బంగాళాఖాతము
పేరుకి కారణం[మార్చు]
ఇంగ్లీషులో గల్ఫ్ (gulf) అన్నా బే (bay) అన్నా దరిదాపుగా అర్థం ఒక్కటే. కావాలని వెతికితే ఈ దిగువ చెప్పిన తాడాలు కనిపిస్తాయి:
- సాధారణంగా గల్ఫ్ కంటే బే పెద్దది.
- గల్ఫ్కి చుట్టూ భూమి ఉండి, బయటకి వెళ్లడానికి చిన్న ముఖద్వారం ఉంటుంది, బేకి చుట్టూ భూమి ఉండి, విశాలమైన ముఖద్వారం ఉంటుంది.
- బేని తెలుగులో అఖాతం అంటారు. గల్ఫ్కి తెలుగు పేరు లేదు. గల్ఫ్ని కూడా అఖాతం అంటే వచ్చే నష్టం ఏమీ లేదు.
- బంగాళాఖాతం వైశాల్యం అరేబియన్ సముద్రం అంతా ఉంటుంది. బంగాళాఖాతం వైశాల్యం గల్ఫ్ అఫ్ మెక్సికో కంటే ఎక్కువ. కనుక దేనిని బే అనాలి, దేనిని గల్ఫ్ అనాలి, దేనిని సముద్రం అనాలి అన్నది నిర్ధారించి చెప్పడం కష్టం.
బంగాళాఖాతం భారతదేశానికి తూర్పున ఉండటం వల్ల చాలా కాలం వరకూ "తూర్పు సముద్రం" అనీ, లేదా దాని తత్సమం అయిన ప్రాచ్యోదధి అని పిలిచేవారు. ఇప్పటికీ మన చరిత్ర పుస్తకాలలోని ఇండియా మ్యాపులలో, బ్రిటీషు వారి రాకకి పూర్వం, ఈ సముద్రాన్ని ఇదే పేరుతో సూచిస్తారు. ముఖ్యముగా గుప్తుల కాలం, విజయనగరకాలం నాటి మ్యాపులు కాని, ఆ నాటి సాహిత్యం కాని చూడండి!
బ్రిటీషు వారు వచ్చినప్పుడు బెంగాలు చాలా పెద్దగా ఉండేది, దానిని బెంగాలు ప్రావిన్సు అని పిలిచేవారు. ఇందులో ప్రస్తుతపు పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్, ఈశాన్య రాష్ట్రాలలోని కొన్ని భాగాలు, ఒడిషా రాష్ట్రము, బీహార్ రాష్ట్రము, జార్ఖండ్ రాష్ట్రములు అంతర్భాగములుగా ఉండేవి. ఈ పెద్ద బెంగాలు ప్రావిన్సు బెంగాలు విభజన వరకూ కొనసాగింది. తరువాత ముక్కలైంది. ఇంత పెద్ద బెంగాలు ప్రావిన్సు ఉండుటం వల్ల, దానికి కోస్తాగా చాలావరకూ ఈ సముద్రం ఉండటం వల్ల ఈ సముద్రాన్ని వారు బే ఆఫ్ బెంగాల్ అని పిలిచారు. అదే స్థిరపడిపొయినది. తరువాత తెలుగులో అదే అనువాదం చెంది బంగాళాఖాతం (బెంగాల్+అఖాతం) అయినది.
ఉనికి[మార్చు]
హిందూ మహా సముద్రపు ఈశాన్య ప్రాంతపు సముద్రాన్ని బంగాళాఖాతము (Bay of Bengal) అంటారు. త్రిభుజాకారంలో ఉండే బంగాళాఖాతానికి తూర్పున మలై ద్వీపకల్పం, పశ్చిమాన భారత ఉపఖండం ఉన్నాయి. అఖాతానికి ఉత్తరాగ్రాన భారతదేశపు రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్,, బంగ్లాదేశ్ దేశము ఉన్నాయి. అందువలననే దీనికి బంగాళాఖాతము అనే పేరు వచ్చింది.
దక్షిణాన శ్రీలంక, అండమాన్ నికోబార్ దీవుల వరకు బంగాళాఖాతం వ్యాపించి ఉంది. విస్తీర్ణపరంగా బంగాళాఖాతం ప్రపంచంలో అతి పెద్దనైన అఖాతము (Bay).
నదులు[మార్చు]
భారత దేశం లోని చాలా ముఖ్యమైన నదులు పడమర నుండి తూర్పుకు ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తున్నాయి:
ఉత్తరాన, గంగ, మేఘన, బ్రహ్మపుత్ర నదులు, దక్షిణాన మహానది, గోదావరి, కృష్ణ, కావేరి నదులు.
గంగ, బ్రహ్మపుత్ర, మేఘన నదులు బంగాళాఖాతంలో కలిసే ప్రాంతంలో విస్తరించిన మడ అడవులను సుందర్బన్స్ అంటారు.
మయన్మార్ (బర్మా) లోని ఇరావతి కూడా బంగాళాఖాతంలోనే కలుస్తుంది.
నౌకాశ్రయాలు[మార్చు]
భారతదేశంలో చెన్నై (ఇదివరకటి మద్రాసు), విశాఖపట్నం, కొల్కతా (ఇదివరకటి కలకత్తా), పరదీప్, పాండిచ్చేరి బంగాళాఖాత తీరంలోని ముఖ్య నౌకాశ్రయాలు. ఇవి కాక అండమాన్ నికోబార్ దీవులలోని పోర్ట్ బ్లెయిర్ తోపాటు మయన్మార్లో కూడా రెండు నౌకాశ్రయాలు ఉన్నాయి.
ఇంకా చూడండి: అండమాన్ నికోబార్ దీవులు