తమలపాకు
| తమలపాకు | |
|---|---|
| తమలపాకు. | |
| Scientific classification | |
| Kingdom: | ప్లాంటే |
| Division: | Magnoliophyta |
| Class: | Magnoliopsida |
| Order: | పైపరేలిస్ |
| Family: | పైపరేసి |
| Genus: | పైపర్ |
| Species: | P. betle |
| Binomial name | |
| Piper betle లిన్నేయస్ |
|
తమలపాకు లేదా నాగవల్లి భారతదేశంలో విరివిగా ఉపయోగించే తాంబూలంలో ముఖ్యమైన భాగం. ఈ ఎగబ్రాకే మొక్కను తేమగల వేడి ప్రదేశాలలో పెంచుతారు.
ఉపయోగాలు [మార్చు]
- తమలపాకులను పూజ చేయునప్పుడు దేవునిముందు వుంచు కలశములో ఉంచుతారు.
- తాంబూలములో ఉపయోగిస్తారు. భోజనానంతరం తాంబూల సేవనము మన సంప్రదాయం.
- తమలపాకుల రసమును గొంతునొప్పి నివారణకు ఉపయోగిస్తారు.
- శ్వాసకోశ వ్యాధుల నివారణకై ఈ ఆకులను నూనె రాసి కొద్దిగా వేడిచేసి ఛాతీపై ఉంచుతారు.
- తమలపాకులకు నేయి రాసి గాయాలకు కట్టుకడతారు.
- తమలపాకుల రసమును చెవిలో పిండిన చెవినొప్పి తగ్గిపోవును.
- అపస్మారకమును నివారించుటకు తమలపాకుల రసమును పాలతో కలిపి త్రాగించెదరు.
సాగుచేయు విధానం [మార్చు]
తమలపాకు సంవత్సర వర్షపాతం 750-1500 మి.మీ. కలిగి, 10-40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత గలిగిన ప్రాంతాలు అనువైనవి. నీరు ఇంకే సారవంతమైన లేటరైట్ మరియు ఎర్ర గరప నేలలు వీటి సాగుకు అనువైనవి. ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా ఆధిక దిగుబడిని ఇచ్చే కపూరి రకాలను పండిస్తున్నారు.
మే-జూన్ నెలలలో భూమిని బాగా దున్ని చదునుచేసి ఎకరాకు 16-20 కిలోల అవిశ విత్తనాలను సాలుకు సాలుకు మీటరు దూరంలో ఉంచి సాలులో వత్తుగా విత్తాలి. ఈ అవిశ విత్తనాలను ఉత్తరం, దక్షిణం దిక్కులకు మాత్రమే విత్తుకోవాలి.
విత్తిన 2 నెలల తర్వాత సాళ్ళ మధ్య మట్టిని చెక్కి అవిశ మొదళ్ళ వద్ద వేసి కయ్యలు చేసి వాటి మధ్య 50 సెం.మీ. లోతు 20 సెం.మీ. వెడల్పు గల గుంతలను 20 సెం.మీ. ఎడంలో తీసి ఎకరాకు 20,000 తమలపాకు తల తీగలను 6-8 కణుపులు ఉండేటట్లు ఎన్నుకొని తీగలను నాటే ముందు 0.5 % బోర్డో మిశ్రమం+250 పి.పి.యం స్ట్రెప్టోసైక్లిన్ మిశ్రమంలో 10 నిమిషాలు శుద్ధిచేసి నాటుకోవాలి. ఈ విత్తనపు తీగలను ఆరోగ్యవంతమైన తోట నుండి సేకరించాలి. నాటడానికి ముందుగా నీరు పెట్టే కాలువలు, మురుగునీరు కాలువలను చేసుకోవాలి. చలి మరియు ఎండాకాలాల్లో తోటల చుట్టూ గాలులు సోకకుండా దడలు కట్టుకోవాలి.
తీగలు నాటిన మొదటి ముడు రోజుల వరకు రెండు పూటలా నీరు కట్టాలి. తర్వాత రోజూ ఒక పూట (సాయంత్రం) మాత్రమే కట్టాలి. ఆ తర్వాత రోజు మార్చి రోజు 3 సార్లు సాయంత్రం వేళ నీరు కట్టాలి. తర్వాత 10 రోజుల కొకసారి ఒక తడి చొప్పున నీరు పెట్టాలి. వేసవి కాలంలో 2-3 రోజులకొకసారి తడి ఇవ్వాలి.
చిగురించిన తీగలను, పెరగడానికి మొదలైన 15 రోజులకు జమ్ముతో అవిశ మొక్కలను కట్టి ప్రాకించాలి. ఈ పనిని 15-20 రోజుల కొకసారి చేయాలి. వేగంగా వీచే గాలులకు అవిశ మొక్కలు వంగే ప్రమాదమం ఉండడం వలన వీటిని ఒకదానికొకటి తాడుతో కట్టి, సాలు చివర నాటిన వెదురు గడలకు కట్టాలి. సరిపడేటంత వెలుతురు, నీడ ఉండేలా అవిశ కొమ్మలను కత్తిరించుకోవాలి. తెగులు సోకిన ఆకులను, తీగలను ఎప్పటికప్పుడు ఏరి కాల్చివేయాలి. రెండు సంవత్సరాల కొకసారి మొక్కజొన్నతో పంట మార్పిడి చేయాలి.
తీగ నాటే ముందు దుక్కిలో ఎకరాకు 40 కిలోల సూపర్ ఫాస్ఫేట్ రూపంలో భాస్వరం, 40 కిలోల పొటాష్ వేయాలి. తీగ నాటిన 2 నెలల నుండి నత్రజనిని ఎకరాకు 80 కిలోలు, వేపపిండి + యూరియా 1:1 నిష్పత్తిలో సంవత్సరానికి 4 నుండి 6 దఫాలుగా వాడాలి. ఎకరాకు ఒక టన్ను చొప్పున జిప్సం వేసుకోవాలి.
నాటిన 2 నెలలకు ఆకులు కోతకు వస్తాయి. తర్వాత ప్రతి నెల ఆకులకు ఇనుప గోరు సహాయంతో కోయాలి. మొదటి సంవత్సరంలో తోట నుండి ఎకరాలు 30,000 నుండి 40,000 పంతాలు (పంతం అంటే 100 ఆకులు), రెండవ సంవత్సరంలో 40,000 పంతాల దిగుబడి వస్తుంది.