రామప్ప దేవాలయం
రామప్ప దేవాలయం | |
---|---|
చారిత్రక ప్రసిద్ధి గాంచిన రామప్ప దేవాలయం | |
ప్రదేశం | |
దేశం: | భారత దేశం |
రాష్ట్రం: | తెలంగాణ |
జిల్లా: | ములుగు |
ప్రదేశం: | పాలంపేట |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | శివుడు |
ఉత్సవ దైవం: | రామలింగేశ్వరుడు |
నిర్మాణ శైలి, సంస్కృతి | |
వాస్తు శిల్ప శైలి : | కాకతీయుల కాలం నాటిది |
ఇతిహాసం | |
నిర్మాణ తేదీ: | 1213 |
రామప్ప దేవాలయం ఓరుగల్లును పరిపాలించిన కాకతీయ రాజులు నిర్మించిన చారిత్రక దేవాలయం. ఇది తెలంగాణ రాష్ట్ర రాజధానియైన హైదరాబాదు నగరానికి 220 కి.మీ.దూరంలో, కాకతీయ వంశీకుల రాజధానియైన వరంగల్లు పట్టణానికి సుమారు 70 కి.మీ.దూరంలో ములుగు జిల్లా, వెంకటాపూర్ మండలంలోని పలంపేట అనే ఊరి దగ్గర ఉంది. దీనినే రామలింగేశ్వర దేవాలయం అని కూడా వ్యవహరిస్తారు. ఇది చాలా ప్రాముఖ్యత గల దేవాలయం. ఈ దేవాలయం విశ్వబ్రాహ్మణ శిల్పుల పనితనానికి మచ్చుతునకగా చెప్పవచ్చు. ఈ దేవాలయం పక్కనే రామప్ప సరస్సు ఉంది. ఆ చెరువు కాకతీయుల కాలం నాటిది. ఇది ఇప్పటికి వేల ఎకరాల పంటకు ఆధారంగా ఉంది. Pలంపేట చారిత్రత్మాక గ్రామం. కాకతీయుల పరిపాలనలో 13-14 శతాబ్ధాల మధ్య వెలుగొందింది.[1] కాకతీయ రాజు గణపతి దేవుడు ఈ దేవాలయంలో వేయించిన శిలాశాసనం ప్రకారం ఈ దేవాలయాన్ని రేచర్ల రుద్రయ్య నిర్మించాడు.[2]
హెరిటేజ్ వారసత్వ హోదా[మార్చు]
కాకతీయుల కాలంలో క్రీస్తు శకం 1213లో నిర్మించిన రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ హోదా దక్కింది. చైనాలోని పూజౌలో నిర్వహించిన యునెస్కో హెరిటేజ్ కమిటీ సమావేశాలలో ప్రపంచం వ్యాప్తంగా 21 దేశాల ప్రతినిధులు ఓటింగ్ ప్రక్రియలో పాలుపంచుకొన్నారు. 17 దేశాల వారు రామప్పకు అనుకూలంగా వేశారు. రామప్పకు వారసత్వ హోదా ఇచ్చే విషయంపై నిర్ణయం తీసుకున్నారు. 2021 జులై 25న ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించబడింది. కేంద్ర ప్రభుత్వం 2020 సంవత్సరానికి మన దేశం నుండి రామప్ప దేవాలయాన్ని వారసత్వ కట్టడంగా గుర్తించడం కోసం ప్రతిపాదనలు పంపింది. ప్రపంచవ్యాప్తంగా 255 కట్టడాలు యునెస్కో వారసత్వ హోదా గుర్తింపు కోసం పోటీ పడ్డాయి. యునెస్కో రామప్పకు వారసత్వ హోదా ఇవ్వడం ద్వారా ఎనిమిది వందల సంవత్సరాల నాటి రామప్ప దేవాలయానికి తగిన గుర్తింపు లభించింది. భవిష్యత్తులో మరిన్ని నిధులు వచ్చి అభివృద్ధి జరిగే అవకాశం ఉంది. తద్వారా రామప్ప పర్యాటక ప్రాంతంగా దేశవ్యాప్త గుర్తింపుకు నోచుకుంటుంది.[3][4]
ఎనిమిది శతాబ్దాల నాటి ప్రాచీన కట్టడమైన రామప్పకు వారసత్వ హోదా గుర్తింపునకు ముఖ్యంగా మూడు అంశాలను ఆధారంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వం యునెస్కోకు నామినేట్ చేసింది. ప్రతిష్టాత్మక గుర్తింపునిచ్చిన యునెస్కో సంస్థ ఆలయ పరిరక్షణకు అధిక ప్రధాన్య మిస్తూ మనదేశ ప్రభు త్వానికి ఎనిమిది అంశాలపై కొన్ని సూచనలు చేసింది.
- ఇసుకపై ఆలయాన్ని నిర్మించడం
- నీటితో తేలియాడే ఇటుకలతో గోపురాన్ని నిర్మించడం.
- ఆలయ నిర్మాణానికి వాడిన రాతి నేటికీ రంగును కోల్పోకుండా ఉండడం.
500 మీటర్ల బఫర్జోన్[మార్చు]
దేవాలయం చుట్టూ 500 మీటర్ల విస్తీర్ణాన్ని బఫర్జోన్గా గుర్తించి, ఆ ప్రాంతంలో భవనాల నిర్మాణాలపై కఠినమైన ఆంక్షలు అమలు చేయనున్నారు. ఉన్నత స్థాయి అనుమతులు లేకుండా ఎటువంటి నిర్మాణాలు చేయకూడదు. 100 మీటర్ల వరకు ఇప్పుడున్న నిర్మాణాలు తప్ప కొత్తవాటిని నిర్మించకూడదు. 300 మీటర్ల వరకు కేంద్ర పురావస్తు శాఖ ఎన్వోసీ తీసుకోవాలి. 500 మీటర్ల వరకు జిల్లా కలెక్టర్ అనుమతి తప్పనిసరి చేశారు. భూమట్టం నుంచి 10 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తుకు నిర్మాణాలు చేయకూడదు.
కాకతీయుల వైభవానికి చిహ్నం[మార్చు]
ఈ దేవాలయాన్ని క్రీస్తు శకం 1213లో గణపతి దేవుని కాలానికి చెందిన రేచర్ల రుద్రుడు కట్టించాడు. మధ్యయుగానికి చెందిన ఈ శివాలయం ఆలయంలో ఉన్న దైవంపేరు మీదుగా కాక దీనిని చెక్కిన ప్రధాన శిల్పి రామప్ప పేరు మీదుగా ఉండటం ఇక్కడి విశేషం. ఈ పేరుకు శివుని పేరు కూడా కలిపి రామలింగేశ్వర ఆలయం అని కూడా వ్యవహరిస్తారు. ఈ దేవాలయంలో ప్రధాన దైవము రామలింగేశ్వరుడు. విష్ణువు ఆవతారము రాముడు కొలిచిన లింగమైన రామలింగేశ్వరుడు ప్రధాన దైవముగా ఉన్న దేవాలయము.
ఈ ఆలయం కాకతీయుల ప్రత్యేక శైలి యైన ఎత్తైన పీఠంపై నక్షత్ర ఆకారాన్ని పోలి ఉంటుంది. ఈ ఆలయము తూర్పు దిశాభిముఖముగా ఎత్తైన వేదికపై గర్భాలయం, అంతర్భాగమున మూడు వైపుల ప్రవేశ ద్వారము గల మహామండపం కలిగి ఉంది. ఇందలి గర్భాలయమున ఎత్తైన పీఠముపై నల్లని నునుపు రాతితో చెక్కబడిన పెద్ద శివలింగము ఉంది. ఇందలి మహామండపము మధ్య భాగమున కల కుడ్య స్తంభములు, వాటిపై గల రాతి దూలములు రామాయణ, పురాణ, ఇతిహాస గాథలతో కూడిన నిండైన అతి రమణీయమైన శిల్పములు కలిగి ఉన్నాయి. ఈ మహా మండపము వెలుపలి అంచున పై కప్పు క్రింది భాగమున నల్లని నునుపు రాతి పలకములపై వివిధ భంగిమలతో సర్వాంగ సుందరముగా చెక్కబడిన మదనిక, నాగిని శిల్పములు కాకతీయుల శిల్పకళాభిరుచులకు చక్కటి తార్కాణాలు. ఈ దేవాలయ ప్రాంగణలో ఇతర కట్టడములలో నంది మండపము, కామేశ్వర, కాటేశ్వర మొదలగు ఆలయములు చూడదగినవి. దేవాలయము శిల్ప సంపద కాకతీయ రాజుల నాటి శిల్ప శైలి తెలుపుతున్నది. దేవాలయం అత్యంత తేలికైన ఇటుకలతో నిర్మితమైనది. ఈ ఇటుకలు నీటి మీద తేలే అంత తేలికైనవి అని చెబుతారు.ఇక్కడ ఆలయానికి ఎదురుగా ఉన్న నందికి ఒక ప్రత్యేకత ఉంది. ఒక కాలు కొంచెం పైకి ఎత్తి పట్టుకొని, చెవులు రిక్కించి యజమాని ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడా? అన్నట్లుంటుంది. ముందు నుంచి ఏ దిశనుంచి చూసినా నంది మన వైపే చూస్తున్నట్లుంటుంది. గర్భగుడికి ఎదురుగా ఉన్న మండపంలో ఉన్న స్తంభాల మీద అత్యంత రమణీయమైన శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. మండపం పైకప్పు మీద శిల్ప కళాసౌందర్యము చాలా అద్భుతంగా ఉంటుంది. లోపల రెండు శివుని సన్నిధులు ఉన్నాయి. శివుడి వైపు చూస్తున్న నంది చెక్కబడి ఇప్పటికి చెక్కుచెదరకుండా ఉంది.



ఓరుగంటికి 40 మైళ్ళ దూరమున "రామప్ప గుడులు" ఉన్నాయి. వాటిని సా.శ. 1162 లో రుద్రసేనాని అను రెడ్డి సామంతుడు కట్టించెను. ఆ గుళ్ళలోని విగ్రహములు, స్తంభాలపై శిల్పములు, ముఖ్యముగా దేవాలయ మంటపముపై కోణములందు నాలుగుదిశలందు నిలిపిన పెద్ద నల్లరాతి నాట్యకత్తెల విగ్రహాలు అతి సుందరములు. ఆ విగ్రహాలపై సొమ్ముల అలంకరణములు, వాటి త్రిభంగీ నాట్యభంగిమము శిల్పకారులనే మోహింపజేసినట్లున్నది. అందుచేతనే శిల్పులు ఆ సుందరాంగులకు తుష్టిపూర్తిగా ప్రసాధన క్రియలను సమకూర్చి అందు రెంటిని నగ్నత్వంగా తీర్చిదిద్ది ఆనందించారు. దేవాలయములోని స్తంభాలపై నాట్యభంగిమములు మృదంగాది వాద్యములవారి రేఖలు చిత్రింపబడినవి. ఆ కాలములో జాయసేనానియను నతడు ఒక సంస్కృత నాట్య శాస్త్రమును వ్రాసెను. అది తంజావూరి లిఖిత పుస్తకాలలో నున్నది. కాని, దానిని ముద్రించుట కెవ్వారును పూనుకొనరయిరి. జాయప గ్రంథమునకు ఉదాహరణ వాజ్మయముము లాస్తంభాలపై నాట్యముచేస్తున్న సుందరీమణులే యని యందురు ఆ శాస్త్రాన్ని ఆ విగ్రహాలను వ్యాఖ్యతో ముద్రించిన ఎంత బాగుండునోకదా![5]
ఆలయ ప్రత్యేకతలు[మార్చు]
ఈ దేవాలయం ఎన్నో యుద్ధాలకు, దాడులకు, ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకొని నిలబడింది. దేవాలయ ప్రాంగణంలో చిన్న కట్టడాలను నిర్లక్ష్యంగా వదలి వేయడం వలన అవి కొన్ని ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నాయి. కొంత మంది ఇక్కుడున్న నీళ్ళపై తేలే ఇటుకలను తీసుకొని వెళ్ళిపోవడం ప్రారంభించారు.[6] అప్పటినుంచి భారతీయ పురాతత్వ పర్యవేక్షక శాఖ దీన్ని ఇపుడు తమ ఆధీనంలోకి తీసుకొని పరిరక్షిస్తుంది. ప్రధాన ద్వారం దగ్గర ప్రాకారం కూడా శిథిలమై ఉంది. కాబట్టి ఇప్పుడు పడమర వైపు ఉన్న చిన్న ద్వారం ద్వారానే ప్రవేశం ఉంది.[7] మహాశివరాత్రి ఉత్సవాలు మూడు రోజులపాటు జరుపుతారు.
శిల్ప కళా చాతుర్యం[మార్చు]
రామప్పగుడి ఆలయ నిర్మాణంలోని చిత్ర కౌశలం, శిల్ప నైపుణ్యం వర్ణించనలవికానిది. ఈ కాకతీయ శిల్పచాతుర్యమంతా, ఇన్నేళ్ళు గడిచినా, ఈ నాటికి చూపరులకు అమితానందాన్ని కలిగిస్తూంది. నాట్య శాస్త్రమంతా మూర్తీ భవించి, స్థంబాలమీదా, కప్పులమీదా, కనబడుతుంది.రామప్ప గుడిలోని విగ్రహాలు, స్థంబాలపై ఉన్న శిల్పాలు ముఖ్యంగా దేవాలయ మంటపంపై కోణాల్లో నాలుగు పక్కలా పెద్ద నల్లారాతి నాట్య కత్తెల విగ్రహాలు అతి సుందరమైనవి. ఆ విగ్రహాల సొమ్ముల అలంకరణాలు, వాటి త్రిభంగీ నాట్య భంగిమలూ శిల్పకారుల్నే సమ్మోహితుల్ని చేస్తున్నాయి. దేవాలయం లోని స్థంబాలపై నాట్య భంగిమలు మృదంగాది వాద్యముల వారి రేఖలు చిత్రించబడి ఉన్నాయి. జాయన సేనాని రచించిన నృత్తరత్నావళిలో ఉదహరించిన నాట్యశిల్పమంతా రామప్ప గుడిలో తొణికిసలాడుతూ ఉంది.
పునర్నిర్మాణం[మార్చు]
ఎకో టూరిజానికి అధిక ప్రాధాన్యమిస్తూ ప్రపంచ పర్యాటకులు సేద తీరేందుకు జంగాలపల్లి-పాలంపేట మధ్య స్టార్ హోటల్, ఇంచర్ల గట్టమ్మ వద్ద శిల్పారామాన్ని పోలిన ట్రైబల్ విలేజ్లను నిర్మించనున్నారు. రామప్ప ఆలయ పరిసరాల్లో శిథిలావస్థలో ఉన్న కామేశ్వరాలయాన్ని పురావస్తు శాఖ అధికారులు పదేళ్లక్రితం తొలగించి రాతిశిల్పాలను పక్కకు పెట్టారు. కాకతీయులు వాడిన సాండ్బాక్స్ టెక్నాలజీని ఉపయోగించి పునర్నిర్మాణం చేపడుతున్నారు. 25 కిలోమీటర్ల పరిధిలో రోడ్ల అభివృద్ధి, పురాతన కట్టడాల పునరుద్ధరణ, సౌకర్యాలను మెరగుపర్చడం తదితర చర్యలు చేపట్టనున్నారు. ప్రాకార పనులను కూడా చేపట్టారు. గతంలో భారీ వర్షాలకు తూర్పు ముఖద్వారం కూలిపోగా ఇప్పటికే శిథిలావస్థకు చేరిన మొత్తం గోడను తొలగించి పటిష్టంగా నిర్మించే పనులను మొదలెట్టారు.[8]
శిల్పం-వర్ణం-కృష్ణం[మార్చు]
ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా రామప్ప దేవాలయ ప్రాంగణంలో ‘శిల్పం-వర్ణం-కృష్ణం’ సెలబ్రేటింగ్ ది హెరిటేజ్ ఆఫ్ రామప్ప అనే థీమ్తో 2023 ఏప్రిల్ 18న సాంస్కృతిక వేడుకలు నిర్వహించబడ్డాయి. ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు దక్కించుకున్న రామప్పపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఉదయం 10 గంటల నుంచి అర్ధరాత్రి వరకు నిర్వహించబడిన ఈ వేడుకలలో రామప్ప సరస్సు కట్టపై ఫుడ్ ఫెస్టివల్, రామప్ప దేవాలయం పక్కనే నిర్మించిన భారీ స్టేజీ మీద నృత్యప్రదర్శనలు, కళా ప్రదర్శనలు (అరబి వయోలిన్ వాయిద్యం, పేరిణి నృత్యం, రామప్ప వారసత్వంపై వీడియో, రావణ నాటకం,సంప్రదాయ-గిరిజన నృత్యాలు, ‘రామప్ప ఆలయ నిత్యం.. శాస్త్రం’ పుస్తక ఆవిష్కరణ, రామప్ప చరిత్రపై లేజర్షో, ఎస్ఎస్ థమన్, శివమణి, కార్తీక్, ఫ్లూట్ నవీన్ ఆధ్వర్యంలో సంగీత ప్రదర్శన) జరిగాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖామంత్రి వి. శ్రీనివాస్గౌడ్, పంచాయితీరాజ్ శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, మహిళా శిశు సంక్షేమ శాఖమంత్రి సత్యవతి రాథోడ్, ములుగు ఎమ్మెల్యే సీతక్క, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.[9][10]
చిత్ర మాలిక[మార్చు]
-
మరో కోణం వైపు నుంచి ఆలయ దృశ్యం
-
మరో కోణం వైపు నుంచి ఆలయ దృశ్యం
-
శిథిలావస్థలో ఉన్న మరో మంటపం
-
మరో కోణం వైపు నుంచి ఆలయ దృశ్యం
-
ఆలయ శిల్పము
-
ఆలయ శిల్పము
-
ఆలయ శిల్పము
-
ఆలయ శిల్పము
-
ఆలయ శిల్పము
-
ఆలయ శిల్పము
-
ఆలయ శిల్పము
-
ఆలయ శిల్పము
-
ఆలయ శిల్పము
-
ఆలయ శిల్పము
-
ఆలయ శిల్పము
మూలాలు[మార్చు]
- ↑ "పాలంపేటలో ఉన్న శివాలయాలు". Archived from the original on 2006-10-18. Retrieved 2007-08-22.
- ↑ Namasthe Telangana (25 July 2021). "ఇసుక పునాదిపై వెలిసిన అద్భుతం రామప్ప దేవాలయం". Archived from the original on 23 July 2021. Retrieved 26 July 2021.
- ↑ Namasthe Telangana (25 July 2021). "రామప్ప ఇక ప్రపంచ సంపద". Archived from the original on 26 July 2021. Retrieved 26 July 2021.
- ↑ Sakshi (25 July 2021). "రామప్పకు విశ్వఖ్యాతి". Archived from the original on 26 July 2021. Retrieved 26 July 2021.
- ↑ "పుట:Andrulasangikach025988mbp.pdf/63 పేజీ సోర్సు చూడండి - వికీసోర్స్". te.wikisource.org. Retrieved 2021-07-26.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-05-22. Retrieved 2007-08-22.
- ↑ "Warangal Temples, Andra Pradesh". Archived from the original on 2006-08-18. Retrieved 2006-09-11.
- ↑ ABN (2022-11-30). "వారసత్వ సంపదకు మహర్దశ". Andhrajyothy Telugu News. Archived from the original on 2022-11-30. Retrieved 2022-11-30.
- ↑ ABN (2023-04-18). "అద్భుత శిల్పం... అమోఘ వర్ణం... అపురూప కృష్ణం..." Andhrajyothy Telugu News. Archived from the original on 2023-04-22. Retrieved 2023-04-22.
- ↑ telugu, NT News (2023-04-19). "ప్రపంచానికి కాకతీయులే దిక్సూచి". www.ntnews.com. Archived from the original on 2023-04-19. Retrieved 2023-04-22.