పాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పాలు

పాలు లేదా క్షీరము (Milk) శ్రేష్ఠమయిన బలవర్ధక ఆహారము. ఇందులో అన్ని రకాలైన పోషక విలువలు ఉన్నాయి. కొద్దిగా విటమిన్ సి, ఇనుము తక్కువ. అన్ని వయసులవారూ తీసుకోదగ్గ ఉత్తమ ఆహార పదార్థము. పాలను ఉత్పత్తి చేసే జంతువులు ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు. హిందువులు పవిత్రంగా పూజించే ఆవు యొక్క పాలు అన్ని రకాల పూజా కార్యక్రమాలలోనూ వాడతారు.

భాషా విశేషాలు[మార్చు]

ఆవు పాలపొదుగు

తెలుగు భాషలో పాలు అనే పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.[1] పాలు నామవాచకంగా పాలు, పాలవంటి ద్రవాలకు ఉపయోగిస్తారు,

సంస్కృతంలో క్షీరము [ kṣīramu ] అనగా n. Milk, పాలు.[2] The milky sap of plants. జిల్లేడు మొదలైన వాటి పాలు. Water ఉదకము. క్షీరాన్నము rice and milk boiled together. పరమాన్నము. క్షీరోదక న్యాయము intimate union as milk and water mixed with each other. నీళ్లును పాలును కలిసినట్లు ఒక్కటిగా కలిసియుండు ధర్మము. వారు క్షీరోదక న్యాయముగా నున్నారు they are intimately associated or related. క్షీరాబ్ధి or క్షీర సాగరము kshīr-ābdhi. n. The sea of milk పాల సముద్రము. క్షీరాబ్ధి తనయ the goddess who sprung from this sea, i.e., Lakshmi. పాల సముద్రం నుండి జన్మించిన లక్ష్మి.

పోషక విలువలు[మార్చు]

మనిషి పాలలో 71 కిలో కేలరీలు, ఆవు పాలలో 69 కిలోకేలరీలు, గేదె పాలలో 100 కిలో కేలరీలు, మేక పాలలో 66 కిలో కేలరీలు శక్తి ఉంటుంది.

రకాలు :[మార్చు]

బూత్ పాలు . తల్లి పాలు. ఆవు పాలు మేక పాలు, గాడిద పాలు, గొఱ్ఱెపాలు. ఒంటె పాలు

పిల్లలకు త్రాగించే పాలు :[మార్చు]

పిల్లల ఆరోగ్యానికీ, ఎదుగుదలకూ పాలు చాలా అవసరం. అయితే, పిల్లలకు ఏ పాలు ఇవ్వడం మంచిదన్న విషయాన్ని పరిశీలించాలి. ఆవు, గేదె, మేకపాలు, స్కిమ్డ్‌ మిల్క్‌ లభిస్తాయి. ఆవుపాలు పిల్లలకు ఎంతో శ్రేష్టమయినవి. కొంతమంది, పాలు పిండగానే అలాగే త్రాగేస్తారు. ఆ పాలను గుమ్మపాలు అంటారు. పొదుగు నుంచీ పిండగానే అలాగే పచ్చిపాలను త్రాగడం మంచిది కాదు. ఆరోగ్యం మాట అటుంచి ఎన్నెన్నో అనారోగ్యాలు ఏర్పడే ప్రమాద ముంటుంది. ఆ పాలల్లో ప్రమాదకరమైన సూక్ష్మక్రిములు ఉండే అవకాశం ఎక్కువ. ఆ పాలు త్రాగిన పిల్లలకు సూక్ష్మక్రిములు శరీరంలోకి ప్రవేశించి ఇన్‌ఫెక్షన్‌ను, వ్యాధిని కలిగిస్తాయి. ఏ పాలనయినా బాగా కాచి (వేడి చేసి) పొంగించిన తర్వాతనే పిల్లలకు త్రాగించడం ఆరోగ్యకరం. పాశ్చరైజ్డ్‌ మిల్క్‌ను కనీసం పది నిముషాలయినా కాచినట్లయితే అందులోని బాక్టీరియా నశిస్తుంది. ఆ పాలు గోరువెచ్చగా ఉన్నప్పుడే పిల్లలకు త్రాగించాలి. చల్లారిపోయిన పాలను, నిలవ ఉన్న పాలను పిల్లలకు త్రాగించకూడదు. చిక్కగా ఉన్న పాలల్లో నీళ్ళు కలిపి త్రాగించాలంటే పాలు కాగుతున్నప్పుడే కొంచెం నీటిని కలపాలి. వేడిపాలల్లో చన్నీళ్ళు కలిపితే, ఆ నీటి ద్వారా బాక్టీరియా పాలల్లోకి ప్రవేశించి పిల్లల ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. పిల్లలకు పాలు పడకపోతే వాంతులు, విరేచనాలు, అజీర్తి వ్యాధులు కలుగుతాయి. పిల్లల వైద్యుని సంప్రదించి, పిల్లలకు ఏ పాలు త్రాగించాలన్నదీ తెలుసుకోవాలి. పశువులపాలు త్రాగించేటప్పుడు పశువులకు చేపువచ్చి పాలివ్వటానికి ఇంజెక్షన్‌ ఇస్తారు కొంతమంది పాల వ్యాపారస్తులు. ఆ ఇంజెక్షన్‌లోని రసాయనిక మందు పాలలో ప్రవేశిస్తుంది. పశువులకు వ్యాధులోస్తే, ఆ సంగతి తెలియక పిల్లలకు ఆ పాలను త్రాగించినట్లయితే పిల్లలకు అనారోగ్యాలు కలుగుతాయి. ముఖ్యంగా పసిబిడ్డకు త్రాగించే పాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

ఈ రోజుల్లో, పట్టణాల్లో పశువుల పాలవాడకం తగ్గిపోయి బూత్‌పాలను ఉపయోగిస్తున్నారు. స్కిమ్డ్‌ మిల్క్‌నే అందరూ ఇష్టపడుతున్నారు. ఎందుకంటే, ఆ పాలల్లోంచి కొవ్వు తొలగించబడుతోంది. పిల్లలకు ఆ పాలు త్రాగించడం ఆరోగ్య కరమే. ఆ పాలల్లో క్యాలరీలు అధికంగా ఉంటాయి. ఆ పాలల్లోంచి కొవ్వు పొర మాత్రమే తొలగిపోతుంది, పోషక పదార్థాలేమీ తొలగిపోవు. ఆ పాలల్లో ఖనిజాలు అలాగే నిక్షిప్తమై ఉంటాయి. కొవ్వు ద్వారా లభించేవి ఎ, డి విటమిన్‌లు. 'ఎ' విటమిన్‌ ఆహార పదార్థాల ద్వారా లభిస్తుంది. డి విటమిన్‌ సూర్యరశ్మి ద్వారా శరీరానికి అందుతుంది. ఆ విధంగా ఆ రెండు విటమినులను వారి శరీరానికి భర్తీ చేయవచ్చు. స్కిమ్డ్‌ మిల్క్‌లో పిల్లలకు అవసరమయ్యే కాల్షియం పుష్కలంగా ఉంటుంది. పిల్లలు పాలు త్రాగటానికి ఇష్టపడకపోతే, ఏ రూపంలోనైనా పాలతో తయారుచేసిన పదార్థాలను ఇవ్వవచ్చు. పెరుగు, మజ్జిగ, పాయసం, పాలకోవా, జున్నులాంటి ఎన్నెన్నో పదార్థాలను పాలతో తయారు చేసి పిల్లలకు ఇవ్వవచ్చు. పిల్లల ఎదుగుదలకూ, నూతన శక్తికీ, శారీరక దృఢత్వానికీ వారికి ప్రతిరోజూ పాలను లేదా పాలతో తయారయ్యే పదార్థాలను ఇవ్వడం ఎంతో ముఖ్యం. పసిపిల్లలకు పోతపాలు వచ్చేటప్పుడు, అవి ఆవుపాలు, గేదెపాలు, మేకపాలు, బూత్‌పాలు ఏవయినా కానీ, పలుచని వస్త్రంలో చిటికెడు వామును వేసి మూటకట్టి, పాలను కాచేటప్పుడు, ఆ మూటను ఆ పాలల్లో వేసి కాచినట్లయితే పాపాయికి అరుగుదల బాగా ఉండి, అజీర్తి బాధలు కలుగవు. జీర్ణక్రియ బాగుంటుంది. ఆకలి కూడా బాగా ఏర్పడుతుంది.

బరువు తగ్గడానికి పాలు[మార్చు]

పాలు ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఇది అందరికీ తెలుసు. పాల వలన బరువు తగ్గడము కూడా సాధ్యమే ... మధ్య వయసులో పాలు తగినంత తాగుతూ, డి-విటమిన్‌ సమృద్ధిగా తీసుకునేవారు బరువు తగ్గుతారని నిరూపించబడింది . ఇజ్రాయిల్ పరిశోధకులు భారీ కాయము కలిగిన 300 మంది మీద జరిపిన పరిశోధనా ఫలితం ఇది. వీరి వయసు 45-60 మధ్య ఉంది. ప్రతిరోజూ 2 గ్లాసుల పాలు త్రాగడంతో పాటు పిండి పదార్థాలు ఉన్న ఆహారము తక్కువగా తీసుకున్న వీరు 2 ఏళ్ళ కాలములో 5.5 కిలోల బరువు తగ్గడము గమనించారు. అదే సమయములో ఇతర పద్ధతుల ద్వారా బరువు తగ్గేందుకు ప్రయత్నించినవారు కేవలము 3 కిలోల బరువు మాత్రమే తగ్గారు. అందుకే పాలలోని కాల్షియం, విటమిన్‌ డి బరువు తగ్గడములో కీలక పాత్ర వహిస్తాయని పరిశోధనల ద్వారా స్పష్టమైనది.

ఎసిడిటీని తగ్గించే పాలు :[మార్చు]

పాలు పౌష్టికాహారమన్న సంగతిని మనం తరచూ వింటుంటాము. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఏదో ఒక్క రూపంలో పాలను తమ ఆహారంగా స్వీకరిస్తూ ఉంటారు. ఆరోగ్యాన్ని కాపాడటంలోనూ, రోగాల్ని కుదర్చడంలోనూ పాలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. అందుకే పాలను ప్రకృతి సిద్ధమైన 'పరిపూర్ణ పౌష్టికాహారం' కింద చెబుతుంటారు. పాలను మానవులు అనాది నుంచి వాడుతూ వస్తున్నారు. ముఖ్యంగా ఆవుపాలు, బర్రెపాలు, మేకపాలు మొదలైనవి. ఆవుపాలలో తల్లి పాలలో కంటే రెట్టింపు ప్రొటీన్లు ఉంటాయి. కాని చక్కెర తక్కువ ఉంటుంది. బర్రె పాలలో ఆవు పాలలో కంటే కొవ్వు అధికంగా ఉంటుంది.

పాలు పడకపోవటం[మార్చు]

కొందరి వొంటికి పాలు సరిపడవు. అలాంటి వాళ్ళకు పాలు తాగగానే కడుపులో గ్యాస్‌ ఉత్పత్తి అయి కడుపు ఉబ్బరించినట్లుగా అవుతుంది. ఇందుకు కారణం ఏమిటంటే... పాలలో ఉన్న కార్బోహైడ్రేట్ జీర్ణం గావించే లాక్టోస్‌ అనబడే ఎంజైమ్‌ వీళ్ళలో సరిగా ఉత్పత్తి కాకపోవటం! లాక్టోస్‌ సరిగా ఉత్పత్తి కాని మనుషులకు కడుపులో గ్యాస్‌ అధికంగా ఉత్పత్తి కావటం, కడుపు ఉబ్బరించటం, కడుపులో నొప్పి, అజీర్ణం, విరేచనాలు లాంటి ఇబ్బందులు ఎదరవుతాయి.

పాలు తాగగానే లేక పాల ఉత్పత్తి పదార్థాలను తినగానే ఇలాంటి ఇబ్బంది ఏర్పడే వాళ్ళు తమకు తాము ఒక సింపుల్‌ టెస్ట్‌ను చేసుకోవచ్చు. వీళ్ళు ఒక పది రోజుల పాటు పాలు, పాల ఉత్పత్తులను తీసుకోవటం మానేసి పై లక్షణాలు తొలగి పోతాయేమో చూడాలి. పాలు మానేయగానే పై లక్షణాలు తొలగి పోయి, తిరిగి పాల ఉత్పత్తులను తీసుకోవటం మొదలు పెటగానే మళ్ళీ ఆ లక్షణాలు మొదలైతే తమకు పాలు పడవని అర్థం చేసుకుని పాలను మానేయాలి.

ఇలా పాలు పడని వాళ్ళు శాకాహారులైతే వాళ్ళు తమ ఆహారంలో గుడ్లు, సోయా, చిక్కుళ్ళు, మిగతా పప్పు ధాన్యాల ద్వారా తమ శరీరానికి అవసరమైన పాల ద్వారా లభించని ప్రొటీన్లను పొందటానికి ప్రయత్నించాలి. ఎందుకంటే ప్రొటీన్లు తక్కువయితే శరీరంలో రోగనిరోధక శక్తి బలహీనపడి సులభంగా రోగాల బారినపడే అవకాశం ఉంది.

పాలలో ఔషధోపయోగాలను[మార్చు]

లావెక్కడానికి : బక్కగా బలహీనంగా ఉన్న వాళ్ళకు లావెక్కటానికి పనికివచ్చే ఆహారం పాలు! ఉండాల్సిన బరువుకంటే తక్కువ బరువున్న వాళ్ళు సరిపడా పాలు తాగటం ద్వారా వారానికి 3 నుంచి 5 పౌన్ల దాకా బరువెక్క గలుగుతారు. నిదానం మీద శరీరం బరువు ఉండాల్సిన స్థితికి వచ్చేస్తుంది.

పాలు తాగటం వల్ల కళ్ళు తేటగా ప్రకాశవంతంగా అవుతాయి. శరీరానికి ఆరోగ్యకరమైన మెరుపు వస్తుంది. శరీరంలోని అవయవాలన్నిటిలోకి సరిపడా శక్తి చేరుకుంటుంది.

సజావుగా రక్తప్రసరణ : శరీరంలో రక్తప్రసరణ సరిగా లేని వాళ్ళకు పాలు అద్భుతమైన ఆహారం! పాలు తాగటంవల్ల కడుపు, ప్రేవులలోని ద్రవాంశం వృద్ధిచెంది, శరీరంలో రక్తప్రసరణ సహజసిద్ధంగా మెరుగుపడుతుంది. రక్త ప్రసరణ సరిగా లేకపోవటంవల్ల చేతులు, పాదాలు చల్లగా ఉంటాయి. రక్తప్రసరణ సజావుస్థితికి చేరుకున్నాక ఇవి మళ్ళీ జవాన్ని పుంజుకొని కొద్ది రోజులకే ఆ వ్యక్తి నవనవలాడే చైతన్యంతో కనిపిస్తాడు.

కడుపులో వాయువు : కడుపులో యాసిడ్‌ తయారవుతూ హైపర్‌ ఎసిడిటీతో బాధపడే వాళ్ళకు పాలు మంచి ఆహారం. పాలు జీర్ణం కావటానికి యాసిడ్‌ అధికంగా కావాల్సివస్తుంది. పాలలో ఉండే ఆల్కలైన్‌ని తయారుచేసే పదార్థాల వల్ల శరీరంలోని యాసిడ్‌ స్థితిని ప్రేరేపించే పరిస్థితులు చాలా త్వరగా సాధారణ స్థితికి వచ్చేస్తాయి.

నిద్రలేమి : నిద్రలేమితో బాధపడే వాళ్ళకు పాలు పరప్రసాదం లాంటివి. నిత్యం నిద్రపట్టక బాధపడే వాళ్ళు రోజూ రాత్రి పడుకోబోయే ముందు గ్లాసెడు పాలలో తేనెను కలుపుకుని తాగాతే కొన్నాళ్టికి కమ్మని నిద్రకు చేరువవుతారు!

శ్వాస సంబంధవ్యాధులు : జలుబు, గొంతు బొంగురుపోవటం, ఉబ్బసం, టాన్సిలైటిస్‌, బ్రాంకైటిస్‌ లాంటి వ్యాధులకు పాలు దివ్యౌవషధంలా పనిచేస్తాయి. గ్లాసెడు మరగ కాచిన పాలలో చిటికెడు పసుపు, కొద్దిగా మిరియాల పొడి కలుపుకుని రోజూ రాత్రుల తాగితే శ్వాసకోశ సంబంధ ఇబ్బందులకు మూడు రోజులలో సత్ఫలితం లభిస్తుంది.

ఎముకల ఆరోగ్యానికి: పాలు విటమిన్ డి, ప్రోటీన్, కాల్షియంని కలిగివుంటాయి. ప్రతిరోజు పాలు తగడము వలన ఎముకలు బలముగ తయారు అవుతాయి.

గర్భిణీ స్త్రీలు ప్రతి రోజు మూడు కప్పుల పాలు తాగాలని  USDA సిఫార్సు చేసింది.

హృదయ వ్యాధి : ఇటీవల జరిగిన వెల్ష్ మెన్ అధ్యయనం ప్రకారం పాలు ఎక్కువ తాగే వాళ్ళలో కంటే తక్కువ తాగే వాళ్ళలో గుండె పోటు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి.చర్మవ్యాధులు : పాలపైని మీగడలో కొద్దిపాటి వినెగార్‌, చిటికెడు పసుపు కలిపి గాయాలు, పుళ్ళు, గజ్జి మొదలైన వాటిమీద పూస్తే అవి త్వరలోనే తగ్గిపోతాయి.

సౌందర్య సాధనంగా : కాస్మెటిక్స్‌లాంటి సౌందర్య సాధనాలలో కూడా పాలు చక్కగా ఉపకరిస్తాయి. రాత్రులు మరగ కాచిన గ్లాసెడు పాలలో ఒక తాజా నిమ్మకాయ రసాన్ని పిండి పది నిమిషాల తర్వాత చేతులు, మొహం, మెడ, భుజాలకు రాసుకుని ఆరబెట్టాలి. అలాగే పడుకుని మర్నాడు ఉదయం గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడుగుకోవాలి. ఇలా రెగ్యులర్‌గా చేస్తే కొన్నాళ్టికి శరీరంలో మెరుపు, మృదుత్వం వస్తాయి. పచ్చిగుడ్డు సొనను పాలలో కలుపుకుని ప్రతిరోజూ ఆ మిశ్రమంతో తలంటుకంటే జుట్టు పెరగటమే కాదు. ఏరకమైన మాడుకు సంబంధించిన చర్మవ్యాధులూ ఇంక మీ దరికి చేరవు.

పాల ఉత్పత్తులు[మార్చు]

  • మనం ప్రతిరోజూ తాగే టీ, కాఫీ లను పాలను ఉపయోగించి తయారుచేస్తారు.
  • పాలును తోడుపెట్టినచో పెరుగు తయారవుతుంది.
  • పెరుగును పలుచగా నీటితో బాగా కలిపితే మజ్జిగ, లస్సీ తయారవుతాయి.
  • మరిగించిన పాలు మీద, తోడుపెట్టిన పెరుగుమీద మీగడ తయారవుతుంది.
  • మజ్జిగను బాగా చిలికితే వెన్న తయారవుతుంది.
  • వెన్నను మరగబెట్టిన నెయ్యి వస్తుంది.
  • పాలుతో కోవా మొదలైన అనేక రకాల మిఠాయిలు తయారుచేస్తారు.
  • ఇంకా బిస్కెట్లు, చాక్లెట్లు, ఐస్ క్రీములు, రొట్టెలు మొదలైన వాటి తయారీలో పాలను విరివిగా ఉపయోగిస్తారు.

పాలు ఉత్పాదకత[మార్చు]

అత్యధిక పాల ఉత్పాదకులు — 2005
(1000 టన్నులు)
 భారతదేశం 91,940
 United States 80,264.51
 China 32,179.48
 Russia 31,144.37
 పాకిస్తాన్ 29,672
 జర్మనీ 28,487.95
 France 26,133
 Brazil 23,455
 United Kingdom 14,577
 New Zealand 14,500
World Total 372,353.31
Source: UN Food & Agriculture Organisation [1]

పాడి పరిశ్రమలో ఆవుపాలు, గేదెపాలు ఉత్పత్తి చేసినా ప్రపంచ వ్యాప్తంగా ఆవు పాలు మాత్రమే అధిక స్థాయిలో ఉత్పత్తిచేస్తున్నారు. ఇదే ఎక్కువ మంది వినియోగిస్తున్నారు. అమెరికా, బ్రిటన్ వంటి అభివృద్ధి చెందిన దేశాలలో 90 శాతం పాలు జెర్సీ ఆవులనుంచే తయారౌతుంది. పాల ఉత్పత్తిలో భారతదేశం, అమెరికా మొదటి, రెండు స్థానాలలో ఉన్నాయి.[3] భారతదేశంలో అమూల్ సహకార సంస్థ అత్యంత విస్తృతమైనది.

పాలవెల్లువ[మార్చు]

గ్రామాల్లో గతంలో ఏ ఇంట చూసినా పాడిగేదెల పోషణ ఉండేది. గ్రామీణ ప్రాంతాల్లో అప్పట్లో కొనేవారు తక్కువగా ఉండేవారు. అప్పట్లో పాలు, పెరుగు అమ్ముకోవడం నామోషిగా భావించేవారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో కూడా గేదెల పెంపకం తగ్గిపోవడంతో పాలకు కొరత ఏర్పడుతోంది. అమ్మకాలకు అనుగుణంగా పాలు ఉత్పత్తి కావడం లేదు.లీటరు పాల ధర రూ. 45లకు విక్రయిస్తేనే గిట్టుబాటవుతుందని ఉత్పత్తిదారులు వాపోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో గేదెలను పోషించే వారు తాము వినియోగించుకోగా మిగిలిన పాలను విక్రయిస్తున్నందువలన గిట్టుబాటు ధర గురించి ఆలోచించడం లేదు. అయితే వ్యాపార ధోరణితో ఈ వృత్తిని చేపట్టినవారు గిట్టుబాటు కాకపోవడంతో ఆ వృత్తిని వదిలేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని పాల కేంద్రాల వద్ద ప్రస్తుతం పాలు పోసేవారి కంటే పాలు కొనేవారే ఎక్కువ సంఖ్యలో ఉంటున్నారు.

పురాణాలలో[మార్చు]

  • విష్ణువు పాల సముద్రములో శేషపానుపు మీద పవళిస్తాడు.
  • శ్రీకృష్ణుడు వినాయక వ్రతకల్పములో పాలభాండములో చవితి నాడు చంద్రున్ని చూడడం వల్ల నీలాపనింద కలిగింది.

ఇవి కూడా చూడండి[మార్చు]

వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=పాలు&oldid=4010836" నుండి వెలికితీశారు