Coordinates: 18°52′26″N 84°27′09″E / 18.8738007°N 84.452563°E / 18.8738007; 84.452563

మందస

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మందస
—  రెవిన్యూ గ్రామం  —
మందస రైల్వే స్టేషన్
మందస రైల్వే స్టేషన్
మందస రైల్వే స్టేషన్
మందస is located in Andhra Pradesh
మందస
మందస
అక్షాంశరేఖాంశాలు: 18°52′26″N 84°27′09″E / 18.8738007°N 84.452563°E / 18.8738007; 84.452563
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా శ్రీకాకుళం
మండలం మందస
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 9,747
 - పురుషుల సంఖ్య 4,807
 - స్త్రీల సంఖ్య 4,940
 - గృహాల సంఖ్య 2,295
పిన్ కోడ్ 532242
ఎస్.టి.డి కోడ్

మందస, శ్రీకాకుళం జిల్లా, ఇదే పేరుతో ఉన్న మందస మండలం కేంద్రం. ఇది సమీప పట్టణమైన పలాస-కాశీబుగ్గ నుండి 18 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2295 ఇళ్లతో, 9747 జనాభాతో 674 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 4807, ఆడవారి సంఖ్య 4940. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 932 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 444. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 580328[1].పిన్ కోడ్: 532242.

మందస చారిత్రక పట్టణం.ఇక్కడ ఉన్న పురాతన వాసుదేవాలయం, రాజా వారి కోట, ప్రక్కనే ఉన్న చిట్టడవి, అడవిలో ఉన్న అమ్మవారి గుడి చూడదగినవి. (క్రిందన ఉన్న మందస లింకులో వివరాలు చూడగలరు).మందస మండలంలోని మహేంద్రగిరి వద్దగల గుహాసముదాయంలో పాండవులగుహ చూడదగింది .ఇక్కడే పాండవులు చాలాకాలం అజ్ఞాతం చేసారని చెపుతారు. ఇక్కడే గల వాసుదేవ ఆలయంలో, ప్రక్కన గల శివాలయంలోనూ శివరాత్రికి బ్రహ్మాండమైన ఉత్సవం జరుగును.

ఈ గ్రామం మేజరు పంచాయితీ.గ్రామంలో 33 వీధులు ఉన్నాయి.ఈ గ్రామానికి పూర్వ నామం మంజూష.మంజూషమంటే సంస్కృతంలో నగల పెట్టె అని అర్థం.అనేకమైన నీటి వనరులతో సస్యశ్యామల మైన ఈ ప్రాంతం 800 ఏళ్ళ నుండి మందస సంస్థానానికి ముఖ్య పట్టణం.ఇక్కడి మందస రాజావారి కోట, 700 సంవత్సరాల పురాతన వాసుదేవ స్వామి ఆలయం, పర్యాటకపరంగా ప్రాధాన్యత ఉన్నాయి.గ్రామంలో ఇంకా బొట్టేశ్వరాలయం, జగన్నాధస్వామి ఆలయం, నరసింహ స్వామి ఆలయం, చండేశ్వరాలయం, గ్రామదేవత అన్నపూర్ణ ఆలయం వంటి పురాతన ఆలయాలు 20 వరకు ఉన్నాయి.ప్రసిద్ధ మహేంద్ర గిరి యాత్ర ప్రతి శివరాత్రికి ఇక్కడినుంచే ప్రారంభం అవుతుంది.

మందసలోని వాసుదేవ పెరుమాళ్ దేవాలయం.

విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు నాలుగు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాల ఒకటి, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి, ప్రైవేటు మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉంది. ఒక ప్రభుత్వ అనియత విద్యా కేంద్రం ఉంది.

సమీప ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల హరిపురంలోను, ఇంజనీరింగ్ కళాశాల రామకృష్ణాపురంలోనూ ఉన్నాయి. సమీప మేనేజిమెంటు కళాశాల రామకృష్ణాపురం లోను, వైద్య కళాశాల, పాలీటెక్నిక్‌లు శ్రీకాకుళంలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల పలాసలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల శ్రీకాకుళం లోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం[మార్చు]

  • మందసలో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు, ఆరుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఇద్దరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.
  • సంచార వైద్య శాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం[మార్చు]

గ్రామంలో4 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఒక ఎమ్బీబీయెస్ డాక్టరు, ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీలు చదివిన డాక్టర్లు ఇద్దరు, డిగ్రీ లేని డాక్టరు ఒకరు ఉన్నారు. రెండు మందుల దుకాణాలు ఉన్నాయి.

తాగు నీరు[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.

పారిశుధ్యం[మార్చు]

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు[మార్చు]

  • మందసలో పోస్టాఫీసు సౌకర్యం, సబ్ పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి.
  • గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.
  • ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు[మార్చు]

గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ ఉన్నాయి.

సహకార బ్యాంకు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి.

వీర నారి గున్నమ్మ[మార్చు]

గ్రామానికి వెళ్ళే ముఖద్వారంలో ఆమె పేరున ఏర్పాటు చేసిన సింహద్వారం చిత్రం

వీర నారి గున్నమ్మ - బ్రిటిష్ ముష్కరుల చర్యలను ఓ సామాన్య మహిళ ఎదిరించింది . ధైర్యంగా ముందుకు కదిలింది. ఆంగ్లేయులతో పోరుకు సై అన్నది . కదనరంగంలో వారి తూటాలకు బలై వీర గున్నమ్మగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా మిగిలింది. యుక్త వయసులో ఉన్న ' సాసుమాన గున్నమ్మ ' నీరనారిగా కదం తొక్కుతూ ముందుకు ఉరికింది.ఆమె పై పోలీసులు తుపాకీ కాల్పులు జరిపారు. తూటాలకు గురై నిండు చూలాలు గున్నమ్మ అక్కడికక్కడే మృతిచెందింది . ఆమె స్మారకార్ధం ఆమె నివాస గ్రామం శ్రీకాకుళం జిల్లా, మందస మండలంలోని మందస గ్రామాన్ని వీరగున్నమ్మపురంగా పిలుస్తారు. ఆ గ్రామానికి వెళ్ళే ముఖద్వారంలో ఆమె పేరున సింహద్వారాన్ని ఏర్పాటు చేసారు

విద్యుత్తు[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 17 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం[మార్చు]

మందసలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 124 హెక్టార్లు
  • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 238 హెక్టార్లు
  • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 135 హెక్టార్లు
  • బంజరు భూమి: 121 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 54 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 3 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 172 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు[మార్చు]

మందసలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 172 హెక్టార్లు

ఉత్పత్తి[మార్చు]

మందసలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు[మార్చు]

వరి, వేరుశనగ, పెసర

వాసుదేవాలయం[మార్చు]

సుమారు 700 సంవత్సరాల క్రితం నిర్మితమయినదిగా భావిస్తున్న ఈ ఆలయం నిర్మాణానికి సంబంధించిన పూర్తి ఆధారాలు లభ్యం కానప్పటికీ సుమారు 266 సంవత్సరాలక్రితం ఇది పునర్నిర్మితమయినట్టు ఇక్కడ లభించిన ఆధారాలబట్టి తెలియవచ్చింది.ఎర్రని ఇసుక రాయితో ఒడిషా శైలిలో తీర్చిదిద్దిన ఈ ఆలయ అపూర్వ శిల్పసంపద వర్ణనాతీతం.ఆలయంలో నెలకొని ఉన్న నిలువెత్తు సాలగ్రామ మూలమూర్తి తిరుపతి వెంకటేశ్వరుని విగ్రహాన్ని పోలివుండి చూపరులను కట్టిపడేస్తుంది. గత శతాబ్దము చివర వరకు ఇది మంచి వేదాధ్యయన కేంద్రముగా విలసిల్లినట్లు కూడా తగిన ఆధారాలు లభించినాయి.

వాసుదేవాలయం-చరిత్ర[మార్చు]

ఆ కాలంలో మందసా రామానుజులను ప్రసిద్ధ వేదవిద్వాంసులు ఈ ఆలయప్రాంగణంలోనే వేదవిద్యను నేర్పుతూ కాశీ వరకు కూడా పర్యటించి పలువురు వేద విద్వాంసులను వేదాంత చర్చలలో ఓడించి పలు సన్మానపత్రములను పొంది ఉన్నారట.మందసా రామానుజుల కీర్తిని గురించి తెలుసుకున్నచిన్నజీయరు స్వామివారి గురువు పెద్దజీయరు స్వామివారు, వారి మిత్రులు గోపాలాచార్యస్వామివారితో కలసి నేటి రాజమండ్రి నుంచి శ్రీభాష్యం అధ్యయనం చేయడానికి కాలినడకన మందసకు వేంచేయడం జరిగింది.వారిని ఆదరించిన మందసా రామానుజులు వారిచే శ్రీభాష్యం అధ్యయనం చేయించడానికి అంగీకరించారు.నాటి రాత్రి ఆలయప్రాంగణంలో నిద్రించిన శిష్యులిద్దరికీ వారు రాజమండ్రి వద్ద దాటి వచ్చిన గోదావరి వంతెన విరిగి వరదలో కొట్టుకుపోయినట్లు కలవచ్చింది.అది అపశకునంగా భావించిన శిష్యులిద్దరు తమ విద్యాభ్యాసానికి ఆటంకము కలుగుతుందేమోనని భయపడుతూ గురువు గారివద్దకు వెళ్ళి కల సంగతి చెప్పారు.గురువుగారు వారిని ఊరడించి ఆలయంలో వేంచేసియున్నశ్రీ వాసుదేవ పెరుమాళ్ వద్దకు వారిని తీసుకుని వెళ్ళి స్వామికి సాష్టాంగనమస్కారము చేయించి, వారు కూడా చేసినారట.ఆ సమయంలో వాసుదేవుని విగ్రహం నుండి ఓ దివ్యమయిన కాంతి ప్రసరించినదట.వాసుదేవుని అనుగ్రహం వల్ల శిష్యులిద్దరు సుమారు 2 సంవత్సరాలలో పూర్తికావలసిన శ్రీభాష్యం అధ్యయనాన్ని కేవలం 6 నెలలలోనే పూర్తి చేసుకుని తిరుగుప్రయాణం అయ్యారట.అందుకని ఇక్కడి దేవుని జ్ఞానప్రదాతగా, అభయప్రదాతగా భక్తులు కొలుస్తారు. కాలాంతరంలో దివ్యమైన ఈ ఆలయం పాలకుల నిరాదరణకు గురి అయ్యి పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. ఆలయానికి చెందిన అపూర్వ శిల్పసంపద చాలావరకు ఆకతాయి చేష్టలకు నాశనం కాబడింది.సుమారు 1683ఎకరాలు మాన్యం ఉన్నప్పటికీ ఈ ఆలయం మనిషి స్వార్థానికి ప్రతీకగా శిథిలమయ్యింది.ప్రస్తుతం కేవలం 3ఎకరాల భూమి మాత్రమే రెవెన్యూ రికార్డుల ప్రకారం అందుబాటులో ఉంది. ఆలయగోడలమీద పిచ్చిమొక్కలు పెరిగి విషజంతువుల సంచారంతో సుమారు 50 సంవత్సరాల కాలం ఈ అపురూప ఆలయం జనబాహుళ్యానికి దూరంగా ఉండిపోయింది.

చినజీయరు ఆగమనం-పునర్వైభవం[మార్చు]

ఈ సమయంలో 1988 లో ఈ ఆలయ చరిత్ర తెలుసుకున్న చిన్నజీయరు స్వామివారు ఆలయసందర్శనార్ధం మందసకు వేంచేసి, ఖర్చుకు వెరవకుండా ఆలయ ప్రాచీనతకు భంగం కలుగకుండా పునర్నిర్మించాలని సంకల్పించారు.అన్ని ప్రభుత్వ లాంచనాలు పూర్తి చేసి దేవాదాయ శాఖ వారినుండి ఆలయాన్ని స్వాధీనం చేసుకుని, ఒడిషా నుంచి శిల్పులను రప్పించి యదాతధంగా ఆలయాన్నిపునర్నిర్మింపచేసారు.గురువు పెద్దజీయరు స్వామివారి విద్యాభ్యాసానికి గుర్తుగా వారి శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయరు స్వామివారు 2009 ఫిబ్రవరి నెలలో పూర్తిగా శిథిలమయిన ఈ ఆలయాన్ని పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది. ప్రస్తుతం గుడి మాన్యం తిరిగి దేవునికే చెందేలా చర్యలు తీసుకోబడుతున్నాయి.శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ప్రముఖ ఆలయాలు అరసవెల్లి, శ్రీకూర్మం, శ్రీముఖలింగం మొదలగు వాటికి సమానంగా ఈ ఆలయం కూడా క్రమేపి ప్రాధాన్యత పొందుతున్నది. జిల్లాలో వివిధ ప్రాంతాలనుంచే కాకుండా ఇతర జిల్లాలు, ఒడిషా నుండి కూడా అనేకమంది భక్తులు వస్తుంటారు. ప్రతి సంవత్సరం మాఘమాసంలో అనగా ఫిబ్రవరి నెలలో బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించబడతాయి. ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతున్న ఈ ఆలయం తప్పక సందర్శించతగినది.

దగ్గరలో ఉన్న స్టేషను పలాస (18 కిమీ). జాతీయ రహదారి 5 నుండి కేవలం 5 కిమీ.శ్రీకాకుళం జిల్లా కేంద్రం నుండి 100 కిమీ.విశాఖపట్నం నుండి 200 కిమీ.

మూలాలు[మార్చు]

  1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=మందస&oldid=3787350" నుండి వెలికితీశారు