జాతీయ చేనేత దినోత్సవం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జాతీయ చేనేత దినోత్సవం
జాతీయ చేనేత దినోత్సవం
చేనేత
జరుపుకొనేవారుభారతదేశం
ప్రారంభం2015
జరుపుకొనే రోజుఆగస్టు 7
ఆవృత్తివార్షికం
అనుకూలనంప్రతి ఏటా ఇదే రోజు

జాతీయ చేనేత దినోత్సవం (ఆంగ్లం: National Handloom Day) ఆగస్టు 7న దేశవ్యాప్తంగా ప్రతి ఏట నిర్వహిస్తారు. భారత స్వాతంత్ర్యోద్యమములో ప్రధాన భూమిక పోషించి, స్వాతంత్ర్య సమపార్జనకు ఒక సాధనంగా నిలిచింది చేనేత. గాంధీజీ కూడా రాట్నంపై నూలు వడకడానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. అంతటి ప్రాధాన్యత కలిగిన చేనేతరంగానికి ఒకరోజు ఉండాలన్న ఉద్దేశంతో జాతీయ చేనేత దినోత్సవాన్ని ఏర్పాటుచేయడం జరిగింది.

ప్రారంభం[మార్చు]

2015, ఆగస్టు 7న చెన్నైలో జరిగిన కార్యక్రమంలో భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రారంభించి, భారత చేనేత లోగోను ఆవిష్కరించడంతోపాటూ ఆగస్టు 7వ తేదీని జాతీయ చేనేత దినోత్సవంగా పరిగణిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా 2012-14 సంవత్సరాల్లో చేనేత రంగంలో ప్రతిభ కనబరిచిన 72మందికి అవార్డులు (వీరిలో 16 మందికి సంత్ కబీర్ పురస్కారాలు) ప్రదానం జరిగింది.[1]

చరిత్ర[మార్చు]

భారత స్వాతంత్ర్యోద్యమములో ప్రధాన భూమిక పోషించి, స్వాతంత్ర్య సమపార్జనకు ఒక సాధనంగా నిలిచింది చేనేత. భారత స్వాతంత్ర్యోద్యమంలో చేనేత అహింసాయుత ఉద్యమానికి నాంది పలికిన చేనేతరంగానికి ఒకరోజు ఉండాలన్న ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రానికి చెందిన యర్రమాద వెంకన్న నేత చేనేత దినోత్సవానికి సరైన తేదీ కోసం అధ్యయనం చేశాడు. భారత స్వాతంత్ర్య ఉద్యమం జరుగుతున్న సమయంలో విదేశీ వస్త్రాలను బహిష్కరించాలన్న లక్ష్యంతో స్వదేశీ ఉద్యమం వచ్చింది. మొదటిసారిగా 1905లో బెంగాల్‌ రాష్ట్ర రాజధాని కలకత్తాలోని టౌన్‌హాల్‌లో 1905 ఆగస్టు 7న భారీ సమావేశం నిర్వహించి విదేశీ వస్త్రాలను బహిష్కరించడంతోపాటూ దేశీయోత్పత్తుల పునరుద్ధరణకు పిలుపునిచ్చారు. అలా విదేశి వస్తు బహిష్కరణలో కీలకపాత్ర వహించిన ఆగస్టు 7ను జాతీయ చేనేత దినోత్సవంగా చేయాలని పిలుపునిచ్చాడు.[2][3][4]

అప్పటి భారత రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, అప్పటి కేంద్ర జౌళీ శాఖ మంత్రి శ్రీ శంకర్ సింగ్ వాఘేలా, ఎల్.కె.అద్వానీ లతోపాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులు వెంకన్న ప్రయత్నాన్ని అభినందిస్తూ సందేశాలు పంపారు. 2008 నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా జరుపుతుంది. 2008, ఆగస్టు 7న హైదరాబాదులోని రవీంద్రభారతిలో జరిగిన చేనేత దినోత్సవ వేడుకలకు అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డా. వై.యస్. రాజశేఖరరెడ్డి వచ్చాడు. 2012, ఏప్రిల్ 6న రవీంద్రభారతిలో వెంకన్న సారథ్యంలో చేనేత దినోత్సవ చరిత్ర, ఆవశ్యకతను వివరిస్తూ స్వదేశీయం సంగీత నృత్య రూపకం ప్రదర్శించారు. 2012, ఆగస్టు 7న దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట నుండి రాజ్ ఘాట్ వరకు చేనేత వాక్ చేసి జాతీయ స్థాయిలో ఈ దినోత్సవంపై ఆసక్తిని కలిగించాడు. 2014లో అదే రాజ్ ఘాట్ లో చేనేత దినోత్సవ ర్యాలీకి ముఖ్య అతిథిగా వచ్చిన అప్పటి కేంద్ర జౌళీ శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ ప్రధానితో చర్చించి చేనేత దినోత్సవాన్ని అధికారికం చేస్తామని మాటిచ్చాడు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాల, కేంద్ర ప్రాంత ప్రభుత్వాల అంగీకారంతో 2015, జూలై 29న భారత ప్రభుత్వం ఆగస్టు 7ను జాతీయ చేనేత దినోత్సవంగా అధికారిక గెజిట్ విడుదల చేసింది. 2015, ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ చెన్నైలో అధికారికంగా ప్రారంభించారు.[5]

తెలంగాణలో[మార్చు]

ప్రతి సంవత్సరం ఈ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాదులోని పీపుల్స్ ప్లాజాలో జాతీయ చేనేత దినోత్సవం ఘనంగా జరుపబడుతోంది. ఈ సందర్భంగా 10 రోజులపాటు జాతీయ ఎగ్జిబిషన్‌ కూడా నిర్వహించబడుతుంది. 2018 నుండి ఈ దినోత్సవం రోజున తెలంగాణకు చెందిన నేత కళాకారులకు ప్రభుత్వం తరపున కొండా లక్ష్మణ్‌బాపూజీ పురస్కారాలు (అవార్డుతోపాటు 25వేల న‌గ‌దు పుర‌స్కారం) అందజేస్తారు.[6] 2022 వరకు 159మంది కళాకారులకు ఈ పురస్కారాలు అందజేయబడ్డాయి.

  • 2022: ప్రమాదవశాత్తు చేనేత కార్మికుడు మరణించినా, సహజమరణం పొందినా 5 లక్షల రూపాయల పరిహారం అందేలా తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన నేతన్న బీమా పథకంను 2022 ఆగస్టు 7న రాష్ట్ర చేనేత జౌళి శాఖలమంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రారంభించాడు. చేనేత మిత్ర, పావలావడ్డీ, నేతన్నకు చేయూత, నూలు సబ్సిడీ లబ్ధిదారులకు చెక్కులనూ, 28మంది చేనేత కార్మికులు, వృత్తి నిపుణులకు కొండా లక్ష్మణ్‌బాపూజీ అవార్డులను అందజేయబడ్డాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎల్‌ రమణ, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, వెంకటేశ్వర్లు, మండల శ్రీరాములు, సాంబారి సమ్మారావు, బోల్ల శివశంకర్‌, కర్నాటి విద్యాసాగర్‌, యాదగిరి, పద్మశ్రీ అవార్డు గ్రహీతలు గజం అంజయ్య, గజం గోవర్ధన్‌, చింతకింది మల్లేశం, ఎర్రమాద వెంకన్న నేత, సహా పలుసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.[7][8]

ఇతర వివరాలు[మార్చు]

  1. చేనేతరంగంలో విశిష్ట కృషిచేసిన చేనేత కార్మికులను గౌరవిస్తూ 2012నుంచి ఏటా చేనేత కార్మికులకు సంత్‌కబీర్‌ అవార్డులను జాతీయస్థాయిలో అందిస్తున్నారు.
  2. 2018లో యాదాద్రి - భువనగిరి జిల్లా పోచంపల్లి గ్రామానికి చెందిన చేనేత కళాకారులు కుట్టులేని జాతీయ జెండాను రూపొందించారు. 24 ఆకులతో కూడిన అశోక చక్రం సహా జాతీయ పతాకమంతా ఎలాంటి కుట్టులేకుండా మగ్గంపై తయారుచేశారు.[9]

ఇవీ చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. సాక్షి (13 August 2015). "ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం". Archived from the original on 7 August 2018. Retrieved 7 August 2018.
  2. ఆంధ్రజ్యోతి (6 August 2015). "చేనేతకూ వచ్చింది ఒక రోజు..." Archived from the original on 7 August 2018. Retrieved 7 August 2018.
  3. ఆంధ్రజ్యోతి (7 August 2017). "చేనేత రంగానిది సుధీర్ఘ చరిత్ర..." Archived from the original on 7 August 2018. Retrieved 7 August 2018.
  4. ఆంధ్రజ్యోతి (భీమారం(వరంగల్ అర్బన్)) (7 August 2017). "చేనేతన్నకు కష్టకాలం...కడుపు నింపని మగ్గం". Archived from the original on 7 August 2018. Retrieved 7 August 2018.
  5. ఆంధ్రజ్యోతి, ఎడిటోరియల్-జనవాక్యం (6 August 2018). "వస్త్రం అస్త్రమైన రోజు". www.andhrajyothy.com. యర్రమాద వెంకన్న నేత. Archived from the original on 19 September 2019. Retrieved 19 September 2019.
  6. telugu, NT News (2021-08-07). "తెలంగాణ నేత‌న్న‌ల‌కు దేశంలోనే ప్ర‌త్యేక‌మైన గుర్తింపు : మంత్రి కేటీఆర్". Namasthe Telangana. Archived from the original on 2021-08-07. Retrieved 2022-08-08.
  7. telugu, NT News (2022-08-08). "నేతన్నకు బీమా ధీమా". Namasthe Telangana. Archived from the original on 2022-08-08. Retrieved 2022-08-08.
  8. "KTR: 'నేతన్నకు బీమా' దేశానికి ఆదర్శం". EENADU. Archived from the original on 2022-08-08. Retrieved 2022-08-08.
  9. ఆంధ్రజ్యోతి (4 August 2018). "కుట్టు లేని త్రివర్ణ పతాకం". Archived from the original on 7 August 2018. Retrieved 7 August 2018.