డయ్యూ

వికీపీడియా నుండి
(డామన్ డయ్యూ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

డామన్ డయ్యూ, (Daman and Diu) అనేది భారతదేశంలో ఒక కేంద్రపాలిత ప్రాంతం.[1] అరేబియా సముద్రం తీరాన ఉన్న డామన్ డయ్యూ , గోవా, దాద్రా, నాగర్-హవేలీ చిన్న ప్రాంతాలలో ఇది ఒకటి. ఇది డయ్యూ జిల్లాకు ముఖ్య పట్టణం

చరిత్ర[మార్చు]

1531లో డామన్‌ను పోర్చుగీసువారు ఆక్రమించారు.1539లో గుజరాతు సుల్తాను ద్వారా డామన్ అధికారికంగా పోర్చుగీసువారికి అప్పగింపబడింది. 450 సం.ములకు పూర్వం ఇది పోర్చుగీసు అధీనములో ఉంది. 1961 డిసెంబరు 19న గోవా, డామన్, డయ్యూ లను భారత ప్రభుత్వం తన అధీనంలోకి తీసుకుంది. కాని పోర్చుగీసు ప్రభుత్వం 1974 వరకు వీటిపై భారత దేశపు అధిపత్యాన్ని అంగీకరించలేదు.

1987 వరకు గోవా, డామన్, డయ్యూ లు (వేరు వేరు చోట్ల ఉన్నా గాని) ఒకే కేంద్రపాలిత ప్రాంతముగా పరిపాలింపబడినవి. 1987 లో గోవా ప్రత్యేక రాష్ట్రముగా ఏర్పడింది. ఇక డామన్ - డయ్యూ అనే రెండు జిల్లాలు ఒక కేంద్రపాలిత ప్రాంతముగా కొనసాగుతున్నాయి.

ఇక్కడ అధికారిక భాష గుజరాతీ. పోర్చుగీసు భాషను పాఠశాలలో బోధించకపోవడం వల్ల దాని వాడకం క్రమంగా క్షీణిస్తుంది. డామన్ లో 10 % ప్రజలు పోర్చుగీసు భాష మాట్లాడుతారు. అది క్రమంగా 'ముసలివారిభాష' అనిపించుకొంటుంది.

డామన్[మార్చు]

డామన్ బీచ్

'డామన్' జిల్లా వైశాల్యం 72 చ.కి.మీ. జనాభా 1,13,949 (2001 జనాభా లెక్కలు ప్రకారం). ఇది డామన్ గంగా నది ముఖద్వారాన ఉంది. దీనికి పశ్చిమాన అరేబియా సముద్రం, మిగిలిన మూడు ప్రక్కల గుజరాత్ లోని వల్సాడ్ జిల్లా ఉంది. డామన్ కు అతి దగ్గరి రైల్వే స్టేషను 7 కి.మీ. దూరంలో ఉన్న 'వాపి' (గుజరాత్). డామన్ కు ఉత్తరాన సూరత్ నగరం, దక్షిణాన సుమారు 160 కి.మీ. దూరంలో ముంబాయి నగరం ఉన్నాయి.డామన్‌లో చేపలు పట్టడం, మత్స్య పరిశ్రమ ప్రధాన ఉపాధి మార్గాలు. అనేక పరిశ్రమలు కూడా ఉన్నాయి.

అందమైన సముద్రతీరం, పోర్చుగీసు విధానంలో నిర్మించిన కట్టడాలు, చక్కనైన చర్చిలు, ప్రకృతి సౌందర్యం - ఇవి డామన్ విశేషాలు. గంగా డామన్ నదికి ఇరువైపులా నాని-డామన్, మోతి-డామన్ అనే పట్టణాలున్నాయి.

డయ్యూ[మార్చు]

డయ్యూ బీచ్

గుజరాత్ దక్షిణ ప్రాంత తీరంలో కథియావార్ దగ్గర ఉన్న ఒక ద్వీపం పేరు డియ్యూ. ఈ ద్వీపం వైశాల్యం 40 చ.కి.మీ. జనాభా 44,110 (2001 జనాభా లెక్కల ప్రకారం). ఈ ద్వీపం తూర్పు తీరాన డియ్యూ పట్టణం ఉంది. ఇక్కడ పాతకాలపు పోర్చుగీసు కోట ఒక ప్రధాన ఆకర్షణ. చేపలు పట్టడం ప్రధానమైన ఉపాధి. భారతీయ వైమానిక దళం స్థావరముంది. ద్వీపంలో మరోప్రక్క 'ఘోగ్లా' అనే పల్లె ఉంది.

1535లో అప్పటి గుజరాత్ సుల్తాను (మొగలు చక్రవర్తి హుమాయున్ కు వ్యతిరేకంగా) పోర్చుగీసువారితో ఒప్పందం కుదుర్చుకొని, కోట కట్టడానికీ, సైనిక స్థావరం ఏర్పాటు చేసుకోవడానికీ అనుమతినిచ్చాడు. తరువాత పోర్చుగీసువారిని తొలగించడం సుల్తాను వల్ల కాలేదు. 1537 లోను, 1546లోను యుద్ధాలు జరిగినా ప్రయోజనం లేకపోయింది. 1545లో 'డామ్ జో డి కాస్ట్రో' అనే పోర్చుగీసు సేనాని ఈ కోటను మరింత బలపరచాడు.

1961 డిసెంబరు 19న భారత సైన్యం డియ్యూ ద్వీపాన్ని ఆక్రమించింది.పర్యాటకులకు మంచి ఆకర్షణీయమైన స్థలంగా డియ్యూ పేరొందింది. నగోవా బీచ్ చాలా చక్కనైంది. పోర్చుగీసు శైలిలో నిర్మింపబడిన కోట, చర్చి, మ్యూజియం కూడా చూడదగినవి.

మూలాలు[మార్చు]

  1. "రెండు కేంద్ర పాలిత ప్రాంతాల విలీనానికి ఆమోదం". www.sakshieducation.com. Retrieved 2020-01-11.

బయటి లంకెలు[మార్చు]

డామన్ జిల్లా గురించి

"https://te.wikipedia.org/w/index.php?title=డయ్యూ&oldid=3947971" నుండి వెలికితీశారు