అష్టావక్రుడు

వికీపీడియా నుండి
(అష్టావక్ర మహర్షి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
అష్టావక్ర మహర్షి
19వ శతాబ్దపు తొలినాళ్లలో పాట్నాలో చిత్రించబడిన అష్టావక్రుని చిత్రం.
గురువుఆరుణి
సాహిత్య రచనలుఅష్టావక్ర గీత
ప్రముఖ శిష్యు(లు)డుజనకుడు, యజ్ఞావ్యల్కుడు

పూర్వకాలమున[1] [2]ఏకపాదుడను బ్రాహ్మణుడు ఉండెడివాడు.అతడు నిరంతర తపోనిరతుడు.అతడు ఏకాగ్రతతో ఏకదీక్షతో ఆరు వేదాంగములతో కూడిన వేదాధ్యయనం చేసాడు.అతనికి [3]కహోడుడు మహోళుడు మహోడుడు అనే పేర్లు కూడా ఉన్నాయి. ఆయన భార్య సుజాత.ఆమె ఉద్దాలకుని కూతురు.ఆమె ఉత్తమురాలు.భర్తకెన్నో ఉపచారములు చేసేది.ఏకపాదుడు వేదవేత్త కావడంవల్ల ఆయన వద్దకు ఎందరో బ్రహ్మచారులు వచ్చి అధ్యయనము చేయసాగారు. శిష్యకోటితో సుజాత ఏకపాదులు హాయిగా కాలక్షేపము చేస్తున్నారు.సుజాత భర్త అనుగ్రహం చేత గర్భవతి అయినది.ఆమె గర్భమందుండగనే వేదములు వల్లెవేయసాగాడా బాలుడు.

తండ్రి శాపం[మార్చు]

ఒకనాడు తండ్రి వల్లె వేయుచుండగా గర్భమందున్న ఆ బాలకుడు సావధానంగా వింటూ స్వరము తప్పినదని పలికినాడు. అంతే కాదు [2]నిద్రాహారములు లేకుండా శిష్యులచే రాత్రింబవళ్ళు అధ్యయనం చేయిస్తే వారు మందమతులు అవుతారని తండ్రిని తప్పుపట్టినాడు. తనకు పుట్టబోవు కుమారుడు దివ్యమహిమోపేతుడని గ్రహించి తండ్రి ఎంతగానో సంతోషించాడు.కాని పుట్టకుండానే తనను తప్పుపట్టినాడని, వక్రముగ పల్కినాడని ఎనిమిది వంకరలతో పుట్టమని ఆ బాలుడిని శపించాడు.

తండ్రికి శిక్ష[మార్చు]

సుజాత ఒకనాడు ఏకపాదుని పిలిచి [2]'నాథా నెయ్యి, ధాన్యము, నూనె తెండని చెప్పినది.అంత ఏకపాదుడు వాటి నిమిత్తమై జనక చక్రవర్తి వద్దకు వెళ్లగా.ఆ సమయమున అచ్చట ఒక పందెము జరుగుచుండెను. వరుణుని కుమారుడగు వందితో వాదము చేసి గెలిచినవారికి సర్వమును ఇచ్చెదనని, ఓడినవారు జలమజ్జితులై వుండవలెనని విన్నాడు ఏకపాదుడు. వందితో వాదమునకు తలపడి ఓడిపోయి నియమం ప్రకారం జలమజ్జితుడై వుండిపోయినాడు.

అష్టావక్రుడు జన్మించుట[మార్చు]

సుజాత కుమారుని ప్రసవించింది. పుట్టిన ఆ బిడ్డ ఎనిమిది వంకరలతో ఉన్నకారణమున అతనికి అష్టావక్రుడని నామకరణ చేశారు.అదే సమయాన సుజాత తల్లి ఒక పుత్రుని కన్నది. ఆమె ఉద్దాలకుని భార్య .ఉద్దాలకుడు తన కుమారునకు శ్వేతకేతు అని నామకరణం చేశాడు.అష్టావక్రుడు, శ్వేతకేతు బాల్యము నుండి ఉద్దాలకమహర్షి వద్ద అధ్యయనం చేయసాగారు. అష్టావక్రుడు ఉద్దాలకుని తండ్రిగా శ్వేతకేతుని సోదరునిగా భావిస్తూ విద్యాధ్యయనం సాగించాడు.

అష్టావక్రుని వాదన[మార్చు]

ఒకనాడు [2][4]అష్టావక్రుడు ఉద్దాలకుని తొడపై కూర్చొనిఉండ శ్వేతకేతువు ఆతని ‘ఇది నీ తండ్రి తొడకాదు, నా తండ్రితోడ లెమ్ము’ అని లాగివైచెను. అష్టావక్రుడు ఏడ్చుచు తన తల్లి వద్దకు వెళ్ళి ‘నాతండ్రి యెవ్వరు’ అని ప్రశ్నించ సుజాత వృత్తాంతమంతయు కుమారునకు వివరించెను. విషయం తెలిసికొనిన అష్టావక్రుడు జలమజ్జితుడగు తండ్రిని తీసికొని రావలెనని నిశ్చయము చేసుకొని తల్లి ఆశీర్వాదము తీసికొని శ్వేతకేతుని వెంటబెట్టుకుని జనక రాజు మందిరద్వారము కడ చేరి లోనికి పోబోగా ద్వారపాలకులు నివారించారు.వృద్ధులకే గాని బాలురకు ప్రవేశార్హత లేదని పలికారు. అంత అష్టావక్రుడు అనేక శాస్త్ర విషయములు తెలిపి దారినిమ్మని పలికాడు. మారు మాట్లాడక ద్వారపాలకులు అష్టావక్రునకు దారి ఇచ్చారు..అష్టావక్రుడు తిన్నగా జనకమహారాజు వద్దకు వెళ్ళి వందితో వాదింతునని పలికాడు. బాలుడవు నీవేమి వందితో వాదించడమేమి కుదరదన్నాడు. అంత అష్టావక్రుడు [2]జనకునితో వాదించి తన శక్తిసామర్థ్యాలు తెలియజేశాడు. జనకుడు వాదనకు అంగీకరించాడు. వంది అష్టావక్రుల మధ్య వాద ప్రతివాదములు ప్రారంభమయాయి. అనేక విషయాలపై వాదన సాగుతుంది. చివరకు వందిని బాలకుడగు అష్టావక్రుడు ఓడించాడు. గెలుపొందిన ఆ బాలకుని అభినందించి జనక మహారాజు 'మహాజ్ఞానీ అజ్ఞాపింపుమని అర్ధించగా అష్టావక్రుడు తన తండ్రిని విడిపించి వందిని జలమజ్జితుని చేయుమని ఆదేశించాడు

తండ్రిని విడిపించుట[మార్చు]

ఇక్కడ ఒక రహస్యమున్నది. వంది వాదమున ఓడిన వారిని ఎవరిని జలమజ్జితులను చేసి బాధించలేదు. వారందరిని తన తండ్రి వరుణుడు చేయు యజ్ఞమునకు పంపినాడు. ఈ విషయము అష్టావక్రునకు తెలిసి అతనిని కీర్తించాడు. అష్టావక్రుని యశస్సు నలుదిశల వ్యాపించింది. ఏకపాదుని, అష్టావక్రుని జనక చక్రవర్తి సత్కరించాడు. అద్వైత వేదాంత రహస్యములను తెలుసుకొన్నాడు.

అష్టావక్రుని శాపవిముక్తి[మార్చు]

తండ్రి అష్టావక్రుని పితృభక్తికి ఎంతగానో సంతసించాడు. పాండిత్య ప్రకర్షకు గర్వపడ్డాడు. నది యందు సాన్నం చేయించి తన కుమారుని వంకరులు పోవునట్లు చేశాడు.అంత అష్టావక్రుడు సుందరుడైనాడు. ఇంటికి వచ్చి తల్లితండ్రులకు సేవ చేయుచు కాలక్షేపం చేయసాగాడు. వివాహ వయస్సు రాగానే తండ్రి కుమారునకు పెళ్ళి చేయతలపెట్టారు.తన నిర్ణయమును కుమారునకు తెలియజేశాడు. కుమారుడు అంగీకారము తెలిపి వదాన్య మహర్షి కుమార్తెయగు సుప్రభను వివాహము చేసుకొన్నాడు. భార్యను వెంటబెట్టుకొని ఆశ్రమమునకు వచ్చి తపస్సునందుండిపోయాడు.సుప్రభ అష్టావక్రుల గృహస్థాశ్రయం అద్వితీయముగా, ఆదర్శప్రాయంగా సాగుతుంది. పుత్రులను పొందాడు.

గోపికల పూర్వ వృత్తాంతం[మార్చు]

ఒకనాడు అష్టావక్రుడు జలమధ్యమున ఉండగా అచ్చటికి రంబాధి అప్సరలు వచ్చి నృత్యగీతములను అష్టావక్రునకు వినిపించారు. అష్టావక్రుడు సంతోషించి ఏమి కావాలని వారిని అడుగగా వారందరూ విష్ణుమూర్తితోడి పొందుకోరారు. విని అష్టావక్రుడు కృష్ణావతార కాలాన మీరు గోపికలై జనించి అతనిని సంగమించగలరని పల్కాడు. అనంతరము అష్టావక్రుడు పుష్కర తీర్ధమున తపస్సు చేయసాగాడు. మనస్సు పరమాత్మయందు లయం చేసి శ్రీకృష్ణుని దర్శించి ఆయన పాదములపై పడి పరమపదించాడు. అనంతరం అతడు గోలోకమునకు పోయి మోక్షము పొందాడు.

అష్టావక్రుని పూర్వజన్మ[మార్చు]

పూర్వ జన్మమున అష్టావక్రుడు దేవలుడనువాడు . దేవలుడు మాలావతి అను పేరు గల కన్యను వివాహము చేసికొని సంతానమును బడసి విరాగియై తపస్సు చేయసాగెను. అతని తపస్సు నుండి వేడి పుట్టి త్రిలోకములను బాధించసాగెను. ఇంద్రుడు అతని తపస్సును భగ్నం చేయుటకు రంభను పంపగా చలింపలేదు. అందుకు రంభ కోపించి మరు జన్మమున నీవు అష్టావక్రుడవై జన్మించుమని శపించింది. అనంతరం రంభ పశ్చాత్తప్తయై శాపవిమోచనము కూడా తెలియజేసి స్వర్గలోకమునకు వెళ్లిపోయింది. ఆ దేవలుడే ఈ అష్టావక్రుడు. అష్టావక్రుడు జనకమహారాజుతో చేసిన వేదాంత చర్చయే అష్టావక్ర సంహిత లేక అష్టావక్రగీత.

మూలాలు[మార్చు]

కవిత్రయ భారతము

  1. https://andhrabharati.com/itihAsamulu/bhAratamu/AraNya_317.html. {{cite web}}: |first= missing |last= (help); Missing or empty |title= (help)
  2. 2.0 2.1 2.2 2.3 2.4 "ఆంధ్రమహాభారతము". https://andhrabharati.com/itihAsamulu/bhAratamu/AraNya_318.html. {{cite web}}: |first= missing |last= (help); External link in |website= (help)
  3. జంధ్యాల, వెంకటేశ్వర శాస్త్రి (1992). "అష్టావక్ర సంహిత" (PDF).
  4. "https://books.google.com/books?id=5x45EAAAQBAJ&pg=RA1-PA132-IA3&lpg=RA1-PA132-IA3&dq=అష్టావక్ర+మహర్షి&source=bl&ots=dg-lunI7Ed&sig=ACfU3U3tGg9IQF6M3CSPiS3kZYKQDoFAJQ&hl=te&sa=X&ved=2ahUKEwjytL_e2Mj_AhWGFzQIHdFOByo4HhDoAXoECB4QAw#v=onepage&q=అష్టావక్ర%20మహర్షి&f=false". {{cite web}}: External link in |title= (help)

ఇతర లింకులు[మార్చు]