శృంగేరి
| ?శృంగేరి కర్ణాటక • భారతదేశం | |
| అక్షాంశరేఖాంశాలు: 13°25′N 75°15′E / 13.42°N 75.25°E | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| విస్తీర్ణం • ఎత్తు |
• 672 మీ (2,205 అడుగులు) |
| జిల్లా (లు) | చిక్మగులూరు జిల్లా జిల్లా |
| శాసనసభ సభ్యుడు | డి.ఎన్.జీవరాజ్ |
| కోడులు • పిన్కోడ్ • ప్రాంతీయ ఫోన్ కోడ్ • వాహనం |
• 577139 • +08265 • KA-18 |
శృంగేరి (కన్నడ: ಶೃಂಗೇರಿ), కర్ణాటక రాష్ట్రం చిక్ మగళూర్ జిల్లాలో తుంగభద్రా నది ఒడ్డున ఉంది. శృంగేరి అనే పేరు ఋష్యశృంగగిరి నుండి వచ్చిందని చెబుతారు. విభాణ్డక మహర్షి కుమారుడైన ఋష్యశృంగ మహర్షి ఆశ్రమము, శృంగేరి దగ్గరగా ఉన్న శృంగపర్వతం వల్ల ఈ పేరు వచ్చిందని చెబుతారు. ఋష్యశృంగుడు రోమపాదుడి [1] పాలిస్తున్న అంగ రాజ్యంలో అడుగు పెట్టి ఆ రాజ్యాన్ని క్షామం నుండి విముక్తి కలిగించి వర్షాలు పడేటట్లు చేస్తాడు. ఈ వృత్తాంతము రామాయణము బాల కాండములో వస్తుంది. ఈ గ్రామములోనే శంకరాచార్యులు అద్వైతమును వ్యాప్తిచేయుటకై స్థాపించిన శంకర మఠమును దఖ్షిణామ్నాయ మఠం అని అంటారు.
చరిత్ర
[మార్చు]శంకరాచార్యులు ధర్మ ప్రచారం కోసం దేశాటన జరుపుతున్న సమయములో, ఆయన తన పరివార శిష్యులతో ఇక్కడకు పర్యటించుచున్నప్పుడు ఒక సర్పము ప్రసవించుచున్న ఒక మండూకానికి నీడ కల్పించే సంఘటన ఆయనకు కనిపిస్తుంది. ప్రాకృతికవైరులైన సర్పమండూకముల మధ్య పరస్పర మైత్రీ భావము, సర్పానికి మణ్డూకంపై అత్యంత దయార్థ్ర భావము చూచి భగవత్పాద శంకరాచార్యుల మనస్సులో ప్రాకృతికవైరులలో మైత్రీభావము మూర్తీభవించి ఉన్నది కాబట్టీ ఈ క్షేత్రము అత్యంత పవిత్రమైనది అని స్ఫురించి అంతే కాకుండా ఇక్కడ వరకు వచ్చేటప్పడికి మండన మిశ్రుడి భార్య అయిన ఉదయ భారతి సరస్వతి మూర్తిగా మారిపోతుంది. ఈ రెండు సంఘటనలు చేశాక ఇక్కడే మెదటి మఠం నిర్మించాలని తలచి మెదటి మఠాన్ని ఇక్కడే స్థాపిస్తారు. ఆది శంకరుడు ఇక్కడ 12 సంవత్సరాలు గడిపాడు అని చెబుతారు. ఆ తరువాత దేశాటన జరుపుతూ పూరి లో, కంచి లో, బదరిలో, ద్వారకలో మఠాలను స్థాపించారు.
జనాభా
[మార్చు]శృంగేరి 13.42°అక్షాంశం పై 75.25°రేఖాంశం పై ఉన్నది[3].సముద్ర మట్టానికి సుమారుగా 672 (2204 అడుగులు).మీటర్ల ఎత్తులో ఉంది .
2001 జనాభా లెక్కల ప్రకారం శృంగేరి జనాభా 4253 (52 శాతం పురుషులు 48 శాతం స్త్రీలు). శృంగేరి అక్షరాస్యత 83 శాతము. ఇది జాతీయ సగటు అక్షరాస్యత కంటే (59.5%) ఎక్కువ. ఆరు సంవత్సరాల కంటే తక్కువ ఉన్న జనాభా 8 శాతం.
దర్శించవలసిన ప్రదేశాలు
[మార్చు]శృంగేరిలో ప్రసిద్ధి చెందిన చారిత్రాత్మక దేవాలయాలు ఉన్నాయి.

శృంగేరిలో ముఖ్యమైన దర్శనీయ విశేషాలు
- శృంగేరి శారదాంబ దేవాలయం
- విద్యాశంకర దేవాలయం
- ఆది శంకరుల దేవాలయం
- నరసింహవనం
- తుంగ నది
శారదాంబ దేవాలయం
[మార్చు]శారదాదేవి జ్ఞానానికి విజ్ఞాన సర్వసానికి తల్లి. ఈ దేవాలయంలో ఉన్న అమ్మవారు శంకరాచార్యుల సమయమునుండి ఉన్నదని చెబుతారు. మండన మిశ్రుని భార్య అయిన ఉభయ భారతి ఇక్కడ విగ్రహంగా మారిపోయిందని కూడా చెబుతారు. మెదలు ఇక్కడ చందనంతో చేసిన విగ్రహం ఉండేది. ఆ చందన విగ్రహాన్ని 14 వ శతాబ్దములో విద్యారణ్య స్వామి పీఠాధిపతిగా ఉన్న సమయంలో రాతి, బంగార విగ్రహ ప్రతిష్ఠ చేసారని చరిత్ర బట్టి తెలుస్తోంది. ఆలయ పరిసరాలు 20 వ శతాబ్దం వరకు చెక్కతో నిర్మించబడింది. అగ్నిప్రమాదము జరగడంతో పాత దేవాలయపు స్థానములో కొత్తదేవాలయము నిర్మించారు. జీర్ణోద్ధారణ జరిగిన ఆ ఆలయ ప్రాంగణం అంతా ద్రవిడ దేవాలయ నిర్మాణ శైలిలో [4] జరిగింది.
విద్యాశంకర దేవాలయం
[మార్చు]శారదా శృంగేరి మఠానికి పదవ పీఠాధిపతైన విద్యాశంకర తీర్థుల స్మారకంగా ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఆ తరువాత పీఠాధిపతి భారతి కృష్ణ తీర్థుల ఆధ్వర్యంలో 1357-58 మిగిలిన నిర్మాణం జరిగింది. విద్యారణ్య స్వామి విజయనగర సామ్రాజ్యం స్థాపించిన హరిహర రాయలు, బుక్క రాయలకు గురువు. ఈ ఆలయం నిర్మాణం హొయసల శైలలో జరిగింది. ఈ దేవాలయంలో విద్యాశంకర స్వామి లింగాకారంగా ఉంటారు. స్వామికి ఇరుప్రక్కల వినాయకుడు, అమ్మవారు ఉంటారు. ఈ దేవాలయం లోపలి మండపంలోని స్థంబాలపై 12 రాశులు చెక్కి ఉంటాయి. ఆలయ నిర్మాణం, గవాక్షాల ఏర్పాటు (కిటికీ ఏర్పాటు) సూర్య కిరణాలు నెలల ప్రకారం ఆయా రాశుల మీద పడేటట్లు చేయబడింది. ఇంకో విశేషం ఏమంటే మండపంలోని స్తంభాలపై ఉన్న గుండ్రపు రాళ్ళు గోళాకారంగా సింహపు నోటి నుండి బయటకు జారునట్లుగా చెక్కారు. ఇవి సింహం నోటిలో ఉన్నట్లు ఉంటాయి కాని గోళం అంచులు సింహం నోటికి తగిలి తగలనట్లు ఉండి జారిపడతాయి అనిపించేటట్లుగా అత్యద్భుతంగా చెక్కారు.[5][6][7]
శృంగేరి శారదా పీఠం
[మార్చు]ఆదిశంకరులు అద్వైతం ప్రచారం చేయడానికి నెలకొల్పిన నాలుగు మఠాలలో శృంగేరి శారద మఠం మెదటిది. దీనినే దక్షిణామ్నాయ మఠంగా చెబుతారు. దక్షిణ భారతదేశంలో ప్రాచుర్యములో ఉన్న కృష్ణ యజుర్వేదము ఈ మఠానికి ప్రధాన వేదం. ఈ మఠానికి పీఠాధిపతిని స్వయంగా శంకరాచార్యులతో సమానంగా భావిస్తారు. ఆయన సన్యాస్యాశ్రమ నామానికి ముందు శంకరాచార్య అని చేర్చబడుతుంది. ఇప్పటి శృంగేరి శారద మఠం పీఠాధిపతి భారతి తీర్థులు.
తుంగ నది
[మార్చు]
శృంగేరి తుంగ భద్ర నది ఒడ్డున ఉంది. తుంగ నది ఇటు ప్రక్కన విద్యాశంకర దేవాలయం, దాని ప్రక్కన ఆ ఆలయానికి అనుసంధానం ఉన్న చిన్న చిన్న దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడి పూజా మూర్తులకు అవసరమైన జలాలన్ని ఇక్కడ నుండే తెస్తారు. తుంగభద్ర నది అవతల ఒడ్డున నరసింహవనం ఉంది. అభినవ విద్యాతీర్థ స్వామి ఆధ్వర్యంలో తుంగభద్ర నదిపై విద్యాశంకర సేతువును నిర్మించారు. తుంగానదిలో అసంఖ్యాకంగా చేపలు నది ఒడ్డుకు వస్తుంటాయి, భక్తులు చేపలకు అటుకులు మున్నగునవి ఆహారంగా వేస్తారు. తుంగానది ఇక్కడ చాలా లోతుగా ఉంటుంది, అందువలన ఇక్కడ ఈత కొట్టవద్దని హెచ్చరికలు ఉంటాయి.
నరసింహ వనం
[మార్చు]నరసింహవనంలో శృంగేరి శారదా మఠానికి చెందిన పీఠం ఉంటుంది. పీఠాధిపతి ప్రతి రోజు ఆ పీఠాన్ని అర్చిస్తారు. నరసింహ వనంలోనే విదేహముక్తి పొందిన పూర్వ పీఠాధిపతుల స్మారక స్థూపాలు కూడా ఉన్నాయి. అభినవ విద్యాతీర్థ స్వామి, చంద్రశేఖర భారతి స్వామి స్థూపాలతో పాటు వారి విగ్రహాలు ఉంటాయి.
వసతి సౌకర్యాలు
[మార్చు]శృంగేరి మఠాన్ని సంప్రదిస్తే వసతి దొరుకుతుంది.
ప్రయాణ సౌకర్యాలు
[మార్చు]మంగళూరు నుండి తరచు బస్సు సౌకర్యం ఉంది. షిమోగా నుండి కూడా తరచు బస్సు సౌకర్యం ఉంది. శృంగేరి నుండి ఉడిపికి బస్సు ఆగుంబె అనే ఊరి మీదుగామలనాడు పర్వతశ్రేణుల మధ్య నుండి వెళ్తుంది. 24 సన్నటి హైర్ పిన్ ఘాట్ రోడ్డులో ఉడిపి చేరు కోవచ్చు.
ఇవికూడా చూడండి
[మార్చు]గ్యాలరీ
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "The legend of Rishyasringa". Sringeri Sharada Peeta. the original నుండి 2006-11-21 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2007-07-03.
- ↑ వెంకట శివరావు, దిగవల్లి (1944). కథలు-గాథలు (1 ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. pp. 127–140.
- ↑ "Falling Rain Genomics, Inc - Sringeri". the original నుండి 2009-05-23 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2007-07-03.
- ↑ "Sri Sharadamba Temple". Sringeri Sharada Peeta. the original నుండి 2006-11-06 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2007-07-03.
- ↑ "Sri Vidyashankara Temple". Sringeri Sharada Peeta. the original నుండి 2006-11-06 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2007-07-03.
- ↑ "Zodiacal pillars of Sringeri" (PDF). Current Science. Indian Academy of Sciences. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2006-03-25.
- ↑ "Vidyashankara Temple". Indiantemples.com. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2006-11-07.
బయటి లింకులు
[మార్చు]- శృంగేరి గురించి ఉపగ్రహముల నుండి గ్రహించిన విషయాలు Archived 2009-05-23 at the Wayback Machine
- Know more about Sringeri Temple Archived 2014-08-01 at the Wayback Machine
