వేదవతి (నవల)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వేదవతి అనే నవలను జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత, కవిసమ్ర్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రచించారు.

రచన నేపథ్యం[మార్చు]

వేదవతి నవలను విశ్వనాథ సత్యనారాయణ 1963లో రచించారు. ఈ నవలను విశ్వనాథ వారు ఆశువుగా చెప్తూ ఉండగా, పోలూరి సత్యనారాయణ లిపిబద్ధం చేశారు. వేదవతి నవల ప్రథమ ముద్రణ 1964లో జరిగింది. 2006లో చతుర్థ ముద్రణ, 2013లో పంచమ ముద్రణ చేశారు.

పురాణవైర గ్రంథమాల[మార్చు]

పురాణవైర గ్రంథమాల శీర్షికన విశ్వనాథ సత్యనారాయణ రాసిన నవలల్లో వేదవతి పదకొండవది. ప్రధానంగా భారతీయులకు చరిత్ర రచనా దృష్టి లేదని, పూర్వరాజుల పరంపర అడిగితే పుక్కిటి పురాణాలు చెప్తారని ఆంగ్లవిద్య ప్రారంభమయిన తరువాత భారత చరిత్రను రచన చేసిన పలువురు అభిప్రాయపడ్డారు. సుమారు వెయ్యేళ్ల క్రితమే, అల్ బీరూనీ (Abu al-Biruni) వంటి పండితుడే, “దురదృష్టవశాత్తు భారతీయులు చారిత్రక గతిక్రమాన్ని పట్టించుకోరు. వారి రాజుల వంశపరంపరలు నమోదు చేసుకోవడంలో వారికి ఒకరకమైన నిర్లక్ష్యభావం ఉంది. ఖచ్చితమైన సమాచారం కోసం నిలదీస్తే ఏం చెప్పాలో తెలియక కథలు కల్పించి చెప్తారు” అన్నాడు. ఇదేమాట, ఏ మార్పులు లేకుండా, వలసపాలన నాటి రచయితలు కూడా పదే పదే ఉటంకించడం మూలాన ఈనాటికీ ఒక సత్యంగా స్థిరపడిపోయింది.[1]
ఈ నేపథ్యంలో పురాణాల చారిత్రికతను తిరస్కరించిన చరిత్ర రచనా ధోరణిని విశ్వనాథ వారు పురాణవైరంగా పేర్కొన్నారు. భగవంతుని మీది పగ ఉపోద్ఘాతంలో ఈ నవలామాలిక లక్ష్యాలను పేర్కొంటూ ఆ లెక్క(పాశ్చాత్య చరిత్ర కారుల లెక్క) ప్రకారము కలి ప్రవేశము మొదలు- సంయుక్తా పృథ్వీరాజుల కథ దనుక, పాశ్చాత్యులు తారుమారు చేసిరి. ఆ కాలము, అనగా సుమారు మూడువేల యేండ్ల కాలము, మహమ్మదు గోరీ వచ్చువరకు మన చరిత్రలో పాశ్చాత్యులు చేసిన అవక తవకలు కాదని నవలల రూపమున నిరూపించుటకు చేసెడి ప్రయత్న మిది. అందుచేత దీనికి పురాణవైరము అని శీర్షిక ఏర్పరుపబడినది. అన్నారు విశ్వనాథ సత్యనారాయణ.[2] ఈ నవలామాలికలోని నవలలు మొత్తం 12. ఆ నవలలు ఇవి:

  1. భగవంతుని మీది పగ
  2. నాస్తికధూమము
  3. ధూమరేఖ
  4. నందోరాజా భవిష్యతి
  5. చంద్రగుప్తుని స్వప్నము
  6. అశ్వమేధము
  7. అమృతవల్లి
  8. పులిమ్రుగ్గు
  9. నాగసేనుడు
  10. హెలీనా
  11. వేదవతి
  12. నివేదిత

చారిత్రికాంశాలు[మార్చు]

ఈ నవలను విక్రమాదిత్య చక్రవర్తి జీవితాన్ని ఇతివృత్తంగా తీసుకుని విశ్వనాథ వారు రచించారు. విక్రమాదిత్య చక్రవర్తి శకకర్తగా భారతీయ కాలమానంలో స్థానం సంపాదించుకోగా, చాలామంది చరిత్రకారులు ఆయన ఉనికిని కాల్పనికమని తిరస్కరించారు. ఆయన క్రీ.పూ.89 నుంచి సా.శ.19 సంవత్సరం వరకూ ఉజ్జయినిని రాజధానిగా చేసుకుని పరిపాలించినట్టు గ్రంథకర్త నిశ్చయం. విశ్వనాథ సత్యనారాయణ ఈ నవల చారిత్రికతను గూర్చి మాట్లాడుతూ కల్హణ పండితుని లెక్క ప్రకారం కూడా విక్రమాదిత్యుడు క్రీ.పూ. ఒకటవ శతాబ్దిలో జీవించినట్టుగా రాశారనీ, ఆయనను ప్రామాణిక బుద్ధితో స్వీకరించే చరిత్రకారులు కూడా ఈ అంశాన్ని విస్మరించారని వాపోయారు.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-11-09. Retrieved 2014-02-13.
  2. భగవంతుని మీది పగ నవలకు విశ్వనాథ సత్యనారాయణ రాసిన ఉపోద్ఘాతము