గుత్తి రామకృష్ణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గుత్తి రామకృష్ణ
జననంగుత్తి రామకృష్ణ
(1915-07-13)1915 జూలై 13
India అనంతపురం , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
మరణం2009 మే 12
అనంతపురం
మరణ కారణంవార్ధక్యము
వృత్తిపాత్రికేయుడు
ప్రసిద్ధికమ్యూనిస్టు పార్టీ నాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, కథారచయిత
మతంహిందూ
భార్య / భర్తనాగలక్ష్మమ్మ
పిల్లలువిజయకుమారి

నాగార్జున

ప్రభావతి

ఆనందవర్ధన్

పద్మావతి
తల్లిదండ్రులునారాయణమ్మ, గుత్తి వెంకటప్ప

గుత్తి రామకృష్ణ రాయలసీమ కథకుడు, పాత్రికేయుడు, స్వాతంత్ర్య సమరయోధుడు. ఇతడు అనంతపురం జిల్లాలో కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాకులలో ఒకడు.

జీవితవిశేషాలు[మార్చు]

బాల్యం, విద్యాభ్యాసం[మార్చు]

ఇతడు 1915, జూలై 13న అనంతపురం పాతవూరులోని అంబారపు వీధిలో గుత్తి వెంకటప్ప, నారాయణమ్మ దంపతులకు జన్మించాడు. ఇతడు జన్మించిన తరువాత ఇతని తండ్రి సన్యాసం స్వీకరించి ఆధ్యాత్మిక జీవనం గడిపి, ఎక్కడెక్కడో తిరిగి చివరకు హంపిలో మరణించాడు. అప్పటికి రామకృష్ణ వయసు 3 సంవత్సరాలు. తండ్రి మరణంతో ఇతడు తన మేనమామ వెంకటరమణప్ప వద్ద పెరిగాడు. ఇతని ప్రాథమిక విద్యాభ్యాసం అనంతపురం మునిసిపల్ హైస్కూలులో నడిచింది. చదివే రోజులలో ఇతడు క్లాసు పుస్తకాల కంటే ఇతర పుస్తకాలు ఎక్కువగా చదివేవాడు. అనంతపురం కాలేజీలో దఫేదారుగా పనిచేసిన ఇతని మేనమామ ఇతనికి లైబ్రరీ నుండి మంచి మంచి పుస్తకాలు తెచ్చి ఇచ్చేవాడు. హైస్కూలు చదివే రోజులలోనే వీరేశలింగం రచనలు 10 వాల్యూములు చదివాడు. ఇతడికి చిన్ననాటి నుండే ఆంగ్లేయులంటే ద్వేషం అబ్బింది. అందుకే ఇతడు ఇంగ్లీషు భాష పట్ల కూడా ద్వేషంతో ఆ సబ్జెక్టు చదివేవాడు కాదు. ఫలితంగా ఎస్.ఎల్.సి. పరీక్షలో ఇంగ్లీషు పరీక్ష తప్పాడు. 1936-39లో మచిలీపట్నంలోని ఆంధ్ర జాతీయ కళాశాలలో నెలకు 8 రూపాయల ఉపకార వేతనంతో చదివాడు. అక్కడ అడివి బాపిరాజు, కాటూరి వేంకటేశ్వరరావులు ఇతని గురువులు. 1937లో ఆచార్య ఎన్.జి.రంగా రైతాంగ విశ్వవిద్యాలయంలో సమ్మర్ స్కూల్‌లో చదివాడు.

హరిజన హాస్టల్[మార్చు]

చదువు ముగించుకుని అనంతపురం వచ్చి ఐదుకల్లు సదాశివన్తో కలిసి హరిజన హాస్టల్ నిర్వహించాడు. ఎర్రమల కొండప్ప, 1934లో గాంధీ అనంతపురం వచ్చిన సందర్భంలో దానంగా ఇచ్చిన రెండెకరాల స్థలాన్ని హరిజనోద్ధరణ కోసం కేటాయించగా ఆ స్థలంలో కొట్టాలు వేసి హరిజన హాస్టల్‌ను ప్రారంభించారు. ఇతడు సదాశివన్తో కలిసి గ్రామగ్రామం తిరిగి తిండిగింజలు సేకరించి హాస్టల్ పిల్లలకు భోజన వసతి కల్పించాడు.

రాజకీయ జీవితం[మార్చు]

ఇతడు కల్లూరు సుబ్బారావు, పప్పూరు రామాచార్యులు, ఎర్రమల కొండప్ప మొదలైనవారి నాయకత్వంలో పనిచేశాడు. కాంగ్రెస్‌ పార్టీలో ఉంటూ కమ్యూనిస్టు భావాలవైపు ఆకర్షితుడయ్యాడు. 1939లో తరిమెల నాగిరెడ్డి, నీలం రాజశేఖరరెడ్డి, ఐదుకల్లు సదాశివన్ లతో కలిసి అనంతపురం జిల్లాలో మొట్టమొదటి కమ్యూనిస్ట్ సెల్ ప్రారంభించాడు. 1941లో ఆకాశవాణి రహస్యపత్రిక నడపడంలో మొదటి ముద్దాయి ఐదుకల్లు సదాశివన్తో పాటు మరో ఇద్దరిని విచారణ నిమిత్తం బేడీలు వేసి కొన్ని నెలలు జిల్లా అంతటా తిప్పి బళ్ళారి, అల్లీపురం జైళ్లలో ఒక సంవత్సరం శిక్ష విధించారు. ఆ ఇద్దరిలో గుత్తి రామకృష్ణ ఒకడు. జైలులో కూడా ఇతడు తోటి ఖైదీలలో కమ్యూనిస్టు భావాలను రేకెత్తించాడు. అక్కడ జరిగిన కాల్పులలో ఇతడు ఒక కన్నును కోల్పోయాడు. సంవత్సరం తరువాత మొదటగా విడుదలైన గుత్తి రామకృష్ణ వి.కె.ఆదినారాయణ రెడ్డితో కలిసి జిల్లా అంతటా తిరిగి కమ్యూనిస్టు భావాలను ప్రచారం చేశాడు. విద్యార్థి, రైతు ఉద్యమాలలో కూడా చురుకుగా పనిచేశాడు. ఇతడు పోలీసుల అరెస్టు నుండి తప్పించుకునేందుకు 1943లో వ్యాపారం నెపం వేసుకుని సిలోన్ వెళ్ళి ఒక సంవత్సరం తలదాచుకున్నాడు.

వ్యాపారం[మార్చు]

కమ్యూనిస్టు రాజకీయాలనుండి తప్పించాలనే ఉద్దేశంతో ఇతని బంధువులు ఇతడిని సిలోన్కు ఉల్లిగడ్డల (ఉల్లిపాయల) వ్యాపారానికి పంపించారు. ఆ రోజులలో అనంతపురం జిల్లాలో ఉల్లిగడ్డలు విస్తారంగా పండించేవారు. సిలోన్లో ఉల్లిగడ్డలకు మంచి గిరాకీ ఉండేది. ఇతడు కొలంబోలో ఉంటూ అనంతపురం నుండి ఉల్లిగడ్డలు తెప్పించి విక్రయించేవాడు. కొలంబోలో ములాస్ అనే వ్యాపారికి మిలటరీ కాంట్రాక్ట్ ఉండేది. రామకృష్ణ ములాస్‌కు ఉల్లిగడ్డలు సప్లై చేసేవాడు. సిలోన్లో ఉంటూ ఇతడు కమ్యూనిస్టు పార్టీ సభలకు హాజరౌతూ పార్టీతో సంబంధాలు పెంచుకున్నాడు. దానితో ఇతనిపై పోలీసు నిఘా పెరిగింది. ఈ దశలో కాంట్రాక్టర్ ములాస్ ఇతడిని అనంతపురం జిల్లాకు తన ఏజెంట్‌గా వెళ్లమని ప్రతిపాదన చేశాడు. దానికి ఇతడు అంగీకరించి అనంతపురం తిరిగి వచ్చి ధర్మవరం కేంద్రంగా చేసుకుని పలుప్రాంతాల నుండి ఉల్లిగడ్డలు సేకరించి కొలంబోకు పంపించసాగాడు.

వివాహం[మార్చు]

ఈ దశలో ఇతడికి పెనుకొండలోని కాంట్రాక్టర్ బండి రామప్ప కుమార్తె నాగలక్ష్మమ్మతో వివాహం జరిగింది. ఈ వివాహానికి తరిమెల నాగిరెడ్డి, ఐదుకల్లు సదాశివన్, నీలం రాజశేఖరరెడ్డి, విద్వాన్ విశ్వం తదితరులు హాజరయ్యారు.

కృష్ణా బుక్ స్టాల్[మార్చు]

ఆ రోజుల్లో అనంతపురంలో రెండే పుస్తక విక్రయ కేంద్రాలుండేవి. జనరల్ పుస్తకాలు పద్మాబుక్‌స్టాల్ లో మాత్రమే లభించేవి. లెనిన్ రచనలు రష్యన్ ఎడిషన్ అసలు ధర 3 రూపాయలు కాగా 8 రూపాయలకు అమ్మేవారు. ఇది గమనించిన తరిమెల నాగిరెడ్డి పార్టీ తరఫున పుస్తకాల షాపు పెట్టాలని తీర్మానించాడు. ఆ పనిని గుత్తి రామకృష్ణకు అప్పగించారు. పార్టీ ప్రోత్సాహ సహకారాలతో 1947లో కృష్ణాబుక్‌స్టాల్ ఇతడు ప్రారంభించాడు. అయితే సంవత్సరం తిరగకముందే ఇతడిని డిటెన్యూగా కడలూరు జైలుకు పట్టుకెళ్లి మూడు సంవత్సరాలు శిక్ష విధించారు. దీనితో బుక్‌స్టాల్ మూతపడింది. 1952లో జైలు నుండి విడుదలయిన తర్వాత రెండవసారి కృష్ణా బుక్‌స్టాల్ ను ప్రారంభించాడు. కమ్యూనిస్టు పుస్తకాలతో పాటు ఇతర సాహిత్య పుస్తకాలు, వేదాలు, పురాణాలు మొదలైన అన్ని పుస్తకాలను అమ్మేవాడు. 15 ఏళ్లపాటు ఈ పుస్తకాల షాపు బాగా నడిచింది. కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా చరిత్రలో అది ఒక స్వర్ణయుగం. కృష్ణా బుక్ స్టాల్ పార్టీకి సమన్వయ కేంద్రంగా ఉండేది. ఇతడు కమ్యూనిస్ట్ పార్టీ కో ఆర్డినేటర్‌గా పనిచేశాడు. తరిమెల నాగిరెడ్డి, నీలం రాజశేఖరరెడ్డి, నీలం రామసుబ్బారెడ్డి, పైడి లక్ష్మయ్య తదితర నాయకులు, పలువురు మేధావులకు కృష్ణా బుక్‌సెంటర్ ఒక అడ్డాగా మారింది. పట్టణంలో జరిగే అనేక రాజకీయ, సాంస్కృతిక కార్యక్రమాలు ఇక్కడ రూపుదిద్దుకునేవి. ఆవిధంగా జిల్లా రాజకీయ, సాంస్కృతిక వికాసంలో కృష్ణా బుక్‌స్టాల్ పాత్ర అమోఘమైనది. 1964లో కమ్యూనిస్టు పార్టీలో చీలిక వచ్చిన నేపథ్యంలో ఈ కృష్ణాబుక్ స్టాల్ మూతపడింది.[1].

పాత్రికేయ జీవితం[మార్చు]

ఇతడు స్వాతంత్ర్యానికి పూర్వమే బ్రిటీష్ హయాంలోనే స్వతంత్రభారత్, ఆకాశవాణి పత్రికలకు జిల్లా సమస్యల గురించి వ్యాసాలు, వార్తలు వ్రాస్తూ ప్రజా సమస్యలను ప్రతిబింబింప జేసేవాడు. ప్రజాశక్తి, విశాలాంధ్ర, దక్కన్ క్రానికల్, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, ఈనాడు, జనశక్తి, ఉజ్జ్వల, జనత మొదలైన పత్రికలకు తొలి విలేఖరిగా పనిచేశాడు. దాదాపు 70 సంవత్సరాలు పత్రికా విలేఖరిగా పనిచేశాడు. భారత బంజార సంఘం ప్రోత్సాహంతో బంజారా పత్రికను అనంతపురం నుండి రెండేళ్లపాటు సంపాదకుడిగా ఉండి నడిపాడు. జనప్రభ దినపత్రికకు కూడా సంపాదకుడిగా పనిచేశాడు.

కథలు[మార్చు]

ఇతడు పాత్రికేయుడే కాదు కథారచయిత కూడా. ఇతడు వ్రాసినవి సుమారు 10 కథలే అయినా అవి ఇతనికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. మొన్నమొన్నటి వరకు ఇతడినే అనంతపురం జిల్లా తొలి కథారచయితగా భావిస్తూ వచ్చారు. ఇతడు వ్రాసిన కథలలో కొన్ని:

  • గంజి కోసరం
  • చిరంజీవి
  • శిల్పి
  • వడ్లగింజలో
  • జొన్నచేను
  • కూటికోసం

1964లో అనంతపురంలో కథాసమ్మేళనం జరిగింది. ఆ సభలో ఇతడు గంజికోసరం కథను చడివాడు. ఆ సందర్భాన్ని పులికంటి కృష్ణారెడ్డి తన మాటల్లో ఇలా వివరిస్తాడు. "ఆ సమ్మేళనంలో మధురాంతకం రాజారాం, కొలకలూరి ఇనాక్, కలువకొలను సదానంద, గుత్తి రామకృష్ణ, నేను కథలు చదవాల, కొలకలూరి ఇనాక్ పైకి లేసె. అప్పుడాయన అనంతపురంలోనే తెలుగు డిపార్టుమెంట్‌లో లెక్చరర్‌గా పనిచేస్తావుండాడు. కత చదవడానికి మొదలుపెట్టె. ఆరంభం అద్భుతంగా ఉండె. అయినా వాళ్లకేం పోయేకాలమో? చదవనీలేదే? ఆ పోరు పళ్లేక ఆయన గమ్మున కూసుండె. సద్దుమణిగె. రాజారాం పైకిలేసె. ఒకే ఒక్క పేరా చదివె. రంపులు... రచ్చలు... ఈలలు!! ..'ఛీఛీ ఈ యదవలకు కత విలువె తెల్దు' గొణుక్కుంటూ ఆయన కూకుండె. సదానందం వంతొచ్చె. నాయాలు శానా జాగర్తగా కత చదివినానంటే చదివినాననిపించె. అప్పుడు పైకి లేచె రామకృష్ణ. రామకృష్ణ ఉండూరు మనిసి! కరువులో గంజి కేంద్రాల మింద కత. అనంతపురం యాస. ఎంత గొప్ప కతో అంత గొప్పగాచదివె. సబలో చప్పట్లు మార్మోగె. అనంతపురం మాండలికానికి మచ్చుతునక. అటువంటి గొప్పకత సీమకతల్లో లేకపొయ్యిందే అంటా ఇప్పటికీ బాధగానే వుంది. రామకృష్ణకు రెండు చేతులెత్తి దండం పెడ్తి." దీనిని బట్టి ఆ కథ గొప్పతనం ఊహించుకోవచ్చు.

మరణం[మార్చు]

ఇతడు 2009, మే 12వ తేదీన తన 95వ యేట తుదిశ్వాస విడిచాడు.

మూలాలు[మార్చు]

  1. స్వాతంత్ర్య సమరయోధుడు గుత్తి రామకృష్ణ - అనంతనేత్రం, అనంతపురం జిల్లా ప్రత్యేక సంచిక, వార్త దినపత్రిక పేజీ 116

బాహ్య లంకెలు[మార్చు]