మొదటి ప్రపంచ యుద్ధం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మొదటి ప్రపంచ యుద్ధం
WWImontage
పైనుంచి సవ్యదిశలో: పశ్చిమ రంగంలో కందకాలు; కందకాన్ని దాటుతున్న బ్రిటిషు మార్క్-IV ట్యాంకు; రాయల్ నేవీ యుద్ధ నౌక HMS ఇర్రెసిస్టిబుల్ ఒక మందుపాతరను డీకొట్టి మునిగిపోతున్న దృశ్యం; వికర్స్ మషీన్ గన్ సిబ్బంది, గ్యాస్ మాస్కులతో, జర్మను అల్బట్రాస్ బైప్లేన్‌లు
తేదీ1914 జూన్ 28 – 1918 నవంబరు 11 కాల్పుల విరమణపై 1919 జూన్ 28 న సంతకం చేసారు

28 జూలై 1914 – 11 నవంబరు 1918 (1914-07-28 – 1918-11-11)
(4 సంవత్సరాలు, 3 నెలలు , 2 వారాలు)

శాంతి ఒప్పందాలు
  • వెర్సెయిల్స్ ఒప్పందం
    1919 జూన్ 28 న కుదిరింది
    (4 సంవత్సరాలు , 11 నెలలు)[c]
  • సెయింట్-జెర్మెయిన్-ఎన్-లాయె ఒప్పందం
    1919 సెప్టెంబరు 20 న కుదిరింది
    (5 సంవత్సరాలు, 1 నెల, 1 వారం , 6 రోజులు)
  • నెవిల్లీ-సుర్-సీన్ ఒప్పందం
    1919 నవంబరు 27 న కుదిరింది
    (4 సంవత్సరాలు, 1 నెల, 1 వారం , 6 రోజులు)[d]
  • ట్రయనాన్ ఒప్పందం
    1920 జూన్ 4 న కుదిరింది
    (5 సంవత్సరాలు, 10 నెలలు , 1 వారం)
  • Treaty of Sèvres
    1920 ఆగస్టు 10 న కుదిరింది
    (6 సంవత్సరాలు, 1 వారం , 6 రోజులు)[e]
  • అమెరికా-ఆస్ట్రియా శాంతి ఒప్పందం
    1921 ఆగస్టు 24 న కుదిరింది
    (3 సంవత్సరాలు, 8 నెలలు, 2 వారాలు , 3 రోజులు)[f][g]
  • అమెరిఉకా జర్మనీ ఒప్పందం
    1921 ఆగస్టు 25 న కుదిరింది
    (4 సంవత్సరాలు, 4 నెలలు, 2 వారాలు , 5 రోజులు)[h]
  • అమెరికా-హంగరీ ఒప్పందం
    1921 ఆగస్టు 29 న కుదిరింది
    (3 సంవత్సరాలు, 8 నెలలు, 3 వారాలు , 1 రోజు)[i]
  • లాసాన్ ఒప్పందం
    1923 జూలై 24 న కుదిరింది
    (8 సంవత్సరాలు, 8 నెలలు, 3 వారాలు , 4 రోజులు)[j]
ప్రదేశంఐరోపా, ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, పసిఫిక్‌ ద్వీపాలు, చైనా, హిందూ మహాసముద్రం, ఉత్తర దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రాలు
ఫలితంమిత్ర రాజ్యాల విజయం; జర్మను, రష్యా , ఓట్టోమన్, ఆస్ట్రో హంగేరియన్ సామ్రాజ్యాల పతనం; ఐరోపా, మధ్య ప్రాచ్యాల్లో కొత్త దేశాల ఏర్పాటు; జర్మనీ వలసలను ఇతర సామ్రాజ్యాలకు బదిలీ; నానాజాతి సమితి ఏర్పాటు.
ప్రత్యర్థులు
మిత్ర రాజ్యాలు
కేంద్ర రాజ్యాలు:
సేనాపతులు, నాయకులు
  • French Third Republic రేమండ్ పాయింకేర్
  • French Third Republic జార్జెస్ క్లెమెన్స్క్యూ
  • United Kingdom of Great Britain and Ireland జార్జి V
  • United Kingdom of Great Britain and Ireland హెర్బర్ట్ హెన్రీ ఎస్క్విత్
  • United Kingdom of Great Britain and Ireland డేవిడ్ లాయిడ్ జార్జ్
  • నికోలస్ II  Executed
  • Russian Republic అలెగ్జాండర్ కెరెన్స్కీ
  • Kingdom of Serbia పీటర్ I
  • బెల్జియం ఆల్బర్ట్ I
  • Empire of Japan తైషో చక్రవర్తి
  • Kingdom of Montenegro నికోలస్ I
  • Kingdom of Italy విక్టర్ ఎమాన్యుయెల్ III
  • Kingdom of Italy విట్టోరియో ఆర్లాండో
  • United States వుడ్రో విల్సన్
  • Kingdom of Romania ఫెర్డినాండ్ I
  • Kingdom of Hejaz హుసేన్ బిన్ అలీ
  • Kingdom of Greece ఎలెఫ్తెరియోస్ వెనెజిలోస్
  • థాయిలాండ్ రామ VI
  • Beiyang government ఫెంగ్ గువోఝాంగ్
  • Beiyang government షు షిచాంగ్
    తదితరులు...
  • German Empire విల్‌హెల్మ్ II
  • German Empire ఎరిక్ లూడెండార్ఫ్
  • Austria-Hungary ఫ్రాంజ్ జోసెఫ్ I [k]
  • Austria-Hungary చార్లెస్ I
  • Ottoman Empire మెహ్మెడ్ V [l]
  • Ottoman Empire మెహ్మెడ్ VI
  • Ottoman Empire ముగ్గురు పాషాలు
  • Kingdom of Bulgaria ఫెర్డినాండ్ I
    తదితరులు...
బలం
మొత్తం: 4,29,28,000[1]మొత్తం: 2,52,48,000[1]
6,81,76,000 (అంతా)
ప్రాణ నష్టం, నష్టాలు
  • 'చనిపోయిన సైనికులు: 55,25,000
  • గాయపడిన సైనికులు: 1,28,32,000
  • మొత్తం సైనికులు: 1,83,57,000 
  • పౌర మరణాలు: 40,00,000
  • చనిపోయిన సైనికులు: 43,86,000
  • గాయపడిన సైనికులు: 83,88,000
  • మొత్తం సైనికులు: 1,27,74,000 
  • పౌర మరణాలు: 37,00,000

మొదటి ప్రపంచ యుద్ధంఐరోపాలో ఉద్భవించిన ప్రపంచ యుద్ధం. ఈ యుద్ధం 1914 జూలై 28 నుండి 1918 నవంబరు 11 వరకు జరిగింది. దీనిని మహా యుద్ధం (గ్రేట్ వార్) అనీ, అన్ని యుద్ధాలనూ ముగించే యుద్ధం (వార్ టు ఎండ్ ఆల్ వార్స్) అని కూడా పిలుస్తారు. ఇది చరిత్రలో జరిగిన అతిపెద్ద యుద్ధాల్లో ఒకటిగా నిలిచింది. 6 కోట్ల మంది ఐరోపాలతో సహా మొత్తం 7 కోట్ల మంది సైనిక సిబ్బంది ఈ యుద్ధంలో పాల్గొన్నారు. 90 లక్షల మంది సైనికులు, 70 లక్షల మంది పౌరులూ మరణించారు.

ఆస్ట్రియాకు చెందిన ఆర్చ్‌డ్యూక్ ఫ్రాంజ్ ఫెర్డినాండ్‌ హత్య ఈ యుద్ధానికి నాంది పలికింది. ఆస్ట్రియా-హంగరీ సింహాసనానికి వారసుడైన ఆర్చ్‌డ్యూక్ ఫ్రాంజ్ ఫెర్డినాండ్‌ను 1914 జూన్ 28 న సారయెవో నగరంలో యుగోస్లావ్ జాతీయవాది గవ్రిలో ప్రిన్సిప్ హత్య చేయడంతో జూలై సంక్షోభం తలెత్తింది. ఈ హత్యకు స్పందనగా జూలై 23 న ఆస్ట్రియా-హంగరీ సెర్బియాకు అల్టిమేటం ఇచ్చింది. దానికి సెర్బియా ఇచ్చిన సమాధానం వారిని సంతృప్తిపరచలేదు. రెండు దేశాలూ యుద్ధానికి సిద్ధపడ్డాయి.

ఈ యుద్ధంలో ఐరోపా లోని గొప్ప శక్తులన్నీ రెండు ప్రత్యర్థి కూటములుగా ఏర్పడ్డాయి. అవి: ట్రిపుల్ ఎంటెంట్ (రష్యా సామ్రాజ్యం, ఫ్రాన్సు, గ్రేట్ బ్రిటన్), ట్రిపుల్ అలయన్స్ (జర్మనీ, ఆస్ట్రియా-హంగరీ, ఇటలీ). తదనంతర కాలంలో ట్రిపుల్ ఎంటెంట్ కు మిత్రరాజ్యాలు అని, ట్రిపుల్ అలయన్స్ కు కేంద్ర శక్తులు (సెంట్రల్ పవర్స్) అనీ పేర్లు వచ్చాయి. ట్రిపుల్ అలయన్స్ స్థాపనోద్దేశం ఆత్మ రక్షణే కానీ, దాడి చెయ్యడం కాదు. ఈ కారణం వల్లనే ఇటలీ 1915 ఏప్రిల్ దాకా యుద్ధంలో దిగలేదు. ఆ తరువాత ఆస్ట్రియా-హంగరీతో ఉన్న విభేదాల కారణంగా, అది ట్రిపుల్ అలయన్స్ నిబంధనలకు వ్యతిరేకంగా దాడి మొదలుపెట్టిందని చెబుతూ ఇటలీ, అలయన్స్ నుండి బయటికి వచ్చి మిత్రరాజ్యాల పక్షాన యుద్ధంలో చేరి పోరాడింది. ఈ కూటములు రెండూ తరువాతి కాలంలో మరిన్ని దేశాలు చేరడంతో విస్తరించాయి. ఇటలీ, జపాన్, అమెరికాలు మిత్రరాజ్యాలతో చేరాయి. ఓట్టోమన్ సామ్రాజ్యం, బల్గేరియాలు సెంట్రల్ పవర్స్‌తో చేతులు కలిపాయి.

1914 జూలై 28 న ఆస్ట్రియా-హంగరీ, సెర్బియా రాజధాని బెల్‌గ్రేడ్‌పై దాడి చేసాక, రష్యా సెర్బియాకు దన్నుగా నిలవాలని భావించి, సమీకరణ మొదలుపెట్టింది.[2] జూలై 30 న రష్యా సంపూర్ణ సమీకరణ ప్రకటించింది; 31 న ఆస్ట్రియా-హంగరీ, జర్మనీలు కూడా సమీకరణలు ప్రకటించాయి. రష్యా సమీకరణను ఆపాలని, 12 గంటల్లోగా నిస్సమీకరణ చెయ్యాలనీ జర్మనీ డిమాండు చేసింది.[3] రష్యా ఈ డిమాండును తోసిపుచ్చడంతో, ఆగస్టు 1 న జర్మనీ, ఆస్ట్రియా-హంగరీకి మద్దతుగా రష్యాపై యుద్ధం ప్రకటించింది. ఆగస్టు 6 న ఆస్ట్రియా-హంగరీ కూడా రష్యాపై యుద్ధం ప్రకటించింది; ఆగస్టు 3 న రష్యాకు మద్దతుగా ఫ్రాన్సు కూడా సమీకరణ ప్రకటించింది.[4]

ఆగస్టు 3 న జర్మనీ ఫ్రాన్స్‌పై యుద్ధం ప్రకటించింది; అదే రోజున బెల్జియంలోని ఏ ప్రాంతం నుండైనా తమ సైన్యాన్ని వెళ్ళనివ్వాలనీ దాన్ని అడ్డుకోరాదనీ డిమాండు చేస్తూ బెల్జియం ప్రభుత్వానికి జర్మనీ అల్టిమేటం పంపింది. బెల్జియమ్ దాన్ని నిరాకరించింది. దీంతో ఆగస్టు 4 తెల్లవారుజామున జర్మనీ బెల్జియంపై దాడి చేసింది; 1839 లండన్ ఒప్పందం ప్రకారం బెల్జియం రాజు బ్రిటన్ సహాయం కోరాడు.[5][6] [7] బెల్జియం తటస్థతను జర్మనీ గౌరవించాలని బ్రిటన్ డిమాండ్ చేసింది; జర్మనీ సమాధానం "సంతృప్తికరంగా లేనందున" 1914 ఆగస్టు 4 న బ్రిటన్, జర్మనీపై యుద్ధం ప్రకటించింది.

ఆగస్టు 12 న బ్రిటన్, ఫ్రాన్సులు ఆస్ట్రియా-హంగరీపై యుద్ధం ప్రకటించాయి; ఆగస్టు 23 న జపాన్, బ్రిటన్‌తో చేయి కలిపి చైనా, పసిఫిక్‌లలోని జర్మను స్థావరాలను ఆక్రమించుకుంది. 1914 నవంబరులో ఓట్టోమన్ సామ్రాజ్యం సెంట్రల్ పవర్స్ లో చేరింది. ఫ్రాన్స్‌లోకి జర్మనీ పురోగతి మార్నే యుద్ధంతో ఆగిపోయింది. 1915 లో, ఇటలీ మిత్రరాజ్యాలలో చేరి ఆల్ప్స్‌లో ఒక ఫ్రంట్ తెరిచింది. బల్గేరియా 1915 లో సెంట్రల్ పవర్స్‌లో చేరింది. గ్రీస్ 1917 లో మిత్రరాజ్యాలలో చేరి బాల్కన్‌లో యుద్ధాన్ని విస్తరించింది. అమెరికా మొదట్లో తటస్థంగా ఉన్నప్పటికీ అది మిత్రరాజ్యాలకు యుద్ధ సామగ్రిని అందించే ముఖ్యమైన సరఫరాదారుగా మారింది. చివరికి, జర్మన్ జలాంతర్గాములు అమెరికన్ వర్తక నౌకలను ముంచివేసిన తరువాత, జర్మనీ తన నావికాదళం తటస్థ షిప్పింగ్‌పై అనియంత్రిత దాడులను తిరిగి ప్రారంభిస్తుందని ప్రకటించడం, అమెరికాపై యుద్ధం చేయడానికి మెక్సికోను జర్మనీ ప్రేరేపించడానికి ప్రయత్నిస్తోందని వెల్లడవడంతో, 1917 ఏప్రిల్ 6 న అమెరికా జర్మనీపై యుద్ధం ప్రకటించింది. శిక్షణ పొందిన అమెరికన్ దళాలు 1918 మధ్యకాలానికి గానీ పెద్ద సంఖ్యలో యుద్ధం లోకి దిగలేదు. కాని చివరికి అమెరికన్ ఎక్స్‌పెడిషనరీ ఫోర్స్ 20 లక్షల మంది సైనికుల సంఖ్యకు చేరుకుంది.[8]

1915 లో సెర్బియా ఓడిపోయినప్పటికీ, రొమేనియా 1916 లో మిత్రరాజ్యాల శక్తులలో చేరింది. 1917 లో ఓడిపోయింది. రష్యాలో 1917 ఫిబ్రవరి విప్లవం తరువాత జారిస్ట్ నిరంకుశత్వాన్ని తొలగించి, తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. కాని యుద్ధ వ్యయం పట్ల నిరంతర అసంతృప్తి అక్టోబర్ విప్లవానికి, సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఏర్పాటుకు, బ్రెస్ట్-లిటోవ్స్క్ ఒప్పందంపై 1918 మార్చిలో కొత్త ప్రభుత్వం సంతకం చేయడానికీ దారి తీసింది. దీంతో యుద్ధంలో రష్యా ప్రమేయం ముగిసింది. తూర్పు నుండి పశ్చిమ రంగానికి పెద్ద సంఖ్యలో జర్మన్ దళాలను బదిలీ చేయడానికి వీలైంది. దీని ఫలితంగా 1918 మార్చిలో జర్మన్ దాడి జరిగింది. ఈ దాడి తొలుత విజయవంతమైంది గానీ, నిర్ణయాత్మక విజయాన్ని సాధించడంలో విఫలమైంది. మిత్రరాజ్యాలు తమ వందరోజుల దాడిలో జర్మనీని వెనక్కి నెట్టాయి.[9] 1918 సెప్టెంబరు 29 న యుద్ధ విరమణపై సంతకం చేసిన మొట్టమొదటి సెంట్రల్‌ పవర్‌ బల్గేరియా. అక్టోబరు 30 న, ఉస్మానియా ("ఒట్టోమన్" ఆంగ్లంలో, పాత పేరు "తురుకు" కూడా) సామ్రాజ్యం లొంగిపోయి, ముడ్రోస్ కాల్పుల విరమణపై సంతకం చేసింది.[10] నవంబరు 4 న ఆస్ట్రో-హంగేరియన్ సామ్రాజ్యం, విల్లా గియుస్టి కాల్పుల విరమణకు అంగీకరించింది. జర్మనీ మిత్రదేశాలు ఓడిపోవడం, దేశంలో తిరుగుబాటు, మిలిటరీ ఇకపై పోరాడటానికి ఇష్టపడకపోవడం వగైరాలతో, కైజర్ విల్హెల్మ్‌ను నవంబరు 9 న పదవీచ్యుతుణ్ణి చేశారు. 1918 నవంబరు 11 న జర్మనీ కాల్పుల విరమణపై సంతకం చేయడంతో, యుద్ధం ముగిసింది.

మొదటి ప్రపంచ యుద్ధం ప్రపంచంలోని రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక, సామాజిక వాతావరణంలో ఒక ముఖ్యమైన మలుపు. రెండవ పారిశ్రామిక విప్లవానికి, పాక్స్ బ్రిటానికా ముగింపుకూ గుర్తుగా ఈ యుద్ధాన్ని పరిగణిస్తారు. యుద్ధం దాని తక్షణ పరిణామాలు అనేక విప్లవాలు, తిరుగుబాట్లను లేవనెత్తాయి. బిగ్ ఫోర్ (బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా, ఇటలీ) 1919 పారిస్ శాంతి సదస్సులో అంగీకరించిన వరుస ఒప్పందాల ద్వారా ఓడిపోయిన దేశాలపై తమ నిబంధనలను విధించాయి. వీటిలో ప్రసిద్ధమైనది జర్మనీ ఓటమిని అంగీకరించిన వెర్సైల్లెస్ ఒప్పందం.[11] అంతిమంగా, యుద్ధం ఫలితంగా ఆస్ట్రో-హంగేరియన్, జర్మన్, ఉస్మానియా, రష్యన్ సామ్రాజ్యాలు ఉనికిలో లేకుండా పోయాయి. వాటి అవశేషాల నుండి అనేక కొత్త దేశాలు వెలుగుచూసాయి. అయితే, మిత్రరాజ్యాలు విజయం సాధించినప్పటికీ (భవిష్యత్ యుద్ధాలను నివారించడానికి నానాజాతి సమితిని ఏర్పాటు చేసినప్పటికీ ), కేవలం ఇరవై సంవత్సరాల తరువాత రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది..

నేపథ్యం[మార్చు]

రాజకీయ సైనిక పొత్తులు[మార్చు]

Map[permanent dead link] of Europe focusing on Austria-Hungary and marking central location of ethnic groups in it including Slovaks, Czechs, Slovenes, Croats, Serbs, Romanians, Ukrainians, Poles.
1914 లో ప్రత్యర్థి సైనిక సంకీర్ణాలు: ఆకుపచ్చ రంగులో ట్రిపుల్ ఎంటెంటే ; గోధుమ రంగులో ట్రిపుల్ అలయన్స్ . ట్రిపుల్ అలయన్స్ మాత్రమే అధికారిక "కూటమి"; జాబితాలో ఉన్న ఇతరులు అనధికారిక మద్దతుదారులు.

19 వ శతాబ్దంలో ఎక్కువ భాగం, ప్రధాన ఐరోపా శక్తులు తామతమ బలాల సున్నితమైన సమతుల్యతను కొనసాగించడానికే ప్రయత్నించాయి. ఫలితంగా సంక్లిష్టమైన రాజకీయ, సైనిక పొత్తులు ఏర్పడ్డాయి. [12] బ్రిటన్ ఎవరితోనూ కలవకుండా ఒంటరిగా ఉండడం, ఓట్టోమన్ సామ్రాజ్యం క్షీణించడం, ఒట్టో వాన్ బిస్మార్క్ ఆధ్వర్యంలో 1848 తరువాత ప్రష్యా ఎదుగుదల దీనికి అతిపెద్ద సవాళ్లు. 1866 ఆస్ట్రో-ప్రష్యన్ యుద్ధంలో విజయం పొందడంతో, జర్మనీలో ప్రష్యా ఆధిపత్యం సాధించింది. 1870–1871లో ఫ్రాంకో-ప్రష్యన్ యుద్ధంలో ఫ్రాన్స్‌పై విజయం తరువాత జర్మన్ రాష్ట్రాలన్నీ ప్రష్యా నాయకత్వంలో జర్మన్ రైఖ్ గా ఏకమయ్యాయి.

ఫ్రాన్స్‌ను ఏకాకిని చేసేందుకు, ఒకే సమయంలో రెండు రంగాల్లో యుద్ధాన్ని నివారించడానికీ బిస్మార్క్, ఆస్ట్రియా-హంగరీ, రష్యా, జర్మనీల మధ్య ముగ్గురు చక్రవర్తుల కూటమి (జర్మన్ భాషలో: డ్రేకైసర్‌బండ్) ఏర్పాటు గురించి చర్చలు జరిపాడు. 1877–1878 రస్సో-టర్కిష్ యుద్ధంలో రష్యా విజయం పట్ల, బాల్కన్లలో వారి ప్రభావం పట్లా ఆందోళన చెందిన జర్మనీ, ఆస్ట్రియా-హంగరీలు 1878 లో ఆ కూటమిని రద్దు చేసి, 1879 లో జమిలి కూటమిని ఏర్పాటు చేశాయి; 1882 లో ఇటలీ కూడా దీనిలో చేరడంతో ఇది ట్రిపుల్ అలయన్స్ (త్రిముఖ కూటమి) అయింది.[13] [14]

ఈ పొత్తుల్లోని అంశాలు పరిమితంగానే ఉన్నాయి. ఎందుకంటే వాటి ప్రాథమిక ఉద్దేశం మూడు రాచరిక శక్తుల మధ్య సహకారాన్ని పెంపొందించడం, ఫ్రాన్స్‌ను ఏకాకి చేయడం-అంతే. వలసరాజ్యాలకు సంబంధించిన ఉద్రిక్తతలను పరిష్కరించడానికి 1880 లో బ్రిటన్ రష్యాతో నేరుగా సంప్రదింపులు జరిపేందుకు చేసిన ప్రయత్నాలతో, బిస్మార్క్ 1881 లో కూటమిని తిరిగి ఏర్పాటు చేసాడు. దాన్ని 1883, 1885 ల్లో కొనసాగించాడు.[15] చివరికి 1887 లో ఈ కూటమి రద్దైనప్పుడు, దాని స్థానంలో రీఇన్స్యూరెన్స్ ఒప్పందం వచ్చింది. జర్మనీపై గాని, రష్యా పై గానీ ఫ్రాన్స్ లేదా ఆస్ట్రియా-హంగరీ దాడి చేస్తే రెండవ దేశం తటస్థంగా ఉండటానికి జర్మనీ, రష్యాల మధ్య కుదిరిన రహస్య ఒప్పందం ఇది.

1890 లో, కొత్త జర్మన్ చక్రవర్తి, కైజర్ విల్‌హెల్మ్ II, బిస్మార్క్‌ను బలవంతంగా పదవీ విరమణ చేయించాడు. కొత్త ఛాన్సలర్ లియో వాన్ కాప్రివి చేత రీఇన్స్యూరెన్స్ ఒప్పందాన్ని పునరుద్ధరించకూడదని ఒప్పించాడు.[16] దీంతో త్రిముఖ కూటమికి వ్యతిరేకంగా ఫ్రాన్స్ రష్యాతో 1894 లో ఫ్రాంకో రష్యను కూటమిని ఏర్పాటు చేసుకునేందుకు వీలు కలిగింది. 1904 లో ఫ్రాన్స్ బ్రిటన్‌లు 1904 ఎంటెంటే కార్డియేల్‌ అనే ఒప్పందాన్ని, 1907 లో బ్రిటన్ రష్యాలు ఆంగ్లో-రష్యన్ కన్వెన్షన్నూ కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందాలు అధికారిక పొత్తులను కలిగి ఉండవు. కానీ దీర్ఘకాలిక వలసరాజ్యాల వివాదాలను పరిష్కరించుకోవడం ద్వారా, భవిష్యత్తులో ఫ్రాన్స్ గానీ, రష్యా గానీ ఏదైనా ఘర్షణలో ఇరుక్కుంటే, అందులో బ్రిటన్ జోక్యం చేసుకునే వీలు ఈ ఒప్పందాలు కల్పించాయి. ఈ మూడు ఒప్పందాలను కలిపి ట్రిపుల్ ఎంటెంటే అని పిలిచారు.[17]

ఆయుధ పోటీ[మార్చు]

SMS రైన్‌ల్యాండ్[permanent dead link], నస్సావ్ క్లాస్ యుద్ధ నౌక, బ్రిటిషు డ్రెడ్‌నాట్‌కు జర్మనీ ప్రతిస్పందన

1871 ఫ్రాంకో-ప్రష్యన్ యుద్ధంలో విజయం తరువాత జర్మన్ రైఖ్ ను ఏర్పరచడంతో జర్మనీ ఆర్థికంగా, పారిశ్రామికంగా భారీగా బలోపేతమైంది. 1890 లో చక్రవర్తయిన విల్‌హెల్ం II, అడ్మిరల్ ఆల్ఫ్రెడ్ వాన్ టిర్పిట్జ్ లు, ప్రపంచ నావికాదళ ఆధిపత్యం కోసం బ్రిటన్ రాయల్ నేవీతో పోటీ పడగల కైసెర్లిచ్ మెరైన్ లేదా ఇంపీరియల్ జర్మన్ నావికాదళాన్ని రూపొందించడానికి సంకల్పించారు.[18] ఈ సంకల్పంలో వారు యుఎస్ నావికా వ్యూహకర్త అల్ఫ్రెడ్ మాహన్ చేత ప్రభావితమయ్యారు. ప్రపంచ స్థాయి బలం కలిగి ఉండాలంటే బ్లూవాటర్ నేవీ ఉండడం కీలకమని మాహన్ సిద్ధాంతం; టిర్పిట్జ్ తన పుస్తకాలను జర్మన్లోకి అనువదించగా, విల్హెల్ం, సీనియరు జర్మనీ మిలిటరీ అధికారులు వాటిని చదవడం తప్పనిసరి చేసాడు.[19] అయితే, విల్హెల్మ్‌కు రాయల్ నేవీ పట్ల ఉన్న ఆరాధనా భావం, దానిని అధిగమించాలనే కోరిక కూడా దీనికి కారణమయ్యాయి.[20]

దీని ఫలితంగా ఆంగ్లో-జర్మన్ నావికాదళాల మధ్య ఆయుధ పోటీ మొదలైంది. కాని 1906 లో బ్రిటిషు రాయల్ నౌకాదళంలో HMS డ్రెడ్‌నాట్ చేరడంతో బ్రిటన్‌కు జర్మనీపై సాంకేతిక ఆధిక్యత చేకూరింది. ఈ ఆధిక్యతను బ్రిటను ఎప్పటికీ కోల్పోలేదు.[18] అంతిమంగా, ఈ పోటీ కారణంగా జర్మనీ భారీ ఎత్తున ధనాన్ని మళ్లించి, పెద్ద నౌకాదళాన్ని నిర్మించింది. ఇది బ్రిటన్‌కు కోపం తెప్పించడం మాత్రమే చెయ్యగలిగింది. కాని దానిని అధిగమించలేకపోయింది. 1911 లో, ఛాన్సలర్ థియోబాల్డ్ వాన్ బెత్మాన్-హోల్వెగ్ ఓటమిని అంగీకరించాడు. దీంతో జర్మనీ మిలిటరీ వ్యయాన్ని నావికాదళం నుండి సైన్యానికి మళ్ళించారు.[21]

1905 విప్లవం నుండి రష్యా కోలుకోవడం, ప్రత్యేకించి 1908 తరువాత దేశ పశ్చిమ సరిహద్దు ప్రాంతాలలో రైలు మార్గాలకు, ఇతర మౌలిక సదుపాయాలకూ పెట్టుబడులు పెట్టడం కూడా పై నిర్ణయం తీసుకోడానికి కారణమైంది. జర్మనీ, ఆస్ట్రియా-హంగరీ తక్కువ సంఖ్యలో భర్తీ చేయడానికి వేగంగా సమీకరణపై ఆధారపడ్డాయి; ఈ అంతరాన్ని మూసివేయడం ఆందోళన కలిగి ఉంది, ఇది నావికాదళ రేసు ముగింపుకు దారితీసింది, ఇతర చోట్ల ఉద్రిక్తత తగ్గకుండా. 1913 లో జర్మనీ తన సైన్యాన్ని 1,70,000 మందితో విస్తరించినప్పుడు, ఫ్రాన్స్‌ తప్పనిసరి సైనిక సేవను రెండు నుండి మూడు సంవత్సరాలకు పెంచింది; బాల్కన్ దేశాలు, ఇటలీ కూడా ఇలాంటి చర్యలు తీసుకోవడంతో, ఓట్టోమన్లు, ఆస్ట్రియా-హంగరీలు కూడా ఖర్చులను పెంచాయి. వ్యయాన్ని వర్గీకరించడంలో ఉన్న తేడాల కారణంగా ఈ గణాంకాలను సంపూర్ణంగా లెక్కించడం చాలా కష్టం. అయితే, 1908 నుండి 1913 వరకు, ఆరు ప్రధాన ఐరోపా శక్తుల రక్షణ వ్యయం వాస్తవ లెక్కల్లో 50% పైగా పెరిగింది. [22]

బాల్కన్‌లో ఘర్షణలు[మార్చు]

Photo[permanent dead link] of large white building with one signs saying "Moritz Schiller" and another in Arabic; in front is a cluster of people looking at poster on the wall.
1908 లో ఆస్ట్రియన్ అనుసంధానం ప్రకటనతో పోస్టర్ చదివే సారాయెవో పౌరులు

1908 అక్టోబరులో, ఆస్ట్రియా-హంగరీ బోస్నియా హెర్జెగోవినాను అధికారికంగా స్వాధీనం చేసుకోవడం ద్వారా 1908-1909 బోస్నియన్ సంక్షోభానికి తెరలేపింది. ఈ మాజీ ఓట్టోమన్ భూభాగం 1878 నుండి ఆస్ట్రియా-హంగరీ అనధికారిక ఆక్రమణ లోనే ఉంది. ఇప్పుడు అది అధికారికమైంది. ఇది సెర్బియా సామ్రాజ్యానికీ, దాని పోషకులమని భావించే ఆర్థడాక్స్ రష్యన్ సామ్రాజ్యానికీ ఆగ్రహం తెప్పించింది. బాల్కన్లో అప్పటికే విచ్ఛిన్నమవుతున్న శాంతి ఒప్పందాలను, ఈ ప్రాంతంలో రష్యన్ల రాజకీయ జోక్యాలు చెడగొట్టాయి. బాల్కన్ ప్రాంతాన్ని "ఐరోపా పౌడర్ కెగ్" (మందు కూరిన బాంబు) అని పిలుస్తారు. [23]

1912, 1913 లో, బాల్కన్ లీగ్, విచ్ఛిన్నమౌతున్న ఓట్టోమన్ సామ్రాజ్యాల మధ్య మొదటి బాల్కన్ యుద్ధం జరిగింది. దాని పర్యవసానంగా జరిగిన లండన్ ఒప్పందంతో ఓట్టోమన్ సామ్రాజ్యం మరింతగా కుదించుకు పోయింది. ఈ ఒప్పందం ప్రకారం అల్బేనియన్ రాజ్యం ఏర్పడింది. బల్గేరియా, సెర్బియా, మాంటెనెగ్రో, గ్రీస్ లు విస్తరించాయి. 1913 జూన్ 16 న బల్గేరియా, సెర్బియా పైనా గ్రీస్‌పైనా చేసిన దాడి 33 రోజుల పాటు జరిగిన రెండవ బాల్కన్ యుద్ధానికి నాంది పలికింది. చివరికి అది మాసిడోనియాలో ఎక్కువ భాగాన్ని సెర్బియా, గ్రీస్ లకు, దక్షిణ డోబ్రూజా రొమేనియాకూ కోల్పోయింది. ఈ ప్రాంతం మరింత అస్థిరపడింది. [24] ఈ బాల్కన్ ఘర్షణలన్నిటినీ గ్రేట్ పవర్స్ అదుపులో ఉంచగలిగాయి. కాని తరువాతి ఘర్షణ మాత్రం ఐరోపా అంతటా, ఐరోపా వెలుపలా వ్యాపించింది.

నాంది[మార్చు]

సారాయెవో హత్య[మార్చు]

[permanent dead link] చిత్రం గావ్రిలో ప్రిన్సెప్ అరెస్టుతో ముడిపడి ఉంది, అయితే కొంతమంది[25] [26] దీనిలో ఉన్నది ఫెర్డినాండ్ బెహర్ అనే ప్రేక్షకుడని భావిస్తారు.

1914 జూన్ 28 న, ఆస్ట్రో-హంగేరియన్ సామ్రాజ్యానికి వారసుడైన ఆర్చ్‌డ్యూక్ ఫ్రాంజ్ ఫెర్డినాండ్ బోస్నియన్ రాజధాని సారాయెవోను సందర్శించాడు. ఓ యుగోస్లేవియా సమూహానికి చెందిన ఆరుగురు హంతకులు, సెర్బియన్ బ్లాక్‌హ్యాండ్ సరఫరా చేసిన ఆయుధాలతో అతణ్ణి హత్య చేసారు. ఈ హత్య యొక్క రాజకీయ లక్ష్యం, ఆస్ట్రియా-హంగరీ ఓట్టోమన్ సామ్రాజ్యం నుండి స్వాధీనం చేసుకుని కలిపేసుకున్న దక్షిణ ప్రావిన్సులను విడగొట్టడం, ఆ తరువాత వాటిని యుగోస్లేవియాలో కలపడం.

చక్రవర్తి ఫ్రాంజ్ జోసెఫ్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు. ఆస్ట్రియాలో ప్రజలు మాత్రం దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. చరిత్రకారుడు జిబినాక్ జెమాన్ తరువాత వ్రాసినట్లుగా, "ఈ సంఘటన ఎటువంటి అలజడీ కలిగించలేదు. ఆది, సోమవారాల్లో (జూన్ 28, 29), వియన్నాలోని జనం ఏమీ జరగనట్లుగా సంగీతం విని, వైన్ తాగారు."[10] [27] అయినప్పటికీ, సింహాసనానికి వారసుడిని హత్య చేస్తే, రాజకీయంగా దాని ప్రభావం తక్కువేమీ ఉండదు. చరిత్రకారుడు క్రిస్టోఫర్ క్లార్క్ BBC రేడియోలో దీన్ని "9/11 ఎఫెక్ట్, చారిత్రిక అర్థం ఉన్న ఉగ్రవాద సంఘటన. ఇది వియన్నాలోని రాజకీయ కెమిస్ట్రీని మారుస్తుంది" అని వర్ణించాడు.[28]

బోస్నియా హెర్జెగోవినాలో హింస వ్యాప్తి[మార్చు]

1914[permanent dead link] జూన్ 28 న సారాయెవోలో సెర్బ్ వ్యతిరేక అల్లర్ల తరువాత వీధుల్లో జనాలు

పర్యవసానంగా సారాయెవోలో జరిగిన సెర్బ్ వ్యతిరేక అల్లర్లను ఆస్ట్రో-హంగేరియన్ అధికారులు ప్రోత్సహించారు. ఇందులో బోస్నియన్ క్రొయేట్స్, బోస్నియాక్స్ ఇద్దరు బోస్నియన్ సెర్బ్‌లను చంపి సెర్బ్ యాజమాన్యంలోని అనేక భవనాలను నాశనం చేసారు.[29][30] సారాయెవో వెలుపల కూడా సెర్బులపై హింస జరిగింది. ఆస్ట్రో-హంగేరియన్-నియంత్రిత బోస్నియా హెర్జెగోవినా లో, క్రొయేషియా, స్లోవేనియాలోని ఇతర నగరాల్లోనూ ఈ హింస జరిగింది. బోస్నియా, హెర్జెగోవినాలోని ఆస్ట్రో-హంగేరియన్ అధికారులు సుమారు 5,500 మంది ప్రముఖ సెర్బులను జైలులో పెట్టారు. వీరిలో 700 నుండి 2,200 మంది జైలులో మరణించారు. మరో 460 మంది సెర్బులకు మరణశిక్ష విధించారు. ప్రధానంగా బోస్నియాక్‌లతో కూడిన షుట్జ్‌కార్ప్స్ అనే స్పెషల్ మిలీషియాను ఏర్పాటు చేసి, సెర్బ్‌లపై హింస జరిపారు.[31] [32][33] [34]

జూలై సంక్షోభం[మార్చు]

ఈ హత్య ఆస్ట్రియా-హంగరీ, జర్మనీ, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్ ల మధ్య ఒక నెల రోజుల పాటు దౌత్యచర్చలకు దారితీసింది. దీన్ని జూలై సంక్షోభం అని అంటారు. ఆర్చ్‌డ్యూక్‌ను హత్య చేసిన కుట్రలో సెర్బియా అధికారులు (ముఖ్యంగా బ్లాక్ హ్యాండ్ అధికారులు) పాల్గొన్నారని ఆస్ట్రియా-హంగరీ విశ్వసించింది. ఇది సరైన నమ్మకమే. బోస్నియాలో సెర్బియన్ జోక్యాన్ని శాశ్వతంగా అంతం చేయాలనుకుంది.[35] జూలై 23 న ఆస్ట్రియా-హంగరీ సెర్బియాకు జూలై అల్టిమేటం జారీ చేసింది. యుద్ధానికి దారితీసేలా రెచ్చగొట్టే ప్రయత్నంలో, కావాలనే, ఏ మాత్రం ఆమోదయోగ్యం కాని పది డిమాండ్లను ఈ అల్టిమేటంలో సెర్బియాకు పంపింది. [36]

సాధారణ సమీకరణ చెయ్యాలని జూలై 25 న సెర్బియా నిర్ణయించింది. ఆరవ నిబంధన మినహా అల్టిమేటం లోని అన్ని నిబంధనలను సెర్బియా అంగీకరించింది. హత్యపై దర్యాప్తులో పాల్గొనడానికి ఆస్ట్రియన్ ప్రతినిధులను సెర్బియా లోకి అనుమతించాలనే డిమాండు ఈ ఆరవ నిబంధన.[37] దీని తరువాత, ఆస్ట్రియా సెర్బియాతో దౌత్య సంబంధాలను తెంచుకుంది. మరుసటి రోజు పాక్షిక సమీకరణకు ఆదేశించింది. అంతిమంగా, 1914 జూలై 28 న, హత్య జరిగిన ఒక నెల తరువాత, ఆస్ట్రియా-హంగరీ సెర్బియాపై యుద్ధం ప్రకటించింది.

ఆస్ట్రియా-హంగరీ[permanent dead link] యొక్క ఎత్నో-భాషా పటం, 1910. బోస్నియా-హెర్జెగోవినా 1908 లో జతచేయబడింది .

జూలై 25 న, రష్యా, సెర్బియాకు మద్దతుగా, ఆస్ట్రియా-హంగరీకి వ్యతిరేకంగా పాక్షిక సైనిక సమీకరణను ప్రకటించింది.[38] జూలై 30 న రష్యా సాధారణ సైనిక సమీకరణకు ఆదేశించింది. జర్మనీ ఛాన్సలర్ బెత్మాన్-హోల్వెగ్ తగిన ప్రతిస్పందన కోసం 31 వ తేదీ వరకు వేచి ఉన్నాడు.[39][40] రష్యా చేస్తున్న సాధారణ సమీకరణను నిలిపివేయమని కైజర్ విల్హెల్మ్ II తన బంధువైన జార్ నికోలస్ II ను కోరాడు. జార్ దానికి నిరాకరించడంతో, రష్యా తన సమీకరణను నిలిపివేయాలని, సెర్బియాకు మద్దతు ఇవ్వనని వాగ్దానం చెయ్యాలనీ జర్మనీ ఒక అల్టిమేటం జారీ చేసింది. రష్యా సెర్బియా రక్షణకు వస్తే, రష్యాకు మద్దతు ఇవ్వవద్దని కోరుతూ ఫ్రాన్స్‌కు మరొక అల్టిమేటం పంపింది. ఆగస్టు 1 న రష్యా ప్రతిస్పందన చూసాక, జర్మనీ సమీకరణ జరిపి, రష్యాపై యుద్ధం ప్రకటించింది. ఇది ఆగస్టు 4 న ఆస్ట్రియా-హంగరీలో కూడా సాధారణ సమీకరణకు దారితీసింది.

యుద్ధ సమయంలో శత్రువుల కదలికలను బట్టి జర్మనీ దళాల మోహరింపుకు వివిధ పథకాలను రూపొందించుకుని పెట్టుకుంది. ఆఫ్‌మార్ష్ II వెస్ట్ ప్రకారమైతే, పశ్చిమాన 80% సైన్యాన్ని మోహరిస్తుంది, ఆఫ్‌మార్ష్ I ఓస్ట్, ఆఫ్‌మార్ష్ II ఓస్ట్ ప్రకారమైతే, పశ్చిమాన 60%, తూర్పున 40% మోహరిస్తుంది. ఓవైపు రష్యాతో యుద్ధానికి సిద్ధమౌతూండగా, మరోవైపు ఫ్రాన్సు కూడా జర్మనీపై యుద్ధానికి సిద్ధపడితే, మోహరింపును మార్చాల్సి ఉంటుంది. మోహరింపులో మార్పు చెయ్యడం చాలా కష్టం. అందుచేత జర్మనీ ఫ్రాన్సును తటస్థంగా ఉండమంటూ డిమాండు చేసింది. ఫ్రాన్సు దీనికి నేరుగా స్పందించలేదు. కానీ తన దళాలను సరిహద్దు నుండి 10 కి.మీ. వెనక్కి రప్పిస్తూ, అదే సమయంలో రిజర్వు దళాలను సమీకరిస్తూ మిశ్రమ ధోరణిలో స్పందించింది. దీనికి స్పందనగా జర్మనీ కూడా తన రిజర్వు సైన్యాన్ని సమీకరిస్తూ, ఆఫ్‌మార్ష్ II వెస్ట్ మోహరింపును అమల్లో పెట్టింది.

అయితే, పై ప్లానుకు విరుద్ధంగా "సైన్యం మొత్తాన్నీ తూర్పువైపుగా నడిపించమని" ఆగస్టు 1 న, విల్హెల్మ్ జనరల్ హెల్ముట్ వాన్ మోల్ట్కే ది యంగర్‌ను ఆదేశించాడు. ఫ్రాన్స్‌పై దాడి చేయని పక్షంలో బ్రిటన్ తటస్థంగా ఉంటుందనే సమాచారం అందిన తరువాత (ఐర్లాండ్‌లో సంక్షోభంలో కారణంగా అది బహుశా కదల్లేకపోవచ్చు కూడా) అతడు ఈ నిర్ణయం తీసుకున్నాడు.[41][42] పది లక్షల మంది సైనికుల మోహరింపును మార్చడం ఊహించలేని సంగతి. ఒక వేళ అలా చేస్తే ఫ్రెంచి వారు "వెనుక నుంచి" దాడిచెయ్యవచ్చు. అది జర్మనీకి వినాశకర మౌతుంది. అయినప్పటికీ విల్హెల్మ్, తన బంధువు జార్జ్ V తనకు పంపిన టెలిగ్రామ్ వచ్చేవరకు జర్మన్ సైన్యం లక్సెంబర్గ్‌లోకి వెళ్లరాదని పట్టుబట్టాడు. అతడేమో ఇందులో ఏదో అపార్థం జరిగిందని స్పష్టం చేశాడు. చివరికి కైజర్ మోల్ట్కేతో, "ఇక నువ్వు చెయ్యదలచుకున్నది చేసెయ్యవచ్చు." అని చెప్పాడు.[43][44]

ఆగస్టు 2 న జర్మనీ లక్సెంబర్గ్‌ను ఆక్రమించింది. ఆగస్టు 3 న ఫ్రాన్స్‌పై యుద్ధం ప్రకటించింది; అదే రోజున, బెల్జియంలోని ఏ ప్రాంతం నుండైనా తమ సైన్యాన్ని వెళ్ళనివ్వాలని దాన్ని అడ్డుకోరాదనీ డిమాండు చేస్తూ బెల్జియం ప్రభుత్వానికి అల్టిమేటం పంపింది. బెల్జియమ్ దాన్ని నిరాకరించింది. దీంతో ఆగస్టు 4 తెల్లవారుజామున జర్మనీ బెల్జియంపై దాడి చేసింది; దాడిని ప్రతిఘటించమని కింగ్ ఆల్బర్ట్ తన సైన్యాన్ని ఆదేశించాడు. 1839 నాటి లండన్ ఒప్పందం ప్రకారం బ్రిటన్ సహాయం కోరాడు. [5][6][10] ఒప్పందానికి జర్మనీ కట్టుబడి ఉండాలని, బెల్జియన్ తటస్థతను గౌరవించాలనీ బ్రిటన్ డిమాండ్ చేసింది; జర్మనీ సమాధానం "సంతృప్తికరంగా లేనందున" 1914 ఆగస్టు 4 న రాత్రి 7:00 గంటలకు (యుటిసి) బ్రిటన్, జర్మనీపై యుద్ధం ప్రకటించింది (రాత్రి 11:00 నుండి అమలులోకి వస్తుందని ప్రకటించింది).[45]

యుద్ధం పురోగతి[మార్చు]

తొలి పోరాటాలు[మార్చు]

సెంట్రల్ పవర్స్‌లో గందరగోళం[మార్చు]

సెంట్రల్ పవర్స్‌ వ్యూహం సమాచార లోపం కారణంగా దెబ్బతింది. సెర్బియాపై ఆస్ట్రియా-హంగరీ చేసిన ఆక్రమణకు మద్దతు ఇస్తామని జర్మనీ వాగ్దానం చేసింది, అయితే దీన్ని అర్థం చేసుకోవడాంలో తేడాలు జరిగాయి. గతంలో పరీక్షించి చూసిన మోహరింపు ప్రణాళికలను మార్చేసారు. కొత్త మోహరింపు ఎన్నడూ పరీక్షించి చూసినది కాదు. ఆస్ట్రో-హంగేరియన్ నాయకులు, తమ దేశపు ఉత్తర హద్దు వద్ద రష్యాకు వ్యతిరేకంగా జర్మనీ తన సైన్యాన్ని మోహరిస్తుందని భావించారు. [46] అయితే, ఆస్ట్రియా-హంగరీ దళాలు రష్యాకు వ్యతిరేకంగా మోహరిస్తే, తాము ఫ్రాన్స్‌ సంగతి చూడవచ్చని జర్మనీ భావించింది. ఈ గందరగోళం వలన ఆస్ట్రో-హంగేరియన్ సైన్యం తన బలగాలను విభజించి రష్యా సెర్బియా రెండింటి సరిహద్దుల వద్దా మోహరించవలసి వచ్చింది.

సెర్బియన్ దాడులు[మార్చు]

సెర్బియన్[permanent dead link] ఆర్మీ బ్లూరిట్ XI "ఓలుజ్", 1915

ఆగస్టు 12 న మొదలుపెట్టి, అస్ట్రియా సెర్బియా సైన్యంపై దాడి చేసి సెర్, కొలుబారా యుద్ధాల్లో పోరాడింది. తరువాతి రెండు వారాల్లో, సెర్బియన్లు ఆస్ట్రియన్ దళాలకు భారీ నష్టాలు కలిగించి, వెనక్కి పారదోలారు. ఈ యుద్ధంలో మిత్రరాజ్యాలకు ఇది తొలి విజయం. త్వరగా విజయం సాధించవచ్చనే ఆస్ట్రో-హంగేరియన్ కలలు కల్లలయ్యాయి. తత్ఫలితంగా, సెర్బియా యుద్ధంలో ఆస్ట్రియా మరింత సైన్యాన్ని మోహరించవలసి వచ్చింది. దీంతో రష్యాకు వ్యతిరేకంగా చేసిన మోహరింపు బలహీనపడింది. [47] 1914 లో ఆస్ట్రో-హంగేరియన్ దళాలను సెర్బియా ఓడించడం ఇరవయ్యవ శతాబ్దపు ప్రధాన సైనిక విజయాలలో ఒకటిగా భావిస్తారు.[48] చరిత్రలో మొట్టమొదటిసారిగా వైద్య తరలింపును 1915 శరదృతువులో సెర్బియా సైన్యం చేసింది. 1915 వసంత ఋతువులో ఆస్ట్రియన్ విమానాన్ని భూమి నుండి గాలికి కాల్పులు జరిపి కూల్చేయడంతో తొలి విమాన విధ్వంసక యుద్ధం కూడా జరిగింది.[49][50]

బెల్జియం, ఫ్రాన్స్ లలో జర్మన్ దాడులు[మార్చు]

1914[permanent dead link]లో రైల్వే గూడ్స్ బండిలో వెళ్తున్న జర్మన్ సైనికులు. యుద్ధం ప్రారంభంలో, ఈ సంఘర్షణ చిన్నదిగానే ఉంటుందని అందరూ భావించారు.
[permanent dead link]ఫ్రాంటియర్స్ యుద్ధంలో ఫ్రెంచి బయోనెట్ ఛార్జ్; ఆగస్టు చివరి నాటికి, ఫ్రెంచి మరణాలు 260,000 దాటింది, ఇందులో 75,000 మంది మరణించారు.

యుద్ధం మొదలైనప్పుడు, జర్మన్ ఆర్డర్ ఆఫ్ బాటిల్ ప్రకారం 80% సైన్యాన్ని పశ్చిమ హద్దులో మోహరించారు. మిగిలినవి తూర్పున స్క్రీనింగ్ శక్తిగా పనిచేస్తాయి. ఫ్రాన్స్‌ను త్వరగా యుద్ధం నుండి తరిమికొట్టి, తరువాత సైన్యాన్ని తూర్పున మోహరించి రష్యాను కూడా అలాగే తరిమికొట్టాలనేది ప్రణాళిక.

పశ్చిమంలో జర్మన్ దాడి అధికారికంగా ఆఫ్‌మార్ష్ II వెస్ట్ అని పేరు పెట్టారు. అయితే దీని అసలు పేరు ష్లీఫెన్ ప్లాన్. ష్లీఫెన్ జర్మనీ సరిహద్దుకు ఎడమ పార్శ్వాన (అంటే అల్సాస్-లోరైన్‌ ప్రాంతం) తక్కువ సైన్యాన్ని మోహరించి ఉద్దేశపూర్వకంగా బలహీనంగా ఉంచాడు. దాంతో ఫ్రెంచి వారు అక్కడ దాడి చేసేందుకు ఆకర్షితులౌతారని అతడి వ్యూహం. మెజారిటీ సైన్యాన్ని మాత్రం కుడి పార్శ్వాన మోహరించారు. ఈ రెండో విభాగం బెల్జియం దేశాన్నంతా చుట్టేసి, ఆ తరువాత పారిస్‌ను చుట్టుముట్టి, ఫ్రెంచి సైన్యాలను స్విస్ సరిహద్దు వద్ద ఇరికించాలనేది ఆ వ్యూహం లోని భాగం. (ఈ వ్యూహం ప్రకారమే ఫ్రెంచి వారు అల్సాస్-లోరైన్‌లోకి దాడి వెళ్ళారు).[51] అయితే, ఫ్రెంచి వారు తమ ఎడమ పార్శ్వంపై వత్తిడి పెట్టి దెబ్బ తీస్తారేమోనని ష్లీఫెన్ వారసుడు మోల్ట్కే ఆందోళన చెందాడు. అందుకని, అతను జర్మన్ కుడి, ఎడమ పార్శ్వాల మధ్య దళాల కేటాయింపును 85:15 నుండి 70:30 కి మార్చాడు. మోల్ట్కే చేసిన ఈ మార్పుల వలన నిర్ణయాత్మక విజయం సాధించడానికి అవసరమైన బలగాల్లో కొంత తరుగు పడింది. [52]  

పశ్చిమాన తొలుత జర్మనీ చాలా విజయవంతంగా పురోగమించింది: ఆగస్టు చివరి నాటికి బ్రిటిషు ఎక్స్‌పెడిషనరీ ఫోర్స్ (BEF) తో సహా, మిత్రరాజ్యాల సైన్యం వెనుకంజలో ఉంది. మొదటి నెలలో ఫ్రెంచి మరణాల సంఖ్య 2,60,000 దాటింది. ఒక్క ఆగస్టు 22 నాటి ఫ్రాంటియర్స్ యుద్ధంలోనే 27,000 మంది మరణించారు.[53] జర్మన్ వ్యూహకర్తలు స్థూలంగా వ్యూహాత్మక సూచనలను అందించేవారు. ఈ వ్యూహాలను ఆమలు జరపడంలో యుద్ధక్షేత్రంలో సైన్యాధికారులకు గణనీయమైన స్వేచ్ఛ ఉండేది. ఈ పద్ధతి 1866, 1870 లలో బాగా పనిచేసింది. కాని ఈ 1914 యుద్ధంలో, వాన్ క్లక్ ఈ స్వేచ్ఛను దుర్వినియోగం చేసి, ఆదేశాలను ధిక్కరించాడు. ఈ కారణంగా జర్మన్ సైన్యాలు పారిస్‌ను ముట్టడించేందుకు పురోగమించే క్రమంలో వివిధ జర్మన్ దళాల మధ్య ఎడం ఏర్పడింది.[54] జర్మనీ దళాల పురోగతిని అడ్డుకోడానికి ఫ్రెంచి బ్రిటిషు సైన్యాలు ఈ ఎడాన్ని ఉపయోగించుకున్నారు. సెప్టెంబరు 5 - 12 మధ్య జర్మన్ దళాలను 50 కి.మీ. వెనక్కి నెట్టేసాయి.

1911 లో, సమీకరణ చేసిన 15 రోజుల్లోగా జర్మనీపై దాడి చేయడానికి ఫ్రెంచితో రష్యన్ సైన్యం అంగీకరించింది; వాస్తవానికి ఇది సాధ్యమయ్యే పని కాదు. ఆగస్టు 17 న తూర్పు ప్రష్యాలోకి ప్రవేశించిన రెండు రష్యన్ దళాలు తమ సహాయక బృందాలేమీ లేకుండా చేరాయి.[55] ఆగస్టు 26-30 తేదీలలో టాన్నెన్‌బర్గ్ యుద్ధంలో రష్యన్ రెండవ సైన్యాన్ని జర్మనీ సమర్థవంతంగా నాశనం చేసింది. కాని రష్యన్ల పురోగతి కారణంగా జర్మన్లు తమ 8 వ ఫీల్డ్ ఆర్మీని ఫ్రాన్స్ నుండి తూర్పు ప్రష్యాకు మళ్ళించాల్సి వచ్చింది. మార్నేలో మిత్రరాజ్యాల విజయానికి ఇదీ ఒక కారణమే.

1914 చివరి నాటికి, జర్మన్ దళాలు ఫ్రాన్స్ లోపల బలంగా పాతుకుపోయాయి. ఫ్రాన్స్ బొగ్గు క్షేత్రాలలో ఎక్కువ భాగం జర్మనీ నియంత్రణలో ఉన్నాయి. తనకు కలిగిన ప్రాణనష్టం కంటే ఫ్రాన్సుకు 2,30,000 ఎక్కువ నష్టం కలిగించింది. అయితే, సమాచార సమస్యలు, ప్రశ్నార్థకమైన కమాండ్ నిర్ణయాల వలన జర్మనీకి నిర్ణయాత్మక ఫలితం రాలేదు. మరీ ముఖ్యంగా, సుదీర్ఘమైన రెండు-రంగాల యుద్ధాన్ని నివారించాలనే తన ప్రాథమిక లక్ష్యాన్ని సాధించడంలో జర్మనీ విఫలమైంది. [56] ఇది వ్యూహాత్మక ఓటమి; మార్నే జరిగాక, క్రౌన్ ప్రిన్స్ విల్హెల్మ్ ఒక అమెరికన్ విలేకరికి, "మేము ఓడిపోయాం. యుద్ధం చాలా కాలం పాటు కొనసాగుతుంది, కానీ ఇప్పటికే ఓడిపోయాం" అని చెప్పాడు.[57]

ఆసియా, పసిఫిక్[మార్చు]

1914 ఆగస్టు 30 న న్యూజిలాండ్ జర్మన్ సమోవా (తరువాత వెస్ట్రన్ సమోవా) ను ఆక్రమించింది. సెప్టెంబరు 11 న, ఆస్ట్రేలియన్ నావల్ అండ్ మిలిటరీ ఎక్స్‌పెడిషనరీ ఫోర్స్ జర్మన్ న్యూ గినియాలో భాగమైన న్యూ పోమ్మెర్న్ (తరువాత న్యూ బ్రిటన్) ద్వీపంలో అడుగుపెట్టింది. అక్టోబరు 28 న, జర్మన్ క్రూయిజర్ SMS ఎమ్‌డెన్, పెనాంగ్ యుద్ధంలో రష్యా క్రూయిజర్ SMS జెమ్‌చగ్‌ను ముంచివేసింది. జర్మనీ మైక్రోనేషియన్ కాలనీలను జపాన్ స్వాధీనం చేసుకుంది. సింగ్‌టావో ముట్టడి తరువాత, చైనీస్ షాన్డాంగ్ ద్వీపకల్పంలోని జర్మన్ల బొగ్గు సరఫరారేవు అయిన కింగ్డావోను కూడా జపాన్ ఆక్రమించింది. వియన్నా ఆస్ట్రో-హంగేరియన్ క్రూయిజర్ SMS కైసరిన్ ఎలిజబెత్‌ను సింగ్‌టావో నుండి ఉపసంహరించు కోవడానికి నిరాకరించింది. దాంతో జపాన్ జర్మనీతో పాటు, ఆస్ట్రియా-హంగరీపై కూడా యుద్ధం ప్రకటించింది. 1914 నవంబరులో జపాన్లో ఈ నౌకను ముంచేసింది.[58] కొన్ని నెలల్లో, మిత్రరాజ్యాల దళాలు పసిఫిక్ లోని అన్ని భూభాగాలన్నిటినీ స్వాధీనం చేసుకున్నాయి; అక్కడక్కడా కొన్ని వాణిజ్య కేంద్రాలు, న్యూ గినియాలో కొన్ని ప్రాంతాలూ మాత్రమే జర్మనీకి మిగిలాయి. [59] [60]

ప్రపంచ[permanent dead link] సామ్రాజ్యాలు, కాలనీలు - 1914 లో

ఆఫ్రికన్ యుద్ధాలు[మార్చు]

యుద్ధం మొదలైన తొలినాళ్ళ లోనే ఆఫ్రికాలో బ్రిటిషు, ఫ్రెంచి, జర్మన్ వలస దళాల మధ్య ఘర్షణలు జరిగాయి. ఆగస్టు 6-7 తేదీలలో, ఫ్రెంచి, బ్రిటిషు దళాలు టోగోలాండ్, కామెరూన్ ల లోని జర్మన్ రక్షణ ప్రాంతాలపై దాడి చేశాయి. ఆగస్టు 10 న, నైరుతి ఆఫ్రికాలో జర్మన్ దళాలు దక్షిణాఫ్రికాపై దాడి చేశాయి; మిగిలిన యుద్ధ కాలమంతా కూడా చెదురుమదురు, భీకర పోరాటాలు సాగుతూనే ఉన్నాయి. తూర్పు ఆఫ్రికాలోని జర్మన్ వలస దళాలు, కల్నల్ పాల్ వాన్ లెటో-వోర్బెక్ నేతృత్వంలో, ప్రపంచ యుద్ధ సమయంలో గెరిల్లా యుద్ధం చేస్తూ వచ్చాడు. ఐరోపాలో కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన రెండు వారాల తరువాతనే అతడు లొంగిపోయాడు. [61]

మిత్రరాజ్యాలకు భారత మద్దతు[మార్చు]

[permanent dead link]బ్రిటిషు భారతీయ పదాతిదళ విభాగాలు 1915 డిసెంబరులో ఫ్రాన్స్ నుండి ఉపసంహరించి, మెసొపొటేమియాకు పంపించారు

జర్మనీ భారతీయ జాతీయతా వాదాన్ని, ఇస్లామిజాన్నీ తన ప్రయోజనాలకు వాడుకునే ప్రయత్నం చేసింది. భారతదేశంలో తిరుగుబాట్లను ప్రేరేపించింది. సెంట్రల్ పవర్స్ తరపున యుద్ధంలో పాల్గొనమని ఆఫ్ఘనిస్తాన్‌ను కోరుతూ ఒక ప్రతినిధి బృందాన్ని పంపింది. అయితే, భారతదేశంలో తిరుగుబాటు జరుగుతుందనే బ్రిటిషు భయాలకు విరుద్ధంగా, యుద్ధం ప్రారంభమైనప్పుడు బ్రిటన్ పట్ల భారతదేశంలో అపూర్వమైన విధేయత, సద్భావన కనిపించింది. [62] [63] భారత జాతీయ కాంగ్రెసుకు, ఇతర సమూహాలకూ చెందిన భారత రాజకీయ నాయకులు బ్రిటిషు యుద్ధ ప్రయత్నాలకు మద్దతు ఇచ్చారు. ఎందుకంటే యుద్ధానికి బలమైన మద్దతు ఇస్తే భారత స్వీయ పరిపాలనకు దోహదపడుతుందని వారు విశ్వసించారు. వాస్తవానికి, యుద్ధం ప్రారంభంలో భారత సైన్యపు సంఖ్య బ్రిటిషు సైన్యాన్ని మించిపోయింది; సుమారు 13 లక్షల మంది భారత సైనికులు, కార్మికులూ ఐరోపా, ఆఫ్రికా, మధ్యప్రాచ్యాలలో పనిచేశారు, కేంద్ర ప్రభుత్వం, సంస్థానాలూ పెద్ద మొత్తంలో ఆహారం, డబ్బు, మందుగుండు సామగ్రిని పంపించాయి. మొత్తం మీద 1,40,000 మంది పశ్చిమ రంగం లోను, దాదాపు 7,00,000 మంది మధ్యప్రాచ్యంలోనూ పనిచేశారు. ప్రపంచ యుద్ధంలో మొత్తం 47,746 మంది భారతీయ సైనికులు మరణించారు. 65,126 మంది గాయపడ్డారు.[64] యుద్ధం తరువాత బ్రిటిషు ప్రభుత్వం భారతదేశానికి స్వాతంత్ర్యం ఇవ్వకపోవడంతో భారతీయుల్లో భ్రమలు తొలగి, మహాత్మా గాంధీ నేతృత్వంలో సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం ఉద్యమించారు.[65]

పశ్చిమ రంగం[మార్చు]

కందక యుద్ధం మొదలు[మార్చు]

11[permanent dead link] వ కందకాలు చెషైర్ రెజిమెంట్లో Ovillers లా Boisselle వద్ద, సోమీ, 1916 జూలై

మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు ఉన్న సైనిక వ్యూహాలు, సాంకేతిక పరిజ్ఞానపు పురోగతికి అనుగుణంగా పురోగమించలేదు. వాటికి కాలదోషం పట్టింది. ఈ పురోగతుల వలన బలమైన రక్షణ వ్యవస్థలను రూపొందించ గలిగారు. కాలదోషం పట్టిన ఎత్తుగడలు ఈ కొత్త రక్షణ వ్యవస్థలనుఛేదించలేక పోయాయి. ముళ్ల తీగతో సామూహిక పదాతిదళ పురోగతిని గణనీయమైన అడ్డుకున్నారు. ఫిరంగిదళాలు, మెషిన్ గన్లూ వీటిని దాటుకుని వెళ్ళడం చాలా కష్టమైంది. [66] రెండు వైపులా ఉన్న కమాండర్లు భారీ ప్రాణనష్టం లేకుండా రక్షణ స్థావరాలను ఛేదించలేక పోయేవారు. అయితే, కాలక్రమేణా, సాంకేతిక పరిజ్ఞానం గ్యాస్ వార్‌ఫేర్, ట్యాంకు వంటి కొత్త ప్రమాదకర ఆయుధాలను ఉత్పత్తి చేయడం ప్రారంభించింది. [67]

మొదటి మార్నే యుద్ధం తరువాత (1914 సెప్టెంబరు 5-12 ), మిత్రరాజ్యాల దళాలు, జర్మన్ దళాలు ఒకదానిపై ఒకటి పైచేయి సాధించడానికి ప్రయత్నించి విఫలమయ్యాయి. ఈ విన్యాసాలనే " రేస్ టు ది సీ " అని పిలిచారు. 1914 చివరి నాటికి, అల్సేస్ నుండి బెల్జియం ఉత్తర సముద్ర తీరం వరకు నిరంతరాయంగా బలగాలు ఒకదానికొకటి ఎదుర్కోవలసి వచ్చింది.[68] జర్మన్లు ఎక్కడ నిలబడాలో ఎచుకున్నారు కాబట్టి, వారు సాధారణంగా ఎత్తైన ప్రదేశంలో ఉండి సదరు ప్రయోజనాన్ని సాధించారు. పైగా, వారి కందకాలు మెరుగ్గా నిర్మించుకున్నారు. ఆంగ్లో-ఫ్రెంచి కందకాలు మొదట్లో జర్మన్ రక్షణను విచ్ఛిన్నం చేయడానికి "తాత్కాలికమైనవి" అనే భావనతో నిర్మించుకున్నారు. [69]

శాస్త్ర సాంకేతిక పురోగతిని ఉపయోగించి ఇరువర్గాలు ప్రతిష్టంభనను తొలగించడానికి ప్రయత్నించాయి. 1915 ఏప్రిల్ 22 న, రెండవ వైప్రెస్ యుద్ధంలో, జర్మన్లు ( హేగ్ ఒడంబడికను ఉల్లంఘించి) పశ్చిమ రంగంలో మొదటిసారి క్లోరిన్ వాయువును ఉపయోగించారు. త్వరలోనే ఇరుపక్షాలూ అనేక రకాలైన వాయువులను విస్తృతంగా ఉపయోగించడం మొదలుపెట్టారు. విషవాయువు నిర్ణయాత్మక, యుద్ధ-విజేతగా నిరూపించబడనప్పటికీ, అది యుద్ధంలో అత్యంత భయపడే, గుర్తుండిపోయే భయానక స్థితుల్లో ఒకటి.[10] [70] బ్రిటన్, ఫ్రాన్స్‌లు ట్యాంకులను అభివృద్ధి చేశాయి. 1916 సెప్టెంబరు15 న ఫ్లెర్స్-కోర్స్లెట్ (సోమ్ యుద్ధంలో భాగం) యుద్ధంలో బ్రిటిషు వారు మొదటగా వాటిని ఉపయోగించారు. అవి పాక్షికం గానే విజయవంతమయ్యాయి. అయితే, యుద్ధం జరిగే కొద్దీ, వాటి ప్రభావం పెరుగుతూ పోయింది. మిత్రరాజ్యాలు పెద్ద సంఖ్యలో ట్యాంకులను నిర్మించాయి. జర్మన్లు సొంతంగా కొన్నిటినే తయారు చేసారు. వీటికి తోడు, పట్టుకున్న మిత్రరాజ్యాల ట్యాంకులను కూడా వాడారు.

కందక యుద్ధం కొనసాగింది[మార్చు]

ఫ్రెంచి 87 వ రెజిమెంట్ వెర్డున్ సమీపంలో, 1916

తరువాతి రెండేళ్ళపాటు ఇరు పక్షాలూ నిర్ణయాత్మకంగా దెబ్బ కొట్టలేకపోయాయి. 1915–17 అంతటా, బ్రిటిషు సామ్రాజ్యం, ఫ్రాన్స్ లకు జర్మనీ కంటే ఎక్కువ ప్రాణనష్టం కలిగింది. రెండు పక్షాలూ ఎంచుకున్న వ్యూహాలూ, ఎత్తుగడలే దీనికి కారణం. వ్యూహాత్మకంగా, జర్మన్లు ఒక పెద్ద దాడిని మాత్రమే చేయగా, మిత్రరాజ్యాలు జర్మన్ శ్రేణులను ఛేదిండానికి అనేక ప్రయత్నాలు చేశాయి.

1916 ఫిబ్రవరిలో, జర్మన్లు వెర్డున్ యుద్ధంలో ఫ్రెంచి రక్షణాత్మక స్థానాలపై దాడి చేశారు, ఇది 1916 డిసెంబరు వరకు కొనసాగింది. ప్రాణనష్టం ఫ్రెంచి‌కే ఎక్కువ జరిగింది. కానీ, జర్మన్లకు జరిగిన నష్టం కూడా తక్కువేమీ కాదు. ఇరువైపులా కలిపి 700,000 [71] నుండి 975,000 [72] వరకు సైనికులను నష్టపోయారు. వెర్డున్, ఫ్రెంచి సంకల్పానికి, ఆత్మబలిదానానికీ చిహ్నంగా మారింది.[73]

Mud stained British soldiers at rest
కమ్యూనికేషన్ కందకంలో రాయల్ ఐరిష్ రైఫిల్స్, సోమ్, 1916 లో మొదటి రోజు

సోమ్ యుద్ధం 1916 జూలై నుండి నవంబరు వరకు జరిగిన ఆంగ్లో-ఫ్రెంచి దాడి. దాడి ప్రారంభ రోజు (1916 జూలై 1) బ్రిటిషు సైన్యం చరిత్రలో అత్యంత రక్తపాత దినం, 57,470 మంది బ్రిటిషు సైనికులు గాయపడ్డారు. ఇందులో 19,240 మంది మరణించారు. మొత్తం సోమ్ దాడిలో 420,000 మంది బ్రిటిషు సైనికులు, ఫ్రెంచి వారు మరో 200,000 మంది, జర్మన్లు 500,000 మందీ ఘ మరణించారు/గాయాలపాలయ్యారు. [74] మరణాలకు తుపాకీ కాల్పులు మాత్రమే కారణం కాదు; కందకాలలో ఉద్భవించిన వ్యాధులు రెండు వైపులా మరణాలకు ఒక ప్రధాన కారణం. కందకపు అడుగు, షెల్ షాక్, అంధత్వం / కాలిన గాయాలు, పేను, కందక జ్వరం, కూటీలు (శరీర పేను), 'స్పానిష్ ఫ్లూ' వంటి లెక్కలేనన్ని వ్యాధులు, అంటువ్యాధులూ సంభవించాయి.[10] ప్రజలు ధైర్యం కోల్పోకుండా ఉండేందుకు, యుద్ధకాలపు వార్తలను సెన్సారు చేసేవారు. జర్మనీ, యునైటెడ్ కింగ్‌డమ్, ఫ్రాన్స్, యునైటెడ్ స్టేట్స్‌లో ఫ్లూ అనారోగ్యం, మరణాలను తగ్గించి చూపారు. [75][10] తటస్థంగా ఉన్న స్పెయిన్‌లో వార్తాపత్రికలు అంటువ్యాధి ప్రభావాలను స్వేచ్ఛగా ప్రచురించేవి ( కింగ్ అల్ఫోన్సో XIII లోనైన తీవ్రమైన అనారోగ్యం వంటివి). [76] దీంతో ఈ అనారోగ్యం స్పెయిన్‌లోనే బాగా ఎక్కువగా ఉందనే తప్పుడు అభిప్రాయం కలిగించింది. [77] ఈ కారణాన్నే ఆ మహమ్మారికి "స్పానిష్ ఫ్లూ" అని పేరుబడింది. [78]

Files of soldiers with rifles slung follow close behind a tank, there is a dead body in the foreground
కెనడియన్ దళాలు 1917 విమి రిడ్జ్ యుద్ధంలో బ్రిటిషు మార్క్ II ట్యాంక్‌తో ముందుకు సాగుతున్నాయి

1916 అంతటా వర్డున్ వద్ద జరిగిన సుదీర్ఘమైన యుద్ధం, [79] సోమ్ వద్ద రక్తపాతంతో కలిపి, అలిసిపోయిన ఫ్రెంచి సైన్యాన్ని పతనం అంచుకు తీసుకువచ్చింది. ఫ్రంటల్ అటాక్ పద్ధతిలో చేసిన నిరర్థకమైన ప్రయత్నాలు బ్రిటిషు, ఫ్రెంచి రెండింటికీ చాలా నష్టం కలిగించాయి. 1917 ఏప్రిల్-మే నాటి నివెల్లే దాడి విఫలమైన తరువాత, ఫ్రెంచి సైన్యంలో విస్తృతంగా తిరుగుబాట్లు తలెత్తాయి. [80] అదేసమయంలో బ్రిటిషు వారు చేసిన అరాస్ యుద్ధం పెద్దగా వ్యూహాత్మక విలువ లేనప్పటికీ, పరిధిలో చిన్నదైనప్పటికీ, అది మరింత విజయవంతమైంది. [81] [82] అరాస్ దాడిలో ఒక చిన్న భాగం - కెనడియన్ కార్ప్స్ చేత వైమీ రిడ్జిని స్వాధీనం చేసుకోవడం. ఇది ఆ దేశానికి ఎంతో ప్రాముఖ్యతనిచ్చింది: కెనడా జాతీయ గుర్తింపు ఈ యుద్ధం నుండి పుట్టిందనేది మిలటరీలో విస్తృతంగా ఉన్న అభిప్రాయం. కెనడా సాధారణ చరిత్రల్లోనూ ఈ అభిప్రాయం కనిపిస్తుంది. [83] [84]

ఈ కాలంలో జరిగిన చివరి పెద్ద దాడి పాస్చెండలేల్ (1917 జూలై-నవంబరు) వద్ద బ్రిటన్ చేసినది (ఫ్రెంచి మద్దతుతో). ఈ దాడి ఆశావహంగానే మొదలైనప్పటికీ, అక్టోబరు బురదలో కూరుకుపోయింది. జననష్టం, వివాదాస్పదమైనప్పటికీ, దాదాపు సమానంగా ఉంటుంది, ఒక్కో వైపు 200,000–400,000.

పశ్చిమ రంగంలో కందకాల యుద్ధం వలన భూభాగాలు కోల్పోవడం సాధించడం లాంటివేమీ పెద్దగా జరగలేదు. అయితే, ఈ కాలంలో, కొత్త యుద్ధభూమి సవాళ్లను ఎదుర్కోవటానికి బ్రిటిషు, ఫ్రెంచి, జర్మన్ వ్యూహాలు నిరంతరం అభివృద్ధి చెందుతూ వచ్చాయి .

నావికా యుద్ధం[మార్చు]

కింగ్ జార్జ్ V ( ముందు ఎడమ ), అధికారుల బృందం 1917 లో బ్రిటిషు ఆయుధాల కర్మాగారాన్ని తనిఖీ చేస్తుంన్న దృశ్యం.

యుద్ధం ప్రారంభంలో, జర్మన్ సామ్రాజ్యపు క్రూయిజర్‌లు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉండేవి. వాటిలో కొన్నిటిని మిత్రరాజ్యాల వాణిజ్య నౌకలపై దాడి చేయడానికి ఉపయోగించారు. బ్రిటిషు రాయల్ నేవీ వాటిని క్రమపద్ధతిలో వేటాడి ముంచేసింది. అయితే ఈలోగా మిత్రరాజ్యాల నౌకలకు జరిగిన నష్టాన్ని అడ్డుకోలేకపోయింది. యుద్ధ ప్రారంభానికి ముందు, బ్రిటన్ ప్రపంచంలోనే బలమైన, అత్యంత ప్రభావవంతమైన నావికాదళాన్ని కలిగి ఉందని విదితమైన సంగతే.[10] 1890 లో ఆల్ఫ్రెడ్ థాయర్ మహాన్ రాసిన ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సీ పవర్ అపాన్ హిస్టరీ అనే పుస్తకాన్ని యునైటెడ్ స్టేట్స్ వారి నావికా శక్తిని పెంచడానికి ప్రోత్సహించడానికి ఉద్దేశించి ప్రచురించారు. దాని బదులు, ఈ పుస్తకం జర్మనీ చేరుకుంది. బ్రిటిషు రాయల్ నేవీపై పైచేయి సాధించటానికి దాని జర్మను పాఠకులను ప్రేరేపించింది.[10] ఉదాహరణకు, లైట్ క్రూయిజర్ SMS ఎమ్‌డెన్‌ను మిగతా దళం నుండి విడదీసి దానితో దాడి చేసి,15 నౌకలను స్వాధీనం చేసుకున్నారు లేదా నాశనం చేశారు. ఒక రష్యన్ క్రూయిజరును, ఒక ఫ్రెంచి డిస్ట్రాయర్‌ను ముంచేసారు. అయితే, జర్మన్ తూర్పు-ఆసియా స్క్వాడ్రన్‌లో చాలావాటికి వాణిజ్య నౌకలపై దాడి చెయ్యమనే ఆదేశాలు లేవు. బ్రిటిషు యుద్ధ నౌకలకు ఎదురైనపుడు అవి జర్మనీకి వెళ్ళే దారిలో ఉన్నాయి. కరోనెల్ యుద్ధంలో జర్మన్ నౌకలు రెండు సాయుధ క్రూయిజర్‌లను ముంచేసాయి., కాని 1914 డిసెంబరులో ఫాక్లాండ్ దీవుల యుద్ధంలో బ్రిటిషు నౌకాదళం చేతిలో దాదాపుగా ధ్వంసమైంది. డ్రెస్డెన్, మరికొన్ని నౌకలు మాత్రమే తప్పించుకున్నాయి. కాని మాస్ ఎ టియెర్రా యుద్ధంలో వీటిని కూడా నాశనం చేసారు లేదా బందీగా పట్టుకున్నారు. [85]

హోచ్సీఫ్లోట్ యొక్క యుద్ధనౌకలు, 1917
1918 కాల్పుల విరమణ తరువాత లండన్లోని టవర్ బ్రిడ్జ్ సమీపంలో ప్రదర్శించిన U-155ను ప్రదర్శించారు

యుద్ధం మొదలైన వెంటనే, బ్రిటన్ జర్మనీపై నావికా దిగ్బంధనాన్ని ప్రారంభించింది. గత రెండు శతాబ్దాలుగా ఉన్న అనేక అంతర్జాతీయ ఒప్పందాల ద్వారా ఏర్పడిన అంతర్జాతీయ చట్టాన్ని ఈ దిగ్బంధం ఉల్లంఘించినప్పటికీ, ఈ వ్యూహం కీలకమైన సైనిక, పౌర సరఫరాలను అడ్డుకుంది. [86] సముద్రం లోని ఏ ప్రాంతం లోకీ ఏ నౌకలు ప్రవేశించకుండా నిరోధించడానికి బ్రిటన్ అంతర్జాతీయ జలాల్లో మందుపాతరలను అమర్చి, తటస్థ నౌకలకు కూడా ప్రమాదం కలిగించింది. [87] బ్రిటిషు వారి ఈ వ్యూహానికి తటస్థ దేశాల ప్రతిస్పందన పెద్దగా లేనందున, జర్మనీ తన అదుపు లేని జలాంతర్గామి యుద్ధానికి కూడా ఇదే విధమైన ప్రతిస్పందన ఉంటుందని ఆశించింది. [88]

1916 మే/జూన్ లో జరిగిన జూట్లాండ్ యుద్ధం (జర్మన్: స్కాగెర్రాక్‌ష్లాట్, లేదా "బ్యాటిల్ ఆఫ్ స్కాగెరాక్ ") అతిపెద్ద నావికాదళ యుద్ధంగా పరిణమించింది మొదటి ప్రపంచ యుద్ధంలో యుద్ధనౌకలు పూర్తిస్థాయిలో ఘర్షణ పడిన సందర్భం ఇదొక్కటే. మొత్తం మానవ చరిత్రలోనే జరిగిన అతి పెద్ద నౌకా యుద్ధాల్లో ఒకటి వైస్ అడ్మిరల్ రీన్హార్డ్ స్కీర్ నేతృత్వంలోని కైసెర్లిచ్ మెరైన్స్ హై సీస్ ఫ్లీట్, అడ్మిరల్ సర్ జాన్ జెల్లికో నేతృత్వంలోని రాయల్ నేవీ యొక్క గ్రాండ్ ఫ్లీట్‌తో పోరాడింది ఈ యుద్ధం అధిక సంఖ్యలో ఉన్న బ్రిటిషు నౌకాదళం జర్మను దళాన్ని చుట్టుముట్టింది. కాని జర్మను దళం తప్పించుకుని, తమకు జరిగిన నష్టం కంటే ఎక్కువ నష్టం బ్రిటిషు దళానికి కలిగించగలిగారుఅయితే, వ్యూహాత్మకంగా, బ్రిటిషు వారు సముద్రంపై తమ ఆధిపత్యాన్ని నొక్కిచెప్పారు జర్మన్ ఉపరితల నౌకాదళంలో ఎక్కువ భాగం యుద్ధ కాలం మొత్తమంతా ఓడరేవుకే పరిమితమై పోయింది.[89]

జర్మన్ యు-బోట్లు ఉత్తర అమెరికా బ్రిటన్‌ల మధ్య సరఫరా మార్గాలను అడ్డుకోవడానికి ప్రయత్నించాయి.[90] జలాంతర్గామి యుద్ధపు ముఖ్య స్వభావం ఏమిటంటే, దాడులు ఏ హెచ్చరికా లేకుండా అకస్మాత్తుగా వస్తాయి. వాణిజ్య నౌకలకు మనుగడపై పెద్దగా ఆశ ఉండదు.[90] [91] యునైటెడ్ స్టేట్స్ తన నిరసన చెయ్యడం మొదలుపెట్టింది. దాంతో జర్మనీ, యుద్ధ నియమాలను మార్చింది 1915 లో ప్రయాణీకుల నౌక RMS లూసిటానియా మునిగిపోయిన తరువాత జర్మనీ, ప్రయాణీకుల లైనర్‌లను లక్ష్యంగా చేసుకోబోమని వాగ్దానం చేసింది, బ్రిటన్ తన వాణిజ్య నౌకల్లో ఆయుధాలను అమర్చింది. [92] చివరగా, 1917 ప్రారంభంలో అమెరికన్లు చివరికి యుద్ధంలోకి ప్రవేశిస్తారని గ్రహించిన జర్మనీ, అదుపులేని జలాంతర్గామి యుద్ధ విధానాన్ని అమల్లో పెట్టింది.[90] [93] యునైటెడ్ స్టేట్స్ పెద్దయెత్తున సైన్యాన్ని విదేశాలకు రవాణా చేసేలోపే జర్మనీ, మిత్రరాజ్యాల సముద్రపు దారులను మూసేయడానికి ప్రయత్నించింది. మొదట్లో విజయం సాధించినా, తరువాత విఫలమైంది.[90]

1917 లో U- బోట్ ముప్పు తగ్గింది. వాణిజ్య నౌకలు కాన్వాయిల్లో ప్రయాణించడం ప్రారంభించాయి, డిస్ట్రాయర్లు వాటికి ఎస్కార్టుగా ఉండేవి. ఈ వ్యూహంతో U- బోట్లకు ఈ లక్ష్యాలను కనుగొనడం కష్టతర మైంది. మిత్ర రాజ్యాల నష్టాలు గణనీయంగా తగ్గాయి. హైడ్రోఫోన్లను, డెప్త్ ఛార్జీలనూ ప్రవేశపెట్టిన తరువాత, డిస్ట్రాయర్లు జలాంతర్గామిలపై దాడి చేయగలిగాయి. కాన్వాయిల్లో ప్రయాణం చెయ్యడం వలన కాన్వాయి ఒకచోట చేరడానికి ఓడలు వేచి ఉండాల్సి వచ్చేది. దాంతో, సరఫరాలు ఆలస్యమయ్యేవి. జాప్యాలకు పరిష్కారం కొత్త రవాణా ఓడలను నిర్మించడమే. సైనికులను రవాణా చేసే నౌకలు చాలా వేగంగా, జలాంతర్గాములకు అందనంత వేగంగా పోయేవి. అంచేత, అవి ఉత్తర అట్లాంటిక్‌లో కాన్వాయిల్లో ప్రయాణించేవి కావు.[94] 199 జలాంతర్గాముల వ్యయంతో జర్మనీ జలాంతర్గాములు (యు-బోట్లు) 5,000 కి పైగా మిత్రరాజ్యాల నౌకలను ముంచివేసాయి. అదే సమయంలో జర్మనీ కేవలం 99 యు-బోట్లను కోల్పోయింది.[95]

విమాన వాహక యుద్ధనౌకలను మొదటి ప్రపంచ యుద్ధం లోనే మొదటిసారిగా నియోగించారు. HMS ఫ్యూరియస్ మొదటి విమాన వాహక నౌక.[96]

దక్షిణ రంగాలు[మార్చు]

బాల్కన్లలో యుద్ధం[మార్చు]

స్టైరియాలోని లీబ్నిట్జ్‌లోని సెర్బియా నుండి శరణార్థుల రవాణా, 1914
ఒక కందకంలో బల్గేరియన్ సైనికులు, ఇన్కమింగ్ విమానానికి వ్యతిరేకంగా కాల్పులు జరపడానికి సిద్ధమవుతున్నారు
ఆస్ట్రో-హంగేరియన్ దళాలు 1917 లో సెర్బియన్లను స్వాధీనం చేసుకున్నాయి. యుద్ధ సమయంలో సెర్బియా సుమారు 850,000 మందిని కోల్పోయింది, ఇది యుద్ధానికి పూర్వ జనాభాలో నాలుగింట ఒక వంతు.[97]

తూర్పున రష్యాను ఎదుర్కోవాల్సి రావడంతో ఆస్ట్రియా-హంగరీ, సెర్బియాపై దాడి చేయడానికి తన సైన్యంలో మూడింట ఒక వంతును మాత్రమే మోహరించగలిగింది. భారీ నష్టాలను చవిచూసిన తరువాత, ఆస్ట్రియన్లు కొంతకాలం పాటు సెర్బియా రాజధాని బెల్గ్రేడ్‌ను ఆక్రమించగలిగారు. కొలుబారా యుద్ధంలో సెర్బియా ఎదురుదాడి చేసి, 1914 చివరి నాటికి వారిని దేశం నుండి తరిమికొట్టడంలో విజయవంతమైంది. 1915 మొదటి పది నెలలు, ఆస్ట్రియా-హంగరీ ఇటలీతో పోరాడటానికే తన సైనిక నిల్వలను ఉపయోగించింది. సెర్బియాపై దాడిలో పాల్గొనడానికి బల్గేరియాను ఒప్పించడం ద్వారా జర్మనీ, ఆస్ట్రో-హంగేరియన్ దౌత్యవేత్తలు విజయం సాధించారు.[98] ఆస్ట్రో-హంగేరియన్ ప్రావిన్సులైన స్లోవేనియా, క్రొయేషియా, బోస్నియాలు సెర్బియా, రష్యా, ఇటలీలతో జరిగిన పోరాటంలో ఆస్ట్రియా-హంగరీ కోసం దళాలను అందించాయి. మోంటెనెగ్రో మాత్రం సెర్బియాతో పొత్తు పెట్టుకుంది. [99]

బల్గేరియా 1915 అక్టోబరు 12 న సెర్బియాపై యుద్ధం ప్రకటించింది. అప్పటికే మాకెన్‌సెన్ నేతృత్వంలో సెర్బియాతో యుద్ధం చేస్తున 250,000 మంది ఆస్ట్రో-హంగేరియన్ సైన్యంతో కలిసింది. ఇప్పుడు బల్గేరియాతో కలిపి సెంట్రల్ పవర్స్ మొత్తం 600,000 మంది సైనికులను యుద్ద్ధంలోకి దింపడంతో సెర్బియాను ఒక నెలలోనే స్వాధీనం చేసుకున్నారు. సెర్బియా సైన్యం, రెండు రంగాల్లో పోరాడిన సెర్బియా, ఓటమి తప్పని పరిస్థితిలో ఉత్తర అల్బేనియాలోకి వెనక్కి తగ్గింది. కొసావో యుద్ధంలో సెర్బ్‌లు ఓటమిని చవిచూశారు . 1916 జనవరి 6 న మోజ్కోవాక్ యుద్ధంలో అడ్రియాటిక్ తీరం వైపు వెనుదిరిగిన సెర్బియా సైన్యానికి మాంటెనెగ్రో రక్షణ నిచ్చింది, కాని చివరికి ఆస్ట్రియన్లు మోంటెనెగ్రోను కూడా జయించారు. ప్రాణాలతో మిగిలిన సెర్బియా సైనికులను ఓడ ద్వారా గ్రీస్‌కు తరలించారు. [100] ఆక్రమణ తరువాత, సెర్బియాను ఆస్ట్రో-హంగరీ, బల్గేరియాలు పంచుకున్నాయి. [101]

1915 చివరలో, గ్రీసుకు సహాయం అందించడానికి, సెంట్రల్ పవర్స్‌కు వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించమని గ్రీసు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకూ ఫ్రాంకో-బ్రిటిషు దళం గ్రీస్‌లోని సలోనికా వద్ద దిగింది. అయితే, జర్మనీకి అనుకూల ఉండే గ్రీసు రాజు కాన్స్టాంటైన్ I, మిత్రరాజ్యాల దళాలు చేరుకోకముందే, మిత్రరాజ్యాలకు అనుకుళంగా ఉండే ఎలిఫ్తేరియోస్ వెనిజెలోస్ ప్రభుత్వాన్ని తొలగించాడు. [102] గ్రీస్ రాజు, మిత్రరాజ్యాల మధ్య ఘర్షణ అప్పటికే దేశంలో రాజుకు, ప్రభుత్వానికీ మధ్య ఉన్న విభేదాలకు తోడైంది. దీంతీ గ్రీసు, రాజుకు అనుఖులంగా ఉండే ప్రాంతాలుగాను, ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే ప్రాంతాలు గానూ విడిపోయింది. మిత్రరాజ్యాలకు, రాచరిక శక్తులకూ మధ్య ఏథెన్స్‌లో తీవ్రమైన చర్చలు, సాయుధ పోరాటాలూ జరిగిన తరువాత ( నోయమ్వ్రియానా అనే సంఘటన), గ్రీస్ రాజు రాజీనామా చేశాడు. అతని రెండవ కుమారుడు అలెగ్జాండర్ అతని స్థానంలో రాజయ్యాడు; 1917 జూన్‌లో గ్రీస్ అధికారికంగా మిత్రరాజ్యాల పక్షాన చేరింది.

మాసిడోనియా యుద్ధరంగంలో మొదట్లో పెద్దగా కదలికలేమీ ఉండేవి కావు. 1916 నవంబరు 19 న ఫ్రెంచి సెర్బియా దళాలు బిటోలాను తిరిగి స్వాధీనం చేసుకోవడంతో కొన్ని పరిమితమైన ప్రాంతాలు వారి అధీనం లోకి వచ్చాయి. దాంతో అక్కడ స్థిరత్వం ఏర్పడింది.[103]

జర్మన్, ఆస్ట్రో-హంగేరియన్ దళాలను చాలావరకు ఉపసంహరించుకున్న తరువాత, సెర్బియా, ఫ్రెంచి దళాలు చివరికి, 1918 సెప్టెంబరులో వర్దార్ దాడిలో పురోగతి సాధించాయి . డోబ్రో పోల్ యుద్ధంలో బల్గేరియన్లు ఓడిపోయారు. సెప్టెంబరు 25 నాటికి బల్గేరియన్ సైన్యం కూలిపోవడంతో బ్రిటిషు, ఫ్రెంచి దళాలు సరిహద్దును దాటి బల్గేరియాలోకి చొచ్చుకెళ్ళాయి. నాలుగు రోజుల తరువాత, 1918 సెప్టెంబరు 29 న, బల్గేరియా లొంగిపోయింది. [104] జర్మనీ హైకమాండ్ బల్గేరియాకు మద్దతుగా దళాలను పంపించింది గానీ, శత్రు దళాలను నిలువరించగలిగేంత బలం వాటికి లేదు.[10]

మాసిడోనియాలో యుద్ధ రంగం ఖాళీ అయిందంటే దానర్థం, బుడాపెస్ట్, వియన్నాలకు వెళ్లే రహదార్లు ఇప్పుడు మిత్రరాజ్యాల దళాలకు బార్లా తెరిచినట్లే. హిండెన్‌బర్గ్, లుడెండోర్ఫ్ వ్యూహాత్మక, కార్యాచరణ సమతుల్యత స్పష్టంగా ఇప్పుడు సెంట్రల్ పవర్స్‌కు వ్యతిరేకంగా మొగ్గిందని భావించారు. బల్గేరియన్ పతనమైన ఒకరోజు తరువాత, తక్షణం సంధి చేసుకోవాలని వాళ్ళు పట్టుబట్టారు. [105]

ఓట్టోమన్ సామ్రాజ్యం[మార్చు]

గల్లిపోలి ప్రచారం సందర్భంగా టర్కీ కందకం సమీపంలో ఆస్ట్రేలియా దళాలు వసూలు చేస్తున్నాయి

ఓట్టోమన్లు రష్యాకు చెందిన కాకేసియన్ భూభాగాలను, సూయజ్ కాలువ ద్వారా భారతదేశానికి వెళ్ళే బ్రిటన్ ప్రయాణ మార్గాన్నీ బెదిరించారు. యుద్ధ సమయంలో ఐరోపా శక్తులు యుద్ధంలో నిమగ్నమై ఉండడాన్ని ఓట్టోమన్లు సద్వినియోగం చేసుకున్నారు. స్వదేశీ అర్మేనియన్, గ్రీక్, అస్సీరియన్ క్రైస్తవ జనాభాలను పెద్ద ఎత్తున జాతి ప్రక్షాళన చేసింది. ఇవే అర్మేనియన్ జెనోసైడ్, గ్రీక్ జెనోసైడ్, అస్సిరియన్ జెనోసైడ్ అని పేరుబడ్డాయి.[106][107][108]

బ్రిటిషు, ఫ్రెంచి వారు గల్లిపోలి (1915), మెసొపొటేమియన్ యుద్ధాలతో (1914) విదేశీ రంగాలను తెరిచారు. గల్లిపోలిలో, ఓట్టోమన్ సామ్రాజ్యం బ్రిటిషు, ఫ్రెంచి, ఆస్ట్రేలియన్ న్యూజిలాండ్ ఆర్మీ కార్ప్స్ (ANZAC లు) ను విజయవంతంగా తిప్పికొట్టింది. మెసొపొటేమియాలో, ఓట్టోమన్లు (1915-16) కుట్ ముట్టడిలో బ్రిటిషు వాళ్ళను ఓడించిన తరువాత, బ్రిటిషు ఇంపీరియల్ దళాలు పునర్వ్యవస్థీకరించుకుని 1917 మార్చిలో బాగ్దాద్‌ను స్వాధీనం చేసుకున్నాయి. బ్రిటిషు వారికి మెసొపొటేమియాలో స్థానిక అరబ్, అస్సీరియన్ గిరిజనులు సహాయం చేయగా, ఓట్టోమన్లు స్థానిక కుర్దిష్, తుర్కోమన్ తెగలను చేర్చుకున్నారు.[109]

కాన్స్టాంటినోపుల్ వద్దకు వచ్చిన మెహమెద్ వి విల్హెల్మ్ IIను పలకరించాడు

పశ్చిమాన, 1915, 1916 ల్లో ఓట్టోమన్ సామ్రాజ్యం చేసిన దాడుల నుండి బ్రిటిషు వాళ్ళు సూయజ్ కాలువను రక్షించుకున్నారు; ఆగస్టులో, రోమాని యుద్ధంలో ANZAC మౌంటెడ్ విభాగం, 52 వ (లోలాండ్) పదాతిదళ విభాగాలు జర్మన్, ఓట్టోమన్ దళాలను ఓడించాయి. ఈ విజయం తరువాత, ఈజిప్టు పర్యవేక్షక దళం సినాయ్ ద్వీపకల్పంలో ముందుకు సాగి, డిసెంబరులో మాగ్దాబా యుద్ధంలోను, 1917 జనవరిలో ఈజిప్టు సినాయ్ - ఓట్టోమన్ పాలస్తీనా సరిహద్దులో జరిగిన రాఫా యుద్ధంలో ఓట్టోమన్ దళాలను వెనక్కి నెట్టాయి.[110]

రష్యన్ సైన్యాలు కాకసస్‌లో విజయం సాధించాయి. ఓట్టోమన్ సాయుధ దళాల సుప్రీం కమాండర్ ఎన్వర్ పాషాకు ఆశలు చాలానే ఉన్నాయి. మధ్య ఆసియాను, గతంలో రష్యాకు కోల్పోయిన ప్రాంతాలనూ తిరిగి జయించాలని కలలు కన్నాడు. అయితే, అతడొక అసమర్థ సేనాధిపతి. [111] అతను 1914 డిసెంబరులో 100,000 మంది సైనికులతో కాకసస్‌లో రష్యన్‌లపై దాడి చేశాడు. శీతాకాలంలో, పర్వతప్రాంతంలో, రష్యన్ స్థావరంలో, వారిపై ముఖాముఖి దాడి చేయాలనేది అతడి సంకల్పం. సరికామిష్ యుద్ధంలో అతను తన బలగాల్లో 86% మందిని కోల్పోయాడు.[112]

కైజర్ విల్హెల్మ్ II తూర్పు గలీసియా, ఆస్ట్రియా-హంగరీ (ఇప్పుడు పోలాండ్) లోని 15 వ కార్ప్స్ యొక్క టర్కిష్ దళాలను తనిఖీ చేస్తున్నాడు. తూర్పు ఫ్రంట్‌లోని జర్మన్ సైన్యం యొక్క సుప్రీం కమాండర్ బవేరియా ప్రిన్స్ లియోపోల్డ్ ఎడమ నుండి రెండవ స్థానంలో ఉన్నాడు.

కాస్పియన్ సముద్రం సమీపంలో బాకు నగరం చుట్టూ ఉన్న పెట్రోలియం క్షేత్రాల్లోకి బ్రిటిషు, రష్యన్ల ప్రవేశాన్ని అడ్డుకునే ప్రయత్నంలో ఓట్టోమన్ సామ్రాజ్యం, జర్మనీ మద్దతుతో, 1914 డిసెంబరులో పర్షియా (ఆధునిక ఇరాన్) పై దాడి చేసింది.[113] పర్షియా, పైకి తటస్థంగా ఉన్నప్పటికీ, చాలాకాలంగా బ్రిటిషు, రష్యన్ల ప్రభావంలో ఉంది. ఓట్టోమన్లకు జర్మన్లతో పాటు, కుర్దిష్, అజేరి బలాలు, ఖాష్గాయ్, తంగిస్తానీ, లూరిస్తానీ, ఖామేష్ వంటి పర్షియన్ తెగలూ సాయం చేశారు. రష్యన్లు, బ్రిటిషర్లకు అర్మేనియన్, అస్సీరియన్ దళాలు మద్దతిచ్చాయి. పెర్షియన్ యుద్ధం 1918 లో ఓట్టోమన్లు, వారి మిత్రదేశాల పరాజయంతో ముగిసింది. అయితే, ఇవే అర్మేనియన్, అస్సిరియన్ దళాలు 1917 లో మెసొపొటేమియాలో యుద్ధం నుండి రష్యా వైదొలగడంతో వారి సరఫరా మార్గాలు తెగిపోయి, సైనికులు, మందుగుండు సామాగ్రి తగ్గిపోయి, ఓడిపోయి ఉత్తర మెసొపొటేమియాలోని బ్రిటిషు స్థావరాలవైపు పారిపోవాల్సి వచ్చింది.[114]

సారికామిష్ యుద్ధంలో రష్యన్ అటవీ కందకం, 1914-1915

1915 నుండి 1916 వరకు రష్యన్ కమాండర్ జనరల్ అయిన యుడెనిచ్ వరుస విజయాలతో, దక్షిణ కాకసస్ నుండి చాలా వరకు తుర్కులను తరిమికొట్టాడు.[112] 1917 లో, రష్యన్ గ్రాండ్ డ్యూక్ నికోలస్ కాకసస్ రంగంలో ఆధిపత్యాన్ని చేపట్టాడు. నికోలస్ రష్యన్ జార్జియా నుండి స్వాధీనం చేసుకున్న భూభాగాల్లోకి రైలు మార్గం నిర్మించేందుకు ప్లాన్ చేశాడు. దీనిద్వారా 1917 లో కొత్త దాడి కోసం తాజా సామాగ్రిని తీసుకెళ్ళే అవకాశం ఉంటుంది. అయితే, 1917 మార్చిలో (విప్లవ పూర్వపు రష్యన్ క్యాలెండర్లో ఫిబ్రవరి), ఫిబ్రవరి విప్లవం సమయంలో జార్ పదవీభ్రష్టుడయ్యాడు. దాంతో రష్యన్ కాకసస్ సైన్యం విచ్ఛిన్నం కావడం ప్రారంభమైంది.

బ్రిటిషు విదేశీ కార్యాలయంలోని అరబ్ బ్యూరో రెచ్చగొట్టడంతో 1916 జూన్‌లో షరీఫ్ హుస్సేన్ నేతృత్వంలో జరిగిన మక్కా యుద్ధంతో అరబ్ తిరుగుబాటు మొదలైంది. డమాస్కస్‌లో ఓట్టోమన్ లొంగుబాటుతో ముగిసింది. మదీనా ఓట్టోమన్ కమాండర్ ఫఖ్రీ పాషా 1919 జనవరిలో లొంగిపోయే ముందు రెండున్నర సంవత్సరాలకు పైగా మదీనా ముట్టడిని ప్రతిఘటించాడు. [115]

ఇటాలియన్ లిబియాకు బ్రిటిషు ఈజిప్టుకూ సరిహద్దులో ఉన్న సెనుస్సీ తెగ, టర్క్‌లు రెచ్చగొట్టగా, వారిచ్చిన ఆయుధాలతో మిత్రరాజ్యాల దళాలకు వ్యతిరేకంగా చిన్నపాటి గెరిల్లా యుద్ధం చేసింది. సెనుస్సీ యుద్ధానికి బ్రిటిషు వారు 12,000 మంది సైనికులను పంపించవలసి వచ్చింది. చివరికి 1916 మధ్యలో తిరుగుబాటును అణిచేసారు. [116]

ఓట్టోమన్ సరిహద్దుల్లో మొత్తం మిత్రరాజ్యాల జననష్టం 650,000. మొత్తం ఓట్టోమన్ జననష్టం 725,000 (3,25,000 మంది మరణించారు, 4,00,000 మంది గాయపడ్డారు).[117]

ఇటలీ చేరిక[మార్చు]

ఇటలీలోని బోలోగ్నాలో 1914 లో యుద్ధ అనుకూల ప్రదర్శన

ట్రిపుల్ అలయన్స్‌లో భాగంగా ఇటలీ 1882 నుండి జర్మనీ, ఆస్ట్రో-హంగేరియన్ సామ్రాజ్యాలతో పొత్తు పెట్టుకుంది. అయితే, ట్రెంటినో, ఆస్ట్రియన్ లిటోరల్, ఫ్యూమ్ (రిజెకా), డాల్మాటియా మొదలైన ఆస్ట్రియా భూభాగాల్లో ఇటలీకి స్వంతంగా కోరికలున్నాయి. రోమ్ ఫ్రాన్స్‌తో రహస్యంగా 1902 ఒప్పందం ఒకటి కుదుర్చుకుంది. ఆ ఒప్పందం ప్రకారం చూస్తే ట్రిపుల్ అలయన్స్‌లో ఇటలీ ఉన్నా లేనట్లే లెక్క;[118] ఒకవేళ జర్మనీ ఫ్రాన్సుపై దాడి చేస్తే తటస్థంగా ఉండటానికి ఇటలీ రహస్యంగా ఫ్రాన్స్‌తో అంగీకరించింది.[119] యుద్ధం ప్రారంభంలో, ఇటలీ తన దళాలను పంపడానికి నిరాకరించింది - ట్రిపుల్ అలయన్స్ రక్షణాత్మకమైనదనీ, ఆస్ట్రియా-హంగరీ దురాక్రమణ చేసిందనీ ఇటలీ వాదన. ఆస్ట్రో-హంగేరియన్ ప్రభుత్వం ఇటలీని కనీసం తటస్థంగా ఉండమని కోరేందుకు చర్చలు ప్రారంభించింది. తటస్థంగా ఉంటే, బదులుగా ఫ్రెంచి వలస రాజ్యమైన ట్యునీషియాను ఇస్తామని బేరం పెట్టింది. దీనికి ప్ర్తిగా మిత్ర రాజ్యాలు, ఆస్ట్రియా-హంగరీ ఓటమి తరువాత డాల్మేషియన్ తీరంలోని దక్షిణ టైరోల్ భూభాగాన్ని ఇటలీకి అప్పగిస్తామని ఆశజూపారు. లండన్ ఒప్పందం ద్వారా దీనిని అక్షరబద్ధం చేశారు. 1915 ఏప్రిల్‌లో మిత్రరాజ్యాలు టర్కీని ఆక్రమించుకోవడంతో ఉత్సాహం పొందిన ఇటలీ ట్రిపుల్ ఎంటెంటెలో చేరి మే 23 న ఆస్ట్రియా-హంగరీపై యుద్ధం ప్రకటించింది. మరో పదిహేను నెలల తరువాత, ఇటలీ జర్మనీపై యుద్ధం ప్రకటించింది.[120]

ఆస్ట్రో-హంగేరియన్ దళాలు, టైరోల్

ఇటాలియన్లకు సంఖ్యాపరమైన ఆధిపత్యం ఉంది. కానీ, పోరాటం జరిగిన కష్టతరమైన భూభాగం వల్లను, వ్యూహాలు, ఎత్తుగడల్లో లోపాల వల్లనూ ఈ ప్రయోజనాన్ని పోగొట్టుకుంది.[121] ముఖాముఖి దాడి చెయ్యాలని గట్టిగా ప్రతిపాదించే ఫీల్డ్ మార్షల్ లుయిగి కాడోర్నా, స్లోవేనియన్ పీఠభూమిలోకి ప్రవేశించి, ల్యుబ్ల్యానాను ఆక్రమించి, వియన్నాను బెదిరించాలని కలలు కన్నాడు.

ట్రెంటినో రంగంలో, ఆస్ట్రో-హంగేరియన్లు పర్వత భూభాగాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఆస్ట్రో-హంగేరియన్లకు ఇది అనుకూలమైన ప్రాంతం. తొలి నాళ్ళలో జరిగిన వ్యూహాత్మక తిరోగమనం తరువాత, యుద్ధ రంగం పెద్దగా మారలేదు. అదే సమయంలో ఆస్ట్రియన్ కైసర్‌చాట్జెన్, స్టాండ్‌చాట్జెన్ లు ఇటాలియన్ ఆల్పినిని వేసవి అంతా నిలబెట్టారు. ఆస్ట్రో-హంగేరియన్లు ఆసియాగోలోని ఆల్టోపియానోలో, వెరోనా, పాడువా వైపు, 1916 వసంతకాలంలో ( స్ట్రాఫెక్స్‌పెడిషన్ ) ఎదురుదాడి చేశారు. కాని పెద్దగా పురోగతి సాధించలేదు. చివరికి ఇటాలియన్ల చేతిలో ఓడిపోయారు.[122]

1915 నుండి, కాడోర్నా ఆధ్వర్యంలోని ఇటాలియన్లు ట్రిస్టేకు ఈశాన్యంగా ఉన్న ఐసోంజో (సోనా) నది వెంట ఐసోంజో రంగంలో పదకొండు దాడులు చేశారు. ఈ పదకొండు దాడులలో, ఐదింట్లో ఇటలీ గెలిచింది, మూడు అనిశ్చితంగా ముగిసాయి, మిగిలిన మూడింటిలో ఆస్ట్రో-హంగేరియన్లు ఎత్తైన స్థలంలో ఉన్నచోట్ల, వారు ఇటలీ దాడిని తిప్పికొట్టారు. 1916 వేసవిలో, డోబెర్డే యుద్ధం తరువాత, ఇటాలియన్లు గోరిజియా పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ విజయం తరువాత, గోరిజియాకు తూర్పున ఉన్న బాంజాయిస్ పైన, కార్స్ట్ పీఠభూమిపైనా ఇటాలియన్లు దాడులు చాలానే చేసినప్పటికీ, ఒక సంవత్సరం పాటు యుద్ధరంగం ఏ కదలికా లేకుండా ఉండిపోయింది.

డోబెర్డే యుద్ధం. 1916 ఆగస్టులో ఇటాలియన్ ఆస్ట్రో-హంగేరియన్ సైన్యాల మధ్య జరిగింది.

సెంట్రల్ పవర్స్ 1917 అక్టోబరు 26 న జర్మన్ల నాయకత్వంలో, కాపోరెట్టో ( కోబారిడ్ ) వద్ద విజయాన్ని సాధించింది. ఇటాలియన్ సైన్యం మట్టికరిచింది. 100 కి.మీ. పైగా వెనక్కి పోయింది. కొత్త ఇటాలియన్ చీఫ్ ఆఫ్ స్టాఫ్, అర్మాండో డియాజ్ తిరోగమనాన్ని ఆపి మోంటే గ్రాప్పా శిఖరాన్ని రక్షించాలని సైన్యాన్ని ఆదేశించాడు. అక్కడ బలమైన రక్షణలు నిర్మించారు; ఇటాలియన్లు ఆస్ట్రో-హంగేరియన్, జర్మన్ సైన్యాలను తిప్పికొట్టారు. పియావ్ నది వద్ద యుద్ధ క్షేత్రాన్ని స్థిరీకరించారు. కాపోరెట్టో యుద్ధంలో ఇటలీ సైన్యానికి భారీ నష్టాలు కలగడంతో, ఇటాలియన్ ప్రభుత్వం 18 అంతకంటే ఎక్కువ వయసున్న మగవారందరికీ నిర్బంధ సైనిక సేవ నియమాన్ని అమలు చేసింది. 1899 లోను, అంతకంటే ముందూ పుట్టిన వారు సైన్యంలో చేరడం తప్పనిసరి చేసిన ఈ కార్యక్రమాన్ని రాగజ్జి డెల్ '99 ('99 కుర్రాళ్ళు) అని పిలిచేవారు. 1918 లో, ఆస్ట్రో-హంగేరియన్లు పియావేలో వరుసగా చేసిన దాడుల్లో ఏమాత్రం ముందడుగు వెయ్యలేకపోయారు. చివరికి అక్టోబరులో జరిగిన విట్టోరియో వెనెటో యుద్ధంలో నిర్ణయాత్మకంగా ఓడిపోయారు. నవంబరు 1 న ఇటలీ నావికాదళం పులాలో ఉంచిన ఆస్ట్రో-హంగేరియన్ నౌకాదళాన్ని చాలావరకు నాశనం చేసి, ఈ ప్రాంతాన్ని స్లోవేనియన్లు, క్రొయేట్స్, సెర్బ్‌ల కొత్త దేశానికి అప్పగించకుండా నిరోధించింది. నవంబరు 3 న, ఇటాలియన్లు సముద్రం నుండి దాడి చేసి ట్రయెస్టేను స్వాధీనం చేసుకున్నారు. అదే రోజు, విల్లా గియుస్టిలో కాల్పుల విరమణపై సంతకాలు చేసారు. 1918 నవంబరు మధ్య నాటికి, ఇటాలియన్ మిలిటరీ మొత్తం పూర్వ ఆస్ట్రియన్ తీరాన్ని ఆక్రమించింది. లండన్ ఒప్పందంలో ఇటలీకి హామీగా లభించిన డాల్మాటియా భాగాన్ని స్వాధీనం చేసుకుంది.[123] 1918 నవంబరులో పోరు ముగిసే సమయానికి,[124] అడ్మిరల్ ఎన్రికో మిల్లోను ఇటలీ డాల్మాటియాకు గవర్నరుగా ప్రకటించారు.[124] ఆస్ట్రియా-హంగరీ 1918 నవంబరు 11 న లొంగిపోయింది. [125] [126]

రొమేనియా చేరిక[మార్చు]

మార్షల్ జోఫ్రే రొమేనియన్ దళాలను తనిఖీ చేస్తున్నాడు, 1916

రొమేనియా 1882 నుండి సెంట్రల్ పవర్స్‌తో పొత్తులో ఉంది. అయితే, యుద్ధం ప్రారంభమైనప్పుడు, తటస్థంగా ఉంటానని ప్రకటించింది. స్వయంగా ఆస్ట్రియా-హంగరీ యే సెర్బియాపై యుద్ధాన్ని ప్రకటించినందున, తాము యుద్ధంలో చేరాల్సిన బాధ్యత ఏమీ లేదని రొమేనియా వాదించింది. 1916 ఆగస్టు 4 న, రొమేనియా, ట్రిపుల్‌ ఎంటెంటే రాజకీయ, సైనిక ఒప్పందంపై సంతకం చేశాయి. ఇది రొమేనియా యుద్ధంలో పాల్గొనడానికి భూమికను ఏర్పాటు చేసింది. దీనికి ప్రతిగా, ట్రాన్సిల్వేనియా, బనాట్, ఆస్ట్రియా-హంగరీలోని ఇతర భూభాగాలను రొమేనియాలో కలుపుకోడానికి మిత్రరాజ్యాల అధికారిక అనుమతి పొందింది. ఈ చర్యకు రొమేనియాలో పెద్దయెత్తున ప్రజాదరణ లభించింది.[127] 1916 ఆగస్టు 27 న, రోమానియా సైన్యం, పరిమితంగా లభించిన రష్యా మద్దతుతో ఆస్ట్రియా-హంగరీపై దాడి ప్రారంభించింది. ట్రాన్సిల్వేనియాలో రొమేనియా దాడి మొదట్లో విజయవంతమైంది, కాని సెంట్రల్ పవర్స్ ఎదురుదాడి వారిని వెనక్కి నెట్టింది.[128] బుకారెస్ట్ యుద్ధంలో విజయం సాధించి, సెంట్రల్ పవర్స్ 1916 డిసెంబరు 6 న బుకారెస్ట్‌ను ఆక్రమించాయి. 1917 లో మోల్డోవాలో పోరాటం కొనసాగింది, కాని అక్టోబరువిప్లవం ఫలితంగా 1917 చివరలో రష్యా, యుద్ధం నుండి వైదొలగడంతో 1917 డిసెంబరు 9 న రొమేనియా సెంట్రల్ పవర్స్‌తో కాల్పుల విరమణపై సంతకం చేయవలసి వచ్చింది.[129]

మెరెస్టి యుద్ధంలో రొమేనియన్ దళాలు, 1917

1918 జనవరిలో బెస్సరేబియాను రష్యా సైన్యం విడిచిపెట్టెయ్యడంతో ఆ ప్రాంతంపై రొమేనియా దళాలు నియంత్రణ సాధించాయి. 1918 మార్చి 5 - 9 మధ్య జరిగిన చర్చల్లో, రెండు నెలల్లోపు బెస్సరాబియా నుండి రొమేనియన్ దళాలను ఉపసంహరించుకోవాలని రొమేనియా, బోల్షివిక్ రష్యన్ ప్రభుత్వాలు ఒక ఒప్పందంపై సంతకం చేసారి. అయినప్పటికీ, 1918 మార్చి 27 న రొమేనియాతో విలీనం కావాలని బెస్సరాబియా అసెంబ్లీ ఆమోదించిన తీర్మానం ఆధారంగా రొమేనియా ప్రజలు మెజారిటీగా ఉన్న బెస్సరాబియా భూభాగాన్ని అధికారికంగా రొమేనియాలో కలిపేసుకుంది.[130]

1918 మే 7 న బుకారెస్ట్ ఒప్పందంపై సంతకం చేయడం ద్వారా రొమేనియా అధికారికంగా సెంట్రల్ పవర్స్‌తో శాంతి కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం, రొమేనియా సెంట్రల్ పవర్స్‌తో యుద్ధాన్ని ముగిస్తుంది. ఆస్ట్రియా-హంగరీకి చిన్నపాటి ప్రాదేశిక రాయితీలు ఇస్తుంది. కార్పాతియన్ పర్వతాలలో కొన్ని కనుమలపై నియంత్రణను ఇస్తుంది. జర్మనీకి చమురు రాయితీలు ఇస్తుంది. బదులుగా, బెస్సరాబియాపై రొమేనియా సార్వభౌమత్వాన్ని సెంట్రల్ పవర్స్ గుర్తింస్తాయి. ఈ ఒప్పందాన్ని 1918 అక్టోబరులో అలెగ్జాండ్రు మార్గిలోమన్ ప్రభుత్వం కాలదన్నింది. రొమేనియా 1918 నవంబరు10 న తిరిగి సెంట్రల్ పవర్స్‌కు వ్యతిరేకంగా యుద్ధంలో దిగింది. మరుసటి రోజు, బుకారెస్ట్ ఒప్పందం కాంపిగ్నే కాల్పుల విరమణ ఒప్పందం లోని నిబంధనల వలన రద్దైపోయింది.[131][132] 1914 నుండి 1918 వరకు మొత్తం రొమేనియన్ మరణాలు, ఆనాటి సరిహద్దుల్లోని సైనికులు, పౌరులూ కలిపి 7,48,000 గా అంచనా వేసారు.[133]

తూర్పు రంగం[మార్చు]

తొలి పోరు[మార్చు]

మొదటి ముట్టడి తరువాత భావి వారసుడు కార్ల్ ప్రజ్మియాల్ కోటను సందర్శించాడు. రష్యన్ ప్రెజ్మియల్ ముట్టడి, ఈ యుద్ధం లోకెల్లా దీర్ఘకాలం సాగింది.

రష్యన్ ప్రణాళికల ప్రకారం ఆస్ట్రియన్ గాలీసియాపైన, తూర్పు ప్రష్యాపైనా ఏకకాలంలో దండయాత్రలతో యుద్ధం మొదలౌతుంది. గాలీసియాలో రష్యా పురోగతి మొదట్లో చాలావరకు విజయవంత మైనప్పటికీ, 1914 ఆగస్టు, సెప్టెంబరుల్లో టాన్నెన్‌బర్గ్, మసూరియన్ సరస్సుల యుద్ధాలలో హిండెన్‌బర్గ్, లుడెండోర్ఫ్ లు తూర్పు ప్రష్యా నుండి రష్యాను వెనక్కి నెట్టేసారు. [134] [135] రష్యా లోని పెద్దగా అభివృద్ధి చెందని పరిశ్రమలు, అసమర్థ సైనిక నాయకత్వం అప్పుడు జరిగిన సంఘటనల్లో కీలక పాత్ర పోషించాయి. 1915 వసంత ఋతువు నాటికి, రష్యన్లు గాలీసియా నుండి వెనక్కి తగ్గారు. మేలో, సెంట్రల్ పవర్స్ గోర్లిస్-టార్నోవ్ దాడితో పోలాండ్ దక్షిణ సరిహద్దులలో గొప్ప విజయాన్ని సాధించింది.[136] ఆగస్టు 5 న వారు వార్సాను స్వాధీనం చేసుకుని, పోలండ్ నుండి రష్యన్లను పారదోలారు.

రష్యన్ విప్లవం[మార్చు]

1918 సెప్టెంబరులో కమ్యూనిస్ట్ వ్యతిరేక వైట్ ఆర్మీకి సాయుధ మద్దతుగా మిత్రరాజ్యాల దళాలు వ్లాడివోస్టాక్ ద్వారా కవాతు చేస్తాయి

1916 జూన్‌లో తూర్పు గాలీసియాలోని ఆస్ట్రియన్లపై బ్రూసిలోవ్ దాడిలో రష్యా విజయం సాధించినప్పటికీ, [137] ఇతర రష్యన్ జనరల్స్ విజయానికి మద్దతుగా తమ బలగాలకు పంపటానికి ఇష్టపడకపోవడంతో ఈ దాడి బలహీనపడింది. ఆగస్టు 27 న రొమేనియా యుద్ధంలోకి ప్రవేశించడంతో మిత్రరాజ్యాల, రష్యన్ దళాలు పునరుద్ధరించారు గానీ, అది కొద్దికాలమే సాగింది. ఎందుకంటే సెంట్రల్ పవర్స్ చేతిలో రొమేనియా వేగంగా ఓడిపోయింది. ఇంతలో, జార్ యుద్ధ రంగంలో ఉండటంతో రష్యాలో అశాంతి పెరిగింది. సామ్రాజ్ఞి అలెగ్జాండ్రా అసమర్థ పాలనపై నిరసనలు వెల్లువెత్తాయి. 1916 చివరిలో ఆమె అభిమానపాత్రుడైన రాస్‌పుటిన్ హత్యకు దారితీసింది.

బ్రెస్ట్-లిటోవ్స్క్ ఒప్పందం ప్రకారం కోల్పోయిన భూభాగం

1917 మార్చిలో, పెట్రోగ్రాడ్‌లో ప్రదర్శనలు చెలరేగి, జార్ నికోలస్ II ను పదవి నుండి తొలగించారు. ఆ తరువాత బలహీనమైన తాత్కాలిక ప్రభుత్వాన్ని నియమించారి. ఈ ప్రభిఉత్వం, పెట్రోగ్రాడ్ సోవియట్ సోషలిస్టులతో అధికారాన్ని పంచుకుంది. ఈ అమరిక దేశం లోను, యుద్ధ రంగం లోనూ గందరగోళానికి దారితీసింది. సైన్యం ఉండేకొద్దీ చేష్టలుడిగి పోతూ వచ్చింది.[138]

జార్ పదవీచ్యుతుడయ్యాక, తరువాత, వ్లాదిమిర్ లెనిన్, జర్మన్ ప్రభుత్వ సహాయంతో, స్విట్జర్లాండ్ నుండి రష్యాకు 1917 ఏప్రిల్ 16 న రైలులో వచ్చాడు.[139] తాత్కాలిక ప్రభుత్వ బలహీనతల పట్ల ప్రజల్లో ఉన్న అసంతృప్తి, లెనిన్ నేతృత్వంలోని బోల్షెవిక్ పార్టీకి ఆదరణ పెరగడానికి దారితీసింది. యుద్ధాన్ని వెంటనే ముగించాలని పార్టీ డిమాండ్ చేసింది. నవంబరు విప్లవం తరువాత డిసెంబరులో జర్మనీతో కాల్పుల విరమణ చర్చలు జరిగాయి. మొదట, బోల్షెవిక్‌లు జర్మన్ నిబంధనలను తిరస్కరించారు. కాని జర్మన్ దళాలు ఉక్రెయిన్ అంతటా నిరంతరాయంగా కవాతు ప్రారంభించినప్పుడు, కొత్త ప్రభుత్వం 1918 మార్చి 3 న బ్రెస్ట్-లిటోవ్స్క్ ఒప్పందానికి అంగీకరించింది. ఈ ఒప్పందం ప్రకారం ఫిన్లాండ్, బాల్టిక్ ప్రావిన్సులు, పోలండ్, ఉక్రెయిన్ లోని కొన్ని ప్రాంతాలు సెంట్రల్ పవర్స్‌కు దక్కాయి.[140] ఇంత పెద్ద విజయం జర్మనీకి దక్కడంతో, స్వాధీనం చేసుకున్న విస్తారమైన భూభాగాన్ని ఆక్రమించటానికి జర్మన్లకు బోలెడంత మానవశక్తిని ఆ ప్రాంతాల్లో మోహరించాల్సిన అవసరం పడింది. తరువాతి కాలంలో జర్మనీ పెద్దయెత్తున చేపట్టిన వసంతకాలపు దాడి విఫలమవడానికి సరిపడినంత సైన్యం లేకపోవడం కూడా ఒక కారణమై ఉండవచ్చు

బ్రెస్ట్-లిటోవ్స్క్ ఒప్పందం కుదరడంతో, ఇక ఎంటెంటే ఉనికిలో లేకుండా పోయింది. మిత్రరాజ్యాల శక్తులు రష్యాపై చిన్న తరహా దండయాత్ర చేసాయి, కొంతవరకు జర్మనీ రష్యన్ వనరులను దోపిడీ చేయకుండా ఆపడానికి, కొంతవరకు రష్యన్ అంతర్యుద్ధంలో "తెల్ల" దండుకు ("ఎర్ర" దండుకు వ్యతిరేకంగా) మద్దతు ఇవ్వడానికి. [141] ఉత్తర రష్యా జోక్యంలో భాగంగా మిత్రరాజ్యాల దళాలు అర్ఖంగెల్స్క్, వ్లాడివోస్టాక్‌లో అడుగుపెట్టాయి.

చెకోస్లోవాక్ సైన్యం[మార్చు]

చెకోస్లోవాక్ లెజియన్, వ్లాడివోస్టాక్, 1918

చెకోస్లోవాక్ సైన్యం ఎంటెంటే వైపు పోరాడింది. చెకోస్లోవేకియా స్వాతంత్ర్యానికి మద్దతు పొందడం దీని లక్ష్యం. చెకోస్లోవాక్ దళాలు 1917 జూలైలో ఉక్రేనియన్ గ్రామమైన జొబోరోవ్ వద్ద ఆస్ట్రో-హంగేరియన్ సైన్యాన్ని ఓడించాయి. ఈ విజయం తరువాత, చెకోస్లోవాక్ దళ సైనికుల సంఖ్య పెరిగింది, అలాగే చెకోస్లోవాక్ సైనిక శక్తి కూడా. బఖ్మాచ్ యుద్ధంలో, దళం జర్మన్‌లను ఓడించి, సంధికి తలవంచేలా చేసింది.

ఈ చెకొస్లోవాక్ దళం రష్యా అంతర్యుద్ధంలో తలమునకలుగా జోక్యం చేసుకుని, తెల్లవారి పక్షాన పోరాడింది. కొన్ని సమయాల్లో ట్రాన్స్-సైబీరియన్ రైల్వేను తమ అదుపులో ఉంచుకున్నారు. సైబీరియా లోని ప్రధాన నగరాలన్నిటినీ ఆక్రమించుకుంది. యెకాటెరిన్బర్గ్ సమీపంలో చెకోస్లోవాక్ దళం ఉండటం 1918 జూలైలో జార్‌ను, అతని కుటుంబాన్నీ బోల్షెవిక్కులు ఉరితీయడానికి ప్రేరేపించిన సంఘటనల్లో ఒకటి. ఒక వారం లోపు చెక్ సైనికులు వచ్చి నగరాన్ని స్వాధీనం చేసుకున్నారు.

సెంట్రల్ పవర్స్ శాంతి మంత్రాలు[మార్చు]

" వారు పాస్ చేయరు ", ఇది వెర్డున్ యొక్క రక్షణతో ముడిపడి ఉంటుంది

1916 డిసెంబరు 12 న, పది నెలల పాటు జరిగిన వెర్దున్ యుద్ధం, రొమేనియాపై విజయవంతమైన దాడి తరువాత, జర్మనీ మిత్రదేశాలతో శాంతి చర్చలు జరిపేందుకు ప్రయత్నించింది.[142] అయితే, ఈ ప్రయత్నం "మోసపూరిత, రెండు నాల్కల ధోరణి" గా అభివర్ణిస్తూ మిత్రరాజ్యాలు తిరస్కరించాయి.[142]

వెంటనే, అమెరికా అధ్యక్షుడు వుడ్రో విల్సన్ శాంతికర్తగా జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించాడు, ఇరుపక్షాలు తమ డిమాండ్లను తెలియజేయాలని ఒక నోట్‌లో కోరాడు. లాయిడ్ జార్జ్ యొక్క వార్ క్యాబినెట్, జర్మన్ ప్రతిపాదనను మిత్రరాజ్యాల మధ్య విభేదాలను సృష్టించే కుట్రగా భావించింది. విల్సన్ ప్రకటన పట్ల తొలుత ఆగ్రహం వెలిబుచ్చినా, చాలా చర్చల తరువాత, వారు విల్సన్ యొక్క నోట్‌ను ఒక ప్రత్యేక ప్రయత్నంగా భావించారు, జర్మను "జలాంతర్గామి దౌర్జన్యాల" తరువాత జర్మనీపై యుద్ధానికి దిగేందుకు సిద్ధంగా ఉందని, ఈ నోట్ అందుకు సంకేతమనీ భావించారు. విల్సన్ ఆఫర్‌కు ప్రతిస్పందన గురించి మిత్రరాజ్యాలు చర్చించగా, జర్మన్లు, "అభిప్రాయాల మార్పిడి నేరుగా జరగాలని" చెబుతూ విల్సన్ ప్రతిపాదనను తిరస్కరించారు. జర్మన్ ప్రతిస్పందన గురించి తెలుసుకున్న మిత్రరాజ్యాల ప్రభుత్వాలు జనవరి 14 ఇచ్చిన వారి ప్రతిస్పందనలో స్పష్టమైన డిమాండ్లు చేసారు. నష్టాలకు పరిహారం, ఆక్రమిత భూభాగాల ఇచ్చివేత, ఫ్రాన్స్, రష్యా, రొమేనియాకు నష్టపరిహారం, జాతీయతల సూత్రాన్ని గుర్తించడం వారి డిమాండ్లలో ఉన్నాయి. [143] ఇందులో ఇటాలియన్లు, స్లావ్‌లు, రొమేనియన్లు, చెకో-స్లోవాక్‌ల విముక్తి, "స్వేచ్ఛాయుత, ఐక్య పోలండ్" ను ఏర్పాటు చెయ్యడం ఉన్నాయి. [143] చర్చలు మొదలు పెట్టాలంటే షరతుగా, భవిష్యత్తులో యుద్ధాలను నిరోధించేలా లేదా పరిమితం చేసేలా, ఆంక్షలతో సహా హామీలు కావాలని కోరాయి. [144] చర్చలు విఫలమయ్యాయి. జర్మనీ ఎటువంటి నిర్దుష్ట ప్రతిపాదనలతో ముందుకు రాలేదనే కారణంతో జర్మన్ ప్రతిపాదనను ఎంటెంటే దేశాలు తిరస్కరించాయి.

1917-1918[మార్చు]

1917 లో జరిగిన సంఘటనలు యుద్ధాన్ని ముగించడంలో నిర్ణయాత్మకమైన పత్ర పోషించాయి. అయితే ఆ సంఘటనల ప్రభావాలు 1918 వరకు పూర్తిగా అనుభవం లోకి రాలేదు.

1917 లో పరిణామాలు[మార్చు]

ఫ్రెంచి ఆర్మీ తన పరిశీలన పోస్ట్, హౌట్-రిన్, ఫ్రాన్స్, 1917 లో చూస్తుంది

బ్రిటిషు నావికా దిగ్బంధం జర్మనీపై తీవ్ర ప్రభావం చూపడం ప్రారంభించింది. ప్రతిస్పందనగా, 1917 ఫిబ్రవరిలో, జర్మనీ జనరల్ స్టాఫ్, అనియంత్రిత జలాంతర్గామి యుద్ధాన్ని ప్రకటించమని ఛాన్సలర్ థియోబాల్డ్ వాన్ బెత్మాన్-హోల్వెగ్‌ను ఒప్పించాడు. బ్రిటన్‌కు సరఫరాలు చేసే ఓడలను ముంచేసి, సరఫరాలు అందకుండా చేసి, ఆ దేశాన్ని యుద్ద్ధం నుండి పారిపోయేలా చెయ్యలనేది ఈ వ్యూహ లక్ష్యం. అనియంత్రిత జలాంతర్గామి యుద్ధం వలన బ్రిటన్‌కు నెలవారీ 600,000 టన్నుల షిప్పింగ్ నష్టం కలగజేయవచ్చని జర్మన్లు అంచనా వేసారు. ఈ విధానం అమెరికాను సంఘర్షణలోకి లాక్కురావడం దాదాపుగా ఖాయమని జనరల్ స్టాఫ్ అంగీకరించాడు. కాని బ్రిటిషు షిప్పింగ్ నష్టాలు ఎంత ఎక్కువగా ఉంటాయంటే, అమెరికన్ల ప్రభావం కనబడే లోపే, ఐదారు నెలల్లోనే బ్రిటిషు వారు శాంతి కోసం అభ్యర్థిస్తారు అని అతడు చెప్పాడు. ఫిబ్రవరి - జూలై మధ్య జర్మను జలాంతర్గాములు ముంచేసిన టన్నేజి సగటున నెలకు 5,00,000 టన్నుల పైనే ఉంది. ఏప్రిల్లో ఇది అత్యధికంగా 8,60,000 టన్నులు ఉంది. జూలై తరువాత, కొత్తగా తిరిగి ప్రవేశపెట్టిన కాన్వాయ్ వ్యవస్థ U- బోట్ ముప్పును తగ్గించడంలో ప్రభావశీలంగా మారింది. బ్రిటన్ కు సరఫరాలు సక్రమంగానే జరిగాయి. జర్మనీలో మాత్రం పారిశ్రామిక ఉత్పత్తి పడిపోయింది. జర్మనీ ఊహించిన దానికంటే చాలా ముందుగానే యునైటెడ్ స్టేట్స్ యుద్ధంలో దిగింది.

మే 3, 1917 న, నివెల్లే దాడి సమయంలో, ఫ్రెంచి 2వ వలసరాజ్యాల విభాగం, వెర్డున్ యుద్ధంలో పాల్గొన్నవారు, ఆదేశాలను తిరస్కరించారు. తాగి వచ్చారు. ఆయుధాలు లేకుండా వచ్చారు. వారి అధికారుల వద్ద విభాగం మొత్తాన్నీ శిక్షించే మార్గాలు లేవు. దాంతో, కఠిన చర్యలు వెంటనే తీసుకోలేదు. ఫ్రెంచి ఆర్మీ తిరుగుబాట్లు చివరికి మరో 54 ఫ్రెంచి విభాగాలకు వ్యాపించాయి. 20,000 మంది సైనికులు దళాన్ని విడిచిపెట్టారు. అయితే, దేశభక్తి ఉద్బోధలు, విధ్యుక్త ధర్మం పట్ల విజ్ఞప్తులు, సామూహిక అరెస్టులు. విచారణలు చేస్తామనే బెదిరింపులూ వగైరాలతో సైనికులను తిరిగి తమ కందకాలను కాపాడుకోవడానికి రప్పించగలిగారు. అయితే, తదుపరి దాడుల్లో పాల్గొనడానికి ఫ్రెంచి సైనికులు నిరాకరించారు.[145] మే 15 నాటికి రాబర్ట్ నివెల్లెను కమాండ్ నుండి తొలగించి, అతని స్థానంలో జనరల్ ఫిలిప్ పెయిటెన్‌ను నియమించారు, అతను పెద్ద ఎత్తున జరిపే దాడులను నిలిపివేసాడు.

జర్మన్ చిత్ర బృందం చర్యను రికార్డ్ చేస్తుంది

కాపోరెట్టో యుద్ధంలో సెంట్రల్ పవర్స్ విజయం తరువాత మిత్రరాజ్యాలు రాపాల్లో సమావేశాన్ని ఏర్పాటు చేసారు. యుద్ధ ప్రణాళికను సమన్వయం చేయడానికి సుప్రీం వార్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేశారు. గతంలో, బ్రిటిషు, ఫ్రెంచి సైన్యాలు వేర్వేరు ఆదేశాల ప్రకారం పనిచేసేవి.

డిసెంబరులో, సెంట్రల్ పవర్స్ రష్యాతో కాల్పుల విరమణపై సంతకం చేసాయి. దాంతో పశ్చిమాన పెద్ద సంఖ్యలో మోహరించడానికి జర్మన్ దళాలు విడుదలయ్యాయి. అలాగే కొత్త అమెరికా దళాలు కూడా వచ్చి చేరుతూండడంతో, ఇక ఫలితాఅన్ని నిర్ణయించేది పశ్చిమ రంగమే. యుద్ధం సుదీర్ఘంగా సాగితే తాము గెలవలేమని సెంట్రల్ పవర్స్‌కు తెలుసు. కాని వారు తుది దాడిలో విజయం కోసం ఆశలు పెట్టుకున్నారు. పైగా, ఐరోపాలో సామాజిక అశాంతి, విప్లవాలు తలెత్తుతాయేమోనని ఇరుపక్షాలు భయపడ్డాయి. ఆ విధంగా, ఇరువర్గాలు వెంటనే నిర్ణయాత్మక విజయం కావాలని కోరుకున్నాయి. [146]

1917 లో, ఆస్ట్రియా చక్రవర్తి చార్లెస్ I, జర్మనీకి తెలియకుండా, బెల్జియంలోని తన భార్య సోదరుడు సిక్స్టస్ మధ్యవర్తిగా క్లెమెన్సీయుతో రహస్యంగా ప్రత్యేక శాంతి చర్చలకు ప్రయత్నించాడు. ఇటలీ ఈ ప్రతిపాదనలను వ్యతిరేకించింది. చర్చలు విఫలమయ్యాక, అతని ప్రయత్నం గురించి జర్మనీకి తెలిసింది, ఫలితంగా దౌత్య విపత్తు సంభవించింది. [147] [148]

ఓట్టోమన్ సామ్రాజ్యం సంఘర్షణ, 1917-1918[మార్చు]

దక్షిణ పాలస్తీనా దాడికి ముందు 1917 లో హరీరాలో 10.5 సెం.మీ. ఫెల్దాబిట్జ్ 98/09 తో ఓట్టోమన్ ఫిరంగిదళ సిబ్బంది
జెరూసలేం యుద్ధంలో మౌంట్ స్కోపస్‌పై బ్రిటిషు ఫిరంగి బ్యాటరీ, 1917. ముందు 16 భారీ తుపాకుల బ్యాటరీ. నేపధ్యంలో శంఖాకార గుడారాలు, సహాయక వాహనాలు.

1917 మార్చి, ఏప్రిల్ లలో, గాజా లోని మొదటి, రెండవ యుద్ధాలలో, జర్మన్, ఓట్టోమన్ సైన్యాలు ఈజిప్టు యాత్రా దళపు పురోగతిని నిలిపివేసాయి. ఇది 1916 ఆగస్టులో రోమాని యుద్ధంతో ప్రారంభమైంది.[149][150] అక్టోబరు చివరలో, సినాయ్, పాలస్తీనాల్లో యుద్ధం తిరిగి ప్రారంభమైంది. మొఘర్ రిడ్జ్ యుద్ధంలో రెండు ఓట్టోమన్ సైన్యాలు ఓడిపోయాయి. డిసెంబరు ఆరంభంలో, జెరూసలేం యుద్ధంలో మరో ఓట్టోమన్ ఓటమి తరువాత జెరూసలేం లొంగిపోయింది.[10][151][152] ఈ సమయంలో, ఫ్రెడరిక్ ఫ్రీహెర్ క్రెస్ వాన్ క్రెసెన్‌స్టెయిన్ ఎనిమిదవ సైన్యం యొక్క కమాండర్‌గా తన విధుల నుండి విముక్తి పొందాడు,

మెసొపొటేమియా యుద్ధంలో ఓట్టోమన్ దళాలు
మెసొపొటేమియన్ యుద్ధం, 1917 సందర్భంగా కవాతులో బ్రిటిషు దళాలు

1918 ప్రారంభంలో, 1918 మార్చి, ఏప్రిల్ లలో బ్రిటిషు సామ్రాజ్య దళాలు మొదటి ట్రాన్స్‌జోర్డాన్, రెండవ ట్రాన్స్‌జోర్డాన్ దాడుల తరువాత, రంగం విస్తరించింది. జోర్డాన్ లోయను ఆక్రమించుకున్నారు..[153] మార్చిలో, వసంతకాలపు దాడి పర్యవసానంగా ఈజిప్టు సాహస దళానికి చెందిన బ్రిటిషు పదాతిదళం, యోమనరీ అశ్వికదళాన్ని పశ్చిమ రంగానికి పంపారు. వాటి స్థానంలో భారత సినిక దళాలు వచ్చాయి. వేసవిలో పునర్వ్యవస్థీకరణ, శిక్షణ పొందుతూండగా, ఓట్టోమన్ విభాగాలపై అనేక దాడులు చేసారు. దాడికి సన్నాహకంగా కొత్తగా వచ్చిన భారత పదాతిదళం శీతోష్ణస్థితికి అలవాటు పడటానికి, ఎంటెంటెకు మరింత అనుకూలమైన స్థానాల్లోకి చేరటానికి, ఫ్రంటును ఉత్తరం వైపుకు జరపడానికీ ఈ దాడులు పనికొచ్చాయి.. సెప్టెంబరు మధ్యనాటికి, ఇంటిగ్రేటెడ్ ఫోర్స్ పెద్ద ఎత్తున కార్యకలాపాలకు సిద్ధంగా ఉంది.

పునర్వ్యవస్థీకరించబడిన ఈజిప్షియన్ ఎక్స్‌పెడిషనరీ ఫోర్స్, అదనపు మౌంటెడ్ డివిజన్‌తో కలిసి, సెప్టెంబరు 1918 లో మెగిద్దో యుద్ధంలో ఓట్టోమన్ దళాలను విచ్ఛిన్నం చేసింది. బ్రిటిషు, భారతీయ పదాతిదళాలు, ఓట్టోమన్ సైన్యపు ముందు వరుసను విచ్ఛిన్నం చేసి శతువు ప్రధాన కాఅర్యాలయాలను స్వాధీనం చేసుకున్నారు. ఎడారి ఆశ్వికదళం, శత్రువు ముందు వరుసలోని ఖాళీ గుండా చొచ్చుకుపోయింది. నిరంతరంగా దాడులు చేస్తూ, అనేక స్థావరాలను ఆకమించుకున్నారు. అక్టోబరు చివరలో ముద్రోస్సం కాల్పుల విరమణ ఒప్పందంపై సంతకాలు చేసాక ఓట్టోమన్ సామ్రాజ్యంతో యుద్ధం ముగిసింది.

1917 ఆగస్టు 15: పోప్ శాంతి ప్రతిపాదన[మార్చు]

1917 ఆగష్టు 15 న లేదా దానికి కొద్దిగా ముందు పోప్ బెనెడిక్ట్ XV ఒక శాంతి ప్రతిపాదన చేసాడు[154] :

  • ఆక్రమణలు ఉండకూడదు
  • బెల్జియం, ఫ్రాన్స్, సెర్బియాలోని కొన్ని ప్రాంతాలలో జరిగిన తీవ్రమైన యుద్ధ నష్టాన్ని భర్తీ చేయడం మినహా వేరే నష్టపరిహారం లేదు
  • అల్సాస్-లోరైన్, ట్రెంటినో, ట్రీస్టే సమస్యలకు పరిష్కారం
  • పోలాండ్ రాజ్య పునరుద్ధరణ
  • బెల్జియం, ఫ్రాన్స్ నుండి జర్మనీ వైదొలగాలి
  • జర్మనీ విదేశీ వలస రాజ్యాలను జర్మనీకి తిరిగి ఇచ్చెయ్యాలి
  • సాధారణ నిరాయుధీకరణ
  • దేశాల మధ్య భవిష్యత్ వివాదాలను పరిష్కరించడానికి మధ్యవర్తిత్వ సుప్రీంకోర్టు
  • సముద్రాలపై స్వేచ్ఛ
  • ప్రతీకార ఆర్థిక సంఘర్షణలన్నింటినీ రద్దు చెయ్యాలి
  • నష్టపరిహారం అడగడంలో అర్థం లేదు, ఎందుకంటే నష్టం అందరికీ జరిగింది


యునైటెడ్ స్టేట్స్ ప్రవేశం[మార్చు]

యుద్ధం ప్రారంభమైనప్పుడు, యునైటెడ్ స్టేట్స్ అందులో జోక్యం చేసుకోని విధానాన్ని అనుసరించింది. శాంతి స్థాపనకు చేసే ప్రయత్నాంలో ఘర్షణను నివారించాలనుకుంది. 1915 మే 7 న జర్మన్ U- బోట్ U-20 బ్రిటిష్ ప్రయాణీకుల ఓడ RMS లూసిటానియాను ముంచివేసినప్పుడు చనిపోయిన వారిలో 128 మంది అమెరికన్లు ఉన్నారు. అధ్యక్షుడు వుడ్రో విల్సన్ యుద్ధం లోకి దిగరాదని నిర్ణయించాడు. ఈ సందర్భంగా అతడు చేసిన "టూ ప్రౌడ్ టు ఫైట్" అనే అతడి వ్యాఖ్య చాలా ప్రసిద్ధం. కాని ప్రయాణీకుల నౌకలపై దాడులను ఆపాలని డిమాండ్ చేశారు. జర్మనీ దానికి ఒప్పుకుని కట్టుబడింది. విల్సన్ యుద్ధానికి పరిష్కారం సాధించేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. అయితే, అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘిస్తున్న, జర్మనీ అనియంత్రిత జలాంతర్గామి యుద్ధాన్ని అమెరికా సహించదని ఆయన పదేపదే హెచ్చరించాడు. మాజీ అధ్యక్షుడు థియోడర్ రూజ్‌వెల్ట్ జర్మనీ చర్యలను "పైరసీ" అని ఖండించాడు. [155] 1916 ఎన్నికల్లో "అతను మనల్ని యుద్ధానికి దూరంగా ఉంచాడు" అనే నినాదంతో ప్రచారం చేసిన వుడ్రో విల్సన్ తిరిగి ఎన్నికయ్యాడు.[156][157][158]

అధ్యక్షుడు విల్సన్ అమెరికా కాంగ్రెస్ లో, 1917 ఫిబ్రవరి 3 న జర్మనీతో అధికారిక సంబంధాలు తెగిపోతున్నట్లు ప్రకటించారు

1917 జనవరిలో, బ్రిటన్‌కు సరఫరాలను అడ్డగించి, ఆకలితో అలమటించేలా చేసి లొంగదీసుకోవాలనే ఆశతో, అనియంత్రిత జలాంతర్గామి యుద్ధాన్ని తిరిగి ప్రారంభించాలని జర్మనీ నిర్ణయించింది. ఇలా చేస్తే అమెరికా యుద్ధం లోకి దిగుతుందని తెలిసీ జర్మనీ ఈ చర్య చేపట్టింది. జర్మనీ విదేశాంగ మంత్రి జిమ్మర్‌మాన్, అమెరికాకు వ్యతిరేకంగా జర్మనీ మిత్రదేశంగా మెక్సికోను యుద్ధంలో పాల్గొనమని టెలిగ్రామ్‌ ద్వారా ఆహ్వానించాడు. దీనికి ప్రతిగా, జర్మన్లు మెక్సికో యుద్ధానికి ఆర్థిక సహాయం చేస్తారు. టెక్సాస్, న్యూ మెక్సికో, అరిజోనా భూభాగాలను అమెరిక నుండి తిరిగి సాధించటానికి సహాయం చేస్తారు. అని ఈ టెలిగ్రామ్‌లో రాసాడు. [159] యునైటెడ్ కింగ్‌డమ్ ఈ సందేశాన్ని అడ్డగించి UK లోని అమెరికా రాయబార కార్యాలయానికి సమర్పించింది. అక్కడి నుండి అది వుడ్రో విల్సన్‌కు చేరింది. అతడు జిమ్మెర్మాన్ నోట్‌ను ప్రజలకు విడుదల చేసాడు. అమెరికన్లు దీనిని యుద్ధంలో దిగడానికి సరైన కారణంగా (కాసస్ బెల్లి) చూశారు. ఈ యుద్ధాఅన్ని గెలిచి, సైనిక వాదాన్ని ప్రపంచం నుండి తొలగించాలని, తద్వారా ఇకపై యుద్ధమనేదే లేకుండా చేయాలనీ విల్సన్ యుద్ధ వ్యతిరేక సంస్థలకు, వ్యక్తులకూ పిలుపునిచ్చారు. యుద్ధం ఎంత ముఖ్యమైనదంటే, శాంతి సమావేశంలో అమెరికా స్వరం వినిపించాల్సినంత అని ఆయన వాదించాడు.[160] జర్మనీ జలాంతర్గాములు ఏడు అమెరికా వాణిజ్య నౌకలను ముంచేసిన తరువాత, జిమ్మెర్మాన్ టెలిగ్రామ్‌ను ప్రచురించిన తరువాత, 1917 ఏప్రిల్ 2 న విల్సన్ జర్మనీపై యుద్ధానికి పిలుపునిచ్చాడు.[161] 4 రోజుల తరువాత అమెరికా కాంగ్రెస్ యుద్ధ ప్రకటన చేసింది.

అధికారికంగా అమెరికాకు మిత్రరాజ్యాల్లో సభ్యత్వం ఎప్పుడూ లేదు. కానీ తాను "అసోసియేటెడ్ పవర్" నని స్వయంగా తానే చెప్పుకుంది. అమెరికాకు చిన్నపాటి సైన్యమే ఉండేది, కానీ, సెలెక్టివ్ సర్వీస్ యాక్ట్ ను ఆమోదించిన తరువాత, 28 లక్షల మంది సైనికులను చేర్చుకుంది.[10] 1918 వేసవి నాటికి, ప్రతిరోజూ 10,000 మంది కొత్త సైనికులను ఫ్రాన్స్‌కు పంపుతోంది. 1917 లో, అమెరికా కాంగ్రెస్ ప్యూర్టోరికన్లకు అమెరికా పౌరసత్వాన్ని మంజూరు చేసింది. దీంతో వారు ప్రపంచ యుద్ధంలో పాల్గొనడానికి వీలైంది. అమెరికన్ దళాలు వచ్చి బలోపేతం చేయక ముందే బ్రిటిష్, ఫ్రెంచి దళాలను ఓడించగలమని జర్మన్ జనరల్ స్టాఫ్ వేసిన అంచనాలు తప్పని తేలాయి.[162]

యునైటెడ్ స్టేట్స్ నావికాదళం, ఒక యుద్ధనౌక సమూహాన్ని బ్రిటిష్ గ్రాండ్ ఫ్లీట్‌తో చేరడానికి స్కాపా ఫ్లోకు పంపింది. డిస్ట్రాయర్లను ఐర్లాండ్ లోని క్వీన్స్‌టౌన్ కు పంపింది. రవాణా నౌకల కాంవాఅయిలకు కాపలాగా ఉండేందుకు జలాంతర్గాములను పంపింది. యుఎస్ మెరైన్స్ యొక్క అనేక రెజిమెంట్లను కూడా ఫ్రాన్సుకు పంపించింది. బ్రిటిషు, ఫ్రెంచి వారు ఇప్పటికే యుద్ధంలో మునిగి ఉన్న తమ యూనిట్లను బలోపేతం చేయడానికి అమెరికా సైనికులను నియోగించాలని కోరారు. అమెరికన్ ఎక్స్‌పెడిషనరీ ఫోర్సెస్ (AEF) కమాండర్ జనరల్ జాన్ జె. పెర్షింగ్, తమ సైనికులను ఫిల్లర్ మెటీరియల్‌గా ఉపయోగించటానికి, ఆ విధంగా అమెరికన్ యూనిట్లను విచ్ఛిన్నం చేయడానికీ నిరాకరించాడు. అయితే, అతను ఆఫ్రికన్-అమెరికన్ పోరాట రెజిమెంట్లను ఫ్రెంచి విభాగాలలో ఉపయోగించడానికి మాత్రం మినహాయింపు నిచ్చాడు. హార్లెం హెల్ ఫైటర్స్, ఫ్రెంచి 16 వ డివిజన్‌లో భాగంగా పోరాడారు. చాటేయు-థియరీ, బెల్లీ వుడ్, సెచాల్ట్ వద్ద వారి చేసిన యుద్ధానికి గాను, వారి యూనిట్‌కు క్రోయిక్స్ డి గుయెర్ అనే పతకాన్ని సంపాదించారు.[10] ముఖాముఖి దాడులు చెయ్యాలనేది AEF సిద్ధాంతం. దానివలన చాలా ప్రాణ నష్టం కలగడం వలన బ్రిటిష్, ఫ్రెంచి కమాండర్లు చాన్నాళ్ళుగా ఆ వ్యూహాన్ని అనుసరించడం లేదు. [163]

1917 నవంబరు 5 న డల్లెన్స్ సమావేశంలో మిత్రరాజ్యాల దళాల సుప్రీం వార్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసారు. సుప్రీం కమాండరుగా జనరల్ ఫోచ్‌ను నియమించారు. హేగ్, పెటైన్, పెర్షింగ్‌లకు తమతమ సైన్యాలపై ఉన్న వ్యూహాత్మక నియంత్రణ అలాగే కొనసాగుతుంది. ఫోచ్ కి నిర్దేశక పాత్ర కాకుండా సమన్వయ పాత్ర మాత్రమే ఉంటుంది. బ్రిటిష్, ఫ్రెంచి, యుఎస్ దళాలు ఎక్కువగా స్వతంత్రంగానే పనిచేస్తాయి. అమెరికన్ దళాలను వ్యక్తిగత ప్రత్యామ్నాయంగా ఉపయోగించమని జనరల్ ఫోచ్ ఒత్తిడి చేశాడు. అయితే పెర్షింగ్ అమెరికన్ యూనిట్లన్నీ స్వతంత్ర బలంగానే ఉండాలని పట్టుబట్టాడు. క్షీణించిన ఫ్రెంచి, బ్రిటిష్ సామ్రాజ్యం దళాలను బలోపేతం చేసేందుకు 1918 మార్చి 28 న అమెరికా యూనిట్లను కేటాయించారు.

జర్మనీ వారి వసంత కాలపు దాడి 1918[మార్చు]

జనరల్ గౌరాడ్ ఆధ్వర్యంలోని ఫ్రెంచి సైనికులు, 1918 లో మార్నే సమీపంలో కేథడ్రల్ శిధిలాల మధ్య మెషిన్ గన్లతో

పశ్చిమ రంగంలో 1918 లో తలపెట్టిన దాడి కోసం లుడెండోర్ఫ్ ప్రణాళికలు (ఆపరేషన్ మైఖేల్ అనే సంకేతనామంతో) రూపొందించాడు. కుయుక్తులతో బ్రిటిష్, ఫ్రెంచి దళాలను విడదీస్తూ, ముందుకు పోవడం ఈ దాడి వ్యూహంలో విశేషం. పెద్దయెత్తున అమెరికా దళాలు రాకముందే యుద్ధాన్ని ముగించాలని జర్మనీ నాయకత్వం భావించింది. సెయింట్-క్వెంటిన్ సమీపంలో బ్రిటిష్ దళాలపై 1918 మార్చి 21 న ఈ ఆపరేషను మొదలైంది. జర్మనీ దళాలు అపూర్వంగా 60 కి.మీ. ముందుకు చొచ్చుకెళ్ళాయి. [164]

జర్మనీ దళాలు ఓ కొత్త వ్యూహాన్ని ఉపయోగించి బ్రిటిషు, ఫ్రెంచి దళాల కందకాలను ఛేదించి, చొచ్చుకుపోయాయి, వీటిని జనరల్ ఓస్కర్ వాన్ హుటియర్ పేరుతో హుటియర్ వ్యూహాలు అని పిలుస్తారు. ప్రత్యేకంగా శిక్షణ పొందిన స్టార్మ్‌ట్రూపర్లు ఇందులో పాల్గొన్నారు. గతంలో, సుదీర్ఘకాలం పాటు ఫిరంగి దాడులు, సామూహిక దాడులూ జరుగుతూండేవి. అయితే, 1918 నాటి ఈ వసంత కాలపు దాడిలో, లుడెండోర్ఫ్ ఫిరంగులను పెద్దగా వాడలేదు. బ్రిటిషు, ఫ్రెంచి కందకాలు బలహీనంగా ఉన్న ప్రదేశాలలో జర్మనీ పదాతిదళంలోని చిన్న సమూహాలు చొచ్చుకుపోయ్యేవి. వారు గట్టి ప్రతిఘటన ఉంటుంది అనుకున్న ప్రదేశాలను తప్పించుకుని వెళ్తూ కమాండ్, లాజిస్టిక్స్ ప్రాంతాలపై దాడి చేసేవారు. ఆ తరువాత సాయుధ పదాతిదళం మరింత భారీగా విరుచుకుపడి ఈ వివిక్త స్థానాలను నాశనం చేసింది. ఈ పద్ధతిలో విజయం పొందడం జర్మనీ బ్రిటిషు, ఫ్రెంచి దళాలకు కలిగించే ఆశ్చర్యంపై ఆధారపడి ఉండేది. [165]

1918 ఏప్రిల్ 10 న ఎస్టేర్స్ యుద్ధంలో కన్నీటి వాయువుతో కళ్ళుమూసుకున్న బ్రిటిష్ 55 వ డివిజన్ సైనికులు

యుద్ధ క్షేత్రం ముందుకు కదిలి పారిస్ కు 120 కి.మీ. దూరం లోకి చేరింది. మూడు భారీ క్రుప్ రైల్వే గన్నులతో పారిస్ నగరంపై 183 గుండ్లు పేల్చారు. చాలా మంది పారిసియన్లు పారిపోయారు. ఈ తొలి దాడి ఎంత విజయవంతమైందంటే, కైజర్ విల్హెల్మ్ II మార్చి 24 ను జాతీయ సెలవు దినంగా ప్రకటించాడు కూడా. విజయం దగ్గర పడిందని చాలామంది జర్మన్లు భావించారు. అయితే, భారీ పోరాటం తరువాత, దాడి ఆగిపోయింది. ట్యాంకులు లేదా మోటరైజ్డ్ ఫిరంగులు లేకపోవడంతో, జర్మన్లు తమ విజయాలను నిలబెట్టుకోలేకపోయారు. యుద్ధ క్షేత్రం పురోగమించడంతో జర్మనీ దళాలకు సరఫరాల్లో కష్టాలు ఎక్కువయ్యాయి. దూరాలు పెరిగాయి. అంతకుముందు యుద్ధం జరిగిన ప్రాంతాల్లో గుండు దెబ్బలు తిన్న దారుల్లో ట్రాఫిక్‌కు అడ్డంకులు ఎదురై వాహనాలు సరిగ్గా కదిలేవి కావు. [166]

ఆపరేషన్ మైఖేల్ తరువాత, జర్మనీ ఉత్తర ఇంగ్లీష్ ఛానల్ రేవులు లక్ష్యంగా ఆపరేషన్ జార్జెట్‌ ప్రారంభించింది. తొలుత జర్మనీ పరిమిత ప్రాదేశిక లాభాలు పొందింది. కానీ, తరువాత మిత్రరాజ్యాలు జర్మనీని నిలిపివేసాయి. దక్షిణాన జర్మన్ సైన్యం ఆపరేషన్ బ్లూచర్, ఆపరేషన్ యార్క్‌లను మొదలుపెట్టి, పారిస్ వైపుకు కదిలింది. రీమ్స్‌ను చుట్టుముట్టే ప్రయత్నంలో జర్మనీ జూలై 15 న ఆపరేషన్ మార్నే (రెండవ మార్నేయుద్ధం) ను ప్రారంభించింది. దీనికి ప్రతిగా మిత్ర రాజ్యాలు చేసిన ఎదురుదాడే, వంద రోజుల దాడి (హండ్రెడ్ డేస్ అఫెన్సివ్). ఈ యుద్ధంలో మొట్టమొదటి విజయవంతమైన మిత్రరాజ్యాల దాడి. జూలై 20 నాటికి, జర్మన్లు మార్నే మీదుగా వెనక్కి, తమ తొలి స్థానాల్లోకి తగ్గారు. [167] మొత్తమ్మీద ఈ దాడిలో జర్మన్లు సాధించింది పెద్దగా ఏమీ లేదు. ఆ తరువాత ఎన్నడూ వారు ముందంజ వెయ్యలేదు. 1918 మార్చి, ఏప్రిల్ లలో జర్మనీ సైనికులు 2,70,000 మంది మరణించారు. ఇందులో మంచి శిక్షణ పొందిన స్టార్మ్‌ట్రూపర్ సైనికులు కూడా చాలామందే ఉన్నారు.

ఇదిలాఉండగా, జర్మనీ స్వదేశంలో గడ్డుకాలాన్ని ఎదుర్కొంటోంది. యుద్ధ వ్యతిరేక ప్రదర్శనలు తరచూ జరుగుతున్నాయి. సైన్యంలో ధైర్యం పడిపోయింది. పారిశ్రామిక ఉత్పత్తి 1913 స్థాయిలో సగానికి పడిపోయింది.

కొత్త దేశాలు యుద్ధంలోకి ప్రవేశించాయి[మార్చు]

1918 వసంత కాలపు చివరిలో, దక్షిణ కాకసస్‌లో మూడు కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి: ఫస్ట్ రిపబ్లిక్ ఆఫ్ అర్మేనియా, అజర్‌బైజాన్ డెమోక్రటిక్ రిపబ్లిక్, డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ జార్జియా. ఈ మూడూ రష్యన్ సామ్రాజ్యం నుండి తమ స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకున్నాయి. సెంట్రోకాస్పియన్ డిక్టేటర్షిప్ (1918 శరదృతువులో అజర్‌బైజాన్ దీన్ని నాశనం చేసింది), సౌత్ వెస్ట్ కాకేసియన్ రిపబ్లిక్ (1919 ప్రారంభంలో ఉమ్మడి అర్మేనియన్-బ్రిటిష్ టాస్క్‌ఫోర్స్ నాశనం చేసింది) అనే రెండు చిన్న దేశాలు కూడా ఏర్పడ్డాయి. 1917-18 శీతాకాలంలో కాకసస్ ఫ్రంట్ నుండి రష్యన్ సైన్యాలు ఉపసంహరించుకోవడంతో, మూడు ప్రధాన రిపబ్లిక్కులు 1918 తొలి నెలల్లో మొదలైన ఉస్మానియా దాడికోసం సిద్ధపడి ఉన్నాయి. ఈ మూడు దేశాలు 1918 వసంతకాలంలో ట్రాన్స్‌కాకేసియన్ ఫెడరేటివ్ రిపబ్లిక్ గా ఏర్పడ్డాయి.అయితే ఇది మే లోనే ఇచ్ఛిన్నమై పోయింది. జార్జియన్లు జర్మనీ నుండి రక్షణ కోరడం, అజర్‌బైజానీలు ఉస్మానియా సామ్రాజ్యంతో సైనిక ఒప్పందం కుదుర్చుకోవడం లతో ఈ ట్రాన్స్‌కాకేసియన్ ఫెడరేటివ్ రిపబ్లిక్ మూణ్ణాళ్ళ ముచ్చటే అయింది. ఇక ఆర్మేనియా ఒంటరిగా ఉస్మానియా సామ్రాజ్యపు దాడిని ఎదుర్కోవాల్సి వచ్చింది. సర్దారాబాద్ యుద్ధంలో అర్మేనియా తనను తాను రక్షించుకోవడానికి ఐదు నెలల పాటు కష్టపడి, ఉస్మానియా టర్కులను ఓడించింది. [168]


మిత్రరాజ్యాల విజయం: వేసవి 1918 నుండి[మార్చు]

వందరోజుల దాడి[మార్చు]

1918 ఏప్రిల్, నవంబరు మధ్య, మిత్రరాజ్యాలు తమ ముందు వరుస రైఫిల్ బలాన్ని పెంచగా, జర్మన్ బలం సగానికి పడిపోయింది. [169]
వోక్స్-దేవాంట్-డామ్‌లౌప్, ఫ్రాన్స్, 1918 యొక్క శిథిలాల వైమానిక వీక్షణ

హండ్రెడ్ డేస్ అఫెన్సివ్ అని పేరుబడ్డ మిత్రరాజ్యాల ఎదురుదాడి 1918 ఆగస్టు 8 న అమియన్స్ యుద్ధంతో మొద్లైంది. ఈ యుద్ధంలో 400 ట్యాంకులు, 1,20,000 బ్రిటిష్, డొమినియన్, ఫ్రెంచి దళాలు పాల్గొన్నాయి. మొదటి రోజు ముగిసే సమయానికి మిత్రరాజ్యాలు జర్మనీ శ్రేణుల్లో 23 కి.మీ. పొడవైన ఖాళీని చేసారు. జర్మనీ సైనికుల ధైర్యసాహసాలలో గణనీయమైన పతనం కనబడింది. దీనివల్ల లుడెండోర్ఫ్ ఆ రోజును "జర్మన్ సైన్యానికి బ్లాక్ డే"గా పేర్కొన్నాడు.[170] [171][172] క్రమేణా జర్మనీ ప్రతిఘటన దృఢపడింది. ఆగస్టు 12 న ఈ యుద్ధం ముగిసింది.

అమియన్స్ యుద్ధంలో పొందిన తొలి విజయాలను కొనసాగించడానికి బదులుగా, మిత్రరాజ్యాలు తమ దృష్టిని మరోచోటికి మరల్చాయి. ప్రతిఘటన గట్టిపడిన తరువాత దాడిని కొనసాగించడం వలన ప్రాణాల నష్టం తప్ప ప్రయోజనం పెద్దగా ఉందదని మిత్రరాజ్యాల నాయకులు ఇప్పుడు గ్రహించారు. పార్శ్వాలపై సాధించిన విజయవంతమైన పురోగతిని సద్వినియోగం చేసుకోవటానికి వారు త్వరితగతిన దాడులు చేయడం మొదలుపెట్టారు. దాడిలో తొలుత ఉన్న ఊపు తగ్గగానే, దాన్ని అక్కడితో ఆపేసి, మరో దాడిని మొదలుపెట్టేవారు.[173]

దాడి ప్రారంభమైన మరుసటి రోజు, లుడెండోర్ఫ్ ఇలా అన్నాడు: "ఇకపై యుద్ధాన్ని గెలవలేం, కాని ఓడిపోకూడదు కూడా". ఆగస్టు 11 న కైసర్‌కు తన రాజీనామాను పంపాడు, అతను దానిని తిరస్కరిస్తూ, "మనం సమతుల్యతను ఎలా సాధించాలా అని నేను చూస్తున్నాను. మనం ప్రతిఘటించే శక్తి పరిమితికి దాదాపుగా చేరుకున్నాం. ఇక యుద్ధాన్ని ముగించాలి." అన్నాడు. ఆగస్టు 13 న, బెల్జియం లోని స్పా పట్టణంలో హిండెన్‌బర్గ్, లుడెండోర్ఫ్, ఛాన్సలర్, విదేశాంగ మంత్రి హింట్జ్ సమావేశమై యుద్ధాన్ని సైనికపరంగా ముగించలేమని అంగీకారానికి వచ్చారు. మరుసటి రోజు జర్మన్ క్రౌన్ కౌన్సిల్, యుద్ధ క్షేత్రంలో విజయం ఇప్పుడు ఎంతో అసంభావ్యమని నిర్ణయించింది. ఆస్ట్రియా, హంగరీ డిసెంబరు వరకు మాత్రమే యుద్ధాన్ని కొనసాగించగలమని హెచ్చరించాయి. లుడెండోర్ఫ్ వెంటనే శాంతి చర్చలు జరపాలని సిఫారసు చేసాడు. ప్రిన్స్ రుప్రెచ్ట్, ప్రిన్స్ మాక్స్ ఆఫ్ బాడెన్‌ను ఇలా హెచ్చరించాడు: "మా సైనిక పరిస్థితి చాలా వేగంగా క్షీణించింది. ఈ శీతాకాలంలో మనగలమని నేను అనుకోవడం లేదు; ఈ లోపే పెను విపత్తు వచ్చే అవకాశం ఉంది."[174]

ఆల్బర్ట్ యుద్ధం[మార్చు]
కెనడియన్ స్కాటిష్, కెనాల్ డు నార్డ్, 1918 యుద్ధంలో అభివృద్ధి చెందుతోంది

బ్రిటిష్, డొమినియన్ దళాలు ఆగస్టు 21 న ఆల్బర్ట్ యుద్ధంతో తదుపరి దశ పోరాటాన్ని మొదలుపెట్టాయి. [175] ఈ దాడిలో ఫ్రెంచి[174] దళాలు, ఆ తరువాత మరిన్ని బ్రిటిష్ దళాలు చేరాయి. ఆగస్టు చివరి వారంలో 110 కి.మీ. యుద్ధ రేఖ పొడుగునా మిత్రరాజ్యాల ఒత్తిడి భారీగాను, నిర్విరామంగానూ సాగింది. జర్మను వ్యాఖ్యానాల ప్రకారం, "ప్రతిరోజూ పగలంతా శత్రువుపై పోరాటంలో రక్తం పారించడం. రాత్రుళ్ళు వెనక్కి, కొత్త యుద్ధ రేఖల వద్దకు మళ్ళడం, నిద్ర పోకుండా కొత్త రేఖల వద్దకు వెళ్ళడం."[173]

మిత్రరాజ్యాల ఈ పురోగతులను గమనించిన జర్మన్ సుప్రీం ఆర్మీ కమాండ్, సెప్టెంబరు 2 న తన దళాలను దక్షిణాన హిండెన్‌బర్గ్ రేఖ వరకు వెనక్కు తగ్గాలని ఆదేశించింది. [176] లుడెండోర్ఫ్ ప్రకారం, "మేము అవసరాన్ని ఒప్పుకోవాల్సి వచ్చింది... స్కార్ప్ నుండి వెస్లే వరకు మొత్తం యుద్ధ రంగాన్నంతటినీ వదలి వెనక్కి వెళ్ళడం " [177] ఆగస్టు 8 న మొదలైన నాలుగు వారాల పోరాటంలో 1,00,000 మంది జర్మన్ యుద్ధఖైదీలను పట్టుకున్నారు. యుద్ధం ఓడిపోయినట్లేనని గ్రహించిన జర్మన్ హైకమాండ్ సంతృప్తికరమైన ముగింపు కోసం ప్రయత్నాలు చేసింది. సెప్టెంబరు 10 న హిండెన్‌బర్గ్ ఆస్ట్రియా చక్రవర్తి చార్లెస్‌ను శాంతి కోసం కదలాలని కోరాడు. జర్మనీ నెదర్లాండ్స్‌ను మధ్యవర్తిత్వం వహించాలని విజ్ఞప్తి చేసింది. సెప్టెంబరు 14 న ఏదైనా తటస్థ గడ్డపై శాంతి చర్చల కోసం సమావేశమౌదామని ఆస్ట్రియా పోరాటదారులకు, తటస్థులకూ ఒక గమనికను పంపింది, సెప్టెంబరు 15 న జర్మనీ బెల్జియానికి శాంతి ప్రతిపాదన చేసింది. ఈ శాంతి ప్రతిపాదనలు రెంటినీ మిత్రరాజ్యాలు తిరస్కరించాయి,[174]

హిండెన్‌బర్గ్ లైన్‌కు మిత్రరాజ్యాల ముందడుగు[మార్చు]

ఒక అమెరికన్ మేజర్, ముందు వైపు ఒక పరిశీలన బెలూన్, 1918

సెప్టెంబరులో మిత్రరాజ్యాలు ఉత్తర, మధ్య ప్రాంతంలో హిండెన్‌బర్గ్ రేఖ వరకు చేరుకున్నాయి. జర్మన్లు బలమైన రక్షణ చర్యలతో పోరాడుతూనే ఉన్నారు. అనేక ఎదురుదాడులను ప్రారంభించారు, కాని యుద్ధరేఖ స్థానాలు అవుట్‌పోస్టులూ పడిపోతూనే ఉన్నాయి, BEF ఒక్కటే సెప్టెంబరు చివరి వారంలో 30,441 మంది యుద్ధ ఖైదీలను పట్టుకుంది. సెప్టెంబరు 24 న బ్రిటిష్, ఫ్రెంచి వారి దాడి సెయింట్ క్వెంటిన్‌కు 3 కి.మీ. దూరం లోకి వచ్చింది. జర్మన్లు ఇప్పుడు హిండెన్‌బర్గ్ రేఖ వెనక్కి తగ్గారు. అదే రోజు, సుప్రీం ఆర్మీ కమాండ్ బెర్లిన్లోని నాయకులకు కాల్పుల విరమణ చర్చలు అనివార్యమని తెలియజేసింది.[174]

హిండెన్‌బర్గ్ లైన్‌పై తుది దాడి సెప్టెంబరు 26 న ఫ్రెంచి, అమెరికన్ దళాలు ప్రారంభించిన మీయుస్-అర్గోన్ దాడితో మొద్లైఅంది. తరువాతి వారం, బ్లాంక్ మాంట్ రిడ్జ్ యుద్ధంలో షాంపైన్లో ఫ్రెంచి, అమెరికన్ యూనిట్లు విరుచుకుపడ్డాయి. ఎత్తు ప్రాంతాల్లో ఉన్న జర్మన్లను అక్కడి నుండి నుండి బెల్జియన్ సరిహద్దు వైపు తరిమారు. [178] అక్టోబరు 8 న కాంబ్రాయి యుద్ధంలో బ్రిటిష్, డొమినియన్ దళాలు జర్మను శ్రీణిని మళ్ళీ ఛేదించాయి.[179] జర్మనీ సైన్యం జర్మనీకి తిరోగమిస్తూ, తన ముందు భాగాన్ని తగ్గించుకుని, డచ్ సరిహద్దును తిరిగివెళ్ళే సైన్యానికి రక్షణ రేఖగా ఉపయోగించుకుంది.

సెప్టెంబరు 29 న బల్గేరియా విడిగా ఒక కాల్పుల విరమణపై సంతకం చేసినప్పుడు, అప్పటికే నెలల తరబడి తీవ్ర ఒత్తిడికి గురై ఉన్న లుడెండోర్ఫ్, దాదాపు కూలిపోయాడు. జర్మనీ ఇకపై తనను తాను రక్షించుకోవడం కష్టమని స్పష్టమైంది. బాల్కన్ల పతనం అంటే జర్మనీ దాని ప్రధాన చమురు, ఆహార సరఫరాలను కోల్పోబోతున్నట్లే. నిల్వలను ఈ సరికే వాడేసుకుంది. యుఎస్ దళాలు రోజుకు 10,000 చొప్పున చేరుకుంటున్నాయి. [180] [181] [182] యుద్ధ సమయంలో మిత్రరాజ్యాలకు అవసరమైన చమురులో 80% పైచిలుకు అమెరికాయే సరఫరా చేసింది. ఆ విషయంలో కొరతే లేదు. [183]

జర్మన్ విప్లవం 1918-1919[మార్చు]

జర్మన్ విప్లవం, కీల్, 1918

జర్మనీకి సైనిక ఓటమి తప్పదనే వార్తలు జర్మన్ సాయుధ దళాలంతటా వ్యాపించాయి. తిరుగుబాటు భయం ప్రబలంగా ఉంది. జర్మన్ నావికాదళం యొక్క "శౌర్యా"న్ని పునరుద్ధరించడానికి అడ్మిరల్ రీన్హార్డ్ స్కీర్, లుడెండోర్ఫ్ లు చివరి ప్రయత్నం చేయాలని నిర్ణయించుకున్నారు.

1918 అక్టోబరు చివరలో ఉత్తర జర్మనీలో, 1918-1919 జర్మన్ విప్లవం ప్రారంభమైంది. దాదాపుగా ఓడిపోయిన యుద్ధంలో చివరి, పెద్ద ఎత్తున ఆపరేషన్ చేసేందుకు బయలుదేరడానికి జర్మన్ నావికాదళ యూనిట్లు నిరాకరించాయి. దీంతో తిరుగుబాటు రాజుకుంది. విల్హెల్మ్షావెన్, కీల్ నావికాదళ ఓడరేవులలో మొదలైన నావికుల తిరుగుబాటు కొద్ది రోజుల్లోనే దేశమంతటా వ్యాపించింది. 1918 నవంబరు 9 న రిపబ్లిక్ ప్రకటనకు దారితీసింది. ఆ తర్వాత కొద్దికాలానికే కైజర్ విల్హెల్మ్ II ను పదవీ చ్యుతుణ్ణి చేసారు. జర్మనీ లొంగిపోయింది.[10][184][185] [182]

కొత్త జర్మన్ ప్రభుత్వం లొంగిపోయింది[మార్చు]

సైన్యం తప్పిదాలు, కైజర్‌పై క్షీణించిన విశ్వాసం, తద్వారా అతడి పదవీచ్యుతి, అతను దేశం విడిచి పారిపోవడం వగైరాలతో జర్మనీ లొంగిపోయే దిశగా కదిలింది. బాడెన్ యువరాజు మాక్సిమిలియన్ అక్టోబరు 3 న జర్మనీ ఛాన్సలర్‌గా కొత్త ప్రభుత్వ బాధ్యతలు స్వీకరించాడు. మిత్రరాజ్యాలతో చర్చలు జరపడానికి ప్రయత్నించాడు. ముందుగా అధ్యక్షుడు విల్సన్‌తో చర్చలు వెంటనే ప్రారంభమయ్యాయి. అతనైతే బ్రిటిషు, ఫ్రెంచి వారి కంటే మెరుగైన నిబంధనలు పెడతాడనే ది అతడి ఆశ. జర్మనీలో రాజ్యాంగ బద్ధమైన రాచరిక వ్యవస్థ ఉండాలని, జర్మన్ మిలిటరీపై పార్లమెంటరీ నియంత్రణ ఉండాలనీ విల్సన్ డిమాండ్ చేశాడు. [186] నవంబరు 9 న సోషల్ డెమొక్రాట్ ఫిలిప్ స్కీడెమాన్ జర్మనీని రిపబ్లిక్ గా ప్రకటించినప్పుడు ఎటువంటి ప్రతిఘటనా కనబదలేదు. కైజర్‌ను, రాజులను, ఇతర వంశపారంపర్య పాలకులందరినీ అధికారం నుండి తొలగించారు. విల్హెల్మ్ నెదర్లాండ్స్‌ పారిపోయి తలదాచుకున్నాడు. దీంతో రాచరిక జర్మనీ ముగిసి, వీమర్ రిపబ్లిక్ గా కొత్త జర్మనీ అవతరించింది. [187]

కాల్పులవిరమణలు, లొంగుబాట్లు[మార్చు]

విట్టోరియో వెనెటో, 1918 యుద్ధంలో ఇటాలియన్ దళాలు ట్రెంటోకు చేరుకున్నాయి. ఇటలీ విజయం ఇటాలియన్ ఫ్రంట్‌పై యుద్ధం ముగిసినట్లు గుర్తించింది. ఆస్ట్రో-హంగేరియన్ సామ్రాజ్యం రద్దు చేయబడింది.

సెంట్రల్ పవర్ల పతనం వేగంగా జరిగింది.1918 సెప్టెంబరు 29 న బల్గేరియా సంతకం పెట్టిన సాలోనికా ఒప్పందం మొదటి కాల్పులవిరమణ ఒప్పందం[10] జర్మన్ చక్రవర్తి విల్హెల్మ్ II బల్గేరియన్ జార్ ఫెర్డినాండ్ I కు పంపిన టెలిగ్రామ్ లో పరిస్థితిని ఇలా వర్ణించాడు: " సిగ్గుపోయింది! 62,000 మంది సెర్బులు యుద్ధఫలితాన్ని నిర్ణయించారు!".[10] అదే రోజు, యుద్ధంలో జర్మనీ పరిస్థితి నిరాశాజనకంగా ఉందని జర్మన్ సుప్రీం ఆర్మీ కమాండ్ కైజర్ విల్హెల్మ్ II కు, ఇంపీరియల్ ఛాన్సలర్ కౌంట్ జార్జ్ వాన్ హెర్ట్లింగ్‌లకూ సమాచార మిచ్చింది . [188]

దస్త్రం:Regent-Aleksandar-Karadjordjevic-in-liberated-Belgade-1-11-1918.jpg
1918 నవంబరు 1 న బెల్గ్రేడ్‌ను సెర్బియన్ సైన్యం విముక్తి చేసింది
దస్త్రం:Srpski-vojnik-u-zagrljaju-dece-na-Savskom-pristanistu-u-Beogradu.-Snimljeno-1918..jpg
తన పిల్లలతో సెర్బియన్ సైనికుడు: నాలుగు సంవత్సరాల తరువాత

అక్టోబరు 30 న, ఉస్మానియా సామ్రాజ్యం లొంగిపోయింది, ముడ్రోస్ కాల్పుల విరమణ ఒప్పందంపై సంతకం చేసింది.[10]

యుఎస్ 64 వ రెజిమెంట్, 7 వ పదాతిదళ విభాగం, 1918 నవంబరు 11, ఆర్మిస్టిస్ వార్తలను జరుపుకుంటారు

అక్టోబరు 24 న, ఇటాలియన్లు కాపోరెట్టో యుద్ధం తరువాత కోల్పోయిన భూభాగాన్ని తిరిగి వేగంగా స్వాధీనపరచుకున్నారు. ఇది విట్టోరియో వెనెటో పోరుతో ముగిసింది. ఈ పోరుతో ఆస్ట్రో-హంగేరియన్ సైన్యం ఒక పోరాట శక్తిగా ఉన్న గుర్తింపును కోల్పోయింది. ఈ దాడి ఆస్ట్రో-హంగేరియన్ సామ్రాజ్య విచ్ఛిన్నానికి కూడా కారణమైంది. అక్టోబరు చివరి వారంలో, బుడాపెస్ట్, ప్రేగ్, జాగ్రెబ్‌లలో స్వాతంత్ర్య ప్రకటనలు జరిగాయి. అక్టోబరు 29 న, సామ్రాజ్య అధికారులు ఇటలీని కాల్పుల విరమణ కోసం కోరారు, కాని ఇటాలియన్లు మాత్రం ముందుకు కొనసాగి, ట్రెంటో, ఉడిన్, ట్రిస్టేలను పట్టుకున్నారు. నవంబరు 3 న, ఆస్ట్రియా-హంగరీ కాల్పుల విరమణ (ఆర్మిస్టిస్ ఆఫ్ విల్లా గియుస్టి) ను కోరుతూ సంధి జెండాను పంపారు. పారిస్‌లోని మిత్రరాజ్యాల అధికారులతో టెలిగ్రాఫ్ ద్వారా సంప్రదించి ఇటలీ, నిబంధనలను ఆస్ట్రియన్ కమాండర్‌కు తెలియజేసింది. వారు ఆ నిబంధనలను అంగీకరించాక, నవంబరు 3 న పాడువా సమీపంలోని విల్లా గియుస్టిలో ఇటలీ ఆస్ట్రియాలు కాల్పుల విరమణపై సంతకాలు చేసాయి. నవంబరులో హబ్స్బర్గ్ రాచరికం పడగొట్టిన తరువాత ఆస్ట్రియా, హంగరీలు వేర్వేరుగా కాల్పుల విరమణలపై సంతకాలు చేశాయి. తరువాతి రోజుల్లో ఇటాలియన్ సైన్యం 20,000 మంది సైనికులతో ఇన్స్‌బ్రూక్, టైరోల్‌ లను ఆక్రమించింది.[189]

నవంబరు 11 న, ఉదయం 5:00 గంటలకు, కంపైగ్నే వద్ద ఒక రైలు బోగీలో జర్మనీతో ఒక కాల్పుల విరమణ ఒప్పందంపై మిత్రరాజ్యాలు సంతకం చేసాయి. 1918 నవంబరు 11 న - "పదకొండవ నెల పదకొండవ రోజు పదకొండవ గంట"కు - కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. కాల్పుల విరమణ సంతకం పెట్టడానికి, దాని అమలుకూ మధ్య ఉన్న ఆరు గంటలలో, పశ్చిమ రంగంలోని ప్రత్యర్థి సైన్యాలు తమ తమ స్థానాల నుండి వైదొలగడం ప్రారంభించాయి. కాని యుద్ధం ముగిసేలోపు కమాండర్లు తగినంత భూభాగాన్ని స్వాధీనం చేసుకోవాలనుకున్నందున, పోరాటం అనేక ప్రాంతాలలో కొనసాగింది. రైన్‌ల్యాండ్ ఆక్రమణ కాల్పుల విరమణ తరువాతనే జరిగింది. ఆక్రమించిన సైన్యాల్లో అమెరికన్, బెల్జియన్, బ్రిటిష్, ఫ్రెంచి దళాలున్నాయి.

ఫెర్డినాండ్ ఫోచ్, కుడి నుండి రెండు. కాంపిగ్నేలోని రైలు బోగీ వెలుపల చిత్రీకరించబడింది, అక్కడ యుద్ధాన్ని ముగించిన కాల్పుల విరమణఒప్పందం కుదిరింది. ఈ క్యారేజీని తరువాత నాజీ జర్మనీ పెటైన్ యొక్క 1940 జూన్ నాటి కాల్పుల విరమణకు ప్రతీకగా ఎంచుకుంది.[190]

1918 నవంబరులో, జర్మనీపై దండయాత్ర చేయడానికి, జర్మనీని ఆక్రమించడానికీ అవసరమైన సైన్యం, సామగ్రీ మిత్రరాజ్యాల వద్ద సరిపడినంత ఉన్నాయి. కాల్పుల విరమణ సమయంలో, మిత్రరాజ్యాల దళాలు జర్మన్ సరిహద్దును దాటలేదు. పశ్చిమ యుద్ధ రేఖ బెర్లిన్ నుండి ఇంకా 720 కి.మీ. దూరం లోనే ఉన్నాయి. కైజర్ సైన్యాలు యుద్ధభూమి నుండి ఏ ఇబ్బందీ లేకుండా వెనక్కి వెళ్ళాయి. దీంతో హిండెన్‌బర్గ్, ఇతర సీనియర్ జర్మన్ నాయకులు తమ సైన్యాలు నిజంగా ఓడలేదనే కథను వ్యాప్తి చేయడానికి వీలు కలిగింది. వెన్నుపోటు కథ చెప్పడానికి కుదిరింది, [191] [192] జర్మనీ ఓటమికి పోరాటం కొనసాగించలేకపోవడం కారణం కాదనీ (1918 ఫ్లూ మహమ్మారితో పది లక్షల మంది సైనికులు బాధపడుతూ ఉన్నారు, వాళ్ళు పోరాడటానికి పనికిరారు), దేశం ఇచ్చిన "దేశభక్తి పిలుపు"కు యూదులు, సోషలిస్టులు, బోల్షెవిక్‌లూ ప్రతిస్పందించక పోవడమే కారణమనీ చెప్పారు

యుద్ధానికి ఇంకా ఖర్చు పెట్టగలిగే స్తోమత మిత్రరాజ్యాలకు ఉంది. ఒక అంచనా ప్రకారం (1913 నాటి US డాలరు విలువలో) మిత్రరాజ్యాలు $ 5800 కోట్లు ఖర్చు చేశాయి. సెంట్రల్ పవర్స్ కేవలం 2500 కోట్ల డాలర్లే ఖర్చుపెట్టాయి. మిత్రరాజ్యాలలో, బ్రిటను $ 2100 కోట్లు, అమెరికా $ 1700 కోట్లు ఖర్చుపెట్టగా, సెంట్రల్ పవర్స్‌లో జర్మనీ ఒక్కటే $ 2000 కోట్లు ఖర్చు చేసింది.[193]

యుద్ధానంతర పరిణామాలు[మార్చు]

యుద్ధం తరువాత, నాలుగు సామ్రాజ్యాలు కనుమరుగయ్యాయి: జర్మన్, ఆస్ట్రో-హంగేరియన్, ఉస్మానియా, రష్యన్. అనేక దేశాలు తమ పూర్వ స్వాతంత్ర్యాన్ని తిరిగి పొందాయి. క్రొత్త దేశాలు రూపుదిద్దుకున్నాయి. నాలుగు రాజవంశాలు, వారి సహాయక కులీనులతో కలిసి, యుద్ధం ఫలితంగా పడిపోయాయి: రోమనోవ్స్, హోహెన్జోల్లెర్న్స్, హబ్స్బర్గ్స్, ఉస్మానియులు. బెల్జియం, సెర్బియా, ఫ్రాన్సులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ దేశాల్లో 14 లక్షల మంది సైనికులు చనిపోయారు.[194] ఇతర ప్రాణనష్టాలు ఇందులో లేదు. జర్మనీ, రష్యాల్లో కూడా నష్టాలు సుమారుగా ఈ స్థాయి లోనే ఉన్నాయి.[195]

అధికారిక ముగింపు తేదీలు[మార్చు]

100,187 మంది సైనికుల సమాధులున్న ఇటాలియన్ రెడిపుగ్లియా వార్ మెమోరియల్
130,000 మందికి పైగా తెలియని సైనికుల సమాధులు ఉన్న డౌమాంట్ ఓసూరీ వద్ద ఉన్న ఫ్రెంచి సైనిక శ్మశానవాటిక

1919 జూన్ 28 న జర్మనీతో వెర్సెయిల్‌స్ ఒప్పందం కుదుర్చుకునే వరకు ఇరుపక్షాల మధ్య అధికారికంగా యుద్ధం ముగియలేదు. అది మరో ఏడు నెలల పాటు కొనసాగింది. యునైటెడ్ స్టేట్స్ సెనేట్ ఈ ఒప్పందానికి ప్రజల మద్దతు ఉన్నప్పటికీ దానిని ఆమోదించలేదు,[196][197] 1921 జూలై 2 న నాక్స్-పోర్టర్ తీర్మానంపై అధ్యక్షుడు వారెన్ జి. హార్డింగ్ సంతకం చేసే వరకు యుద్ధాన్ని అధికారికంగా ముగించలేదు.[198] యునైటెడ్ కింగ్‌డమ్, బ్రిటిష్ సామ్రాజ్యానికి సంబంధించినంత వరకు వారి చట్టాల ప్రకారం యుద్ధాల అధికారిక ముగింపు తేదీలు ఇవి:

  • 1920 జనవరి 10 న జర్మనీ[199]
  • 1920 జూలై 16 న ఆస్ట్రియా[200]
  • 1920 ఆగస్టు 9 న బల్గేరియా[201]
  • 1921 జూలై 26 న హంగరీ[202]
  • 1924 ఆగస్టు 6 న టర్కీ[203]

వెర్సెయిల్‌స్ ఒప్పందం తరువాత, ఆస్ట్రియా, హంగరీ, బల్గేరియా, ఉస్మానియా సామ్రాజ్యంతో కూడా ఒప్పందాలు కుదిరాయి. అయితే, ఉస్మానియా సామ్రాజ్యంతో ఒప్పందం కోసం చర్చలు జరుగుతూండగా దేశంలో కల్లోలాలు రేగాయి. ఆ తర్వాత ఆ దేశం రిపబ్లిక్ ఆఫ్ టర్కీగా మారిన తరువాత, ఆ దేశంతో 1923 జూలై 24 న లాసాన్ వద్ద సంతకం చేసారు.

1919 లో వెర్సెయిల్‌స్ ఒప్పందం కుదుర్చుకున్న తేదీని యుద్ధం ముగిసిన తేదీగా కొన్ని యుద్ధ స్మారకాలు పరిగణించాయి. ఈ ఒప్పందం తరువాత విదేశాలలో పనిచేస్తున్న అనేక మంది సైనికులు చివరకు స్వదేశానికి తిరిగి వచ్చారు. దీనికి విరుద్ధంగా, యుద్ధానికి సంబంధించిన చాలా స్మారకాలు 1918 నవంబరు 11 నాటి కాల్పుల విరమణను యుద్ధం ముగింపు తేదీగా పరిగణిస్తున్నాయి. చట్టబద్ధంగా, లాసాన్ ఒప్పందం సంతకం చేసే వరకు అధికారికంగా శాంతి ఒప్పందాలు పూర్తి కాలేదు. దాని నిబంధనల ప్రకారం, మిత్రరాజ్యాల దళాలు 1923 ఆగస్టు 23 న కాన్స్టాంటినోపుల్ నుండి బయలుదేరాయి.

శాంతి ఒప్పందాలు, జాతీయ సరిహద్దులు[మార్చు]

గ్రీకు ప్రధాన మంత్రి ఎలిఫ్తీరియోస్ వెనిజెలోస్ సావ్రేస్ ఒప్పందంపై సంతకం చేశారు

యుద్ధం తరువాత, పారిస్ శాంతి సమావేశం అధికారికంగా యుద్ధాన్ని ముగిస్తూ సెంట్రల్ పవర్స్ పై అనేక శాంతి ఒప్పందాలను విధించింది. 1919 లో వేర్సైల్లెస్ ఒప్పందం జర్మనీకి సంబంధించింది. విల్సన్ చేర్చిన 14 వ పాయింట్ మీద ఆధారపడి, 1919 జూన్ 28,న నానాజాతి సమితి అవతరించింది. [204] [205]

"దురాక్రమణ కారణంగా మిత్రరాజ్యాలు, వాటి అనుబంధ ప్రభుత్వాలు, వారి జాతీయులు అనుభవించిన నష్టాలకు, నాశనానికీ బాధ్యత తమదేనని సెంట్రల్ పవర్స్ అంగీకరించాలి. వెర్సైల్లెస్ ఒప్పందంలో, ఈ ప్రకటన అధికరణం 231 గా ఉంది. దీనికి యుద్ధ అపరాధ నిబంధన అని పేరువచ్చింది. ఎందుకంటే ఎక్కువ మంది జర్మన్లు దీన్ని అవమానంగా భావించి ఆగ్రహించారు. మొత్తంమీద ఈ "వెర్సైల్లెస్ నిరంకుశాదేశం" తమ పట్ల అన్యాయంగా వ్యవహరించిందని జర్మన్లు భావించారు. జర్మనీ చరిత్రకారుడు హగెన్ షుల్జ్ ఈ ఒప్పందంతో జర్మనీ "చట్టపరమైన ఆంక్షలు అనుభవించింది, సైనిక శక్తిని కోల్పోయింది, ఆర్థికంగా నాశనమైంది, రాజకీయంగా అవమానానికి గురయింది" అని అన్నారు.[206] బెల్జియం చరిత్రకారుడు లారెన్స్ వాన్ యిపెర్సెల్ 1920 - 1930 లలో జర్మన్ రాజకీయాల్లో ఈ యుద్ధమూ, వెర్సైల్లెస్ ఒప్పందమూ పోషించిన పాత్రను నొక్కిచెప్పారు:

జర్మనీలో యుద్ధ అపరాధాన్ని చురుకుగా తిరస్కరించడం, నష్టపరిహారం, రైన్‌ల్యాండ్‌ను మిత్రరాజ్యాలు ఇంకా ఆక్రమించుకునే ఉండడం ఉండేకొద్దీ సమస్యగా మారాయి. " వెన్నుపోటు" కథ, "వెర్సైల్లెస్ నిరంకుశాదేశా" న్ని సవరించాలనే కోరిక, ఒక జాతిగా జర్మనీని నిర్మూలించాలనే అంతర్జాతీయ కుట్ర జరుగుతోందనే నమ్మకం, జర్మనీ రాజకీయాలకు కేంద్ర బిందువయ్యాయి. గుస్తావ్ స్ట్రీస్మాన్ వంటి శాంతి కాముకులు కూడా జర్మన్ అపరాధాన్ని బహిరంగంగా తిరస్కరించాడు. నాజీల విషయానికొస్తే, ప్రతీకారం తీర్చుకునే దిశగా జర్మన్ జాతిని రెచ్చగొడుతూ దేశద్రోహం, అంతర్జాతీయ కుట్ర అనే జండాలు ఎగరేసారు. ఫాసిస్ట్ ఇటలీ వలె, నాజీ జర్మనీ యుద్ధ జ్ఞాపకాలను తన స్వంత ప్రయోజనాలకు మళ్ళించటానికి ప్రయత్నించింది.[207]

1919 జూన్ 28 న హాల్ ఆఫ్ మిర్రర్స్, వెర్సైల్లెస్ లో వెర్సైల్లెస్ ఒప్పందంపై సంతకం. సర్ విలియం ఓర్పెన్ చిత్రం.

ఇదిలా ఉండగా, జర్మన్ పాలన నుండి విముక్తి పొందిన కొత్త దేశాలు, చిన్న దేశాలపై పెద్దవి చేసిన తప్పులకు గుర్తింపే ఈ ఒప్పందమని భావించాయి.[208] పౌరులకు జరిగిన అన్ని నష్టాలకు నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం ఓడిన దేశాలకు ఉందని శాంతి సమావేశం భావించింది. అయితే, ఆర్థిక ఇబ్బందుల కారణంగానూ, ఓడిపోయిన దేశాల్లో ఒక్క జర్మనీలోనే ఆర్థిక వ్యవస్థ చెక్కుచెదరకుండా ఉండడం వల్లనూ ఆ భారం ఎక్కువగా జర్మనీపైననే పడింది.

ఆస్ట్రియా-హంగరీ అనేక వారసత్వ దేశాలుగా విభజించబడింది. వాటిలో ఆస్ట్రియా, హంగరీ, చెకోస్లోవేకియా, యుగోస్లేవియా ఉన్నాయి. ఇవి ఎక్కువగా జాతి పరంగా ఏర్పడిన దేశాలే గానీ పూర్తిగా అదే ప్రాతిపదికన కాదు. ట్రాన్సిల్వేనియాను హంగరీ నుండి గ్రేటర్ రొమేనియాకు మార్చారు. సెయింట్-జర్మైన్ ఒప్పందం, ట్రయానాన్ ఒప్పందంలో ఈ వివరాలు ఉన్నాయి. ట్రియానన్ ఒప్పందం ఫలితంగా, 33 లక్షల హంగేరియన్లు విదేశీ పాలనలోకి వెళ్ళారు. యుద్ధానికి పూర్వపు హంగరీ సామ్రాజ్యపు జనాభాలో హంగేరియన్లు సుమారు 54% ఉన్నప్పటికీ (1910 జనాభా లెక్కల ప్రకారం ), దాని భూభాగంలో 32% మాత్రమే హంగరిఈకి దక్కింది. 1920, 1924 మధ్య, 3,54,000 మంది హంగేరియన్లు రొమేనియా, చెకోస్లోవేకియా, యుగోస్లేవియాల్లోకి చేరిన పూర్వపు హంగేరియన్ భూభాగాల నుండి వలస వెళ్ళారు.[209]

అక్టోబరు విప్లవం తరువాత 1917 లో యుద్ధం నుండి వైదొలిగిన రష్యన్ సామ్రాజ్యం లోని భూభాగం నుండి కొత్తగా స్వతంత్ర దేశాలైన ఎస్టోనియా, ఫిన్లాండ్, లాట్వియా, లిథువేనియా, పోలండ్ ఏర్పడినందున దాని పశ్చిమ సరిహద్దులో ఎక్కువ భాగాన్ని కోల్పోయింది. 1918 ఏప్రిల్ లో రొమేనియా బెస్సరాబియాపై నియంత్రణ సాధించింది. [210]

ఉస్మానియా సామ్రాజ్యం విచ్ఛిన్నమైంది, దాని లెవాంట్ భూభాగంలో ఎక్కువ భాగం వివిధ మిత్రరాజ్యాల శక్తులకు సామంతరాజ్యంగా లభించింది. అనటోలియాలోని టర్కిష్ ప్రాంతాన్ని రిపబ్లిక్ ఆఫ్ టర్కీగా పునర్వ్యవస్థీకరించారు. ఉస్మానియా సామ్రాజ్యం 1920 నాటి సావ్రేస్ ఒప్పందం ప్రకారం విభజించారు. ఈ ఒప్పందాన్ని సుల్తాన్ ఎన్నడూ ఆమోదించలేదు. టర్కిష్ జాతీయ ఉద్యమం దీనిని తిరస్కరించింది. ఇది టర్కీ స్వాతంత్ర్యానికి, 1923 నాటి (మరింత సరళమైన) లోసాన్ కాల్పుల విరమణ ఒప్పందానికీ దారితీసింది.

1923 నాటికి చాలా దేశాలు శాంతి ఒప్పందాలు చేసుకున్నప్పటికీ, ఆండొర్రా దీనికి మినహాయింపు. ఆండొర్రా 1914 ఆగస్టులో జర్మనీపై యుద్ధం ప్రకటించింది. ఆ సమయంలో, ఆ దేశానికి ఇద్దరు అధికారుల నేతృత్వంలో 600 మంది పార్ట్‌టైమ్ సైనికులు ఉన్నారు. అండోరాలో జనాభా చాలా తక్కువ జనాభా. కాబట్టి ఇది సైనికులను యుద్ధభూమికి పంపలేదు. అందువల్ల వెర్సైల్ ఒప్పందానికి హాజరు కావడానికి ఆండొర్రాను అనుమతించలేదు. ఆ దేశం చివరకు 1958 లో జర్మనీతో శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకుంది.[211][212][213][214]

జాతీయ గుర్తింపులు[మార్చు]

ప్రపంచ యుద్ధం తరువాత ఐరోపాలో ప్రాదేశిక మార్పుల పటం (1923 నాటికి)

123 సంవత్సరాల తరువాత, పోలండ్ తిరిగి స్వతంత్ర దేశంగా అవతరించింది. సెర్బియా రాజ్యం, దాని రాజవంశం, "మైనర్ ఎంటెంటే దేశం"గా అత్యధిక తలసరి ప్రాణనష్టం పొందిన దేశం,[10][215][216] కొత్త బహుళజాతి దేశమైన సెర్బ్స్, క్రొయేట్స్, స్లోవేనిస్ రాజ్యంగా ఏర్పడింది. తరువాత ఈ దేశానికి యుగోస్లేవియా అని పేరు మార్చారు. బోహేమియా రాజ్యాన్ని, హంగరీ రాజ్యంలోని కొన్ని భాగాలతో కలిపి చెకోస్లోవేకియా దేశంగా మారింది. రష్యా సోవియట్ యూనియన్ అయ్యింది. తన భూభాగం నుండి ఫిన్లాండ్, ఎస్టోనియా, లిథువేనియా, లాట్వియాలను కోల్పోయింది, ఇవి స్వతంత్ర దేశాలుగా మారాయి. ఉస్మానియా సామ్రాజ్యం స్థానంలో టర్కీ, మధ్యప్రాచ్యంలోని అనేక ఇతర దేశాలు ఏర్పడ్డాయి.

బ్రిటిషుసామ్రాజ్యంలో, యుద్ధం జాతీయవాదం యొక్క కొత్త రూపాలను విప్పింది. గల్లిపోలి యుద్ధం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల "బాప్టిజం ఆఫ్ ఫైర్"గా ప్రసిద్ధి చెందింది. ఇది కొత్తగా స్థాపించబడిన ఈ దేశాలు పోరాడిన మొదటి పెద్ద యుద్ధం. బ్రిటిష్ క్రౌన్ యొక్క సామంత దేశాల్లా కాకుండా, ఆస్ట్రేలియన్ దళాలు ఆస్ట్రేలియన్లుగా పోరాడిన మొదటి యుద్ధం ఇది. ఆస్ట్రేలియన్ న్యూజిలాండ్ ఆర్మీ కార్ప్స్ (ANZAC) అంజాక్ డేగా ఈ నిర్ణయాత్మక క్షణాన్ని జరుపుకుంటుంది.[10][217]

కెనడియన్ విభాగాలు మొదటిసారిగా ఒకే దళంగా కలిసి పోరాడిన వైమీ రిడ్జ్ యుద్ధం తరువాత, కెనడియన్లు తమ దేశాన్ని "అగ్ని నుండి ఆవిర్భవించిన" దేశంగా పేర్కొనడం ప్రారంభించారు.[218] ఇంతకుముందు "మాతృ దేశాలు" ఓడిపోయిన యుద్ధభూమిలోనే తాము విజయం సాధించిన తరువాత, వారు అంతర్జాతీయంగా గౌరవం పొందారు. కెనడా బ్రిటిషుసామ్రాజ్యపు డొమినియన్‌గా యుద్ధంలోకి ప్రవేశించింది. యుద్ధం ముగిసే నాటికి అది మరింత స్వాతంత్య్రంతో ఉద్భవించినప్పటికీ డొమినియన్‌ గానే ఉండిపోయింది.[219][220] 1914 లో బ్రిటన్ యుద్ధం ప్రకటించినప్పుడు, డొమినియన్లు ఆటోమాటిగ్గా యుద్ధంలో దిగిపోయాయి; యుద్ధం ముగిసేటపుడు మాత్రం కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాలు కూడా వెర్సైల్లెస్ ఒప్పందంలో సంతకాలు పెట్టిన భాగస్వాములే.[221]

చైమ్ వైజ్మాన్ చేసిన లాబీయింగ్ కారణం గాను, జర్మనీకి మద్దతు ఇవ్వమని అమెరికన్ యూదులు అమెరికాను ప్రోత్సహిస్తారనే భయం వల్లనూ బ్రిటిష్ ప్రభుత్వం 1917 నాటి బాల్ఫోర్ డిక్లరేషన్‌లో పాలస్తీనాలో యూదుల మాతృభూమిని సృష్టించడాన్ని ఆమోదించింది.[222] ప్రపంచ యుద్ధంలో మొత్తం 11,72,000 మందికి పైగా యూదు సైనికులు మిత్రరాజ్యాలకు, సెంట్రల్ పవర్స్ కూ పనిచేశారు. వీరిలో ఆస్ట్రియా-హంగరీలో 2,75,000, జారిస్ట్ రష్యాలో 4,50,000 మంది ఉన్నారు.[223]

ఆధునిక ఇజ్రాయెల్ రాష్ట్ర స్థాపన, ఇప్పటికీ కొనసాగుతున్న ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదం యొక్క మూలాలు ప్రపంచ యుద్ధం ఫలితంగా ఏర్పడిన మధ్యప్రాచ్యం లోని అస్థిర శక్తి డైనమిక్స్‌లో పాక్షికంగా కనిపిస్తాయి. [224] యుద్ధం ముగిసే ముందు, ఉస్మానియా సామ్రాజ్యం మధ్యప్రాచ్యం అంతటా కొద్దిపాటి శాంతి, స్థిరత్వాలను ఏర్పరచింది. [225] ఉస్మానియా ప్రభుత్వం పతనంతో, బలాల శూన్యత ఏర్పడింది. భూమి గురించి, జాతి గురించీ విరుద్ధమైన వాదనలు వెలువడటం మొదలైంది. [226] ప్రపంచ యుద్ధ విజేతలు గీసిన రాజకీయ సరిహద్దులను స్థానిక ప్రజలపై రుద్దారు. కొన్నిసార్లు స్థానిక జనాభాతో కంటితుడుపు సంప్రదింపులు జరిపారంతే. 21 వ శతాబ్దంలో కూడా ఇవి సమస్యాత్మకంగానే కొనసాగుతున్నాయి. [227] [228] ప్రపంచ యుద్ధం ముగింపులో ఉస్మానియా సామ్రాజ్యం రద్దయి అరబ్-ఇజ్రాయెల్ సంఘర్షణతో సహా మధ్యప్రాచ్యం లోని ఆధునిక రాజకీయ పరిస్థితులకు దారితీసింది.[229] [230][231] ఉస్మానియా పాలన ముగింపు నీరు, ఇతర సహజ వనరులపై వివాదాలకు కూడా దారితీసింది. [232]

లాటిన్ అమెరికాలో జర్మనీ, జర్మన్ వస్తువుల ప్రతిష్ఠ, యుద్ధం తరువాత కూడా అధికంగానే ఉంది గానీ యుద్ధానికి పూర్వ స్థాయికి తిరిగి రాలేదు.[233][234] చిలీలో తీవ్రమైన శాస్త్రీయ, సాంస్కృతిక ప్రభావానికి యుద్ధం ముగింపు పలికింది. ఈ ప్రభావాన్ని రచయిత ఎడ్వర్డో డి లా బార్రా "జర్మనీ వ్యామోహం" అని అన్నాడు[233]

ఆరోగ్య ప్రభావాలు[మార్చు]

సిర్కేసి వద్ద గాయపడిన ఉస్మానియా సైనికుడి రవాణా

1914 నుండి 1918 వరకు ఐరోపాలో సమీకరించిన 6 కోట్ల మంది సైనికుల్లో 80 లక్షల వరకు మరణించారు. 70 లక్షల మంది శాశ్వతంగా అంగవికలురయ్యారు. 1.5 కోట్ల మంది తీవ్రంగా గాయపడ్డారు. చురుకైన పురుష జనాభాలో జర్మనీ 15.1%, ఆస్ట్రియా-హంగరీ 17.1%, ఫ్రాన్స్ 10.5% కోల్పోయాయి. [235] జర్మనీలో పౌర మరణాలు, శాంతి కాలపు మరణాల కంటే 4,74,000 ఎక్కువ. ఆహార కొరత, పోషకాహార లోపం కారణంగా వ్యాధి నిరోధకశక్తి తగ్గడం దీనికి ప్రధాన కారణం.[236] యుద్ధం ముగిసే సమయానికి, కరువు వల్ల ఆకలితో సుమారు 1,00,000 మంది లెబనాన్ ప్రజలు మరణించారు. [237] 1921 నాటి రష్యన్ కరువులో 50 లక్షల నుండి కోటి మంది వరకూ మరణించారు.[238] 1922 నాటికి రష్యాలో 45 నుండి 70 లక్షల వరకు నిరాశ్రయులైన పిల్లలు ఉన్నారు. దాదాపు ఒక దశాబ్దం పాటు ప్రపంచ యుద్ధం, అంతర్యుద్ధం, కరువూ వగైరాలు దీనికి కారణం [239] అనేక సోవియట్ వ్యతిరేక రష్యన్లు విప్లవం తరువాత దేశం విడిచి పారిపోయారు; 1930 ల నాటికి, ఉత్తర చైనా నగరం హర్బిన్‌లో 100,000 మంది రష్యన్లు ఉన్నారు.[240] వేలాది మంది ఫ్రాన్స్, ఇంగ్లాండ్, అమెరికా లకు వలస పోయారు.

అత్యవసర సైనిక ఆసుపత్రిలో స్పానిష్ ఫ్లూ మహమ్మారి రోగులు. ఒక్క అమెరికా లోనే ఇది 675,000 మందిని చంపింది, క్యాంప్ ఫన్స్టన్, కాన్సాస్, 1918

ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి బిల్లీ హ్యూస్ బ్రిటిష్ ప్రధాన మంత్రి లాయిడ్ జార్జికి ఇలా రాశాడు, "ఇంతకంటే మంచి ఒప్పందం మీకు ఉండదని మీరు మాకు హామీ ఇచ్చారు. బ్రిటిషుసామ్రాజ్యం, దాని మిత్రరాజ్యాలు చేసిన అపారమైన త్యాగాలకు అనుగుణంగా నష్టపరిహారాన్ని కోరడానికి ఒప్పందం కుదుర్చుకోవడానికి ఇప్పుడు కూడా ఏదో ఒక మార్గం దొరుకుతుందని ఆశిస్తున్నాను." ఆస్ట్రేలియాకు, 55,71,720 యుద్ధ నష్టపరిహారం లభించింది, కాని యుద్ధంలో ఆస్ట్రేలియాకైన ప్రత్యక్ష వ్యయం 637,69,93,052. 1930 ల మధ్య నాటికి, స్వదేశానికి తిరిగి వచ్చే పెన్షన్లు, యుద్ధ గ్రాట్యుటీలు, వడ్డీ, సింకింగ్ ఫండ్ ఛార్జీలు 183,12,80,947. [241] యుద్ధంలో పనిచేసిన 4,16,000 మంది ఆస్ట్రేలియన్లలో, 60,000 మంది మరణించారు. మరో 152,000 మంది గాయపడ్డారు.[242]

అస్తవ్యస్తమైన యుద్ధకాల పరిస్థితులలో వ్యాధులు వృద్ధి చెందాయి. ఒక్క 1914 లోనే, సెర్బియాలో లౌస్-బర్న్ టైఫస్ వ్యాధి 2,00,000 మందిని బలి తీసుకుంది. [243] 1918 నుండి 1922 వరకు, రష్యాలో 2.5 కోట్ల మంది టైఫస్‌కు గురవగా, 30 లక్షల మంది మరణించారు. [244] 1923 లో, 1.3 కోట్ల మంది రష్యన్లు మలేరియా బారిన పడ్డారు. ఇది యుద్ధానికి పూర్వ సంవత్సరాల కంటే బాగా ఎక్కువ.[245] అదనంగా, ఒక పెద్ద ఇన్ఫ్లూయెంజా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. మొత్తంమీద, 1918 నాటి ఈ ఫ్లూ మహమ్మారికి కనీసం 1.7 నుండి 5 కోట్ల మంది వరకూ బలయ్యారు.[246] [247][248] అంతేకాకుండా, 1915 - 1926 మధ్యకాలంలో, ఎన్సెఫాలిటిస్ లెథార్జికా అనే అంటువ్యాధి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 లక్షల మందికి సంక్రమించింది.[249][250]

1917 నాటి రష్యన్ విప్లవం, ఆ తరువాతి రష్యన్ అంతర్యుద్ధం యొక్క సామాజిక విచ్ఛిత్తి, విస్తృతమైన హింస పూర్వపు రష్యన్ సామ్రాజ్యంలో, ఎక్కువగా ఉక్రెయిన్‌లో, 2 వేలకు పైగా హింసా కార్యక్రమాలకు కారణమయ్యాయి. .[251] ఈ దారుణాల్లో 60,000-200,000 వరకూ పౌర యూదులు చంపబడ్డారని అంచనా.[252]

మొదటి ప్రపంచ యుద్ధం తరువాత, ముస్తఫా కెమాల్ నేతృత్వంలోని టర్కిష్ జాతీయవాదులపై గ్రీస్ పోరాడింది. ఈ యుద్ధం చివరికి కుదిరిన లౌసాన్ ఒప్పందం ప్రకారం ఇరు దేశాల మధ్య భారీ జనాభా మార్పిడికి దారితీసింది.[253] వివిధ వనరుల ప్రకారం,[254] ఈ కాలంలో అనేక లక్షల మంది గ్రీకులు మరణించారు. ఇది గ్రీకు జెనోసైడ్‌తో ముడిపడి ఉంది.[255]

ఇవి కూడా చూడండి[మార్చు]

గమనికలు[మార్చు]

  1. Russian Empire during 1914–1917, Russian Republic during 1917. The Bolshevik government signed the separate peace with the Central Powers shortly on 3 March 1918 after their armed seizure of power of November 1917, leading to Central Powers victory in the Eastern Front and Russian defeat in World War I, however the peace treaty was nullified by Allied Powers victory on the Western Front at the end of World War I on 11 November 1918.
  2. Following the Armistice of Focșani causing Romania to withdraw from the Eastern Front of World War I; Romania signed a peace treaty with the Central Powers on 7 May 1918, however the treaty was canceled by Romania and Romania itself rejoined the Allied Powers on 10 November 1918.
  3. పారిస్ శాంతి సమావేశాంలో కుదిరిన ఒప్పందాలు వేటినీ అమెరికా ధ్రువీకరించలేదు.
  4. 1915 అక్టోబరు 14 న బల్గేరియా కేంద్ర రాజ్యాలతో చేరింది.
  5. ఓట్టోమన్ సామ్రాజ్యం 1914 ఆగస్టు 2 న జర్మనీతో ఒక రహస్య పొత్తు కుదుర్చుకుంది. 1914 అక్టోబరు 14 న అది కేంద్ర రాజ్యాల వైపున యుద్ధంలో చేరింది.
  6. అమెరికా 1917 డిసెంబరు 7 న ఆస్ట్రో హంగేరియన్ సామ్రాజ్యంపై యుద్ధం ప్రకటించింది.
  7. ఆస్ట్రియాను ఆస్ట్రియా-హంగరీ వారస దేశాల్లో ఒకదానిగా గుర్తించారు.
  8. అమెరికా 1917 ఏప్రిల్ 6 న జర్మనీపై యుద్ధం ప్రకటించింది.
  9. హంగరీ, ఆస్ట్రియా-హంగరీ సామ్రాజ్య వారస దేశాల్లో ఒకదానిగా గుర్తించారు.
  10. సెవ్రెస్ ఒప్పందంతో మిత్ర రాజ్యాలకు, ఓట్టోమన్ సామ్రాజ్యానికీ మధ్య యుద్ధం ముగిసినప్పటికీ, ఓట్టోమన్ సామ్రాజ్యపు వారస దేశమైన టర్కీకి, మిత్ర రాజ్యాలకూ మధ్య లాసాన్ ఒప్పందాన్ని చేసుకున్నాయి.
  11. 1916 లో మరణించగా చార్లెస్ I వారసుడయ్యాడు
  12. 1918 జూలైలో మరణించగా, మెహ్మెడ్ VI వారసుడయ్యాడు

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 Tucker & Roberts 2005, p. 273
  2. Lieven, Dominic (2016). Towards the Flame: Empire, War and the End of Tsarist Russia. Penguin. p. 326. ISBN 978-0141399744.
  3. Martel, Gordon (2014). The Month that Changed the World: July 1914 and WWI (Kindle ed.). 6286: OUP.{{cite book}}: CS1 maint: location (link)
  4. "Le Président de la République, R. [Raymond] Poincaré et al., 'A La Nation Française'" (PDF). Journal Officiel de la République Française: 7053–7054. 2 August 1914. Retrieved 26 August 2018.
  5. 5.0 5.1 Crowe 2001, pp. 4–5.
  6. 6.0 6.1 Dell, Pamela (2013). A World War I Timeline (Smithsonian War Timelines Series). Capstone. pp. 10–12. ISBN 978-1-4765-4159-4.
  7. Willmott 2003, p. 29.
  8. Edward M. Coffman, The War to End All Wars: The American Military Experience in World War I (1998)
  9. Sheffield, Gary (2002). Forgotten Victory. Review. p. 251. ISBN 978-0747271574.
  10. 10.00 10.01 10.02 10.03 10.04 10.05 10.06 10.07 10.08 10.09 10.10 10.11 10.12 10.13 10.14 10.15 10.16 10.17 "1918 Timeline". League of Nations Photo Archive. Archived from the original on 5 May 2016. Retrieved 20 November 2009.
  11. Gerwath, Robert (2016). The Vanquished: Why the First World War Failed to End, 1917–1923 (Kindle ed.). 3323–3342: Penguin. ISBN 978-0141976372.{{cite book}}: CS1 maint: location (link)
  12. Clark 2014, pp. 121–152.
  13. Willmott, H. P. (2003). World War I. Dorling Kindersley. ISBN 0-7894-9627-5.
  14. Keegan 1998, p. 52.
  15. Medlicott, W.N. (1945). "Bismarck and the Three Emperors' Alliance, 1881–87". Transactions of the Royal Historical Society. 27: 66–70. doi:10.2307/3678575. JSTOR 3678575.
  16. Keenan, George (1986). The Fateful Alliance: France, Russia and the Coming of the First World War. Manchester University Press. p. 20. ISBN 978-0719017070.
  17. Willmott 2003, p. 15
  18. 18.0 18.1 Willmott 2003, p. 21
  19. Holger Herwig,"The Failure of German Sea Power, 1914–1945: Mahan, Tirpitz, and Raeder Reconsidered", The International History Review, 10:1 (February 1988), 72–73.
  20. Moll, Kendall, Luebbert, Gregory (1980). "Arms Race and Military Expenditure Models: A Review". The Journal of Conflict Resolution. 24 (1): 153–185. doi:10.1177/002200278002400107. JSTOR 173938.{{cite journal}}: CS1 maint: multiple names: authors list (link)
  21. Stevenson, David (2016). Mahnken, Thomas (ed.). Land armaments in Europe, 1866-1914 in Arms Races in International Politics: From the Nineteenth to the Twenty-First Century. OUP. p. 45. ISBN 978-0198735267.
  22. Stevenson 2016, p. 42.
  23. Keegan 1998, pp. 48–49.
  24. Willmott 2003, pp. 2–23.
  25. Finestone, Jeffrey; Massie, Robert K. (1981). The last courts of Europe. Dent. p. 247.
  26. Smith 2010.
  27. Willmott 2003, p. 26.
  28. Clark, Christopher (25 June 2014). Month of Madness. BBC Radio 4.
  29. Djordjević, Dimitrije; Spence, Richard B. (1992). Scholar, patriot, mentor: historical essays in honor of Dimitrije Djordjević. East European Monographs. p. 313. ISBN 978-0-88033-217-0. Following the assassination of Franz Ferdinand in June 1914, Croats and Muslims in Sarajevo joined forces in an anti-Serb pogrom.
  30. Reports Service: Southeast Europe series. American Universities Field Staff. 1964. p. 44. Retrieved 7 December 2013. ... the assassination was followed by officially encouraged anti-Serb riots in Sarajevo ...
  31. Kröll, Herbert (2008). Austrian-Greek encounters over the centuries: history, diplomacy, politics, arts, economics. Studienverlag. p. 55. ISBN 978-3-7065-4526-6. Retrieved 1 September 2013. ... arrested and interned some 5.500 prominent Serbs and sentenced to death some 460 persons, a new Schutzkorps, an auxiliary militia, widened the anti-Serb repression.
  32. Tomasevich 2001, p. 485.
  33. Schindler, John R. (2007). Unholy Terror: Bosnia, Al-Qa'ida, and the Rise of Global Jihad. Zenith Imprint. p. 29. ISBN 978-1-61673-964-5.
  34. Velikonja 2003, p. 141.
  35. Stevenson 1996, p. 12.
  36. Willmott 2003, p. 27.
  37. Fromkin, David; Europe's Last Summer: Why the World Went to War in 1914, Heinemann, 2004; pp. 196–97.
  38. Levy & Vasques 2014, p. 250
  39. Martel, Gordon (2014). The Month that Changed the World: July 1914 and WWI (Kindle ed.). 6286: OUP.{{cite book}}: CS1 maint: location (link)
  40. "Verordnung, betreffend die Erklärung des Kriegszustandes". Reichs-gesetzblatt (in German). 31 July 1914. LCCN 14013198.{{cite journal}}: CS1 maint: unrecognized language (link)
  41. "On This Day, March 24, 1917. Kaiser's spy in north". The Irish News. Belfast. 24 March 2017.
  42. Coogan, Tim Pat (2009). Ireland in the 20th Century. London: Random Houe. p. 48. ISBN 9780099415220.
  43. ["The Telegraph, First World War centenary: how the events of 1 August 1914 unfolded". Archived from the original on 2020-03-25. Retrieved 2020-04-04. The Telegraph, First World War centenary: how the events of 1 August 1914 unfolded]
  44. McMeekin, Sean, July 1914: Countdown to War, Basic Books, 2014, 480 p., ISBN 978-0465060740, pp. 342, 349
  45. "Daily Mirror Headlines: The Declaration of War, Published 4 August 1914". BBC. Retrieved 9 February 2010.
  46. Strachan 2003, pp. 292–296, 343–354.
  47. Tucker & Roberts 2005, p. 172.
  48. Schindler, John R. (1 April 2002). "Disaster on the Drina: The Austro-Hungarian Army in Serbia, 1914". War in History. 9 (2): 159–195. doi:10.1191/0968344502wh250oa.
  49. Serbia, RTS, Radio televizija Srbije, Radio Television of. "Veliki rat - Avijacija".{{cite web}}: CS1 maint: multiple names: authors list (link)
  50. "How was the first military airplane shot down". National Geographic. Archived from the original on 31 ఆగస్టు 2015. Retrieved 5 August 2015.
  51. Horne, Alistair (1964). The Price of Glory (1993 ed.). Penguin. p. 22. ISBN 978-0140170412.
  52. Holmes 2014, pp. 194, 211.
  53. Stevenson, David (2012). 1914–1918: The History of the First World War. Penguin. p. 54. ISBN 978-0718197957.
  54. Jackson, Julian (2018). A Certain Idea of France: The Life of Charles de Gaulle. Allen Lane. p. 55. ISBN 978-1846143519.
  55. Lieven, Dominic (2016). Towards the Flame: Empire, War and the End of Tsarist Russia. Penguin. p. 327. ISBN 978-0141399744.
  56. Tucker & Roberts 2005, pp. 376–378.
  57. Horne, Alistair (1964). The Price of Glory (1993 ed.). Penguin. p. 221. ISBN 978-0140170412.
  58. Donko, Wilhelm M. (2012). A Brief History of the Austrian Navy epubli GmbH, Berlin, p. 79
  59. Keegan 1998, pp. 224–232.
  60. Falls 1960, pp. 79–80.
  61. Farwell 1989, p. 353.
  62. Brown 1994, pp. 197–198.
  63. Brown 1994, pp. 201–203.
  64. "Participants from the Indian subcontinent in the First World War". Memorial Gates Trust. Retrieved 12 December 2008.
  65. Horniman, Benjamin Guy. British administration and the Amritsar massacre. Mittal Publications, 1984. Pg. 45.
  66. Raudzens 1990, p. 424.
  67. Raudzens 1990, pp. 421–423.
  68. Taylor 1998, pp. 80–93
  69. Goodspeed 1985, p. 199 (footnote).
  70. Love 1996.
  71. Dupuy 1993, p. 1042.
  72. Grant 2005, p. 276.
  73. Lichfield, John (21 February 2006). "Verdun: myths and memories of the 'lost villages' of France". The Independent. Archived from the original on 22 అక్టోబరు 2017. Retrieved 23 July 2013.
  74. Harris 2008, p. 271.
  75. Valentine 2006.
  76. Porras-Gallo & Davis 2014.
  77. Barry 2004, p. 171.
  78. Galvin 2007.
  79. Tucker & Roberts 2005, p. 1221.
  80. Tucker & Roberts 2005, p. 854.
  81. Keegan 1998, pp. 325–326.
  82. Strachan 2003, p. 244.
  83. Inglis 1995, p. 2.
  84. Humphries 2007, p. 66.
  85. Taylor 2007, pp. 39–47.
  86. Keene 2006, p. 5.
  87. Halpern 1995, p. 293.
  88. Zieger 2001, p. 50.
  89. Jeremy Black (June 2016). "Jutland's Place in History". Naval History. 30 (3): 16–21.
  90. 90.0 90.1 90.2 90.3 Sheffield, Garry. "The First Battle of the Atlantic". World Wars in Depth. BBC. Archived from the original on 3 June 2019. Retrieved 11 November 2009.
  91. Gilbert 2004, p. 306.
  92. von der Porten 1969.
  93. Jones 2001, p. 80.
  94. Nova Scotia House of Assembly Committee on Veterans' Affairs (9 November 2006). "Committee Hansard". Archived from the original on 23 నవంబర్ 2011. Retrieved 12 March 2013. {{cite web}}: Check date values in: |archive-date= (help)
  95. Chickering, Roger; Förster, Stig; Greiner, Bernd (2005). A world at total war: global conflict and the politics of destruction, 1937–1945. Publications of the German Historical Institute. Washington, DC: Cambridge University Press. ISBN 978-0-521-83432-2.
  96. Price 1980
  97. "The Balkan Wars and World War I". p. 28. Library of Congress Country Studies.
  98. Tucker, Spencer; Roberts, Priscilla Mary (2005). World War One. ABC-CLIO. pp. 241–. ISBN 978-1-85109-420-2.
  99. Neiberg 2005, pp. 54–55.
  100. Tucker & Roberts 2005, pp. 1075–1076.
  101. DiNardo 2015, p. 102.
  102. Neiberg 2005, pp. 108–110.
  103. Hall, Richard (2010). Balkan Breakthrough: The Battle of Dobro Pole 1918. Indiana University Press. p. 11. ISBN 978-0-253-35452-5.
  104. Tucker, Wood & Murphy 1999, pp. 150–152.
  105. Doughty 2005, p. 491.
  106. Gettleman, Marvin; Schaar, Stuart, eds. (2003). The Middle East and Islamic world reader (4th pr. ed.). New York: Grove Press. pp. 119–120. ISBN 978-0-8021-3936-8.
  107. January, Brendan (2007). Genocide : modern crimes against humanity. Minneapolis, Minn.: Twenty-First Century Books. p. 14. ISBN 978-0-7613-3421-7.
  108. Lieberman, Benjamin (2013). The Holocaust and Genocides in Europe. New York: Continuum Publishing Corporation. pp. 80–81. ISBN 978-1-4411-9478-7.
  109. Arthur J. Barker, The Neglected War: Mesopotamia, 1914–1918 (London: Faber, 1967)
  110. Crawford, John; McGibbon, Ian (2007). New Zealand's Great War: New Zealand, the Allies and the First World War. Exisle Publishing. pp. 219–220.
  111. Fromkin 2004, p. 119.
  112. 112.0 112.1 Hinterhoff 1984, pp. 499–503
  113. a b c The Encyclopedia Americana, 1920, v.28, p.403
  114. a b c d e f g (Northcote 1922, pp. 788)
  115. Sachar 1970, pp. 122–138.
  116. Gilbert 1994.
  117. Hanioglu, M. Sukru (2010). A Brief History of the Late Ottoman Empire. Princeton University Press. pp. 180–181. ISBN 978-0-691-13452-9.
  118. Gardner, Hall (2015). The Failure to Prevent World War I: The Unexpected Armageddon. Ashgate. p. 120.
  119. Charles Seymour (1916). The Diplomatic Background of the War. Yale University Press. pp. 35, 147.
  120. Page, Thomas Nelson (1920). Italy and the world war. Scribners. pp. 142–208.
  121. Marshall|page=108
  122. Thompson, Mark. The White War: Life and Death on the Italian Front, 1915–1919. London: Faber and Faber. p. 163. ISBN 978-0-571-22334-3.
  123. Praga, Giuseppe; Luxardo, Franco (1993). History of Dalmatia. Giardini. p. 281. ISBN 88-427-0295-1.
  124. 124.0 124.1 O'Brien, Paul (2005). Mussolini in the First World War: the Journalist, the Soldier, the Fascist. Oxford, England; New York: Berg. p. 17. ISBN 1-84520-051-9.
  125. Hickey 2003, pp. 60–65.
  126. Tucker 2005, pp. 585–589. sfn error: multiple targets (2×): CITEREFTucker2005 (help)
  127. Laurentiu-Cristian Dumitru, Preliminaries of Romania's entering the World War I, No. 1/2012, Bulletin of "Carol I" National Defence University, Bucharest, p.171
  128. Michael B. Barrett, Prelude to Blitzkrieg: The 1916 Austro-German Campaign in Romania (2013)
  129. Cyril Falls, The Great War, p. 285
  130. Clark, Charles Upson (1927). Bessarabia. New York City: Dodd, Mead.
  131. Béla, Köpeczi. Erdély története. Akadémiai Kiadó.
  132. Béla, Köpeczi (1998). History of Transylvania. Akadémiai Kiadó. ISBN 978-84-8371-020-3.
  133. Erlikman, Vadim (2004). Потери народонаселения в 20. веке [The loss of population in the 20th Century] (in Russian). Moscow: Русская панорама. ISBN 978-5931651071.{{cite book}}: CS1 maint: unrecognized language (link)
  134. Tucker 2005, p. 715. sfn error: multiple targets (2×): CITEREFTucker2005 (help)
  135. Meyer 2006, pp. 152–154, 161, 163, 175, 182.
  136. Smele
  137. Schindler 2003.
  138. Neiberg, Michael (2014). The Cambridge History of the First World War (1 ed.). Cambridge University Press. pp. 110–132.
  139. "How Germany got the Russian Revolution off the ground". Deutsche Welle. 7 November 2017.
  140. Wheeler-Bennett, John W. (1938). Brest-Litovsk : The forgotten peace. London: Macmillan. pp. 36–41.
  141. Mawdsley 2008, pp. 54–55.
  142. 142.0 142.1 Alexander Lanoszka, Michael A. Hunzeker (11 November 2018). "Why the First War lasted so long". Washington Post. Retrieved 11 November 2018.
  143. 143.0 143.1 Keegan 1998, p. 345.
  144. Kernek 1970, pp. 721–766.
  145. Marshall, 292.
  146. Heyman 1997, pp. 146–147.
  147. Kurlander 2006.
  148. Shanafelt 1985, pp. 125–130.
  149. Erickson, Edward J. (2001). Ordered to Die: A History of the Ottoman Army in the First World War: Forward by General Hüseyiln Kivrikoglu. No. 201 Contributions in Military Studies. Westport Connecticut: Greenwood Press. p. 163. OCLC 43481698.
  150. Moore, A. Briscoe (1920). The Mounted Riflemen in Sinai & Palestine: The Story of New Zealand's Crusaders. Christchurch: Whitcombe & Tombs. p. 67. OCLC 156767391.
  151. Wavell, Earl (1968) [1933]. "The Palestine Campaigns". In Sheppard, Eric William (ed.). A Short History of the British Army (4th ed.). London: Constable & Co. pp. 153–155. OCLC 35621223.
  152. Bruce, Anthony (2002). The Last Crusade: The Palestine Campaign in the First World War. London: John Murray. p. 162. ISBN 978-0-7195-5432-2.
  153. Erickson, Edward J. (2001). Ordered to Die: A History of the Ottoman Army in the First World War: Forward by General Hüseyiln Kivrikoglu. No. 201 Contributions in Military Studies. Westport Connecticut: Greenwood Press. p. 195. OCLC 43481698.
  154. Daily Telegraph Wednesday 15 August 1917, reprinted on p. 26 of Daily Telegraph Tuesday 15 August 2017
  155. Brands 1997, p. 756.
  156. "Wilson for 'America First'", The Chicago Daily Tribune (12 October 1915).
  157. Cooper, John Milton. Woodrow Wilson: A Biography, p. 278 (Vintage Books 2011).
  158. Garrett, Garet. Defend America First: The Antiwar Editorials of the Saturday Evening Post, 1939–1942, p. 13 (Caxton Press 2003).
  159. Tuchman 1966.
  160. Karp 1979
  161. "Woodrow Wilson Urges Congress to Declare War on Germany" (Wikisource)
  162. Stone, David (2014). The Kaiser's Army: The German Army in World War One. London: COnway. ISBN 978-1844862924.
  163. Millett & Murray 1988, p. 143.
  164. Westwell 2004.
  165. Posen 1984, p. 190.
  166. Gray 1991, p. 86.
  167. Rickard 2007.
  168. Hovannisian 1967, pp. 1–39.
  169. Ayers 1919, p. 104.
  170. Schreiber, Shane B. (2004) [1977]. Shock Army of the British Empire: The Canadian Corps in the Last 100 Days of the Great War. St. Catharines, ON: Vanwell. ISBN 978-1-55125-096-0. OCLC 57063659.
  171. Rickard 2001.
  172. Brown, Malcolm (1999) [1998]. 1918: Year of Victory. London: Pan. p. 190. ISBN 978-0-330-37672-3.
  173. 173.0 173.1 Pitt 2003
  174. 174.0 174.1 174.2 174.3 Gray & Argyle 1990
  175. Terraine 1963.
  176. Nicholson 1962.
  177. Ludendorff 1919.
  178. McLellan, p. 49.
  179. Christie, Norm M. (1997). The Canadians at Cambrai and the Canal du Nord, August–September 1918. For King and Empire: A Social History and Battlefield Tour. CEF Books. ISBN 978-1-896979-18-2. OCLC 166099767.
  180. Stevenson 2004, p. 380.
  181. Hull 2006, pp. 307–310.
  182. 182.0 182.1 Stevenson 2004, p. 383.
  183. Painter 2012, p. 25. Over the course of the war the United States supplied more than 80 percent of Allied oil requirements, and after US entry into the war, the United States helped provide and protect tankers transporting oil to Europe. US oil resources meant that insufficient energy supplies did not hamper the Allies, as they did the Central Powers.
  184. Dähnhardt, D. (1978). Revolution in Kiel. Neumünster: Karl Wachholtz Verlag. p. 91. ISBN 3-529-02636-0.
  185. Wette, Wolfram (2006). "Die Novemberrevolution – Kiel 1918". In Fleischhauer; Turowski (eds.). Kieler Erinnerungsorte. Boyens.
  186. Stevenson 2004, p. 385.
  187. Stevenson 2004, Chapter 17.
  188. Axelrod 2018, p. 260.
  189. Andrea Di Michele (2014). "Trento, Bolzano E Innsbruck: L'occupazione Militare Italiana Del Tirolo (1918–1920)" [Trento, Bolzano and Innsbruck: The Italian Military Occupation of Tyrol (1918–1920)] (PDF). Trento e Trieste. Percorsi Degli Italiani d'Austria Dal '48 All'annessione (in ఇటాలియన్): 436–437. Archived from the original (PDF) on 2018-10-02. La forza numerica del contingente italiano variò con il passare dei mesi e al suo culmine raggiunse i 20–22.000 uomini. [The numerical strength of the Italian contingent varied with the passing of months and at its peak reached 20–22,000 men.] ← see https://www.agiati.it/memorie-trento-e-trieste-rasera-caffieri Archived 2019-03-24 at the Wayback Machine for metadata -->
  190. "Clairière de l'Armistice" (in ఫ్రెంచ్). Ville de Compiègne. Archived from the original on 27 August 2007.
  191. Baker 2006.
  192. Chickering 2004, pp. 185–188.
  193. Hardach, Gerd (1977). The First World War, 1914–1918. Berkeley: University of California Press. p. 153. ISBN 0-520-03060-5, using estimated made by Menderhausen, H. (1941). The Economics of War. New York: Prentice-Hall. p. 305. OCLC 774042.
  194. "France's oldest WWI veteran dies" Archived 28 అక్టోబరు 2016 at the Wayback Machine, BBC News, 20 January 2008.
  195. Tucker, Spencer (2005). Encyclopedia of World War I. ABC-CLIO. p. 273. ISBN 978-1-85109-420-2.
  196. Hastedt, Glenn P. (2009). Encyclopedia of American Foreign Policy. Infobase Publishing. p. 483. ISBN 978-1-4381-0989-3.
  197. Murrin, John; Johnson, Paul; McPherson, James; Gerstle, Gary; Fahs, Alice (2010). Liberty, Equality, Power: A History of the American People. Vol. II. Cengage Learning. p. 622. ISBN 978-0-495-90383-3.
  198. Staff (3 July 1921). "Harding Ends War; Signs Peace Decree at Senator's Home. Thirty Persons Witness Momentous Act in Frelinghuysen Living Room at Raritan". The New York Times.
  199. "No. 31773". The London Gazette. 10 February 1920. p. 1671.
  200. "No. 31991". The London Gazette. 23 July 1920. pp. 7765–7766.
  201. "No. 13627". The London Gazette. 27 August 1920. p. 1924.
  202. "No. 32421". The London Gazette. 12 August 1921. pp. 6371–6372.
  203. "No. 32964". The London Gazette. 12 August 1924. pp. 6030–6031.
  204. Magliveras 1999, pp. 8–12.
  205. Northedge 1986, pp. 35–36.
  206. Schulze, Hagen (1998). Germany: A New History. Harvard U.P. p. 204.
  207. Ypersele, Laurence Van (2012). Horne, John (ed.). Mourning and Memory, 1919–45. Wiley. p. 584. {{cite book}}: |work= ignored (help)
  208. "The Surrogate Hegemon in Polish Postcolonial Discourse Ewa Thompson, Rice University" (PDF). Archived (PDF) from the original on 29 October 2013. Retrieved 27 October 2013.
  209. Kocsis, Károly; Hodosi, Eszter Kocsisné (1998). Ethnic Geography of the Hungarian Minorities in the Carpathian Basin. p. 19. ISBN 978-963-7395-84-0.
  210. Clark 1927.
  211. "8 Facts You Might Not Have Known About Andorra". 30 June 2011.
  212. "The 44-year war between Germany and Andorra". 3 April 2016. Archived from the original on 31 జూలై 2020. Retrieved 6 ఏప్రిల్ 2020.
  213. "9 wars that were technically ongoing due to quirks of diplomacy".
  214. "25 things you might not know about WWI". 24 June 2014.
  215. "Appeals to Americans to Pray for Serbians" (PDF). The New York Times. 27 July 1918.
  216. "Serbia Restored" (PDF). The New York Times. 5 November 1918.
  217. "'ANZAC Day' in London; King, Queen, and General Birdwood at Services in Abbey". The New York Times. 26 April 1916.
  218. "Vimy Ridge".
  219. "The War's Impact on Canada".
  220. "Canada's last WW1 vet gets his citizenship back". CBC News. 9 May 2008. Archived from the original on 11 May 2008.
  221. "Documenting Democracy". www.foundingdocs.gov.au. Retrieved 2023-01-03.
  222. "Balfour Declaration (United Kingdom 1917)". Encyclopædia Britannica.
  223. "Timeline of The Jewish Agency for Israel:1917–1919". The Jewish Agency for Israel. Archived from the original on 2013-05-20. Retrieved 2020-04-06.
  224. Doughty 2005.
  225. Hooker 1996.
  226. Muller 2008.
  227. Kaplan 1993.
  228. Salibi 1993.
  229. Evans 2005
  230. Israeli Foreign Ministry.
  231. Gelvin 2005
  232. Isaac & Hosh 1992.
  233. 233.0 233.1 Sanhueza, Carlos (2011). "El debate sobre "el embrujamiento alemán" y el papel de la ciencia alemana hacia fines del siglo XIX en Chile" (PDF). Ideas viajeras y sus objetos. El intercambio científico entre Alemania y América austral. Madrid–Frankfurt am Main: Iberoamericana–Vervuert (in Spanish). pp. 29–40.{{cite book}}: CS1 maint: unrecognized language (link)
  234. Penny, H. Glenn (2017). "Material Connections: German Schools, Things, and Soft Power in Argentina and Chile from the 1880s through the Interwar Period". Comparative Studies in Society and History. 59 (3): 519–549. doi:10.1017/S0010417517000159.
  235. Kitchen 2000, p. 22.
  236. Howard, N.P. (1993). The Social and Political Consequences of the Allied Food Blockade of Germany, 1918–19 (PDF). Vol. 11. pp. 161–188. {{cite book}}: |work= ignored (help) table p. 166, with 271,000 excess deaths in 1918 and 71,000 in the first half of 1919 while the blockade was still in effect.
  237. Saadi 2009.
  238. Patenaude, Bertrand M. "Food as a Weapon". Hoover Digest. Hoover Institution. Archived from the original on 2008-07-19. Retrieved 2020-04-06.
  239. Ball 1996, pp. 16, 211.
  240. "The Russians are coming (Russian influence in Harbin, Manchuria, China; economic relations)". The Economist (US). 14 January 1995. Archived from the original on 10 May 2007. (via Highbeam.com)
  241. Souter 2000, p. 354.
  242. Tucker, Spencer (2005). Encyclopedia of World War I. Santa Barbara, CA: ABC-CLIO. p. 273. ISBN 978-1-85109-420-2. Retrieved 7 May 2010.
  243. Tschanz.
  244. Conlon.
  245. Taliaferro, William Hay (1972). Medicine and the War. p. 65. ISBN 978-0-8369-2629-3.
  246. P. Spreeuwenberg; et al. (1 December 2018). "Reassessing the Global Mortality Burden of the 1918 Influenza Pandemic". American Journal of Epidemiology. 187 (12): 2561–2567. doi:10.1093/aje/kwy191. PMID 30202996.
  247. Knobler 2005.
  248. Kamps, Bernd Sebastian; Reyes-Terán, Gustavo. Influenza. Influenza Report. Flying Publisher. ISBN 978-3-924774-51-6. Archived from the original on 28 అక్టోబరు 2019. Retrieved 17 November 2009.
  249. K. von Economo.Wiener klinische Wochenschrift, 10 May 1917, 30: 581–585. Die Encephalitis lethargica. Leipzig and Vienna, Franz Deuticke, 1918.
  250. Reid, A.H.; McCall, S.; Henry, J.M.; Taubenberger, J.K. (2001). "Experimenting on the Past: The Enigma of von Economo's Encephalitis Lethargica". J. Neuropathol. Exp. Neurol. 60 (7): 663–670. doi:10.1093/jnen/60.7.663. PMID 11444794.
  251. "Pogroms". Encyclopaedia Judaica. American-Israeli Cooperative Enterprise.
  252. "Jewish Modern and Contemporary Periods (ca. 1700–1917)". Jewish Virtual Library. American-Israeli Cooperative Enterprise.
  253. Großbongardt, Annette (2006-11-28). "Christians in Turkey: The Diaspora Welcomes the Pope". Der Spiegel (in ఇంగ్లీష్). ISSN 2195-1349. Retrieved 2023-01-03.
  254. R.J. Rummel, "The Holocaust in Comparative and Historical Perspective", 1998, Idea Journal of Social Issues, Vol.3 no.2
  255. Hedges, Chris (17 September 2000). "A Few Words in Greek Tell of a Homeland Lost". The New York Times.

బయటి లంకెలు[మార్చు]

  1. మొదటి ప్రపంచ యుద్ధం ఘోరానికి నూరేళ్లుసాక్షి