వేములవాడ
Vemulawada | |
---|---|
![]() | |
ముద్దుపేరు(ర్లు): Emulaada | |
నిర్దేశాంకాలు: 18°28′N 78°53′E / 18.467°N 78.883°ECoordinates: 18°28′N 78°53′E / 18.467°N 78.883°E | |
Country | India |
State | Telangana |
District | Rajanna Sircilla district |
స్థాపించిన వారు | Chalukyas |
ప్రభుత్వం | |
• ప్రభుత్వ రకం | Municipal council |
• నిర్వహణ | Vemulawada Municipal Council; Vemulawada Temple Area Development Authority |
విస్తీర్ణం | |
• మొత్తం | 28.89 km2 (11.15 sq mi) |
జనాభా వివరాలు (2011) | |
• మొత్తం | 33,706 |
• సాంద్రత | 1,200/km2 (3,000/sq mi) |
Languages | |
• Official | Telugu |
కాలమానం | UTC+5:30 (IST) |
పిన్కోడ్ | 505302 |
Lok Sabha constituency | Karimnagar |
Assembly constituency | Vemulawada |
జాలస్థలి | http://www.vemulawadatemple.org |
వేములవాడ, తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ మండలానికి చెందిన గ్రామం.[2]. దీని పరిపాలన నిర్వహణ వేములవాడ పురపాలక సంఘం నిర్వహిస్తుంది. 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత కరీంనగర్ జిల్లాలో, ఇదే మండలంలో ఉండేది. [3]ఇది 2011 సెస్టెంబరు 3న వేములవాడ పురపాలకసంఘంగా ఏర్పడింది.[4] ఇది కరీంనగర్కు 32 కిమీ ల దూరంలో కరీంనగర్-కామారెడ్డి దారిలో ఉంటుంది.
చరిత్ర[మార్చు]
ఈ పురాతన గ్రామం పశ్చిమ చాళుక్యుల కాలం నుండి ఉన్నదని ఇక్కడ లభించిన పురాతత్వ ఆధారాలను బట్టి తెలుస్తోంది. పశ్చిమ చాళుక్యులు నిర్మించిన రాజరాజేశ్వర స్వామి దేవాయం వేములవాడ ప్రసిద్ధి చెందింది. చారిత్రక ప్రసిద్ధి కలిగిన ఈ దేవాలయానికి సుదూర ప్రాంతాల నుండి యాత్రికులు వస్తూ ఉంటారు. ఈ ప్రాంతాన్ని పాలించిన మొదటి నరసింహుడుకు రాజాదిత్య అనే బిరుదు ఉండేది. ఆ బిరుదు పేరిట గాని, లేదా అతడు కట్టించినందువలన గాని ఈ దేవాలయానికి ఈ పేరు వచ్చిందని భావిస్తున్నారు. రాజాదిత్య మొదటి వినయాదిత్య యుద్ధమల్లుని మనుమడు. దేవాలయానికి ఉత్తరాన ధర్మగుండం అనే కోనేరు ఉంది. గ్రామాన్ని ఆనుకుని ప్రవహించే వాగు ఈ కోనేటికి నీటి వనరు. వద్దేగేశ్వర స్వామి దేవాలయము కూడా ఇక్కడ ఉంది.మధ్యయుగాల్లో ఇది వేములవాడ చాళుక్యులకు రాజధానిగా ఉండేది. పుణ్యక్షేత్రంగానూ, వ్యాపార కేంద్రంగానూ కూడా వేములవాడ 11 శతాబ్ది నాటికే పేరొందింది.
1830ల్లో కాశీయాత్రలో భాగంగా నాటి నైజాం ప్రాంతాలలో మజిలీ చేస్తూ వెళ్ళిన ఏనుగుల వీరాస్వామయ్య ఈ పుణ్యక్షేత్రాన్ని గురించి తన కాశీయాత్రచరిత్రలో ప్రస్తావించారు. తన యాత్రామార్గంలోని మజిలీల్లో ఇక్కడికి సమీపమైన మజిలీ జగనంపల్లి (డిచ్పల్లి సమీపంలోని గ్రామం) గురించి వ్రాస్తూ అక్కడికి 4 మజిలీల దూరంలో వేములవాడ ఉన్నదని వ్రాశారు. అది మహాక్షేత్రమని, రాజేశ్వర క్షేత్రమని పేర్కొన్నారు. అప్పట్లో ఈ ప్రాంతానికి పులుల భయం తీవ్రంగా ఉండేదని, కోడెలను పులులు బాధించేవని పేర్కొన్నారు.[5]
శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం[మార్చు]
శివరాత్రి రోజున మూడు లక్షలకు పైగా భక్తులు రాజరాజేశ్వర స్వామిని సేవించుకుంటారు. ఆ రోజున ప్రత్యేక పూజలు జరుపుతారు. రాత్రివేళ దీపాలంకరణలతో దేవాలయం దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటుంది. భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. విద్యార్థులకు ఉచిత వసతి, భోజన ఏర్పాట్లు చేస్తారు. ఇంకా, ఈ దేవాలయం ఇతర చిన్న ఆలయాలకు దానధర్మాలు చేస్తుంది.రాష్ట్రంలో అత్యధిక ఆదాయం గల దేవాలయాల్లో ఇది ఒకటి.దేవస్థానం గ్రామాభివృద్ధి నిమిత్తం సంవత్సరానికి రూ. 8 లక్షలు ఖర్చు పెడుతుంది దేవస్థానం.కాశీ, చిదంబరం, శ్రీశైలం, కేదారేశ్వరం లను పావనం చేసిన తరువాత శివుడు వేములవాడ వేంచేసాడని పురాణ కథనం.ఇక్కడ కొలువై ఉన్న స్వామిని శ్రీ రాజ రాజేశ్వర స్వామి అని, రాజన్న అనీ అంటారు. మూలవిరాట్టుకు కుడి పక్కన శ్రీ రాజ రాజేశ్వరీ దేవి, ఎడమ పక్కన శ్రీ లక్ష్మీ సహిత సిద్ధి వినాయక విగ్రహాలు ఉంటాయి. ధర్మగుండం కోనేటిపై మూడు మండపాలు నిర్మించబడ్డాయి. మధ్య దానిపై ఈశ్వరుని విగ్రహం ప్రతిష్ఠించబడింది. ధ్యాన ముద్రలో ఉన్న శివుని విగ్రహం చుట్టూ ఐదు శివలింగాలు ఉంటాయి.
స్థలపురాణం[మార్చు]
భాస్కర క్షేత్రంగా, హరిహర క్షేత్రంగా పిలవబడే ఈ క్షేత్రం గురించి భవిష్యోత్తర పురాణంలోని రాజేశ్వరఖండంలో చెప్పబడింది. అర్జునుడి మునిమనవడైన నరేంద్రుడు ఒక ఋషిని చంపటం వల్ల కలిగిన బ్రహ్మహత్యాపాతకాన్ని వదిలించుకోడానికి దేశాటన చేస్తూ ఇక్కడికి చేరుకున్నాడట. ఇక్కడి ధర్మగుండంలో స్నానం చేసి, జపం చేస్తున్న నరేంద్రుడికి కొలనులో శివలింగం దొరికిందట. కొలను సమీపంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించిన నరేంద్రుడికి శివుడు ప్రత్యక్షమై బ్రహ్మహత్యాపాతకం నుంచి విముక్తి కలిగించాడట. ఆ శివలింగమే ఇప్పుడున్న మూలవిరాట్టని స్థలపురాణం.
ఆలయప్రత్యేకతలు[మార్చు]
- శివరాత్రి రోజున వంద మంది అర్చకులతో మహాలింగార్చన జరుగుతుంది. అమావాస్య దాటి ఏకాదశి మొదలైన అర్ధరాత్రివేళ శివునికి ఏకాదశ రుద్రాభిషేకం చేస్తారు.
- ఇక్కడ భక్తులు చేసే పూజల్లో ప్రముఖమైంది కోడె మొక్కు . భక్తులు గిత్తను తీసుకొచ్చి గుడి చుట్టూ ప్రదక్షిణ చేయించి ప్రాంగణంలో కట్టేసి, ఆ గిత్తను దేవాలయానికిదక్షిణగా ఇచ్చేస్తారు. దీనివల్ల సంతానప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు. పవిత్రమైన గండ దీపాన్ని వెలిగించడం కూడా ఎంతో పుణ్యకరమని భక్తులు భావిస్తారు.
- శైవులు, వైష్ణవులు, జైనులు, బౌద్ధులు అందరూ ఈ దేవాలయాన్ని దర్శిస్తారు. దేవాలయంపై ఉన్న శిల్పాలు కూడా జైన, బౌద్ధ సంస్కృతులను ప్రతిబింబిస్తూ ఉంటాయి.
- దేవాలయ ప్రాంగణంలో 400 ఏళ్ళ నాటి మసీదు ఉంది. ఇస్లాం మతానికి చెందిన ఒక వ్యక్తి స్వామి మూర్తి విగ్రహాన్ని అవమానించాడు ,కోపోద్రిక్తులైన భక్తులు అతడిని అక్కడికక్కడే చంపేశారు,ఈ విషయం తెలుసుకున్న ఆ ప్రాంత ముస్లిం పాలకుడు అతడు ఎక్కడైతే మరణించాడో అక్కడే పూడ్చి మాజార్ కట్టించాడు.
వివిధ మతాల భక్తుల దర్శన స్థలం[మార్చు]
శైవులు, వైష్ణవులు, జైనులు, బౌద్ధులు అందరూ ఈ దేవాలయాన్ని దర్శిస్తారు. దేవాలయంపై ఉన్న శిల్పాలు కూడా జైన, బౌద్ధ సంస్కృతులను ప్రతిబింబిస్తూ ఉంటాయి.
విశేషాలు[మార్చు]
- వేములవాడ గుడి ఆధ్వర్యంలో 1956 నుంచి వేములవాడ, కరీంనగర్, ధర్మపురిలలో సంస్కృత విద్యాసంస్థల నిర్వహణ జరుగుతున్నది. వేములవాడలో డిగ్రీస్థాయి వరకు సంస్కృత భాష బోధించబడుతున్నది.
- అంతే కాకుండా ఇక్కడ అతి పురాతనమైన భీమన్న ఆలయం కూడా ఉంది. ఈ ఆలయంలో భక్తులు తమ జాతకంలోని శని దోషం నివారణకు శని పూజలు జరుపుకుంటారు.
- అలాగే ఈ భీమన్న ఆలయ సమీపంలో పోచమ్మ ఆలయం కూడా ఉంది. ఈ ఆలయంలో భక్తులు తమ మొక్కుబడులను (అంటే కోడి, మేక వంటి జంతువులను అమ్మవారికి భలి ఇచ్చి) మొక్కుబడులు తీర్చుకుంటారు.
- వేరే ప్రాంతాలనుండి భక్తులు ఇక్కడికి వచ్చి రాజరాజేశ్వర స్వామిని, అమ్మవారిని దర్శించుకుని రాత్రి పూట ఒక నిద్ర తీసి వెళతారు, అలా చేయటం వలన తమకు ఉన్న దోషాలు తొలగిపోతాయని వారి నమ్మకం. అందుకు గాను ప్రభుత్వ వసతి గృహాలు ఇక్కడ ఉన్నాయి, ప్రభుత్వ వసతి గృహాలతో పాటు ప్రైవేటు వసతి గృహాలు కూడా మనం ఇక్కడ చూడవచ్చు.
- నిద్రకోసం వచ్చే భక్తులకు కాలక్షేపం కోసం వసతి గృహాలకు దగ్గరలో సినిమా హాల్లు కూడా ఉన్నాయి.
ఆరోగ్యం[మార్చు]
హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టు: ప్రజల ప్రాథమిక ఆరోగ్య సమాచారం ప్రభుత్వ భవిష్యత్తు ప్రణాళికలకు, పథకాలకు సరైన ప్రాతిపదిక కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టుకు సంబంధించిన పైలట్ కార్యక్రమాన్ని 2022, మార్చి 5న రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖామంత్రి కేటీఆర్ ఈ పట్టణంలో ప్రారంభించాడు. ఆ తరువాత పట్టణంలోని తిప్పాపురంలో 100 పడకల దవాఖాన, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటుచేసిన సీటీ స్కాన్, ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్, చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన పిడియాట్రిక్ వార్డు & పొలియేటివ్ కేర్ సెంటర్, టీబీ రోగ నిర్ధారణ పరీక్ష కేంద్రాన్ని కూడా ప్రారంభించాడు. ఈ కార్యక్రమంలో వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[6]
పట్టణ ప్రముఖులు[మార్చు]
- చౌటి భాస్కర్: ప్రముఖ సంగీత విద్యాంసుడు.[7]
ఇవి కూడా చూడండి[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ "District Census Handbook – Karimnagar" (PDF). Census of India. pp. 12, 50. Retrieved 9 June 2016.
- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2018-02-10.
- ↑ "రాజన్న సిరిసిల్ల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.
- ↑ "Basic Information of Municipality, Vemulawada Municipality". vemulavadamunicipality.telangana.gov.in. Retrieved 2022-09-20.
- ↑ వీరాస్వామయ్య, యేనుగుల (1941). కాశీయాత్రా చరిత్ర (PDF) (మూడవ ముద్రణ ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. Retrieved 26 November 2014.
- ↑ telugu, NT News (2022-03-05). "హెల్త్ ప్రొఫైల్ ద్వారా ఆరోగ్య తెలంగాణను నిర్మిద్దాం : మంత్రి కేటీఆర్". Namasthe Telangana. Archived from the original on 2022-03-05. Retrieved 2022-03-05.
- ↑ సంగీత భాస్కరుని అకాల మరణం, ఆంధ్రప్రభ హైదరాబాదు మెయిన్, 1990 ఫిబ్రవరి 7, పేజీ.9.