపాతం నుండి పడే జలం వల్ల 100 అడుగుల కంటే ఎత్తు కల సహజ శిలలు ఏర్పడ్డాయి.

కదంబి జలపాతం

ఈ జలపాతం కుద్రేముఖ్ జాతీయ ఉద్యానవనం వద్ద ఉంది.

పుణ్యక్షేత్రాలు[మార్చు]

శృంగేరి లోని విద్యాశంకర దేవాలయం
హొరనాడు అన్నపూర్ణేశ్వరి దేవాలయమహాద్వారం
  • శృంగేరి: చిక్‌మగళూరుకు 90 కి.మీలకు పశ్చిమంగా తుంగ నది ఒడ్డున శంకరాచార్యులు అద్వైత ధర్మప్రచారానికి స్థాపించిన మొట్టమొదటి మఠమైన శారద పీఠానికి నిలయం శృంగేరి. శృంగేరిలో శారదా దేవి దేవాలయం ఉన్నది, శారద దేవి ఆలయానికి ప్రక్కన విద్యాశంకరులు స్మారకంగా నిర్మితమైన విద్యాశంకర్ దేవాలయం హొయసల రాజుల కాలంలో ప్రారంభించబడి విజయనగర రాజుల చేత పూర్తి చేయబడింది. ఈ విద్యాశంకర దేవాలయంలో 12 రాశులను సూచిస్తూ 12 స్తంభాలు ఉన్నాయి. సూర్యుడు ఏ రాశితో ఉన్నాడో సూర్యకిరణాలు ఆ స్తంభం మీద పడతాయి.
  • హొరనాడు: చిక్‌మగళూరుకు 100 కి.మీ.ల నైఋతి దిక్కులో ఉన్న ఈ గ్రామంలో ప్రసిద్ధమైన అన్నపూర్ణేశ్వరి దేవాలయం ఉంది. ఈ దేవాలయం పునరుద్ధరణ ఈ మధ్య కాలంలో జరిగింది. ఆదిశక్తితో ప్రాణ పతిష్ట చేసిన ఈ గుడిలో ఉన్న ఈ అమ్మవారిని ఆదిశక్త్యకాంబ శ్రీ అన్నపూర్ణేశ్వరిగా భావిస్తారు. ఈ దేవాలయంలో ప్రతి రోజు అన్న సంతర్పణ జరుగుతుంది. అమ్మవారిని దర్శించడానికి వచ్చిన తీర్థయాత్రీకులకు దేవస్థానం వసతి భోజన సదుపాయాలు కల్పిస్తుంది.
  • కలస: చిక్‌మగళూరుకు నైఋతిథిశలో 92 కి.మీల దూరంలో భద్ర నది ఒడ్డున కలస ఉంది.భద్ర నది ఒడ్డున ఉన్న పంచ క్షేత్రాలలో (ఐదు సరస్సులు) ఇది ఒకటి . దగ్గరలో ఉన్న చిన్న కొండ పై హొయసల శైలితో నిర్మితమైన శివాలయం కాళేశ్వర దేవాలయం ఉంది. కలసలో ఉన్న పెద్ద శిలను మధ్వాచార్య బండఅని పిలుస్తారు. ఈ బండ పై మధ్వాచార్యులు ద్వైత సిద్ధాంతాన్ని బోధించాడని చెబుతారు.ఈ శిల పై ఇప్పుడు మధ్వచార్యుల విగ్రహం చెక్కబడింది.
  • గురు దత్తాత్రేయ, బాబా బుడాన్ స్వామి దర్గాహ్: బాబా బుడాన్ గిరి కొండలపై నున్న ఇమాం దత్తాత్రేయ పీఠాన్ని హిందువులు ముస్లిములు సమానమైన పవిత్ర స్థలంగా భావిస్తారు.ఈ కొండ పై నున్న లాటిరైటు (కంకర) గుహలో దత్తాత్రేయ స్వామి లేదా హజరత్‌ దాదా హయాత్‌ మీర్ కలందర్ నివసించారని ఇక్కడి ప్రజలు నమ్ముతారు. (బాబా బుర్హాన్ సూఫీ సంతుడిని, హిందువులు దత్తాత్రేయ స్వామి అని, ముస్లింలు హజరత్ దాదా హయాత్ మీర్ కలందర్ అని పిలుస్తారు) ప్రతి సంవత్సరం ఇక్కడి ఫకీర్ల జాతరను, ఉర్సును నిర్వహిస్తారు.
  • అమృత్‌పుర: చిక్‌మగళూరు పట్టణానికి 67 కి.మీల ఉత్తరంలో ఉన్న అమృత్‌పుర గ్రామంలో ఉన్న అమృతేశ్వర దేవాలయాన్ని సా.శ. 1196 సంవత్సరంలో అమృతేశ్వర దండ నాయక అని పేరు గాంచిన హొయసల రాజు రెండవ వీర బల్లాల్ కట్టించాడు. ఈ దేవాలయం చూస్తే హోయసల రాజుల కాలంలో శిల్ప నైపుణ్యం ఎంత ఉచ్ఛ స్థితిలో ఉండేదో అవగతమవుతుంది.
  • బేలవాడి: చిక్‌మగళూరుకు ఆగ్నేయంలో 29 కి.మీ.ల దూరంలో ఉన్న బేలవాడి గ్రామంలో ఉన్న శృంగారమైన వీరనారాయణ దేవాలయం, ఉద్భవ గణపతి దేవాలయం చాలా ప్రసిద్ధం. ఈ గ్రామానికి 10 కి.మీ. దూరం లోనే హళేబీడు ఉంది.

వృక్ష-జంతు సంపద[మార్చు]

భద్ర అభయారణ్యంలో ఉన్న రివర్-టెర్న్ అనే పక్షి
  • భద్ర అభయారణ్యం: తుంగ భద్ర నది ఒడ్డున 495 కి.మీ.². విస్తీర్ణంలో ఉన్న ఈ అభయారణ్యంలో పులుల ప్రాజెక్టు ఉంది.ఈ అభయారణ్యం ఉన్న జలాశయం తుంగ భద్ర నది నుండి వచ్చే నీటిని నిల్వ ఉంచి దక్షిణ కర్ణాటక వర్షచ్ఛాయ జిల్లాలకు నీరు అందిస్తోంది.ఈ అభయారణ్యం లోని అడవులలో వెదురు చెట్లు ఉన్నాయి. సహ్యాద్రి పర్వతాల (పశ్చిమ కనుమలు) లో, మలబారు తీరంలో కనిపించే వివిధ పక్షిజాతులు ఇక్కడ కనిపిస్తాయి.
  • కుద్రేముఖ్ జాతీయ వనం: 13°01'00" - 13°29'17" N అక్షాంశాల, 75°00'55' - 75°25'00" E రేఖాంశాల మధ్య ఉన్న ఈ కుద్రేముఖ్ జాతీయ వనం ఉంది. జంతు వైవిధ్యం ఉండి ప్రపంచం మొత్తం మీద సంరక్షిత స్థలాలుగా ఎన్నుకొనబడిన 25 ప్రదేశాలలో పశ్చిమ కనుమలలోని కుద్రేముఖ్ ఒకటి. వన్యప్రాణి కన్సర్వేషన్ సొసైటి (Wildlife Conservation Society (WCS) ), వర్డ్ వైడ్ ఫండ్ (World Wide Fund-USA) చేత అవిష్కరించబడుతున్న ఈ కుద్రేముఖ్ జాతీయ ఉద్యానవనం Global Tiger Conservation Priority-I క్రిందకు వస్తుంది.

మూలాలు[మార్చు]

  1. చిక్‌మగళూరు పేరు వెనుక ఉన్న కథను చిక్‌మగళూరు జిల్లా వెబ్‍సైటు లో వివరించారు National Informatics Centre. "About Chikkamagaluru". The Official website of Chikkamagaluru. District Administration, Chikkamagaluru. Retrieved 2007-03-16.[permanent dead link]
  2. Angadi village in Chikkamagaluru district, where it is believed that king Sala, founder of Hoysala dynasty killed the tiger, will be made a major tourist destination, reports the Staff Correspondent in. "Angadi to be made a major tourist destination". Online Edition of The Hindu ePaper - Issue Thursday, Oct 19, 2006. 2006 The Hindu, From the publishers of the Hindu. Archived from the original on 2007-10-01. Retrieved 2007-03-16.
  3. C. Hayavadhana Rao, J. D. M. Derrett, B. R Joshi call the Sala story a legend, Arthikaje, Mangalore. "History of Karnataka-Hoysalas and their contributions". 1998-2000 OurKarnataka.Com, Inc. Archived from the original on 2007-04-18. Retrieved 2007-03-16.
  4. 4.0 4.1 Geographical details of Chikkamagaluru district are discussed by National Informatics Centre. "Perspective Industrial Plan of Chickmagalur District". The Official website of Chikkamagaluru. District Administration, Chikkamagaluru. Archived from the original on 2007-04-05. Retrieved 2007-03-18.
  5. The damage to roads in the district, including State highways and municipal roads is unprecedented reports the Correspondent in. "BJP threatens stir over bad roads in Chikmagalur". Online Edition of The Hindu ePaper - Issue Thursday, Sep 25, 2005. 2005 The Hindu, From the publishers of the Hindu. Archived from the original on 2008-03-02. Retrieved 2007-03-18.
  6. Deplorable condition of Chickmagalur roads and money being released to address the issue is reported by Correspondent in. "Chikmagalur district gets Rs. 27 crore for road repairs". Online Edition of The Hindu ePaper - Issue Thursday, Jan 05, 2007. 2007 The Hindu, From the publishers of the Hindu. Archived from the original on 2007-01-08. Retrieved 2007-03-18.
  7. In absence of good rail network, the roads play an important part for the industrial development. However, most of the roads in Chikkamagaluru district needs proper maintenance. Report by National Informatics Centre. "Present Industrial Scenario of the district and SWOT analysis". The Official website of Chikkamagaluru. District Administration, Chikkamagaluru. Archived from the original on 2007-01-26. Retrieved 2007-03-17.
  8. Plans to upgrade some roads in Chikkamagaluru district is presented by National Informatics Centre. "Socio-Economic Infrastructure". The Official website of Chikkamagaluru. District Administration, Chikkamagaluru. Archived from the original on 2007-09-27. Retrieved 2007-03-18.
  9. Isolation of Chikkamagaluru city from the rest of the state because of it not having a railway station and plans to correct this is discussed in National Informatics Centre. "Socio-Economic Infrastructure". The Official website of Chikkamagaluru. District Administration, Chikkamagaluru. Archived from the original on 2007-09-27. Retrieved 2007-03-18.
  10. Proposal to construct an airport in Chikkamagaluru district is discussed by National Informatics Centre. "Socio-Economic Infrastructure". The Official website of Chikkamagaluru. District Administration, Chikkamagaluru. Archived from the original on 2007-09-27. Retrieved 2007-03-18.
  11. 11.0 11.1 11.2 Statistics related to schools in చిక్‌మగళూరు జిల్లా are discussed by National Informatics Centre. "Annexures". Annexure IX, The Official website of Chikkamagaluru. District Administration, Chikkamagaluru. Archived from the original on 2007-09-27. Retrieved 2007-03-19.
  12. 12.0 12.1 Colleges offering Technical Education in Chikkamagaluru district are discussed in National Informatics Centre. "Socio-Economic Infrastructure". The Official website of Chikkamagaluru. District Administration, Chikkamagaluru. Archived from the original on 2007-09-27. Retrieved 2007-03-19.

బయటి లింకులు[మార్చు]