పాలగుమ్మి సాయినాథ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పాలగుమ్మి సాయినాథ్

సాయినాథ్
జననం
వెబ్‌సైటు India Together

పాలగుమ్మి సాయినాథ్ (1957 - ) భారతదేశంలో పేరు గాంచిన జర్నలిస్టు లలో ఒకరు, జర్నలిజం విభాగంలో 2007వ సంవత్సరపు రామన్ మెగసెసె అవార్డు గ్రహీత. జర్నలిస్టు అని పిలిపించుకునే కన్నా, 'పల్లె రిపోర్టరు' లేదా 'రిపోర్టరు' అని పిలువబడటాన్ని ఇష్టపడతారు. పల్లె రైతులు, పేదరికం వంటి విషయాలను వెలుగులోనికి తీసుకురావడానికి ఎంతో కృషి చేసారు, చేస్తున్నారు. గత పధ్నాలుగు సంవత్సరాలుగా ఆయన సంవత్సరానికి 270-300 రోజులు పల్లెల్లో గడుపుతున్నారు. హిందూ పత్రికలో గ్రామీణ వ్యవహారల ఎడిటర్‌గా ఉద్యోగాన్ని నిర్వహిస్తున్నారు. ఈయన చేసిన పనిని మెచ్చి నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యా సేన్ "ఆకలి, కరువుల వంటి విషయాలపై నేడు ప్రపంచం లోని ఉత్తమ పరిశోధకులలో ఒకరు" అని ప్రశంచించారు.

పుట్టు పూర్వోత్తరాలు[మార్చు]

సాయినాథ్ ఆంధ్రప్రదేశ్‌లోని పేరొందిన కుటుంబం నుండి వచ్చిన వాడు. మాజీ రాష్ట్రపతి వి.వి. గిరి మనవడు. సాయినాథ్ 1957లో మద్రాసులో జన్మించాడు. మద్రాసులోని లయోలా కాలేజ్లో విద్యాభ్యాసం చేసాడు. సామాజిక రుగ్మతలు, రాజకీయ కోణాలకు సంబంధించిన ఆసక్తి అతనికి కాలేజీ విద్యార్థిగా ఉండగానే మొదలయ్యింది. ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో చదువుతున్నప్పుడు అతను విద్యార్థి రాజకీయాలలో పాల్గొన్నాడు. అక్కడి నుండి చరిత్రలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి 1980లొ యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియాలో జర్నలిస్టుగా ఉద్యోగజీవితాన్ని ప్రారంభించి ఆ వార్తాసంస్థ యొక్క అత్యుత్తమ అవార్డును అందుకున్నాడు. ఆ తరువాత రూసీ కరాంజియా యొక్క బ్లిజ్ట్ వారపత్రికలో పనిచేశాడు. ముంబాయి నుండి ప్రచురితమయ్యే ఈ ప్రముఖ భారతీయ టాబ్లాయిడ్ వారపత్రికకు ఆరు లక్షల సర్క్యులేషన్ ఉంది. బ్లిట్జ్లో విదేశీవ్యవహారాల సంపాదకుడిగా చేరిన సాయినాథ్, అదే పత్రికలో పదేళ్ల పాటు ప్రధాన ఉప సంపాదకుడిగా పనిచేశాడు. గత పాతిక సంవత్సరాలుగా ముంబాయిలోని సోఫియా కళాశాలకు చెందిన సోఫియా పాలిటెక్నిక్లో సామాజిక సమాచారప్రసార మాధ్యమాల కోర్సును భోధిస్తూ వచ్చాడు,[1] చెన్నైలోని ఆసియా జర్నలిజం కళాశాలలో బోధిస్తూ నవతరం పాత్రికేయ విద్యార్థులను ఉత్తేజితుల్ని చేస్తున్నాడు.

విమర్శలు[మార్చు]

సాయినాథ్ గారి ఘాటు జర్నలిజం ఎంతో మంది విమర్శకులను తయారుచేసి ఉండవలసింది, కానీ ఎందుకో అతనిపై విమర్శలు చెప్పుకోదగివంత లేవు. ఎన్ని తప్పులను ఎత్తి చూపినా అతని వృత్తి గౌరవానికి ఎవరూ అడ్డుచెప్పడం చూడలేదు. ఔట్‌లుక్ పత్రికలో సుర్జిత్ ఎస్. భల్లా అనే ఆయన విమర్శ ఒక్కటి కొంత చెప్పుకోవచ్చును.

గౌరవాలు, పురస్కారాలు[మార్చు]

జర్నలిజం, సాహిత్యం, కమ్యూనికేషన్ రంగాలలో నోబెల్ పురస్కారానికి దీటుగా పరిగణించబడే రామన్ మెగసెసె పురస్కారాన్ని 2007లో గెలుచుకున్న ఒకే ఒక్క భారతీయుడు.

మూలాలు[మార్చు]

  1. "Social Communications Media". Scmsophia.com. 22 November 2011. Archived from the original on 6 నవంబరు 2011. Retrieved 29 November 2011.