స్వామిమలై
స్వామిమలై తమిళనాడులో గల తంజావూర్ జిల్లాలో కుంభకోణం సమీపంలో ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరు ప్రఖ్యాత క్షేత్రములలో ఐదవది. ఇక్కడ ప్రణవ రహస్యాన్ని పరమిశివుడికి చెప్పాడు సుబ్రహ్మణ్యుడు. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారిని స్వామినాథ స్వామి అని కొలుస్తారు. స్వామినాథ అంటే గురు స్వరూపం. అసలు స్వామి అనే మాట అమరకోశం ప్రకారం ఒక్క సుబ్రహ్మణ్యుడిదే. ఎందుచేతనంటే “దేవసేనాపతీ, శూరః, స్వామీ, గజముఖానుజః “ అని అర్ధంగా ఇవ్వబడింది. తరువాత స్వామి అనే పేరు వేరే స్వరూపాలు కూడా తీసుకున్నా, అన్నీ సుబ్రహ్మణ్య స్వరూపాలే అని అనుకోవాలి. అందుకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని పిలిచినా, కేవలం స్వామీ అని పిలిచినా అది సుబ్రహ్మణ్యుడికే చెందుతుంది అని చెప్పింది అమరకోశం. అటువంటి మహానుభావుడు స్వామిమలైలో వెలిసి ఉన్నాడు.
సుబ్రహ్మణ్య మందిరం[మార్చు]
ఈ క్షేత్రము అరవై మెట్లు ఉన్న ఒక కొండ మీద ఉంటుంది. ఈ అరవై మెట్లు మన అరవై సంవత్సరాలకు సంకేతము. కొండ పైన సుబ్రహ్మణ్యుని మందిరం వెలుపల విఘ్నేశ్వర స్వామి వారి మందిరం ఉంటుంది. ఎవరైనా స్వామి వారి యొక్క ఆర్జిత సేవలు చేసుకోవడానికి లోపలి వెళ్ళే ముందు, విఘ్నేశ్వరుని వద్ద సంకల్పము చేసుకుని లోపలకి వెడతారు. స్వామినాథ స్వామి వారిని కీర్తిస్తూ శ్రీ నక్కీరన్ ఆయన చేసిన “ తిరుమురుకాట్రుపడై “లో ఎన్నో కీర్తనలు చేశారు. అంతే కాక అరుణగిరినాథర్ “తిరుప్పుగళ్”లో కూడా స్వామినాథ స్వామిని కీర్తించారు.
స్థల పురాణము[మార్చు]
పూర్వము ఒకనాడు చతుర్ముఖ బ్రహ్మ గారు కైలాసం వైపు వెడుతూ వుండగా, సదా చిద్విలాసంతో ఉండే నా తండ్రి సుబ్రహ్మణ్యుడు, బ్రహ్మ గారిని ఆపి “ బ్రహ్మమనగా ఏమి?, ప్రణవమునకు అర్ధం తెలుసా? “ అని అడిగారు.
చతుర్ముఖ బ్రహ్మ గారు అన్నారు, “ బ్రహ్మము అనగా నేనే “.
వెంటనే కార్తికేయుడు, మీరు నాలుగు ముఖములతో వేదములు చెప్తున్నారు కాని, బ్రహ్మము అర్ధం కాలేదు అని బ్రహ్మ గారిని చెరసాలలో బంధించారు. వెంటనే పరమశివుడు వచ్చి, “నాన్నా, బ్రహ్మ గారికి జ్ఞానములో కించిత్ దోషం ఉండవచ్చు, అంత మాత్రాన కారాగారములో పెట్టకూడదు. ఆయనని విడిచి పెట్టేయి” అని చెప్పగా, సుబ్రహ్మణ్య స్వామి వారు వెంటనే బ్రహ్మ గారిని విడిచిపెడతారు.
అంతే కాక, సుబ్రహ్మణ్యుడు శంకరుడితో అంటారు, “ నేను ఎంత మీ కుమారుడనైనా, బ్రహ్మ గారిని అలా అవమానించకూడదు” అని, దీనికి ప్రాయశ్చిత్తంగా సర్ప రూపం దాల్చి భూలోకంలో వచ్చి ఉన్నారు . అలా ఉండగా పిల్లలూ, అందరూ వచ్చి రాళ్ళతో కొడుతూ ఉంటే, పార్వతీ దేవికి ఈ విషయం తెలిసి షష్ఠీ వ్రతం చేయించింది. దానితో ఆయన పాపం తొలగి పూర్తి తెజోమయుడైన సుబ్రహ్మణ్య రూపం వచ్చిందని అంటారు పెద్దలు.
పరమశివునికీ ప్రణవ ఉపదేశం[మార్చు]
ఒకానొక సమయంలో సుబ్రహ్మణ్య స్వామి వారు, పరమశివునికి ప్రణవము ఉపదేశం చేశారు స్వామిగా. ఇది ఎంతో చిత్రంగా ఉంటుంది, శంకరుడు సకల జ్ఞానములకు ఆలవాలము. ఈశానః సర్వ విద్యానాం అంటారు కదా. ఇక్కడ దీని అంతరార్ధము ఏమిటంటే, ఏ తండ్రి అయినా తన కొడుకు చేతిలో ఓడిపోవడం ఇష్టపడతాడు. కొడుకు చేతిలో తండ్రి ఓడిపోతే అది తనకి గొప్ప సన్మానముగా భావిస్తాడు తండ్రి. లోకానికంతటికీ జ్ఞానమునిచ్చే తండ్రికి, తన తేజస్సుతో పుట్టిన పుత్రుడు జ్ఞాన బోధ చేయడం అనేది ఎంతో ఆనందదాయకమైన విషయము.
స్వామిమలైలో సుబ్రహ్మణ్య స్వామి వారి మందిరం పైన ఉంటంది, క్రింద, మీనాక్షీ, సుందరేశ్వరుల మందిరములు ఉంటాయి. ఇక్కడే అగస్త్య మహర్షికి ద్రవిడ వ్యాకరణం బోధించారు సుబ్రహ్మణ్యుడు.
ఈ క్షేత్రమును చేరే మార్గములు[మార్చు]
స్వామిమలై తమిళనాడు లోని కుంభకోణం నుంచి తంజావూర్ వెళ్ళే దారిలో ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది.
- రోడ్ ద్వారా: తిరుచిరాపల్లి నుండి తొంభై కిలోమీటర్ల దూరంలో ఉంది. తిరుచిరాపల్లి, మధురై, చెన్నై, బెంగళూరు నగరాల నుండి అనేక బస్సులు ఉన్నాయి. KSRTC ప్రతీ రోజూ బెంగళూరు నుంచి కుంభకోణంకి బస్సులు నడుపుతుంది.
- రైలు ద్వారా: కుంభకోణం రైల్వే స్టేషను తంజావూరు-మయిలాడుదురై మార్గములో ఉంది. ఇక్కడ నుండి చెన్నైకి ప్రతీ రోజూ అనేక రైళ్ళు నడుస్తాయి. (ఉళవన్, మన్నై, ఎక్స్ ప్రెస్ మొదలగునవి )
- విమానము ద్వారా: దగ్గరలో విమానాశ్రయములు తిరుచిరాపల్లి ( 90 కి.మీ. ), మధురై ( 234 కి.మీ. ), చెన్నై ( 285 కి.మీ. ), బెంగళూరు ( 438 కి.మీ. ) దూరంలో ఉన్నాయి.
వసతి సదుపాయము[మార్చు]
స్వామిమలై క్షేత్రం కుంభకోణం నుండి చాలా దగ్గరలో ఉండడం వల్ల, వసతి కుంభకోణంలో చూసుకోవడమే ఉత్తమం. స్వామిమలైలో అంత ఎక్కువగా వసతి సదుపాయాలూ లేవు. కుంభకోణం కూడా ప్రఖ్యాత పుణ్య క్షేత్రము అవడం వల్ల ఇక్కడ ఎన్నో హోటళ్ళు ఉన్నాయి.
ఆలయంలో ఆర్జిత సేవలు[మార్చు]
స్వామిమలైలో ప్రతీ రోజూ స్వామి వారికి అభిషేకం చేస్తారు. మేము వెళ్ళినప్పుడు ఉదయం తొమ్మిదిన్నర అయ్యింది, అప్పటికే ఒక అభిషేకం జరిగింది. మళ్ళీ పదకొండు గంటలకు మొదలు అయ్యింది. స్వామి వారిని అలంకరణ లేకుండా చిన్న కౌపీనం మాత్రం ఉంచి వేద మంత్రాలు చదువుతూ, పంచామృతాలతో అద్భుతంగా చేస్తారు ఈ అభిషేకం. అభిషేకంలో మన పురుషార్ధంతో ద్రవ్యాలు ఏమైనా ఇచ్చినా వాటితో కూడా చేస్తారు. ఈ అభిషేకం దర్శనం కోసం వెయ్యి రూపాయలు టికెట్. సుబ్రహ్మణ్య అభిషేకం చూడడం అంటే అమ్మవారి, అయ్యవారి ఇద్దరి అభిషేకం ఒకేసారి చూసినట్టు అన్నమాట. అందులోనూ ఇక్కడ స్వామినాథ స్వామి చిన్న కౌపీనంతో తన చేతిలో శక్తిఆయుధం పట్టుకుని చిన్న పిల్లవాడిలా ముద్దుగా కనబడతారు. సమయము, అవకాశము ఉన్న వారు తప్పకుండా చూడవలసినది స్వామి వారి అభిషేకం.