బభ్రువాహనుడు
బభృవాహనుడు అర్జునుడు మరియు మణిపురపు రాకుమారి చిత్రాంగదలకు కలిగిన కుమారుడు.
అర్జునుడు అరణ్యవాసం చేయు సమయమున మణిపురపు రాకుమారి చిత్రాంగదను చూచి వలచాడు. చిత్రాంగద తండ్రి అయిన చిత్రవాహనునికి ఆమె ఒక్కతే సంతానం. చిత్రవాహనుడు చిత్రాంగదకు కలిగే సంతానము మణిపురములోనే ఉండి రాజ్యమును పరిపాలించవలెను అని పెట్టిన షరతుకు అంగీకరించి అర్జునుడు చిత్రాంగదను వివాహము చేసికొన్నాడు. బభృవాహనుడు తన తాత తదనంతరం మణిపురమును పాలించాడు.
కురుక్షేత్ర సంగ్రామం తరువాత యధిష్టురుడు చేసిన అశ్వమేధ యాగంలో భాగంగా అర్జునుడు మణిపురము వచ్చినప్పుడు బభృవాహనుడు అర్జునునికి ఎదురేగి పాదాభివందనము చేసాడు. అర్జునునికి తన కుమారుడు వీరుని వలే ఎదిరించకుండా లొంగిపోవుట నచ్చక "వీరపుత్రులు యుద్ధమునకు వెనుకాడరు" అని పల్కాడు. బభృవాహనుడు తన తండ్రి మాటలకు కుంగిపోయి తన రాజధానికి చేరాడు. ఆ విషయము తెలుసుకొన్న అర్జునుని భార్య అయిన కౌరవ్యుడు కుమార్తె ఉలూచి బభృవాహనుడు వద్దకు వచ్చి యుద్ధము చేసి తండ్రిని సంతోషపెట్టమని చెప్పింది. అంతట సకల సైన్యముతో బభృవాహనుడు అర్జునునిపై దండెత్తాడు. ఆ యుద్ధములో అర్జునుని బాణమునకు బభృవాహనుడు మూర్చపోయినాడు. కాని బభృవాహనుడు మూర్చపోక ముందు ప్రయోగించిన బాణము అర్జునుని రొమ్ములో గ్రుచ్చుకుని అర్జునుని ప్రాణం తీసింది. ఈ విషయము తెలిసి చిత్రాంగద మరియు ఉలూచి రణరంగమునకు వచ్చారు. అంతలో బభృవాహనుడు మూర్చనుంచి తేరుకుని లేచి తండ్రి మరణించాడని తెలుసుకుని హతాశుడై ఉలూచిని దుర్భాషలాడి, ప్రాయోపవేశము చేసి ప్రాణాలు విడుచుటకు సిద్దమయ్యాడు. అప్పుడు ఉలూచి బభృవాహనునికి సంజీవనిమణిని ఇచ్చి అర్జునుని గుండెలపై ఉంచమని చెప్పింది. అర్జునుడు తిరిగి బ్రతికాడు. ఉలూచి వారికి కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడు భీష్ముని (ఎనిమిదవ వసువు అవతారం) చంపుట వల్ల వసువులు ఇచ్చిన శాపం గురించి వివరించింది.