భారత విభజన

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భారత విభజన
1909 లో బ్రిటిష్ ఇండియా సామ్రాజ్యం. బ్రిటిష్ ఇండియా గులాబి రంగు లోను, సంస్థానాలు పసుపు రంగు లోనూ ఉన్నాయి
తేదీ1947 ఆగస్టు
ప్రదేశంబ్రిటిషు ఇండియా, భారతదేశం, పాకిస్తాన్
ఫలితంబ్రిటిషు ఇండియా సామ్రాజ్యాన్ని భారతదేశం, పాకిస్తాన్ అనే రెండు స్వతంత్ర డొమినియన్లుగా విభజన, కాందిశీకుల సమస్య
మరణాలు2,00,000 నుండి 20 లక్షల దాకా,[1][lower-alpha 1] 14 million displaced[2]
1901 భారత జనగణన ప్రకారం బ్రిటిషు ఇండియా సామ్రాజ్యంలో మతాలు

1947 లో యునైటెడ్ కింగ్‌డమ్ పార్లమెంటు చేసిన చట్టం ద్వారా బ్రిటిషు భారతదేశాన్ని [lower-alpha 2] భారతదేశం, పాకిస్థాన్‌ అనే రెండు రెండు స్వతంత్ర అధినివేశ రాజ్యాలుగా విభజించడాన్ని భారత విభజన అంటారు.[3] ఆనాటి భారతదేశం నేడు భారత రిపబ్లిక్ గాను, ఆనాటి పాకిస్తాన్ నేడు ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ బంగ్లాదేశ్లు గానూ ఉనికిలో ఉన్నాయి. ఈ విభజనలో బెంగాల్, పంజాబ్ అనే రెండు రాష్ట్రాలను ఆ రాష్ట్రాల్లో జిల్లా వారీగా ఉన్న ముస్లిం, ముస్లిమేతర ప్రజల మెజారిటీల ఆధారంగా విభజించారు. దేశ విభజనతో పాటు బ్రిటిషు ఇండియన్ ఆర్మీ, రాయల్ ఇండియన్ నేవీ, ఇండియన్ సివిల్ సర్వీస్, రైల్వే, సెంట్రల్ ట్రెజరీల విభజన కూడా జరిగింది. ఈ విభజనను భారత స్వాతంత్ర్య చట్టం 1947లో వివరించారు. దీని ఫలితంగా బ్రిటిషు రాజ్ లేదా భారతదేశంలో బ్రిటిషు పాలన రద్దైపోయింది. భారతదేశం, పాకిస్తాన్ అనే రెండు స్వయంపరిపాలక దేశాలు 1947 ఆగస్టు 15 న అర్ధరాత్రి చట్టబద్ధంగా ఉనికిలోకి వచ్చాయి.

ఈ విభజనలో 1 - 1.2 కోట్ల మంది ప్రజలు మత ప్రాతిపదికన కాందిశీకులయ్యారు. కొత్తగా ఏర్పడిన దేశాల్లో పెద్దయెత్తున శరణార్థుల సంక్షోభం ఏర్పడింది. పెద్ద ఎత్తున హింస జరిగింది. విభజన సమయం లోను, అంతకుముందూ జరిగిన ప్రాణనష్టం అంచనాలు వివాదాస్పదంగా ఉన్నాయి. రెండు లక్షల నుండి ఇరవై లక్షల దాకా ఈ అంచనాలు ఉన్నాయి. [1] [lower-alpha 3] విభజన లోని హింసాత్మక స్వభావం భారత పాకిస్తాన్ల మధ్య శత్రుత్వానికి, అనుమానాల వాతావరణానికీ కారణమైంది. ఇప్పటికీ ఇది వాటి సంబంధాలను దెబ్బతీస్తూనే ఉంది.

1971 లో పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ విడిపోవడాన్ని లేదా బ్రిటిషు ఇండియా పరిపాలన నుండి బర్మా (ఇప్పుడు మయన్మార్ ), సిలోన్ (ఇప్పుడు శ్రీలంక ) లు విడిపోవడం భారతదేశ విభజనలో భాగం కాదు. [lower-alpha 4] రాచరిక సంస్థానాలు భారత పాకిస్తాన్లలో విలీనమవడం, లేదా విలీనానికి సంబంధించి హైదరాబాద్, జునాగఢ్, జమ్మూ కాశ్మీర్ రాజ్యాల్లో తలెత్తిన వివాదాలు కూడా విభజనలో భాగం కాదు. 1947–1954 కాలంలో ఫ్రెంచ్ భారతదేశం లోని ప్రాంతాలను భారతదేశంలో కలపడం లేదా 1961 లో గోవానూ, పోర్చుగీస్ భారతదేశంలోని ఇతర జిల్లాలనూ భారతదేశం చేజిక్కించుకోవడం కూడా ఈ విభజనలో భాగం కావు. 1947 లో ఈ ప్రాంతంలోని ఇతర సమకాలీన రాజకీయ ప్రాంతాలైన సిక్కిం, భూటాన్, నేపాల్, మాల్దీవులు కూడా ఈ విభజన ద్వారా ప్రభావితం కాలేదు. [lower-alpha 5]

రాచరిక సంస్థానాల్లో, పాలకుల ప్రమేయంతో గానీ, పాలకులు అసలు పట్టించుకోక పోవడం ద్వారా గానీ వ్యవస్థీకృతమైన హింస జరిగింది. సిక్కు రాష్ట్రాల్లో (జింద్, కపూర్తలా మినహా) ముస్లింల ఏరివేత జరుగుతూంటే అక్కడీ సంస్థానాధీశులు పట్టించుకోకుండా ఉండిపోయారు. పాటియాలా, ఫరీద్‌కోట్, భరత్‌పూర్ వంటి ఇతర సంస్థానాధీశులు ఈ అల్లర్లు చేయించడంలో భారీ ఎత్తున పాల్గొన్నారని భావిస్తున్నారు. భరత్‌పూర్ పాలకుడు, జాతి పేరిట తన ప్రజల ఏరివేత జరుగుతోంటే సాక్షిగా ఉన్నాడు - ముఖ్యంగా డీగ్ వంటి చోట్ల.[7]

నేపథ్యం[మార్చు]

ముస్లింలీగ్, దాని నాయకుడు మహమ్మద్ అలీ జిన్నాల ప్రధాన నినాదమైన ద్విజాతి సిద్ధాంతం, బ్రిటిషు ప్రభుత్వపు విభజించి పాలించు అన్న పాలనా సిద్ధాంతం వంటివి భారత విభజనకు ముఖ్య నేపథ్యం. రామచంద్ర గుహ వంటి చరిత్రకారులు ఈ రెంటికి తోడు - కాంగ్రెసు ముఖ్యనేతలైన మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ తదితరులు 1920ల్లోనూ, 30ల్లోనూ రాజకీయంగా మహమ్మద్ అలీ జిన్నాను, ముస్లిం లీగ్ ను తక్కువ అంచనా వేసి రాజకీయ చర్చల్లో పట్టువిడుపుల ధోరణి కనబరచక పోవడం కూడా భారత విభజనను ఇష్టపడనివారు చూపించే కారణమని చెప్తాడు.[8]

బెంగాల్ విభజన (1905), ముస్లింలీగ్ ఏర్పాటు[మార్చు]

1905లో లార్డ్ కర్జన్ ప్రభుత్వం బెంగాల్‌ను విభజించింది. దీనిలో భాగంగా ఉమ్మడి బెంగాల్ ప్రావిన్సులో ముస్లిములు ఎక్కువ సంఖ్యలో ఉన్న తూర్పుభాగాన్నీ (చాలాభాగం ప్రస్తుత బంగ్లాదేశ్, ప్రస్తుత అస్సాంల్లో ఉన్నాయి), హిందువులు ఎక్కువ సంఖ్యలో ఉన్న పశ్చిమ భాగాన్నీ (ప్రస్తుతం ప్రధానంగా పశ్చిమ బెంగాల్, ఒడిషా, ఝార్ఖండ్, బీహార్ రాష్ట్రాల్లో విస్తరించి ఉంది) విభజించి తూర్పు బెంగాల్, పశ్చిమ బెంగాల్ ఏర్పాటుచేశారు. పశ్చిమ ప్రాంతాల్లో అధికంగా నివసించే హిందూ జమీందారులు తూర్పు ప్రాంతాల్లోని తమ భూములను అక్కడి ముస్లిం రైతులకు కౌలుకు ఇచ్చేవారు, అలానే పశ్చిమ ప్రాంతంలో మెజారిటీ బెంగాలీ హిందువులను బీహారీల సంఖ్య డామినేట్ చేసేలా విభజన జరిగిందని, ఇది తమ రాజకీయ చైతన్యానికి బ్రిటిషు వారు విధించిన శిక్షగా వారు భావించారు. దీనికి వ్యతిరేకంగా బెంగాలీలు - ప్రధానంగా పశ్చిమ బెంగాల్లోని హిందువులు - వందేమాతరం ఉద్యమాన్ని చేపట్టారు. విభజన జరిగిన ఐదేళ్ళ అనంతరం ఉద్యమం కారణంగానూ, పరిపాలనా సరళీకరణలో భాగంగానూ బెంగాల్ పునరేకీకరణ జరిగింది. ఐతే ముస్లిం సంపన్నులు, విద్యావంతులూ ముస్లిములకు ప్రత్యేక నియోజకవర్గాలు (ప్రతి నియోజకవర్గానికి జనరల్, ముస్లిం అన్న రెండు స్థానాలను ఏర్పరిచి ముస్లింలు ముస్లిం స్థానాలకే ప్రత్యేకంగా ఓటు చేసే విధానం) కావాలన్న డిమాండ్ ను 1906లో అప్పటి కొత్త వైస్రాయ్ లార్డ్ మింటో ముందుంచారు. మరోవైపు, పూర్వం తమకు రాజరికం ఉండడం, బ్రిటిషు రాజ్యానికి సహకరించడం వంటి కారణాలతో తమకు మరింత ఎక్కువ ప్రాతినిధ్యాన్ని చట్టసభల్లో కల్పించాలని కోరారు. ముస్లిముల ఈ ఆకాంక్షల్ని రాజకీయంగా వారి మద్దతు ఆశిస్తున్న బ్రిటిషు ప్రభుత్వం ప్రోత్సహిస్తూండడంతో 1906లో ఢాకాలో అఖిల భారత ముస్లింలీగ్ పక్షాన్ని ఏర్పాటుచేశారు.

విభజించి పాలించు సిద్ధాంతం[మార్చు]

ముస్లిం సంపన్నులు, విద్యావంతులను ప్రతిబింబించే ముస్లింలీగ్ బెంగాల్ విభజనకు అనుకూల దృక్పథాన్ని స్వీకరించింది. నిజానికి 1871 జనాభా లెక్కల్లో మొదటిసారిగా మత ప్రాతిపదికన జనాభాను లెక్కించినప్పటి నుంచి ఉద్రిక్తతలు ఏర్పడుతూనే ఉన్నాయి. 1857లో భారత ముస్లింలు బ్రిటిషు సార్వభౌమాధికారానికి వ్యతిరేకంగా పోరాడిన నాటి నుంచి ఎలాగైనా వారిని బ్రిటిషు సామ్రాజ్యానికి అనుకూలురుగా చేయాలని చేసిన ప్రయత్నాలు బెంగాల్ విభజనతో వాస్తవరూపం దాల్చినట్టయింది. 19వ శతాబ్ది చివరి భాగంలో హిందువులకు అధికారంలో మరింత భాగస్వామ్యం లభిస్తూండడం, ఆపైన హిందీ-ఉర్దూ వివాదం చెలరేగడం, గోవధ వ్యతిరేకోద్యమాలు జరగడం వంటి వాటితో ఉత్తరప్రదేశ్ ముస్లిముల్లో భయాలు, రాజకీయ ఆకాంక్షలూ ప్రబలమయ్యాయి. 1905లో బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా ఉద్యమకారులు (ప్రధానంగా హిందువులు) వందేమాతరం నినాదాన్ని చేపట్టడంతో ఆ నినాదం ఉన్న పద్యం హిందూ ముస్లిం వివాదాలకు సంబంధించిన ఆనంద్ మఠ్ నవలలోదన్న విషయాన్ని రాజకీయ నాయకులు బయటకు తీశారు. ఢాకా నవాబ్ ఖ్వాజా సలీముల్లా వంటివారి రాజకీయ ఆకాంక్షలు కూడా వీటికి తోడయ్యాయి. కాంగ్రెసు బెంగాల్ విభజనను వ్యతిరేకిస్తూండగా సలీముల్లా తూర్పు బెంగాల్, అస్సాం ప్రాంతాల్లో విభజనకు అనూకూలంగా సభలు, సమావేశాలు నిర్వహించారు.

లక్నో ఒప్పందం[మార్చు]

1911లో వందేమాతరం ఉద్యమం ఫలితంగా బ్రిటిషు ఇండియా ప్రభుత్వం బెంగాల్ ను తిరిగి ఏకీకరించడం ముస్లిం లీగ్ లోనూ, ఆ పార్టీ నాయకత్వంలోనూ బ్రిటిషు ప్రభుత్వంపై అపనమ్మకాన్ని ఏర్పరిచింది. టర్కీ, జర్మనీలకు వ్యతిరేకంగా పోరాడిన దేశాల్లో బ్రిటన్ కూడా ఉంది. తరచుగా మక్కా, మదీనా, జెరూసలేం వంటి ముస్లిం పవిత్ర స్థలాల రక్షణ బాధ్యతను ప్రకటించుకుంటూండే టర్కీ సుల్తాన్ లేదా ఖలీఫా మొదటి ప్రపంచయుద్ధంలో బ్రిటిషు వారికి వ్యతిరేకంగా పోరాడడం కూడా కారణమయింది. బ్రిటన్, దాని మిత్రరాజ్యాలు టర్కీతో యుద్ధం సాగిస్తుండడంతో అప్పటికే బెంగాల్ పునరేకీకరణ సమయంలో ఏర్పడ్డ అపనమ్మకాలు ధ్రువపడి, బ్రిటిషు ప్రభుత్వం మతపరమైన తటస్థవైఖరి అవలంబించట్లేదని ముస్లిం లీగ్ భావించింది.

మరోవైపు మొదటి ప్రపంచ యుద్ధంలో భారీ సంఖ్యలో భారతీయ సైనికులు బ్రిటన్ పక్షాన పాల్గొనడం, బ్రిటన్ విజయానంతరం ప్రపంచవ్యాప్తంగా నానాజాతి సమితిలోనూ, వింటర్ ఒలింపిక్స్ లోనూ బ్రిటిషు ఇండియాను ఒక రాజ్యంగా గుర్తించడం వంటి పరిణామాలు జరిగాయి. ఈ నేపథ్యంలో భారత జాతీయ కాంగ్రెసు జాతీయోద్యమాన్ని మరింత విస్తృతపరిచి స్వయం పరిపాలన కోసం డిమాండ్ ను తీవ్రతరం చేయడం ప్రారంభించింది. 1916లో లక్నోలో జరిగిన కాంగ్రెసు సమావేశాలు ముస్లింలీగ్, కాంగ్రెసు పరస్పర సహకారం అనే అనూహ్య పరిణామానికి తెరతీసింది. కొందరు ముస్లింలీగ్ నాయకులు వ్యతిరేకించిన ప్రధానంగా లీగ్ లోని యువతరం ఈ లక్నో ఒప్పందానికి మద్దతు తెలిపింది. ప్రధానంగా యునైటెడ్ ప్రావిన్సుకు చెందిన అలీ సోదరులుగా ప్రఖ్యాతులైన మౌలానా మహమ్మద్ అలీ, మౌలానా షౌకత్ అలీలు, వారి యువ అనుచరులు దీన్ని సాధ్యపరచేందుకు లీగ్ పరంగా కృషిచేశారు. ఈ ఒప్పందాన్ని అప్పటికి యువ న్యాయవాది, తర్వాతికాలంలో భారత జాతీయోద్యమంలోనూ, లీగ్ లోనూ, పాకిస్తాన్ ఏర్పాటు ఉద్యమంలోనూ కీలక స్థానం పొందిన జిన్నా సమర్థించాడు.

ఈ ఒప్పందం ప్రకారం భారత జాతీయోద్యమానికి ముస్లింలీగ్ సహకరించడం, ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లోనే కాక, ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో కూడా మతపరమైన ప్రత్యేక నియోజకవర్గాలను ముస్లింలకు ఇచ్చేలా అంగీకరించారు. ఏర్పడిన కొన్నేళ్ళకు ఒప్పందం పూర్తి స్వభావం బయటపడింది - ఇది అప్పటికే మెజారిటీతో ఉండి ఎలాగూ గెలిచే పంజాబ్, తూర్పు బెంగాల్ ముస్లిములకు ప్రయోజనం లేకపోగా యునైటెడ్ ప్రావిన్స్, బొంబాయి, మద్రాస్ వంటి ప్రావిన్సుల్లో మైనారిటీలుగా ఉన్న ముస్లిములకు మాత్రం రాజకీయంగా ప్రయోజనకరం.

మాంటేగు-చెమ్స్‌ఫోర్డ్ సంస్కరణలు: 1919[మార్చు]

మునుపటి శీతాకాలంలో భారతదేశంలో చేసిన సుదీర్ఘమైన నిజనిర్ధారణ పర్యటన తరువాత భారత వ్యవహారాల కార్యదర్శి మోంటేగు, వైస్రాయ్ లార్డ్ చెమ్స్‌ఫోర్డ్ లు 1918 జూలైలో తమ నివేదికను సమర్పించారు.[9] బ్రిటన్లో ప్రభుత్వం, పార్లమెంటు దీనిపై చర్చించింది. భవిష్యత్ ఎన్నికలలో భారత జనాభాలో ఎవరెవరు ఓటు వేయవచ్చో గుర్తించడానికి ఫ్రాంచైజ్ అండ్ ఫంక్షన్స్ కమిటీ మరో పర్యటన చేసింది. ఆ తరువాత, 1919 డిసెంబరులో భారత ప్రభుత్వ చట్టం 1919 (దీనిని మోంటేగు-చెమ్స్‌ఫోర్డ్ సంస్కరణలు అని కూడా పిలుస్తారు) ని బ్రిటను పార్లమెంటు ఆమోదించింది.[9] కొత్త చట్టం ప్రాంతీయ, ఇంపీరియల్ శాసనమండళ్ళు రెండింటినీ విస్తరించింది. సభలో ఓటింగులో వ్యతిరేకంగా ఫలితం వచ్చిన సందర్భంలో బ్రిటిషు భారత ప్రభుత్వం దాన్ని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ఉన్న "అధికారిక మెజారిటీ" పద్ధతిని రద్దు చేసింది.[9] రక్షణ, విదేశీ వ్యవహారాలు, క్రిమినల్ లా, కమ్యూనికేషన్స్, ఆదాయపు పన్ను వంటి విభాగాలను వైస్రాయ్, కేంద్ర ప్రభుత్వాలు నిలుపుకున్నప్పటికీ, ప్రజారోగ్యం, విద్య, భూమి-రాబడి, స్థానిక స్వపరిపాలన వంటి ఇతర విభాగాలను రాష్ట్రాలకు బదిలీ చేసారు.[9] ప్రాదేశిక ప్రభుత్వాలు ఇప్పుడు ద్వంద్వ ప్రభుత్వ పద్ధతిలో ఉంటాయి. నీటి పారుదల, విద్య, వ్యవసాయం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, స్థానిక స్వయం పరిపాలన వంటి కొన్ని అంశాలు భారతీయ మంత్రులు, అంతిమంగా భారతీయ ఓటర్ల చేతిలో ఉండగా, భూమి-శిస్తు, పోలీసులు, జైళ్లు, మీడియా నియంత్రణలు బ్రిటిషు గవర్నరు, అతని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ పరిధిలో ఉంటాయి.[9] కొత్త చట్టం వలన భారతీయులు, సివిల్ సర్వీసులోను ఆర్మీ ఆఫీసర్ కార్ప్స్ లోనూ చేరడం సులభతరమైంది.

ఇప్పుడు మరింత మంది భారతీయులకు వోటు హక్కు వచ్చింది. అయితే, జాతీయ స్థాయిలో ఓటు వేయడానికి, మొత్తం వయోజన పురుష జనాభాలో 10% మాత్రమే హక్కు ఉంది. వీరిలో చాలామంది నిరక్షరాస్యులు.[9] ప్రాంతీయ శాసనసభలలో, బ్రిటిషు వారు తమకు సహకరించే, లేదా తామకు ఉపయోగపడే అంశాల కోసం సీట్లను కేటాయించడం ద్వారా కొంత నియంత్రణను అట్టిపెట్టుకున్నారు. ముఖ్యంగా, బ్రిటిషు పాలన పట్ల సానుభూతిగా ఉంటూ, పెద్దగా ఘర్షణ పడని గ్రామీణ అభ్యర్థులకు, పట్టణ అభ్యర్థుల కంటే ఎక్కువ సీట్లు కేటాయించారు.[9] బ్రాహ్మణేతరులు, భూ యజమానులు, వ్యాపారవేత్తలు, కళాశాల గ్రాడ్యుయేట్లకు కూడా సీట్లు కేటాయించారు. మింటో-మోర్లే సంస్కరణల అంతర్భాగంగాను, ఇటీవలి కాంగ్రెస్-ముస్లిం లీగ్ లక్నో ఒప్పందంలోనూ ఉన్న "మత ప్రాతినిధ్యా"న్ని పునరుద్ఘాటించారు. ముస్లింలు, సిక్కులు, భారతీయ క్రైస్తవులు, ఆంగ్లో-ఇండియన్లు, ఇక్కడ స్థిరపడ్డ యూరోపియన్లకూ ప్రావిన్షియల్ ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్‌లో సీట్లు కేటాయించారు.[9] మోంటేగు-చెమ్స్‌ఫోర్డ్ సంస్కరణలు భారతీయులకు శాసన అధికారాన్ని వినియోగించుకోవడానికి అత్యంత ముఖ్యమైన అవకాశాన్ని కలిగించాయి -ముఖ్యంగా ప్రాంతీయ స్థాయిలో; అయితే, అర్హతగల ఓటర్ల సంఖ్య ఇంకా తక్కువగానే ఉండడం, ప్రాంతీయ శాసనసభలకు ఉన్న చిన్న చిన్న బడ్జెట్లు, బ్రిటిషు నియంత్రణ సాధనంగా భావించే గ్రామీణ సీట్ల వలన ఆ అవకాశం పరిమితమై పోయింది.[9]

రెండు దేశాల సిద్ధాంతం[మార్చు]

భారత ఉపఖండంలోని ముస్లింల ప్రాథమిక గుర్తింపు, వారిని ఐక్యపరచే అంశం వారి భాష కాదు, జాతీ కాదు - వారి మతం. అదే రెండు దేశాల సిద్ధాంతానికి ప్రాతిపదిక. అందువల్ల హిందువులు, ముస్లింలు సామాన్యతలతో సంబంధం లేకుండా రెండు విభిన్న దేశాల్లాంటి వారు. పాకిస్తాన్ ఉద్యమానికీ (అంటే దక్షిణాసియాలో ఒక ముస్లిం దేశంగా ఉండడం అనే భావజాలం) 1947 లో భారతదేశ విభజనకూ రెండు దేశాల సిద్ధాంతమే మూల సూత్రం.[10]

భారతీయ ముస్లింల జాతీయతను నిర్వచించేది మతమే అనే భావజాలాన్ని ముహమ్మద్ అలీ జిన్నా చేపట్టాడు. దీనిని, పాకిస్తాన్ ఏర్పాటు కోసం ముస్లింలకు మేల్కొలుపు అని పేర్కొన్నాడు.[11] ఈ భావజాలమే - భారత ముస్లిములు విదేశీయులని, రెండవ తరగతి పౌరులని, భారతదేశం నుండి ముస్లింలను బహిష్కరించడం, హిందూ దేశ స్థాపన, ఇస్లాం మతంలోకి మారడాన్ని నిషేధించడం, భారతీయ ముస్లింలను హిందూ మతంలోకి మార్చడం లేదా తిరిగి మార్చడాన్ని ప్రోత్సహించడం వంటి ఆలోచనలు పలు హిందూ జాతీయవాద సంస్థల్లో రేకెత్తడానికి కారణమైంది.

ముస్లిం, ముస్లిమేతర జనాభా ప్రాతిపదికన భారతదేశాన్ని విభజించాలని డిమాండ్ చేసిన మొదటి వ్యక్తులలో హిందూ మహాసభ నాయకుడు లాలా లజపత్ రాయ్ ఒకడు. అతను 1924 డిసెంబరు 14 లో ది ట్రిబ్యూన్ పత్రికలో రాశాడు:

నా పథకం ప్రకారం ముస్లింలకు నాలుగు ముస్లిం రాష్ట్రాలు ఉంటాయి: (1) పఠాన్ ప్రావిన్స్ లేదా వాయువ్య సరిహద్దు; (2) పశ్చిమ పంజాబ్ (3) సింధ్ (4) తూర్పు బెంగాల్. భారతదేశం లోని మరే ఇతర ప్రాంతంలోనైనా చిన్న ముస్లిం సమాజం ఉంటే, అది ఒక ప్రావిన్స్ ఏర్పడటానికి సరిపడేంత పెద్దదైతే, వారిని కూడా అదేవిధంగా ఏర్పరచాలి. అయితే ఇది ఐక్య భారతదేశం కాదని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అంటే ముస్లిం భారతదేశం, ముస్లిమేతర భారతదేశంగా భారతదేశాన్ని స్పష్టంగా విభజించడం.[12]

రెండు జాతీయతా సిద్ధాంతాలు ఒక భూభాగంలో సహజీవనం చేయగలవా లేదా అనే దానిపై ఆధారపడి, రెండు దేశాల సిద్ధాంతానికి భిన్నమైన వ్యాఖ్యానాలు ఉన్నాయి. వీటికి భిన్నమైన పర్యవసానాలున్నాయి. భారత ఉపఖండంలోని ముస్లిం-మెజారిటీ ప్రాంతాలకు విడిపోయే హక్కుతో సహా సార్వభౌమ స్వయంప్రతిపత్తి ఉండాలని ఒక వ్యాఖ్యానం చెప్పింది. ఇందులో జనాభా బదిలీ ఉండదు (అంటే హిందువులు ముస్లింలు కలిసి జీవించడం కొనసాగుతుంది). హిందూ ముస్లింలవి "రెండు విభిన్నమైన, విరుద్ధమైన జీవన విధానాలు. అందువల్ల వారు ఒకే దేశంలో సహజీవనం చేయలేరు" అని మరో వ్యాఖ్యానం చెప్పింది. ఈ ఆలోచనలో, జనాభా బదిలీ (అనగా, ముస్లిం-మెజారిటీ ప్రాంతాల నుండి హిందువులను మొత్తం తొలగించడం, హిందూ-మెజారిటీ ప్రాంతాల నుండి ముస్లింలను మొత్తం తొలగించడం) అనేది, "సామరస్యంగా సహజీవనం చేయలేని" రెండు అననుకూల దేశాలను పూర్తిగా వేరుచేయడానికి ఆవశ్యకమైన చర్య"

ఈ సిద్ధాంతానికి వ్యతిరేకత రెండు మూలాల నుండి వచ్చింది. మొదటిది అఖండ భారతదేశం అనే భావన. అందులో హిందువులు ముస్లింలు రెండు ఒకరితో ఒకరు ముడిపడి ఉంటారు. ఇది ఆధునిక, అధికారికంగా లౌకిక, భారత గణతంత్రానికి మూల సూత్రం. పాకిస్తాన్ ఏర్పడిన తరువాత కూడా, ముస్లింలు హిందువులు విభిన్న జాతీయులా కాదా అనే చర్చ ఆ దేశంలో కూడా జరుగుతోంది. వ్యతిరేకతకు రెండవ మూలం ఏమిటంటే, భారతీయులు ఒక దేశం కానట్లే, ఉపఖండంలోని ముస్లింలూ హిందువులూ కూడా ఒక దేశం కాదు. ఉపఖండంలోని సజాతీయ ప్రాంతీయ భూభాగాలే నిజమైన దేశాలవుతాయి. ఇవే సార్వభౌమత్వానికి అర్హమైనవి; పాకిస్తాన్ లోని బలూచ్, సింధి, పష్తూన్‌లు భారత్ లోని అస్సామీ [13] పంజాబీ [14] ఉప జాతీయులు దీనికి ఉదాహరణలు.

ముస్లిం మాతృభూమి, ప్రాంతీయ ఎన్నికలు, రెండవ ప్రపంచ యుద్ధం, లాహోర్ తీర్మానం: 1930-1945[మార్చు]

1940[permanent dead link]లో కాంగ్రెసు రామ్‌గఢ్ సమావేశంలో జవహర్‌లాల్ నెహ్రూ, సరోజిని నాయుడు, ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్, మౌలానా ఆజాద్ పాల్గొన్నారు, ఇందులో ఆజాద్ రెండవసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు
[permanent dead link]అఖిల భారత ముస్లిం లీగ్ 1940 లాహోర్ తీర్మానాన్ని జిన్నా (కుడి) అధ్యక్షత వహించి, లియాఖత్ అలీ ఖాన్ మధ్యలో చౌదరి ఖాలిక్జ్జామన్ (ఎడమ)

1933 లో చౌదరి రహమత్ అలీ నౌ ఆర్ నెవర్ పేరుతో ఒక కరపత్రాన్ని తయారుచేసాడు. అయితే, అది రాజకీయ దృష్టిని ఆకర్షించలేదు. [15] ఇందులోనే పంజాబ్, నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ (ఆఫ్ఘనియా), కాశ్మీర్, సింధ్, బలూచిస్తాన్ లతో కలిపిన " పాకిస్తాన్ ", "స్వచ్ఛమైన భూమి", భావనను మొదటిసారిగా ప్రకటించారు. కొన్నాళ్ళ తరువాత, భారత రాజ్యాంగ సంస్కరణలపై పార్లమెంటరీ కమిటీని కలిసిన ఒక ముస్లిం ప్రతినిధి బృందం, పాకిస్తాన్ ఆలోచన "భ్రమ" అని, "అసాధ్యమైనద"నీ చెప్పింది. [15] 1932 లో, "అణగారిన తరగతులకు" కేంద్ర, ప్రాంతీయ శాసనసభలలో ప్రత్యేక ప్రాతినిధ్యం వహించాలన్న డాక్టర్ అంబేద్కర్ డిమాండ్‌ను బ్రిటిషు ప్రధాన మంత్రి రామ్‌సే మెక్‌డొనాల్డ్ అంగీకరించారు. హిందూ కుల నాయకత్వాన్ని బలహీనపరిచే అవకాశం ఉన్నందున ముస్లిం లీగ్ ఈ అవార్డుకు మొగ్గు చూపింది. అయితే, దళిత హక్కులకు ప్రముఖమైన మద్దతుదారుగా కనిపించిన మహాత్మా గాంధీ ఈ అవార్డును రద్దు చేయమని బ్రిటిషు వారిని ఒప్పించడానికి ఉపవాస దీక్ష చేసాడు. గాంధీ ప్రాణాలకు ముప్పు ఉందనిపించి, అంబేద్కర్ వెనక్కి తగ్గాల్సి వచ్చింది.[16]

రెండు సంవత్సరాల తరువాత, భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రాంతీయ స్వయంప్రతిపత్తిని ప్రవేశపెట్టింది. భారతదేశంలో ఓటర్ల సంఖ్య 3.5 కోట్లకు పెరిగింది. [17] మరింత ముఖ్యంగా, శాంతిభద్రతల సమస్య మొదటిసారిగా బ్రిటిషు అధికారం నుండి భారతీయుల నేతృత్వంలోని ప్రాంతీయ ప్రభుత్వాలకు బదిలీ అయింది. [17] దీంతో హిందూ ఆధిపత్యం పట్ల ముస్లిముల్లో ఉన్న ఆందోళనలు పెరిగాయి. [17] 1937 భారత ప్రాంతీయ ఎన్నికలలో, ముస్లిం లీగ్ యునైటెడ్ ప్రావిన్సెస్ వంటి ముస్లిం-మైనారిటీ ప్రావిన్సులలో ఉత్తమ ప్రదర్శన కనబరిచింది. ఇక్కడ 64 రిజర్వు చేసిన ముస్లిం సీట్లలో 29 స్థానాలను గెలుచుకుంది. [17] అయితే, పంజాబ్ బెంగాల్‌ల ముస్లిం-మెజారిటీ ప్రాంతాలలో ప్రాంతీయ పార్టీలు లీగ్‌పై పైచేయి సాధించాయి. [17] పంజాబ్ లో సికందర్ హయత్ ఖాన్ నాయకత్వం లోని యూనియనిస్ట్ పార్టీ ఎన్నికల్లో గెలిచి భారత జాతీయ కాంగ్రెస్, శిరోమణి అకాలీ దళ్ ల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఐదు సంవత్సరాలు పాలించింది. [17] బెంగాల్‌లో, క్రిషక్ ప్రజా పార్టీ నాయకుడు ఎకే ఫజ్లుల్ హుక్ నేతృత్వంలోని సంకీర్ణంలో లీగ్ అధికారాన్ని పంచుకోవలసి వచ్చింది . [17]

మరోవైపు, మొత్తం 1585 ప్రావిన్షియల్ అసెంబ్లీ స్థానాల్లో 716 చోట్ల విజయం సాధించి కాంగ్రెస్, బ్రిటిషు ఇండియాలోని 11 ప్రావిన్సులలోను, ఏడింటిలో ప్రభుత్వాలను ఏర్పాటు చేయగలిగింది. [17] ఆర్థిక సామాజిక సమస్యల కంటే మతపరమైన సమస్యలకు ప్రజలు తక్కువ ప్రాముఖ్యతనిస్తారని కాంగ్రెసు తన మ్యానిఫెస్టోలో పేర్కొంది. అయితే, మొత్తం 482 ముస్లిం స్థానాల్లో కేవలం 58 స్థానాల్లో కాంగ్రెసు పోటీ చేయగా, వీటిలో 26 సీట్లలో మాత్రమే గెలిచింది. [17] కాంగ్రెసు గెలిచిన యుపిలో, లీగ్‌తో అధికారాన్ని పంచుకునేందుకు ముందుకొచ్చింది - కానీ లీగ్ ముస్లింలకు మాత్రమే ప్రతినిధిగా పనిచేయడం ఆపివేయాలి అనే షరతుతో. లీగ్ అందుకు నిరాకరించింది [17] ఇది ముస్లిం ప్రజల నుండి కాంగ్రెస్‌ను మరింత దూరం చేసింది. ఈ షరతు పెట్టడం పొరపాటని తేలింది. అంతేకాకుండా, కొత్త యుపి రాష్ట్ర ప్రభుత్వం గోరక్షణను, హిందీ వాడకాన్నీ ప్రకటించింది. [17] కొత్త కాంగ్రెసు పాలనలో కొన్నిసార్లు ప్రభుత్వ భవనాల్లోకి పెద్ద సంఖ్యలో గ్రామీణ ప్రజలు చేరడంతో, సామాన్యులెవరో, అధికారులెవరో చట్టాన్ని అమలు చేసే వ్యక్తులెవరో తెలీకుండా పోయేది. అస్తవ్యస్తమైన ఈ దృశ్యాలను చూసినపుడు యుపిలో ఉన్నత వర్గ ముస్లింలు కాంగ్రెసుకు మరింత దూరమయ్యారు. [18]

కాంగ్రెసు పాలనలో ఉన్న ముస్లింల పరిస్థితులపై ముస్లిం లీగ్ తన దర్యాప్తు నిర్వహించింది. [19] ఇటువంటి పరిశోధనల ఫలితాలు భవిష్యత్ హిందూ ఆధిపత్యం పట్ల ముస్లిం ప్రజలలో భయాన్ని పెంచాయి. [19] కాంగ్రెసు ఆధిపత్యం కలిగిన స్వతంత్ర భారతదేశంలో ముస్లింల పట్ల అన్యాయంగా ప్రవర్తిస్తారనే అభిప్రాయం ఇప్పుడు ముస్లింల బహిరంగ చర్చల్లో ఒక భాగం. [19] 1939 లో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమవగానే, వైస్రాయ్ లార్డ్ లిన్‌లిత్‌గో, భారతీయ నేతలతో చర్చలేమీ లేకుండానే, భారతదేశం తరపున యుద్ధప్రకటన చెయ్యడంతో, దానికి నిరసనగా కాంగ్రెసు ప్రాదేశిక మంత్రులు రాజీనామా చేసారు. [19] దీనికి విరుద్ధంగా, ముస్లిం లీగ్, [20] "విమోచన దినం", వేడుకలు (కాంగ్రెసు ఆధిపత్యం నుండి) నిర్వహించింది. యుద్ధ ప్రయత్నంలో బ్రిటన్‌కు మద్దతు ఇచ్చింది. [19] లిన్‌లిత్‌గో జాతీయవాద నాయకులతో కలిసినప్పుడు, అతను గాంధీకి ఇచ్చిన స్థాయినే, జిన్నాకూ ఇచ్చాడు. ఒక నెల తరువాత కాంగ్రెసును "హిందూ సంస్థ"గా అభివర్ణించాడు. [20]

1940 మార్చి లో, లాహోర్లో జరిగిన లీగ్ వార్షిక మూడు రోజుల సమావేశంలో, జిన్నా ఇంగ్లీషులో రెండు గంటల ప్రసంగం చేసాడు. చరిత్రకారులు టాల్బోట్, సింగ్ మాటలలో చెప్పాలంటే, ఆ ప్రసంగంలో ద్విజాతి సిద్ధాంత వాదనలు ఉన్నాయి. "ముస్లింలు, హిందువులు ... ఒకదానికొకటి ఏమాత్రమూ సరిపడని ఏకమత సమాజాలు. ముస్లిముల ఆకాంక్షలను సంతృప్తిపరచని ఏ పరిష్కారాన్నీ వారిపై రుద్దలేరు." [19] సమావేశాల చివరి రోజున, లాహోర్ రిజల్యూషన్ను లీగ్ ఆమోదించింది. దీన్నే కొన్నిసార్లు "పాకిస్తాన్ రిజల్యూషన్" అని కూడా పిలుస్తారు. [19] "భారతదేశం లోని వాయవ్య, తూర్పు మండలాల్లో లాగా ముస్లింలు సంఖ్యాపరంగా మెజారిటీ ఉన్న ప్రాంతాలన్నిటినీ స్వతంత్ర దేశాలుగా ఉండటానికి సమూహం చేయాలి. ఇందులో రాజ్యాంగ యూనిట్లు స్వయంప్రతిపత్తి, సార్వభౌమత్వం కలిగి ఉంటాయి." లీగ్‌ను స్థాపించి మూడు దశాబ్దాలు గడిచినా, రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో మాత్రమే దక్షిణాసియా ముస్లింల మద్దతు పొందింది.[21]

యుద్ధం తరువాత భారతదేశానికి డొమినియన్ హోదా ఇవ్వాలని వైస్రాయ్ 1940 ఆగస్టులో లిన్‌లిత్‌గో ప్రతిపాదించాడు. అతడు పాకిస్తాన్ ఆలోచనను సీరియస్‌గా తీసుకోలేదు. జిన్నా కోరుకున్నది హిందూ ఆధిపత్యం లేని సమాఖ్యేతర ఏర్పాటు అని లిన్‌లిత్‌గో భావించాడు. హిందూ ఆధిపత్యం గురించి ముస్లింలలో భయాలను తొలగించడానికి, భవిష్యత్ రాజ్యాంగం మైనారిటీల అభిప్రాయాలను పరిశీలిస్తుందనే వాగ్దానంతో 'ఆగస్టు ఆఫర్' వచ్చింది.[22] కాంగ్రెస్, ముస్లిం లీగ్ లు రెండూ ఈ ప్రతిపాదనపై సంతృప్తి చెందలేదు. ఇద్దరూ దీనిని సెప్టెంబరులో తిరస్కరించారు. కాంగ్రెసు మరోసారి శాసనోల్లంఘన కార్యక్రమాన్ని ప్రారంభించింది.[23]

1942 మార్చి లో, సింగపూర్ పతనం తరువాత జపనీయులు మలయా ద్వీపకల్పంలోకి వేగంగా వెళ్లడంతో, [20] అమెరికన్లు భారతదేశ స్వాతంత్ర్యాన్ని సమర్ధిస్తూండడంతో, [24] బ్రిటన్ యుద్ధకాల ప్రధాన మంత్రి విన్స్టన్ చర్చిల్, సర్ స్టాఫోర్డ్ క్రిప్స్‌ను కాంగ్రెసుతో రాయబారానికి భారతదేశం పంపాడు. యుద్ధ ప్రయత్నాలకు కాంగ్రెసు మద్దతు ఇస్తే, అందుకు ప్రతిఫలంగా యుద్ధం ముగిసాక, భారతదేశానికి డొమినియన్ హోదా ఇస్తామనేది ఆ రాయబారం. [25] తాము ఇప్పటికే మద్దతు దక్కించుకున్న మితుల - ముస్లిం లీగ్, పంజాబ్ యూనియన్లు, సంస్థానాధీశులు - మద్దతును కోల్పోకుండా ఉండేందుకు క్రిప్స్, బ్రిటిషు ఇండియన్ సామ్రాజ్యంలో ఏ భాగాన్ని కూడా, ఆ డొమినియన్‌లో చేరాలని బలవంతం చేయమని పేర్కొన్నాడు. పాకిస్తాన్ సూత్రాన్ని తీర్చడంలో ఈ నిబంధన సరిపోదని భావించి లీగ్ ఈ ప్రతిపాదనను తిరస్కరించింది.[26] ఆ నిబంధన కారణంగా, కాంగ్రెసు కూడా ఈ ప్రతిపాదనలను తిరస్కరించింది. 1885 లో మర్యాదపూర్వక న్యాయవాదుల సమూహంగా మొదలైనప్పటి నుండీ, [27] తాను అన్ని విశ్వాసాలకు చెందిన భారతీయులందరికీ ప్రతినిధిగా కాంగ్రెసు భావిస్తూ వస్తోంది. [25] 1920 లో భారతీయ జాతీయవాదపు వ్యూహకర్త గాంధీ వచ్చి, [28] కాంగ్రెసును కోట్ల మంది ప్రజల జాతీయవాద ఉద్యమంగా మార్చేసాడు. [27] 1942 ఆగస్టు లో, కాంగ్రెసు క్విట్ ఇండియా తీర్మానాన్ని ప్రారంభించింది, ఇది తీవ్రమైన రాజ్యాంగ మార్పులను కోరింది. 1857 లో భారత తిరుగుబాటు తరువాత బ్రిటిషు వారు తమ పాలనకు ఇదే అత్యంత తీవ్రమైన ముప్పుగా భావించారు. [25] ప్రపంచ యుద్ధం ద్వారా వారి వనరులు, శ్రద్ధ ఇప్పటికే చిక్కిపోవడంతో, బ్రిటిషు వారు వెంటనే కాంగ్రెసు నాయకులను జైలులో పెట్టారు. 1945 ఆగస్టు వరకు జైలులోనే ఉంచారు. [29] అయితే రాబోయే మూడు సంవత్సరాల పాటు దాని సందేశాన్ని ప్రచారం చేసుకునేందుకు ముస్లిం లీగ్ మాత్రం స్వేచ్ఛగానే ఉంది. [20] పర్యవసానంగా, ముస్లిం లీగ్ సభ్యత్వం యుద్ధ సమయంలో పెరిగిందని, జిన్నా స్వయంగా అంగీకరించాడు, "ఎవరూ స్వాగతించని ఈ యుద్ధం, మాకు వరమైంది." [30] అబుల్ కలాం ఆజాద్, ఎకే ఫజులుల్ హక్, వామపక్ష కృషక్ ప్రజా పార్టీ బెంగాల్లో, సికందర్ హయత్‌ ఖాన్ భూస్వామ్య ఆధిపత్యంలో ఉన్న పంజాబ్ యూనియనిస్ట్ పార్టీ, నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్లో కాంగ్రెసు అనుకూల ఖుదాయి ఖిద్మత్‌గార్ (ప్రముఖంగా, "రెడ్ షర్ట్స్") కు చెందిన అబ్దుల్-గఫార్ ఖాన్ వంటి ఇతర ముఖ్యమైన జాతీయ ముస్లిం రాజకీయ నాయకులు ఉన్నప్పటికీ బ్రిటిషు వారు మాత్రం ముస్లిం భారతదేశానికి ప్రధాన ప్రతినిధిగా లీగ్‌నే ఎంచుకున్నారు.[31]

1946 ఎన్నికలు, క్యాబినెట్ మిషన్, డైరెక్ట్ యాక్షన్ డే, విభజన కోసం ప్రణాళిక, స్వాతంత్ర్యం: 1946-1947[మార్చు]

1946 జనవరిలో సాయుధ సేనల్లో తిరుగుబాట్లు జరిగాయి. బ్రిటనుకు చెందిన RAF సైనికులు తమను స్వదేశానికి తిరిగి పంపడం నెమ్మదిగా జరగడంతో నిరాశ చెందారు. వారితో తిరుగుబాట్లు మొదలయ్యాయి.[32] 1946 ఫిబ్రవరిలో బొంబాయిలో రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటుతో పుంజుకున్నాయి. కలకత్తా, మద్రాస్, కరాచీలలో కూడా అందుకున్నాయి. తిరుగుబాట్లను వేగంగా అణచివేసినప్పటికీ, అవి అట్లీ ప్రభుత్వాన్ని చర్యకు ప్రేరేపించాయి. లేబర్ పార్టీ ప్రధాన మంత్రి క్లెమెంట్ అట్లీకి 1920 ల నుండి భారత స్వాతంత్ర్యం పట్ల ఆసక్తి ఉంది. అనేక సంవత్సరాలుగా దీనికి మద్దతు ఇస్తూ వచ్చాడు. అతను ఇప్పుడు ప్రభుత్వ పదవిని చేపట్టాడు, ఈ సమస్యకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చాడు. భారత విదేశాంగ కార్యదర్శి లార్డ్ పెథిక్ లారెన్స్ నేతృత్వంలో ఒక క్యాబినెట్ మిషన్ భారతదేశానికి పంపాడు. ఇందులో సర్ స్టాఫోర్డ్ క్రిప్స్ కూడా ఉన్నాడు. క్రిప్స్ అంతకు నాలుగేళ్ళ ముందు కూడా భారతదేశాన్ని సందర్శించాడు. స్వాతంత్ర్యానికి క్రమబద్ధమైన బదిలీకి ఏర్పాట్లు చేయడమే మిషన్ లక్ష్యం.[32]

1946 ప్రారంభంలో, భారతదేశంలో ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు ప్రకటించడంతో ముస్లిం ఓటర్లు ఐక్య భారతదేశం, లేదా విభజన - ఈ రెంటిలో ఒకదాన్ని ఎన్నుకోవలసి వచ్చింది.[33] 1945 లో యుద్ధం ముగింపులో, దేశద్రోహ ఆరోపణలు ఎదుర్కొన్న సుభాస్ చంద్రబోస్కు చెందిన భారత జాతీయ సైన్యం లోని ముగ్గురు సీనియర్ అధికారులపై బహిరంగ విచారణను వలస ప్రభుత్వం ప్రకటించింది. విచారణలు ప్రారంభమైనప్పుడు, అంతకు ముందు ఎప్పుడూ ఐఎన్‌ఎకు మద్దతు ఇవ్వని కాంగ్రెసు నాయకత్వం, నిందితులైన అధికారులను రక్షించాలని తలపెట్టింది.[34] అధికారులపై నేరారోపణలు, దానికి వ్యతిరేకంగా ప్రజల ఆగ్రహం, చివరికి శిక్షల నుండి ఉపశమనం వలన కాంగ్రెస్‌కు సానుకూల ప్రచారం లభించింది. తదుపరి జరిగిన ఎన్నికల్లో పదకొండు ప్రావిన్సులలో ఎనిమిదింటిలో పార్టీ విజయాలను గెలుచుకోవడానికి ఇది దోహదపడింది.[35] కాంగ్రెసు, ముస్లిం లీగ్ మధ్య చర్చలు విభజన సమస్యపై తడబడ్డాయి.

చాలా మంది హిందువులకు సంబంధించి, బ్రిటిషు పాలన చట్టబద్ధతను కోల్పోయింది. దీనికి నిశ్చయాత్మకమైన రుజువు 1946 ఎన్నికల రూపంలో వచ్చింది. ముస్లిమేతర నియోజకవర్గాలలో కాంగ్రెసు 91 శాతం ఓట్లను గెలుచుకుంది. తద్వారా కేంద్ర శాసనసభలో మెజారిటీ సాధించింది. ఎనిమిది ప్రావిన్సుల్లోప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. చాలా మంది హిందువులకు బ్రిటిషు ప్రభుత్వానికి చట్టబద్ధమైన వారసుడు కాంగ్రెస్సే. ఒకవేళ, బ్రిటిషు వారు భారతదేశాన్నీ వదలకుండా పాలిస్తూనే ఉండాలని అనుకుని ఉంటే, రాజకీయంగా చురుకైన భారతీయులను బ్రిటిషు పాలనకు అంగీకరింపజేయడం ఈ ఎన్నికల ఫలితాల తరువాత వారికి కష్టమయ్యేది. అయితే, చాలా మంది గ్రామీణ భారతీయుల అభిప్రాయాలు ఆ సమయంలో కూడా అనిశ్చితంగానే ఉన్నాయి.[36] ముస్లిం లీగ్ ముస్లిం ఓట్లతో పాటు ప్రాంతీయ అసెంబ్లీలలో రిజర్వు చేసిన ముస్లిం సీట్లలోఎక్కువ భాగాన్ని గెలుచుకుంది. ఇది కేంద్ర అసెంబ్లీలో ముస్లిం సీట్లన్నిటినీ దక్కించుకుంది. చివరకు ముస్లిం లీగ్, జిన్నాలు మాత్రమే భారతదేశ ముస్లింలకు ప్రాతినిధ్యం వహిస్తారనే వాదనను లీగ్ పటిష్ఠం చెయ్యగలిగింది [37] జిన్నా ఈ ఓటును ప్రత్యేక మాతృభూమి కోసం ప్రజాదరణ పొందిన డిమాండ్‌గా చిత్రించాడు.[38] అయితే, సింధ్, బెంగాల్ రెండు ప్రావిన్సుల వెలుపల ముస్లిం లీగ్ మంత్రిత్వ శాఖలను ఏర్పాటు చేయలేకపోగా, కాంగ్రెసు NWFP లో ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. సిక్కులు యూనియనిస్టులతో కలిసి కాంగ్రెస్, పాంజాబులో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.[39]

బ్రిటిషు వారు ప్రత్యేక ముస్లిం మాతృభూమిని ఆమోదించ లేదు గానీ, భారత ముస్లింల తరపున మాట్లాడటానికి ఒకే స్వరం ఉండడంలోని వీలు వారికి నచ్చింది.[40] భారతదేశాన్ని తన 'సామ్రాజ్య రక్షణ' వ్యవస్థలో ఉంచాలంటే భారతదేశం, దాని సైన్యం ఐక్యంగా ఉండాలని బ్రిటన్ కోరుకుంది.[41][42] భారతదేశంలోని రెండు రాజకీయ పార్టీలు దీన్ని అంగీకరించక పోవడంతో, బ్రిటన్ క్యాబినెట్ మిషన్ ప్రణాళికను రూపొందించింది. ఈ మిషన్ ద్వారా, బ్రిటన్, కాంగ్రెసులు రెండూ కోరుకున్న ఐక్య భారతదేశాన్ని కాపాడాలని భావించారు. అదే సమయంలో పాకిస్తాన్ కోసం జిన్నా చేస్తున్న డిమాండ్ లోని సారాన్ని 'సమూహాల' ద్వారా సాధించదలచారు.[43] క్యాబినెట్ మిషన్ పథకంలో, ప్రావిన్సులన్నీ మూడు సమూహాలుగా ఉండే సమాఖ్య ఏర్పాటు ఉంది. ఈ సమూహాలలో రెండిట్లో ప్రధానంగా ముస్లిం ప్రావిన్సులు ఉంటాయి. మూడవ సమూహం ప్రధానంగా హిందూ ప్రాంతాలతో ఉంటుంది. ప్రావిన్సులు స్వయంప్రతిపత్తి కలిగివుంటాయి. అయితే రక్షణ, విదేశీ వ్యవహారాలు, సమాచార మార్పిడిపై కేంద్రం నియంత్రణను కలిగి ఉంటుంది. ఇవి స్వతంత్ర పాకిస్తాన్‌ను అందించనప్పటికీ, ముస్లిం లీగ్ ఈ ప్రతిపాదనలను అంగీకరించింది. భారతదేశపు ఐక్యత పదిలంగానే ఉన్నా, ఇది కేంద్రాన్ని బలహీనపరుస్తుందని కాంగ్రెసు నాయకులు, ముఖ్యంగా నెహ్రూ, భావించారు. 1946 జూలై 10 న నెహ్రూ "రెచ్చగొట్టే ప్రసంగం" చేస్తూ, ప్రావిన్సులను సమూహపరచాలనే ఆలోచనను తిరస్కరించాడు. క్యాబినెట్ మిషన్ ప్లాన్‌ను, ఐక్య భారతదేశం అవకాశాలు రెండింటినీ "సమర్థవంతంగా తుత్తునియలు చేసేసాడు".[44]

కేబినెట్ మిషన్ విఫలమైన తరువాత, బ్రిటిషు ఇండియాలో ముస్లిం మాతృభూమికి ఉన్న డిమాండ్‌ను శాంతియుతంగా ఎత్తిచూపే లక్ష్యంతో జిన్నా 1946 ఆగస్టు 16 ప్రత్యక్ష కార్యాచరణ దినోత్సవాన్ని ప్రకటించారు. అయితే, 16 వ తేదీ ఉదయం, కలకత్తాలోని ఓక్టర్లోనీ మాన్యుమెంట్ వద్ద ముస్లిం లీగ్‌కు చెందిన బెంగాల్ ముఖ్యమంత్రి హుస్సేన్ షాహీద్ సుహ్రావార్ది ప్రసంగం వినడానికి సాయుధ ముస్లిం ముఠాలు సమావేశమయ్యాయి. చరిత్రకారుడు యాస్మిన్ ఖాన్ మాటల్లో చెప్పాలంటే, "అతను హింసను స్పష్టంగా ప్రేరేపించకపోయి ఉండవచ్చు, కానీ అతడి మాటల్లో మాత్రం - వారు ఏంచేసినా శిక్ష పడకుండా తప్పించుకోగలరని, పోలీసులను గానీ, మిలిటరీని గానీ పిలవరనీ, నగరంలో వారు చేసే ఏపనులనైనా ప్రభుత్వం పట్టించుకోదనీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా ప్రేక్షకులకు కలిగించింది". [45] అదే రోజు సాయంత్రం, కలకత్తాలో, ఈ సమావేశం నుండి తిరిగి వస్తున్న ముస్లింలు హిందువులపై దాడి చేసారు. వారి చేతుల్లో అంతకుముందు పంచిన కరపత్రాలున్నాయి. ఈ హింసకు, పాకిస్తాన్ డిమాండుకూ మధ్య ఉన్న స్పష్టమైన సంబంధాన్ని ఈ కరపత్రాలు చూపించాయి. హింసకు మూలం ప్రత్యక్ష చర్యా దినోత్సవమేనని సూచించింది. ఈ హింసనే "1946 ఆగష్టు కలకత్తా నరమేధం" అని పిలిచారు. [46] మరుసటి రోజు, హిందువులు తిరగబడ్డారు. హింస మూడు రోజులు కొనసాగింది, ఇందులో హిందువులు ముస్లింలు సుమారు 4,000 మంది మరణించారు (అధికారిక లెక్కల ప్రకారం). భారతదేశంలో ఇంతకుముందు హిందూ ముస్లింల మధ్య మత హింసలు జరిగినప్పటికీ, కలకత్తా హత్యలు " జాతి ప్రక్షాళన " లక్షణాలను ప్రదర్శించిన మొదటి కలహాలివి.[47] హింస ప్రజా రంగానికి మాత్రమే పరిమితం కాలేదు, ఇళ్ళల్లోకి ప్రవేశించి నాశనం చేసారు, మహిళలు పిల్లలపై దాడి చేశారు. [48] భారత ప్రభుత్వం, కాంగ్రేస్ పార్టీ రెండూ ఈ ఘటనలతో క్రక్కదలి పోయినప్పటికీ, సెప్టెంబరులో జవహర్ లాల్ నెహ్రూ ఐక్య భారత ప్రధానిగా, కాంగ్రెసు నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసారు.

మత హింస బీహార్ (హిందువులు ముస్లింలపై దాడి చేసారు), బెంగాల్‌లోని నోఖాలి (ముస్లింలు హిందువులను లక్ష్యంగా చేసుకున్నారు), యునైటెడ్ ప్రావిన్స్‌లోని గర్హ్ముక్తేశ్వర్ (హిందువులు ముస్లింలపై దాడి చేసారు) లకూ వ్యాపించింది. 1947 మార్చిలో రావల్పిండిలో హిందువులపై దాడి చేసి, తరిమేసారు..[49]

బ్రిటిషు ప్రధాన మంత్రి అట్లీ, లార్డ్ లూయిస్ మౌంట్ బాటెన్ను భారతదేశపు చివరి వైస్రాయ్ గా నియమించాడు. విభజనను నివారించడానికీ, యునైటెడ్ ఇండియాను కాపాడటానికీ సూచనలతో 1948 జూన్ నాటికి బ్రిటిషు ఇండియా స్వాతంత్ర్యాన్ని పర్యవేక్షించే పని అతనికి ఇచ్చారు. కనీసమాత్రపు ఎదురుదెబ్బలతో అతడు ఈ పని నిర్వహించాలి. భారతదేశంలో సమాఖ్య ఏర్పాట్ల కోసం క్యాబినెట్ మిషన్ పథకాన్ని పునరుద్ధరించాలని మౌంట్ బాటన్ భావించాడు. కేంద్రాన్ని పరిరక్షించాలన్న ఆసక్తి అతనికి మొదట్లో ఉన్నప్పటికీ, ఉద్రిక్తమైన మతతత్వ పరిస్థితి వలన అధికారాన్ని త్వరగా బదిలీ చేయడం కోసం విభజన అతడికి తప్పనిసరైంది [50][51][52][53]

ముహమ్మద్ అలీ జిన్నా నేతృత్వంలో పెరుగుతున్న ముస్లిం వేర్పాటువాద ఉద్యమానికి పరిష్కారం భారతదేశ విభజనేనని అంగీకరించిన మొదటి కాంగ్రెసు నాయకులలో వల్లభాయ్ పటేల్ ఒకరు. భారతదేశం అంతటా మత హింసను రేకెత్తించిన జిన్నా ప్రత్యక్ష కార్యాచరణ ప్రచారం, రాజ్యాంగ ప్రాతిపదికన హింసను ఆపడానికి తన హోం శాఖ ప్రతిపాదనలను వైస్రాయ్ వీటో చెయ్యడం అతడికి ఆగ్రహం తెప్పించింది. వైస్రాయ్, లీగ్ మంత్రులను ప్రభుత్వంలోకి ప్రవేశపెట్టడాన్ని, కాంగ్రెసు అనుమతి లేకుండా బ్రిటిషు వారు సమూహ పథకాన్ని తిరిగి ధ్రువీకరించడాన్నీ పటేల్ తీవ్రంగా విమర్శించాడు. ముస్లిం లీగ్ పార్టీ కేంద్ర ప్రభుత్వంలో భాగమైనప్పటికీ అసెంబ్లీని బహిష్కరించడం, మే 16 నాటి ప్రణాళికను అంగీకరించకపోవడం లపై పటేల్‌కు మరింత ఆగ్రహం కలిగింది. కానీ, జిన్నాకు ముస్లింలలో మద్దతు ఉందని, అతడికీ జాతీయవాదులకూ మధ్య బహిరంగ వివాదం తలెత్తితే పరిస్థితి క్షీణించి, హిందూ-ముస్లిం అంతర్యుద్ధానికి దారితీసే అవకాశం ఉందనీ పటేల్ భావించాడు. కేంద్ర ప్రభుత్వం బలహీనంగా, భిన్నాభిప్రాయాలతో కొనసాగితే, 600 కి పైగా రాచరిక సంస్థానాలు స్వాతంత్ర్యం ప్రకటించుకుని, దేశం ముక్కలైపోయే ప్రమాదముందని పటేల్ మనస్సులో ఉంది.[54] 1946 1947 డిసెంబరు జనవరి కాలంలో పటేల్, ప్రభుత్వ అధికారి విపి మీనన్‌తో కలిసి పనిచేశాడు. ముస్లిం-మెజారిటీ ప్రావిన్సుల నుండి పాకిస్తాన్ ను సృష్టించాలనే మీనన్ ప్రతిపాదనపై వాళ్ళిద్దరూ పనిచేసారు. 1947 జనవరి, మార్చి ల్లో బెంగాల్, పంజాబ్‌లలో జరిగిన మతహింస వలన, విభజన ప్రతిపాదన లోని ప్రయోజకత్వం పటేల్‌కు మరింతగా అర్థమైంది. పంజాబ్, బెంగాల్ లోని హిందూ-మెజారిటీ ప్రాంతాలను ముస్లిం రాజ్యంలో చేర్చాలని జిన్నా చేసిన డిమాండును తీవ్రంగా విమర్శించిన పటేల్, ఆ ప్రావిన్సుల విభజనను సాధించి, తద్వారా వాటిని పాకిస్తాన్లో చేర్చే అవకాశం లేకుండా చేసాడు. పంజాబ్, బెంగాల్ ల విభజనపై పటేల్ చూపించిన నిర్ణయాత్మకత, లీగ్ వ్యూహాలతో విసిగిపోయిన భారత ప్రజలకు చాలా నచ్చింది. అతనికి మద్దతు దారులను, ఆరాధకులనూ సంపాదించి పెట్టింది. అయితే, విభజన కోసం ఆత్రుతగా ఉన్నాడంటూ అతన్ని గాంధీ, నెహ్రూ, లౌకిక ముస్లింలు, సోషలిస్టులు విమర్శించారు. 1947 జూన్ 3 న లార్డ్ మౌంట్ బాటన్ అధికారికంగా ఈ ప్రణాళికను ప్రతిపాదించినప్పుడు, పటేల్ తన అనుమతి ఇచ్చి, నెహ్రూను ఇతర కాంగ్రెసు నాయకులనూ ఈ ప్రతిపాదనను అంగీకరించమని నచ్చచెప్పాడు. విభజన ప్రతిపాదనలకు సంబంధించి గాంధీ పడుతున్న తీవ్ర వేదన గురించి తెలుసుకున్న పటేల్, కాంగ్రెస్-లీగ్ సంకీర్ణ ప్రభుత్వం ఏ విధంగా ఆచరణాత్మకం కాదో, హింస ఎలా పెరుగుతోందో, అంతర్యుద్ధపు ముప్పు ఎలా పొంచి ఉందో.. ప్రైవేట్ సమావేశాల్లో గాంధీతో చర్చించాడు. ఈ ప్రతిపాదనపై ఓటు వేయాలని పిలిచిన అఖిల భారత కాంగ్రెసు కమిటీ సమావేశంలో పటేల్ ఇలా అన్నాడు:

[ముస్లిం-మెజారిటీ ప్రాంతాల] లోని మా సోదరుల భయాలను నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను. భారతదేశ విభజన ఎవరికీ ఇష్టం లేదు. నాకూ గుండె భారంగా ఉంది. కానీ, ఒక్క విభజనా, అనేక విభజనలా అనేది మనమిప్పుడు ఎంచుకోవాల్సి ఉంది. మనం వాస్తవాలను ఎదుర్కోవాలి. భావోద్వేగాలకూ మనోభావాలకూ లొంగిపోకూడదు. వర్కింగ్ కమిటీ భయంతో వ్యవహరించలేదు. కానీ నేను ఒక విషయానికి భయపడుతున్నాను, ఇన్ని సంవత్సరాలుగా మనం పడ్డ శ్రమ, కృషి అంతా వృథాగా పోవచ్చు లేదా నిష్ఫలమై పోవచ్చు. నా తొమ్మిది నెలల పదవీకాలంలో క్యాబినెట్ మిషన్ ప్లాన్ యోగ్యతల పట్ల నాకున్న భ్రమలు తొలగిపోయాయి. ఏవో కొన్ని గౌరవనీయమైన మినహాయింపులు తప్పించి, పైనుండి క్రిందికి - చప్రాసీల దాకా ముస్లిం అధికారులంతా లీగ్ కోసమే పనిచేస్తున్నారు. మిషన్ ప్లాన్‌లో లీగ్‌కు ఇచ్చిన మతపరమైన వీటో ప్రతి దశలో భారతదేశ పురోగతిని అడ్డుకునేది. మనకు నచ్చినా నచ్చకపోయినా, పంజాబ్, బెంగాల్‌లలో ఇప్పటికే డీ ఫ్యాక్టో పాకిస్తాన్ ఉంది. ఈ పరిస్థితులలో, నేను డి జ్యూర్ పాకిస్తాన్‌ను ఇష్టపడతాను. ఇది లీగ్‌ను మరింత బాధ్యతాయుతంగా చేస్తుంది. స్వేచ్ఛ వచ్చేస్తోంది. 75 నుండి 80 శాతం భారతదేశం మనకే ఉంది. మన తెలివితేటల్తో దీన్ని బలోపేతం చేసుకోవచ్చు. మిగిలిన దేశాన్ని లీగ్ అభివృద్ధి చేసుకుంటుంది.[55]

ప్రణాళికను గాంధీ తిరస్కరించడం [56] కాంగ్రెసు ఆమోదించడం జరిగాక, పటేల్ విభజన మండలిలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. అక్కడ అతను ప్రజా ఆస్తుల విభజనను పర్యవేక్షించాడు. నెహ్రూతో కలిసి భారత మంత్రుల మండలిని ఎంచుకున్నాడు. ఏదేమైనా, విభజనతో జరిగే తీవ్రమైన హింస, జనాభా బదిలీని అతను గాని, మరే ఇతర భారతీయ నాయకుడు గానీ ఊహించలేదు. 1946 చివరిలో, బ్రిటన్‌లోని లేబర్ ప్రభుత్వం, ఇటీవల ముగిసిన రెండవ ప్రపంచ యుద్ధంతో దాని ఖజానా ఖాళీ అయిపోవడంతో, భారతదేశంలో బ్రిటిషు పాలనను ముగించాలని నిర్ణయించుకుంది. 1948 జూన్ లోపు అధికారాన్ని బదిలీ చేయాలనే ఉద్దేశ్యాన్ని 1947 ప్రారంభంలో ప్రకటించింది. అయితే, హింస పెరిగితే, బ్రిటిషు సైన్యం సన్నద్ధంగా లేనందువల్ల, కొత్త వైస్రాయ్, లూయిస్ మౌంట్ బాటెన్, అధికార బదిలీ తేదీని ముందుకు తెచ్చాడు. స్వాతంత్ర్యం కోసం పరస్పరం అంగీకరించిన ప్రణాళికకు ఆరు నెలల కన్నా తక్కువ సమయం ఇచ్చాడు. 1947 జూన్ లో, కాంగ్రెసు తరపున నెహ్రూ, అబుల్ కలాం ఆజాద్, ముస్లిం లీగ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న జిన్నా, దళిత సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బిఆర్ అంబేద్కర్, సిక్కులకు ప్రాతినిధ్యం వహిస్తున్న మాస్టర్ తారా సింగ్ సహా జాతీయవాద నాయకులందరూ గాంధీ అభిప్రాయాలకు పూర్తిగా వ్యతిరేకంగా మతపరమైన దేశ విభజనకు అంగీకరించారు. ప్రధానంగా హిందువులు సిక్కులూ ఉన్న ప్రాంతాలను కొత్త భారతదేశానికీ, ప్రధానంగా ముస్లిం ప్రాంతాలను కొత్త దేశం పాకిస్తాన్‌కూ కేటాయించారు. ఈ ప్రణాళికలో పంజాబ్, బెంగాల్ ముస్లిం-మెజారిటీ ప్రావిన్సుల విభజన ఉంది. విభజన రేఖ అయిన రాడ్‌క్లిఫ్ లైన్ ప్రకటనతో జరిగిన మత హింస మరింత భయంకరమైనది. భారత విభజనతో పాటు జరిగిన హింసను వివరిస్తూ, చరిత్రకారులు ఇయాన్ టాల్బోట్ గురుహర్‌పాల్ సింగ్ ఇలా వ్రాస్తున్నారు:

బాధితులను నరకడం, అవయవాలు తెగ్గొయ్యడం గురించి అనేక ప్రత్యక్ష సాక్షుల కథనాలు ఉన్నాయి. భయానక చర్యల్లో గర్భిణీ స్త్రీల గర్భవిచ్ఛిత్తి, ఇటుక గోడలపై శిశువుల తలలు పగల కొట్టడం, బాధితుల అవయవాలు, జననేంద్రియాలను కోసెయ్యడం, తలలూ మొండేలను ప్రదర్శించడం వంటివి ఉన్నాయి. మునుపటి మత అల్లర్లు ఘోరమైనవే అయినప్పటికీ, విభజన నాటి ఊచకోతలోని క్రూరత్వం, ఆ స్థాయీ మున్నెన్నడూ ఎరగనిది. విభజన ఊచకోతలకు సంబంధించి ' మారణహోమం ' అనే పదాన్ని ఉపయోగించడాన్ని కొందరు పండితులు ప్రశ్నించినప్పటికీ, చాలా చోట్ల జాతిహింస ధోరణులు కనిపించాయి. ఇప్పటికే ఉన్న తరాన్ని తుడిచెయ్యడానికీ, భవిష్యత్ పునరుత్పత్తిని నిరోధించడానికీ ఈ హింసను రూపొందించారు. " [57]

1947 ఆగస్టు 14 న, పాకిస్తాన్ అనే కొత్త డొమినియన్ ఉనికిలోకి వచ్చింది. ముహమ్మద్ అలీ జిన్నా కరాచీలో మొదటి గవర్నర్ జనరల్ గా ప్రమాణ స్వీకారం చేశాడు. మరుసటి రోజు, 1947 ఆగస్టు 15 న, భారతదేశం - ఇప్పుడు చిక్కిపోయిన యూనియన్ ఆఫ్ ఇండియా - న్యూ ఢిల్లీలో అధికారిక వేడుకల మధ్య, జవహర్‌లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా, వైస్రాయ్ మౌంట్ బాటెన్ మొదటి గవర్నర్‌ జనరల్‌గా స్వాతంత్ర్యం పొందింది. విభాజిత ఉపఖండంలోని కొత్త శరణార్థులతో కలిసి పనిచేయడానికి గాంధీ బెంగాల్‌లోనే ఉండిపోయాడు.

భౌగోళిక విభజన, 1947[మార్చు]

మౌంట్ బాటన్ ప్లాన్[మార్చు]

రెండు కొత్త దేశాలుగా బ్రిటిషు ఇండియా విభజన "3 జూన్ ప్లాన్" లేదా "మౌంట్ బాటెన్ ప్లాన్"గా పిలిచే దాని ప్రకారం జరిగింది. 1947 జూన్ 3 న మౌంట్ బాటన్ విలేకరుల సమావేశంలో దీనిని ప్రకటించాడు. స్వాతంత్ర్య తేదీ - 1947 ఆగస్టు 15 అని కూడా ప్రకటించాడు. ప్రణాళిక లోని ప్రధాన అంశాలు:

  • పంజాబ్, బెంగాల్ శాసనసభలలో సిక్కులు, హిందువులు, ముస్లింలు సమావేశమై విభజనకు ఓటు వేస్తారు. ఏ ఒక్క సమూహమైనా సాధారణ మెజారిటీతో విభజన కోరుకుంటే, ఈ ప్రావిన్సులను విభజిస్తారు.
  • సింధ్, బలూచిస్తాన్‌లు వారి స్వంత నిర్ణయం తీసుకోవలసి ఉంది.[58]
  • నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్, అస్సాంలోని సిల్హెట్ జిల్లా గతిని ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా నిర్ణయించాల్సి ఉంది.
  • 1947 ఆగస్టు 15 నాటికి భారతదేశం స్వతంత్రంగా ఉంటుంది.
  • బెంగాల్‌కు ప్రత్యేకంగా స్వాతంత్ర్యం ఇవ్వడాన్ని తోసిపుచ్చారు.
  • విభజన విషయంలో సరిహద్దు కమిషన్ ఏర్పాటు చేయాలి.

భారత రాజకీయ నాయకులు జూన్ 2 న ఈ ప్రణాళికను అంగీకరించారు. బ్రిటిషు స్వాధీనంలో లేని రాచరిక సంస్థానాలను ఏం చెయ్యాలో ఇది తేల్చలేకపోయింది, కాని స్వతంత్రంగా ఉండవద్దనీ, ఏదో ఒక దేశంలో చేరాలనీ జూన్ 3 న మౌంట్ బాటెన్ వారికి సలహా ఇచ్చాడు.[59]

ఆ విధంగా ప్రత్యేక దేశం కోరిన ముస్లిం లీగ్ డిమాండ్లను అంగీకరించారు. ఐక్యతపై కాంగ్రెసు అభిప్రాయాన్ని కూడా అడగ్గా, అది పాకిస్తాన్‌ను వీలైనంత చిన్నదిగా చేసింది. మౌంట్ బాటెన్ సూత్రం భారతదేశాన్ని విభజించడం, అదే సమయంలో, గరిష్ఠ ఐక్యతను నిలుపుకోవడం.

హింసాత్మక అల్లర్ల సంభావ్యతపై అబుల్ కలాం ఆజాద్ ఆందోళన వ్యక్తం చేశారు, దీనికి మౌంట్ బాటన్ ఇలా సమాధానం ఇచ్చారు:

కనీసం ఈ ప్రశ్నపై నేను మీకు పూర్తి హామీ ఇస్తాను. రక్తపాతం, అల్లర్లు లేకుండా నేను చూస్తాను. నేను సైనికుడిని, సాధారణ పౌరుడిని కాదు. విభజన సూత్రప్రాయంగా అంగీకరించిన తర్వాత, దేశంలో ఎక్కడా మతపరమైన అల్లర్లు ఉండకూడదని నేను ఆదేశాలు జారీ చేస్తాను. స్వల్పంగానైనా ఆందోళన ఉంటే, మొగ్గలోని తుంచెయ్యడానికి నేను కఠినమైన చర్యలు తీసుకుంటాను.[60]

ఇదీ, ఆ తరువాత జరిగినదీ "ప్రభుత్వ యంత్రాంగపు స్పష్టమైన వైఫల్యాన్ని" చూపించింది అని జగ్మోహన్ అన్నాడు [60]

1947 జూన్ 3 న, విభజన ప్రణాళికను కాంగ్రెసు వర్కింగ్ కమిటీ అంగీకరించింది.[61] పంజాబ్ లో అల్లర్లు లేవు. కానీ ఉద్రిక్తత ఉంది. నెహ్రూ, పటేల్‌లు గాంధీని పక్కన పెట్టారు. అతడు మౌనదీక్ష చేపట్టాడు. మౌంట్ బాటన్ గాంధీని సందర్శించి, విభజనను మీరు వ్యతిరేకించరని ఆశిస్తున్నానని అనగా, దీనికి గాంధీ "నేను నిన్ను ఎప్పుడైనా వ్యతిరేకించానా?"అని సమాధానం రాసి చూపించాడు [62]

బ్రిటిషు భారతదేశంలో, భారతదేశం, పాకిస్తాన్ మధ్య సరిహద్దు ( రాడ్‌క్లిఫ్ లైన్) ను లండన్ న్యాయవాది సర్ సిరిల్ రాడ్‌క్లిఫ్ అధ్యక్షతన బ్రిటిషు ప్రభుత్వం నియమించిన నివేదిక ద్వారా నిర్ణయించారు. పాకిస్తాన్ విడివిడిగా ఉన్న రెండు భూభాగాలతో ఉనికిలోకి వచ్చింది, తూర్పు పాకిస్తాన్ (నేడు బంగ్లాదేశ్), పశ్చిమ పాకిస్తాన్. ఈ రెంటినీ భారతదేశం భౌగోళికంగా వేరు చేసింది. బ్రిటిషు ఇండియాలోని మెజారిటీ హిందూ ప్రాంతాలతో భారతదేశం, మెజారిటీ ముస్లిం ప్రాంతాలతో పాకిస్తాన్ ఏర్పడ్డాయి.

1947 జూలై 18 న, బ్రిటిషు పార్లమెంటు భారత స్వాతంత్ర్య చట్టాన్ని ఆమోదించింది. విభజన కొరకు ఏర్పాట్లు చెయ్యడం, అనేక వందల సంఖ్యలో ఉన్న రాచరిక సంస్థానాలపై బ్రిటిషు పాలనను తొలగించడం, ఏ దేశంలో కలవాలో, లేదా స్వతంత్రంగా ఉండాలో నిర్ణయించుకునే అధికారాన్ని వాటికే వదిలెయ్యడం ఈ చట్టంలో ఉన్నాయి.[63] కొత్త దేశాలకు అవసరమైన చట్టపరమైన చట్రాన్ని అందించడానికి భారత ప్రభుత్వ చట్టం 1935 ను అనుసరించారు.

1947 ఆగస్టులో కొత్త దేశంగా ఏర్పడిన తరువాత, పాకిస్తాన్ ఐక్యరాజ్యసమితి సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకుంది, 1947 సెప్టెంబరు 30 న సర్వసభ్య సమావేశం దీన్ని అంగీకరించింది. 1945 నుండి భారతదేశం ఐక్యరాజ్యసమితి వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్నందున డొమినియన్ ఆఫ్ ఇండియా ఆ సీటులోనే కొనసాగింది.[64]

రాడ్‌క్లిఫ్ లైన్[మార్చు]

పంజాబ్ ప్రాంతం పటం సుమారు 1947 .

సింధుకు తూర్పున ఉన్న ఐదు నదుల ప్రాంతం పంజాబ్. ఆ నదులు: జీలం, చెనాబ్, రావి, బియాస్, సట్లెజ్. రెండేసి నదుల మధ్య గల భూమిని దోయబ్ అంటారు. పంజాబు 5 దోయబ్‌ల రాష్ట్రం. అవి: సింధ్-సాగర్ దోయబ్ (సింధు జీలం మధ్య), జెచ్ దోయబ్ (జీలం / చెనాబ్), రెచ్నా దోయబ్ (చెనాబ్ / రవి), బారి దోయబ్ (రవి / బియాస్), బిస్ట్ దోయబ్ (బియాస్ / సట్లెజ్) (కుడి వైపున ఉన్న మ్యాప్ చూడండి). 1947 ప్రారంభంలో, పంజాబ్ సరిహద్దు కమిషన్ చర్చలకు దారితీసిన నెలల్లో, ప్రధాన వివాదాస్పద ప్రాంతాలు బారి, బిస్ట్ దోబ్‌లలో కనిపించాయి. అయితే, రెచ్నా దోయబ్‌లోని కొన్ని ప్రాంతాలు తమవేనని కాంగ్రెస్, సిక్కులు పేర్కొన్నారు. బారి దోయబ్‌లో గురుదాస్‌పూర్, అమృత్‌సర్, లాహోర్, మోంట్‌గోమరీ జిల్లాలన్నీ వివాదాస్పదమయ్యాయి.[65] అన్ని జిల్లాల్లో (అమృత్‌సర్ మినహా, ఇక్కడా 46.5% ముస్లింలు) ముస్లిం మెజారిటీ ఉంది; గురుదాస్‌పూర్‌లో, ముస్లిం మెజారిటీ 51.1% వద్ద ఉంది. ఉప ప్రాంత స్థాయిలో, బారి దోయబ్‌లో కేవలం మూడు తహసీళ్ళు మాత్రమే ముస్లిమేతర మెజారిటీలను కలిగి ఉన్నాయి. అవి: పఠాన్‌కోట్ (వివాదాస్పదంగా లేని గురుదాస్‌పూర్‌కు ఉత్తరాన), అమృత్‌సర్ జిల్లాలోని అమృత్‌సర్, తర్న్ తరన్. అంతేకాకుండా, బియాస్-సట్లెజ్కు తూర్పున నాలుగు ముస్లిం-మెజారిటీ తహసీళ్ళు ఉన్నాయి (రెండు చోట్ల ముస్లింల సంఖ్య, హిందువులు సిక్కుల మొత్తం సంఖ్య కంటే ఎక్కువ).[65]

సరిహద్దు కమిషన్ అధికారిక విచారణలను ప్రారంభించడానికి ముందు, తూర్పు, పశ్చిమ పంజాబ్ ప్రాంతాల్లో ప్రభుత్వాలు ఏర్పాటు చేసారు. వారి భూభాగాలను జిల్లాల్లో ఉన్న మెజారిటీల ఆధారంగా "నోషనల్ డివిజన్" ద్వారా తాత్కాలికంగా విభజించారు. పంజాబ్, బెంగాల్ లకు చెరొక సరిహద్దు కమిషన్‌ ఉంటుంది. ఒక్కో కమిషన్లో ఇద్దరు ముస్లిం, ఇద్దరు ముస్లిమేతర న్యాయమూర్తులుంటారు. రెండు కమిషన్లకూ సర్ సిరిల్ రాడ్‌క్లిఫ్‌ చైర్మన్‌గా ఉంటాడు.[65] పంజాబ్ కమిషన్‌కు అప్పగించిన బాధ్యతలు ఇలా ఉన్నాయి: "ముస్లింలు, ముస్లిమేతరుల మెజారిటీ ప్రాంతాలను నిర్ధారిస్తూ, దాని ఆధారంగా పంజాబ్ రెండు భాగాల సరిహద్దులను గుర్తించడం. అలా చేసే క్రమంలో, ఇది ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది". ప్రతీ పక్షమూ (ముస్లింలు, కాంగ్రెసు / సిక్కులు) బేరానికి వీలు లేని పద్ధతిలో తమ వాదనను సమర్పించారు. న్యాయమూర్తులకు కూడా రాజీ పడే అధికారం లేదు. అన్ని ప్రధాన సమస్యలపై వారు "రెండు - రెండు"గా విడిపోయారు. ఇక వాస్తవ నిర్ణయాలు తీసుకునే దుర్మార్గపు పని మాత్రం సర్ సిరిల్ రాడ్‌క్లిఫ్‌దే అయింది.[65]

స్వాతంత్ర్యం, జనాభా బదిలీ, హింస[మార్చు]

విభజన తరువాతి నెలల్లో కొత్తగా ఏర్పడిన రెండు రాష్ట్రాల మధ్య భారీ యెత్తున జనాభా మార్పిడి జరిగింది. విభజన కారణంగా జనాభా బదిలీలు జరుగుతాయనే ఆలోచనే ప్రభుత్వాల్లో లేదు. మతపరమైన మైనారిటీలు తాము నివసిస్తున్న రాష్ట్రాల్లోనే ఉంటారని భావించారు. అయితే, పంజాబుకు మినహాయింపు ఉంది, ఇక్కడ ప్రావిన్సును ప్రభావితం చేసే మత హింస కారణంగా జనాభా బదిలీని వ్యవస్థీకృతంగా జరిపారు. ఇది ఇతర ప్రావిన్సులకు వర్తించదు.[66][67]

"1947 లో అవిభక్త భారతదేశ జనాభా సుమారు 39 కోట్లు. విభజన తరువాత, భారతదేశంలో 33 కోట్ల మంది, పశ్చిమ పాకిస్తాన్‌లో 3 కోట్ల మంది, తూర్పు పాకిస్తాన్‌లో (ఇప్పుడు బంగ్లాదేశ్) 3 కోట్ల మంది ఉన్నారు." సరిహద్దులు ఏర్పడిన తర్వాత, సుమారు 145 లక్షల మంది ప్రజలు, మతపరమైన మెజారిటీ ఉన్నచోట భద్రత ఉంటుందని భావించి సరిహద్దులను దాటారు. 1951 పాకిస్తాన్ జనాభా లెక్కల ప్రకారం పాకిస్తాన్లో కాందిశీకుల సంఖ్య 72,26,600. బహుశా వీళ్ళంతా భారతదేశం నుండి పాకిస్తాన్లోకి ప్రవేశించిన ముస్లింలే అయి ఉంటారు; 1951 భారత జనాభా లెక్కల ప్రకారం 72,95,870 మంది కాందిశీకులున్నారు. వీళ్ళంతా, విభజన జరిగిన వెంటనే పాకిస్తాన్ నుండి భారతదేశానికి వెళ్లిన హిందువులు సిక్కులూ అయి ఉంటారు .[2] మొత్తం 1.45 కోట్లు. అయితే రెండు దేశాల జనాభా గణనలు విభజన జరిగిన 4 సంవత్సరాల తరువాత జరిగాయి. సామూహిక వలసల తరువాత నికర జనాభా పెరుగుదల కూడా ఈ సంఖ్యల్లో ఉంది.

సుమారు 112 లక్షల మంది (కాందిశీకుల్లో 77.4% మంది) పశ్చిమంలో ఉన్నారు. అందులో ఎక్కువ మంది పంజాబ్ నుండే: 65 లక్షల మంది ముస్లింలు భారతదేశం నుండి పశ్చిమ పాకిస్తాన్‌కు వెళ్లారు, 47 లక్షల మంది హిందువులు, సిక్కులు పశ్చిమ పాకిస్తాన్ నుండి భారతదేశానికి వెళ్లారు; అందువల్ల భారతదేశం నుండి పశ్చిమ పాకిస్తాన్ (ఇప్పుడు పాకిస్తాన్) కు నికర వలస 18 లక్షలు. మరో 33 లక్షల మంది (కాందిశీకుల్లో 22.6%) తూర్పున ఉన్నారు: 26 లక్షలు తూర్పు పాకిస్తాన్ నుండి భారతదేశానికి, 7 లక్షలు భారతదేశం నుండి తూర్పు పాకిస్తాన్ (ఇప్పుడు బంగ్లాదేశ్) కు తరలారు; ఈ విధంగా, తూర్పున నికర వలసలు భారతదేశంలోకి 19 లక్షలు

పంజాబ్[మార్చు]

భారతదేశ విభజన సమయంలో అంబాలా స్టేషన్ వద్ద శరణార్థుల ప్రత్యేక రైలు

బ్రిటిషు ఇండియా విభజనతో, పూర్వపు బ్రిటిషు ప్రావిన్స్ అయిన పంజాబ్‌ కూడా రెండుగా విడిపోయింది. ప్రావిన్స్ లో ఎక్కువగా ముస్లింలు ఉండే పశ్చిమ భాగం పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ అయింది; హిందూ సిక్కులు మెజారిటీగా ఉండే తూర్పు భాగం భారతదేశం లోని తూర్పు పంజాబ్ రాష్ట్రంగా మారింది (తరువాత దీన్ని పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ అనే మూడు రాష్ట్రాలుగా విభజించారు). చాలా మంది హిందువులు, సిక్కులు పశ్చిమాన నివసించేవారు, చాలా మంది ముస్లింలు తూర్పున నివసించేవారు. అలాంటి మైనారిటీలందరికీ చాలా భయాలుండేవి. విభజన వలన చాలా మంది ప్రజలు స్థానభ్రంశం చెందారు. మతకలహాలు చెలరేగాయి. కొందరు పంజాబ్‌లో హింసను ప్రతీకార మారణహోమం అని అభివర్ణించారు.[68]

రెండు దిశల్లోనూ అత్యంత భారీ యెత్తున జరిగిన వలసలను గానీ, కొత్తగా ఏర్పడిన సరిహద్దుకు రెండు వైపులా జరిగిన భారీ హింసను గానీ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాలు ఊహించనేలేదు. ఏమాత్రం సిద్ధంగా లేవు కూడా. మరణాల సంఖ్యపై అంచనాలు మారుతూ ఉన్నాయి - తక్కువలో తక్కువ 2,00,000 అని అంచనా వెయ్యగా, అత్యధికంగా 20,00,000 అని అంచనా వేసారు. అన్ని ప్రాంతాలలోకీ అత్యంత ఘోరమైన హింస పంజాబ్‌లో జరిగిందని తేల్చారు.[69][70][71][72] తూర్పు పంజాబ్‌లో (మలేర్‌కోట్ల మినహా) ఒక్క ముస్లిం కూడా ప్రాణాలతో బయటపడలేదు. పశ్చిమ పంజాబ్‌లో ఒక్క హిందూ లేదా సిక్కు కూడా బయటపడలేదు.[73]

లారెన్స్ జేమ్స్ ఇలా అన్నాడు: తన ప్రావిన్స్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తూ 5,00,000 మంది ముస్లింలు మరణించారని పశ్చిమ పంజాబ్ గవర్నర్ సర్ ఫ్రాన్సిస్ ముడీ అంచనా వేయగా, కరాచీలోని బ్రిటిషు హైకమిషన్ మాత్రం ఈ సంఖ్య 8,00,000 అని చెప్పింది. మౌంట్ బాటెన్ అతని మనుషులూ 2,00,000 మంది మాత్రమే చంపబడ్డారని చెప్పిన మాట అర్ధంలేనిదని తేలింది : [జేమ్స్ 1998: 636] ". [74]

ఈ కాలంలో, ముస్లింల హత్యకు తారా సింగ్ ఆమోదం ఉందని పలువురు ఆరోపించారు. 1947 మార్చి 3 న, లాహోర్లో సింగ్, సుమారు 500 మంది సిక్కులతో కలిసి, "పాకిస్తాన్ ముర్దాబాద్" అని నినదించాడు. రాజకీయ శాస్త్రవేత్త ఇష్తియాక్ అహ్మద్ ప్రకారం, "మార్చి 3 న, అతివాద సిక్కు నాయకుడు మాస్టర్ తారా సింగ్ పంజాబ్ అసెంబ్లీ వెలుపల తన కిర్పాన్ (కత్తి) ను ప్రదర్శించాడు. పాకిస్తాన్ అనే ఆలోచననే నాశనం చేయాలని పిలుపునిచ్చాడు. దీంతో ఉత్తర పంజాబ్‌లోని ముస్లింలు అధికంగా ఉన్న జిల్లాల్లోని ముస్లింలు, సిక్కులకు హిందువులకు వ్యతిరేకంగా హింసాత్మకంగా ప్రతిస్పందించారు. అయినప్పటికీ, ఆ సంవత్సరం చివరకు, పశ్చిమ పంజాబ్‌లో ముస్లిములు చంపిన హిందువులు సిక్కుల కంటే తూర్పు పంజాబ్‌లో ఎక్కువ మంది ముస్లింలు చంపబడ్డారు. " [75] పశ్చిమ పంజాబ్‌లోని హిందువులు, సిక్కుల కంటే తూర్పు పంజాబ్‌లో అప్పటి వరకు రెట్టింపు ముస్లింలు చంపబడ్డారని నెహ్రూ ఆగస్టు 22 న గాంధీకి లేఖ రాశాడు.[76]

బెంగాల్[మార్చు]

బెంగాల్ ప్రావిన్స్ పశ్చిమ బెంగాల్ (ఇండియన్ డొమినియన్ లో కలిపారు), తూర్పు బెంగాల్ (పాకిస్తాన్ డొమినియన్ లో కలిపారు) అనే రెండు ప్రాంతాలుగా విభజించారు. 1955 లో తూర్పు బెంగాల్ పేరును తూర్పు పాకిస్తాన్ గా మార్చారు. ఆ తరువాత 1971 బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం తరువాత బంగ్లాదేశ్ అనే స్వతంత్ర దేశంగా మారింది.

ముస్లిం మెజారిటీ జిల్లాలైన ముర్షిదాబాద్, మాల్డా లను భారతదేశానికి ఇచ్చారు. హిందూ మెజారిటీ జిల్లా ఖుల్నా, బౌద్ధ మెజారిటీ (జనాభా బాగా తక్కువ) ఉన్న చిట్టగాంగ్ హిల్ ట్రాక్ట్స్‌ లను పాకిస్తాన్కు రాడ్క్లిఫ్ అవార్డు ద్వారా ఇచ్చారు.[77]

పాకిస్తాన్‌కు ప్రదానం చేసిన తూర్పు బెంగాల్ జిల్లాల్లో ఉన్న వేలాది మంది హిందువులపై దాడులు జరిగాయి. ఈ మతపరమైన హింస కారణంగా తూర్పు బెంగాల్ నుండి లక్షలాది మంది హిందువులు భారతదేశంలో ఆశ్రయం పొందవలసి వచ్చింది. కలకత్తాలోకి హిందూ శరణార్థులు భారీగా రావడం నగర జనాభాను ప్రభావితం చేసింది. చాలా మంది ముస్లింలు నగరాన్ని విడిచిపెట్టి, తూర్పు పాకిస్తాన్ వెళ్ళారు. హిందూ శరణార్థ కుటుంబాలు వారి ఇళ్ళూ ఆస్తులను ఆక్రమించాయి.

సింధ్[మార్చు]

విభజన సమయంలో, సింధ్ లోని సంపన్న మధ్యతరగతి ప్రజలు హిందువులే. హైదరాబాద్, కరాచీ, షికార్పూర్, సుక్కూర్ వంటి నగరాల్లో ఎక్కువ మంది కేంద్రీకృతమై ఉన్నప్పటికీ అప్పటికి 14,00,000 మంది హిందూ సింధీలు ఉన్నారు. సింధ్‌లో నివసిస్తున్న వందలాది మంది హిందువులు వలస వెళ్ళవలసి వచ్చింది. భారతదేశం నుండి ముస్లిం శరణార్థుల రాకతో సింధ్‌లో కొన్ని హిందూ వ్యతిరేక హింసకు దారితీసింది. దీనికి స్థానిక ముస్లింల నుండి మద్దతు పెద్దగా లేదు. పశ్చిమ పంజాబ్ నుండి వలస వెళ్ళవలసి వచ్చిన పంజాబీ హిందువులూ సిక్కుల మాదిరిగా కాకుండా సింధీ హిందువులపై హింస తక్కువగా ఉంది.

1947 డిసెంబరు 6 న, భారతదేశంలోని అజ్మీర్‌లో మత హింస జరిగింది, దర్గా బజార్‌లో సింధీ హిందూ శరణార్థులకు, స్థానిక ముస్లింలకూ మధ్య వాదన జరిగింది. మళ్లీ డిసెంబరు మధ్యలో అజ్మీర్‌లో హింస తలెత్తింది. కత్తిపోట్లు, దోపిడీలు, కాల్పులు జరిగాయి. ముస్లింలు ఎక్కువగా మరణించారు.[78] చాలా మంది ముస్లింలు థార్ ఎడారి మీదుగా పాకిస్తాన్లోని సింధ్‌కు పారిపోయారు.[78] ఇది సింధ్ లోని హైదరాబాద్ లో మరిన్ని హిందూ వ్యతిరేక అల్లర్లకు దారితీసింది. జనవరి 6 న కరాచీలో హిందూ వ్యతిరేక అల్లర్లు చెలరేగి, 1100 మంది మరణించినట్లు అంచనా.[78] 7,76,000 సింధీ హిందువులు భారతదేశానికి పారిపోయారు.[79] ఉత్తర గుజరాత్ పట్టణమైన గోద్రాకు సింధీ హిందూ శరణార్థుల రాకతో 1948 మార్చిలో అల్లర్లు జరిగాయి. ఇది గోద్రా నుండి పాకిస్తాన్కు ముస్లింల వలసలకు దారితీసింది.[78]

వలసలు జరిగినప్పటికీ, గణనీయమైన సింధీ హిందూ జనాభా ఇప్పటికీ పాకిస్తాన్ లోని సింధ్ ప్రావిన్స్లో నివసిస్తున్నారు, ఇక్కడ వారి సంఖ్య 1998 పాకిస్తాన్ జనాభా లెక్కల ప్రకారం 23 లక్షలు; భారతదేశంలో సింధీ హిందువులు 2001 భారత జనాభా లెక్కల ప్రకారం 26 లక్షలు. సింధ్‌లోని కొన్ని సరిహద్దు జిల్లాలైన థార్‌పార్కర్ జిల్లా, ఉమెర్‌కోట్, మీర్‌పూర్ఖాస్, సంఘర్, బాడిన్ వంటి జిల్లాల్లో హిందూ మెజారిటీ ఉంది, కాని వారి జనాభా తగ్గుతోంది. వారు తమను తాము మైనారిటీగా భావిస్తున్నారు. జిల్లాలో ఇప్పటికీ ఉమెర్‌కోట్‌లో మాత్రమే హిందువులు మెజారిటీగా ఉన్నారు. సింధీ సమాజం పెద్ద ఎత్తున హింసను ఎదుర్కోలేదు, కానీ మాతృభూమినీ, సంస్కృతినీ కోల్పోతున్నామని భావించింది.[78]

గుజరాత్[మార్చు]

విభజన సమయంలో పంజాబ్, బెంగాల్‌లో జరిగినట్లు గుజరాత్‌లో సామూహిక హింస జరగలేదు.[80] పాకిస్తాన్‌కు వలస వచ్చిన వారిలో కేవలం 2.2% మంది మాత్రమే గుజరాత్, బొంబాయి నగరాలకు చెందినవారు, వారిలో 75% మంది తమ వ్యాపార ప్రయోజనాల రీత్యా కరాచీకి వెళ్లారు.[80]

ఢిల్లీ[మార్చు]

బాబర్ కాలం నుండి ఢిల్లీ మొఘల్ సామ్రాజ్యానికి రాజధానిగా ఉంది, అంతకు ముందరి టర్కీ ముస్లిం పాలకులకు కూడా ఢిల్లీ రాజధానిగా ఉండేది. ఢిల్లీలో విస్తారమైన ఇస్లామిక్ నిర్మాణ శైలి కనిపిస్తుంది. బలమైన ఇస్లామిక్ సంస్కృతి నగరంలో విస్తరించింది. 1911 లో, బ్రిటిషు రాజ్ తమ రాజధానిని కలకత్తా నుండి ఢిల్లీకి మార్చినప్పుడు, నగరం స్వభావం కొద్దిగా మారడం ప్రారంభించింది. నగర ప్రధాన భాగాన్ని బ్రిటిషు వాస్తుశిల్పి ఎడ్విన్ లుట్యెన్స్ పేరు మీద 'లుట్యెన్స్ ఢిల్లీ' అని పిలుస్తారు ఏదేమైనా, 1941 లో జనాభా లెక్కల ప్రకారం ఢిల్లీ జనాభాలో 33.2% ముస్లింలు.

1947 లో శరణార్థులు ఢిల్లీలోకి రావడం మొదలయ్యే సమయానికి, నిర్వాసితుల సమస్యను ఎదుర్కోవటానికి నగరం సిద్ధంగా లేదు. శరణార్థులు “ఎక్కడెక్కడ వెళ్ళేందుకు వీలుందో అక్కడక్కడికి చొరబడిపోయారు… కళాశాలలు, దేవాలయాలు, గురుద్వారాలు, ధర్మశాలలు, సైనిక బ్యారక్లు, తోటలూ మొదలైన చోట్ల నెలకొల్పిన శిబిరాల్లోకి వెళ్ళారు ” [81] 1950 నాటికి, నగరం లోని కొన్ని భాగాలలో ఇళ్ళు నిర్మించుకోడానికి ప్రభుత్వం కబ్జాదార్లను అనుమతించడం ప్రారంభించింది. తత్ఫలితంగా, లజ్‌పత్ నగర్, పటేల్ నగర్ వంటి ప్రాంతాలు ఉనికిలోకి వచ్చాయి. ఈనాటికీ వీటికి ప్రత్యేకమైన పంజాబీ లక్షణం ఉంటుంది. అయితే, పంజాబ్ నుండి వేలాది హిందూ సిక్కు శరణార్థులు నగరానికి పారిపోయి రావడంతో, మత హింసలు రేగడంతో ఇది తిరుగుబాట్ల వాతావరణాన్ని సృష్టించింది. ఢిల్లీలోని పాకిస్తాన్ దౌత్యవేత్త హుస్సేన్, ఢిల్లీ ముస్లిం జనాభాను నిర్మూలించడానికే భారత ప్రభుత్వం ఉద్దేశించిందని లేదా వారి కర్మకు వాళ్లను వదిలేసిందనీ ఆరోపించాడు. అమాయక ముస్లింలను ఆర్మీ దళాలు బహిరంగంగా కాల్చి చంపాయని అతడు నివేదించాడు.[82] నగరంలో 1000 వరకు మరణాలు/క్షతులూ ఉన్నట్లు భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ అంచనా వేసాడు. అయితే, ఇది 20 రెట్లు ఎక్కువగా ఉంటుందని ఇతర వర్గాలు పేర్కొన్నాయి..ఢిల్లీ హింస గురించి జ్ఞానేంద్ర పాండే రాసిన ఇటీవలి వ్యాసంలో ఢిల్లీలో ముస్లిం మరణాల సంఖ్య 20,000-25,000 మధ్య ఉన్నట్లు పేర్కొన్నాడు.[83]

రాజకీయ అనుబంధాలతో సంబంధం లేకుండా పదివేల మంది ముస్లింలను శరణార్థి శిబిరాలకు తరలించారు. ఢిల్లీలోని పురానా ఖిల్లా, ఈద్గా, నిజాముద్దీన్ వంటి అనేక చారిత్రక ప్రదేశాలు శరణార్థి శిబిరాలుగా మారిపోయాయి. వాస్తవానికి, చాలా మంది హిందూ సిక్కు శరణార్థులు ఢిల్లీ ముస్లిం నివాసులు వదిలిపెట్టిన ఇళ్లను ఆక్రమించారు.[84] ఢిల్లీలో ఉద్రిక్తతలు తగ్గేనాటికి 3,30,000 మంది ముస్లింలు నగరం వదలి పాకిస్తాన్‌కు పారిపోయారు. జనాభా లెక్కల ప్రకారం నగరంలో ముస్లిం జనాభా 1941 లో 33.2% నుండి 1951 లో 5.3%కి పడిపోయింది.[85]

భారతదేశంలో శరణార్థుల పునరావాసం: 1947-1951[మార్చు]

1951 భారత జనాభా లెక్కల ప్రకారం, జనాభాలో 2% మంది శరణార్థులే (పశ్చిమ పాకిస్తాన్ నుండి 1.3%, తూర్పు పాకిస్తాన్ నుండి 0.7%). ఒకే నగరానికి అత్యధిక సంఖ్యలో శరణార్థులు వచ్చింది, ఢిల్లీకి. 1947–1951 కాలంలో ఢిల్లీ జనాభా 10 లక్షల (9,17,939) నుండి 17 లక్షల కన్నా ఎక్కువకు (1,744,072) పెరిగింది.[86] శరణార్థులను పురానా ఖిల్లా, ఎర్రకోట, కింగ్స్‌వే క్యాంప్‌లోని సైనిక బ్యారక్‌లలో (ప్రస్తుత ఢిల్లీ విశ్వవిద్యాలయం చుట్టూ) ఉంచారు. కింగ్స్‌వే క్యాంప్‌, ఉత్తర భారతదేశంలో అతిపెద్ద శరణార్థి శిబిరాలలో ఒకటిగా మారింది. ఏ సమయంలోనైనా 35,000 మందికి పైగా శరణార్థులు అక్కడ ఉండేవారు. 1948 నుండి భారత ప్రభుత్వం చేపట్టిన విస్తృతమైన భవన నిర్మాణ ప్రాజెక్టుల ద్వారా శిబిరాలను శాశ్వత గృహాలుగా మార్చారు. ఈ కాలంలో లజ్‌పత్ నగర్, రజిందర్ నగర్, నిజాముద్దీన్ ఈస్ట్, పంజాబీ బాగ్, రెహగర్ పురా, జంగ్‌పురా, కింగ్స్‌వే క్యాంప్ వంటి అనేక హౌసింగ్ కాలనీలు ఢిల్లీలో వచ్చాయి. అఖిల భారత స్థాయిలో శరణార్థుల కోసం విద్య, ఉపాధి అవకాశాలు, వ్యాపారాలు ప్రారంభించడానికి సులభమైన రుణాలు వంటి అనేక పథకాలను ప్రభుత్వం ప్రవేశపెట్టింది.[87]

చాలా మంది సిక్కులు, హిందూ పంజాబీలు పశ్చిమ పంజాబ్ నుండి వచ్చి తూర్పు పంజాబ్‌ (అందులో హర్యానా, హిమాచల్ ప్రదేశ్ లు కూడా ఉన్నాయి) ఢిల్లీల్లో స్థిరపడ్డారు. తూర్పు పాకిస్తాన్ (ఇప్పుడు బంగ్లాదేశ్) నుండి పారిపోతున్న హిందువులు తూర్పు భారతదేశం, ఈశాన్య భారతదేశం అంతటా స్థిరపడ్డారు. చాలామంది పొరుగున ఉన్న భారత రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, అస్సాం, త్రిపురలలో స్థిరపడ్డారు. కొంతమంది వలసదారులను అండమాన్ దీవులకు పంపారు. అక్కడ బెంగాలీలు అతిపెద్ద భాషా సమూహంగా ఉన్నారు.

సింధీ హిందువులు ప్రధానంగా గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్లలో స్థిరపడ్డారు. అయితే దూరాన, మధ్యప్రదేశ్‌లో కూడా కొందరు స్థిరపడ్డారు. మహారాష్ట్రలో సింధి హిందూ శరణార్థుల కోసం కొత్త టౌన్‌షిప్ ఏర్పాటు చేసారు. భారత గవర్నర్ జనరల్ సర్ రాజగోపాలాచారి ఈ పట్టణానికి పునాది వేసి దానికి ఉల్హాస్ నగర్ (అవి 'ఆనందం నగరం') అని పేరు పెట్టారు.

సెంట్రల్ ముంబైలోని సియోన్ కోలివాడ ప్రాంతంలో ఎక్కువగా సిక్కులు, పంజాబీ హిందువులతో కూడిన ఒక స్థావరాన్ని నెలకొల్పారు. దీనికి గురు తేజ్ బహదూర్ నగర్ అని పేరు పెట్టారు.[88]

పాకిస్తాన్లో శరణార్థుల పునరావాసం: 1947-1951[మార్చు]

1951 పాకిస్తాన్ జనాభా లెక్కల ప్రకారం ముస్లిం శరణార్థులు అత్యధిక సంఖ్యలో తూర్పు పంజాబ్, సమీప రాజ్‌పుతానా రాష్ట్రాల (అల్వార్, భరత్‌పూర్) నుండి వచ్చారు. వారు 57,83,100 దాకా ఉన్నారు. పాకిస్తాన్ లోని మొత్తం శరణార్థ జనాభాలో వీరు 80.1% దాకా ఉన్నారు.[89] పంజాబ్‌లో సరిహద్దుకు రెండు వైపులా జరిగిన ప్రతీకార జాతి ప్రక్షాళన ప్రభావం ఇది. తూర్పు పంజాబ్‌ లోని ముస్లిం జనాభాను పశ్చిమ పంజాబ్‌లోని హిందూ / సిక్కు జనాభా లాగా బలవంతంగా తరిమేసారు.

భారతదేశంలోని ఇతర ప్రాంతాల నుండి వలసలు ఈ క్రింది విధంగా ఉన్నాయి: బీహార్, పశ్చిమ బెంగాల్, ఒరిస్సాల నుండి 7,00,300 లేదా 9.8%; యుపి, ఢిల్లీల నుండి 4,64,200 లేదా 6.4%; గుజరాత్, బొంబాయిల నుండి 1,60,400 లేదా 2.2%; భోపాల్, హైదరాబాదుల నుండి 95,200 లేదా 1.2%;మద్రాసు, మైసూరుల నుండి 18,000 లేదా 0.2%.[89]

పాకిస్తాన్లో వారి స్థిరనివాసానికి సంబంధించినంతవరకు, తూర్పు పంజాబ్, దాని సమీప ప్రాంతాల నుండి 97.4% మంది శరణార్థులు పశ్చిమ పంజాబుకు వెళ్లారు; బీహార్, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా నుండి 95.9% మంది పూర్వ తూర్పు పాకిస్తాన్ కు వెళ్ళారు; యుపి, ఢిల్లీల నుండి 95.5% ప్రధానంగా పశ్చిమ పాకిస్తాన్ లోని, సింధ్ లోని కరాచీ విభాగంలోకి; భోపాల్, హైదరాబాద్ నుండి 97.2% పశ్చిమ పాకిస్తానుకు, ప్రధానంగా కరాచీకి; బొంబాయి, గుజరాత్‌ల నుండి పశ్చిమ 98.9% పాకిస్తాను లోని కరాచీకి; మద్రాసు మైసూరుల నుండి 98.9% మంది పశ్చిమ పాకిస్తాన్‌ లోని కరాచీకి వెళ్లారు.[89]

పశ్చిమ పంజాబ్‌లో అత్యధిక సంఖ్యలో శరణార్థులు (73.1%) ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది ప్రధానంగా తూర్పు పంజాబ్, దాని సమీప ప్రాంతాల నుండి వెళ్ళారు. మొత్తం వలసదారులలో 16.1%తో రెండవ అతిపెద్ద శరణార్థుల జనాభా సింధ్ చేరుకుంది. సింధ్ లోని కరాచీ విభాగం ఒక్కచోటికే మొత్తం వలస జనాభాలో 8.5% వెళ్ళింది. 6,99,100 మందితో తూర్పు బెంగాల్ శరణార్థులు, మొత్తం పాకిస్తాన్ ముస్లిం శరణార్థ జనాభాలో 9.7%తో మూడవ స్థానంలో ఉన్నారు. తూర్పు బెంగాల్‌లో 66.7% మంది శరణార్థులు పశ్చిమ బెంగాల్ నుండి, 14.5% బీహార్ నుండి, 11.8% అస్సాం నుండి వెళ్ళారు.[90]

NWFP, బలూచిస్తాన్ల లోకి అతి తక్కువ సంఖ్యలో వలసదారులు వెళ్ళారు. ఎన్‌డబ్ల్యుఎఫ్‌పికి 51,100 మంది వలసదారులు (వలస జనాభాలో 0.7%) ఉండగా, బలూచిస్తాన్ 28,000 (వలస జనాభాలో 0.4%) వెళ్ళారు.

1948 లో పశ్చిమ పంజాబ్‌లో శరణార్థుల జనాభా గణనను ప్రభుత్వం చేపట్టింది. ఇది భారతదేశంలో వారి మూలం ఎక్కడో తేల్చింది.

తూర్పు పంజాబ్, పొరుగు ప్రాంతాల జిల్లాల నుండి పశ్చిమ పంజాబ్‌లోకి వెళ్ళిన ముస్లిం శరణార్థుల డేటా [91]

స్థలాలు సంఖ్య
అమృత్సర్ (తూర్పు పంజాబ్) 7,41,444
జలంధర్ (తూర్పు పంజాబ్) 5,20,189
గురుదాస్‌పూర్ (తూర్పు పంజాబ్) 4,99,793
హోషియార్పూర్ (తూర్పు పంజాబ్) 3,84,448
కర్నాల్ (తూర్పు పంజాబ్) 3,06,509
హిస్సార్ (తూర్పు పంజాబ్) 2,87,479
లుధియానా (తూర్పు పంజాబ్) 2,55,864
అంబాలా (తూర్పు పంజాబ్) 2,22,939
గుర్గావ్ (తూర్పు పంజాబ్) 80,537
రోహ్తక్ (తూర్పు పంజాబ్) 172,640
ఢిల్లీ 91,185
కాంగ్రా (తూర్పు పంజాబ్) 33,826
యునైటెడ్ ప్రావిన్సెస్ 28,363
సిమ్లా (తూర్పు పంజాబ్) 11,300

తూర్పు పంజాబ్, రాజ్‌పుతానాలోని సంస్థానాల నుండి పశ్చిమ పంజాబ్‌లోని ముస్లిం శరణార్థుల డేటా [91][మార్చు]

పేరు సంఖ్య
పాటియాలా (తూర్పు పంజాబ్) 3,08,948
అల్వార్ (రాజ్‌పుతానా) 1,91,567
కపుర్తాలా (తూర్పు పంజాబ్) 1,72,079
ఫరీద్కోట్ (తూర్పు పంజాబ్) 66,596
భరత్‌పూర్ (రాజ్‌పుతానా) 43,614
నభా (తూర్పు పంజాబ్) 43,538
జింద్ (తూర్పు పంజాబ్) 41,696
ఇతర చిన్న రాష్ట్రాలు కలిసి 39,322

తప్పిపోయిన వ్యక్తులు[మార్చు]

1931, 1951 జనాభా లెక్కల ప్రకారం అందించిన డేటాను ఉపయోగించి పంజాబ్ లోని జిల్లాల్లోకి వచ్చే జన ప్రవాహం, వెళ్ళే జన ప్రవాహాలపై చేసిన అధ్యయనం ప్రకారం, పశ్చిమ భారతదేశాన్ని విడిచిపెట్టి, పాకిస్తాన్ చేరుకోని ముస్లిములు 13 లక్షల మంది అని అంచనా వేసారు.[92] పశ్చిమ సరిహద్దులో తప్పిపోయిన హిందువులు / సిక్కుల సంఖ్య సుమారు 8 లక్షలు.[93] పంజాబ్ సరిహద్దులో విభజనకు సంబంధించిన వలసల కారణంగా తప్పిపోయిన వారి మొత్తం సంఖ్య సుమారు 22 లక్షలకు చేరుతుంది.[93] 1931, 1941, 1951 జనాభా లెక్కలను ఉపయోగించి పంజాబ్ ప్రాంతంలో విభజన వలన జనాభాపై కలిగే పరిణామాలపై మరొక అధ్యయనం ప్రకారం పంజాబ్లో 23 - 32 లక్షల మధ్య తప్పిపోయారని తేల్చింది.[94]

మహిళల పునరావాసం[మార్చు]

అల్లర్ల సమయంలో అపహరణకు, అత్యాచారానికీ గురైన మహిళలను పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తామని ఇరువర్గాలు ఒకరికొకరు వాగ్దానం చేశాయి. 33,000 మంది హిందూ, సిక్కు మహిళలను అపహరించారని భారత ప్రభుత్వం చెప్పగా, అల్లర్ల సమయంలో 50,000 మంది ముస్లిం మహిళలను అపహరించారని పాకిస్తాన్ ప్రభుత్వం పేర్కొంది. 1949 నాటికి, భారతదేశంలో 12,000, పాకిస్తాన్లో 6,000 మంది మహిళలను కాపాడారని చట్టపరమైన వాదనలు ఉన్నాయి.[95] 1954 నాటికి భారతదేశంలో 20,728 మంది ముస్లిం మహిళలను కాపాడారు, 9,032 మంది హిందూ, సిక్కు మహిళలను పాకిస్తాన్ లో కాపాడారు.[96] తమ కుటుంబం తమను స్వీకరించదని భయపడి చాలా మంది హిందూ, సిక్కు మహిళలు భారతదేశానికి తిరిగి వెళ్లడానికి నిరాకరించారు. అలాగే ముస్లిము మహిళలు పాకిస్తాన్ వెళ్ళేందుకు నిరాకరించారు [97]

విభజన తరువాత వలసలు[మార్చు]

పాకిస్థాన్[మార్చు]

1951 జనాభా లెక్కల తరువాత కూడా, భారతదేశం నుండి అనేక ముస్లిం కుటుంబాలు 1950 ల్లోను 1960 ల ప్రారంభంలోనూ పాకిస్తానుకు వలస వెళ్లడం కొనసాగించాయి. చరిత్రకారుడు ఒమర్ ఖలీది ప్రకారం, 1947 1971 డిసెంబరు డిసెంబరు మధ్య యుపి, ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళల నుండి ముస్లింలు పశ్చిమ పాకిస్తాన్‌కు వలస వెళ్ళారు. వలసల తదుపరి దశ 1973 - 1990 ల మధ్య జరిగింది. ఈ వలసదారుల ప్రాథమిక గమ్యం కరాచీతో పాటు సింధ్ లోని ఇతర పట్టణ కేంద్రాలు.[98]

1959 లో, అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) ఒక నివేదికను ప్రచురించింది, 1951 నుండి 1956 వరకు, భారతదేశం నుండి మొత్తం 6,50,000 మంది ముస్లింలు పశ్చిమ పాకిస్తాన్‌కు మకాం మార్చారు.[99] అయితే, పాకిస్తాన్కు భారత ముస్లిం వలసల గురించి వాదనల ప్రామాణికతపై విజారియా (1969) సందేహాలను లేవనెత్తింది. ఎందుకంటే 1961 పాకిస్తాన్ జనాభా లెక్కలు ఈ గణాంకాలను ధ్రువీకరించలేదు. అయితే, 1961 పాకిస్తాన్ జనాభా లెక్కల్లో అంతకు ముందరి దశాబ్ద కాలంలో భారతదేశం నుండి పాకిస్తాన్కు 8,00,000 మంది ప్రజలు వలస వచ్చారని ప్రకటించారు.[100] పాకిస్తాన్ బయలుదేరిన వారిలో, చాలామంది తిరిగి రాలేదు.

పాకిస్తాన్కు భారత ముస్లింల వలసలు 1970 లలో బాగా తగ్గాయి. ఈ ధోరణిని పాకిస్తాన్ అధికారులు గుర్తించారు. 1973-1994 మధ్య కాలంలో, సరైన ప్రయాణ పత్రాలపై 8,00,000 మంది సందర్శకులు భారతదేశం నుండి వచ్చారని, 1995 జూన్ లో, పాకిస్తాన్ అంతర్గత మంత్రి నసీరుల్లా బాబర్ జాతీయ అసెంబ్లీకి తెలియజేశారు. వీరిలో 3,393 మంది మాత్రమే ఉండిపోయారు.[101] ఇలాంటి ధోరణినే చూపిస్తూ, భారతీయ పాకిస్తాన్ ముస్లింల మధ్య వివాహాలు కూడా బాగా తగ్గాయి. న్యూ ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషనర్ రియాజ్ ఖోఖర్ 1995 నవంబరులో చేసిన ప్రకటన ప్రకారం, 1950 - 1960 లలో సరిహద్దుమీదుగా జరిగిన వివాహాల సంఖ్య సంవత్సరానికి 40,000 నుండి సంవత్సరానికి 300 కి పడిపోయింది.[101]

1965 ఇండో-పాకిస్తాన్ యుద్ధం తరువాత, 3,500 మంది ముస్లిం కుటుంబాలు థార్ ఎడారి లోని భారత భాగం నుండి థార్ ఎడారి లోని పాకిస్తాన్ విభాగానికి వలస వెళ్ళారు.[102] 1965 యుద్ధం తరువాత 400 కుటుంబాలు నాగర్‌లో స్థిరపడ్డాయి. మరో 3000 కుటుంబాలు పశ్చిమ పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లోని చాక్రో తాలూకాలో స్థిరపడ్డారు.[103] పాకిస్తాన్ ప్రభుత్వం ప్రతి కుటుంబానికి 12 ఎకరాల భూమిని ఇచ్చింది. ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఈ భూమి మొత్తం 42,000 ఎకరాలు.[103]

పాకిస్తాన్‌లో 1951 జనాభా లెక్కల ప్రకారం తూర్పు పాకిస్తాన్‌లో 6,71,000 మంది శరణార్థులు నమోదయ్యారు, వీరిలో ఎక్కువ మంది పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చారు. మిగిలిన వారు బీహార్ కు చెందినవారు.[104] 1951–1956 కాలంలో ఐఎల్‌ఓ ప్రకారం, ఐదు లక్షల మంది భారతీయ ముస్లింలు తూర్పు పాకిస్తాన్‌కు వలస వచ్చారు.[105] 1961 నాటికి ఈ సంఖ్య 8,50,000 కి చేరుకుంది. రాంచీ జంషెడ్పూర్లలో జరిగిన అల్లర్ల తరువాత, బీహారీలు అరవైల చివరలో తూర్పు పాకిస్తాన్కు వలస వెళ్ళడం కొనసాగించారు. వీరి సంఖ్య సుమారు పది లక్షల వరకు ఉంటుంది.[106] విభజన తరువాతి రెండు దశాబ్దాలలో సుమారు 15 లక్షల మంది ముస్లింలు పశ్చిమ బెంగాల్, బీహార్ ల నుండి తూర్పు బెంగాల్కు వలస వచ్చారని అంచనాలు సూచిస్తున్నాయి.[107]

భారతదేశం[మార్చు]

పాకిస్తాన్‌లో మతపరమైన హింస కారణంగా హిందువులు భారత్‌కు పారిపోతూనే ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రంలో స్థిరపడుతూంటారు.[108] హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫ్ పాకిస్తాన్ డేటా ప్రకారం, 2013 లో కేవలం 1,000 హిందూ కుటుంబాలు భారతదేశానికి పారిపోయాయి.[108] 2014 మే లో, పాలక పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పిఎంఎల్-ఎన్) సభ్యుడు డాక్టర్ రమేష్ కుమార్ వాంక్వానీ పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో ప్రతి సంవత్సరం 5,000 మంది హిందువులు పాకిస్తాన్ నుండి భారతదేశానికి వలస పోతున్నారని వెల్లడించాడు.[109] భారతదేశం 1951 ఐక్యరాజ్యసమితి శరణార్థుల తీర్మానంపై సంతకం చేయలేదు కాబట్టి పాకిస్తాన్ నుండి వచ్చే హిందూ వలసదారులను శరణార్థులుగా గుర్తించడానికి భారత్ నిరాకరించింది.[108]

పశ్చిమ పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లోని థార్‌పార్కర్ జిల్లాలో జనాభా 1947 లో స్వాతంత్ర్యం సమయంలో 80% హిందూ, 20% ముస్లింలు. 1965, 1971 నాటి ఇండో-పాకిస్తాన్ యుద్ధాల సమయంలో, హిందూ ఉన్నత కులాలు, వారి అండలో ఉన్నవారూ భారతదేశానికి పారిపోయారు. ఇది జిల్లాలో భారీ జనాభా మార్పుకు దారితీసింది.[102] 1978 లో భారతదేశం 55,000 మంది పాకిస్తానీయులకు పౌరసత్వం ఇచ్చింది.[108] పాకిస్తాన్ 1998 జనాభా లెక్కల నాటికి, థార్‌పార్కర్‌ జనాభాలో ముస్లింలు 64.4%, హిందువులు 35.6% ఉన్నారు.

తూర్పు పాకిస్తాన్ నుండి భారతదేశానికి హిందువుల వలసలు విభజన తరువాత నిరంతరాయంగా కొనసాగాయి. భారతదేశంలో 1951 జనాభా లెక్కల ప్రకారం 25 లక్షల మంది శరణార్థులు తూర్పు పాకిస్తాన్ నుండి వచ్చారు. వారిలో 21 లక్షల మంది పశ్చిమ బెంగాల్‌కు, మిగిలిన వారు అస్సాం, త్రిపుర, ఇతర రాష్ట్రాలకు వలస వచ్చారు.[104] ఈ శరణార్థులు తరంగాలుగా వచ్చారు. వాళ్ళు వచ్చింది విభజన సమయంలో మాత్రమే కాదు. 1973 నాటికి వారి సంఖ్య 60 లక్షలకు చేరుకుంది. కింది డేటా తూర్పు పాకిస్తాన్ నుండి వచ్చిన శరణార్థుల ప్రధాన తరంగాలను, వలసలు సంభవించిన సంఘటనలనూ చూపిస్తుంది:[110][111]

సంవత్సరం కారణం సంఖ్య
1947 విభజన 3,44.000
1948 హైదరాబాదు స్వాధీనం 7,86.000
1950 1950 బారిసల్ అల్లర్లు 15,75.000
1956 పాకిస్తాన్ ఇస్లామిక్ రిపబ్లిక్‌గా మారినప్పుడు 3,20,000
1964 హజ్రత్‌బాల్ సంఘటనపై అల్లర్లు 6,93.000
1965 1965 ఇండో-పాకిస్తాన్ యుద్ధం 1,07,000
1971 బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం 15,00,000
1947-1973 మొత్తం 60,00,000

ఇవి కూడా చూడండి[మార్చు]

నోట్స్[మార్చు]

  1. "The death toll remains disputed with figures ranging from 200,000 to 2 million."[1]
  2. British India consisted of those regions of the British Raj, or the British Indian Empire, which were directly administered by Britain; other regions, of nominal sovereignty, was which were indirectly ruled by Britain, were called princely states.
  3. "The death toll remains disputed to this day with figures ranging from 200,000 to 2 million."[1]
  4. Coastal Ceylon, part of the Madras Presidency of British India from 1796, became the separate crown colony of British Ceylon in 1802. Burma, gradually annexed by the British during 1826–86 and governed as a part of the British Indian administration until 1937, was directly administered after that.[4] Burma was granted independence on 4 January 1948 and Ceylon on 4 February 1948. (See History of Sri Lanka and History of Burma.)
  5. The Himalayan kingdom of Sikkim was established as a princely state after the Anglo-Sikkimese Treaty of 1861. However, the issue of sovereignty was left undefined.[5] In 1947, Sikkim became an independent kingdom under the suzerainty of India and remained so until 1975 when it was absorbed into India as the 22nd state. Other Himalayan kingdoms, Nepal and Bhutan, having signed treaties with the British designating them as independent states, were not a part of British India.[6] The Indian Ocean island of The Maldives, became a protectorate of the British crown in 1887 and gained its independence in 1965.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 Talbot & Singh 2009, p. 2.
  2. 2.0 2.1 Population Redistribution and Development in South Asia. Springer Science & Business Media. 2012. p. 6. ISBN 978-9400953093.
  3. Partition (n), 7. b (3rd ed.). Oxford English Dictionary. 2005. The division of British India into India and Pakistan, achieved in 1947.
  4. Sword For Pen Archived 2020-07-29 at the Wayback Machine, Time, 12 April 1937
  5. "Sikkim". Encyclopædia Britannica. 2008.
  6. Encyclopædia Britannica. 2008. "Nepal.", Encyclopædia Britannica. 2008. "Bhutan."
  7. Copland, Ian (2005). State, Community and Neighbourhood in Princely North India, c. 1900-1950. p. 140.
  8. రామచంద్ర, గుహ (డిసెంబరు 2010). "విభజన తార్కికత". గాంధీ అనంతర భారతదేశం (1 ed.). విజయవాడ: ఎమెస్కో. pp. 26–35. కాకాని చక్రపాణి తెలుగు అనువాదం
  9. 9.0 9.1 9.2 9.3 9.4 9.5 9.6 9.7 9.8 Brown 1994, pp. 205–207
  10. "Two-Nation Theory Exists". Pakistan Times. Archived from the original on 11 November 2007.
  11. Conor Cruise O'Brien (August 1988). "Holy War Against India". The Atlantic Monthly. pp. 54–64. Retrieved 2 April 2017.
  12. "The Partition of India".
  13. Pritam Singh; Pritam Singh (2008). Federalism, Nationalism and Development: India and the Punjab Economy. Routledge. pp. 137–. ISBN 978-1-134-04946-2.
  14. Pritam Singh (2008). Federalism, Nationalism and Development: India and the Punjab Economy. Routledge. pp. 173–. ISBN 978-1-134-04945-5.
  15. 15.0 15.1 Talbot & Singh 2009, p. 31.
  16. "The turning point in 1932: on Dalit representation". The Hindu. 3 May 2018. Retrieved 28 May 2018.
  17. 17.00 17.01 17.02 17.03 17.04 17.05 17.06 17.07 17.08 17.09 17.10 Talbot & Singh 2009, p. 32.
  18. Talbot & Singh 2009, pp. 32–33.
  19. 19.0 19.1 19.2 19.3 19.4 19.5 19.6 Talbot & Singh 2009, p. 33.
  20. 20.0 20.1 20.2 20.3 Talbot & Singh 2009, p. 34.
  21. Yasmin Khan (2017). The Great Partition: The Making of India and Pakistan, New Edition. Yale University Press. pp. 18–. ISBN 978-0-300-23364-3. Although it was founded in 1909 the League had only caught on among South Asian Muslims during the Second World War. The party had expanded astonishingly rapidly and was claiming over two million members by the early 1940s, an unimaginable result for what had been previously thought of as just one of the numerous pressure groups and small but insignificant parties.
  22. William Roger Louis; Wm. Roger Louis (2006). Ends of British Imperialism: The Scramble for Empire, Suez, and Decolonization. I.B. Tauris. pp. 397–. ISBN 978-1-84511-347-6. He made a serious misjudgment in underestimating Muslim sentiment before the outbreak of the war. He did not take the idea of 'Pakistan' seriously. After the adoption of the March 1940 Lahore resolution, calling for the creation of a separate state or states of Pakistan, he wrote: 'My first reaction is, I confess, that silly as the Muslim scheme for partition is, it would be a pity to throw too much cold water on it at the moment.' Linlithgow surmised that what Jinnah feared was a federal India dominated by Hindus. Part of the purpose of the famous British 'August offer' of 1940 was to assure the Muslims that they would be protected against a 'Hindu Raj' as well as to hold over the discussion of the 1935 Act and a 'new constitution' until after the war.
  23. L. J. Butler (2002). Britain and Empire: Adjusting to a Post-Imperial World. I.B. Tauris. pp. 41–. ISBN 978-1-86064-448-1. Viceroy Linlithgow's 'August Offer,' made in 1940, proposed Dominion status for India after the war, and the inclusion of Indians in a larger Executive Council and a new War Advisory Council, and promised that minority views would be taken into account in future constitutional revision. This was not enough to satisfy either the Congress or the Muslim League, who both rejected the offer in September, and shortly afterward Congress launched a fresh campaign of civil disobedience.
  24. Talbot & Singh 2009, pp. 34–35.
  25. 25.0 25.1 25.2 Talbot & Singh 2009, p. 35.
  26. Ayesha Jalal (1994). The Sole Spokesman: Jinnah, the Muslim League and the Demand for Pakistan. Cambridge University Press. p. 81. ISBN 978-1-139-93570-8. Provincial option, he argued, was insufficient security. Explicit acceptance of the principle of Pakistan offered the only safeguard for Muslim interests throughout India and had to be the precondition for any advance at the center. So he exhorted all Indian Muslims to unite under his leadership to force the British and the Congress to concede 'Pakistan.' If the real reasons for Jinnah's rejection of the offer were rather different, it was not Jinnah but his rivals who had failed to make the point publicly.
  27. 27.0 27.1 Khan 2007, p. 18.
  28. Stein & Arnold 2010, p. 289: Quote: "Gandhi was the leading genius of the later, and ultimately successful, campaign for India's independence"
  29. Metcalf & Metcalf 2006, p. 209.
  30. Khan 2007, p. 43.
  31. Robb 2002, p. 190
  32. 32.0 32.1 Judd 2004, pp. 172–173
  33. Barbara Metcalf (2012). Husain Ahmad Madani: The Jihad for Islam and India's Freedom. Oneworld Publications. pp. 107–. ISBN 978-1-78074-210-6.
  34. Judd 2004, pp. 170–171
  35. Judd 2004, p. 172
  36. Brown, Judith Margaret (1994). Modern India: the origins of an Asian democracy. Oxford University Press. ISBN 978-0-19-873112-2. Yet these final years of the raj showed conclusively that British rule had lost legitimacy and that among the vast majority of Hindus Congress had become the raj's legitimate successor. Tangible proof came in the 1945–6 elections to the central and provincial legislatures. In the former, Congress won 91 percent of the votes cast in non-Muslim constituencies, and in the latter, gained an absolute majority and became the provincial raj in eight provinces. The acquiescence of the politically aware (though possibly not of many villagers even at this point) would have been seriously in doubt if the British had displayed any intention of staying in India. (pp. 328–329)
  37. Barbara D. Metcalf; Thomas R. Metcalf (2012). A Concise History of Modern India. Cambridge University Press. pp. 212–. ISBN 978-1-139-53705-6.
  38. Burton Stein (2010). A History of India. John Wiley & Sons. pp. 347–. ISBN 978-1-4443-2351-1.
  39. Sugata Bose; Ayesha Jalal (2004). Modern South Asia: History, Culture, Political Economy (2nd ed.). Psychology Press. pp. 148–149. ISBN 978-0-415-30787-1.
  40. Burton Stein (2010). A History of India. John Wiley & Sons. p. 347. ISBN 978-1-4443-2351-1. His standing with the British remained high, however, for even though they no more agreed with the idea of a separate Muslim state than the Congress did, government officials appreciated the simplicity of a single negotiating voice for all of India's Muslims.
  41. Jeffery J. Roberts (2003). The Origins of Conflict in Afghanistan. Greenwood Publishing Group. pp. 85–. ISBN 978-0-275-97878-5. Virtually every Briton wanted to keep India united. Many expressed moral or sentimental obligations to leave India intact, either for the inhabitants' sake or simply as a lasting testament to the Empire. The Cabinet Defense Committee and the Chiefs of Staff, however, stressed the maintenance of a united India as vital to the defense (and economy) of the region. A unified India, an orderly transfer of power, and a bilateral alliance would, they argued, leave Britain's strategic position undamaged. India's military assets, including its seemingly limitless manpower, naval and air bases, and expanding production capabilities, would remain accessible to London. India would thus remain of crucial importance as a base, training ground, and staging area for operations from Egypt to the Far East.
  42. Darwin, John (3 March 2011). "Britain, the Commonwealth and the End of Empire". BBC. Retrieved 10 April 2017. But the British still hoped that a self-governing India would remain part of their system of 'imperial defense'. For this reason, Britain was desperate to keep India (and its army) united.
  43. Barbara D. Metcalf; Thomas R. Metcalf (2002). A Concise History of India. Cambridge University Press. pp. 212–. ISBN 978-0-521-63974-3. By this scheme, the British hoped they could at once preserve united India desired by the Congress, and by themselves, and at the same time, through the groups, secure the essence of Jinnah's demand for a 'Pakistan'.
  44. Barbara D. Metcalf; Thomas R. Metcalf (2002). A Concise History of India. Cambridge University Press. pp. 211–213. ISBN 978-0-521-63974-3. Its proposal for an independent India involved a complex, three-tiered federation, whose central feature was the creation of groups of provinces. Two of these groups would comprise the Muslim majority provinces of east and west; a third would include the Hindu majority regions of the center and south. These groups, given responsibility for most of the functions of government, would be subordinated to a Union government, would be subordinated to a Union government controlling defense, foreign affairs, and communications. Nevertheless, the Muslim League accepted the Cabinet mission's proposals. The ball was now in Congress's court. Although the grouping scheme preserved a united India, the Congress leadership, above all Jawaharlal Nehru, now slated to be Gandhi's successor, increasingly concluded that under the Cabinet mission proposals the Center would be too weak to achieve the goals of the Congress, which envisioned itself as the successor to the Raj. Looking ahead to the future, the Congress, especially its socialist wing headed by Nehru, wanted a central government that could direct and plan for an India, free of colonialism, that might eradicate its people's poverty and grow into an industrial power. India's business community also supported the idea of a strong central government In a provocative speech on 10 July 1946, Nehru repudiated the notion of compulsory grouping or provinces, the key to Jinnah's Pakistan. Provinces, he said, must be free to join any group. With this speech, Nehru effectively torpedoed the Cabinet mission scheme, and with it, any hope for a united India.
  45. Khan 2007, pp. 64–65.
  46. Talbot & Singh 2009, p. 69: Quote: "Despite the Muslim League's denials, the outbreak was linked with the celebration of Direction Action Day. Muslim procession that had gone to the staging ground of the 150-foot Ochterlony Monument on the maidan to hear the Muslim League Prime Minister Suhrawardy attacked Hindus on their way back. They were heard shouting slogans as 'Larke Lenge Pakistan' (We shall win Pakistan by force). Violence spread to North Calcutta when Muslim crowds tried to force Hindu shopkeepers to observe the day's strike (hartal) call. The circulation of pamphlets in advance of Direct Action Day demonstrated a clear connection between the use of violence and the demand for Pakistan."
  47. Talbot & Singh 2009, p. 67 Quote: "The signs of 'ethnic cleansing' are first evident in the Great Calcutta Killing of 16–19 August 1946."
  48. Talbot & Singh 2009, p. 68.
  49. Talbot & Singh 2009, p. 67 Quote: "(Signs of 'ethnic cleansing') were also present in the wave of violence that rippled out from Calcutta to Bihar, where there were high Muslim casualty figures, and to Noakhali deep in the Ganges-Brahmaputra delta of Bengal. Concerning the Noakhali riots, one British officer spoke of a 'determined and organized' Muslim effort to drive out all the Hindus, who accounted for around a fifth of the total population. Similarly, the Punjab counterparts to this transition of violence were the Rawalpindi massacres of March 1947. The level of death and destruction in such West Punjab villages as Thoa Khalsa was such that communities couldn't live together in its wake."
  50. Ziegler, Philip (1985). Mountbatten: The Official Biography. London: HarperCollins. p. 359. ISBN 978-0002165433..
  51. Ayesha Jalal (1994). The Sole Spokesman: Jinnah, the Muslim League and the Demand for Pakistan. Cambridge University Press. p. 250. ISBN 978-0-521-45850-4. These instructions were to avoid partition and obtain a unitary government for British India and the Indian States and at the same time observe the pledges to the princes and the Muslims; to secure agreement to the Cabinet Mission plan without coercing any of the parties; somehow to keep the Indian army undivided, and to retain India within the Commonwealth. (Attlee to Mountbatten, 18 March 1947, ibid, 972–974)
  52. Ayesha Jalal (1994). The Sole Spokesman: Jinnah, the Muslim League and the Demand for Pakistan. Cambridge University Press. p. 251. ISBN 978-0-521-45850-4. When Mountbatten arrived, it was not wholly inconceivable that a settlement on the Cabinet Mission's terms might still be secured limited bloodshed called for a united Indian army under effective control. But keeping the army intact was now inextricably linked with keeping India united, this is why Mountbatten started by being vehemently opposed to 'abolishing the center'.
  53. Talbot, Ian (2009). "Partition of India: The Human Dimension". Cultural and Social History. 6 (4): 403–410. doi:10.2752/147800409X466254. Mountbatten had intended to resurrect the Cabinet Mission proposals for a federal India. British officials were unanimously pessimistic about Pakistan's state's future economic prospects. The agreement to an Indian Union contained in the Cabinet Mission proposals had been initially accepted by the Muslim League as the grouping proposals gave considerable autonomy in the Muslim majority areas. Moreover, there was the possibility of withdrawal and thus acquiring Pakistan by the back-door after a ten-year interval. The worsening communal situation and extensive soundings with Indian political figures convinced Mountbatten within a month of his arrival that partition was, however, the only way to secure a speedy and smooth transfer of power.
  54. Gandhi, Rajmohan. Patel: A Life. pp. 395–397.
  55. Menon, V. P. Transfer of Power in India. p. 385.
  56. Jain, Jagdish Chandra.Gandhi, the forgotten Mahatma. Mittal Publications, 1987, p. 38.
  57. Talbot & Singh 2009, pp. 67–68.
  58. Menon, V.P (1957). Transfer of Power in India. Orient Blackswan. p. 512. ISBN 978-8125008842.
  59. Sankar Ghose, Jawaharlal Nehru, a biography (1993), p. 181
  60. 60.0 60.1 Jagmohan (2005). Soul and Structure of Governance in India. Allied Publishers. p. 49. ISBN 978-8177648317.
  61. Gopal, Ram (1991). Hindu Culture During and After Muslim Rule: Survival and Subsequent Challenges. M.D. Publications Pvt. Ltd. p. 133. ISBN 978-8170232056.
  62. Ray, Jayanta Kumar (2013). India's Foreign Relations, 1947–2007. Routledge. p. 58. ISBN 978-1136197154.
  63. Ishtiaq Ahmed, State, Nation and Ethnicity in Contemporary South Asia (London & New York, 1998), p. 99
  64. Raju, Thomas G. C. (Fall 1994). "Nations, States, and Secession: Lessons from the Former Yugoslavia". Mediterranean Quarterly. 5 (4): 40–65.
  65. 65.0 65.1 65.2 65.3 Spate 1947, pp. 126–137
  66. Vazira Fazila-Yacoobali Zamindar (2010). The Long Partition and the Making of Modern South Asia: Refugees, Boundaries, Histories. Columbia University Press. pp. 40–. ISBN 978-0-231-13847-5. Second, it was feared that if an exchange of populations was agreed to in principle in Punjab, ' there was likelihood of trouble breaking out in other parts of the subcontinent to force Muslims in the Indian Dominion to move to Pakistan. If that happened, we would find ourselves with inadequate land and other resources to support the influx.' Punjab could set a very dangerous precedent for the rest of the subcontinent. Given that Muslims in the rest of India, some 42 million, formed a population larger than the entire population of West Pakistan at the time, economic rationality eschewed such a forced migration. However, in divided Punjab, millions of people were already on the move, and the two governments had to respond to this mass movement. Thus, despite these important reservations, the establishment of the MEO led to an acceptance of a 'transfer of populations' in divided Punjab, too, 'to give a sense of security' to ravaged communities on both sides. A statement of the Indian government's position of such a transfer across divided Punjab was made in the legislature by Neogy on November 18, 1947. He stated that although the Indian government's policy was 'to discourage mass migration from one province to another.' Punjab was to be an exception. In the rest of the subcontinent migrations were not to be on a planned basis, but a matter of individual choice. This exceptional character of movements across divided Punjab needs to be emphasized, for the agreed and 'planned evacuations' by the two governments formed the context of those displacements.
  67. Peter Gatrell (2013). The Making of the Modern Refugee. OUP Oxford. pp. 149–. ISBN 978-0-19-967416-9. Notwithstanding the accumulated evidence of inter-communal tension, the signatories to the agreement that divided the Raj did not expect the transfer of power and the partition of India to be accompanied by a mass movement of population. Partition was conceived as a means of preventing migration on a large scale because the borders would be adjusted instead. Minorities need not be troubled by the new configuration. As Pakistan's first Prime Minister, Liaquat Ali Khan, affirmed, 'the division of India into Pakistan and India Dominions was based on the principle that minorities will stay where they were and that the two states will afford all protection to them as citizens of the respective states'.
  68. "The partition of India and retributive genocide in the Punjab, 1946–47: means, methods, and purposes" (PDF). Archived from the original (PDF) on 14 ఏప్రిల్ 2021. Retrieved 19 December 2006.
  69. Talbot, Ian (2009). "Partition of India: The Human Dimension". Cultural and Social History. 6 (4): 403–410. doi:10.2752/147800409X466254. The number of casualties remains a matter of dispute, with figures being claimed that range from 200,000 to 2 million victims.
  70. D'Costa, Bina (2011). Nationbuilding, Gender and War Crimes in South Asia. Routledge. p. 53. ISBN 978-0415565660.
  71. Butalia, Urvashi (2000). The Other Side of Silence: Voices From the Partition of India. Duke University Press.
  72. Sikand, Yoginder (2004). Muslims in India Since 1947: Islamic Perspectives on Inter-Faith Relations. Routledge. p. 5. ISBN 978-1134378258.
  73. "A heritage all but erased". The Friday Times. 25 December 2015. Retrieved 26 June 2017.
  74. Bharadwaj, Prasant; Khwaja, Asim; Mian, Atif (30 August 2008). "The Big March: Migratory Flows after the Partition of India" (PDF). Economic & Political Weekly: 43. Archived from the original (PDF) on 3 డిసెంబరు 2012. Retrieved 16 January 2016.
  75. Talbot, Ian (1993). "The role of the crowd in the Muslim League struggled for Pakistan". The Journal of Imperial and Commonwealth History. 21 (2): 307–333. doi:10.1080/03086539308582893. Four thousand Muslim shops and homes were destroyed in the walled area of Amritsar during a single week in March 1947. were these exceptions which prove the rule? It appears that casualty figures were frequently higher when Hindus rather than Muslims were the aggressors.
  76. Nisid Hajari (2015). Midnight's Furies: The Deadly Legacy of India's Partition. Houghton Mifflin Harcourt. pp. 139–. ISBN 978-0-547-66921-2.
  77. Chatterji, Joya (2007). The Spoils of Partition: Bengal and India, 1947–1967. p. 45. ISBN 978-1139468305.
  78. 78.0 78.1 78.2 78.3 78.4 Bhavnani, Nandita (2014). The Making of Exile: Sindhi Hindus and the Partition of India. Westland. ISBN 978-93-84030-33-9.
  79. Markovits, Claude (2000). The Global World of Indian Merchants, 1750–1947. Cambridge University Press. p. 278. ISBN 978-0-521-62285-1.
  80. 80.0 80.1 Acyuta Yājñika; Suchitra Sheth (2005). The Shaping of Modern Gujarat: Plurality, Hindutva, and Beyond. Penguin Books India. pp. 225–. ISBN 978-0-14-400038-8.
  81. Guha, Ramachandra. Gandhi before India. ISBN 978-0-307-47478-0. OCLC 903907799.
  82. Nisid Hajari (2015). Midnight's Furies: The Deadly Legacy of India's Partition. Houghton Mifflin Harcourt. pp. 160–. ISBN 978-0-547-66921-2.
  83. Zamindar, Vazira Fazila-Yacoobali (2010). The Long Partition and the Making of Modern South Asia: Refugees, Boundaries, Histories. Columbia University Press. p. 247. ISBN 978-0-231-13847-5.
  84. Kumari, Amita (2013). "Delhi as Refuge: Resettlement and Assimilation of Partition Refugees". Economic and Political Weekly: 60–67.
  85. Sharma, Bulbul (2013). Muslims In Indian Cities. HarperCollins Publishers India. ISBN 978-93-5029-555-7.
  86. Census of India, 1941 and 1951.
  87. Kaur, Ravinder (2007). Since 1947: Partition Narratives among Punjabi Migrants of Delhi. Oxford University Press. ISBN 978-0-19-568377-6.
  88. Johari, Aarefa. "Facing eviction, residents of a Mumbai Partition-era colony fear they will become homeless again". Scroll.in. Retrieved 20 October 2018.
  89. 89.0 89.1 89.2 Chitkara, G.M. (1998). Converts Do Not Make A Nation. APH Publishing. p. 216. ISBN 978-81-7024-982-5.
  90. Ghosh, Papiya (2001). "The Changing Discourse Of The Muhajirs". India International Centre Quarterly. 28 (3): 58. JSTOR 23005560.
  91. 91.0 91.1 Chattha 2009, p. 111.
  92. Bharadwaj, Prasant; Khwaja, Asim; Mian, Atif (30 August 2008). "The Big March: Migratory Flows after the Partition of India" (PDF). Economic & Political Weekly: 43. Archived from the original (PDF) on 3 డిసెంబరు 2012. Retrieved 16 January 2016.
  93. 93.0 93.1 Bharadwaj, Prasant; Khwaja, Asim; Mian, Atif (30 August 2008). "The Big March: Migratory Flows after the Partition of India" (PDF). Economic & Political Weekly: 43. Retrieved 16 January 2016
  94. Hill, K., Selzer, W., Leaning, J., Malik, S., & Russell, S. (2008). The Demographic Impact of Partition in Punjab in 1947. Population Studies, 62(2), 155–170.
  95. Perspectives on Modern South Asia: A Reader in Culture, History, and ... – Kamala Visweswara. nGoogle Books.in (16 May 2011).
  96. Borders & boundaries: women in India's partition – Ritu Menon, Kamla Bhasi. nGoogle Books.in (24 April 1993).
  97. Jayawardena, Kumari; de Alwi, Malathi (1996). Embodied violence: Communalising women's sexuality in South Asia. Zed Books. ISBN 978-1-85649-448-9.
  98. Khalidi, Omar (Autumn 1998). "From Torrent to Trickle: Indian Muslim Migration to Pakistan, 1947–97". Islamic Studies. 37: 339–352. JSTOR 20837002.
  99. Khalidi, Omar (Autumn 1998). "From Torrent to Trickle: Indian Muslim Migration to Pakistan, 1947–97". Islamic Studies. 37: 339–352. JSTOR 20837002.
  100. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2016-01-27. Retrieved 2020-04-17.
  101. 101.0 101.1 Khalidi, Omar (Autumn 1998). "From Torrent to Trickle: Indian Muslim Migration to Pakistan, 1947–97". Islamic Studies. 37: 339–352. JSTOR 20837002.
  102. 102.0 102.1 Hasan, Arif; Mansoor, Raza (2009). Migration and Small Towns in Pakistan; Volume 15 of Rural-urban interactions and livelihood strategies are working paper. IIED. p. 16. ISBN 978-1-84369-734-3.
  103. 103.0 103.1 Hasan, Arif (30 December 1987). "Comprehensive assessment of drought and famine in Sind arid ones leading to a realistic short and long-term emergency intervention plan" (PDF). p. 25. Retrieved 12 January 2016.
  104. 104.0 104.1 Hill et al., page 13
  105. Khalidi, Omar (Autumn 1998). "From Torrent to Trickle: Indian Muslim Migration to Pakistan, 1947–97". Islamic Studies. 37: 339–352. JSTOR 20837002.
  106. Ben Whitaker, The Biharis in Bangladesh, Minority Rights Group, London, 1971, p. 7.
  107. Chatterji – Spoils of partition. p. 166
  108. 108.0 108.1 108.2 108.3 Rizvi, Uzair Hasan (10 September 2015). "Hindu refugees from Pakistan encounter suspicion and indifference in India". Dawn.
  109. Haider, Irfan (13 May 2014). "5,000 Hindus migrating to India every year, NA told". Dawn. Retrieved 15 January 2016.
  110. P. N. Luthra – Rehabilitation, pp. 18–19
  111. Aditi Kapoor, A home ... far from home?, The Hindu, 30 July 2000. During the Bangladesh liberation war, 11 million people from both communities took shelter in India. After the war, 1.5 million decided to stay.