గఫార్ (కవి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గఫార్
జననంగఫార్
మహబూబ్ నగర్ జిల్లా ఉప్పునుంతల
ప్రసిద్ధికవి
మతంఇస్లాం

గఫార్ మహబూబ్ నగర్ జిల్లా ఉప్పునుంతల మండల కేంద్రానికి చెందిన కవి. మాతృభాష ఉర్దూ అయినా బాల్యం నుండి తెలుగు భాష మీద మక్కువతో తెలుగు సాహిత్యాన్ని, మరీ ముఖ్యంగా శతకాలను అధ్యయనం చేశారు. ఆ కోవలోనే తెలుగు మీద పట్టు సాధించి, కవిత్వం రాసి పలువురిచే ప్రశంసలందుకున్నారు.

వృత్తి[మార్చు]

గఫార్ విశ్రాంత ఉపాధ్యాయుడు. అచ్చంపేట, సిద్ధాపూర్ తదితర ప్రాంతాలలో ఉపాధ్యాయులుగా సేవలందించారు. ప్రధానోపాధ్యాయులుగానూ విధులు నిర్వహించారు.

సాహితీ ప్రస్థానం[మార్చు]

1981లో తొలిసారి మారుతున్నది సమాజమా? అనే కవిత రాసి, ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం వారు ప్రసారం చేసిన యువవాణి కార్యక్రంలో తన కవితావాణిని వినిపించారు. రేడియోలో ప్రసారమైన తన కవితా పఠనానికి వచ్చిన స్పందన ప్రేరణతో మరింత సంకల్పంతో కవిత్వం రాయడం ప్రారంభించారు. సారా వ్యతిరేక ఉద్యమంలోను, జిల్లాలో చేపట్టిన అక్షరకిరణం కార్యక్రమంలోనూ అనేక గీతాలు రాసి ప్రజలను చైతన్యపరిచారు. మరీముఖ్యంగా అచ్చంపేట ప్రాంతంలోని గిరిజనులలో చైతన్యదీప్తికి తోడ్పడ్డారు. 1993లో సారా వ్యతిరేక ఉద్యమంలో భాగంగా తాను రాసిన సారాక్షసి, మరణగీతం కవితలు కవిగా మంచి పేరును తీసుకువచ్చాయి. ఇప్పటికీ పలు సామాజిక సమస్యలపై కవితలు రచిస్తున్నారు. ఇటీవల నానీలపై దృష్టిసారించి రచనలు చేస్తున్నారు. త్వరలో నానీలతో ఓ కవితా సంకలనాన్ని వెలువరించటానికి సిద్దమవుతున్నారు.

రచనలు[మార్చు]

ఇప్పటికి వారు వెలువరించిన పుస్తకాలు

  1. చైతన్య దీపిక (2008)
  2. నల్లమల రత్నాలు (2010)
  3. ప్రజా ప్రస్థానం (2011)[1].

ప్రశంసలు[మార్చు]

వీరి సాహిత్య కృషికి పలు సాహితీ సంస్థలు సన్మానించాయి. స్నేహా సేవాసంస్థ, పొద్దుటూరు వారు, గురజాడ లలిత కళావేదిక వారు, ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా జిల్లాలో నిర్వహించిన సన్నాహక కార్యక్రమాలలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వారు వీరిని సన్మానించారు.

మూలాలు[మార్చు]

  1. ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్ జిల్లా ప్రత్యేకంలో మధ్యపేజి,(పుట-9) తేది.29.08.2014