శివాజీ గణేశన్
| శివాజీ గణేశన్ | |
![]() Sivaji Ganesan in the film Thayaipola Pillai Noolaipola Selai in 1959 | |
| జన్మ నామం | చిన్నయ్య పిళ్ళై గణేశన్ |
| జననం | 1928 అక్టోబరు 1 విళ్ళుపురం, భారతదేశం |
| మరణం | 2001 July 21 (వయసు: 73) చెన్నై, భారతదేశం |
| ఇతర పేర్లు | నడిగర్ తిలకం |
| క్రియాశీలక సంవత్సరాలు | 1952-1999 |
| భార్య/భర్త | కమల |
'నడిగర్ తిలకం' శివాజీ గణేశన్ (Sivaji Ganesan) సుప్రసిద్ధ దక్షిణ భారత సినిమా నటుడు.
ఇతడు అక్టోబర్ 1, 1928 సంవత్సరంలో దక్షిణ ఆర్కాట్ జిల్లా విళ్ళుపురంలో స్వాతంత్ర్య సమరయోధులు చిన్నయ్య మండ్రాయర్, రాజామణి అమ్మయార్ దంపతులకు జన్మించారు. ఇతడు జన్మించిన సమయంలోనే మహాత్మాగాంధీ పిలుపుతో తెల్లదొరలపై సమరం జరిపిన నేరానికి చిన్నయ్యకు ఏడాది కఠిన కారాగార శిక్ష విధించారు.
చిన్నతనంలోనే గణేశన్ కు 'కట్ట బ్రహ్మన్న' వీధి నాటకం జీవిత గమనాన్ని నిర్దేశించింది. బ్రిటిష్ వారి నిషేధానికి భయపడి ఆ నాటకాన్ని 'కంబళత్తాన్ కూత్తు' అనే పేరుతో ప్రదర్శించేవారు. శివాజీ బడి ఎగ్గొట్టి ఎక్కడ ఆ నాటకం వేస్తే అక్కడకు వెళ్ళి చూసేవాడు. ఆ నాటకంలోని డైలాగులను కంఠస్థం చేశాడు. దానిమూలంగా ఉత్తేజం పొందిన తాను కూడా నటుడిగా ఉన్నత శిఖరాలు చేరాలని లక్ష్యం అయింది. నాటకాల మీద ఆసక్తిని గమణించిన తల్లి రాజామణి 10 సంవత్సరాల శివాజీని 'శ్రీ బాలగానసభ' అనే నాటకాల కంపెనీలో చేర్చింది. బాలగానసభ నిర్వాహకులు పొన్నుసామి పిళ్ళై తన తొలి గురువు అని శివాజీ గర్వంగా చెప్పుకునేవారు. అయితే కొంతకాలం చిన్నచిన్న వేషాలు వేసేవాడు. అయితే శివాజీకి హీరో కన్న హీరోయిన్ వేషం రామాయణంలో సీత రూపంలో వచ్చింది. ఆడవేషమైనా అందమైన హావభావాలతో నాటకంలోని సీత పాత్రను అవలీలగా పోషించి ప్రేక్షకుల మెప్పుపొందారు.
శివాజీ నేషనల్ పిక్చర్స్ వారి 'పరాశక్తి' ద్వారా చిత్రరంగ ప్రవేశం చేశారు. చిత్రనిర్మాణం సమయంలో ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొని చివరికి ద్రావిడ మున్నేట్ర కజగం వ్యవస్థాపకులు, మాజీ తమిళనాడు ముఖ్యమంత్రి కీ.శే.అణ్ణాదురై అండతో సినిమా పూర్తిచేసి మహానటుడిగా ఎదిగాడు. శివాజీ ఎక్కువగా కథాబలం ఉన్న చిత్రాల్లో మహానటుల మధ్య నటించి నటనలో వారితో పోటీపడేవారు. తనకంటూ ఒక ప్రత్యేకత కోసం తపించేవారు. అవార్డుల కంటే ప్రజల గుర్తింపే నటుడికి ముఖ్యమైనదని ఎప్పుడూ చెప్తుండేవారు.
చలనచిత్రరంగంలో మూడువందలకు పైగా చిత్రాలలో నటించిన శివాజీ గణేశన్ తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తూ వస్తున్నారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంగా ఉన్నప్పుడు శివాజీ నటించిన చిత్రాలు ఆంధ్రాలో కూడా విడుదలయ్యేవి. తెలుగులో పరదేశి, పెంపుడు కొడుకు, మనోహర, పరాశక్తి, బొమ్మలపెళ్ళి, పిల్లలు తెచ్చిన చల్లని రాజ్యం, సంపూర్ణ రామాయణం, రామదాసు, భక్త తుకారాం, జీవన తీరాలు, చాణక్య చంద్రగుప్త, నివురుగప్పిన నిప్పు, విశ్వనాథ నాయకుడు చిత్రాలలో వైవిధ్యమైన పాత్రలను పోషించారు. తెలుగులో శివాజీ నటనకు కళావాచస్పతి జగ్గయ్య కంఠం సంపూర్ణత్వాన్ని కలిగించేది.
తమిళంలో బి.ఆర్.పంతులు తీసిన 'కర్ణన్' చిత్రంలో శివాజీ కర్ణుడి పాత్రలో, ఎన్టీఆర్ శ్రీకృష్ణుడిగా నటించారు. ఆచిత్రంలో శివాజీ నటనను చూసి ఎన్టీఆర్ ఆశ్చర్యపోయారు. తర్వాత కాలంలో ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో రామకృష్ణా సినీ స్టుడియోస్ బ్యానర్ పై నిర్మించిన చాణక్య చంద్రగుప్త చిత్రంలో శివాజీని అలెగ్జాండర్ గా నటింపజేశారు. ప్రముఖ నిర్మాత డి.రామానాయుడు ప్రేమ్ నగర్ చిత్రాన్ని తమిళంలో శివాజీని హీరోగా పెట్టి 'వసంత మాళిగై' పేరుతో రీమేక్ చేసి తమిళ చిత్రరంగంలో సంచలనం సృష్టించారు. దాసరి నారాయణరావు కూడా శివాజీ నటన అంటే చెప్పలేని అభిమానం మూలంగా విశ్వనాథ నాయకుడు చారిత్రాత్మక చిత్రంలో అతనిని నటింపజేశారు.
భారత చిత్రరంగంలో ఎంతో ఎదిగినా ఒదిగివుండే వినమ్రత శివాజీ గణేశన్ లో కనిపిస్తుంది. పాతతరం నటుల నుండి ఈతరం కథానాయకుల వరకు అందరూ శివాజీతో నటించినవారే, ఈతని నీడలో సేదతీరినవారే.
చిత్ర సమాహారం
[మార్చు]మూలాలు
[మార్చు]యితర లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో శివాజీ గణేశన్ పేజీ
- http://www.goldentamilcinema.net/index.php/sivaji Archived 2013-09-27 at the Wayback Machine
