తెలంగాణకు హరితహారం
తెలంగాణకు హరితహారం | |
---|---|
![]() తెలంగాణకు హరితహారం లోగో | |
ప్రాంతం | తెలంగాణ, భారతదేశం |
ప్రధాన వ్యక్తులు | తెలంగాణ ప్రజలు |
వెబ్ సైటు | అధికారిక వెబ్ సైట్ |
నిర్వాహకులు | ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, తెలంగాణ ప్రభుత్వం |
తెలంగాణకు హరితహారం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అటవీకరణ కార్యక్రమం. హరితహారం 2015 జూలైలో చిలుకూరు బాలాజీ దేవాలయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చే అధికారికంగా ప్రారంభించబడింది. తెలంగాణలో మొత్తంలో మొక్కలను నాటి, పచ్చదనం కనిపించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. 2016 లోనే 46 కోట్ల మొక్కలు నాటడం జరిగింది.[1]
కార్యక్రమాలు[మార్చు]
హైదరాబాద్ నగరంలో ఒక్కరోజులోనే 25 లక్షల మొక్కలు, ఒకేరోజు లక్షమంది 163 కిలోమీటర్ల పొడవునా నిలబడి మొక్కలు నాటి రికార్డు సృష్టించడం జరిగింది. ప్రతీ రెండు గ్రామాలకు ఒక నర్సరీ చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 4,213 నర్సరీలు ఏర్పాటుచేశారు. కేవలం ఒకే రకం చెట్లు కాకుండా నీడనిచ్చే చెట్లు, పండ్ల చెట్లు, పూల చెట్లు, ఔషధ మొక్కలను కూడా నాటారు. 2016లో నాటిన 46 కోట్ల మొక్కల్లో నీడ నిచ్చే వేప, మర్రి, రావి లాంటివి 36.81 కోట్ల మొక్కలు... టేకు, మద్ది లాంటి లాభదాయక చెట్లు మరో 8.5 కోట్ల మొక్కలు...పండ్ల చెట్లు కోటి దాకా ఉన్నాయి. అంతేకాకుండా పూలచెట్లు మరియు ఈత మొక్కలు ఉన్నాయి. అటవీ ప్రాంతంలోనే కాకుండా అన్ని రహదారులకు ఇరువైపులా, విద్యాలయాల్లో, పోలీస్ ప్రాంగణాల్లో, మార్కెట్ యార్డుల్లో, వ్యవసాయ క్షేత్రాల్లో, శ్మశాన వాటికలు, గ్రేవ్ యార్డుల్లో, పరిశ్రమల్లో, పారిశ్రామిక వాడల్లో, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, విమానాశ్రయాల్లో మొక్కలు నాటారు.
ప్రభుత్వ రంగ సంస్థలైన ఆర్టీసీ, సింగరేణి, విద్యుత్ శాఖలు, పాఠశాల విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు, డ్వాక్రా మహిళలతో సహా అందరూ కార్యక్రమంలో పాల్గొన్నారు.
హైదరాబాద్ – విజయవాడ, హైదరాబాద్ - ముంబాయి, హైదరాబాద్ – వరంగల్, హైదరాబాద్ – బెంగుళూరు, హైదరాబాద్ – నాగపూర్ వంటి జాతీయ రహదారులకిరువైపులా పెద్ద పూల చెట్లు నాటారు.
లక్ష్యాలు[మార్చు]
- తెలంగాణలో ఉన్న 24 శాతం అటవీ ప్రాంతంలో నూటికి నూరు శాతం అడవులు పెంచడం
- పట్టణాలు, గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున సామాజిక అడవుల పెంపకం
- తెలంగాణ వ్యాప్తంగా ఐదేళ్ల కాలంలో 230 కోట్ల మొక్కలు నాటి, వాటిని సంరక్షించడం
- అటవీ ప్రాంతంలో 100 కోట్ల మొక్కలు, సామాజిక అడవుల కింద 120 కోట్ల మొక్కలు, హైదరాబాద్ నగర పరిధిలో 10 కోట్ల మొక్కలు నాటడం
- సహజసిద్ధమైన అడవులను పరిరక్షించడం, పునరుజ్జీవింపచేయడం
- అటవీ భూముల దురాక్రమణను అడ్డుకోవడం
- పెద్ద ఎత్తున సాగే వృక్షాల నరికివేతను నిలువరించడం
- సామాజిక అడవుల పెంపకానికి పెద్దఎత్తున చర్యలు చేపట్టడం
- ప్రజల భాగస్వామ్యంతో విస్తృతంగా మొక్కలు నాటి సంరక్షణకు సమగ్ర చర్యలు చేపట్టడం[2]
రెండో మరియు మూడో మరియు నాల్గో విడత హరితహారం[మార్చు]
- రెండో విడత హరితహారాన్ని నల్లగొండ జిల్లా గుండ్రంపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు ప్రారంభించటం జరిగింది.
- మూడో విడత హరితహారాన్ని కరీంనగర్ జిల్లాలోని దిగువ మానేరు డ్యామ్ వద్ద మొక్క నాటి ప్రారంభిచటం జరిగింది
- నాల్గో విడత హరితహారాన్ని మెదక్ జిల్లాలోని గజ్వేల్ లో ప్రారంభించారు
- ఐదో విడత హరితహారాన్ని కరీంనగర్ లో ప్రారంభిచటం జరిగింది
మూలాలు[మార్చు]
- ↑ గౌడ్స్ న్యూస్.కాం. "'తెలంగాణకు హరితహారం' మరో కొత్త రికార్డు సృష్టించబోతున్నది". goudsnewstv.com. Retrieved 5 January 2017.[dead link]
- ↑ తెలంగాణ మాస పత్రిక. "తెలంగాణకు హరితహారం". magazine.telangana.gov.in. Retrieved 6 January 2017.