సి.హెచ్.విద్యాసాగర్ రావు

వికీపీడియా నుండి
(చెన్నమనేని విద్యాసాగర్ రావు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
సి.హెచ్.విద్యాసాగర్ రావు
సి.హెచ్.విద్యాసాగర్ రావు

సి.హెచ్.విద్యాసాగర్ రావు


మాజీ కేంద్ర మంత్రి, మాజీ లోక్‌సభ సభ్యుడు, మాజీ శాసనసభ్యుడు
నియోజకవర్గం కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గం (1998-2004)
మెట్‌పల్లి శాసనసభ నియోజకవర్గం(1985-1998)

వ్యక్తిగత వివరాలు

జననం (1942-02-12) 1942 ఫిబ్రవరి 12 (వయసు 82)
కరీంనగర్, ఆంధ్రప్రదేశ్
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి వినోద
సంతానం 2 కుమారులు , 1 కుమార్తె
జూన్ 3, 2008నాటికి

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకులలో ఒకడైన సి.విద్యాసాగర్ రావు (చెన్నమనేని విద్యాసాగర్ రావు) 1942, ఫిబ్రవరి 12న శ్రీనివాసరావు, చంద్రమ్మ దంపతులకు కరీంనగర్ జిల్లాలో జన్మించారు.[1] ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యనభ్యసించి న్యాయవాద వృత్తి చేపట్టిన విద్యాసాగర్ రావు 1980లో తొలిసారిగా కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయారు. 1985లో మెట్‌పల్లి శాసనసభ నియోజకవర్గంలో తొలిసారి గెలుపొంది రాష్ట్ర శాసనసభలో ఆడుగుపెట్టిన విద్యాసాగర్ రావు మొత్తం 3 సార్లు శాసనసభ్యుడిగాను, రెండు సార్లు లోక్‌సభ సభ్యుడిగాను ఎన్నికయ్యారు. అటల్ బిహారీ వాజపేయి నేతృతంలోని ఎన్.డి.ఏ.ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. 1977లో కరీంనగర్ జిల్లా జనతా పార్టీ అధ్యక్షుడిగానూ, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడుగాను వ్యవహరించారు. స్వశక్తితో ఎదిగి రాజకీయాలలో రాణించిన నాయకుడైన విద్యాసాగర్ రావు 2004లో, 2006 ఉప ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభంజనంతో ఓడిపోయారు. తెరాస సభ్యుల రాజీనామాతో జరిగిన 2008 ఉపఎన్నికలు హాస్యాస్పదమని, అనవసరమనీ ప్రకటించి [2] ఎన్నికల బరిలోకి నిలవలేరు. 2009 శాసనసభ ఎన్నికలలో వేములవాడ నుంచి పోటీచేసిననూ విజయం లభించలేదు. ఈయన పెద్ద సోదరుడు చెనమనేని రాజేశ్వరరావు 6 సార్లు శాసనసభ్యుడిగా విజయం సాధించగా, మరో సొదరుడు చెన్నమనేని హన్మంతరావు జాతీయస్థాయిలో ఆర్థికవేత్తగా పేరుపొందారు.

బాల్యం, విద్యాభ్యాసం[మార్చు]

చెన్నమనేని విద్యాసాగర్ రావు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నాగారంలో 1942 ఫిబ్రవరి 12 న శ్రీనివాసరావు, చంద్రమ్మ దంపతులకు జన్మించాడు. ప్రాథమిక విద్యాభ్యాసం స్థానికంగా అక్కడే పూర్తిచేశాడు. అతనికి ముగ్గురు సోదరులు ఉన్నారు. అతను తన పాఠశాల విద్యను వేములవాడ, హైదరాబాదులో పియుసి, బి.ఎస్.సి. మహారాష్ట్రకు చెందిన నాందేడ్‌లో, తరువాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో న్యాయవిద్యను అభ్యసించి, ఎల్.ఎల్.బి పట్టాలు పొంది న్యాయవాద వృత్తిని స్వీకరించాడు. ఎల్.ఎల్.బి. చేసేటప్పుడే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. ఆ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. అదే సమయంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్.ఎస్.ఎస్.) లో కూడా అతని చురుకైన కార్యకర్త. కళాశాల ఎన్నికలలో పోటీచేసి ప్రెసిడెంటుగా కూడా ఎన్నికైనాడు. ఇదే సమయంలో పెద్ద సోదరుడు రాజేశ్వరరావు కమ్యూనిస్ట్ పార్టీలో ఉండేవాడు. ఆ తరువాత విద్యాసాగర్ రావు రాజకీయాలలో ప్రవేశించి జనసంఘ్ పార్టీలో చేరాడు. 1977లో జనసంఘ్ పార్టీ జనతా పార్టిలో విలీనమైనప్పుడు ఇతను జనతాపార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసాడు. 1980లో పాత జనసంఘ్ నేతలు జనతాపార్టీని వీడి, భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసిన పిదప భారతీయ జనతా పార్టీ తరపున ముఖ్య నాయకుడిగా ఎదిగారు.

రాజకీయ ప్రస్థానం[మార్చు]

విద్యాసాగర్ రావు తొలిసారిగా 1980లో కరీంనగర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి జనతా పార్టీ తరపున పోటీచేసాడు. ఆ ఎన్నికలలో ఓటమి పొందిననూ మునుముందు విజయానికి నాంది పలికింది. 1985లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో మెట్‌పల్లి శాసనసభ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున ఎన్నికలలో విజయం సాధించి తొలిసారిగా శాసనసభలో అడుగుపెట్టాడు. ఆ తరువాత 1989, 1994 ఎన్నికలలో కూడా మెట్‌పల్లి నుంచి వరుస విజయాలు సాధించి మొత్తం మూడు పర్యాయాలు శాసనసభ్యుడిగా కొనసాగాడు.[3] 1998లో కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేసి 12వ లోక్‌సభలో ప్రవేశించాడు. పార్లమెంటుకు చెందిన పబ్లిక్ అక్కౌంట్స్ కమిటీ సభ్యుడిగాను పనిచేసాడు.[4] 1999లో జరిగిన 13వ లోక్‌సభ ఎన్నికలలో కూడా గెలుపొంది కేంద్రంలో వాజపేయి నాయకత్వంలోని ఎన్.డి.ఏ. ప్రభుత్వంలో హోంశాఖ సహాయమంత్రిగా పనిచేశాడు.[5] ఆ తరువాత తెలంగాణా రాష్ట్ర సమితి అవతరించుటతో 2004, 2006 ఉపఎన్నికలలో కరీంనగర్ నియోజకవర్గం నుంచి పోటీచేసిన కె.చంద్రశేఖర రావు చేతిలో పరాజయం పొందాడు. తెరాస సభ్యుల రాజీనామాతో జరిగిన 2008 ఉపఎన్నికలు అనవసరం, హాస్యాస్పదం అని ప్రకటించి ఎన్నికల బరిలోకి దిగలేదు. 2009 శాసనసభ ఎన్నికలలో వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీచేసి అన్న చెన్నమనేని రాజేశ్వరరావు కుమారుడైన చెన్నమనేని రమేష్ బాబు చేతిలో పరాజయం పొందాడు.[6] అయిననూ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీను బలోపేతం చేయడానికి ముందస్తు వ్యూహాలను సిద్ధం చేసాడు.

ప్రత్యేకత
  • 1985లో8వ శాసనసభ సమయంలో ఇతను శాసనసభలో భారతీయ జనతా పార్టీ నాయకుడిగానూ, అన్న రాజేశ్వరరావు సీపీఐ నాయకుడుగానూ వ్యవహరించారు. ఒకే సమయంలో సోదరులిద్దరూ చెరో పార్టీకి శాసనసభ నాయకులుగా వ్యవహరించడం రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే తొలిసారి.
  • రాజేశ్వరరావు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు శాసనసభలో రెండో వివాహానికి సంబంధించిన ప్రైవేటు బిల్లు ప్రతిపాదించగా, ఈ బిల్లును అన్ని పార్టీలు మద్దతు తెలిపి బిల్లును శాసనం (చట్టం) గా చేశాయి. మొదటి వివాహం అమలులో ఉన్నప్పుడు భర్త రెండో వివాహం చేసుకుంటే నాన్‌బెయిలబుల్ నేరంగా పరిగణించడం ఈ బిల్లు ఉద్దేశం. దేశంలో ఇలాంటి బిల్లును చేసిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్.

1998, 1999 ఎన్నికలు[మార్చు]

విద్యాసాగర్ రావు 1998లో జరిగిన 12వ లోక్‌సభ ఎన్నికలలో కరీంనగర్ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున పోటీచేసి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆనందరావును 19,360 ఓట్లతేడాతో ఓడించాడు. 1999లో జరిగిన ఎన్నికలలో అదే స్థానం నుంచి సమీప తెలుగుదేశం పార్టీ ప్రత్యర్థి రమణపై 95, 997 ఓట్ల మెజారిటీ సాధించారు.

మహారాష్ట్ర గవర్నర్ గా సీహెచ్ విద్యాసాగరరావు[మార్చు]

2014 ఆగస్టు 26 మంగళవారం మహారాష్ట్ర గవర్నర్ గా నియమిస్తూ రాష్ట్రపతి భవన్ ఆదేశాలు జారీ చేసింది. అతను 2014 ఆగస్టు 26 నుంచి 2019 సెప్టెంబరు 1 వరకు మహారాష్ట్ర గవర్నర్ గా బాధ్యతలు నిర్వర్తించాడు.[7]

వ్యక్తిగత జీవితం, బంధుత్వం[మార్చు]

విద్యాసాగర్ రావు 1972లో వినోదను వివాహం చేసుకున్నాడు. వారికి ముగ్గురు సంతానం. ఇద్దరు కుమారులు, ఒక కూతురు.[8] రాజకీయనేత చెన్నమనేని రాజేశ్వరరావు, జాతీయస్థాయి ఆర్థికవేత్తగా పేరుపొందిన చెన్నమనేని హన్మంతరావు ఇతని సోదరులు.[9] వేములవాడ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నమనేని రమేష్ బాబు ఇతని అన్న రాజేశ్వరరావు కుమారుడు. రాజేశ్వరరావు చిన్న కుమారుడు చెన్నమనేని వికాస్ వైద్యరంగంలో రేడియాలజిస్ట్‌గా పేరుపొందారు.

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-06-15. Retrieved 2008-06-02.
  2. ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్ జిల్లా స్పెషల్, పేజీ 9, తేది 24-5-2008
  3. Eenadu (9 November 2023). "విద్యాసాగర్‌రావుల హ్యాట్రిక్‌ విజయాలు". Archived from the original on 9 November 2023. Retrieved 9 November 2023.
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2006-05-13. Retrieved 2008-06-02.
  5. http://www.rediff.com/election/1999/oct/13vaj.htm
  6. ఈనాడు దినపత్రిక, తేది 17-05-2009
  7. Tiwari, Ravish. "C Vidyasagar Rao: Maharashtra governor C Vidyasagar Rao: Lifelong Sangh man who returned from wilderness". The Economic Times. Retrieved 2021-07-17.
  8. 10TV Telugu (30 August 2023). "బీజేపీలో చేరిన చెన్నమనేని వికాస్ రావు, ఆయన సతీమణి దీపా" (in Telugu). Archived from the original on 30 August 2023. Retrieved 30 August 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  9. Sakshi (22 March 2019). "భిన్న'దమ్ములు'". Archived from the original on 30 August 2023. Retrieved 30 August 2023.

వెలుపలి లంకెలు[మార్చు]