రేలంగి వెంకట్రామయ్య
రేలంగిగా పేరుగాంచిన రేలంగి వెంకట్రామయ్య (ఆంగ్లం: Relangi Venkata Ramaiah) పద్మ శ్రీ అవార్డు పొందిన మొదటి హాస్యనటుడు.
విషయ సూచిక |
[మార్చు] బాల్యం
రేలంగి వెంకట్రామయ్య రావులపాడులో 1910 ఆగష్టు 9వ తేదీన జన్మించారు. రేలంగి తండ్రి హరికథలు, సంగీతం నేర్పించేవాడు. రేలంగి చిన్నతనం నుండి తన తండ్రి దగ్గర సంగీతం, హరికథలు నేర్చుకుంటూ పాటలు, పద్యాలు పాడడంలో మంచి పేరు తెచ్చుకున్నాడు. 1919లో 'బృహన్నల' అనే నాటకంలో స్త్రీ పాత్రతో మొదటిసారి నటించాడు. ఎస్వీ రంగారావు, అంజలీదేవి మొదలయిన వారు సభ్యులుగా ఉన్న యంగ్మెన్ హ్యాపీ క్లబ్ నిర్వహించే నాటకాలలో వేషాలు వేసేవాడు.
[మార్చు] సినీ రంగ ప్రవేశం
1931లో విడుదలయిన భక్త ప్రహ్లాద' చిత్రం చూసి తాను కూడా చలనచిత్రాలలో నటించాలని నిశ్చయించుకొని కలకత్తా చేరుకున్నాడు. అక్కడ సి.పుల్లయ్య నిర్మిస్తున్న శ్రీకృష్ణ తులాభారంలో రేలంగికి చిత్రాలలో మొదటి అవకాశం లభించింది. తర్వాత వరవిక్రయం, గొల్లభామ మొదలయిన చిత్రాలలోని వేషాలతో పాటు చిన్న చిన్న వేషాలు వేసినా గుర్తింపు రాలేదు. దాదాపు పన్నెడేళ్ళ తర్వాత గుణసుందరి కథ చిత్రంలో పోషించిన పాత్రకు మంచి గుర్తింపు వచ్చి రేలంగికి హాస్యనటుడిగా పేరు ప్రఖ్యాతులు, మరిన్ని అవకాశాలు తీసుకువచ్చింది.
[మార్చు] విజయాలు
తర్వాత దాదాపు ప్రతి సినిమాలో రేలంగి ఒక ప్రముఖ పాత్రలో కనిపించేవాడు. ముఖ్యముగా మిస్సమ్మ, మాయాబజార్, దొంగరాముడు, వెలుగునీడలు, విప్రనారాయణ, నర్తనశాల, అప్పు చేసి పప్పు కూడు మొదలయిన చిత్రాలలో వేసిన పాత్రలు కథానాయకుడి సరిసమాన పేరు ప్రాముఖ్యతలను తెచ్చిపెట్టాయి. రేలంగి పోషించిన కొన్ని పాత్రలు:
- నర్తనశాలలో - ఉత్తరకుమారుడు
- మాయాబజార్లో - లక్ష్మణకుమారుడు
- సత్య హరిశ్చంద్రలో - నక్షత్రకుడు
- లవకుశలో - రజకుడు
- జయభేరిలో - లచ్చన్న బంగారయ్య
- జగదేకవీరుడులో - రెండు చితలు
- సువర్ణ సుందరిలో - కైలాసం
- ప్రేమించి చూడులో - బుచ్చబ్బాయ్
- వెలుగునీడలులో - వెంగళప్ప
- అప్పుచేసి పప్పుకూడులో - భజగోవిందం
- మిస్సమ్మలో - దేవయ్య
రేలంగి సరసన సూర్యకాంతం, గిరిజ ఎక్కువ నటించారు. రేలంగి నటుడిగా మాత్రమే కాకుండా కొన్ని చిత్రాలలో పాటలు కూడా పాడేవాడు. 'వినవే బాల నా ప్రేమ గోల ' 'కాణీ ధర్మం సెయ్ బాబూ ' 'సరదా సరదా సిగిరెట్టు ' వంటి రేలంగి పాడిన పాటలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. నిర్మాతగా రేలంగి సామ్రాజ్యం అనే చిత్రాన్ని నిర్మించాడు. ఈ చిత్రం హాస్యనటుడు రాజబాబుకు మొదటి చిత్రం.
[మార్చు] గొప్పదనం
రేలంగి ఎన్నో కళాశాలలకు విరాళాలు ఇచ్చేవాడు. ఎందరికో వివాహాలకు సహాయం చేసేవాడు. రేలంగి ఇంట నిత్యం అన్నదానములు జరిగేవి. పద్మ శ్రీ అవార్డు పొందిన మొదటి హాస్యనటుడయిన రేలంగి 1975 నవంబరు 26 న కన్నుమూశాడు.