Coordinates: 13°11′N 79°38′E / 13.18°N 79.63°E / 13.18; 79.63

తిరుత్తణి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
  ?తిరుత్తణి
తమిళనాడు • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 13°11′N 79°38′E / 13.18°N 79.63°E / 13.18; 79.63
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం
ఎత్తు

• 76 మీ (249 అడుగులు)
జిల్లా (లు) తిరువళ్ళూరు జిల్లా
జనాభా 38,502 (2011 నాటికి)
కోడులు
పిన్‌కోడ్

• 631209
ఆలయ ప్రవేశ ద్వారం

తిరుత్తణి (Tiruttani) తమిళనాడులో గల సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఇక్కడ కొలువైన దైవం సుబ్రహ్మణ్య స్వామి. కొండపై ఉన్న ఈ ఆలయం చాలా ప్రాచీనమైనది. ఈ దివ్య క్షేత్రంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వల్లీ దేవసేన అమ్మవార్ల సహితంగా కొలువయ్యారు. తమిళనాడులోని సుబ్రహ్మణ్య క్షేత్రాలలో విశిష్టమైనదిగా పేరుగాంచిన ఈ క్షేత్రం తమిళులందరికీ ఆరాధ్య క్షేత్రం. తమిళుల ఇష్టదైవంగా, ఇలవేల్పుగా పూజలందుకుంటున్న సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఇక్కడ మురుగపెరుమాళ్ళుగా పూజలందుకుంటున్నాడు. శ్రీవారు వెలసి ఉన్న కొండకు ఇరుప్రక్కలందూ పర్వత శ్రేణులు వ్యాపించి ఉన్నాయి. ఉత్తరాన గల పర్వతం కొంచెం తెల్లగా ఉండడంవల్ల దీనిని ‘బియ్యపుకొండ’ అని పిలుస్తారు. దక్షిణం వైపునగల కొండ కొంచెం నల్లగా ఉండడంవల్ల దానిని ‘గానుగ పిండి కొండ’ అని పిలవడం జరుగుతోంది. సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవతలు, మునుల బాధలు పోగొట్టడానికి శూరపద్మునితో యుద్ధం చేసిన అనంతరం, వల్లీదేవిని వివాహం చేసుకోవడానికి బోయకుల రాజులతో చేసి చిన్నపోరు ముగిసిన అనంతరం శాంతించి, ఇక్కడ ఈ క్షేత్రంలో కొలువయ్యాడని ఇక్కడి స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది. స్వామి శాంతించి ఇక్కడ కొలువయ్యాడు కనుక ఈ క్షేత్రానికి ‘తణిగై’ లేదా ‘శాంతిపురి’ అనే పేరొచ్చింది. అలాగే ‘తణిగ’ అనే పదానికి మన్నించుట, లేదా ఓదార్చుట అని అర్థం చెబుతారు. స్వామి భక్తుల తప్పులను, పాపాలను మన్నించి, కటాక్షిస్తాడు కనుక ఈ క్షేత్రానికి తిరుత్తణి అని పేరు వచ్చింది.

చరిత్ర[మార్చు]

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి ఆలయం అతి పురాతనమైనది. 1600 సంవత్సరాలకు పూర్వంనుంచే ఇక్కడ ఈ ఆలయం ఉన్నట్లు శాసనాల ద్వారా అవగతమవుతోంది. సా.శ.875-893 లో అపరాజిత వర్మ అనే రాజు శాసనమందు, సా.శ.907-953 లో మొదటి పరాంతక చోళుడి శాసనంలో ఈ క్షేత్రం గురించి ప్రస్తావించబడటంవల్ల 1600 సంవత్సరాలకు పూర్వమే పల్లవ, చోళ రాజుల చేత ఈ క్షేత్రం కీర్తింపబడిందని అవగతమవుతోంది.

కాలి నడకన చేరుకునే విధం[మార్చు]

రైలులో తిరుత్తణి వెళ్తే, రైల్వే స్టేషను బయటకి వస్తే రోడ్డు కనిపిస్తుంది . అక్కడ నుంచి ఎడమ వైపుకి నడిస్తే బస్సు స్టాండుని చేరుకుంటాం . బస్సు స్టాండు నుంచి కొండ పైకి బస్సులు ఆటోలు ఉంటాయి. మెట్ల మార్గం కూడా ఉంటుంది. ఇక్కడ మనకి కొండ క్రిందనే కల్యాణకట్ట ఉంటుంది . ఇక్కడ మొత్తం 365 మెట్లున్నాయి. ఈ మెట్లను సంవత్సరంలోని 365 రోజులకు ప్రతీకలుగా చెబుతారు. తిరుపతి లాగే ఇక్కడ కూడా మెట్లకు పసుపు, కుంకుమ రాయడం, . కర్పూరం వెలిగించడం చేస్తారు .

కుమారతీర్థము[మార్చు]

సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఇక్కడ తన తండ్రి అయిన పరమేశ్వరుని పూజించ తలచి తిరుత్తణి కొండపై తన నివాసానికి ఈశాన్య భాగాన శివలింగ ప్రతిష్ఠచేసి సేవించాడట. కుమారస్వామి పితృభక్తికి మెచ్చిన సాంబశివుడు సంతోషించి కుమారస్వామికి ‘జ్ఞానశక్తి’ అనే ‘ఈటె’ను అనుగ్రహించాడట. ఆ కారణాన ఈ స్వామికి "జ్ఞానశక్తి ధరుడు" అనే పేరొచ్చింది. ఇక్కడ కుమారస్వామి స్థాపించిన లింగానికి కుమారేశ్వరుడనే పేరొచ్చింది. కుమారస్వామి, శివుని అర్చించడానికి సృష్టించిన తీర్థమే కుమారతీర్థము. దీనిని శరవణ తీర్థమని కూడా పిలుస్తారు.

స్థల పురాణము[మార్చు]

త్రేతా యుగములో శ్రీ రామచంద్ర ప్రభువు రావణ సంహారము చేసిన తర్వాత రామేశ్వరంలో ఈశ్వరుడిని ఆరాధిస్తాడు. అక్కడ, ఈశ్వరుడి ఆనతి మేరకు, శ్రీ రాముడు ఈ తిరుత్తణి క్షేత్రము దర్శించాడు. ఆ తర్వాతనే శ్రీరామచంద్రునికి పూర్తి మనశ్శాంతి కలిగింది.

ద్వాపర యుగములో, మహా వీరుడైన అర్జునుడు దక్షిణ దేశ తీర్థ యాత్రలు చేస్తూ, ఇక్కడ తనికేశన్ స్వామి వారిని కొలిచాడు. శ్రీ మహా విష్ణువు ఈ క్షేత్రములోనే సుబ్రహ్మణ్యుడి పూజ చేసి ఆయన పోగొట్టుకున్న శంఖు, చక్రములను తిరిగి పొందినాడు. (అంతకు పూర్వం వాటిని తారకాసురుడు శ్రీ మహా విష్ణువు నుండి చేజిక్కించుకుంటాడు).

చతుర్ముఖ బ్రహ్మ ప్రణవ అర్ధమును చెప్పలేక పోవడం వలన, మన ముద్దులొలికే సుబ్రహ్మణ్యుడి చేత బంధింపబడి, ఆయన సృష్టి చేసే సామర్థ్యం కోల్పోతాడు. ఇక్కడ తిరుత్తణిలో ఉన్న బ్రహ్మ తీర్థములో కార్తికేయుని పూజించి, ఆయన తిరిగి శక్తి సామర్ధ్యములను పొందాడు.

దేవేంద్రుడు ఈ క్షేత్రములోనే, ఇంద్ర తీర్థములో, “ కరున్ కువలై ” అనే అరుదైన పూల మొక్కను నాటి, ప్రతి రోజూ ఆ మొక్క ఇచ్చే మూడు పుష్పములతో ఇక్కడ షణ్ముఖుని పూజించాడు. ఆ తర్వాతనే, ఇంద్రుడు తారకాసురాది రాక్షసుల ద్వారా పోగొట్టుకున్న “ సంఘనీతి, పద్మనీతి, చింతామణి ” మొదలైన దేవలోక ఐశ్వర్యమును తిరిగి పొందాడు.

ప్రత్యేకత[మార్చు]

ఇక్కడ ఉత్సవ మూర్తులుగా ఉన్న వల్లీ, దేవసేనా, సుబ్రహ్మణ్యులకు పైన ఉండే విమానము (ఛత్రము) రుద్రాక్షలతో చేసింది. చాలా అందముగా ఉంటుంది. అంతేకాదు, స్వామి వారు ఒక ఆకు పచ్చని రంగులో ఉండే షట్కోణ పతకము ధరించి మిల మిల మెరిసి పోతూ ఉంటారు. ఇక్కడ బంగారు బిల్వ పత్రముల మాలతో కూడా స్వామి వారిని అలంకరిస్తారు.

ప్రముఖులు[మార్చు]

ఈ క్షేత్రమును చేరే మార్గములు[మార్చు]

తిరుత్తణి ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి నుంచి తమిళనాడు లోని అరక్కోణం (ఆర్కోణం) వెళ్ళే దారిలో ఉంది. రోడ్డు ద్వారా: చెన్నై నుండి 84 కి.మీ., తిరుపతి నుండి 68 కి.మీ., అరక్కోణం ( కాణిపాకం ) నుండి 78 కి.మీ. దూరంలో ఈ క్షేత్రం ఉంది. ఈ ప్రదేశాలు అన్నిటి నుంచి బస్సు సౌకర్యం ఉంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కూడా తిరుపతి నుంచి అనేక బస్సులు నడుపుతుంది. రైలు ద్వారా: దీనికి దగ్గరలోని రైల్వే స్టేషను అరక్కోణం జంక్షన్. అంతేకాక, చెన్నై నుండి తిరుత్తణికి అనేక లోకల్ రైళ్ళు నడుస్తాయి.

చిత్రమాలిక[మార్చు]

బయటి లింకులు[మార్చు]