కీచకుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కీచకుడు
ద్రౌపదితో కీచకుడు - రాజా రవివర్మ వర్ణచిత్రం
సమాచారం
ఆయుధంగద
కుటుంబంవిరాటుడు (బావ), సుధేష్ణ (అక్క), ఉత్తర కుమారుడు, ఉత్తర, శ్వేత, శంఖ (మేనల్లుడు, మేనకోడళ్ళు)

కీచకుడు (సంస్కృతం: कीचकः ) మహాభారతంలోని విరాట పర్వంలో వచ్చే పాత్ర. కీచకునికి సింహబలుడు అనే పేరు కూడా ఉంది. కీచకుడు విరాటరాజు భార్య సుధేష్ణ తమ్ముడు.[1] కీచకుడు ద్రౌపదిని అత్యాచారం చేయడానికి ప్రయత్నించగా తరువాతి రోజు నర్తనశాలలో భీముడు కీచకుడిని చంపేస్తాడు.[2] కీచకుడు అధిక శక్తి, అపారమైన బలం కలిగివున్న వ్యక్తి. విరాట రాజ్యాన్ని శత్రువుల నుండి చాలాసార్లు రక్షించాడు. కీచకుడి సోదరి సుధేష్ణకు ఉత్తర కుమారుడు, ఉత్తర అనే అందమైన కుమార్తె ఉన్నారు. ఉత్తరను అర్జునుడి కుమారుడు అభిమన్యుడు వివాహం చేసుకున్నాడు.

భీముడు కీచకుడిని చంపడం (ఆర్టిస్టు: ధను)

విరాటరాజు రాజ్యం (విరాటగర్) ఇప్పుడు తూర్పు నేపాల్ లోని మొరాంగ్ జిల్లాలో ఉంది. కీచకుడు చంపబడిన ప్రదేశాన్ని కీచక్‌బాద్ అని పిలుస్తారు. ఇది బీరత్‌నగర్ నుండి తూర్పున కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న ఝాపా జిల్లాలో ఉంది. ఝాపాలో అర్జుంధర అనే స్థలం కూడా ఉంది. విరాటరాజు పశువులను పాండవులు కాపాడి తిరిగి వచ్చేటప్పుడు పశువులకు దాహం వేయగా, అర్జునుడు తన గాండీవం చేత ఒక చెరువు (ధార) తవ్వి వాటికి నీరు అందించాడు.

మహాభారతంలో[మార్చు]

పాండవులు ఒక సంవత్సరం పాటు విరాట రాజు రాజ్యభవనంలో పనివాళ్ళుగా చేరినప్పుడు పాండవుల భార్య ద్రౌపది, మహిళా సేవకురాలు (మాలిని) వేషంలో విరాట రాజు భార్య సుధేష్ణకి సేవలు చేయడానికి వెళ్ళింది. కీచకుడు మాలిని చూసి ఆమె అందాన్ని ఆస్వాదించాలని కోరగా దానికి ఆమె నిరాకరించింది. కీచకుడు మాలిని పట్ల తనకున్న కోరికును రాణి సుధేష్ణకు తెలిపి, తనకు మధువు పోయడానికి ఆమెను పంపమని కోరాడు. మాలిని మధువు పోస్తుండగా, కీచకుడు మాలినిని కౌగిలింత చేసుకోవడానికి ప్రయత్నించగా మాలిని ఏడుస్తూ అతన్ని కిందకు తోసేస్తుంది. దాంతో కీచకుడు మాలినిని వెంబడించగా, మాలిని సభా వేదిక గదిలోకి వెళ్తుంది. అక్కడ ఆమెను వెంట్రుకలతో పట్టుకుని, నేలమీద పడవేసి, మారువేషంలో ఉన్న భర్త యుధిష్ఠిరుడు, విరాటరాజుతో సహా సభికులందరి ముందు కాలితో తన్నాడు. ఆ సంఘటనను చూసి ఎవరూ స్పందించలేరు. కోపంతో పళ్ళు కొరుకుతున్న భీముడిని యుధిష్ఠిరుడు ప్రతీకారం తీర్చుకోవాలని ఆజ్ఞాపించాడు.

ఆ రోజు రాత్రి మాలిని, వంటవాడిగా ఉన్న భీముడిని కలుస్తుంది. వారిద్దరూ కలిసి కీచకుడిని చంపడానికి ప్రణాళికను రూపొందిస్తారు. రాత్రి సమయంలో కీచకుడిని నర్తనశాలకు రమ్మని మాలిని చెబుతుంది. దాంతో కీచకుడు నర్తనశాలకు వస్తాడు. చీకట్లో మారువేషంలో ఉండి నిద్రపోతున్న భీముడిని చూసి మాలిని అనుకొని, ముందుకు రాగానే భీముడు ఒక్కసారిగా లేచి కీచకుడిపై పడతాడు. ఇద్దరి మధ్య యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో భీయుడి చేతిలో కీచకుడు మరణిస్తాడు.[3]

మూలాలు[మార్చు]

  1. SRIKRISHNA The Lord Of The Universe By SHIVAJI SAWANT. ISBN 9789386888242. Retrieved 1 July 2020.
  2. కీచకులు, పురాణనామ చంద్రిక, యెనమండ్రం వెంకటరామయ్య, ప్రాచీ పబ్లికేషన్స్, హైదరాబాదు, 1879 & జూన్ 1994, పుట. 49.
  3. "Virata parva". Sacred text. Retrieved 1 July 2020.
"https://te.wikipedia.org/w/index.php?title=కీచకుడు&oldid=2984310" నుండి వెలికితీశారు