పల్లెల్లో వ్యవసాయ విధానాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఒక నిర్ధిష్టమైన పద్ధతిలో మొక్కలను, జంతువులను పెంచి, పోషించి తద్వారా ఆహారాన్ని, మేత, నార, ఇంధనాన్ని ఉత్పత్తి చేయటాన్ని వ్యవసాయం లేదా కృషి అంటారు. వ్యవసాయం చరిత్ర మానవ చరిత్రలో అతి పెద్ద అంశం. ప్రపంచవ్యాప్త సామాజిక ఆర్థిక ప్రగతిలో వ్యవసాయభివృద్ధి ఒక కీలకాంశము. వేటాడటం ద్వారా ఆహార సముపార్జన చేసుకొనే స్థితిలో ఉన్న సంస్కృతులలో కనిపించని సంపద సమకూర్చుకోవటం, సైనిక కలాపాలవంటి ప్రత్యేకతలు వ్యవసాయం అభివృద్ధి చెందటంతోనే ప్రారంభమయ్యాయి. సమాజంలోని కొందరు రైతులు తమ కుటుంబ ఆహార అవసరాలకు మించి పండిచటం ప్రారంభించడంతో తెగ/జాతి/రాజ్యంలోని మిగిలిన వ్యక్తులకు ఇతర వ్యాపకాలను పోషించే వెసలుబాటునిచ్చింది. ఈ వ్యవసాయం చేయుటకు రైతులు వివిధ విధానాలను ప్రాంతాలవారీగా అనుసరిస్తారు.

ఎండిపోయిన గుండు బావి. బావిలో మరో బోరు బావిని కూడా చూడ వచ్చు/ వెంకట్రామా పురంలో తీసిన చిత్రం
పల్లెల్లోని పొలంలో అడుగంటిన అందమైన దిగటానికి మెట్లున్న దిగుడు బావి. వెంకట్రామా పురంలో తీసిన చిత్రం

నీటి వనరులు[మార్చు]

గతంలో అనగా సుమారు యాభై సంవత్సరాల క్రితం రాయలసీమ ప్రాంత పల్లె ప్రజలు అనగా రైతులు వారి వ్యవసాయ నీటి అవసరాలకు కాలువలు, చెరువులు, బావులు, కసిం కాలువలు, బోరు బావులు, కుంటలు, వాగులు, వంకలు, వంటి జల వనరులు పై ఆధార పడే వారు.. రైతులు కొన్ని ప్రాంతాలలో నీటి వసతి కొరకు చెరువులు, బావులు పైనే ఆధార పడి వుండే వారు. వర్షాకాలంలో చెరువులు నిండితే ఆరు నెలల వరకు నీళ్లు వుండేవి. చిన్న చిన్న వంకలు వాగులు ఉన్నాయి. ఆ రోజుల్లో వాటిల్లో సన్నగానైనా ఎల్లప్పుడు నీరు పారు తుండేవి. దాంతో భూగర్బ జలం పుష్కలంగా వుండి బావుల్లో నీళ్లు పైకే వుండేవి. ఆ వంకల్లో సాగే నీటిని నిలగట్టి చిన్న కాలువ ద్వారా పంటలకు మల్లించే వారు. లేదా ఏతం గూడ వంటి సాధనాల ద్వారా నీటిని పొలాలకు మళ్లించి పంటలు వండించే వారు. బావుల నుండి కపిలి అనే సాధనం ద్వారా ఎద్దులతో నీటిని పైకి తోడి పంట పొలాలకు పెట్టే వారు. ఆ తర్వాత బావులకు కరెంటు మోటార్లు వచ్చాయి. దాంతో రైతుల పని కొంత సులువైంది. బావులు సాధారణంగా గుండ్రంగా గాని, నలు చదరంగా గాని వుంటాయి. చుట్టు రాతి కట్టడం వుండి లోనికి దిగడానికి రాతి బండలతో చేసిన మెట్లుంటాయి. వీటి లోతు సుమారు ఐదు లేక ఆరు మట్లు వుంటుంది. ఒక మట్టు అంటే ఐదు అడుగులు. మహా లోతైన బావి అంటే ఏడు మట్లు బావి. ఆరోజుల్లో ఈ బావుల్లో నీళ్లు పైకే వుండేవి, అనగా పది అడుగుల లోతులో వుండేవి. పిల్లలందరు ఎండా కాలం బావుల్లో ఈత కొట్టే వారు. కొత్తవారు ఈత నేర్చు కునే వారు. ఈ బావుల్లో నుండి కపిలి / మోటతో నీళ్లను బయటకు తోడి పంటలు పండించే వారు. ప్రస్తుతం ఇటు వంటి బావులు వర్షం లేక అడుగంటి పోయాయి.

గొట్టపు బావులు లేదా బోరింగు బావులు[మార్చు]

వర్షాబావంతో మామూలు బావుల్లో నీరు అడుగంటి పోగా విధిలేక రైతు లందరు బోరింగు బావులు త్రవ్వించారు. అవి వంద లాది అడుగుల లోతులో నుండి మోటార్ల సాయంతో నీటిని తోడు గలవు. భూగర్బ జలాన్ని ఈ బోరు బావులు వందలాది అడుగుల లోతునుండి తోడేస్తున్నందున లోతు తక్కువ గల దిగుడు బావులన్ని ఎండి పోయాయి. ఆ ఎండి పోయిన బావుల్లోనే బోరులు వేసి యంత్రాలతో నీటిని పైకి లాగు తున్నారు. ప్రస్తుతం అందారూ ఈ బోరు బావులపైనే ఆధార పడి కొంత వరకు పంటలు పండించు కుంటున్నారు. ఒకప్పుడు ఈ దిగుడు బావులన్ని కపిలి బావులే. గతంలో ఈ బావులనుండి కపిలి/ మోటతో నీళ్లను తోడి పంటలకు పండించేవారు. ఆ బావులకు కపిలి వుండేదనడానికి నిదర్శనంగా ఆ బావులకు ఉన్న కపిలి దొరువులను ప్రక్కనున్న చిత్రంలో చూడ వచ్చు. అప్పట్లో మహా అయితే ముప్పై నలమై అడుగుల లోతు నుండి కపిలితో నీరు తోడే వారు. ఆ బావులు అడుగంటగ ఆ దిగుడు బావులలోనే వందలాది అడుగుల లోతున బోరులు వేసి నీటిని తోడే వారు. కొంత కాలం తర్వాత ఆబోరు బావులలో కూడా నీరు అతి తక్కువగా వస్తున్నందున, అంత సన్నగా వచ్చే నీరు పొలానికి పెట్టితే ఒక బారెడు దూరంకూడ పారవు. అందు చేత ఆ బోరుబావిలో నుండి సన్నగా వచ్చే నీటి దారను ఒడిసి పట్టి ఆ దిగుడు బావిలోనే నిల్వ చేసి సుమారు అయిదారు అడుగులు లోతు నీరు వచ్చాక ఆనీటిని మరిక మోటారుతో బయటకు తోడి కొంత కాలం పంటలు పండించారు. భూగర్బంలోని నీరు బోరు ద్వారా పైకి అనగా దిగుడుబావి అడుకుకి వస్తుంది. అక్కడ కొంత మేర నిల్వ చేసుకొని మరొక మోటారుతో ఆ నీటిని పైకి తోడే వారు. ప్రక్కనున్న చిత్రంలో ఈ తతంగ మంతా చిత్రంగా చూడండి. ప్రస్తుతం అలాంటివి కొన్ని పని చేయడం లేదు. ఈ ప్రాంతంలో ఈ తరం వారికి బావుల్లో ఈత కొట్టడం, చెరువుల్లో గేలాలతో, కొడంతో చేపలు పట్టడం, వంకల్లో, వాగుల్లో చేపలు పట్టడం మొదలగు ఆటలన్ని పూర్తిగా అందు బాటులో లేవు. అవన్నీ కనుమరుగయ్యాయి.

ఎండి పోయిన దిగుడు బావి. కపిలి దొరువు కూడా వున్నది, వెంకట్రామ పురంలో తీసిన చిత్రము.

కసింకాలువ[మార్చు]

కపిలి./మోట. గతంలో బావిలోని నీటిని పైకి తోడే విధానము. ప్రస్తుతము ఈ విధానము కనుమరుగైనది. వెంకట్రామాపురంలో తీసిన పాత చిత్రము(స్వంతకృతి)

చిన్న చిన్న కసింకాలువలు చెరువు కట్ట క్రింద ప్రారంబమై సుమారు ఒక మైలు పొడవునా వుంటాయి. అటు ఇటు పొలాల్లోని మురుగు నీరు ఈ కాలవలోకి ప్రవహిస్తుంది. అందు చేత అంద్లో నీళ్లు పారు తుంటుంది. చెరువులో నీరు అయిపోయినా ఈ కసింకాలవలో నీరు ఉంటుంది. ఆ నీటిని ఏతం, గూడ, ద్వారా పైకి తోడి పొలాలకు పారిస్తుంటారు రైతులు. ఇదొక నీటి వనరు. కాని ప్రస్తుతం సంవత్సరాల తరబడి చెరువులు నిండక పోవడంతో ఈ కసిం కాలువలు కూడా ఎండి పోయాయి. ఇంకొన్ని కసింకాలువలు అరుదుగా వుంటాయి. అవి ఏ కొండ వాలులోనో ప్రారంబమై కొన్ని మైళ్ల పర్వంతం వుంటాయి.

ఇందులోని నీరు కూడా పంటలకు వాడుకుంటారు. ఈ కసింకాలావల్లో నీరు ప్రవహించదు కాని నీరు నిల్వ వుంటుంది. ఎంత తోడినా తిరిగి ఊరు తుంది. అంచేత దానికిరుపక్కాలా బావుల్లో నీరు సంవృద్దిగా వుంటుది. ఈ కరువు కాలంలో అవి కూడా ఎండి పోయాయి. పశువుల మేతకు కూడా ఈ కసిం కాలవలు చాల ఉపయోగ పడేవి. ఎలాగంటే ఇందులో నీరు ఎల్లప్పుడ్లు వున్నందున అందులో జమ్ము, గడ్డి ఏపుగా పెరిగి వుండేది. దాని గట్టు మీద కూడా గరిక బాగా వుండేది. ఆవులు గట్టున మేస్తే బర్రెలు నీళ్లలో దిగి జమ్ము, తుంగ వంటి గడ్డిని బాగా మేసేవి. చిన్న చిన్న చేపలు, పీతలు మొదలగు వాటిని పట్టే వారికి కూడా ఇవి ఉపయోగ పడేవి. ఇలాంటి కసింకాలువలు ఎండి పోయాయి.

పశు సంపద[మార్చు]

గొర్రెల మంద. స్వంత కృతి

ఆవులు, ఎద్దులు, పందులు, గేదెలు, గొర్రెలు, మేకలు, కోళ్లు ప్రతి రైతు పశువులను పెంచడం అవసరం. వాటి వల్ల అదనపు ఆదాయమే గాకుండా వాటి వలన పొలాలకు ఎరువు కూడా లబ్యమౌతుంది. పైగా ఎద్దులు పొలంపనులకు అత్యవసరం. ఎద్దులను రైతు తన బిడ్డల్లాగ చూసు కుంటాడు. వాటికి సరైన మేత పెట్టి, స్నానం చేయించి, రక రకాల ఆబరణాలతో అలంక రించి ఆనందిస్తాడు. ఈ పశువుల కొరకే ఒక ముఖ్యమైన పండగ కూడా ఉంది. దీన్ని బట్టి రైతుకు పశువుల పట్ల తనకున్న అబిమానం తెలుస్తుంది. ఎద్దులకు వేసే అలంకరణ, ఆబరణాలు మూతికి మూజంబరం అని నార దారాలతో గాని వెంట్రుకల దారలతో గాని చేసి అలంకరిస్తారు. ఆ దారాల మధ్యలో గవ్వలు అమర్చుతారు. ఎద్దుల మూతికి ఇవి ఎంతో అందంగా వుంటుంది. ఎద్దుల కొమ్ములను పదునైన కత్తితో నునుపుగా చెక్కి వాటికి రంగులు వేసి, కొమ్ముల చివరన ఇత్తడి, స్టీలు కుప్పెలు వేస్తారు. ఎద్దుల మెడలకు వెడల్పాటి తోలు బెల్టు కట్టి దానికి అక్కడక్కడా గజ్జెలు, మువ్వలు కట్టి, చివరన గంట వేలాడ గడ్తారు. ఎద్దులు నడుస్తుంటే ఆ గజ్జెల, మువ్వల చప్పుడు విన సొంపుగా వుంటుంది. ఆ గజ్జెల, గంటల శబ్దాన్ని బట్టి తమ ఎద్దులు ఎక్కడున్నాయో రైతులు గుర్తు పట్ట గలరు. ఎద్దుల అలంకరణకు కావలసిన సామగ్రి ఆరోజుల్లో సంతల్లో అమ్మేవారు. ఇప్పుడు ఎద్దులు లేవు, వాటికి అలంకరించే ఆభరణాలు లేవు. పశువుల పండగ సందర్భంగా ఇటువంటి అలంకరణ మారుస్తుంటారు.

పశువుల పండగ సందర్భంగా సంబరం[మార్చు]

సంక్రాంతి వరుస పండగల్లో పశువుల పండుగ మూడోది. ఆ రోజున ఇంటి కొక్కరు చొప్పన పల్లె వాసులు తెల్లవారక ముందే ఒక కత్తి, సంచి తీసుకొని పక్కనే వున్న అడవికి బయలు దేరుతారు. అనేక రకాల వన మూలికలు, ఆకులు, కాయలు, చెట్టు బెరడు, గడ్డలు, పువ్వులు, వేర్లు, మొదలగు నవి తీసుకొని వస్తారు. కొన్ని తప్పనిసరిగా వుండవలసిన మూలికలు కొన్ని వున్నాయి అవి తీసుకొని మిగతా ఎన్ని రకాల మూలికలు ఎన్ని వీలైతే అన్ని తీసుకొని వస్తారు. ఇంటికి వచ్చి, వాటినన్నింటిని కత్తితో చిన్న చిన్న ముక్కలుగా కత్తరించి ఆ తర్వాత రోట్లో వేసి బాగా దంచి పొడి లాగ చేస్తారు. చివరిలో అందులో ఎక్కువ మోతాదులో వుప్పు వేసి ఇంకా బాగా దంచు తారు. దాన్ని "ఉప్పుచెక్క" అంటారు. ఇది పశువులకు సర్వ రోగ నివారిణి. పశువులను/ ఎద్దులను దగ్గర్లోని చెరువుకు గాని, బావి వద్దకు గాని తీసుకెళ్లి స్నానం చేయించి ఇంటికి తీసుకొచ్చి ఉప్పు చెక్కను తినిపిస్తారు. పశువులు ఉప్పు చెక్కను ఇష్టంగా తినవు. కాని బలవంతంగా తినిపిస్తారు కొన్ని సన్న జీవాలు అనగా గొర్రెలు, మేకలు ఉప్పు చెక్కను ఇష్టంగా తింటాయి. అనేక రకాల వనమూలికలతో తయారైన ఈ ఉప్పుచెక్క అత్యంత మధురమైన వాసన వస్తుంది. ఈ వుప్పు చెక్క తయారికి కావలసిన కొన్ని వనమూలికలు: మద్ది చెక్క (బెరడు) నేరేడు చెక్క, మామిడి చెక్క, కరక్కాయ, నల్లేరు, అడవి గుమ్మడి, అడవి ఉల్లి, మన్నేరు గడ్డ, ఎలక్కాయ, ఉసిరి కాయ, చలువ వేర్లు, అలా ఈ జాబితా చాల పెద్దది. అన్నీ తేవాలని లేదు గాని వీలైనన్ని ఎక్కవ సేకరించాలు. అందులో కొన్ని తప్పని సరైనవి కొన్ని వుంటాయి. ఈ ఆచారం ఎక్కువగా చిత్తూరు జిల్లాలోను ఆ పరిసర ప్రాంతాలైన తమిళనాడు లోను ఎక్కువ. ఆ రోజుల్లో వున్నవన్ని దేశీయ ఆవులే/ గేదెలే. రెండు మూడు లీటర్ల పాలిస్తే అదే పెద్ద గొప్ప. పెద్ద ఇళ్లలో అలాంటి ఆవులు ఒక మంద వుండేవి. మిగతా వారి వద్ద ఒకటి రెండు ఆవులు/ గేదెలు వుండేవి. ఆరోజుల్లో పాలు ఎవ్వరు అమ్మేవారు కాదు. అంతా ఇంటి కొరకే. పాలు లేని వారికి వీరు మజ్జిగ ఇచ్చేవారు. ఈ ఆవులకు ప్రత్యేకించి మేత ఏమి వేసే వారు కాది. బయటకు తీసుకెళ్లి పొలాలలో, మైదానాలలో మేపించి సాయంత్రానికి ఇంటికి తీసుకొచ్చేవారు. వాటికి అదే మేత. పాలిచ్చే ఆవులకు/ గేదెలకు మాత్రం రాత్రులందు కొంత మేత వేసే వారు. వరి పొలాల్లోని గట్టుల మీద, చెరకు తోటల్లోను దొరికే పచ్చి మేత వేసే వారు. పాలనుండి నెయ్యి తీసి తాము వాడుకోగా మిగాతాది అమ్ముకునే వారు. ఇదొక అధనపు ఆదాయం. మేకలు, గొర్రెలు మాత్రం మందలు, మందలుగా వుండేవి. వీటిని పాలు పిండడం చాల తక్కువ. దేశ వాలీ రకాలైన ఆవులు, ఎద్దులు ఇప్పుడు లేవు. ఎక్కడో అరుదుగా ఎద్దులు, ఎద్దులు బండి, మడక కనబడతాయి. ఈ పనులన్ని ట్రాక్టర్లు చేస్తున్నాయి. కాని ఇప్పుడు ఇంచు మించు ప్రతి ఇంట్లోను ఒక పాడి ఆవు ఉంది. అది కచ్చితంగా జర్సీ ఆవు లేదా మంచి జాతి ఆవు ఉంది. వీటికి ప్రతి రోజు మంచి ఆహారం పెట్టాలి, ప్రతి రోజు స్నానం చేయించాలి చాల జాగ్రత్తగా చూసుకోవాలు. వాటి పరిసరాలు శుభ్రంగా వుంఛాలి. ఇవి పూటకు ఐదారు లీటర్ల పాలిస్తాయి. ఇలా రెండు పూటలా ఇస్తాయి. ప్రస్తుతం రైతుల చేతుల్లో నాలుగు డబ్బులు ఆడుతున్నాయంటే ఈ ఆవుల చలువే. దానికి తగ్గట్టు చిన్న పల్లేల్లో కూడా పాల డిపోలు వెలిశాయి. రెండు పూటలా వారు పాలు కొంటారు. వాటిని శీతలీకరించి పట్నాలకు పంపుతున్నారు. వర్షాబావంతో గుక్క తిప్పుకో లేక తిక మక పడుతున్న రైతుకు ఈ జర్సీ ఆవులు, పాల డిపోలు కొండంత అండ. ప్రస్తుతం పట్నాలలో సంవృద్దిగా చిక్కని పాలు కావలిసినన్ని దొరుకు తున్నాయంటే అదంటా పల్లె టూరి రైతుల చలువే. గతంలో పట్న వాసులు పాలకు ఎంత కట కట పడ్డారొ అందరికి తెలిసిన విషయమే. పసి పిల్లలకు అరుదుగా దొరికే నీళ్ల పాలు కూడా దొరక చాల అవస్తలు పడ్డారు. దానికి నివారణగా అప్పట్లో పాల పొడి డబ్బాలు కూడా దిగుమతి అయ్యాయి. ప్రభుత్యంకూడ "పాల వెల్లువ" పథకానికి తగినంత చేయూత నందిస్తున్నది. దాన్ని అంది పుచ్చుకున్న పల్లెటూరి రైతు కొంతలో కొంత సుఖంగా జీవనం సాగించుకుంటూ పోతున్న పరువును కొంతలో కొంతైనా నిలబెట్టు కుంటున్నాడు. గొర్రెలు, మేకలు. చాల మంది రైతులకు గొర్రెలు, మేకలు మందలు వుండేవి. వాటిని తమ ఇంటి ముందున్న దొడ్లల్లో వుంచేవారు. వాటికి ప్రత్యేకమైన ఆహారం పెట్టే వారు కాదు. రతి రోజు వాటిని దగ్గరున్న అడవికి తీసుకెళ్లి మేపుకొని వచ్చేవారు. పొట్టేళ్లను మాత్రామే మాంసానికి అమ్మేవారు, కొనేవారు. గొర్రెలను మాంసానికి అమ్మే వారు కాదు.గొర్రెలు ఇతరుల కంటికి ఒకే లాగ కనిపిస్తాయి. వాటి కాపరికి మాత్రం కొన్ని గొర్రెలను గుర్తు పట్టగలడు. కాని వాటి పిల్లలు తమ తల్లులను కచ్చితంగా గుర్తు పట్ట గలవు. దీనికి రుజువేమంటే సాయంకాలం వెళ గొర్రెల మంద ఇంటి కొచ్చే వేళ తల్లి గొర్రెలు తమ పిల్లల కొరకు ఊరి బయటనుండే పిల్లలను పిలుస్తూ అంత వరకు మందలో ఒకటిగా వస్తున్న గొర్రెలు ఊరు దగ్గర పడగానే మందను వదిలి తమ పిల్లలను పిలుస్తూ ముందుకు పరుగెడుతాయి తమ పిల్లల కొరకు. అప్పటికే గిడుగు నుండి బయటకు వచ్చిన పిల్లలు తమ తల్లుల గొంతు విని పిల్లలు కూడా అరుస్తూ అనగా తమ తల్లులను పిలుస్తూ బయటకు పరుగెడతాయి. అలా పరుగెత్తిన పిల్లలు ఊరి బయట గాని, వీధిలో గాని, అవి ఇంకా దొడ్లోకి రాక ముందే తమ తల్లులను గుర్తించి వాటిని పట్టుకొని పాలు తాగుతాయి. ఇలా అవి తమ తల్లులను కచ్చితంగా గుర్తు పడతాయి. ఒక వేళ పిల్లలు తెలియక తమ తల్లి గాక ఇంకొక గొర్రె వద్దకు పాలు తాగ డానికి వెళ్లితే ఆ తల్లి గొర్రె తప్పించు కుంటుంది. ఆ పిల్ల తన తప్పును గ్రహించి తన తల్లి గొర్రె వద్దకు వెళ్లీ పాలు తాగు తుంది. ఈ తతంగ మంతా చూడ డానికి చాల అత్మీయంగా వుంటుంది. మేకలు ఆవులు కూడా ఇంతే. ఇది ప్రకృతి నియమం. మానవుల్లోను ఈ ప్రకృతి నియమం తప్పదు. నిద్ర పోతున్న పిల్లకు వేరొక తల్లి పాలివ్వడానికి ప్రయత్నిస్తే ఆ పశికందు సరిగా స్పందించదు. ఇంకా ఏ మాత్రం ఎదగని ఆ పిల్ల పాలిస్తున్నది తన తల్లి కాదని ఎలా గుర్తించ గలదు. అదీ ముఖం చూడ కుండానే? దీనికి కారణం ఏమిటి? ...... శాస్త్ర వేత్తలు కారణాలెన్నైనా చెప్పొచ్చు. అసలు కారణం ఒకటే.... అది ప్రకృతి నియమం. దానికి కారణాలు. అడవికి మేతకొరకు తోలు కెళ్లిన గొర్రెల/ మేకలకు రేసు కుక్కల భయం ఒకటి వెంటాడు తుంటుంది. ఇవి అడవి జంతువులు. కాపరుల కళ్ల ముందే వారు చూస్తుండగానే మందల మీద పడి బతికుండ గానే అతి వేగంగా గొర్రెను గాని మేకను గాని పట్టి తినేస్తాయి. ఆ తర్వాత తాపీగా వెళ్లి పోతాయి. ఇవి మనుషులకు ఏ హాని చేయవు. మనుషులు కూడా వీటికి ఎలాంటి హాని చేయరు. ఇవి దేవతా కుక్కలని అంటారు. ఇవి గుంపులు, గుంపులుగా తిరుగు తుంటాయి. ఇవి స్థిరంగా ఒక చోట వుండవు. అప్పుడప్పుడు వస్తుంటాయి పొట్టేలు, ఆవు.

వ్యవసాయ పనిముట్లు[మార్చు]

పాఱలు

బాన, బండి,(కపిలి బండి) కదురుగోలు, ఇరుసు, ఎద్దుల బండి కాడి మాను, మడక, లేదా నాగలి, గొర్రు, పార, తొలిక, కర్రు, గునపము, గొడ్డలి, కొడవలి, కత్తి, పిక్కాసు, మాను, పల్లంకి, మోకు, పగ్గం, తొండం తాడు, పలుపు, జాటి, ముల్లు గర్ర, పలుపులు, చిలుకు దోటి, కొంకి, గోరు గిల్లు, గీస కత్తి, చిక్కం, మచ్చు గత్తి, గొర, దోకుడు పార, మొదలగునవి వ్యవసాయమ్లో ఉపయోగించు పరికరాలు

గునపము/గడ్డపాఱ

వీటిల్లో ఇనుప వాటిని కంసాలి చేస్తాడు. కర్రతో చేసే వాటిని వడ్రంగి చేస్తాడు.నార, దారాలతో చేసే వటికి అనగా పగ్గం, తొండంతాడు, మోకు, మూజంబరం వంటి వాటిని రైతులు స్వంతంగా చేసుకుంటారు . వీటిలో కొన్ని వాడుకలో లేక కనుమరుగైనవి. కపిలి, ఏతం, గూడ మొదలైన నీటి పారుదల ప్రక్రియలు పూర్తిగా వాడుకలో లేనందున దానికి సంబంధించిన పరికరాలు ఎక్కడా కనబడవు.

పార

వ్యవసాయ పరికరాలలో మొదటిగా చెప్పుకోదగినది: అరక/మడక/ నాగలి ఇది కొయ్యతో చేసింది. ఇందులోని బాగాలు: మేడి, నొగ, కాడిమాను, కర్రు. ఈ కర్రు లేదా కారు మాత్రం ఇనుముతో చేసింది. ఎద్దులతో భూమిని దున్నడానికి ఉపయోగిస్తారు. రెండు ఎద్దులు, ఒక మనిషి అవసరం. నిదానంగా పని జరుగుతుంది. ప్రస్తుతం భూమిని దున్నడానికి టిల్లర్లు, లేదా ట్రాక్టర్లు వంటి యంత్రాలు వచ్చాయి. వీటితో అతి తొందరగా దున్నడం పూర్తవుతుంది. రైతుకు శ్రమ తగ్గింది. భూమిని దున్నిన తర్వాత దాన్ని చదును చేయ డానికి, గట్లు వేయ డానికి, పాదులు కట్టడానికి, మెట్ట భూముల్లో విత్తనాలు చల్లడానికి, వుండే పరికరాల స్థానంలో ప్రస్తుతం ఈ ట్రాక్టర్లే అన్ని పనులు చేస్థున్నాయి. ఈ మధ్యన వరి కోత యంత్రాలు, నూర్పిడి యంత్రాలు కూడా వచ్చాయి. రైతుకు చాల కష్టం తగ్గింది కాని పంటలు పండించడానికి సరిపడ నీళ్లే లేవు. పార వ్వవ దారునికి పార లేనిదే పని గడవదు. మట్టి పనికి, మడితయారీకి పార ప్రముఖమైన పనిముట్టు. పాలలో అనేక రకాలున్నాయి. పలుగు పార, దోకుడు పార, సెలగ పార. గొనంపార ఇలా ప్రాంతాన్ని బట్టి పేరు ఏదైనా ఉపయోగమొక్కటే. గడ్డపార మాత్రము గోతులు త్రవ్వడానికి ఉపయోగిస్తారు. దీన్నే గునపము అని అంటారు. పార, గడ్డపార ఈ రెండు పరికరాలు జంట పరికరాలు. గుంతలు త్రవ్వడానికి ఈ రెండింటి అవసరముంటుండి. ఏ ఒక్కదానితో ఆ పని కాదు. గడ్డపారతో భూమిని త్రవ్వితే పారతో ఆ మట్టిని ఎత్తి పోస్తారు.[1]

  • కొడవలి :వరి కోతకు, ఇతర సన్నని పంటలను కోయ డానికి ఉపయోగిస్తారు. అలాగే పశువుకు గడ్డి కోయడానికి ఉవయోగిస్తారు. ఇది చిన్న కత్తి లాగే వుండి వంపు వైపు సన్నని రంపపు వళ్లు లాంటి పళ్లు కలిగి వుంటుంది. దీనికి పదును వుండదు. తేలికగా వుంటుంది.
  • కత్తి :కత్తులు చాల రకాలు. చిన్న కత్తి చిన్న పనులకు, అనగా చిన్న కొమ్మలు కొట్ట డానికి, చెరుకు కొట్టడానికి, వాడుతారు. పెద్ద కత్తి: దీన్ని పెద్ద కొమ్మలు కొట్ట డానికి ఉపయోగిస్తారు. వేట కత్తి: దీన్ని వేటను నరక డానికి, లావు పాటి కొమ్మలను నరక డానికుపయోగిస్తారు. వీటికి పదునెక్కువ.
  • కొంకి :ఇది కత్తికన్న ఎక్కువ వంపు కలిగి వుండి, దానికి పిడి బదులు అక్కడ ఒక రంధ్రం వుంటుంది. అందులో పొడవాతి వెదురు కర్రను దూర్చి వుంటుంది. దీన్ని గొర్రెల కాపరులు, మేకల కాపరులు వెంట తీసుకెళ్లి చెట్ల పైనున్న కొమ్మలను కోసి వారి జీవాలకు మేత వేస్తారు. దీనికి పదునెక్కువ.
  • గొడ్డలి :చిన్నగొడ్డలి .. పెద్ద గొడ్డలి రెండు రకాలు. చిన్న దాన్ని చిన్న పనులకు, పెద్ద దాన్ని పెద్ద పెద్ద మానులను నరకడాని కుపయోగిస్తారు. గొడ్డళ్లకు పదును ఎక్కువగా వుండదు.
  • తొలిక :మెట్ట పైర్లలో కలుపు తీతకు, వేరుశనగ కాయలు త్రవ్వడానికి, వాడు తారు. చిలుకు దోటి: సన్నని పొడవాతి వెదురు కర్రకు కొసన ఒక కొక్కెము తగిలించి వుంటుంది: దీంతో ఎత్తైన చెట్ట్ల కొమ్మల్లో వుండే చింత కాయలు, ములక్కాయలు ఇతర కాయలను కోయ డానికి ఉపయోగిస్తారు.
  • చిక్కం దోటి :చిలుకు దోటి లాంటిదే. కాని దీనికి చివరన ఒకచిన్న చక్రం లాంటిది వుండి దానికి చిన్న వల వుంటుంది. దీన్ని చెట్లపై నున్న మామిడి కాయలను కోయ డానికి వాడతారు. మామిడి కాయలను చిలుకు దోటితో కోస్తే అవి కింద పడి దెబ్బలు తగిలి పాడవుతాయి. ఈ చిక్కంతో కోస్తే కాయలు ఆ చిక్కంలో (వలలో) తగులుకొని కింద పడవు. మెల్లిగా క్రిందికి దించి కాయలను తీసు కుంటారు.
  • పార :మట్టిని తట్టల కెత్త డానికి, అడుసులో అండ చెక్కడానికి, గట్టులు వేయడానికి, పొలాలకు, చెరుకు తోట వంటి తోటలకు నీరు కట్టడానికి పార చాల అవసరం.
  • గడ్డ పార/ గునపం : మట్టిని త్రవ్వడానికి, పొలాల్లో రాళ్లను పెకలించ డానికి దీని వుపయోగం చాల ఉంది. కపిలి, గూడ, ఏతం, ఎద్దుల బండి వీటికి కావలసిన పరికరాలు అవి పని చేసే విధానం ప్రత్యేకంగా ఆయా వర్గాలలో వివరించ బడ్డాయి. మంచె జొన్న, సజ్జ చేలలో మధ్యలో కర్రలతో ఎత్తైన వేదిక వేసి దానిపైకెక్కి కంకులపై వాలే పక్షులు, పిట్టలను తోలదానికి ఏర్పాటు చేసుకున్న సుమారు అయిదారు అడుగుల ఎత్తైన కర్రల వేదిక.
  • వడిసెల :అరచేతి వెడల్పుతో అదే పరిణామంలో దారాలతో అల్లిన వల. ఆ వల రెండు చివరలన రెండు పొడవాటి దారాలు వుంటాయి. మధ్యలో ఒక రాయిని పెట్టి రెండు దారాల కొసలను చేర్చి కుడి చేత్తో పట్టుకొని తలపి గిర గిరా వేగంగా తిప్పి ఒక దారం కొసను వదిలేస్తే అందులోని రాయి అతి వేగంగా చాల దూరం వెళ్ళి పడుతుంది.పొలాల్లో పక్షులను తోల డానికి దీన్ని వాడతారు. కాని దీన్ని గురి చూసి కొట్ట డానికి లేదు. పూర్వం వడిసెలను యుద్ధాలలో కూడా వాడినట్లు ఆధారాలున్నాయి. నైజాం సర్కారు పై ప్రజాపోరులో పాడిన పాట: బండెనక బండి కట్టి పదహారు బండ్లు గట్టి ... ఏ బండిల వస్తవురో నైజాము సర్కరోడ ......................, ............ వడిసేల రాయి పెట్టి వడి వడిగా కొట్టి తేను నీ మిల్ట్రి పారి పోయే రో నైజాము సర్కరోడా ............................,
చేపలు పట్టడానికుపయోగించే గాలాలు
  • గోరు గిల్లు :ఆకు తోటలో తమలపాకులు కోయడానికి బొటన వేలుకి వేసుకునే ఇనుప రేకు గోరు.
  • కొడము :ఇది కొబ్బరి లేదా వెదురు పుల్లలతో అల్లిన చేపలు పట్టే పరికరం.
  • గాలము :ఇది కూడా చేపలు పట్టడానికుపయోగించే చిన్న ఇనుప కొక్కెం.
  • సూది :ఇది బట్టలను కుట్టుకునే సాదారణ పరికరం.
  • దబ్బణం :ఇది సూది లాంటి పెద్ద పరికరం. దీతో పెద్ద గోతాలలో ధాన్యం వేసి నపుడు దాని మూతిని కుట్టడానికి వుపయోగిస్తారు.
  • జాటి :ఎద్దుల బండి తోలే టప్పుడు జాటీతో ఎద్దులను అదిలిస్తుంటాడు. ఇది సన్నని వెదురు కర్రకు తోలుతొ అల్లిన దారం కలిగి, కొసలో జానెడు పొడవున్న మూడు తోలు పోగులు వుంటాయి.
  • ముల్లు గర్ర :ఇది సన్నని వెదురు కర్ర. దాని చివరన కొసగా చెక్కి వుంటుంది. దీన్ని దుక్కి దున్నేటప్పుడు ఎద్దులను అదిలించ డానికి వాడుతారు.
  • కాడి :ఎద్దులు అంటే రెండు ఎద్దులు. కుడి పక్కది, ఎలపట.. ఎడం పక్కది దాపట అని అంటారు.. ఎద్దులు ఎప్పుడు దుక్కి దున్ను తున్న, బండి లాగుతున్న, లేదా రోడ్డు మీద నడుస్తున్న. పనిలో వున్నప్పుడు ఇంటి వద్ద కొట్టంలో కట్టేసి వుంచినా అవి ఆ వరుసలో మాత్రమే వుంటాయి. కుడిది ఎడం పైపుకు గాని అటుది ఇటు గాని వుండవు. చ్చో అంటే ఎలపటది, టుర్ ర్ ర్ దాపటది తిరుగు తాయి. వంపు తిరగ టానికి ఈ మాటలను వాడతారు. దుక్కి దున్నేటప్పుడు ఒక సాలు అయిన తర్వాత దాని పక్కనే ఇంకో సాలు దున్నాలి. అలా దున్నాలంటే సాలు చివరన ఎద్దులను తిప్పి సరిగా ఆ సాలు వెంబడే ఇంకో సాలు దున్నాలి. ఇది కొంత ఆలస్యం అవుతుంది. అందు చేత సాలు చివరన ఎద్దులను ఇంకొంత దూరం సుమారు పది అడుగులు పక్కకు పోనిచ్చి అక్కడ ఇదివరకు దున్నిన సాలుకు సమాంతరంగా ఇంకో సాలు దున్నుతారు. దాన్ని కొండ్ర అంటారు. ఆ కొండ్ర చివరన ఎద్దులను మలిపి ఇదివరకు దున్నిన సాలు వెంబడి సాలు వేస్తారు. ఆ కొండ్ర పూర్తి కాగానే ఇంకో కొండ్ర వేస్తారు. రోజలు మారాయ్ అనే పాత సినిమాలో వ్యవసాయానికి సంబంధించిన పదాలు ఒక పాటలో కొన్ని ఉన్నాయి. అది ఏరు వాక సాగారో ... రన్నో ..... చిన్నన్న........ నీ కష్టమంతా తీరెను రో రన్నో చిన్నన్న.. ఎలపట దాపట ఎడ్ల కట్టుకొని, ఇల్లాలిని నీ వెంట బెట్టుకొని,,,,,,,,, సాలు తప్పక కొండ్ర వేసుకొని విత్తనాలు విసిరిసిరి చల్లుకో....... ఏరువాక సాగారోరన్నో చిన్నన్న
  • ఎద్దుల బండి :రైతులకు ఇది అతి ముఖ్యమైన సాధనము. పొలములోని పంటను ఇంటికి చేర్చడానికి, ఇంటి వద్దనున్న దిబ్బలోని ఎరువును పొలానికి చేర్చడానికి ఇది ముఖ్యమైన సాధనం. దీనిని వడ్రంగి తయారు చేస్తాడు. రెండెడ్లతో నడిచే ఈ బండి కాలానుగుణంగా మార్పులు చెందుతూ టైరు చక్రాలతో నడిచే విధంగా రూపు దిద్దుకొన్నది. ఇందులో కొన్ని రకాలున్నాయి. అవి గూడు బండి, సవారి బండి. వీటిని సంతలకు సరకులను రవాణ చేయడానికి, మనుషులను రవాణాకు వాడే వారు. ఒంటెద్దు బళ్లు కూడా వుండేవి. గూడు బళ్లు, సవారి బళ్లకు ఏ నాడో కాలం చెల్లి పోయింది. మామూలు ఎద్దుల బండ్లు మాత్రం అరుదుగా అక్కడక్కడా కనిపిస్తున్నాయి, వీటి స్థానంలో ట్రాక్టర్లు వచ్చాయి. ఇవి ఎద్దులు చేసే అన్ని పనులు చేస్తున్నాయి. పైగా అతి వేగంగా చేస్తున్నాయి.
  • చిక్కం :ఇది సన్నని దారలతో అల్లిన చిన్న వల. గొర్రెల కాపరులు, మేకల కాపరులు మొదలకు వారు అడవికి వెళ్లే టప్పుడు సంగటి ముద్దను వేసుకొని అందులో చింతకాయ ఊరి బిండిని వేసుకొని మధ్యాహ్నాం తినడానికి తీసుకెళ్లే వారు. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఆ చిక్కం నిండా వులింజి పండ్లు, బూడిగ పండ్లు, రేగి పండ్లు, కలింకాయలు వంటి అడవి పండ్లను తీసుకొని వచ్చెవారు. గొర్రె పిల్లలు వాటి తల్లుల కొరకు, ఊరి పిల్లలు వారు తెచ్చే పండ్లకొరకు ఊరి బయటే ఎదురు చూసే వారు.
  • గీస కత్తి :సాధారణంగా ప్రతి మొగ వారి వద్ద మొల తాడుకు కట్టిన చిన్న వస్తువులు కలిగిని ఒక గుత్తి వుండేది. అందులో గీస కత్తి: ఇది చాల చిన్నని కత్తి: గుబిలి గంటె ..... ఇది చెవులో గుమిలి తీయ డానికి వుప యోగ పడేది: మల్లే ముల్లు: ... దీంతో కాలిలో గుచ్చు కున్న ముల్లును తీయ డానికి ఉపయోగించే వారు. వీటిని అత్యవసర పరికారలుగా చెప్ప వచ్చు. ప్రస్తుతం ఇటు వంటివి ఎవరి వద్దా లేవు. కాని దానికి పోలిన ఇంకా ఎక్కువ చిన్న పరికారాలున్నవి పట్టణాలలో విరివిగా దొరుకుతున్నాయి. అందులో గోర్లు తీయ డానికుపయోగించేది మొదలగు నవి ఉన్నాయి.
ఎద్దులబండి

పంటలు[మార్చు]

మొక్కజొన్నపంట

వరి పండించే విధానం[మార్చు]

ఆరోజుల్లో వరి పంట పండించాలంటే ..... పొలాన్ని మూడు సార్లు మడకతో దున్ని, చువరి దుక్కిలో పశువుల ఎరువును వేసి చదును చేస్తారు. ఒకపెద్ద చెక్క పలకను ఎద్దులకు కట్టి అడుసులో ఒక సారి తిప్పితే పొలం అంతా చదునుగా అవుతుంది. ఆ తర్వాతి పొలం అంతా ఆకు పరచి ఆ ఆకును కాళ్లతో బురద లోనికి తొక్కుతారు. ఆకు అనగా, కానుగ, వేప, గంగ రావి, జిల్లేడు మొదలగు ఆకు తెచ్చి అడుసులో వేసి తొక్కుకాతారు. పొలాల గట్టు మీద ఈ ఆకు చెట్లు లేనివారు అడవికి వెళ్లి కనిపించిన ఆకు కొమ్మలను కొట్టి మోపులుగా కట్టి తెచ్చి పొలంలో పరచి తొక్కుతారు. ఇది పంటకు చాల సారవంత మైన సేంద్రియ ఎరువు. తర్వాత అదివరకే నారు పోసి వుంచుకున్న వరి నారును పీకి కట్టలు కట్టలుగా కట్టి పొలంలో వరుసలుగా వేస్తారు. ఆడ కూలీలు వచ్చి నాట్లు వేస్తారు. ఈ కూలీలు నాట్లు వేస్తూ పాటలు పాడతారు. ఈ పాటలు ఒకరు ఒక నుడుగు పాడితే మిగతా వారు కోరస్ గా పాడు తారు. ఆ దృశ్యం చూడ ముచ్చటగా, ఆ పాటలు విన సొంపుగా ఎంతో ఆహ్లాద కరంగా వుంటుంది. మధ్యాహ్న సమయానికి పొలం యజమాని ఇంటి నుండి కూలీలకు అన్నం సంగటి వస్తుంది. అప్పుడు కూలీలు బయటికి వచ్చి తమ బురద కాళ్లను కడుక్కొని చెట్టు కింద కూర్చొని చేతిలో సంగటి ముద్దను వేయించుకొని తింటారు. కొందరు చిన్న పిల్ల లున్న తల్లులు రెండు ముద్దల సంగటిని కొంగులో వేసుకుని మూట గట్టుకొని తాము తెచ్చుకున్న గిన్నెలో కూర పోయించు కొని ఇంటి కెళ్లి తమ పిల్లలకు అన్నం పెట్టి, చంటి పిల్లలుంటే వారికి పాలిచ్చి తిరిగి పనిలోకి వస్తారు. పొద్దు పోయిందాక వారు పని చేస్తారు.

వరి పొలము. దామలచెరువు గ్రామములో తీసిన చిత్రము

వరి నాటిన నాలుగు వారాలకు కలుపు తీయాలి. ఇది కూడా బురదలో పనే. ఆడవారి పనే. తెల్ల వారి సద్దులు తాగి పనిలోకి దిగితే మధ్యాహ్నం ఒంటిగంటకు సంగటి తిని అరగంట అలసట తీసుకుని మల్లీ పనిలోకి దిగుతారు. కలుపు తీతలో కూడా వీరు పాటలు పాడుతారు. వరి నాట్లు, కలుపు తీయడం ఈ రెండు పనులలోనే ఈ పాటల కార్యక్రమం వుంటుంది. మిగతా ఏ పనిలోను ఈ కోరస్ పాటలుండవు. ఈపాటలు వారికి పనిలోని అలసటను మరిపించి మనసుకు ఆనందాన్ని ఇస్తాయి.

వరిలో రకాలు[మార్చు]

గతంలో వరి రకాలు. తోక వడ్లు, ఐ.ఆర్.8, కిచ్చిలి సంబావులు, సాంబార్లు, బంగారు తీగలు, మొదలగు నవి. గతంలో ఎక్కువగా లావు బియ్యమే పండించేవారు. వీటిలో దీర్ఘకాలికమైనవి, స్వల్పకాలికమైనవి. ప్రస్తుతము ఎక్కువగా సోనా మసూరి వరి రకాన్ని ఎక్కువగా పండిస్తున్నారు. ఉపయోగిస్తున్నారు. ఎందుకనగా ఇవి సన్నబియ్యము, నాణ్యమైనవి.

చెరకు సాగు విధానం[మార్చు]

లేత చెరకు పొలము/ దామలచెరువు గ్రామములో తీసిన చిత్రము

వెలి దుక్కి (నీళ్లు పెట్టి అరిన తర్వాత దున్నే దుక్కిని వెలిదుక్కి అంటారు. నీల్లతో కలిపి దున్నే దుక్కిని అడుసు దుక్కి అంటారు.) వెలి దుక్కి రెండు మూడు సార్లు దున్ని చివరి సాలులో పశువుల ఎరువు వేసి దున్ని సాళ్లు, కాలువలు కట్టి మడవలు ఏర్పాటు చేసి కొని ( మడవలు అంటే నాలుగు సాళ్లను ఒకటిగా నీటి పారుదల సౌకర్యం కొరకు చేసేవి) నాలుగు రోజులు ఆరనిచ్చి ముందుగానే సిద్దంచేసుకున్న చెరకు ముక్కల సుమారు ఒక అడుగు పొడవున్న వాటిని సాళ్లలో వరుసగా పేర్చి మధ్య మధ్యలో వున్న కాలువల ద్వారా నీటిని మడవలకు పారించి అక్కడున్ను చెరుకు ముక్కలను సాళ్లలో భూమిలో తక్కువ లోతులో పాతి పెడ్తారు. ఆపొలానికి వారానికి అవసరాన్ని బట్టి తడి ఇస్తారు. ఒకటి రెండు నెలలకు చెరుకు మొలకెత్తి ఒక ఆడుగు ఎత్తు వరకు పెరుగుతుంది. అప్పుడు నాగలి/మడకలతో "సాలు" తోలు తారు. అనగా మడకలతో సాలు గట్టున దున్నగా గట్టుగా వున్నది సాలుగా, సాలుగా వున్నది గట్టుగా మారి చెరుకు మొలకలు వున్న సాలు జానెడెత్తు పూడి అది గట్టుగా మారుతుంది. ఇప్పుడు చెరకు మొక్కలు గట్టు మధ్యలో వుంటాయి. అప్పుడు తిరిగి మడవలు ఏర్పాటు చేసి నీళ్లు పారిస్తారు. చెరకు మూడు నాలుగడుగులు పెరిగాక ఆ మొక్కలను నాలుగైదింటిని ఒకటిగా చేర్చి వాటి ఆకులతోనే ఒకటిగా చుట్టు తారు. ఈ ఏర్పాటు చెరుకు గడలు నిటారుగా పెరగడానికి. ఆ తర్వాత రెండు మూడు నెలలకు మరలా మరో చుట్టకం వేస్తారు. ఇప్పుడు రెండు సాళ్లలోని గడలను పైన ఒకటిగా చేర్చి వాటి ఆకులతోనే చుడ్తారు. చెరకు పెరిగే పొడవును బట్టి మరో చుట్టకం వేస్తారు. అవసరం అయితే చెరకు గడలు పడి పోకుండా కర్రలతో వూతం కూడా ఏర్పాటు చేస్తారు. అవసరం వుంటే జడ చుట్టకం వేస్తారు. అనగా రెండు మూడు సాళ్లలోని గడలను ఒకటిగా చేర్చి సాలు పొడవునా చెరకు ఆకులతోనే జడలాగ ... దారం లాగ అల్లి పడిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. చెరకు పంట సాధారణంగా పది నెలల పంట. ఆ రోజుల్లో విస్తారంగా చెరకు తోటలు వుండేవి. అందు చే గుంట నక్కల బెడద ఎక్కువ. అవి చెరకులను కొరికి రసాన్ని పీల్చేవి. దాని వల్ల రైతుకు నష్టం. దాని నివారణకు కుండ పులి అనే ఒక సాధనాన్ని రైతు తయారు చేశాడు. అది ఎలాగంటే... మామూలుగా వుండే ఒక రేకు డబ్బాను తీసుకొని దానికి ఒక వైపున పూర్తిగా మూతను తీసేసి రెండో వైపున వున్న మూతకు మధ్యలో ఒక చిన్నని రంధ్రం చేసి ఆ రంధ్రంలో ఒక జనుము పోసను కట్టి దాన్ని తడి చేసి డబ్బాలోపలి వైపున రెండు చేతులతో జమ్మును వేళ్లను జారుడుగా సాగ దీస్తే అది భయంకరమైన శబ్దం చేస్తుంది. ఆ శబ్దానికి గుంట నక్కలు పారి పోతాయి. ఇప్పిడిప్పుడు ఆరు నెలల చెరకు వంగడం ప్రచారంలో ఉంది. దీని ప్రత్యేకత ఏమంటే పంట కాలం తక్కువ, రసంలో తీపి శాతం ఎక్కువ, పొడవు తక్కువ కనుక గాలికి పడిపోదు. పైగా చెరకు గడ గట్టిగా వుంటుంది కనుక గుంట నక్కలు కొరకలేవు. పక్యానికొచ్చిన చెరకును చక్కెర మిల్లులకు పంపు తారు. కాని ఎక్కువగా రైతులు స్వంతంగా బెల్లం తయారికి మొగ్గు చూపు తారు. ఎందుకంటే?.... చక్కెర మిల్లుల నుండి చెరకు కొట్టడానికి అనుమతి పొందడానికి కొంత సమయం పడుతుంది. ఆ తర్వాత కొట్టిన చెరకును మిల్లుకు తీసుకెళ్ళడానికి మరి కొంత సమయం పడుతుంది. ఇంత లోపల కొట్టిన చెరకు గాలికి ఆరి పోయి బరువు తగ్గి పోయి రైతుకు నష్టం. చెరకు కొంత ఆరితే చెక్కెర శాతం పెరుగు తుంది దానివలన మిల్లుకు అది లాభం. అందుకే వారు ఆలస్యం చేస్తారు.

మొదట సారి చెరకు నాటి అది పక్యానికి వచ్చింతర్వాత ఆ చెరకును కొట్టి బెల్లంచేసింతర్వాత ఆపొలంలో చెరకు ఆకు మిగిలి వుంటుంది. దాన్ని నిప్పు పెట్టి కాల్చేస్తారు. ఆ తర్వాత దానికి నీరు పార గట్టితే చెరకు మొదళ్లలోనుండి పిలకు వచ్చి మరల చెరకు తోట పెరుగుతుంది. ఈ విదంగా రెండు మూడు సార్లు చేయ వచ్చు. దీనిని మర్దాలు తోట, కాశీ తోట, లేదా మొక్క తోట అంటారు. ఇందులో కూడా మొదటి తోటలో లాగానే అంతర కృషి చేసి ఎరువులు వేయాల్సి వుంటుది. ఈ పంట కొంత తొందరగా కోతకు వస్తుంది. ఖర్చు, శ్రమ కొంత తక్కువ.

వేరు శనగ[మార్చు]

రైతు తన అవసరాలకు పోగా నాలుగు డబ్బులు కళ్లజూసే మరో ప్రధాన పంట వేరు శెనగ. ఇది మెట్ట పంట. కేవలం వర్షాధార పంట. తొలకరి వర్షాలు పడగానే చేలల్లో దుక్కి దున్ని సిద్దం చేసు కుంటారు. ఒకరోజు సాలుకు సాలుకు ఒక జానెడు దూరం వుండేటట్లు మడకలతో దున్నుతూ సాలు వెంబడి వేరు శనగ విత్తనాలు వేస్తారు. ఇలా ఐదారు సాల్లకు ఒక సాలు కందులు, జొన్నలు, అనప గింజలు, పెసలు, అనుములు, అలసందలు వంటి అపరాలు వేస్తారు. విత్తనాలు మొలకెత్తిన సుమారు ఒక నెల తర్వాత కలుపు తీయాలి. అవసరాన్ని బట్టి మధ్య మధ్యలో తొలిక లతొ కలుపు మొక్కలను తొలిగిస్తారు. ఎద్దులతో నడిచే గుంటక అనే సాధనంతో కూడా కలుపు తీస్తారు. ఊడలు దిగే సమయాన చెట్టు చుట్టు మెల్లిగా త్రవ్వితే వూడలు బాగా దిగి కాయలు బాగా కాస్తాయి. ప్రకృతి కరుణించి సకాలంలో వర్షాలు పడితే .... రైతు ఇంటికి కావలసిన అన్ని అపరాలు, ఇంటికి చేరుతాయి. ఇంటి ఖర్చుకు పోగా మిగిలిన వేరుశెనగ కాయలు అమ్ము కుంటే రైతు నాలుగు రూకలు ఆనందంతో కళ్ల జూస్తాడు. ఇదంతా గతం. ఇప్పుడు అకాల వర్షాలతో ఈ మెట్ట పంటలు వేసిన రైతులు భూమి దున్నిన కూలి, వేసిన విత్తనాల ఖర్చు కూడా నష్ట పోయే పరిస్థితి దాపురించింది.

జొన్న, సజ్జ పంటలు[మార్చు]

ఇవి మెట్ట పంటలు. వర్షాధార పంటలు. వీటి మధ్య మధ్య సాలుల్లో ఇతర అపరాల, పప్పు దినుసుల పంటలు కూడా వేస్తారు. జొన్న సజ్జ పంటలకు పంట దశలో పక్షులు, పిట్టల బెడద ఎక్కువ. వాటి నివారణ కొరకు చేలు మధ్యలో కర్రలతో ఎత్తైన వేదిక నిర్మించి దానిపైకెక్కి వడిసెలలో రాళ్లు పెట్టి కొట్టి పక్షులను కాకులను తరుముతారు. ఆ వేదికనే మంచె అంటారు.

కొర్రలు/ఆరెకలు[మార్చు]

ఇవి కూడా ఆహార పంటలే. కాని మెట్ట పంటలు. అచ్చంగా వీటినే పండించ కుండా వేరుశనగ పంటలో అంతర్ పంటగా వేసే వారు. తగు మాత్రం పండించు కునే వారు. ఇంటి అవసరాల కొరకు, వైవిధ్య ఆహారం కొరకు. కాని ఆ కొర్రల, ఆరెకల అన్నం వట్టిది తిన్న చాల రుచిగా వుంటుంది. పైగా ఈ పంట చాల సులభంగా ఎలాంటి తెగుళ్ల బారిన పడకుండా, ఎరువులు ఏమి లేకున్న వర్షాధార పంటగా పండు తుంది. కాని ఏ కారణం చేతనో ఆపంట పూర్తిగా కనుమరుగై చాల కాలమే అయినది. కానీ పట్టణాలలి కొన్ని చోట్ల చెక్కెర వ్యాధి గ్రస్తులకు.... రాగులు, కొర్రలు,ఆరెకలు, ఎర్ర జొన్నలు అమ్మబడును అనే బోర్డులున్నాయి.

రాగులు[మార్చు]

వీటినే కొన్ని ప్రాంతాలలో తైదులు అంటారు. ఇవి ఆవాలంత చిన్నవి. వీటిని మెట్ట పంటగా గాని, లేద నీటి పారుదల కింద గాని పండిస్తారు. ఇది తక్కువ కాలపు పంట. వీటిని రైతులు ప్రతి యొక్కరు పండించేవారు. రాగులను రాగల్రాయిలో వేసి విసిరి. పిండి చేసి ఆ పిండిని అన్నం వండే టప్పుడు అందులో వేసి కెలికి దాన్ని ముద్దలు ముద్దలు గాచేసి తిటారు. వాటినే రాగి ముద్దలు అంటారు. రాగులు చాల బలవర్దకమైన ఆహారం. చాల రుచి కరమైనది కూడ. అందుకే ఈ రోజుల్లో కూడా పట్టణాలలోని పెద్ద పెద్ద హోటళ్లలో రాగి సంగటిని ప్రత్యేక మైన ఆహార పదార్థంగా వడ్డిస్తుంటారు. రాగి పిండితో జావ కూడా తయారు చేస్తారు.ఇది చాల భలవర్థకమైన పదార్థం. ఆరోగ్యానికి కూడా చాల మంచిది.

ఆకు తోట[మార్చు]

ఆ రోజుల్లో రైతు నిత్యం డబ్బు మొఖం జూసే పంట ఆకు తోట. ఇది తమలపాకుల తోట. ఇవి విస్థారమైన తోటలు కాదు. ఏ కొద్ది మంది రైతులే చాల కొద్ది విస్థీర్ణంలో వేసే వారు. అయినా ఆదాయం బాగానే వుండేది. అయితే ఆకు తోట పెంపకం అత్యంత నిష్ఠతో, అంటు, ముట్టు తగల కుండా పెంచాలి. ఎవరు పడితే వారు ఆ తోటలోనికి పోకూడదు. యజమాని రైతే లేదా వారి కుటుంబ సభ్యులు మాత్రమే లోనికెళ్లెవారు. వారాని కొక సారి గోరు గిల్లు (బొటన వేలుకు తగిలించుకునే ఇనుపగోరు) తో ఆకులను గిల్లి వారపు సంతలో అమ్మే వారు. వాటికి ధర బాగానే వుండేది. మారు బేర గాళ్లు తోట దగ్గరకే వచ్చి ఆకులను కొనుగోలు చేసే వారు. ఈ ఆకు తోటకు చుట్టు దట్టమైన దడి ఆరడుగుల ఎత్తు వుండి దానికి మూడడుగుల చదరంలో ఒక చట్రం వుండి దానికి ఒక తలుపు వుండేది. దానికి తాళం వేసుకునే వాడు రైతు. ఈ తమలపాకులకు ఇప్పుడు కూడా మంచి ధర వున్నా ఏ కారణం చేతనో ఆ పంట దాదాపుగా కనుమరుగై పోతున్నది. మామిడి తోట. కమ్మపల్లి వద్ద తీసిన చిత్రం

పండ్ల తోటలు[మార్చు]

పండ్ల తోటలలో ముఖ్యంగా చెప్పుకోదగినవి మామిడి తోటలు ఇవి చాల విస్తారంగా వుంటాయి. ఈ మధ్యన రైతులు ఈ మామిడి తోటలపై ఎక్కువ మక్కువ చూపు తున్నారు. కారణ మేమంటే వరి వంటి నీటి పంటలకు నీరెక్కువ కావాలి. వర్షాభావంతో నీటి లభ్యత చాల తక్కువ. అందు చేత చాల మంది రైగులు తమపొలాలలో వరి, చెరకు వంటి పంటలను మానేసి మామిడి తోటల వైపు మొగ్గు చూపు తున్నారు. ఈ మామిడి తోటలకు నీటి అవసరం తక్కువ. మామిడి చెట్లు నాటిన తరువాతి సుమారు మూడు సంవత్సరాల వరకు కొంత శ్రద్ధ వహించి అంతర కృషి చేయాలి. ఆ తర్వాత వాటంతట అవే పెరుగుతాయి. నీటి లభ్యతను బట్టి నీరు పారిస్తారు. లేకుంటే లేదు. ఈ తోటలలో మొదటి మూడు సంవత్సరాల వరకు ఇతర పంటలను, అనగా వేరుశనద, చెరకు మొదలైన పంటలను కూడా పండిస్తారు. ఈ పంటలకు పారించే నీరే మామిడి చెట్లకు కూడా సరిపోతుంది. ప్రత్యేకించి మామిడి చెట్లకు నీరు పెట్ట నవసరం లేదు. మూడు సంవత్సరాల తర్వాత మామిడి తోటలు కాతకు వస్తాయి. ఆ తర్వాత చాల సంవత్సరాల వరకు తోటలు పెరుగుతూనే వుంటాయి., కాత కాస్తూనే వుంటాయి. దీనిలో శ్రమ చాల తక్కువ. మామిడి పూత, పిందే సమయాలలో మాత్రము జాగ్రత్త వహించి అవసరాన్ని బట్టి మందులు చల్లాలి. ఇప్పుడు ఈ మామిడి తోటలు విస్తారంగా పెరిగి పోతున్నందున ఒక్కోసారు పంట దిగుబడి ఎక్కువై ధర పడి పోయి రైతులకు నిరాశ మిగులు తున్నది. కొన్నిసార్లు ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట దిగుబడి తగ్గి పోతున్నది. ఆ కారణంగా కూడా రైతులు నష్ట పోతున్నారు. మామిడి కాత బాగా కాశీ రైతు ఆనంద పడుతున్న సమయాన మే నెలలో విపరీతమైన గాలి వడగండ్ల వానలు వచ్చి పక్వానికి రాని ఆ మామిడి కాయలన్ని నేల రాలి పోతాయి. ఆ సందర్భాలలో రైతుల ఆవేదన వర్ణనాతీతం: ఇలాంటి ప్రకృతి పరమైన ఇబ్బందులే కాక మానవ కల్పిత ఇబ్బందుల వలన కూడా మామిడి రైతులు కొన్ని సార్లు నష్ట పోతున్నారు. ఈ చుట్టు పక్కల మామిడి గుజ్జు తీసే పరిశ్రమలు అనేకం ఉన్నాయి. అవి సరిగా రైతుల నుండి కాయలను కొనుగోలు చేస్తే రైతుకు మంచి గిట్టు బాటు అవుతుంది. కాని ఒక్కోసారు ఈ పరిశ్రమల యజమానులంత ఏకమై (సిండికేట్) కూడా బలుక్కొని రైతు పండించిన మామిడికి మిల్లుల యజమానులు ధర నిర్ణయిస్తారు. రైతు ఈ మామిడిని నిల్వ చేసు కోలేడు. మిల్లులు వారు చెప్పిన ధరల ప్రకారం తప్పని సరిగా వారికి అమ్మాల్సిందే. ఈ విధంగా రైతులు మోస పోతున్నారు.

కలుపు మొక్కలు[మార్చు]

కలుపు మొక్కలు పలు విదాలు. ప్రధాన పంటలో మొలిచే రైతుకు అవసరంలేని గడ్డి మొక్కలే కలుపు మొక్కలు. ఈ మొక్కలు రైతులు ప్రధాన పంటకు వేసిన ఎరువులు ఇతర పోషకాలను గ్రహించి ప్రధాన పంట్టకు నష్టం కలిగిస్తాయి. వాటిని కూలీలు చాకచఖ్యంగా సులభంగా గుర్తిస్తారు. పీకేస్తారు. కాని ఒక రకమైన కలుపు మొక్క వుంటుంది. దాని పేరు "ఊదర" .ఇది ఎలా వరి మొక్కల మధ్యలో చేరుతుందో గాని ఇది చాల మోస కారి మొక్క. ఈ "ఊదర" మొక్క పూర్తిగా వరి మొక్క లాగే వుంటుంది. వరి మొక్కల మధ్య చేరి అక్కడున్న బలాన్ని అతి తొందరగా పీల్చు కుంటాయి. సకాలంలో వాటి నిపీకేయక పోతే వరి పంట పండదు. అంతా ఊదర పంటే. అవి ఎంత మోసకారివైన ఈ కూలీల కళ్లు గప్పలేవు. చూడ డానికి ఒకే విధంగ వున్న అవి అతి వేగంగా ఏపుగా పెరిగు తాయి. వరి మొక్కలన్ని ఒక విధంగా వున్నా వరి మొక్కలాగే వున్న ఈ ఊదర మొక్కలు కొంత బలంగా ఏపుగా వుంటాయి. ఆ తేడాను బట్టి గుర్తించి వాటిని పీకి అక్కడే ఆ బురదలోనే పూడ్చేస్తారు. ఒకటొ అరో మిగిలిపోతే అవి వెన్ను వచ్చినప్పుడు మాత్రమే గుర్తించ గలము. అప్పుడు రైతులు ఆ వెన్ను లన్ని పక్యానికి రాక ముందే పీకి పారేస్తారు. ఈ కలుపు మొక్క కేవళం వరి పొలాల్లో మాత్రమే పెరుగు తుంది. మరే ఇతర పంటలలోను ఇది పెరగదు. ఇతర పంటల్లో పెరిగితే దీని ప్రత్యేకతను గుర్తించి పీకేస్తారేమో నని దానికి ముందే తెలుసు నేమో? రెండు సార్లు కలుపు తీసిన తర్వాత రెండు నెలలకు వరి పొట్ట కర్ర కొస్తుంది., ఆ తర్వాత ఆ పొట్ట పగిలి వెన్ను బయటకు వచ్చి పాలు పోసుకుంటుంది. ఆ సమయాన "గువ్వలు" దాడి రైతుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తాయి. వాటిని గిజిగాడు అంటారు. ఇవి ఊర పిచ్చుకల కన్న చిన్నగా వుండి వేల సంఖ్యలో వుంటాయి. పొలాల చుట్టు పక్కల చెట్ల మీద అందమైన గూళ్లు కట్టుకొని గుంపులు గుంపులుగా నివసిస్తుంటాయి. వీటి గూళ్లు చాల అందంగా ఒకటి రెండంతస్తులను కూడా కట్టు కుంటాయి. అవి తమ ఇళ్లల్లో అనగా గూళ్లల్లో దీపాలు కూడా పెట్టు కుంటాయి. ఈత, చెరకు వంటి ఆకులనుండి పొడవాటి ఈనెలను తీసి చెట్టు చిటారు కొమ్మన, ముఖ్యంగా బావుల్లోకి వాలి వున్న చెట్ల కొమ్మలకు అందమైన గూళ్లు అల్లి అందులో నివసిస్తుంటాయి. చీకటి పడేముందు పొలాల్లో మిణుగురు పురుగులు వెలుగులు చిమ్ముతు ఎగురుతుంటాయి. వాటిని పట్టి తీసుకెళ్ళి వాటిని చంపకుండా తమ గూటిలో పైబాగాన వుంచిన బంక మట్టికి గుచ్చి ఆ వెలుగులో అవి కాపురం చేసుకుంటాయి. రెండు మూడు పురుగులు చాలు ఆ గూటిలో వెలుగు నింపడానికి. ఆ మిణుగురులు చని పోతే వెలుగు రాదు. ప్రతి రాత్రి కొత్త మిణుగురులని తెచ్చి దీపాలు పెట్టు కుంటాయి. వేలెడంత లేని ఈ పిట్టకు ఇంత తెలివి ఎలా వచ్చిందో అని ఆచ్యర్య పోవలసినదే. వాటి గూడు నిర్మాణ శైలి కూడా అంత అందంగా వుంటుంది. ఈ పిట్టలు వరికంకులు పొట్ట పగిలే దశలో వందలాదిగా గుంపులు గుంపులుగా వరికంకుల మీవాలి ఆ లేత గింజలను తమ ముక్కులతో వత్తి అందులో వచ్చే తెల్లని పాలను తాగుతాయి. పంట పండాక ఇటువంటి గింజలు అన్నీ తాలు గింజలే. అందు చేత ఆ సమయంలో గువ్వలను తోల డానికి రైతు పొలం దగ్గర కాపలా వుండవలసినదే. కంకుల్లో గింజ ముదిరాక ఈ గువ్వలు రావు. గింజలు ముదిరాక ఎలుకలు బాధ మరొకటి ఉంది. ఎలుకలు గట్టుల్లో బొరియలు చేసుకొని రాత్రి వేళల్లో వరి కంకులను కొరికి తమ బొరియల్లో దాచు కుంటాయి. ఈ విధంగా కూడా రైతుకు పంట నష్టం. ఎలుకలను చంపడానికి ఈ రోజుల్లో ప్రభుత్యం ఉచ్చులను, విషపు బిళ్లలను సరపరా చేస్తున్నది. ఇంకా కొన్ని నివారణ మార్గాలను ప్రచారం చేస్తున్నది. కాని ఆ రోజుల్లో "ఇర్ల వాళ్లు" ఎలుకలను పట్టడాని పలుగు, పార, చిన్న గునపం తీసుకొని పొలాల వెంబడి సతీ సమేతంగా తిరుగుతూ ఎలుక బొరియ కనబడితె అందులోకి ఊదరతో పొగ పెట్టి త్రవ్వి ఎలికలను పట్టి, అవి ఆ బొరియల్లో దాచి పెట్టిన వరి కంకులను చేజిక్కించుకునే వారు. ("ఊదర " అనగా సన్న మూతి గల ఒక మట్టి కుండలో ఆకులలములు, చెత్త వేసి దానికి మంట పెట్టి దాని మూతిని ఎలుక బొరయకు బోర్లించి కుండకు వెనక నున్న సన్నని రంధ్రంద్వారా నోటితో గాలిని ఊదుతారు. అప్పుడు కుండలోనుండి దట్టమైన పొగ వచ్చి ఎలుక బొరియలంతా వ్వాపిస్తుంది. ఎక్కడైనా పొగ బయటకు వస్తే దాన్ని మూసేస్తారు. అలా కొంత సేపు పొగ పెట్టగా లోపల వున్న ఎలుకలు పొగతో ఉక్కిరి బిక్కిరి అయి ఎక్కడైనా బయటకు వచ్చే ప్రయత్నం చేస్తాయి. అలా వచ్చిన ఎలుకలన్నింటిని వెంటనే పట్టేస్తారు. ఆ తర్వాత నిదానంగా బొరియలను త్రవ్వి లోపలవున్న వరి కంకులను తీసు కుంటారు, ఇర్ల వాళ్లు ఎప్పుడూ ఆడవారు గాని మగ వారు గాని ఒంటరిగా తిరుగరు. సతీ సమేతంగానే తిరుగుతారు. అది వారి ఆచారం. అవకాశం లేనప్పుడు భార్య తమ్ముడిని గాని అన్నను గాని వెంట వేటకు తీసు కెళతారు గాని, తన తమ్మున్ని లేక అన్నను ఎట్టి పరిస్థితుల్లోను వెంట తీసుకెళ్లరు.) ఆ రోజుకి వారి కుటుంబానికి కావలసిన తిండి గింజలు, కూరలోకి ఎలుకల మాంసం దొరుకు తుంది. ఇప్పటికి వీ ఎలుకలను మెట్ట పైర్లలో, ఇతరత్రా పడుతున్నారు. ఈ ఇర్ల వాళ్లు ఒక జాతి ప్రజలు. వారి వృత్తి కేవళం తేనె తీయడం, ఎలుకలను పట్టడం, చిన్న చిన్న అడవి జంతువులను, పిట్టలను వేటాడ్డం. వీరు పల్లెలకు దూరంగా అడవులకు దగ్గరగా నివసిస్తుంటారు.

వరికంకులు గింజ కట్టి ముదిరి పైరు ఎర్ర బారితే ఇక ఆ పొలానికి నీరు కట్టడం మానేస్తాడు రైతు. ఇక పదిరోజుల్లో కోతకు సిద్దం అవుతుంది. కూలీలలు పిలిచి, తన కుటుంబ సభ్యులతో కలిసి కొడవళ్లు తీసుకొని వరికోతకు ఉపక్రమిస్తాడు రైతు. పొలం అంతా కోసి వాదులు (కుప్పలు) వేసి నాలుగు రోజులు ఎండనిచ్చి వాటిని మోపులు కట్టి ఐదారు మోపులను పొలంలోనే వదిలి మిగతా అన్నీంటిని కళ్ళం లోనికి చేర్చి కూలీలను పెట్టి తనూ ఒక చెయ్యీ వేసి వాది కొట్టి (నూర్చి) గింజలను వేరు చేస్తారు. పొలంలో వదిలిన ఈ ఐదారు మోపుల వృత్తి పరి వారికి మేర కొరకు వదిలేస్తారు. చాకలి, మంగలి, కుమ్మరి, వడ్రంగి, నీరుగట్టోడు, మొదలగు వారు తలా ఒక మోపు వాలిళ్లకు తీసుకెళ్ళి దాచుకొని, అలా అందరి దగ్గరనుండి మోపులు తెచ్చి ఒక రోజున వాటిని నూర్చి వడ్లను వేరు చేసుకుని ఉపయోగించు కుంటారు. రైతు తన కల్లంలో వున్న ఆ గింజలనుండి తాలు, తప్పలను వేరు చేయడానికి తూర్పార పట్టు తారు. ఆ వడ్లను బస్తాలకు నింపి తన ఎడ్ల బండి మీద ఇల్లు చేరుస్తారు. ఆ తర్వాత ఒక మంచి రోజు చూసుకొని కొత్త వడ్లను దంచి బియ్యం చేసి ఆ బియ్యాన్ని పొంగలి పెట్టి అనగా ఆ బియ్యంలో బెల్లంవేసి అన్నం వండి నట్టింట దేవునికి తళిగ వేసి దండం పెట్టుకొని ఆ కొత్త బియ్యం అన్నాన్ని తింటారు. ఈ ప్రాంత రైతులు అవకాశాన్ని బట్టి అనేక రకాల పంటలను పండిస్తారు. కాని వరి పంట ఇంటి కొచ్చిన వేళ మాత్రమే ఇటువంటి పూజా కార్యక్రమం చేస్తారు. మొక్క పోకుండా పంట ఇల్లు చేరినందున రైతు కళ్లల్లో ఆనంద వెల్లి విరుస్తుంది. గింజలు తీసిని వరిగడ్డిని ఇంత వరకు ఆ పొలంలో కూలి చేసిన వారి కుటుంబాలు ఒక రోజున వచ్చి ఆ గడ్డిని కళ్లంలో వేస్తు ఎద్దులతో తొక్కించి విదిలించి కట్టలుగా కట్టి ఆ ప్రక్కనే వామి (కుప్ప) వేస్తారు. కల్లం అడుగున ఆ గడ్డిలో మిగిలిన గింజలు రాలి వుంటాయి. వాటిని బాగు చేసుకొని వాళ్లు తీసు కెళ్లతారు. పొలం విస్థీర్ణాన్ని బట్టి వారికి ఆ గింజలే ఒకటి రెండు బస్తాలు దొరుకు తాయి. ఆ రోజుల్లో వడ్ల నుండి బియ్యాన్ని వేరు చేసే యంత్రాలు లేవు. వడ్లను ఏతంతో దంచే వారు. ఇది నీరు తోడే ఏమమే కాని దీనికి నీరు తోడే బాన స్థానంలో పెద్ద రోకలి వుంటుంది. కింద పెద్ద రోలు వుంటుంది. అందులో పెద్ద మొత్తంలో వడ్లను పోసి పెద్ద రోకలితో దంచు తారు. కాని సాధారణంగా ప్రతి ఇంట్లోను రోలు రోకలి వుంటుంది. రోట్లొ వడ్లను పోసి ఆడవాళ్లు రోకలితో దంచు తారు. ఈ పని ఆడవారు మాత్రమే చేస్తారు. ఒకే సారి ఇద్దరు ముగ్గురు కూడా కలిసి దంచు తారు. కొంత సేపు దంచాక దానిని చేటలతో చెరిగి బియ్యాన్ని, పొట్టును వేరు చేస్తారు. రోకలిని పెద్ద కర్రమానుతో చేస్తారు. దానికి క్రిండ పెద్దది, పైన చిన్నది అయిన పొన్ను వుంటుంది అది ఇనుముతో చేసింది. ఈ రోకలితో అనేక రకాల జొన్నలు, సజ్జలు వంటి గింజలను పప్పులను కూడా దంచు తారు. బియాన్ని పిండి చేయాలంటే కూడా రోలు, రోకలి అవసరమే. ప్రస్తుతం అన్నింటికి యంత్రాలు వచ్చాయి. రోలు, రోకలి మూల పడ్డాయి. ఇది నీరే ప్రదాన అవసరమైన వరి పంట పండించడంలో ఇక్కడి రైతుల కడగండ్లు. వర్షాభారంతో ఆ నీరే లేనప్పుడు ఇక వరి ఎక్కడ పండు తుంది. అంచేత ప్రస్తుతం వరి వేసే రైతే లేదు. అప్పట్లో బియ్యం కొరకు రైతు అంగడి కెళితే అదో అవమానం, నామోషి. ఇప్పుడు అదే రైతు రేషన్ బియ్యం కొరకు అంగలార్చడం, అవి చాలక అంగట్లో బియ్యం కొరకు వెళ్లక తప్పడం లేదు.

చెరకు గానుగ, బెల్లం తయారీ[మార్చు]

చెరకు కొట్టి ఆ పొలంలోనే ఏర్పాటు చేసుకొన్న గానుగ వద్దకు చేర్చి అందులో నుండి రసం తీసు దాన్ని పెద్ద పెనంలో కాగ బెట్టి బెల్లం తయారు చేస్తారు. ఈ బెల్లం నేల రకాన్ని బట్టి, నీటి పారుదల సౌకర్యాన్ని బట్టి తెల్లగాను, లేదా నల్లగాను, మెత్తగాను లేదా గట్టిగాను వుంటుంది. దాన్ని బట్టి దానికి ధర వస్తుంది. గట్టి దనాన్ని రైతు పరి భాషలో రాపు.... లేదా జేడు అంటారు. ఏదైనా రైతు నాలుగు డబ్బులు కళ్ల జూసేది ఈ బెల్లంలోనే. ఇప్పుడు చెరకు తోటలు ఆ కాలంతో పోలిస్తే సగం మంది కూడా పండించడం లేదు. తయారైన బెల్లాన్ని రైతులు "మండిలకు" బండ్లలో తోలుకెళ్లి అమ్ము కోవచ్చు. కాని ఇందులో రైతుకు కొంత శ్రమ ఎక్కువ. ఎలాగంటే.... అంత దూరం బెల్లాన్ని తీసుకెళ్లడం రైతుకు పెద్ద శ్రమ. మండీలలో ఒక్కోసారి ఒకటి రెండు రోజులు ఆగవలసి వస్తుంది. మూడోది బెల్లం నాణ్యతను కట్టడం. బెల్లం ధర నాణ్యత మీదనె ఆధార పడి వుంటుంది. ఇన్ని కష్టాలు పడేదానికన్నా రైతులు తమ ఇళ్ల వద్దకు వచ్చే వ్వాపారస్తులకే తమ బెల్లాన్ని అమ్ముకుంటారు. పైగా ఆ వ్వాపారస్థుడు రైతుకు ఇదివరకే అప్పు ఇచ్చి వుంటాడు. దాని వలన రైతు తన బెల్లాన్ని ఆ వ్వాపరస్తునికె తప్పక అమ్మవలసిన పరిస్థితి. బెల్లాన్ని మంచి ధర వచ్చునంత వరకు నిల్వ వుంచుకోవడము కూడ కొందరి రైతులకు అవకాశము వుండడు. కాని వ్వాపారస్తులు ముందుగానె రైతు వద్ద బెల్లాన్ని కొని తన గోదాములో చేర్చు కుంటాడు. ధర తెంచడు. ధరలు ఎప్పుడు ఎక్కువగా వుండునో అప్పుడే తన బెల్లానికి ధర తెంచమని రైతు అడగ వచ్చు. ఈ అవకాశము రైతుకు కొంత వెసులుబాటును కలిగిస్తుంది. బెల్లాన్ని "గోనెలు "లో బరువుతో తూకం వేస్తారు. గోనె అనగా 150 కిలోలు, నాలుగు గోనెలు అనగా ఒక బండి . రైతులు "నాకు పది గోనెల బెల్లం అయింద " నో, "పన్నెండు బండ్ల బెల్లం " అయిందనో అంటుంటారు. బెల్లాన్ని తూకం వేసే పరికరాన్ని రతి అంటారు. ఎక్కువగా దీనినే వాడతారు. పెద్ద త్రాసులను కూడా వాడుతారు. ఏది వాడినా వ్వాపారస్తుడు రైతును మోసం చేయాలనుకుంటే రైతు ఏ మాత్రం గ్రహించలేడు. ఇది కేవలం నమ్మకంతో జరిగే వ్యవహారం. పైగా తరుగు కింద ప్రతి బస్తా బెల్లానికి సుమారు ఒక కిలో బెల్లం ఎక్కువ వేసు కుంటారు వ్వాపారస్తుడు.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. సి.డి, జోతీశ్వరీదేవి. ఆంధ్రప్రదేశ్ లో వ్వవసాయ విధానము. p. 7/64. Retrieved 28 July 2016.

వెలుపలి లంకెలు[మార్చు]