Coordinates: 16°55′N 81°40′E / 16.92°N 81.67°E / 16.92; 81.67

నిడదవోలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పట్టణం
పటం
Coordinates: 16°55′N 81°40′E / 16.92°N 81.67°E / 16.92; 81.67
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాతూర్పు గోదావరి జిల్లా
మండలంనిడదవోలు మండలం
Area
 • మొత్తం20.36 km2 (7.86 sq mi)
Population
 (2011)[1]
 • మొత్తం43,809
 • Density2,200/km2 (5,600/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1059
Area code+91 ( 8817 Edit this on Wikidata )
పిన్(PIN)534301 Edit this on Wikidata
WebsiteEdit this at Wikidata

నిడదవోలు, ఆంధ్రప్రదేశ్ రాష్టం తూర్పు గోదావరి జిల్లా, నిడదవోలు మండలానికి చెందిన పట్టణం, మండల కేంద్రం. చరిత్రలో తూర్పు చాళుక్యులకు ప్రధాన జలదుర్గం.

పేరు వ్యుత్పత్తి[మార్చు]

నిరవద్యపురమున - నిరవద్యప్రోలు- నిడుదవోలు- నిడదవోలుగా రూపాంతరం చెందింది. తూర్పు చాళుక్య వీరుడు రెండవ విజయాదిత్యుడు అనేక యుద్ధాలలో శత్రువులనోడించి రాజ్య విస్తరణ చేశాడు. జననష్ట పాప పరిహారార్ధం 108 శివాలయాలను కట్టించినందున "నిరవద్య " అనగా పాపం లేనివాడు అని పిలవబడ్డాడు. ఇదే పేరుతో ఊరు ఏర్పడింది.

చరిత్ర[మార్చు]

గణేష్ చౌక్, నిడదవోలు
దాసాంజనేయ స్వామి దేవాలయం

మెకంజీ కైఫీయతును బట్టి నిడదవోలు చాలా ప్రాచీన నగరం. చాళుక్య పరిపాలనలో ఇది "నిరవద్య పురము "గా ఖ్యాతి గాంచిన జలదుర్గం. దీనినే కేంద్రంగా చేసుకొని అనేకమంది చాళుక్యరాజులు తమ రాజ్యాన్ని విస్తరింప చేసారు. విష్ణుకుండినుల వేంగిని చాళుక్య రెండవ పులకేసి ధ్వంసం చేసి తమ్మునికి కృష్ణ గోదావరి మధ్య ప్రాంతం అప్పగించాడు. ఆ కుబ్జవిష్ణువర్ధనుడే తూర్పు చాళుక్య మూలపురుషుడు. వారికి ప్రధాన జలదుర్గం నిరవద్యపురం.

తూర్పు చాళుక్య వీరుడు రెండవ విజయాదిత్యుడు అనేక యుద్ధాలలో శత్రువులనోడించి రాజ్య విస్తరణ చేశాడు. జననష్ట పాప పరిహారార్ధం 108 శివాలయాలను కట్టించి "నిరవద్య " అనగా పాపం లేనివాడు అనే బిరుదు పొందాడు. అతనికి గల నిరవద్య అన్న పేరుతోనే ఈ ప్రాచీన నగరం "నిరవద్య పురమని" చరిత్రలో పిలవబడింది. నిరవద్యపురం, పెదవంగూరులలో రాష్ట్ర కూటులకు-చాళుక్య రాజైన మొదటి చాళుక్య భీమునకు జరిగిన యుద్ధంలో చాళుక్యులు విజయం సాధించడంతో ఈ ప్రాంతంలో వారి పరిపాలన సుస్థిరము కాబడింది. దక్షిణ భారతదేశ చరిత్ర గతిని మార్చినదీ యుద్ధం. ఆ తరువాత సా.శ.972లో చాళుక్య రాజధాని గోదావరి ఆవలి గట్టు "రాజమందిరం" నకు చేరింది. నేటికీ ఈ ప్రాంత గ్రామీణులు రాజమండ్రిని రాజమంద్రం అంటుంటారు. ద్రాక్షారామం, భీమవరం, సామర్లకోట, పాలకొల్లు లలోని పంచా రామక్షేత్రాల నిర్మాత 2వ చాళుక్య భీముడే. ఈ దేవాలయాలలోని శిలా శాసనాల ద్వారా "నిరవద్యపుర" ప్రశస్తి తెలుస్తోంది.

నన్నయ్య మహా భారత రచనలో రాజరాజనరేంద్రుని నిరవద్యనరేశ్వర, నిరవద్యరవిప్రభ, నిరవద్యయువతీమదనా అని సంబోధించాడు. దీనిని బట్టి రాజరాజనరేంద్రుని కాలంలో కూడా నిరవద్యపురం చాళుక్యుల ప్రముఖ నగరమని తెలుస్తోంది. తెలుగు వారినందరినీ ఏకం చేయటానికి ఎంతో కృషి సల్పిన కాకతీయ గణపతి దేవ చక్రవర్తి తన జ్యేష్ట కుమార్తె రాణి రుద్రమదేవిని "నిరవద్యపుర" పాలకుడైన వీరభద్ర చాళుక్యునికి ఇచ్చి వివాహం చేశాడు. నిడదవోలు చాళుక్యులుగా వీరు చరిత్రలో ప్రసిద్ధి పొందారు. ఆంధ్ర సామ్రాజ్యన్ని వరంగల్లు రాజదానిగా కాకతీయులు పరిపాలించే సమయంలో రాణి రుద్రమ దేవి నిడదవోలుచాళుక్యుల కోడలు అయ్యింది. రుద్రమదేవి-వీరభద్రచాళుక్యుల పెద్ద కుమార్తె ముమ్మిడాంబను మరలా నిడదవోలు చాళుక్యుల వంశం లోనే ఇవ్వడంతో జన్మించిన వాడే ప్రతాపరుద్రుడు. వీరి దౌహిత్రుడు. వరంగల్లును ఏలినవాడు. ఇతను నిడదవోలు చాళుక్యుడే కాకతీయుడుగా మనకు చెబుతారు.

ఇక్కడ నుండి అనేకమంది పండితులు అనేక ప్రాంతాలలో విద్యా సంస్థలకు అధిపతులుగా వేళ్ళేవారు. శ్రీశైల పీఠానికి అధ్యాపకులు నిడదవోలు నుండి తరలివెళ్ళారని చరిత్ర చెపుతోంది.[2]

ఈ నిరవద్యపురంలో మహాదేవేశ్వరాలయం ఉండేదని అనేక శాసనాల వలన తెలుస్తోంది. ఈఆలయానికి సంబంధించిన వివరాలు పాలకొల్లు, పెనుగొండ ఆలయాలలో ఉన్నాయి. 9-2-1959న స్కూలు భవనం నిమిత్తం త్రవ్వుతుండగా జూనియర్ కళాశాల-ఉన్నత పాఠశాల ఆవరణ పడమట వైపు దొరికిన "నందీశ్వరుని" విగ్రహం అపురూప సుందర అద్భుత కాకతీయ శిల్పకళాఖండం. దీనిని శ్రీ గోలింగేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రతిష్ఠించారు. ప్రాచీన చాళుక్య శిల్పరీతి గల మరో పెద్ద నంది విగ్రహం గొల్లవీధిలో త్రవ్వకాలలో లభించింది. దీనిని సోమేశ్వర ఆలయంలో ప్రతిష్ఠించారు.

నిరవద్యపుర జలదుర్గం చుట్టూ ఎర్రకాలువ, భీమదొర కాలువ, రాళ్ళమడుగు, తాడిమళ్ళ ఆవ, ఉత్తరంగా గోదావరి మధ్యన ఇది నిర్మించబడింది. నీటిలో అతి బలమైనది మొసలి. తాము జల దుర్గ రక్షణలో నున్న మొసలి వంటి బలవంతులమని చాటడానికే తూర్పు చాళుక్యురాజులు "మకరధ్వజులు"గా తమ జండాపై మొసలి గుర్తును కల్గియున్నారు. కనుక వీరికి ఆది నిరవద్యపురమేనని తోస్తోంది. నగరం చుట్టూ దండ నాయకుల పేర్లతో గ్రామాలు కనిపిస్తాయి. ఉదా:ద్రోణంరాజుముప్పవరుడు, సింగవరుడు, గోపవరుడు, తిమ్మరాజు, సమిశ్రుడు. చావుకొలనే "చాగల్లు" శిక్షలు విధించు స్థలము. పూర్వపు విజయనగరం వలె, వీధుల విభజన, వివిధ వర్ణముల వారు నివసించే వరుసలు, ఈ జలదుర్గమునకు ద్వారమే దారవరం అక్కడ"రాళ్ళమడుగు" దాటితే ఓడపల్లె వాడపల్లె అక్కడ గోదావరి దాటిన రాజమండ్రి, ఇదీ పూర్వపు నిరవద్యపుర ప్రాంతం అయి ఉండవచ్చునని తెలుస్తోంది.విధ్వంసమునకు గురి కాబడిన చాళ్యుక్య పుణ్యక్షేత్రమైన ఈ నగరంలో తలలు తెగిన నంది విగ్రహాలు, లింగాలు, మహిషాసుర మర్ధని విగ్రహాలు దొరుకుతూనే ఉన్నాయి.

పట్టణ స్వరూపం[మార్చు]

నిడదవోలు వారఫ్

నిడదవోలును వ్యవసాయపరంగా ఆదుకొనేది విజ్జేశ్వరం గుండా గోదావరి నది నుంచి వచ్చే ముఖ్యమైన కాలువ. ఇది నిడదవోలు గుండా ప్రవహిస్తూ వరిచేలకు నీరు అందిస్తోంది. నిడదవోలులో ఈ కాలువ ఒడ్డున కల ప్రాంతాన్ని చినకాశిరేవు అని పిలుస్తారు. చినకాశిరేవులో ముఖ్యమైన ఆలయాలు ఉన్నాయి. గ్రామదేవత అయిన నంగాలమ్మ గుడికుడా చినకాశిరేవులో ఉంది.

1970కు ముందు నిడదవోలుకు పశ్చిమగోదావరి జిల్లాలో ప్రముఖపాత్ర ఉండేది. గోదావరి పై రైలురోడ్డు వంతెన (కొవ్వూరుకి రాజమహేంద్రవరం), సిద్దాంతంవంతెన (రావులపాలెం దగ్గర నిర్మించబడ్డాక పట్టణ అభివృద్ధి కుంటు పడింది. తణుకు, తాడేపల్లిగూడెం బాగా అభివృద్ధి చెంది పశ్చిమగోదావరి జిల్లాలో ప్రాముఖ్యత సంపాదించుకుంటున్నాయి. నిడదవోలు సంత (మార్కెట్) మునిసిపల్ కార్యాలయం దగ్గర ఉండేది. తరువాత ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరున్న అంబేద్కర్ బొమ్మ ప్రాంతానికి తరలించారు.

దేవాలయాలు[మార్చు]

చినకాశీరేవు, నిడదవోలు
గోలింగేశ్వరస్వామి ఆలయంలో ఉన్నమృత్యుంజయుడి విగ్రహం
వేణు గోపాలస్వామి దేవస్థానం
చిన కాశీ రేవు మీద ఉన్న వేంకటేశ్వర స్వామి దేవాలయం
  1. గోలింగేశ్వర స్వామి ఆలయం
  2. సోమేశ్వర స్వామి ఆలయం
  3. నంగలమ్మ గుడి
  4. చిన్నకాశీ రేవు మీద ఉన్న గుళ్ళు
  5. కొట సత్తెమ్మ దేవాలయం

రవాణా సౌకర్యాలు[మార్చు]

రహదారి మార్గాలు[మార్చు]

సమీప జాతీయ రహదారి 16 కొవ్వూరు దగ్గర కలదు.

రైలు మార్గం[మార్చు]

నిడదవోలు రైల్వే కూడలి. ఇక్కడకు ఉత్తరాన విశాఖపట్నం నుండి రాజమండ్రి మీదగా వచ్చే లైను రెండుగా విడి పోయి మళ్ళీ విజయవాడలో కలుసుకుంటాయి. అందులో ఒకటి ఏలూరు మీదగా, రెండవది తణుకు, భీమవరాల మీదగా వెళతాయి.

జలమార్గం[మార్చు]

రైలు, రోడ్డు రవాణా వ్యవస్థ రాకముందు, నిడదవోలు వారఫ్ నుండి పడవలపై ప్రయాణం చురుకుగా సాగేది. రైలు ప్రయాణం వచ్చిన తరువాత కూడా నిడదవోలు వరకూ పడవమీద వచ్చి అక్కడనుండి రైలు ఎక్కేవారు. రోడ్డు రవాణా వచ్చిన తరువాత, వారఫ్ వాడుక పూర్తిగా తగ్గిపోయింది. ఆ వారఫ్ నెహ్రూ బొమ్మకు ఎదురుగా ఉంది.

ముఖ్యమైన కూడళ్ళు[మార్చు]

  1. గణపతి సెంటరు
  2. నెహ్రూ బొమ్మ ( లెవెల్ క్రాసింగు దగ్గర )
  3. పెద్ద గాంధీ బొమ్మ
  4. పొట్టి శ్రీరాములు బొమ్మ
  5. పాటిమీద ( గణేష్ ఛౌక్ ) సెంటరు
  6. బస్టాండ్ సెంటరు

జనగణన గణాంకాలు[మార్చు]

2011 జనగణన ప్రకారం పట్టణ జనాభా 43,809.

పరిపాలన[మార్చు]

నిడదవోలు పురపాలక సంఘం పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది.

ప్రముఖులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల జనగణన దత్తాంశ సమితి - పట్టణాలు (2011), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q58768667, archived from the original on 15 March 2018
  2. గోపరాజు వెంకటానందం, నిడదవోలు చరిత్ర

వెలుపలి లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=నిడదవోలు&oldid=3789206" నుండి వెలికితీశారు