భాస్కర శతకము
భాస్కర శతకము రచించిన మారయ (మారవి) వెంకయ్య కవి 1550-1650 కాలంలో శ్రీకాకుళం, విశాఖపట్నం ప్రాంతంలో నివశించిన కళింగ కవి. ఆ ప్రాంతంలో ఉన్న అరసవిల్లి సూర్యదేవాలయంలోని సూర్యభగవానుడిని సంబోధిస్తూ భాస్కర శతకము వ్రాశాడు. అందులోని నీతి బోధలవల్ల, కవిత్వ సౌందర్యము వల్లా ఈ శతకము బాగా ప్రాచుర్యము పొందింది. దృష్టాంతాలంకారములు మెండుగా వాడిన మొదటి శతకాలలో ఇది ఒకటి అని విమర్శకుల అభిప్రాయము. ప్రతి విషయాన్నీ చక్కని పోలికతో ఈ కవి వర్ణించాడు.
కొన్ని ఉదాహరణలు:
- శ్రీగల భాగ్యశాలిఁ గడుఁ జేరఁగవత్తురు తారుదారె దూ
- రాగమన ప్రయాసము కాదట నోర్చియైన నిల్వ న
- ద్యోగము చేసి; రత్న నిలయుండని కాదె సమస్త వాహినుల్
- సాగరుఁ జేరుటెల్ల ముని సన్నుత మద్గురుమూర్తి భాస్కరా!
ఓ సూర్యభగవానుడా! సాగరుడు రత్ననిలయుడు కనుకనే నదులన్నీ సముద్రములో చేరుటకు పొర్లివచ్చును. అలాగే సదూరప్రాంతాలనుండి కూడ జనులు ధనవంతుని ఆశ్రయిస్తారు.
- ఊరక సజ్జనుండొదిగి యుండిననైన, దురాత్మకుండు ని
- ష్కారణ మోర్వలేక యపకారము చేయుట వాని విద్యగా;
- చీరలు నూరు అంకములు చేసెడివైనను బెట్టెనుండగాఁ
- జేరి చినింగిపోఁ గొఱుకు చిమ్మట కేమి ఫలంబు భాస్కరా!
ఎంతో ఖరీదైన చీరలను పెట్టెలో పెడితే చిమ్మెట పురుగు వాటిని తెగ కొరుకుతుంది. అలాగే మంచివాడు తనమానాన తానున్నా దుష్టుడు పూనుకొని ఏదో హాని తలపెడతాడు.
- చదువది యెంత గల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా
- చదువు నిరర్థకంబు, గుణ సంయుతులెవ్వరు మెచ్చ రెచ్చటం;
- బదనుగ మంచికూర నలపాకము చేసిననైన నందు నిం
- పొదవెడొ నుప్పు లేక రుచి పుట్టఁగ నేర్చు నటయ్య భాస్కరా!
ఎంత గొప్పగా వండినా ఉప్పు లేని కూర రుచించదు. అలాగే ఎంత చదివినా, ఆ చదువు సార ము గ్రహించలేకపోయినట్లయితే ఆ చదువు నిరుపయోగము. ఎవరూ మెచ్చుకొనరు.
ఆధారాలు[మార్చు]