ఎల్లోరా గుహలు

వికీపీడియా నుండి
(ఎల్లోరా నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఎల్లోరాలోని జైన గుహ

ఎల్లోరా గుహలు మహారాష్ట్రలో ఔరంగాబాద్ కు 30 కి.మీ. దూరంలో ఉన్నాయి. మాన్యుమెంటల్ గుహలకు ప్రసిద్ధి చెందిన ఎల్లోరా ప్రపంచ వారసత్వ సంపద. ఎల్లోరా గుహలు భారతీయ రాతి శిల్పకళను ప్రతిబింబిస్తుంది.[1] చరణధారీ కొండల నుండి తవ్వబడిన ఈ గుహలు హిందూ, బౌద్ద, జైన దేవాలయాలు , సన్యాసాశ్రమాలు. 5వ శతాబ్దం నుండి 10వ శతాబ్దం మధ్యలో నిర్మించబడ్డవి. మొదటి 12 గుహలు బౌద్ధమతానికి చెందినవి. వీటి నిర్మాణం కాలం సా. శ. పూ. 600 నుంచి 800 మధ్య ఉంటుంది. 13వ గుహ నుండి 29వ గుహ వరకు హిందూ మతానికి సంబంధించిన దేవతలూ, పౌరాణిక కథలను తెలుపుతాయి. వీటి నిర్మాణ కాలం క్రీ.పూ 600 నుంచి 900 మధ్యలో ఉంటుంది. 30 నుండి 34 గుహల వరకూ జైన మతానికి సంబంధించినవి. వీటి నిర్మాణం సా. శ. పూ. 800-1000. ఈ గుహలన్నీ పక్క పక్కన ఉండి ఆ కాలపు పరమత సహానాన్ని చాటి చెబుతున్నాయి. ఈ గుహల విస్తీర్ణం సుమారు 2 కి.మీ. ఈ మొత్తం గుహల నిర్మాణానికి 500 సంవత్సరాలు పట్టింది. ఇవి యునెస్కో చే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపబడ్డాయి.

ఇందులో బౌద్ధ చైత్యాలు, ప్రార్థనా మందిరాలు, విహారాలు, ఆరామాలు, హిందూ, జైన దేవాలయాలు ఉన్నాయి. మూడు మతాల భావ సంగమం ఇది. ఎల్లోరాని అక్కడి స్థానికులు వేరులిని అని పిలుస్తారు. ఎల్లోరాను దర్శించడానికి ఆగస్టు-అక్టోబరు మధ్య కాలం అనువైనది. కాని విద్యార్థులకు వేసవి సెలవుల కారణంగా మే-జూన్ నెలలలో పర్యాటకులు అధికంగా వస్తారు.

గుహలు ఎలా నిర్మించారు[మార్చు]

తడిగా వున్న ఇసుకతో ఇళ్ళు, గోపురాలు కట్టడం, ఇసుకను గోపురంగా చేర్చి, లోపల కాలిని గాని, చేతిని గాని లేదా వస్తువునో గాని ఉంచి వాటిని మెల్లగా వెనక్కు తీసి, అక్కడి ఇసుకను తొలగించి ద్వారా మార్గాలు ఏర్పాటు చేస్తే గుహలా ఏర్పడుతుంది. సరిగ్గా అలాగే కొండలను తొలిచి శిల్పులు గుహాలయాలను నిర్మించారు. భారతదేశంలో శిలలను తొలిచే విధానం దాదాపు 2000 సంవత్సరాలకు పూర్వమే ఆరంభమయింది. మొదట కొండల నుంచి ఏ భాగాన్ని ఏ ఆకారంలో తొలగించాలో గుర్తుగా గీతలు గీసుకునే వారు. ఆ తరువాత తొలచడం ప్రారంభించేవారు. మొదట పైకప్పు భాగం నుంచి తొలుచుకుంటూ కింది భాగానికి వచ్చేవారు.[2]

ప్రసిద్దమైన గుహలు[మార్చు]

ఎల్లోరా గుహలు

ఎల్లోరా గుహలన్నింటిలో మొదటి గుహ చాలా ప్రాచీనమైనది. రెండో గుహ శిల్పకళతో కూడిన ఒక చైతన్యశాలగా ఉంటుంది. దీనిలో బుద్ధుడి గురించిన వివిధ మూర్తులు, బోధిసత్వుని మూర్తులున్నాయి. దీనిపై కప్పు పెద్దపెద్ద 12 స్తంభాలపై ఆధారపడి ఉంటుంది. ఈ గుహ గర్భాలయంలో సింహాసనాసీసుడై ఉన్న బుద్ధుని విగ్రహం ఉంది. ఈ శిల్ప విగ్రహం చూపరులను ఆకట్టుకుంటుంది.

10వ గుహ - విశ్వకర్మ చైతన్యం[మార్చు]

ఎల్లోరాలో చైత్యశాల ఇది ఒకటే, దీనిని విశ్వకర్మ చైతన్యమని అంటారు. ఇది గొప్ప శిల్ప విన్యాసంతో బౌద్ధ గుహాలయాలన్నింటికీ మకుటాయ మానంగా వెలుగొందుతోంది. ఈ గుహాలయాన్ని విశ్వకర్మ గుహ అని పిలు స్తారు. విశ్వకర్మ అనే శిల్పాచార్యుడు ఒక్కరాత్రి లోనే తన పరివారంతో ఈ గుహలో శిల్పాలను చెక్కాడట. అందుకే ఈ గుహకు విశ్వకర్మ గుహాలయం అనే పేరు వచ్చిందని ఇక్కడివారు చెబుతారు. ఆయన ఒక్కరాత్రిలో నిర్మించారో లేదో అనే మీమాంసకు వెళ్లకుండా ఈ గుహను పరిశీలిస్తే అద్భుతమైన శిల్పాలతో చాలా మనోహరంగా ఉంటుంది. ఇక్కడ 15 అడుగుల బుద్ధుని విగ్రహము చాలా శాంతంగా, ధ్యానంలో నిమగ్నుడై ఎంతో సౌందర్యంగా ఉంటుంది.

అలాగే ఈగుహలో ఒక ప్రత్యేకత కూడా ఉంది. మనం ఒక ధ్వని చేస్తే అది ప్రతి ధ్వనించి ఆ ప్రతిధ్వనుల పరంపరలు మళ్లీ మనకే విన్పిస్తూ మెల్లగా తగ్గుతూ ఒక విధమై న ధ్వని సొంపుతో ముగుస్తాయి. ఈ ధ్వనులు వింటుంటే మళ్లీ మళ్లీ మనం ధ్వని చేయాలన్పిస్తుంది. అంతేకాక ఒక స్తంభాన్ని మనం మోగిస్తే ఇంకొక స్తంభం నుండి ధ్వని విన్పిస్తుంది.

14వ గుహ..15వ గుహ[మార్చు]

వీటిలో 14వ గుహ రావణ పరా భావ శిల్పం అత్యద్భుతం. 15వ గుహలో నట రాజ శిల్పం, లింగం నుండి ఉద్భవిస్తున్నట్లుగా పరమేశ్వరుడు, ఆయనను స్తుతిస్తున్నట్లుగా బ్రహ్మ, విష్ణువుల శిల్పాలు ఉంటాయి.

16వ గుహ..కైలాస దేవాలయం[మార్చు]

పదహారవ గుహలో ఉన్న కైలాస దేవాలయం ప్రపంచంలోనే అతి పెద్దదైన ఏకశిలా శివాలయం. దీని నిర్మాణానికి 150 సంవత్సరాలు పట్టింది. దీని నిర్మాణానికి సుమారు ఏడు వేలమంది కార్మికులు పాలుపంచుకున్నట్లు చెబుతారు. రాష్ట్ర కూటులకు చెందిన శ్రీకృష్ణ -1 కు దీనిని నిర్మించిన ఘనత దక్కింది. ఈ ఆలయం అరవై వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఆలయం అంతటా రామాయణ, భాగవత, భారత గాథలను శిల్పాలుగా చెక్కినారు. ఆలయ ఆవరణలో ఒక గోడకు చెక్కిన నటరాజ విగ్రహానికి ఆనాడు వేసిన రంగు నేటికి ఉంది.

21-22 గుహలు[మార్చు]

21వ గుహను రామేశ్వర గుహాలయం అంటారు. 22వ గుహ నీలకంఠగుహ అంటారు. ఈ గుహలో సప్త మాతృకలు, గణపతి, నదీ దేవతలు తదితర విగ్రహాలున్నాయి.21, 22 గుహల్లో శివపార్వతుల కళ్యాణం, శివుడు తాండవం చేస్తున్నట్లున్న శిల్పాలున్నాయి. జగన్మోహనమైన ఈ గుహాలయం రాష్ట్ర కూటుల నిర్మాణ శైలిని పోలివుంది. మొత్తం మీద ఎల్లోరాలోని హిందూ మత గుహల్లోని పౌరా ణిక కథలను తెలిపే శిల్పాలన్నీ శైవమత ప్రాధాన్యతను కళ్ళకు కట్టినట్టు చూపుతున్నాయి.

25-29 గుహలు[మార్చు]

25వ గుహలో సూర్యుడు ఏడు గుర్రాలను కట్టిన రథమెక్కి ఉన్న శిల్పం అద్భుతంగా ఉంటుంది అలాగే 29వ గుహలో రావణుడు కైలాస పర్వతాన్ని ఎత్తబోవడం, శివుడు తన పాదంతో పర్వతాన్ని నొక్కడం ఈ భావాలన్నీ స్పష్టంగా ఈ శిల్పంలో చూడవచ్చు.

30-34 గుహలు[మార్చు]

ఈ ఐదు గుహలు జైనులకు సంబంధించినవి.32వ గుహలో గోమటేశ్వరుడి శిల్పం చాలా అద్భుతంగా ఉంటుంది.. ఇవి క్రీస్తు శకం 9వ శతాబ్దం నుండి 11వ శతాబ్దం మధ్య కాలంలో చెక్కినట్లున్నాయి. ఈ గుహల్లో జైన మహావీరుడి జన్మ వృత్తాంతాన్ని తెలిపే రాతి శిల్పా లున్నాయి.

ఎల్లోరా గుహలకు సమీపంలోనే ఒక జ్యోతి ర్లింగ క్షేత్రం కూడా ఉంది. ఇక్కడి కొలువై ఉన్న స్వామిని ఘృష్ణేశ్వరుడు అంటారు. దేశంలో ఉన్న పురాతన శైవ క్షేత్రాల్లో ఈ ఆలయం కూడా ఒకటి. ఎల్లోరా సందర్శనకు వచ్చిన యాత్రికులు ఘృష్ణేశ్వర స్వామిని కూడా దర్శించుకుంటారు.

ఎలా వెళ్ళాలి[మార్చు]

రైలు ద్వారా ఔరంగా బాద్ కు చేరుకుని, అక్కడి నుండి బస్సులో కానీ, కార్లు, జీపులలో కాని ఎల్లోరా గుహలకు చేరుకోవచ్చు.

ఇవీ చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Ellora UNESCO World Heritage Site". Retrieved 2006-12-19.
  2. "ఎల్లోరా గుహలు ఎలా నిర్మించారు". Archived from the original on 2011-08-11. Retrieved 2013-05-10.