కీర్తి ఆజాద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కీర్తి ఆజాద్ అని సంక్షిప్తంగా పిలువబడే కీర్తివర్థన్ భగవత్ ఝా ఆజాద్ (Kirtivardhan Bhagwat Jha Azad) 1959, జనవరి 2న బీహార్ లోని పూర్ణియలో జన్మించాడు. ఇతడు భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. 1980 నుంచి 1986 వరకు 7 టెస్టులలో, 25 వన్డేలలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అతని క్రీడాజీవితంలో అతిపెద్ద విజయం 1983లో భారత జట్టు విశ్వవిజేతగా నిలవడం. ఆజాద్ బీహార్ మాజీ ముఖ్యమంత్రి భగవత్ ఝా ఆజాద్ కుమారుడు.

1984 డిసెంబర్లో పాకిస్తాన్తో ఢిల్లీలో జరిగిన వన్డేలో పాకిస్తాన్ మొదట బ్యాటింగ్ చేసి 50 ఓవర్లలో 197 పరుగులు చేయగా తరువాత ఆడిన భారత్ ఒక వికెట్టు తేడాతో విజయం సాధించింది. కీర్తి ఆజాద్ వేగంగా 71 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడంతోనే భారత్‌కు విజయం లభించింది. ఇదే ఇన్నింగ్సులో పాకిస్తాన్ పేస్ బౌలర్ జాలాలుద్దీన్ వేసిన ఒక ఓవర్‌లో వరుసగా 3 సిక్సర్లు సాధించాడు.

అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిష్క్రమించిన తరువాత కీర్తి ఆజాద్ టెలివిజన్లో క్రికెట్ వ్యాఖ్యాతగా కొనసాగిననూ సునీల్ గవాస్కర్, రవిశాస్త్రిల వలె ఎక్కువకాలం నిలదొక్కుకోలేకపోయాడు.ఇటీవలి కాలంలో మ్యాచ్ అనంతరం హిందీ చాట్ షోలో తన స్వంత అభిప్రాయాలతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు.

క్రీడా జీవితం[మార్చు]

కీర్తి ఆజాద్ తన కెరీర్‌లో 7 టెస్టులలో 12 ఇన్నింగ్స్‌లలో 135 పరుగులు చేసి 10 ఇన్నింగ్స్‌లలో 3 వికెట్లు, 25 వన్డే మ్యాచ్‌లలో 21 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేసి 14.15 సగటుతో 269 పరుగులు చేశాడు. వన్డేలో అతని అత్యధిక స్కోరు ౩౯ (నాటౌట్) పరుగులు. 1983 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో ఆజాద్ సభ్యుడిగా ఉన్నారు.

రాజకీయ జీవితం[మార్చు]

ఆయన బీహార్‌లోని దర్భంగా నియోజకవర్గం 2009 నుండి 2019 వరకు ఎంపీగా ప్రాతినిధ్యం వహించాడు. కీర్తి ఆజాద్ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ 2015 డిసెంబరులో బీజేపీ  ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఆయన 2019 ఫిబ్రవరి 18న ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[1]

కీర్తి ఆజాద్ 2021 నవంబర్ 23న ఢిల్లీలో టీఎంసీ పార్టీ అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమక్షంలో తృణమూల్ కాంగ్రెస్‌లో చేరాడు.[2] ఆయన 2024లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో బెంగాల్‍లోని బర్ధమాన్-దుర్గాపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయనున్నాడు.[3]

మూలాలు[మార్చు]

  1. The Hindu (18 February 2019). "Rebel BJP MP Kirti Azad joins Congress" (in Indian English). Archived from the original on 10 March 2024. Retrieved 10 March 2024.
  2. The Economic Times (23 November 2021). "Congress leader Kirti Azad joins TMC". Archived from the original on 10 March 2024. Retrieved 10 March 2024.
  3. The Times of India (10 March 2024). "TMC announces cricketers Yusuf Pathan, Kirti Azad as candidates for West Bengal Lok Sabha seats". Archived from the original on 10 March 2024. Retrieved 10 March 2024.