Coordinates: 9°26′15″N 77°04′50″E / 9.4375°N 77.0805°E / 9.4375; 77.0805

శబరిమల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
  ?శబరిమల
 • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 9°26′15″N 77°04′50″E / 9.4375°N 77.0805°E / 9.4375; 77.0805
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం
ఎత్తు

• 914 మీ (2,999 అడుగులు)
జిల్లా (లు) పతనంతిట్ట జిల్లా జిల్లా
కోడులు
ప్రాంతీయ ఫోన్ కోడ్
వాహనం

• +0473
• KL-03
వెబ్‌సైటు: sabarimala.org.in


శబరిమల / శబరిమలై, కేరళ రాష్ట్రంలోగల ఒక ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రం. ఇక్కడ కొలువైన దేవుడు అయ్యప్ప, హిందువులు ఈయనను హరిహరసుతుడిగా భావించి పూజిస్తారు. ఈ ప్రదేశం పశ్చిమ కనుమల్లో నెలకొని ఉంది. కేరళ లోని పత్తినంతిట్ట జిల్లాలో సహ్యాద్రి పర్వత శ్రేణుల ప్రాంతం క్రిందకు వస్తుంది. గుడి సముద్ర మట్టం నుంచి సుమారు 3000 అడుగుల ఎత్తులో దట్టమైన అడవులు, 18 కొండల మధ్య కేంద్రీకృతమై ఉంటుంది. ఇక్కడికి యాత్రలు ప్రతీయేటా నవంబరు నెలలో ప్రారంభమై జనవరి నెలలో ముగుస్తాయి. ఇక్కడికి దక్షిణాది రాష్ట్రాల భక్తులే కాక ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. మండల పూజ (నవంబరు 17), మకరవిళక్కు (జనవరి 14) ఈ యాత్రలో ప్రధాన ఘట్టాలు. జనవరి 14 వ రోజును ఆలయంలో మకర జ్యోతి దర్శన మిస్తుంది. మిగతా అన్ని రోజుల్లోనూ గుడిని మూసే ఉంచుతారు. కానీ ప్రతీ మలయాళ నెలలో ఐదు రోజుల పాటు తెరచియుంచుతారు.

అయ్యప్ప మొదట శబరిమల పంబలో రాజా రాజశేఖర్‌కి దొరికాడు

అయ్యప్ప జననం, దేవాలయ నిర్మాణం[మార్చు]

శబరిమల ఆలయంలో మకర జ్యోతి, భక్తులు దీనిని ఒక అద్భుతం అని నమ్ముతారు.

ఛైత్రమాసము, ఉత్తరా నక్షత్రం, చతుర్ధశి - సోమవారము నాడు అయ్యప్ప స్వామి జన్మింఛినారు. జ్యోతి రూపంగా అంతర్ధానమయిన రోజు -- మకర సంక్రాంతి. క్షీరసాగరమధనం అనంతరం దేవతలకు, రాక్షసులకు అమృతం పంచేందుకు మహావిష్ణువు మోహినిగా అవతారం దరించి కార్యం నిర్వహిస్తాడు. తరువాత అదేరూపంలో విహరిస్తున్న మోహినిని చూసి శివుడు ఆమె పట్ల ఆకర్షింపబడతాడు. వారి కలయికతో శివకేశవుల తేజస్సుతో ధనుర్మాసము, 30వ రోజు శనివారం, పంచమి తిథి, ఉత్తరా నక్షత్రం వృశ్చికా లగ్నమందు శాస్త (అయ్యప్ప) జన్మించాడు. ఇతడు శైవులకు, వైష్ణవులకు ఆరాధ్య దైవం. తండ్రియైన జగత్పతి ఆజ్ఞ ప్రకారము పంపా సరోవర తీరప్రాంతంలో మెడలో మణిమాలతో శిశురూపంలో అవతరించాడు.

అదే సమయంలో దైవ ప్రేరణవలన వేట నిమిత్తం అటుగా వస్తాడు పందళ దేశాధీశుడు, గొప్ప శివభక్తుడు అయిన రాజశేఖరుడు. సంతానం లేక అల్లాడిపోతున్న తనను కరుణించి ఈశ్వరుడే ఆ శిశువును ప్రసాదించాడని తలంచిన రాజశేఖరుడు ఆనందంతో ఆ బిడ్డను అంతఃపురమునకు తీసుకువెళ్తాడు. ఆ శిశువును చూసి అతని రాణి కూడా ఎంతగానో ఆనందిస్తుంది. ఆయ్యప్ప అంతఃపురంలో అడుగుపెట్టిన వేళావిశేషము వలన ఏడాది తిరిగే సరికి రాజశేఖరుని భార్య మగబిడ్డను ప్రసవిస్తుంది. మణికంఠుని సాత్విక గుణాలవల్ల కొందరు 'అయ్యా' అని, మరికొందరు 'అప్పా' అని.. రెండు పేర్లూ కలిపి 'అయ్యప్ప'గానూ పిలిచేవారు. తగిన వయసురాగానే మహారాజు కొడుకులిద్దర్నీ గురుకులానికి పంపిస్తాడు. రాజ గురువు అయ్యప్పను అవతారపురుషునిగా గుర్తిస్తాడు. అయినా అయ్యప్ప కోరిక మేరకు కాదనలేక అరణ్య ప్రయాణానికి కావలసిన సామాగ్రిని సిద్ధం చేయిస్తాడు. గురుకులంలో విద్యనభ్యసించి వెనుకకు వచ్చిన అయ్యప్పకు రాజ్యపట్టాభిషేకం జరపాలని అనుకుంటాడు తండ్రి. తల్లికి అది ఇష్టం లేక తలనొప్పి అని నాటకమాడి వైద్యులతో వ్యాధి తగ్గుటకు పులిపాలు కావాలని చెప్పిస్తుంది. అప్పుడు, అయ్యప్ప నేను వెళ్ళి తీసుకువస్తానని చెప్పి బయలుదేరుతాడు. రాజు అయ్యప్పను పట్టాభిషిక్తుడిని చేయాలనుకొంటాడు. కాని తన తండ్రి ఇచ్చిన రాజ్యాన్ని వలదని మణికంఠుడు తనకు ఒక ఆలయం నిర్మించి ఇవ్వమని కోరాడు. అందుకు నియమం ఏమంటే తానొక బాణం వదులుతానని, ఆ బాణం ఎక్కడ పడితే అక్కడ తనకు ఆలయం నిర్మించాలని. అలా కట్టిన ఆలయం శబరిమలలో ఉంది. అక్కడ అయ్యప్ప స్థిరనివాసం ఏర్పరచుకొని తన భక్తుల పూజలందుకొంటున్నాడని భక్తుల విశ్వాసం.

దేవాలయంలో పూజలు, విధానాలు[మార్చు]

  • మేల్ శాంతి

శబరిమల దేవాలయంలో పూజలు జరిపించడానికి మేల్ శాంతిని (పూజారి) ప్రతి సంవత్సరం లాటరీ ద్వారా ఎన్నుకొంటారు. దేవస్థానంవారికి వచ్చిన దరఖాస్తులని పరిశీలించి పదింటిని సెలక్టు చేసి వారి పేర్లను రాసి ఒక డబ్బాలో ఉంచి, అయ్యప్ప విగ్రహం ముందుంచి ఒక చిన్నపిల్లవాని చేత లాటరీ తీయిస్తారు. ఎవరు పేరు వస్తే, వారు ఆ సంవత్సరనికి మేల్ శాంతిగా శబరిమలలో వ్యవహరిస్తారు.

స్వామి వారి ఆభరణాలను పందళంలో భద్రపరచి ఉంచుతారు. ప్రతీయేటా జనవరి 14 తారీఖునాటికి (మకరసంక్రాంతి) శబరిమల మూడుపెట్టెలలో పందళం నుండి 84 కిలోమీటర్లు ఆడవులలో నడుచుకొని మోసుకువస్తారు. ఈ ఆభరణాలు తేవడానికి పందళంలో భాస్కరన్ పిళ్ళే వారి కుటుంబం ఉంది. వీరు మొత్తం 11 మంది. దీక్షలో ఉండి (65 రోజులు) తిరువాభరణాలను శబరిమల మోసుకువస్తారు.

వీరు జనవరి 12 మధ్యాహ్నం పందళంలో బయలుదేరి మధ్యలో రెండు రాత్రిళ్ళు విశ్రాంతి తీసుకొని, 14 తారీఖున సాయంత్రం 6 గంటలకు శబరిమల సన్నిధానం చేరుతారు. ఆభరణాల వెంట పందళరాజు వంశస్తులలో పెద్దవాడు కత్తి పట్తుకొని నీలిమల వరకు వచ్చి అక్కడ విశ్రమిస్తాడు. తిరు ఆభరణాలు స్వామివారికి అలంకరించి కర్పూరహారతి గుళ్ళో ఇవ్వగానే తూరుపుదిక్కు పొన్నంబలమేడు నుండి భక్తులకు జ్యోతి దర్శనం అవుతుంది. పదునెనిమిది మెట్లు ఎక్కడానికి ఇరుముడి లేకుండా తాంత్రీ, పందళరాజు, తిరువాభరణాలు మోసేవారు ఎక్కుతారు. మరల జరవరి 20వ తారీఖునాడు పందళరాజు వెంటరాగా తిరువాభరణాల మూడు పెట్టెలను తిరిగి పందళం తీసుకు వెళ్ళి భద్రపరుస్తారు.

శబరిమలై యాత్ర, మార్గ విశేషాలు[మార్చు]

అయ్యప్ప పూజా విధానము

కేరళలోనే ఉన్న ఈ ఆలయం దేశ వ్యాప్తంగా భక్తులు కలిగిన ఆలయం: దీక్ష వహించిన అయ్యప్ప భక్తులు ఏట నవంబరు నుండి జనవరి వరకు ఇక్కడికి వచ్చి తమ దీక్షను విరమిస్తుంటారు. ఆ సమయంలో ఈ ఆలయానికి డెబ్బై ఐదు కోట్ల రూపాయలు వస్తుంది. ఇక్కడ ఆలయంలో తయారు చేసే ప్రసాదం అమ్మకం ద్వారా ఏటా ముప్పై కోట్ల రూపాయలు వస్తుంది. ఈ ఆలయ వార్షికాదాయం ఒక వంద కోట్ల రూపాయలు. ఈ ఆలయ అస్తులను 30 కోట్ల రూపాయలకు భీమా చేశారు. ఈ భీమాలో ఆలయ పైకప్పుకు వేసిన బంగారపు పూతకు, ప్రాంగణంలో భవనాలకు, స్వామి వారి నగలకు, పనిచేసే ఉద్యోగులకు, భక్తులకు వర్తిస్తుంది, ఇందు కొరకు దేవస్థానం 14.75 లక్షల రూపాయలను ప్రీమియంగా చెల్లిస్తున్నది. అయ్యప్ప హిందూ దేవతలలో ఒకడు. ఈయనను హరిహరసుతుడని, మణికంఠుడని కూడా పిలుస్తారు. అయ్యప్ప పూజా సాంప్రదాయం అధికంగా దక్షిణ భారతదేశంలో ఉంది. అయ్య (= విష్ణువు), అప్ప (= శివుడు) అని పేర్ల సంగమంతో 'అయ్యప్ప' నామం పుట్టింది. మహిషి అనే రాక్షసిని చంపి అయ్యప్ప శబరిమలైలో వెలిశాడు. కేరళలోని శబరిమలై హిందువుల ప్రధాన యాత్రా స్థలాలలో ఒకటి. శబరిమలైలో అయ్యప్పను బ్రహ్మచారిగా పూజిస్తారు. sబరిమలైలోని ప్రధాన దేవాలయమే కాకుండా అనేక దేవాలయాలున్నాయి. కేరళలోనే "కుళతుపుళ"లో ఇతనిని బాలుని రూపంలో అర్చిస్తారు. "అచ్చన్ కోవిల్"లో పుష్కల, పూర్ణ అనే దేవేరులసమేతుడైన అయ్యప్పను పూజిస్తారు. శబరిమలైలోని అయ్యప్ప సన్నిధికి యేటా ఐదుకోట్లమంది భక్తులు దర్శనార్ధులై వెళుతుంటారు. దీక్ష స్వీకరించి నియమాలతో మండలం గడిపిన భక్తులు శబరిమలై యాత్ర చేస్తారు. ఈ దీక్ష స్వామి సన్నిధాన సందర్శనంతో ముగుస్తుంది.

పూర్వం  శబరిమల వెళ్ళడానికి ఎరుమేలిమార్గం అనే ఒకే ఒక దారి ఉండేది. నెలసరి పూజలకు ప్రత్యేకపూజలకు ఆలయ సిబ్బంది, తాంత్రి, మేల్ శాంతి ఈ మార్గంలో వెళ్ళివచ్చేవారు. పూర్తిగా అటవీ ప్రాంతం కావడంతో శబరిమల యాత్రకి బృందాలుగా వెళ్ళడం అప్పటి నుండి ఆనవాయితీగా వస్తోంది.

సుమారు 200 సంవత్సరాల క్రితం అంటే (1819) లో 70 మంది శబరిమల యాత్ర చేసారని, ఆ సంవత్సర ఆదాయం ఏడురూపాయలని పందళరాజు వంశీయుల రికార్డులలో ఉంది. 1907వ సంవత్సరంలో శబరిమలలో అయ్యప్ప దేవాలయం పైకప్పు (గర్భగుడి) ఎండుగడ్డి, ఆకులతో కప్పబడివుండేది. అప్పుడు అక్కడ శిలా విగ్రహానికే పూజలు జరిగేవి. 1907-1909 మధ్యకాలంలో దేవాలయం అగ్నికి ఆహుతి అవడంతో మరల దేవాలయాన్ని పునఃనిర్మించినట్లు తెలుస్తోంది.

ఈసారి శిలా విగ్రహానికి బదులు, అయ్యప్ప విగ్రహాన్ని పంచలోహాలతో తయారు చేసి ప్రతిష్ఠించారు. పంచలోహావిగ్రహం ప్రతిష్ఠించాకే శబరిమల వైభవం పెరిగింది. ఈ దేవాలయం 1935 వరకు తిరువాంకూరు మహారాజా సంస్థానంవారి ఆధీనంలో ఉండేది. 1935లో దీనిని తిరువాంకూరూ దెవస్థానం బోర్డువారికి అప్పగించబడింది. ఆ తరువాతే భక్తుల సంఖ్య గణనీయంగా పెరగడంతో జ్యోతి దర్శనానికే కాకుండా మండల పూజ కొరకు కూడా శబరిమలలో దేవాలయం తెరవడం మొదలుపెట్టారు.

చాలక్కాయమార్గం, వడిపెరియారు మార్గం ఏర్పడి తరువాత పంబా ప్రాజెక్టు నిర్మాణంలో శబరిమలకు వచ్చే భక్తుల రద్దీ పెరిగింది. అనంతరం 1945వ సంవత్సరం నుండి భక్తుల సంఖ్య ఇంకా పెరగడంతో విషు, పంకుని ఉత్తారం, ఓణం వంటి పండుగదినాలలో కూడా తెరవడం ప్రారంభించారు.

శబరిమలకు వచ్చే భక్తులు పెరగడంతో 1980 నుండి దేవస్థానం బోర్డువారు శ్రద్ధ తీసుకొని పంబపై వంతెన, పంబ నుండి విద్యుద్దీపాలు, మంచి నీటి కొళాయిలు, స్వాముల విశ్రాంతి కోసం పెద్ద షెడ్లు నిర్మించారు.

1984 వరకు పదునెట్టాంబడిని ఎక్కడానికి పరశురామ నిర్మితమయిన రాతిమెట్లపైనుండే ఎక్కేవారు. వారువెళ్ళే పడిని బట్టి ఆ మెట్టుపై కొబ్బరికాయ కొట్టి మెట్లు ఎక్కే ఆచారం ఉండేది. మెట్లు అరిగిపోయి, అన్ని మెట్లపై కొబ్బరికాయలు కొట్టడం వలన భక్తులు అనేక ఇబ్బందులకు గురికావడం చూసి, భక్తుల విరాళాలతో పదునెట్టాంబడికి 1985వ సంవత్సరంలో పంచలోహ కవచాన్ని మంత్రతంత్రాలతో కప్పడం జరిగింది. దీనివలన 18 మెట్లు ఎక్కడం సులభరతమైంది. భక్తుల రద్దీ పెరగడం వలన తొక్కిసలాటలు లేకుండా ఉండటానికి వీలుగా, 1982లో ప్లై ఓవరు బ్రిడ్జి కట్టి దానిపై నుండి పదునేట్టాంబడి ఎక్కిన తర్వాత క్యులో వెళ్ళడానికి ఏర్పాటు చేసారు.

కొండపైనుండి మాలికాపురత్తమ్మ గుడివరకు ప్లైఓవరుబ్రిడ్జి కట్టడం వలన యాత్రీకులు తిరగడానికి వీలుగావుంది. 1989-90లోనే పంబామార్గంలో కొంతభాగం, సన్నిధానం ఆవరణలో మొత్తం భాగం సిమెంటు కాంక్రీటు చేసి, బురద లేకుండా చేసి భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి అనువుగా తయారు చేసారు.

1985 నుండి పక్కా బిల్డింగులెన్నో అక్కడ నిర్మించబడి, శబరిమల స్వరూపాన్ని మార్చాయి. బెంగళూరు భక్తుడొకరు శబరిమలగర్భగుడిపైన, చుట్టూ బంగారు రేకులతో తాపడం చేయడానికి పూనుకొని 2000 సంవత్సరంలో పూర్తిచేయడంతో శబరిమల స్వర్ణదేవాలయంగా మారింది.

శబరిమలలో వంశపారంపర్య ముఖ్యపూజారిని తాంత్రి అని పిలుస్తారు.పరశురాముడు పూజ కొరకు ఆంధ్రాలోని తూర్పుగోదావరి జిల్లాలోని హరిహరుల కలయిక జరిగిన ప్రదేశం అయిన ర్యాలీ గ్రామంలో ఉన్న భట్టురాజుల వంశీయులను తీసుకెళ్ళారని చెబుతారు.

అయ్యప్ప దీక్ష, విధానాలు, నియమాలు[మార్చు]

ఈ యాత్రను చేయదలచిన వారు అత్యంత శ్రద్ధా భక్తులతో కొన్ని కఠోర నియమాలను పాటించాల్సి ఉంటుంది. మండల పూజకు హాజరయ్యే వారు తప్పని సరిగా 41 రోజుల పాటు దీక్ష చేపట్టాలి. సాధారణంగా ఈయాత్రలు స్వాములు ఒక గురుస్వామి (5 సార్ల కంతే ఎక్కువ సార్లు మాల దరించి న వాల్లు) నాయకత్వంలో ఒక బృందంగా బయలు దేరి వెళతారు. ప్రతి ఒక్కరూ తమ తలపై ఇరుముడి కెట్టు (గుడ్డతో చుట్టిన పూజా సామాగ్రి) ఉంచుకుని యాత్ర చేయాల్సి ఉంటుంది..

భక్తులు కార్తీకమాసం నుండి దాధాపు మార్గశిర పుష్య మాసాల వరకు దృఢమైన నియమాలను ఆచరిస్తూ ఉంటారు. ఐహికమైన సౌఖ్యాలను పరిత్యజించడం, మధ్య మాంస ధూపమపానాది వ్యసనాలకు దూరంగా ఉండడం, స్వామి చింతనలో స్వామి భక్తులతో సమయం గడపడం, సాత్విక జీవనం అవలంబించడం ఈ దీక్షలో ముఖ్య లక్షణాలు. వీరి దినచర్య తెల్లవారు ఝామున లేచి చన్నీటి స్నానం చేయడంతో మొదలవుతుంది. నల్లని వస్త్రాలు, తులసిమాల, నుదుట విభుదిపై గంధం బొట్టు ధరిస్తారు. దినంలో అధిక భాగం పూజ భజనాది కార్యక్రమాలలో గడుపుతారు. కటికనేల మీద పడుకొంటారు. అందరినీ "స్వామి" అని సంబోధిస్తారు. దుర్భాషణాలకు దూరంగా ఉంటారు. ఇలా ఒక మండలం పాటు నియమాలతో గడుపుతారు. ఇలా అయ్యప్ప స్వామి దీక్షకు ఒక స్పష్టమైన, కొంత క్లిష్టమైన విధానం రూపు దిద్దుకొంది. దీక్ష తీసుకోవాలనుకొనే భక్తుడు గురుస్వామి (సీనియర్ స్వామి) వద్దనుండి ఉపదేశంతో మాలను ధరిస్తాడు. మాలా ధారణ అనంతరం తన మనస్సునూ, శరీరాన్ని భగవంతునికి అంకితం చేయాలి. అందరినీ భగవంతుని రూపాలుగా భావించాలి. అయ్యప్ప శరణు ఘోషను విడువకూడదు. నిత్యం భజన కార్యక్రమంలో పాల్గొనాలి.

ఎరుమేలి

శబరిమలై యాత్ర "ఎరుమేలి"తో మొదలవుతుంది. ఎరుమేలిలో "వావరు స్వామి"ని భక్తులు దర్శించుకొంటారు. (అయ్యప్ప పులిపాలకోసం అడవికి వెళ్ళినపుడు అతనిని అడ్డగించిన ఒక దొంగ అనంతరం స్వామి సన్నిహిత భక్తునిగా మారాడు. అతడే వావరు స్వామి. "నన్ను దర్శించుకోవాలని వచ్చిన భక్తులు ముందుగా నిన్ను దర్శించుకొంటారు" అని అయ్యప్ప వావరుకు వరమిచ్చాడట. ఈ వావరు స్వామి ఒక ముస్లిం కులస్తుడు. ఈ వావరు ఇక్కడ కొలువున్నది కూడా ఒక మసీదులోనే) దర్శనానంతరం భక్తులు వావరుస్వామి చుట్టూ రకరకాల వేషధారణతో "పేటై తులాల" అనే నాట్యం చేస్తారు. (మహిషితో యుద్ధం చేసేటపుడు అయ్యప్ప చేసిన తాండవం పేరు "పేటై తులాల"). ఈ ఎరుమేలి వద్ద ఉన్న "ధర్మశాస్త" ఆలయంలో అయ్యప్ప స్వామి ధనుర్బాణధారియై ఉంటాడు. ఇక్కడ వినాయకుడు కూడా కొలువై ఉంటాడు. ఈయనను "కన్నెమూల గణపతి" అని అంటారు. ఇక్కడ భక్తులు కొబ్బరికాయ కొడతారు.

పాదయాత్ర

ఇక్కడినుండి భక్తుల పాదయాత్ర మొదలవుతుంది. పాదయాత్రకు రెండు మార్గాలున్నాయి. "పెద్ద పాదం" అనేది కొండలమధ్య దట్టమైన అరణ్యంలో ఉన్న కాలిబాట. ఇది 48 to 52 కిలోమీటర్ల దారి. దారిలో పెరుర్‌తోడు, కాలైకట్టి అనే స్థలాలున్నాయి. (మహిషితో అయ్యప్పస్వామి యుద్ధం చేస్తుండగా కాలైకట్టివద్దనుండి శివకేశవులు యుద్ధాన్ని చూశారట). ఇక్కడికి కొద్ది దూరంలోనే అళదా నది (మహిషి కార్చిన కన్నీరు నదీరూపమైందట) ఉంది. ఈ నదిలో స్నానం చేసి భక్తులు నదినుండి ఒక రాయిని తీసుకు వెళతారు. ఆ రాతిని "కళిద ముకుంద" (మహిషి కళేబరాన్ని పూడ్చిన చోటు) వద్ద పడవేస్తారు. తరువాత యాత్ర ముందుకు సాగి కరిమల, పెరియానపట్టమ్, చెరియానపట్టమ్ అనే స్థలాలగుండా పంబ నది చేరుకొంటుంది. అక్కడే "పంబ" అనే గ్రామం కూడా ఉంది. ఇక్కడినుండి స్వామి సన్నిధానానికి ఏడు కిలోమీటర్ల దూరం. చిన్నపాదం మార్గంలో బస్సులు కూడా తిరుగుతాయి. బస్సులపై పంబానది వరకు చేరుకోవచ్చు. చివరి ఏడు కిలోమీటర్లు మాత్రం కాళినడకన వెళ్ళాలి.

సన్నిధానం
శబరిమలైలో దర్శనానికి వేచిఉన్న భక్తులు.
శబరిమలైలో దర్శనానికి వేచిఉన్న భక్తులు.

భక్తులు పంబానదిలో స్నానం చేసి "ఇరుముడి"ని తలపై పెట్టుకొని అయ్యప్ప శరణు ఘోషతో "నీలిమలై" అనే కొండ మార్గం ద్వారా ప్రయాణిస్తారు. కన్నెస్వాములు (తొలిసారి దీక్ష తీసుకొన్నవారు) తమతో తెచ్చిన ఒక బాణాన్ని దారిలో "శరమ్ గుత్తి" అనే చోట ఉంచుతారు. ఇక్కడినుండి అయ్యప్ప సన్నిధానానికి ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది.

సన్నిధానం వద్ద ఉన్న 18 మెట్లను "పదునెట్టాంబడి" అంటారు. 40 రోజులు దీక్ష తీసుకొని ఇరుముడి ధరించినవారు మాత్రమే ఈ మెట్లు ఎక్కేందుకు అర్హత కలిగి ఉంటారని కథనం. ఒక్కో మెట్టుకు ఒక్కో అధిష్టాన దేవత ఉంటుంది. సన్నిధానానికి, 18 మెట్లకు నమస్కరిస్తూ స్తోత్రాలు పఠిస్తూ మెట్లను ఎక్కుతారు. ఈ ఆళయంలో స్వామి కొలువైన సందర్భంగా 18 వాయిద్యాలను మ్రోగించారట. సన్నిధానంలో "పానవట్టం"పైన అయ్యప్ప కూర్చుని ఉన్న భంగిమలో దర్శనమిస్తాడు. స్వామియే శరణం అయ్యప్ప స్వామి కూర్చున్న తీరు శివలింగాన్ని తలపిస్తుందని. ఒంపు తిరిగిన ఎడమచేయి మోహిని అవతారాన్ని తెలియజేస్తుందని చెబుతారు.

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
"https://te.wikipedia.org/w/index.php?title=శబరిమల&oldid=4084884" నుండి వెలికితీశారు