యాజ్ఞవల్క్య మహర్షి

వికీపీడియా నుండి
(యాజ్ఞవల్క మహర్షి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

గురు ప్రార్థన || ఓం వందేఽహం మంగళాత్మానం భాస్వంతంవేదవిగ్రహమ్ | యజ్ఞవల్క్యం మునిశ్రేష్ఠం జిష్ణుం హరిహర ప్రభుమ్ || జితేంద్రియం జితక్రోధం సదాధ్యానపరాయణమ్ | ఆనందనిలయం వందే యోగానంద మునీశ్వరమ్ || ఏవం ద్వాదశ నామాని త్రిసంధ్యా యః పఠేన్నరః | యోగీశ్వర ప్రసాదేన విద్యావాన్ ధనవాన్ భవేత్ || ఓం శ్రీ యాజ్ఞవల్క్య గురుభ్యో నమః | కణ్వకాత్యాయనాది మహర్షిభ్యో నమః ||

జనకునికి బ్రహ్మోపదేశం చేస్తున్న యజ్ఞవల్కుడు అది కురు పాంచాల దేశము. అందు గంగ ప్రవహించెడిది. ఆ నదీ తీరమున చమత్కార పురమను నగరం ఉంది. ఆ నగరంన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. యజ్ఞవల్కుడను సార్థక నామధేయుడు. అతని భార్య సునంద. ఆ దంపతులకు ధనుర్లగ్నమున ఒక కుమారుడు జన్మించాడు. అతడే యాజ్ఞవల్క్యుడు. తన కుమారునకు అయిదవ ఏట అక్షరాభ్యాసమూ, ఎనిమిదవ ఏట ఉపనయనము చేశాడు. ప్రాతఃస్మరణీయులైన ఋషిపరంపరలో యాజ్ఞవల్క్య మహర్షి ఒకరు. ఇతను భాష్కలుని వద్ద ఋగ్వేదము, జైమిని వద్ద సామవేదము అరుణి దగ్గర అధర్వణవేదమును అభ్యసించాడు. వైశంపాయనుని వద్ద యజుర్వేదాధ్యయనము కూడా చేసాక విద్యాహంకారము కలిగి గురుశాపానికి గురై తాను నేర్చుకున్న వేదజ్ఞానమంతా రుధిర రూపములో గక్కి శాపాన్ని బాపుకున్నారు. అతను గక్కిన పదార్థాన్ని తిత్తిరిపక్షులు తిని, అవి తిరిగి పలుకగా ఉపనిషత్తులయ్యాయి. అవే తైత్తిరీయోపనిషత్తులుగా ప్రసిద్ధికెక్కాయి. ఆతరువాత యాజ్ఞవల్క్యుడు సూర్యభగవానుని ఆరాధించి, శుక్ల యజుర్వేదాన్ని నేర్చుకొని గురువుకన్నా గొప్పవాడయ్యాడు. సరస్వతీదేవిని ఉపాసించి సమస్త విద్యలు సాధించాడు. తరువాత కాత్యాయిని అనే ఆమెను వివాహము చేసుకున్నాదు. గార్గి శిష్యురాలైన మైత్రేయి యాజ్ఞవల్కుని తప్ప మరొకర్ని వివాహము చేసుకోనని శపథముచేసి, కాత్యాయిని స్నేహము సంపాదించి ఆమె సమ్మతితో యాజ్ఞవల్క్యుని రెండవ భార్య అయినది.

యాజ్ఞవల్క్య స్తుతి

సంయమితిలక ! నీ సరసవాక్యంబులు

పరికంప వేదాంత భాషణములు

పరమ బుషీంద్ర ! నీ కరుణాకటాక్షంబు

లఖిలంబులకు జీవననౌషధములు

ధరణీ సురేంద్ర! నయురు తర క్రోధముల్‌

దావపాపక శిఖాధారణములు

సజ్జన శ్రేష్ఠ నీ సభ్య నైషికములు

సకల పురాణాను సమ్మతములు

దినము నీ వొసంగు దీవన్యనృపతుల

భూరిసంపదలకు గారణములు

నిన్ను సన్నుతింప నేనెట్లు నేర్తును

యాజ్ఞవల్క్య! మునికులాగ్రగణ్య !.

యాజ్ఞవల్క్యుడు బాష్కలుని వద్ద బుగ్వేదము, జైమిని వద్ద సామవేదము, అరుణి వద్ద ఆధర్వణ వేదము అభ్యసించాడు. కుమారుడు అనతికాలముననే మూడు వేదములు అభ్యసించి జ్ఞానియైనందుకు తండ్రి సంతోషించాడు. అతనంతరం తన కుమారుని వైశంపాయనుని వద్దకు పంపాడు. యాజ్ఞవల్క్యుడు వైశంపాయుని శిష్యుడై యజుర్వేదాధ్యయనం చేయసాగాడు. అతను వద్ద మరెన్నో విషయములు తెలుసుకొనసాగాడు. అహంకారము, విద్యామదము అంకురించాయి. ఆ సంగతి గురువు గ్రహించాడు. క్రమముగా నశించునని వైశంపాయనుడు ఊరుకున్నాడు. యాజ్ఞవల్క్యునకు విద్యామదము నశించడం లేదు సరికదా పెరుగుతోంది. ఒకనాడు వైశంపాయనుడు తన మేనల్లుడు అవినీతుడై సంచరించుచున్నాడని కోపముతో ఒక తన్ను తన్నాడు. బ్రాహ్మణుని కాలితో దన్నిన అది బ్రహ్మహత్యతో సమానము. ఈ పాపము నుండి దూరమగుట ఎట్లా యని శిష్యులందరకు చెప్పగా విద్యా గర్వితుడైన యాజ్ఞవల్క్యుడు గురువర్యా ఇది ఎవరివల్లా నశించదు. నేనొక్కడనే ఆపగలవాడను అని గర్వంగా పలికాడు. వైశంపాయనుడు శిష్యుని అహంకారమునకు మండిపడీ యాజ్ఞవల్క్యా నా వద్ద అభ్యసించిన వేదశక్తితో నన్నే కించపరచదలచావా నే నేర్పినది నా వద్ద క్రక్కి వెంటనే ఆశ్రమము విడిచిపో. గురుద్రోహి ' అని కఠినంగా పలికాడు. యాజ్ఞవల్క్యుడు గురువు పాదములపై బడి శోకించాడు. కరుణించమని వేడుకున్నాడు. తన తపోబలంతో బ్రహ్మహత్యాదోషము బాపి తాను నేర్చుకున్న వేదములను రుధిరరూపమున గ్రక్కి వెళ్ళిపోయాడు. ఈ గ్రక్కిన పదార్ధమును దిత్తిరి పక్షులుతిన్నవి. అవి తిరిగి ఉపనిషత్తులయ్యాయి. అవే తైత్తిరీయోపనిషత్తులుగా ప్రసిద్ధికెక్కాయి. అనంతరం యాజ్ఞవల్క్యుడు సూర్యభగవానుని ఆరాధించి అతను కరుణకు పాత్రుడై శుక్ల యజుర్వేదమును గ్రహించి గురువు కన్న అధికుడయ్యాడు. ఆ తరువాత సరస్వతిని ఉపాసించి సమస్త విద్యలు సంపాదించాడు. ఆ విధంగా అతడు అమానుష విద్యానిధియైనాడు.

ఇతను ప్రథమ శిష్యుడు కణ్వుడు. వీరే ప్రథమ శాఖీయులు, గాణ్వశాఖీయులు. జనకుడు యాగము చేయుచూ మహర్షులందరిని ఆహ్వానించాడు. యాజ్ఞవల్క్యునకు కూడా వర్తమానం పంపాడు. వచ్చిన ఆ మహర్షిని ఉచితాసనం పై కూర్చుండబెట్టాడు. యాగము పరిసమాప్తి కాగానే అక్కడున్నవారిని ఉద్దేశించి. 'మహానుభావులారా మీలో ఎవరు గొప్పవారో వారు ముందుకు వచ్చి ఈ ధనరాసులు స్వీకరించవచ్చు ' అని గంభీరంగా పలికాడు. ఎవరూ సాహసించలేదు. ఎవరికి వారే సంశయంలో ఉండిపోయారు. అంత యాజ్ఞవల్క్యుడు తన శిష్యులతో ఆ ధనరాసులను గృహమునకు పట్టుకువెళ్ళమని ఆజ్ఞాపించాడు. విన్న విప్రకూటమి అతనితో వాదించి ఓడిపోయారు. శాకల్యుడను ముని కూడా వాదించి ఓటమి అంగీకరించాడు. జనకుడు యాజ్ఞవల్క్యుని అందరికన్నా మిన్నగా భావించి పూజించాడు. యాజ్ఞవల్క్యుడు జనకునకు అనేక ఆధ్యాత్మిక విషయాలు వివరించి చెప్పాడు. ఒకనాడు విశ్వావసుడను గందర్వుడు యాజ్ఞవల్క్యుని కడకు అరుదెంచి తత్త్వముపదేశించమని అర్థింపగా యాజ్ఞవల్క్యుడు ఆ గంధర్వునకు అనేక విషయాలు తెలియజేశాడు. అంత వివ్వావసుడు ఆనందించి ఆ మహర్షికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి వెళ్ళిపోయాడు.

ఈ కాలంలో కతుడను ఒక బుషి ఉండేవాడు అతనుకు కాత్యాయని యన కూతురుండేది. ఆమెను యాజ్ఞవల్క్యునకిచ్చి వివాహం చేయ నిశ్చయించి కతడు ఈ విషయమును యాజ్ఞవల్క్యునకు తెలియజేశాడు. యాజ్ఞవల్క్యుడు సమ్మతించగా అతి వైభవంగా వివాహం జరిగింది. మిత్రుడను బ్రాహ్మణుని కుమార్తె, గార్గి శిష్యురాలగు మైత్రేయి యాజ్ఞవల్క్యుని తప్ప అన్యులను వివాహమాడనని శపథం చేసింది. ఈ విషయం తండ్రికి తెలిసి గార్గికి చెప్పాడు. గార్గి ఆమెను కాత్యాయినికి అప్పగించింది. వారిద్దరు స్నేహంగా ఉంటున్నారు. ఒకర్ని విడిచి మరొకరు ఉండలేని స్థితికి వచ్చారు. ఆ పరిస్ధితి రాగానే గార్గి అసలు విషయం కాత్యాయినికి తెలిపింది. కాత్యాయిని సంతోషించి మగని వల్ల వరం పొంది మైత్రేయికి వివాహం జరిపించింది. భార్యలిద్దరితో యాజ్ఞవల్క్యుడు హాయిగా కాలం వెలిబుచ్చుతున్నాడు.

ఆ మహర్షి అనుగ్రహంతో కాత్యాయిని చంద్రకాంతుడు, మహామేషుడు, విజయుడు అను ముగ్గురు కుమారులను కన్నది. బుషులందరూ యాజ్ఞవల్క్యునకు మాఘశుద్ధ పూర్ణిమ నాడు యోగీంద్ర పట్టాభిషేకం చేశారు. అతను బుషులకు తెలియజేసిన విషయాలే యోగశ్రాస్తమని యోగ యాజ్ఞవల్క్య మనీ ప్రసిద్ధికెక్కాయి. యాజ్ఞవల్క్యుడు భార్యలకు తత్వమునుపదేశించి సన్యసించాడు. అతను పేర ఒక స్మతి ప్రచారంలో ఉంది. అందనేక విషయము ఉన్నాయి. కర్మ జ్ఞానముల వలన మోక్షము కలుగునని తెలియజేశాడు. యోగమును గురించి చెప్పిన విషయాలు యోగ యాజ్ఞవల్క్యుమను పేర ప్రచారంలో ఉన్నాయి. ఈ బుషి ప్రాతఃస్మరణీయుడు. అతను జయంతి రోజున అతను్ని ఆరాధిస్తే జ్ఞానసంపత్తి కలుగుతుంది.

యాజ్ఞవల్క్యుడు ప్రాచీన వేద భారతావనిలో ప్రముఖుడు. ఉపనిషత్తుల్లో ముఖ్యంగా కనిపించే యాజ్ఞవల్క్యుడు శతపథ బ్రాహ్మణం (బృహదారణ్యకోపనిషత్తు సహా), యాజ్ఞవల్క్య సంహిత, యాజ్ఞవల్క్య స్మృతి రచించాడు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో యాజ్ఞవల్క్య మహర్షి వారి ఆలయములు పిఠాపురము తిరుమల శ్రీవారి ఆలయంలో, విశాఖ సాగర తీరమున పెందుర్తి శ్రీసూర్య యాజ్ఞవల్క్య గుడి, గుంటూరులో పండరీపురం దేవాలయంలో ఆంధ్రయాజ్ఞవల్క్య మహర్షి, తూరంగి కాకినాడ, కుంచనపల్లి తాడేపల్లిగూడెం, పుణ్య గిరి s. కోట, రాజమండ్రి, నిడదవొలులో, వారి భక్తులు కూడా ఉన్నారు.