వికీపీడియా:ఈ వారం వ్యాసాలు (2014)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

2014 సంవత్సరంలో "ఈ వారం వ్యాసం" శీర్షికలో ప్రదర్శించిన వ్యాసాలు

ప్రస్తుత ప్రతిపాదనలు, జాబితా కోసం వికీపీడియా:ఈ వారపు వ్యాసం జాబితా చూడండి.


1వ వారం

వాము

వాము ఒక విధమైన వంటలలో ఉపయోగించే గింజలు. వాము లేదా ఓమను సంస్కృతం లో దీప్యక అని, హిందీలో అజ వాన్‌ అని అంటారు. వాము మొక్క మొత్తం సువాసన కలిగి ఉంటుంది. పువ్వులు గుత్తులు గుత్తులుగా ఉంటాయి. ఈ పువ్వులనుంచే విత్తులు వస్తాయి. వాము శరీరంలో వాతాన్ని హరింపజే స్తుంది. శూలలను తగ్గిస్తుంది. జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. కడుపు ఉబ్బరం, ప్లీహవృద్ధిని తగ్గిస్తుంది. వాంతులను తగ్గిస్తుంది. గుండెకు కూడా అత్యంత ఉపయోగకారి. వాము భారతదేశ వాసులకు తెలిసిన గొప్ప ఓషధి. దీనిని భారతదేశమంతటా పండిస్తారు. ఎక్కువగా మన రాష్ట్రంతో సహా మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో సాగుచేస్తారు. చలి వాతావరణంలో బాగా పెరుగుతుంది. ఇది తెల్లని పూలు కలిగిన చిన్న ఏక వార్షికపు మొక్క. దీని గింజల నుంచి సుగంధ తైలాన్ని డిస్టిలేషన్ విధానం ద్వారా వేరుపరిచి థైమాల్‌గా మార్కెట్ చేస్తుంటారు. వాము సాధారణంగా అన్ని ఇళ్లల్లో కనిపించేదే. వంటింట్లో ఇదో దినుసు. ఈరోజు అరిగినట్లు లేదే అనగానే, 'కాసింత వాము వేణ్ణీళ్లతో కలిపి నమలవే. సమస్య తీరిపోతుంది' అనే అమ్మమ్మల మాటలు గుర్తుండే ఉంటాయి. సాధారణంగా మనం వామును చక్రాలు(జంతికలు, మురుకులు) చేసినపుడు వాడుతుంటాం. పూర్వంనుండి వాడుతున్నారని వాడటమే తప్ప ఇందులోని సుగుణాలు చాలామందికి తెలియవు. వాము జీర్ణశక్తికి మంచిదని మాత్రం చాలామందికి తెలుసు. వాము జీలకర్రలా అనిపించినా చిన్నగా ఉంటుంది. రుచి కొంచెం ఘాటుగా, కారంగా ఉంటుంది. రూపంలో చిన్నదైనా చేసే మేలులో పెద్ద స్థానాన్నే ఆక్రమించింది. వామును నీళ్లలో నానబెట్టి ఆ నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి తాగితే వాంతులు తగ్గుతాయి.


(ఇంకా…)

2వ వారం

స్టెతస్కోప్

స్టెతస్కోప్ (ఆంగ్లం: Stethoscope) అనగా గుండె, ఊపిరితిత్తులు, ఉదరం లాంటి అవయవాల చప్పుడు విని పరీక్షించడానికి వాడే ఒక వైద్య పరికరం. దానిని రెని థియోఫిల్ హయసింత్ లెనెక్ (Rene Theophile Hyacinthe Laennec) అనే ఫ్రెంచ్ వైద్యుడు 1819లో కనుగొన్నాడు. 1781 నుండి 1826 వరకు జీవించిన లెనెక్ ప్రతిభాశాలియైన కల్పనాచరుతుడే కాక అనుభవశాలియైన వైద్యుడు కూడా. 1816లో అతను ఒక యువతిని పరీక్షించసాగాడు. ఆ రోజుల్లో వైద్యుడు రోగి గుండెను, ఊపిరితిత్తుల్ని పరీక్షించేటప్పుడు తన చెవుల్ని రోగి గుండెకు ఆనించి వినేవాడు. కాని లెనెక్ ఆ యువతిని పరీక్షించడానికి మొహమాటపడ్డాడు. గట్టి వస్తువుల ద్వారా చప్పుడు పయనిస్తుందని అతనికి తెలుసు. కాబట్టి అతను 24 కాగితాల్ని చుట్టగా చుట్టి వాటి ఒక కొనను తన చెవికీ, యింకొక కొనను ఆ యువతి గుండెకు ఆనించి వినగా మామూలు పద్ధతిలో కంటే చాలా స్పష్టంగా చప్పుడు వినపడి అతను సంతోషించాడు. ఆ ఏడాదే లెనెక్ పారిస్‌లోని నెకెర్ ఆస్పత్రిలో ఉద్యోగాన్ని స్వీకరించాడు. తరువాతి కొన్నె నెలలపాటు అతను నవీన స్టెతస్కోప్‌కు పూర్వపు మోటురకాలతో ప్రయోగాలు చేశాడు. చివరకు అతను వాడిన స్టెతస్కోప్ యొక్క సమాచారాన్నీ, నిరూపణన్నీ ప్రమాణ పత్రాల ద్వారా ఆధారంగా చేసుకొని ఒక రాత ప్రతిని 1817 మార్చి 8న తయారుచేశాడు. అంగశ్రవణానికి సంబంధించి నమోదైన మొట్టమొదటి రాతప్రతి యిదే. లెనెక్ తన పరికరానికి "లె సినిండర్" అని పేరుపెట్టాడు. తరువాత స్నేహితులు, సహచరులు అతనికి నచ్చచెప్పాక దానికి "స్టెతస్కోప్" అని పేరును మార్చాడు. గ్రీకు భాషలో స్టెతస్కోప్ కు "నేను గుండెను చూస్తున్నాను" అని అర్ధము. లెనెక్ ఆ స్టెతస్కోప్‌ను వెంటనే వాడుకలో ప్రవేశపెట్టాడు.


(ఇంకా…)

3వ వారం

సహజ వాయువు

సహజ వాయువు వాయు స్థితిలో ఉండే ఒక శిలాజ ఇంధనం పేరు. ఇది ఎక్కువగా మీథేన్ వాయువును కలిగి ఉంటుంది. కానీ తక్కువ పరిమాణంలో ఈథేన్, ప్రోపేన్, బ్యూటేన్ పెంటేన్ మొదలైన ఇతర వాయువులు కూడా ఉంటాయి. భార హైడ్రో కార్బన్ లనూ, కార్బన్ డయాక్సైడ్, నైట్రోజెన్, హీలియం, హైడ్రోజన్ సల్ఫైడ్ మొదలైన వాటిని ప్రజావసరాలకు వాడే ముందే తొలగిస్తారు.ఈ సహజ వాయువులు నూనె క్షేత్రాలలో గాని లేదా వేరుగా వాయు క్షేత్రాలలో మరియు బొగ్గు గనుల లోతు ప్రాంతాలలో కనిపిస్తాయి. ఇదే వాయువు జీవవ్యర్థాల నుంచి తయారైతే దానిని బయోగ్యాస్ అని అంటారు. ఇది మామూలుగా డ్రైనేజీ వ్యర్థాలు, పశువుల పేడ మొదలైనవాటి నుండి తయారవుతుంది. ఇతర ఇంధన వనరులైన విధ్యుచ్చక్తి మొదలైన వాటితో పోల్చి చెప్పేటపుడు దీన్ని సాధారణంగా గ్యాస్ అని అని పిలుస్తారు. దీన్ని ఇంధనం గా ఉపయోగించడానికి ముందు సుధీర్ఘమైన శుద్ధి ప్రక్రియ ద్వారా మీథేన్ తప్ప మిగతా పథార్థాలన్నింటినీ తొలగిస్తారు. ఈ శుద్ధి ద్వారా వచ్చే ఉప ఉత్పత్తులు ఈథేన్, బ్యూటేన్, పెంటేన్, హైడ్రో కార్బన్ లు, సల్ఫర్, హీలియం, నత్రజని మొదలైనవి. సహజ వాయువు పరిమాణాన్ని ఘనపు మీటర్లలో కొలుస్తారు. సాధారణంగా ఒక ఘనపు మీటర్ సహజ వాయువు "స్థూల జ్వలన తాపం" షుమారు 39 మెగా జౌల్‌లు (అనగా 10.8 కిలోవాట్ గంటలు-KWH) ఉంటుంది. ఒక ఘనపు అడుగు సహజవాయువులో ఇది 1,028 బ్రిటిష్ థర్మల్ యూనిట్లు అవుతుంది. వాయువు నాణ్యతను బట్టి, అందులో ఉండే నీటి శాతం బట్టీ ఈ విలువ మారుతూ ఉంటుంది.దీని ధర లభించే ప్రదేశాన్ని బట్టి మరియు వినియోగదారుని అవుసరాల మీద ఆధారపడి ఉంటుంది.


(ఇంకా…)

4వ వారం

షిర్డీ సాయిబాబా

షిర్డీ సాయిబాబా (?? - అక్టోబర్ 15, 1918) భారతీయ గురువు మరియు సాధువు, ఫకీరు. ఇతని అసలు పేరు, జన్మ స్థలం తెలియదు. సాయిబాబాను అనేకులు ముస్లింలు, హిందువులూ సాధువుగా నమ్ముతారు. ఇతని జీవిత నడవడిలో, భోధనలలో రెండు మతాలను అవలంభించి, సహయోగము కుదర్చడానికి ప్రయత్నించాడు. సాయిబాబా మసీదులో నివసించాడు, గుడిలో సమాధి అయ్యాడు. రెండు మతాల పద్ధతులను తన బోధనలో అవలంభించాడు. ఈయన రెండు సాంప్రదాయాల యొక్క పదాలను, చిత్రాలను ఉపయోగించాడు. ఈయన యొక్క వ్యాఖ్యలలో ముఖ్యమైన ఒక వాక్యము అల్లా మాలిక్, సబ్ కా మాలిక్ ఎక్ (सबका मालिक एक) (అందరి ప్రభువు ఒక్కడే). పెక్కుమంది భక్తులు (ప్రధానంగా హిందూ సంప్రదాయానికి చెందినవారు) సాయిబాబాను శివుని, దత్తాత్రేయుని అవతారం అయిన సద్గురువుగా భావిస్తారు.యిబాబా బోధనలో ప్రేమ, కరుణ, దానం, సంతృప్తి, శాంతి, దైవారాధన, గురుపూజ ముఖ్యమైనవి. అద్వైతం, భక్తి మార్గం, ఇస్లాం సంప్రదాయాలు అతని బోధనలలోనూ, జీవనంలోనూ మిళితమై ఉన్నాయి. ఎంతో మంది, ప్రధానంగా మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలనుండి సాయిబాబాను దైవ స్వరూపునిగా నమ్మి ఆరాధిస్తున్నారు.అతను హిందువా, ముస్లిమా, దేవుడా, గురువా, సామాన్యుడా అన్ని విషయాల గురించి పలు వాదాలున్నాయి. సాయిబాబా పుట్టుపూర్వోత్తరాల గురించి తెలియడంలేదు. ఈ విషయమై జరిగిన కొన్ని అధ్యయనాల వల్ల బాబా షిరిడీ చుట్టుప్రక్కలే జన్మించి ఉండవచ్చుననీ, అతని బాల్య నామం హరిభావు భుసారి కావచ్చుననీ కొన్ని అభిప్రాయాలున్నాయి. తన జన్మ, బాల్యాల గురించి బాబా ఎప్పుడూ స్పష్టంగా చెప్పలేదు. అవి అనవుసరమని అనేవాడు. ఎందుకంటే ఎక్కడ పుట్టాడో మరియు పేరు ఏమిటో తెలిస్తే ప్రతి మనిషి ముందు వారి కుల గోత్రాలు చూస్తారు మరియు వారిది ఈ మతం అని మనసులో నాటేసుకొంటారు, బహుశా బాబా గారు అందుకే వారి పేరు మరియు పుట్టిన ప్రదేశం ప్రస్తావన చేయలేదు.


(ఇంకా…)

5వ వారం

కొలనుపాక

కొలనుపాక గ్రామము భువనగిరి డివిజన్ లో మేజరు గ్రామ పంచాయితి. వరంగల్ - హైదరాబాదు మార్గంలో హైదరాబాదుకు 65 కి.మీ, ఆలేరు కు సుమారు 6 కి.మీ. దూరంలో ఉంది. ఈ గ్రామములో సుమారుగా తొమ్మిది వేల ఆరు వందల మంది జనాభా కలదు. అందులో సుమారుగా ఆరు వేల ఓటర్లు ఉన్నారు.ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అయిన హైదరాబాదు నుండి బస్ మరియు రైలుబండి సదుపాయాలు కలవు. హైదరాబాదు మహత్మ గాంధి బస్ స్టాప్ నుండి వరంగల్ లేద హన్మకొండ వెల్లే బస్ ఎక్కి ఆలేర్లో దిగాలి. ఉప్పల్ రింగ్ రోడ్డ్ నుండి మరియు కూకట్ పల్లీ నుండి నేరుగా కొలనుపాక కు సిటీ బస్సుల సదుపాయము కలదు, అలాగే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి వరంగల్ వెల్లే ట్రేయిన్ ఎక్కి ఆలేర్లో దిగాలి. అక్కడ నుండి బస్ లో కాని అటోలో కాని 6 కి.మి ప్రయాణిస్తె కొలనుపాక గ్రామము చేరుకుంటారు.ఈ గ్రామం పేరు అనేక రూపాంతరాలు చెందింది.పూర్వము " కాశి కొలనుపాక బింభావతి పట్టణం " గా పిలువబడేను, మైసూరు వద్ద లభించిన ఒక శాసనంలో దీని పేరు కొల్లిపాకై. అలాగే సోమేశ్వరస్వామి ఆలయం దగ్గర వాగులో ఇసుక మేటలో దొరకిన గంటపై స్వస్తి శ్రీమతు కందప్పనాయకరు, కొల్లిపాకేయ సకలేశ్వర సోమేశ్వర దేవరిగె కొట్టి పూజ అని ఉంది. కాకతీయ రుద్రదేవుని కాలంనాటి శాసనంలో కూడా కొల్లిపాక అని ప్రస్తావించబడింది. విజయనగర రాజుల కాలంనాటికి కొల్‌పాక్'‌'గా మారింది. ప్రస్తుతం కూల్‌పాక్ లేదా కొలనుపాక అని పిలువబడుతున్నది.


(ఇంకా…)

6వ వారం

తైల చిత్రలేఖనం

తైలవర్ణ చిత్రలేఖనం (ఆయిల్ పెయింటింగ్) అనేది ఆరిపోయే తైల మాధ్యమానికి నిబద్ధమై ఉండే వర్ణద్రవ్యాలను ఉపయోగించే ఒక చిత్రలేఖన ప్రక్రియ - ప్రారంభ ఆధునిక ఐరోపాలో ఈ చిత్రలేఖన పద్ధతిలో సీమఅవిసె నూనె (లిన్సీడ్ ఆయిల్)ను ఎక్కువగా ఉపయోగించేవారు. తరచుగా సీమఅవిసె నూనె వంటి చమురును దేవదారు సర్జరసం (రెసిన్) లేదా ఫ్రాంకిన్‌సెన్స్ (వివిధ అరేబియా లేదా తూర్పు ఆఫ్రికా ప్రాంత చెట్ల నుంచి తయారు చేసే ఒక సుగంధభరితమైన జిగురు రెసిన్) వంటి ఒక రెసిన్‌తో వేడిచేస్తారు; వీటిని 'వార్నిషులు' అని పిలుస్తారు, ఇవి వాటి ఆకృతిని నిలిపివుంచే గుణం మరియు తళుకు వంటి లక్షణాలకు కీర్తించబడుతున్నాయి. గసగసాల నూనె (పాపీసీడ్ ఆయిల్), అక్రోటుకాయ నూనె (వాల్‌నట్ ఆయిల్) మరియు కుసుంభ నూనె (సాఫ్లవర్ ఆయిల్) వంటి ఇతర తైలాలను కూడా అప్పుడప్పుడు ఉపయోగిస్తుంటారు. తైల వర్ణచిత్రానికి ఈ తైలాలు తక్కువగా పసుపు రంగులోకి మారడం లేదా వివిధ ఆరిపోయే సమయాలు వంటి వివిధ గుణాలను అందిస్తాయి. తైలం ఆధారంగా వర్ణచిత్రాల జిలుగులో కొన్ని వ్యత్యాసాలు కూడా కనిపిస్తాయి. చిత్రకారులు తరచుగా ఒకే వర్ణచిత్రంలో ప్రత్యేక వర్ణద్రవ్యాలు మరియు వాంఛిత ప్రభావాలు ఆధారంగా వివిధ తైలాలను ఉపయోగిస్తారు. మాధ్యమం ఆధారంగా వర్ణచిత్రాలు వాటంతటవే ఒక నిర్దిష్ట అనుగుణతను అభివృద్ధి చేస్తాయి. ఐదు మరియు తొమ్మిదో శతాబ్దం మధ్యకాలంలో పశ్చిమ ఆఫ్ఘనిస్థాన్‌లో మొదటిసారి తైల వర్ణద్రవ్యాన్ని ఉపయోగించినప్పటికీ, 15వ శతాబ్దం వరకు దీనికి ప్రాచుర్యం లభించలేదు.


(ఇంకా…)

7వ వారం

తెలుగు వికీపీడియా

2001 లో మొట్టమొదటగా ఆంగ్ల భాషలో వికీపీడియాను జిమ్మీ వేల్స్ మరియు లారీ సాంగెర్ ఆరంభించారు. దీని ముఖ్య ఊహ, స్వచ్ఛందంగా ఎవరికి వారు తమకు తెలిసిన సమాచారాన్ని ఒక చోట చేర్చగలగటం మరియు మార్చగలగటం. పలువురి ఆదరాభిమానాన్ని చూరగొని విజయవంతమై, ప్రజాదరణ పొందిన వెబ్సైటులలో 2011నాటికి 5 వ స్థానంలోకి వచ్చింది. ప్రపంచ నలుమూలల నుండి సమాచారం సేకరించడం భద్రపరచడం సాధ్యమైన కార్యమేనని రుజువు కావడంతో తరువాతి దశలలో ప్రపంచ భాషలన్నిటిలో ఆయా భాషాభిమానుల కృషితో వికీపీడియా అనే విజ్ఞాన సర్వస్వం అభివృద్ధి పధంలో నడవటం మొదలైంది. దానిలో ఒక భాగమే వెన్న నాగార్జున కృషితో 2003 డిసెంబర్ 10 న ఆవిర్భవించిన తెలుగు వికీపీడియా . దీనిలో చాలా మంది సభ్యులై అభివృద్ధి పథంలో నడిపించారు. తెలుగు వికీపీడియా మొదటిపేజీ వివిధ రకాల శీర్షికలతో అందరినీ ఆకట్టుకొనేటట్లుగా ఉంటుంది. దీనిలో భాగంగా చాలా మార్పులు చేర్పులు జరిగాయి. తెలుగు వికీపీడియాలో ఉన్న మంచి వ్యాసాలను వెలికితీసి, పదిమందికీ చూపించాలనే లక్ష్యంతో విశేష వ్యాసం అనే శీర్షికతో అప్పుడప్పుడు మొదటిపేజీలో మంచి వ్యాసాన్ని ప్రదర్శించేవారు. నవంబర్ 14 2005 న "గోదావరి" వ్యాసంతో విశేష వ్యాసాల పరంపర మొదలయింది. ఆ తరువాత "ఈ వారపు వ్యాసాల" గా మారింది. 2007 జూన్ లో(23 వారంలో) మొదటిగా "సుడోకు" వ్యాసం ఈ వారం వ్యాసంగా ప్రదర్శించబడింది. తెలుగు వీకీపీడియాకు శ్రీకారం చుట్టింది వెన్న నాగార్జున బోస్టన్ నగరంలో సమాచార సాంకేతిక నిపుణుడిగా పని చేస్తున్న వెన్న నాగార్జున రూపొందించిన పద్మ అనే లిప్యాంతరీకరణ పరికరం (ఇది ఇంగ్లీషు కీబోర్డ్ తో తెలుగు వ్రాసే తెలుగు భాషా అనువాద పరికరం) నెట్ లో తెలుగు సమాచార అభివృద్ధికి ఒక మైలురాయి. క్రమంగా తెలుగు భాషాభిమానులను ఇది విశేషంగా ఆకర్షించింది. పద్మ అనే లిప్యాంతరీకరణ పరికరం సృష్టితో వెలుగులోకి వచ్చిన నాగార్జునకి వికీ నిర్వాహకులలో ఒకరైన విలియంసన్ పంపిన విద్యుల్లేఖ (టపా) తెలుగు వీకీపీడియా ఆవిర్భావానికి నాంది పలికింది.


(ఇంకా…)

8వ వారం

గురజాడ అప్పారావు

గురజాడ అప్పారావు గురించి వినని వారు వుంటారేమో గానీ, కన్యాశుల్కం నాటకంలో ఆయన సృజించిన ఈ వాక్యాలు వినని తెలుగు వారు వుండరు. ఈనాటకంలో ఆయన సృష్టించిన గిరీశం, మధురవాణి, రామప్పంతులు మొదలైన పాత్రలు కూడా అంతే ప్రఖ్యాతి పొందాయి. గురజాడ అప్పారావు గారు (1862-1915) తెలుగు భాష మహా కవి, తన రచన ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించినవారు.గురజాడ అప్పారావు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారులలో ఒకడు. హేతువాది 19 వ శతాబ్దంలోను, 20 వ శతబ్ది మొదటి దశకంలోను ఆయన చేసిన రచనలు ఈనాటికీ ప్రజల మన్ననలను పొందుతున్నాయి. రాశిలో తక్కువైనా, ఆయనవి వాసికెక్కిన రచనలు. వ్యావహారిక భాషలో రచనలు చేయడం తప్పుగానూ, చేతకానితనం గాను భావించే ఆ రోజుల్లో ఆయన ప్రజలందరికీ అర్ధమయ్యే జీవ భాషలో రచనలు చేసాడు. వీరి "కన్యాశుల్కం" తెలుగు అన్నిటికన్నా గొప్ప నాటకం అని చెప్పవచ్చు. అభ్యుదయ కవితా పితామహుడు అని బిరుదు పొందిన వీరు, తెలుగు సాహిత్యంలో వాడుక భాష ఒరవడికి కృషి చేసిన వారిలోముఖ్యులు. వీరికి "కవి శేఖర" అనే బిరుదు కూడా కలదు. విశాఖ జిల్లా, ఎలమంచిలిలో, మేనమామ ఇంట్లో సెప్టెంబరు21, 1862 న, వెంకట రామదాసు మరియు కౌసల్యమ్మ దంపతులకు జన్మించారు. వీరికి శ్యామల రావు అనే తమ్ముడు ఉన్నారు.గురజాడ అప్పారావు కుటుంబం వారి తాతల కాలంలో కృష్ణా జిల్లా గురజాడ గ్రామం నుండి విశాఖ మండలానికి వలస వచ్చింది.


(ఇంకా…)

9వ వారం

బుడుగు

బుడుగు, ముళ్ళపూడి వెంకటరమణ వ్రాసిన ఒక హాస్య రచన. ముళ్ళపూడి వ్రాతలు మరియు బాపు బొమ్మలు ద్వారా హాస్యపూర్వకంగా బుడుగు అనే పిల్లవాని భాష, అల్లరి, ఆలోచనలు, ప్రవర్తన ఈ పుస్తకంలో చెప్పబడ్డాయి. తెలుగు సాహిత్యంలో ఈ తరహా పుస్తకాలలో ప్రసిద్ధమైంది ఇదొక్కటే అనవచ్చును. ముళ్ళపూడి రచనలు "ముళ్ళపూడి సాహితీ సర్వస్వం" అనే సంపుటాలుగా లభిస్తున్నాయి. అనువాద రమణీయం, సినీరమణీయం, బాలరమణీయం, కదంబ రమణీయం ఇలా. ఇందులో 3వ సంపుటం "బాలరమణీయం" బుడుగు. ఇది ఎమ్బీఎస్ ప్రసాద్ సంపాదకత్వం (ముందుమాట)తో వెలువడింది. ఈ రచన ప్రశంస ఆరుద్ర కూనలమ్మ పదాలులో ఇలా ఉంది. ఆరుద్ర చెప్పినట్లుగా ముళ్ళపూడి వెంకటరమణ "బుడుగు వెంకటరమణ"గా అయ్యాడంటే ముళ్ళపూడి సృష్టించిన పాత్రలన్నింటిలోనూ బుడుగు ఎంత ప్రసిద్ధమయ్యాడో తెలుస్తుంది. నవంబరు 1956 నుండి ఏప్రిల్ 1957 వరకు ఆంధ్ర పత్రిక వార పత్రికలో సీరియల్‌గా వచ్చింది. అప్పుడు రచయిత అసలు తన పేరు వేసుకోలేదు. చివరికి అందరి బలవంతం వల్ల "ఇది వ్రాసి పెట్టినవాడు - ఫలానా, బొమ్మలు వేసిపెట్టినవాడు - ఫలానా" అని ఆఖరు సంచికలో వేశారు. అప్పుడు వీక్లీ సీరియల్‌కు పెట్టిన పేరు బుడుగు - చిచ్చర పిడుగు ఏప్రిల్ 24.1957 లో బుడుగు స్కూల్లో చేరడానికి, అల్లరి మానేయడానికి నిశ్చయించుకోవడంతో సీరియల్ ఆగిపోయింది. నాలుగేళ్ళ తరువాత "వురేయ్, మళ్ళీ నేనే" అని పాఠకులను అలరిస్తూ వచ్చాడు. ఇప్పటికి కాస్త తెలివి మీరాడు. అణ్వస్త్ర భయం గురించి, మేష్టర్ల జీతాల గురించి కూడా మాట్లాడాడు. బుడుగు పాత్ర సృష్టికి ప్రసిద్ధ ఆంగ్ల కార్టూను డెనిస్ - ది మెనేస్ స్ఫూర్తి అని అంటుంటారు. ఇది ఎంత నిజమో తెలియదు. కాని ముళ్ళపూడి వెంకట రమణను చిన్నప్పుడు "బుడుగు" అని పిలిచేవారట. డెనిస్, బుడుగు పాత్రలలోనూ, వారి పరిజనాలలోనూ సాపత్యం ఉన్నదనుకొన్నా బుడుగు పరివారం, ఆలోచనలు, భాష అన్నీ పక్కా తెలుగు వాతావరణమే. ఆలోచించి చూస్తే డెనిస్ కంటె బుడుగు పాత్ర విస్తృతి ఎక్కువ


(ఇంకా…)

10వ వారం
కొండా లక్ష్మణ్ బాపూజీ

నిరంకుశ నిజాం వ్యతిరేక మరియు తెలంగాణ ఉద్యమ నాయకులలో ప్రముఖుడైన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆదిలాబాదు జిల్లా వాంకిడి గ్రామంలో 1915 సెప్టెంబరు 27న జన్మించారు. స్వాతంత్ర్యోద్యమంలో మరియు నిరంకుశ నిజాం వ్యతిరేక ఉద్యమంలోనూ చురుకుగా పాల్గొన్నారు. 1940లో న్యాయవాద వృత్తి చేసేటప్పుడు బాపూజీ నిజాం నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసేవారి తరఫున వాదించి కేసులను గెలిపించేవారు. 1952లో ఆసిఫాబాదు నియోజకవర్గం నుంచి ఎన్నికై హైదరాబాదు మరియు ఆంధ్రప్రదేశ్ శాసనసభలకు ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత కూడా శాసనసభ్యుడిగా చిన్నకొండూరు మరియు భువనగిరిల నుంచి ఎన్నికై 1971 వరకు శాసనసభ్యునిగా కొనసాగినారు. నిఖార్సయిన తెలంగాణ వాది. తెలంగాణ కోసం 1969లో మంత్రి పదవిని కూడా తృణప్రాయంగా వదిలిలేసిన నిబద్ధత కలిగిన రాజకీయవేత్త. 1969 మరియు 2009-12 తెలంగాణ ఉద్యమాలలో పాల్గొన్నారు. రాష్ట్ర చేనేత సహకార రంగానికి కూడా కృషిచేసిన బాపూజీ సెప్టెంబరు 21, 2012 నాడు 97 సంవత్సరాల వయస్సులో హైదరాబాదులో మరణించారు.

(ఇంకా…)

11వ వారం

చక్రం

చక్రం మనిషి కనుగొన్న మొట్టమొదటి పరికరం. చక్రం అనేది ఒక అక్షం చుట్టూ తిరిగే గుండ్రటి పరికరం. రవాణా మరియు ఎన్నోరకాల యంత్రాలలో చక్రాలు విరివిగా వాడబడుతున్నాయి. ఇరుసు సహాయంతో చక్రం దొర్లడం వల్ల రవాణాలో ఘర్షణ లేదా రాపిడి తగ్గుతాయి. ఏదో ఒక యంత్రం లేదా మంత్రం మనల్ని చారిత్రక పూర్వం యుగంలోకి తీసుకెళ్ళిందనుకొందాం. నేటి జీవితంలో మనం అలవాటు పడ్డ ఎన్నో వస్తువులు అక్కడ లేక పోవటంతో బ్రతుకు దుర్భరంగా ఉంటుంది. తిండీ,బట్టా, ఇల్లూ ఎలా సంపాదించుకోవాలి? అన్నీ సమస్యలుగానే ఉంటాయి. కాళ్ళూ, చేతులూ, మెదడు తప్ప మన దగ్గర మరేమీ ఉండదు. వీటిని ఉపయోగించే మన అవసరాలను తీర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మొదట ఏవో మొరటు ఆయుధాల్ని తయారుచేసి, అడవుల్లో వేటాడి జంతువుల్ని చంపాలి. రవాణా సౌకర్యాలు లేవు గనక మనం నివసించే గుహకు ఆ జంతువుల్ని ఎలా తీసుకువావాలో బుర్ర గోక్కోవాలి. అడవిలో వాటిని లాక్కు రావటం అసాథ్యం కాదు గానీ, శ్రమతో కూడుకున్న పనే. చెట్టు కొమ్మల మీద లేదా పొడుగాటి కొయ్య దిమ్మ మీద జంతువుల్ని పడవేసి లాగితే బాగుంటుందని ఎవరో ఒకరు అంటారు. ఇలా చేస్తే లాగటం సులువుగా ఉంటుంది. భూమి మీద రవాణాకు సంబంధించి ఇది మొట్టమొదటి వాహనం అవుతుంది.ఇది సుమారు 15 వేల ఏళ్ళ నాటి పరిస్థితి.


(ఇంకా…)

12వ వారం

పిగ్మీ స్పెర్మ్ వేల్

మరగుజ్జు స్పెర్మ్ వేల్ స్పెర్మ్ వేల్ కుటుంబం లో మూడు రకాల టూత్డ్ వేల్ జాతులలో ఒకటి. అవి తరచుగా సముద్రంలో కనబడవు. కాని వాటి గురించి చాలా నమూనాల పరీక్ష బట్టి తెలుసుకోవచ్చును. పిగ్మీ వేల్ మరియు మరగుజ్జు స్పెర్మ్ వేల్ ల గూర్చి సరైన వర్గీకరణ వంటి విషయాలపై చర్చ జరిగినపుడు వివిధ అభిప్రాయలు వ్యక్తమైనాయి. 1966 వరకు ఈ రెండు వేల్స్ ఒకే జాతికి చెందినవిగా స్మిత్సోనియన్ ఇనిస్టిట్యూషన్ లోని శాస్త్రవేత్తల నిర్వచనాల ఆధారంగా గుర్తించారు. ఈ మరుగుజ్జు స్పెర్మ్ వేల్ కు 1838 లో మొట్టమొదట పేరు పెట్టినవారు "హెన్రి మేరీ డుక్రొటాయ్ డి బ్లాయిన్‌విల్లీ". మరగుజ్జు స్పెర్మ్ వేల్ అనేక డాల్ఫిన్లు కంటే పెద్దవి. యివి పుట్టినప్పుడు 1.2 మీటర్ల (3 అడుగుల 11అంగుళాలు) పరిపక్వత చెందినపుడు 3.5 మీటర్ల (11 అడుగులు) వరకు పెరుగుతాయి. వీటిలో పెద్ద వేల్స్ 400 కిలోగ్రాములు లేదా 880 పౌండ్లు బరువు ఉంటాయి. వీటి క్రిందిభాగంలో క్రీం రంగు, అప్పుడప్పుడు ఊదారంగు, వీపు మరియు ప్రక్క భాగాలు నీలం బూడిద రంగులో లెదా రెండు రంగుల కలయికతో ఉంటాయి.శరీర పరిమాణం పోల్చి చూస్తే షార్క్ వంటి తల పెద్దదిగా కనిపిస్తుంది.తరచుగా ప్రతి కంటి వెనుక, ఒక "తప్పుడు గిల్" గా వర్ణించబడింది.


(ఇంకా…)

13వ వారం

పైడిమర్రి సుబ్బారావు

పైడిమర్రి సుబ్బారావు బహు భాషావేత్త, మంచి రచయిత. ఇంగ్లీషు, తెలుగు, ఉర్దూ, పారసీ, సంస్కృతం భాషలలో ప్రావీణ్యం ఉంది. జనగణమన, వందేమాతరం తర్వాత అంతే సంఖ్యలో రోజూ లక్షలాది మంది విద్యార్థులు చదువుతున్న ‘ప్రతిజ్ఞ’ ను రచించింది ఈయనే. ఈయన నల్గొండ జిల్లా , అన్నెపర్తి లో రాంబాయమ్మ, రామయ్యలకు జూన్ 10 , 1916 లో జన్మించారు.1962 చైనా యుద్ధ సమయంలో విశాఖపట్నం డిటివొగా పనిచేశారు.మన విద్యార్థులలో దేశభక్తిని పెంపొందించాలనే ఉద్దేశ్యంతో పైడిమర్రి ‘ప్రతిజ్ఞ’కు రూపకల్పన చేసి తను రాసిన దానిని తెన్నేటి విశ్వనాథానికి చూపించారు.ఆయన అప్పటి విద్యాశాఖమంత్రి పి.వి.రాజుకు చూపించగా ఆయన ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి తో చర్చించి 1965 , జనవరి 26 వ తేదీనుండి ప్రతి పాఠశాలలో ఉదయాన్నే విద్యార్ధుల అసెంబ్లీ సమయంలో ఈ ప్రతిజ్ఞ చేసేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయించారు..క్రమంగా ఇది అన్ని భాషల్లోను అనువదించబడింది. వీరి విద్యాభ్యాసం నల్లగొండలోనే జరిగింది. వీరి కుటుంబీకులు ఇప్పటికీ నల్లగొండ లోనే వున్నారు. వీరి సతీమణి వెంకట రత్నమ్మ ఇటీవలే చనిపోయారు. పైడిమర్రి సుబ్బారావు బహు భాషావేత్త, మంచి రచయిత. ఇంగ్లీషు, తెలుగు, ఉర్దూ, పారసీ, సంస్కృతం భాషలలో ప్రావీణ్యం ఉంది. ఆయన తన 18వ ఏటనే ‘కాలభైరవుడు’ (1936) పేరున చిన్న నవల రాశారు.

(ఇంకా…)

14వ వారం

కేదార్‌నాథ్

కేదార్‌నాథ్ హిందువుల ముఖ్య పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఇది భారతదేశంలోని ఉత్తరా ఖండ్ లోని రుద్రప్రయాగ జిల్లా లోని ఒక నగర పంచాయితీ. కేదార్‌నాథ్ సముద్రమట్టానికి 3584 మీటర్ల ఎత్తులో ఉంది. మందాకినీ నది పైభాగంలో మంచు కప్పిన కొండల మధ్య ఉంది. హిందువుల పవిత్ర ఆలయమైన కేదార్‌నాథ్ శివాలయం ఉన్న పుణ్య క్షేత్రం. శివభక్తుల ముఖ్య పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్. కేదార్‌నాథ్ గుడి పవిత్రమైన శైవ క్షేత్రం. గర్హ్వాల్ కొండల పైభాగంలో ఉంది. ప్రతికూల వాతావరణం కారణంగా అక్షయతృతీయ నుండి దీపావళి వరకు భక్తుల సందర్శనార్ధం ఈ గుడిని తెరచి ఉంచుతారు. ఇక్కడ పూజలు నిర్వహించడానికి అధికారమున్న కుటుంబం అంటూ ఏదీ లేదు. గుడిలో ప్రతిష్టితమయిన లింగం యొక్క కాలం ఇదమిద్దంగా ఇంతవరకు నిర్ణయించబడలేదు. గుడి చేరటానికి రోడ్డు మార్గం లేదు. గౌరికుండ్ నుండి గుర్రాలు, డోలీలు మరియు కాలినడకన మాత్రం గుడిని చేరవచ్చు. ఈ గుడిని ఆదిశంకరులు నిర్మించినట్లు విశ్వసిస్తున్నారు. కేదార్‌నాథ్ గుడి వెనుక భాగంలో ఆదింకరుల సమాధికి ఉంది. 12 జ్యోతిర్లింగాలలో ఇది ఒకటి. ఉత్తరాఖండ్ లోని చార్‌ధామ్‌లలో ఇది ఒకటి. గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్ మరియు కేదార్‌నాధ్ లను చార్ ఉత్తరాఖండ్ ధామ్‌లుగా వ్యవహరిస్తారు. ఆలయం ముందరి భాగంలో కుంతీ దేవి, పంచ పాండవులు, శ్రీకృష్ణుని మూర్తులు వరుసగా కుడ్య శిలలుగా దర్శనమిస్తాయి. గర్భగుడిలో కేదారీశ్వరుడు స్వయంభువుడుగా దర్శనం ఇస్తాడు.

(ఇంకా…)

15వ వారం
చెన్నమనేని విద్యాసాగర్ రావు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో భారతీయ జనతా పార్టీ కి చెందిన ప్రముఖులలో ఒకరైన 'సి.విద్యాసాగర్ రావు (చెన్నమనేని విద్యాసాగర్ రావు) 1942, ఫిబ్రవరి 12న శ్రీనివాసచారి, చంద్రమ్మ దంపతులకు కరీంనగర్ జిల్లాలో జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం లో ఉన్నత విద్యనభ్యసించి న్యాయవాద వృత్తి చేపట్టిన విద్యాసాగర్ రావు 1980 లో తొలిసారిగా కరీంనగర్ లోకసభ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయారు. 1985 లో మెట్‌పల్లి శాసనసభ నియోజకవర్గంలో తొలిసారి గెలుపొంది రాష్ట్ర శాసనసభలో ఆడుగుపెట్టిన విద్యాసాగర్ రావు మొత్తం 3 సార్లు శాసనసభ్యుడిగాను, రెండు సార్లు లోకసభ సభ్యుడిగాను ఎన్నికయ్యారు. అటల్ బిహారీ వాజపేయి నేతృతంలోని ఎన్.డి.ఏ.ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. 1977లో కరీంనగర్ జిల్లా జనతా పార్టీ అధ్యక్షుడిగానూ, ఆ తర్వాత భాజపా అధ్యక్షుడుగానూ వ్యవహరించారు. స్వశక్తితో ఎదిగి రాజకీయాలలో రాణించిన నాయకుడైన విద్యాసాగర్ రావు 2004 లో మరియు 2006 ఉప ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభంజనంతో ఓడిపోయారు. తెరాస సభ్యుల రాజీనామాతో జరిగిన 2008 ఉపఎన్నికలు హాస్యాస్పదమని, అనవసరమనీ ప్రకటించి ఎన్నికల బరిలో నిలవలేదు. 2009 శాసనసభ ఎన్నికలలో వేములవాడ నుంచి పోటీచేసిననూ విజయం లభించలేదు. ఈయన పెద్ద సోదరుడు చెన్నమనేని రాజేశ్వరరావు 6 సార్లు శాసనసభ్యుడిగా విజయం సాధించగా, మరో సొదరుడు చెన్నమనేని హన్మంతరావు జాతీయస్థాయిలో ఆర్థికవేత్తగా పేరుపొందారు.

(ఇంకా…)

16వ వారం

ఐస్ క్రీం

ఐస్ క్రీం అనగా పాలు, ఐసు (మంచు), చక్కెర మొదలైన పదార్థాలతో తయారు చేసిన ఒక నోరూరించే తినుబండారం. ఐస్ క్రీం ప్రపంచ వ్యాప్తంగా చాలామందికి ఇష్టమైన ఆహారం. ముఖ్యంగా వేసవి కాలంలో ఐస్ క్రీం సెంటర్ల వైపు మొగ్గుచూపడం సాధారణంగా జరుగుతుంటుంది. తీవ్రమైన ఎండల ప్రభావం వల్ల కలిగిన అలసటనుండి విముక్తి పొందడానికి జనం ఆశ్రయించే ఈ ఐస్ క్రీములు నేడు సర్వకాల సర్వావస్థలయందు మానవుడి ఆహార అంతర్భాగాలలో ఒకటి కావడం విచిత్రమైన పరిణామం. ఇతర వంటలలాగా, ఇతర తినుబండారాలాగా ఐస్ క్రీం ఒకరి చేత తయారుచేయబడింది కాదు. దీని సృష్టికర్త ప్రత్యేకమైన వంటగాడేమీ కాదు. ఇది తనకు తానుగా ఏర్పడింది. ప్రాచీన కాలంలో రాజులు, జమీందారులు, ధనికులు, ఇతర సంపన్న వర్గాలవారు సాధారణంగా వైన్ లాంటి మత్తు పానీయాలు సేవించేవారు. వైన్ గానీ, సారా గానీ చల్లబడినప్పుడు, ఇతర నాజూకు పదార్ధాలను ఐస్‌తో చల్లబరచినప్పుడు పరిణామాత్మకంగా ఇది ఏర్పడింది. క్రీ.శ. 62లో రోమన్ చక్రవర్తి నీరో తన వైను గదిని చల్లబరుచుకోవడానికి ఐసు కోసం తన సేవకులను అపినైన్ పర్వతాలకు పంపించాడు. ఐసు కోసం సుదూర ప్రాంతాలకు వ్యయ ప్రయాలకు ఓర్చడం ఆ కాలంలో ఉండేది. ఐసుకు ఆ కాలంలోనే అంత ప్రాధాన్యత ఉండేది.13వ శతాబ్దంలో దూర ప్రాచ్య దిశ నుండి మర్కోపోలో వచ్చినప్పుడు అనేక అమూల్య వస్తువులతోపాటు ఆనాడు ఆసియాలో బహుళ ప్రచారంలో ఉన్న మిల్క్ ఐస్ చేసే విధానాన్ని కూడా తీసుకువచ్చాడు. ఈ రుచికర పదార్ధం ఇటలీలో శీఘ్ర ప్రచారం పొందింది.

(ఇంకా…)

17వ వారం

వంకాయ

వంగ - వంకాయ - తెలుగు దేశములో చాలా ప్రముఖమైన, విరివిగా పెంచబడుతున్న కూరగాయల రకాలలో ఒకటి. దీని చరిత్ర సరిగ్గా తెలీదు, కానీ హిందూ మత శ్రాద్ధ కర్మలందు దీనిని కూడా నిషేధించి ఉన్నందువల్ల దీనిని భారతదేశమునకు ఇతర దేశముల నుంచి వచ్చినదిగా భావింపబడుతున్నది, కానీ ఎప్పుడు ఎలా భారతదేశమునకు వచ్చినదో సరిగ్గా తెలీదు. వంకాయలు రకరకాలుగా - చిన్న వంకాయలు, పొడుగు వంకాయలు, తెల్ల వంకాయలు, ఎర్ర వంకాయలు, గుత్తి వంకాయలు - లభిస్తున్నాయి. వంగ సుమారుగా ఒకటి, ఒకటిన్నర మీటర్ల యెత్తెదుగు చిన్న గుల్మము. సామాన్యముగా ఒక సంవత్సరము పెంచబడిననూ, పరిస్థితులు అనుకూలంగా ఉన్నచో ఒకటి కన్నా ఎక్కువ సంవత్సరములు ఈ మొక్క పెరుగును. వేళ్ళు మొక్క యొక్క పైభాగమునకు తగినంత విరివిగ వ్యాపించవు. కాండము సామాన్యముగా 1.25 - 2.50 సెం. మీ. లావుగా పెరుగును. దీనికి చాలా కొమ్మలూ, రెమ్మలూ వచ్చును. ఆకులు పెద్దవిగా ఉంటాయి. సుమారుగా 15 సెంటీమీటర్లు పొడువూ, 10 సెంటీమీటర్లు వెడల్పు కలిగిఉంటాయి. అంచుకు కొద్ది గొప్ప తమ్మెలుగ చీలి ఉంటాయి. కొన్నిటిలో ఏకముగా ఉండుటనూ చూడవచ్చు. ఆకులు అంతటనూ మృదువయిన నూగు కలిగిఉండును. (ఇంకా…)

18వ వారం

వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, సింహాచలం

శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానము, సింహాచలము అనే గ్రామంలో విశాఖపట్టణము నకు 11 కి.మీ. దూరంలో తూర్పు కనుమలలో పర్వతంపైన ఉన్న ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రము. ఈ క్షేత్రమున విశాఖ పరిసర ప్రాంతాల్లో ప్రజలు సింహాద్రి అప్పన్న గా పిలిచే వరాహ లక్ష్మీనరసింహస్వామి కొలువై ఉన్నాడు. ఈ దేవాలయము సముద్రమట్టానికి 244 మీ ఎత్తున సింహగిరి పర్వతంపై ఉన్నది. ఇది దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఒకటి. తిరుపతి తర్వాత అత్యధిక ఆదాయం (52 కోట్ల రూపాయలు) కలిగిన దేవాలయము. సంవత్సరానికి 12 గంటలు మాత్రమే ఈ దేవుని నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది; మిగిలిన సమయంలో ఈ విగ్రహం చందనంతో కప్పబడి ఉంటుంది. నిజరూప దర్శన సమయాన్ని చందన యాత్ర లేదా చందనోత్సవం అని అంటారు. ఇది ప్రతీ సంవత్సరం వైశాఖ మాసం శుద్ద తదియ నాడు (మే నెలలో) వస్తుంది. సింహాచలం చరిత్ర ఆధారాలతో సహా పదకొండవ శతాబ్ధం వరకు కనిపిస్తున్నది. కాని భారత ఇతిహాసాల ప్రకారం ఇది ఇంకా పురాతనమైనదై ఉండవచ్చు.

(ఇంకా…)

19వ వారం

అన్నమయ్య

అన్నమయ్య లేదా తాళ్ళపాక అన్నమాచార్యులు (మే 9, 1408 - ఫిబ్రవరి 23, 1503) తెలుగు సాహితీ చరిత్రలో లభించిన ఆధారాల ప్రకారం మొదటి వాగ్గేయకారుడు (సాధారణ భాషలో గేయాలను కూర్చేవారు). అన్నమయ్యకు పదకవితా పితామహుడు అని బిరుదు ఉన్నది. దక్షిణాపథంలో భజన సాంప్రదాయానికి, పదకవితాశైలికి ఆద్యుడు. గొప్ప వైష్ణవ భక్తుడు. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ని, అహోబిలము లోని నరసింహ స్వామి ని, ఇతర వైష్ణవ సంప్రదాయ దేవతలను కీర్తిస్తూ 32వేలకు పైగా కీర్తనలు రచించాడు . అన్నమయ్య పాటలు, పదాలు, పద్యాలలో భక్తి, సాహిత్యం, సంగీతం, శృంగారం, భావలాలిత్యం పెనవేసికొని ఉంటాయి. కన్నడ వాగ్గేయకారుడు పురందరదాసు అన్నమయ్యను శ్రీనివాసుని అవతారంగా ప్రశంసించాడంటారు. (సాక్షాత్తు శ్రీమహావిష్ణువు ఖడ్గమైన నందకం అంశతో అన్నమయ్య జన్మించాడని శ్రీవైష్ణవసంప్రదాయంలో నమ్మకం ఉన్నది. ప్రధాన మందిరంలో ఘంట అవతారమని కూడా అంటారు). త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసు వంటి సంకీర్తనాచార్యులకు అన్నమయ్య మార్గదర్శకుడు. చందమామ రావే జాబిల్లి రావే అంటే వేంకటేశుడు ముద్దలు తిన్నాడో తినలేదో కానీ, తెలుగు పిల్లలు మాత్రము గబుక్కున తింటారు. జోఅచ్యుతానంద జో జో ముకుందా అంటే ముకుందుడు నిద్ర పోతాడో లేదో కానీ తెలుగు పిల్లలు మాత్రము హాయిగా నిద్ర పోతారు. అన్నమయ్య పాటలు తెలుగు సంస్కృతికి ప్రతిరూపాలు. అవి తెలుగు సంస్కృతిలో ఒక భాగమై పోయినాయి; జనాల నోళ్ళలో నాటుకొని పోయినాయి. తుమ్మెద పాటలు, గొబ్బిళ్ళ పాటలు, శృంగార గీతాలు, ఆధ్యాత్మిక పదాలు - ఇలా మొత్తము ముప్పై రెండు వేల పాటలు వ్రాసాడు.

(ఇంకా…)

20వ వారం

గౌతమ బుద్ధుడు

సిద్ధార్థ గౌతముడు నాటి ఆధ్యాత్మిక గురువులలో ఒకరు మరియు బౌద్ధ ధర్మానికి మూల కారకులు. బౌద్ధులందరిచే మహా బుద్ధుడిగా కీర్తింపబడేవాడు. బుద్ధుని జనన మరణాల కాలం స్పష్టంగా తెలియరావడం లేదు: 20వ శతాబ్దపు చారిత్రకకారులు క్రీ.పూ 563 నుండి 483 మధ్యలో జననం అని, 410 నుండి 400 మధ్యలో మరణం ఉండవచ్చు అని భావిస్తున్నారు. గౌతముడిని శాక్యముని అని కూడా పిలుస్తారు. ఆయన జీవిత సంఘటనలు, బోధలు మరియు భిక్షువుల నడవడికలు మొదలగునవి అన్ని ఆయన మరణం తరువాత సంఘముచే తరతరాలుగా పారాయణం చేయబడ్డాయి. మొదట, నోటి మాటగా బోధింపబడినా, దాదాపు నాలుగు వందల సంవత్సరాల తరువాత త్రిపీటక అనే పేరుతో మూడు పీఠికలుగా విభజింపబడి భద్రపరిచారు. బుద్ధుడు మరియు అతని శిష్యులు, ప్రతి సంవత్సరం నాలుగు నెలలు బుద్ధుని బోధనలను చర్చించి ఆచరించేవారు. ఈ బోధనలను భద్రపరచి ప్రచారం చెయ్యడానికి బుద్ధుని నిర్యాణం తర్వాత ఒక సంఘం ఏర్పడింది. ఒక శతాబ్దం తర్వాత ఇంకో సంఘం ఏర్పడింది. ఈ రెండు సంఘాలు బుద్ధుని బోధనలను ప్రచారం చేయసాగాయి. ఈ సంఘాలు బుద్ధుని బోధనలను, వేర్వేరు భాగాలుగా విభజించి ఒక్కో భాగాన్ని ఒక్కో బౌద్ధ భిక్షువుకు అప్పగించాయి. అప్పటి నుంచి బుద్దుని బోధనలు ముఖస్థంగా ప్రచారం కాసాగాయి. చరిత్ర ప్రకారం బుద్ధుని బోధనలను, రెండవ సంఘం ఏర్పడినప్పుడు గానీ, లేదా తర్వాత కొద్ది కాలానికి గానీ ప్రస్తుత రూపాన్ని సంతరించుకున్నాయి.

(ఇంకా…)

21వ వారం

జీయాస్ విగ్రహం-ఒలింపియా

ప్రపంచంలో మూడవ వింతగా చెప్పుకునే జీయాస్ విగ్రహం గ్రీసు దేశంలో కలదు. ఈ దేవతనే "జూపిటర్" అని కూడా అంటారు. ఇది సుమారు 13 మీటర్లు(43 అడుగులు) పొడవు ఉంటుంది. గ్రీస్ దేశానికి చెందిన ప్రఖ్యాత శిల్పి ఫిడియాస్ ఈ బృహత్తర జూపిటర్ విగ్రహాన్ని క్రీ.పూ 430-422 మధ్య కాలంలో రూపొందించారు. ఈ విఖ్యాత శిల్పి తయారు చేసిన మరో విగ్రహం పార్థినాన్ లోని "ఎథెన్నా " శిల్పం. పశ్చిమ గ్రీస్ లో ఒలింపియా వద్ద నున్న గొప్ప దేవాలయంలో ఈ జీయాస్ విగ్రహం నెలకొని ఉన్నది. ఈ ఆలయం గ్రీస్ లోకల్లా చాలా పెద్దది. ఎథెన్నా విగ్రహం లాగానే ఈ జీయస్ విగ్రహాన్ని క్రిసిలి ప్లాంటైన్ తో రూపొందించటం జరిగింది.ఈ విగ్రహం బంగారం,దంతం తో నిర్మాణమైనది. ఈ విగ్రహం నిర్మాణంలో దంత శిల్ప నైపుణ్యం చెప్పుకోదగినది. ఈ విగ్రహం జీయాస్ దేవుడు ఉన్నతాసనంపై కూర్చున్న విధంగా ఉంటుంది. ఇది ప్రపంచ ఏడు వింతలలో ఒకటిగా నిలిచింది. ఈ జీయాస్ విగ్రహం యొక్క నకలులు ఎక్కడా మనకు కానరావు. కానీ ప్రాచీన గ్రీకు చరిత్రలో కొన్ని నాణేలపై ఈ చిత్రాలను చూడవచ్చు. ఈ విగ్రహం మానవుని కన్నా 8 రెట్లు పెద్దది. విగ్రహం ఎత్తు దాదాపు 13 మీటర్లు ఉంటుంది. దేవాలయం పైకప్పును అంటుకుంటుంది. జీయాస్ జిడర్‌వుడ్(రక్త చందనం) సింహాసనం మీద కూర్చున్నట్లు ఉంటుంది. ఈ సింహాసనాన్ని పబొని, దంతం,బంగారం,అమూల్యమైన మణిమాణిక్యాలు, రత్నాలతో అలంకరించబది ఉంటుంది. విగ్రహం దుస్తులు బంగారంతో,దంతపు పేడుతో చేయబడ్డాయి. కళ్లు అమూల్యమైన మణులతో పొదగబడ్డాయి

(ఇంకా…)

22వ వారం

జైన మతము

జైన మతము సాంప్రదాయికంగా జైన ధర్మ అని పిలువబడుతుంది. ఈ మతము క్రీ.పూ. 9వ శతాబ్దంలో పుట్టినది. ఈ మత స్థాపకుడు మొదటి తీర్థంకరుడు అయిన వృషభనాథుడు. 23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడు. 24వ తీర్థంకరుడు వర్థమాన మహావీరుడు. భారతదేశంలో జైనులు ఒక చిన్న సమూహము. వీరి జనాభా దాదాపు 42 లక్షలు ఉంటుంది. జైన మతమును శ్రమణ మతమని కూడ అంటారు. క్రీ.పూ ఆరవ శతాబ్దంలో మతపరంగా సమాజం ఒక కుదుపుకు లోనైంది. ఈ కాలంలో నైతిక, ఆధ్యాత్మిక అశాంతి నెలకొని ఉంది. ప్రపంచం మొత్తం మీద నాడు ఉన్న యధాతధ స్థితిలో విసిగిపోయిన జనం ఎదురు తిరిగారు. గ్రీసు బయోనియో గిరాక్లీటీజ్ నూతన సిద్ధాంతాన్ని ప్రవచించారు. జరతూష్ట్ర ఇరాన్ లో, చైనా లో కన్ఫ్యూషియస్ లు ఉన్న పరిస్థితులకు వ్యతిరేకంగా తమ నూతన సిద్ధాంతాలను ప్రతిపాదించారు. భారత దేశంలోనూ ఇదే జరిగింది. ప్రాచీన మత ధర్మాలలో, కర్మకాండ క్రతువుల భారంతో జనం విసిగి పోయి ఉన్నారు. మత సంస్కృతి యొక్క మృత భారంతో నడుములు వంగిపోయాయి. పూజారి వర్గం, అసమానతలు, సామాజిక స్తబ్దత, అధర్మం, బలులు, కులవ్యవస్థ లతో సమాజం కుళ్ళిపోయింది. విప్లవం తప్పనిసరి అయింది. "వ్యక్తి ఆడగాని, మగ గాని మానవ మాతృడుగా తన ముక్తిని తానే సాధించుకోవాలి. జీవితం లక్ష్యం కాదు. ఆధ్యాత్మీకరణ మార్గంలో అది ఒక పరికరం మాత్రమే. అంతిమ లక్ష్యం భౌతికం కాదు ఆధ్యాత్మిక సామాజీకరణం కాదు. "ఆధ్యాత్మీకరణం" అన్నది నూతన విప్లవం.

(ఇంకా…)

23వ వారం
తెలంగాణ

జనపదాల కాలం నాటి నుంచి చారిత్రక ప్రాశస్త్యం కలిగి కాకతీయుల కాలంలో వైభవంగా వెలుగొందిన తెలంగాణ 1948 సెప్టెంబరు 17న నిజాం పాలన నుంచి విముక్తి చెంది హైదరాబాదు రాష్ట్రంగా ఏర్పడింది. 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా కన్నడ, మరాఠి మాట్లాడే ప్రాంతాలు కర్ణాటక, మహారాష్ట్రలకు వెళ్ళిపోగా, తెలుగు భాష మాట్లాడే జిల్లాలు ఆంధ్ర రాష్ట్రంతో కలిసి ఆంధ్ర ప్రదేశ్ గా ఏర్పడింది. దశాబ్దాలుగా సాగిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమం 1969లో ఉధృతరూపం దాల్చగా, 2011లో మరో సారి తీవ్రరూపం దాల్చింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో భాగంగా వందలాది మంది ఆత్మహత్యలు చేసుకొన్నారు. జూన్ 2, 2014 న తెలంగాణ భారతదేశంలో 29వ రాష్ట్రంగా అవతరించింది. తెలంగాణ రాష్టానికి ఉత్తరాన మహారాష్ట్ర, పశ్చిమాన మహారాష్ట్ర మరియు కర్ణాటక, దక్షిణాన మరియు తూర్పున ఆంధ్రప్రదేశ్, ఈశాన్యాన చత్తీస్‌గఢ్ రాష్ట్రాలు సరిహద్దులుగా ఉన్నాయి. తొలి తెలుగు రామాయణ కర్త గోన బుద్ధారెడ్డి, సహజకవి బమ్మెర పోతన, దక్షిణ భారతదేశంలో తొలిమహిళా పాలకురాలు రుద్రమదేవి, ప్రధానమంత్రిగా పనిచేసిన పి.వి.నరసింహారావు తెలంగాణకు చెందినవారు. చరిత్రలో షోడస మహాజనపదాలలో ఒకటైన అశ్మక జనపదం విలసిల్లిన ప్రాంతమిది. కాకతీయుల కాలంలో వైభవంగా వెలుగొందిన భూభాగమిది. రామాయణ-మహాభారతం కాలానికి చెందిన చారిత్రక ఆనవాళ్ళున్న ప్రదేశమిది. 10 జిల్లాలు కలిగిన తెలంగాణ రాష్ట్ర వైశాల్యం 114,840 చకిమీ, కాగా 2011 లెక్కలప్రకారం జనాభా 3,52,86,757 ఉంది. 17లోకసభ స్థానాలు, 119 శాసనసభ స్థానాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా ఆలంపూర్ లో 5వ శక్తిపీఠం, భద్రాచలంలో ప్రముఖమైన రామాలయం, బాసరలో సరస్వతీ దేవాలయం ఉన్నాయి. దేశంలో ఐదవ పెద్ద నగరమైన హైదరాబాదు ఈ రాష్ట్ర రాజధాని. వరంగల్, నిజామాబాదు, కరీంనగర్, ఖమ్మం, రామగుండం తెలంగాణలోని ఇతర ముఖ్య నగరాలు.

(ఇంకా…)

24వ వారం

ఇడ్లీ

ఇడ్లీ దక్షిణ భారత దేశంలో విరివిగా వాడే అల్పాహార వంటకం. ఇడ్లీలు గుండ్రంగా రెండు లేదా మూడు అంగుళాల వ్యాసం కలిగి ఉంటాయి. మినప పప్పు మరియు బియ్యపు పిండి కలిపి పులియబెట్టిన పిండిని గుంత అచ్చులు ఉన్న పళ్లాలపైపోసి ఆవిరితో ఉడికించి తయారుచేస్తారు. మినప్పప్పు లోని ప్రోటీన్లు, బియ్యంలోని పిండి పదార్థాలు కలిసి శరీరానికి కావలసిన శక్తిని ఇస్తాయి. పిండి పులియడం వల్ల శరీరం సులభంగా జీర్ణించుకోగల చిన్న పదార్ధాలుగా విచ్ఛిన్నం చెందుతుంది. అందుకే దీన్ని పసి పిల్లలకూ, అనారోగ్యంతో బాధ పడేవారికీ తరచుగా తినిపిస్తూ ఉంటారు. సాధారణంగా ఉదయం పూట అల్పాహారంగా తినే ఇడ్లీలను, వాటితో పాటు నంజుకుని తినటానికి చట్నీ లేదా సాంబారు లేదా కారంపొడిగానీ, పచ్చడితో గానీ వడ్డిస్తారు. ఎండు మసాలాలను కలిపి దంచి తయారుచేసిన ముళగాయి పొడి వంటి పొడులు ఇడ్లీలను ప్రయాణాలలో వెళుతూ వెళుతూ తినటానికి అనువుగా ఉంటాయి. అంతే కాకుండా, ఇడ్లీలు ప్రపంచంలోని పది అత్యంత ఆరోగ్యవంతమైన వంటకాలలో ఒకటిగా పరిగణించబడుతున్నది. దోశకు మరియు వడకు తమిళ దేశాన రెండు వేల సంవత్సరాల ఘనమైన చరిత్ర కలదు కానీ, ఇడ్లీ మాత్రము విదేశీ దిగుమతి. సాహిత్యములో తొలిసారి ఇడ్లీ వంటి వంటకము యొక్క ప్రస్తావన (ఇడ్డలిగే) 920 లో శివకోట్యాచార్య యొక్క “వడ్డారాధనే” అనే కన్నడ రచనలో ఉన్నది. ఆ తరువాత 1130 లో కళ్యాణీ చాళుక్య చక్రవర్తి మూడవ సోమేశ్వరుడు రచించిన సంస్కృత విజ్ఞాన సర్వస్వము మానసోల్లాస లో ఇడ్లీ తయారు చేసే విధానము ఇవ్వబడినది. అయితే ఈ రచనలలో ఆధునిక ఇడ్లీ తయారీకి ప్రధాన భాగలైన మినపప్పు తో పాటు బియ్యపుపిండి కలపడము, పిండిని పులియబెట్టడము, పిండి పొంగడానికి ఆవిరిపట్టడము మొదలైన విషయాల గురించిన ప్రస్తావన లేదు.


(ఇంకా…)

25వ వారం

కుమారభీమారామం

పంచారామాలలో ఒకటయిన ఈ కుమారభీమారామము క్షేత్రం ప్రశాంతంగా చుట్టూ పచ్చని పంటచేలతో సామర్లకోట కు కిలోమీటరు దూరంలో ఉంటుంది. ఇక్కడ లింగం కూడా 14 అడుగుల ఎత్తున రెండస్తుల మండపంగా ఉంటుంది. పై అంతస్తులోకి వెళ్ళి పూజలు జరపాలి. మహాశివరాత్రి ఉత్సవం ఇక్కడ ముఖ్యమైన పర్వదినం. సామర్లకోట లోని భీమేశ్వరాలయాన్ని చాళుక్య రాజయిన భీముడు నిర్మించాడని క్షేత్ర కథనంలో వివరించబడినది. ఈయనే ద్రాక్షరామ దేవాలయాన్నీ నిర్మించినది. అందుకె ఈ రెండు గుళ్ళు ఒకే రీతిగా వుండటమేగాక, రెంటి నిర్మాణానికి ఉపయోగించిన రాయి కూడ ఒకటేరకంగా మరియు నిర్మాణ శైలికూడా ఒకే విధంగా వుంటుంది.ఈ మందిరం నిర్మాణం క్రీ.శ 892 లో ప్రారంభమై సుమారు క్రీ.శ. 922 వరకు సాగింది.ఆలయం నిర్మాణం చాలా చక్కని శిల్ప కళ కలిగి ఇప్పటికీ పగుళ్ళు లేకుండా ఉంది. ఇక్కడి శివలింగం సున్నపురాయితో చేయబడి తెల్లని రంగులో ఉంది. 1340-1466 మధ్యకాలంలో రాజ్యం చేసిన కాకతీయులు ఈ మందిరాన్ని కొంత పునర్మిర్మించారు. ఇక్కడ కాకతీయుల నాటి శిల్ప కళను, అంతకు పూర్వపు తూర్పు చాళుక్యులనాటి శిల్ప కళను తేలికగా గుర్తించవచ్చును. ఇక్కడి అమ్మవారు బాలా త్రిపుర సుందరి. శివుడు కాలభైరవుని రూపంలో కూడా ఉన్నాడు. 1147 - 1494 మధ్యకాలంలో ఆలయానికి సమర్పించిన విరాళాల గురించిన శాసనాలున్నాయి.

(ఇంకా…)

26వ వారం

ప్రథమ చికిత్స

ఆరోగ్యము ను పరిరక్షించడానికి, అనారోగ్యము ను, చిన్న చిన్న గాయాలు కు, సాదారణ శరీరరుగ్మతలకు, నిపుణుల వైద్యము అందేవరకు తాత్కాలికంగా చేయు ఉపయుక్తకరమైన వైద్యవిధానాన్ని ప్రధమ చికిత్స అందురు. ట్రైనింగు ఉన్నవాళ్ళు, లేనివాళ్ళు కూడా ప్రథమచికిత్స చేయవచ్చును. ఒక్కొక్కప్పుడు దీనివలన ప్రాణాలను కాపాడవచ్చును. కట్లు కట్టడము, రక్తము పోకుండా ఆపడము, ఊపిరి ఆడడము కష్టముగా ఉన్నప్పుడు కృత్రిమ శ్వాస ఇవ్వడము, మొదలగునవి. దీనిలో ముఖ్యముగా మూడు ఉద్దేశములున్నవి. ప్రాణాన్ని నిలపడము, ఉన్న గాయాన్ని ఎక్కువవకుండా చూడడము, బాధ నుండి బయటపడడానికి సహాయము చేయడము. ప్రథమ చికిత్స పరికరాల పెట్టె ప్రతి కర్మాగారం, ఆఫీసు, పాఠశాల, ఇళ్లల్లో అందరికీ అందుబాటులో ఉండాలి. మన ఇంట్లో రేకు లేదా అట్టపెట్టెతో ప్రథమ చికిత్స బాక్స్‌ను తయారు చేసుకోవచ్చు. సులువుగా అందుబాటులో ఉండేలా మీ ప్రథమ చికిత్స పెట్టెను ఏర్పాటు చేసుకోవాలి. గడువు తీరిన ఔషధాలను పారేసి, తాజా ఔషధాలను బాక్స్ లో పెట్టాలి. ఈ క్రింద పేర్కొన్న పరికరాలు, వస్తువులు మీ ప్రథమ చికిత్స పెట్టెలో ఉండాలి.

(ఇంకా…)

27వ వారం

పెదవేగి

పెదవేగి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలము, అదే పేరున్న గ్రామము.ఇది పశ్చిమ గోదావరి జిల్లాలో గల పెద్ద మండలాల్లో ఒకటి. పెదవేగి గ్రామము పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రము అయిన ఏలూరుకు 12 కి.మీ. దూరములో ఉన్నది. జిల్లా కేంద్రం ఏలూరు నుండి గోపన్నపాలెం మీదుగా పెదవేగి చేరుకోవచ్చును. ఇది మెరక ప్రాంతం. (కాలువల వంటి సదుపాయాలు లేవు). ప్రధానమైన వూరుతో బాటు గార్ల మడుగు, దిబ్బగూడెం లక్ష్మీపురం, దిబ్బగూడెం సెంటర్ వంటి శివారు గ్రామాలు జనావాస కేంద్రాలు. చాలా ఇండ్లు వూరిలో కేంద్రీకృతం కాకుండా తోటలలో విస్తరించి ఉంటాయి.మండల వ్యవస్థ రావడానికి ముందు పెదపాడు బ్లాక్ (పంచాయితీ సమితి)లో ఒక వూరిగా, ఏలూరు తాలూకాలో పెదవేగి ఉండేది. తరువాత ఇది పెదవేగి మండల కేంద్రమైంది. పెదవేగి ప్రాంతంలో నేల అధికంగా ఎర్రచెక్కు నేల. పైన ఒకటి అడుగు వరకు ఇసుక ఉండి దాని క్రింద ఎర్రమట్టి, రాతినేల (గ్రావెల్) ఉంటాయి. ఇక్కడ ప్రధానముగా మెరక పంటలు - కొబ్బరి, నిమ్మ, బత్తాయి,కూరగాయలు, పామాయిల్, పుగాకు వంటి వ్యవసాయము ఎక్కువగా జరుగుతున్నది. ఒక పెద్ద చెరువు, మరి రెండు చిన్న చెరువులు (మిరపకుంట, ఏనుగు గుండం) ఉన్నాయిగాని, భూగర్భజలాలే ప్రధాన నీటివనరు. 1970 వరకు ఎక్కువగా బీళ్ళు, చిట్టడవులుగా ఉన్న ఈ ప్రాంతంలో కరెంటు సదుపాయము వల్ల వ్యవసాయం చాలా వేగముగా అభివృద్ధి చెందింది. అడవులతో పోటీపడే దట్టమైన తోటలు చుట్టుప్రక్కల కనువిందు చేస్తాయి.


(ఇంకా…)

28వ వారం

పరశురాముడు

శ్రీమహావిష్ణువు దశావతారములలో పరశురామావతారము ఆరవది. త్రేతాయుగము ఆరంభములో జరిగినది. అధికార బల మదాంధులైన క్షత్రియులను శిక్షించిన అవతారమిది. పరశురాముని భార్గవరాముడు, జామదగ్ని అని కూడా అంటారు. కుశ వంశానికి చెందిన మహారాజు గాధి. ఒకసారి భృగు వంశానికి చెందిన ఋచీకుడు అనే మహర్షి గాధి దగ్గరికి వెళ్ళి ఆయన కూతురు సత్యవతిని తనకిచ్చి వివాహం చెయ్యమని కోరగా ఆ మహారాజు నున్నటి శరీరం నల్లటి చెవులు గల వెయ్యి గుర్రాలు ఇమ్మని కోరుతాడు. ఋచీకుడు వరుణుని ప్రార్థించి వెయ్యి గుర్రాలు తెచ్చి సత్యవతిని పెళ్ళి చేసుకొన్నాడు. ఇలా జరుగుతుండగా ఒక రోజు సత్యవతి ఋచీకుని దగ్గరకు వచ్చి తనకు, తన తల్లికి పుత్రసంతానం ప్రసాదించమని కోరగా ఉచీకుడు యాగం చేసి విప్రమంత్రపూతం అయిన ఒక హవిస్సు, రాజమంత్రపూతం అయిన ఒక హవిస్సు తయారుచేసి స్నానానికి వెళ్ళతాడు. సత్యవతి ఈ విషయం తెలియక రాజమంత్రపూతమైన హవిస్సు తను తీసుకొని విప్రమంత్రపూతమైన హవిస్సు తల్లికి ఇస్తుంది. ఋచీకునికి సత్యవతి విషయం తెలిపి ప్రాధేయపడగా తనకొడుకు సాత్వికుడిగ ఉండి, మనుమడు ఉగ్రుడు అవుతాడు అని పల్కుతాడు. ఋచీకుని కుమారుడు జమదగ్ని. జమదగ్ని కొడుకు పురుషోత్తమాంశతో జన్మించినవాడు పరశురాముడు. గాధి కొడుకే విశ్వామిత్రుడు. భృగు వంశాను చరితంగా జమదగ్నికి కూడా కోపము మెండు. ఆయన పత్ని రేణుకాదేవి. జమదగ్ని, రేణుకల చిన్న కొడుకు పేరు పరశురాముడు.

(ఇంకా…)

29వ వారం

వైన్‌ తయారీ

వైన్‌ తయారీ లేదా ద్రాక్షను వైన్‌ గా మార్చే పద్ధతి , అనేది వైన్‌ ఉత్పత్తికి సంబంధించిన తయారీ ప్రక్రియ క్రమాన్ని సూచిస్తుంది, ద్రాక్ష లేదా ఇతర ఉత్పత్తిని ఎంపిక చేయడంతో ప్రారంభించి తయారైన వైన్‌ను సీసాల్లో నింపడంతో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. వైన్‌ అనేది చాలావరకు ద్రాక్ష నుంచి తయారుచేసినప్పటికీ, ఇతర రకాల పండ్లు లేదా విషపూరితం కాని చెట్టు భాగాల నుంచి కూడా తయారు చేస్తారు. మీడ్‌ అనేది ఒక వైన్ రకం, నీటి తర్వాత తేనెను ప్రాథమిక పదార్ధంగా ఉపయోగించి దీన్ని తయారు చేస్తారు.వైన్‌ మరియు వైన్‌ తయారీకి సంబంధించిన శాస్త్రాన్ని ఓనాలజీ అని పిలుస్తారు. ద్రాక్షను సేకరించిన తర్వాత, దానిని ప్రాథమికంగా పులియబెట్టడం (ఫర్మెంటేషన్) కోసం వైనరీకి తరలిస్తారు. ఈ దశలో వైట్ వైన్ తయారీ, రెడ్ వైన్‌ల తయారీ వేర్వేరు పద్ధతిలో జరుగుతుంది. రెడ్ వైన్ అనేది ఎర్ర లేదా నల్ల ద్రాక్షను తొక్కతో సహా పులియబెట్టిన సమయంలో ఆ పండ్లలోని గుజ్జు నుంచి తయారవుతుంది. వైట్ వైన్ అనేది ద్రాక్షను బాగా నలపడం ద్వారా సేకరించిన రసంను పులియబెట్టడం ద్వారా తయారవుతుంది. ఈ విధానంలో ద్రాక్షకు ఉన్న తొక్కను తీసివేస్తారు. దీని తర్వాత వైన్ తయారీలో తొక్కకు ఎలాంటి ప్రాముఖ్యం ఉండదు. అప్పుడప్పుడూ వైట్ వైన్ అనేది ఎర్ర ద్రాక్ష నుంచి కూడా తయారవుతుంటుంది.

(ఇంకా…)

30వ వారం

దాశరథి కృష్ణమాచార్య

తెలంగాణ ప్రజల కన్నీళ్లను 'అగ్నిధార'గా మలిచి నిజాం పాలన మీదికి ఎక్కుపెట్టిన మహాకవి దాశరథి కృష్ణమాచార్య . దాశరథి గా ఆయన సుప్రసిద్ధుడు. పద్యాన్ని పదునైన ఆయుధంగా చేసుకొని తెలంగాణ విముక్తి కోసం ఉద్యమించిన దాశరథి ప్రాతఃస్మరణీయుడు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని గర్వంగా ప్రకటించి ఇప్పటి ఉద్యమానికీ ప్రేరణనందిస్తున్న కవి దాశరథి. దాశరథి కృష్ణమాచార్య 1925 జూలై 22 న వరంగల్ జిల్లా గూడూరు గ్రామంలో జన్మించాడు. ప్రస్తుతం ఈ గ్రామం ఖమ్మం జిల్లాలో ఉంది. బాల్యం ఖమ్మం జిల్లా మధిరలో గడిచింది. ఉర్దూలో మెట్రిక్యులేషను, భోపాల్ విశ్వవిద్యాలయం నుండి ఇంటర్మీడియెట్, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఇంగ్లీషు సాహిత్యంలో బియ్యే చదివాడు. సంస్కృతం, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో మంచి పండితుడు. చిన్నతనంలోనే పద్యం అల్లటంలో ప్రావీణ్యం సంపాదించాడు. ప్రారంభంలో కమ్యూనిస్టు పార్టీ అభ్యుడిగా ఉండి రెండో ప్రపంచయుద్ధం సమయంలో ఆ పార్టీ వైఖరి నచ్చక ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి హైదరాబాదు సంస్థానంలో నిజాం అరాచక ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో పాలుపంచుకున్నాడు. ఉపాధ్యాయుడిగా, పంచాయితీ ఇన్స్పెక్టరుగా, ఆకాశవాణి ప్రయోక్తగా ఉద్యోగాలు చేసాడు. సాహిత్యంలో దాశరథి అనేక ప్రక్రియల్లో కృషి చేసాడు. కథలు, నాటికలు, సినిమా పాటలుకవితలు రాసాడు.

(ఇంకా…)

31వ వారం

ముస్లింల ఆచారాలు

ముస్లిం అనగా ఇస్లాం ను అనుసరించేవాడు. ఆచారాలు అనగా సూచింపబడిన ఆచరణలు ఆచరించేవిధము. మూలంగా; ఇస్లాం సూచించిన ఆచరణలు ముస్లిం ఆచరిస్తాడు, ఇవే ముస్లిం ఆచారాలు. ఇస్లాం సూచనలకు మూలాధారాలు: ఖురాన్, సున్నహ్, హదీసులు మరియు షరియా అంటారు. ఇస్లాం సూచించినవన్నీ ముస్లిం ఆచరించడం లేదు. ముస్లిం ఆచరించేవన్నీ ఇస్లాం సూచించినవి గావు. ముస్లింలు పరస్పరం 'సలాము' చేసుకోవడం ఆచారం. ఈ ఆచారం ఎంతో పరిశుధ్ధమైనది. దీని ఉదాహరణ ముస్లిమేతరులుకూడా ఇస్తారు. ఇస్లాం నికాహ్ లేదా వివాహాన్ని ధర్మబద్ధం చేసి ప్రోత్సహించింది. నికాహ్ చేసుకోవడం దైవప్రవక్త సత్సంప్రదాయం. బ్రహ్మచర్యాన్నీ, వైరాగ్యాన్నీ ఇస్లాం వ్యతిరేకించింది. వివాహం మనిషి ఆలోచనలను సమతూకంలో ఉంచి అతని శారీరక నడవడికను క్రమబద్ధీకరిస్తుంది. వ్యభిచారం హరామ్ లేదా నిషిద్ధం. వివాహం అతి తక్కువ ఖర్చుతో చాలా నిరాడంబరంగా ఉండాలని ఇస్లాం బోధిస్తుంది. కానీ ముస్లింలలో ఒక జాడ్యమేమనగా నికాహ్ రోజు ఇచ్చే విందు, వధువు తండ్రి ఇస్తాడు. ఇందులో అయ్యే ఖర్చు వర్ణనాతీతం. దుబారా ఎక్కువ. భారతదేశంలో ముస్లింలపై హిందూ సాంప్రదాయాల ప్రభావం ఎక్కువ. ఈ రోజుల్లో ముస్లిం కుటుంబాలలో వధూవరులను చూచే 'పెళ్ళిళ్ళపేరయ్యలు' చాలామంది మౌల్వీలు, మౌలానాలు మరియు ముల్లాలే. వధూవరుల పెళ్ళిళ్ళ విషయాల్లో వీరే కులాలను వర్గాలను ప్రోత్సహిస్తుంటారు.


(ఇంకా…)

32వ వారం

వరలక్ష్మీ వ్రతం

శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం ఒక హిందూ ఆచారం. వరలక్ష్మీ దేవత విష్ణు భార్య. హిందూ మతం ప్రకారం ఈ పండగ విశిష్టమైనది. వరాలు యిచ్చే దేవతగా వరలక్ష్మీని కొలుస్తారు. ఈ పూజలు ఆంధ్ర ప్రదేశ్ , కర్ణాటక రాష్ట్రాల్లో అధికంగా స్త్రీలు కొలుస్తారు. ఈ పండగను ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తారు. ఈ రోజు దేవతను పూజచేస్తే అష్టలక్ష్మీ పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాలుపంచుకుంటారు. ముఖ్యంగా మంచి భర్త, కుమారులు కలగాలని కూడా అమ్మాయిలు పూజిస్తారు. ఈ దేవతను పూజిస్తే అష్టైశ్వర్యాలు అయిన సంపద, భూమి, శిక్షణ, ప్రేమ,కీర్తి, శాంతి, సంతోషం మరియు శక్తి వంటివి లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం. ఈ రోజున భారత దేశంలో ఐఛ్చిక సెలవు దినాన్ని ప్రకటిస్తారు. స్కాంద పురాణంలో పరమేశ్వరుడు వరలక్ష్మీ వ్రతం గురించి పార్వతీదేవికి వివరించిన వైనం ఉంది. లోకంలో స్త్రీలు సకల ఐశ్వర్యాలనూ, పుత్రపౌత్రాదులనూ పొందేందుకు వీలుగా ఏదైనా ఓ వ్రతాన్ని సూచించమని పార్వతీదేవి ఆది దేవుణ్ని కోరుతుంది. అప్పుడు శంకరుడు, గిరిజకు వరలక్ష్మీ వ్రత మహాత్మ్యాన్ని వివరించాడని చెబుతారు. అదే సందర్భంలో శివుడు ఆమెకు చారుమతీదేవి వృత్తాంతాన్ని తెలియజేశాడంటారు. భర్త పట్ల ఆదరాన్నీ, అత్తమామల పట్ల గౌరవాన్నీ ప్రకటిస్తూ చారుమతి ఉత్తమ ఇల్లాలుగా తన బాధ్యతల్ని నిర్వహిస్తూ ఉండేది. మహాలక్షీదేవి పట్ల ఎంతో భక్తిశ్రద్ధలు కలిగిన చారుమతి, అమ్మవార్ని త్రికరణ శుద్ధిగా పూజిస్తుండేది.


(ఇంకా…)

33వ వారం

భారత స్వాతంత్ర్యోద్యమము

భారత ఉపఖండం లో స్వాతంత్ర్య సముపార్జనకై జరిగిన అనేక ఉద్యమాలనన్నిటినీ కలిపి "భారత స్వాతంత్ర్యోద్యమము" గా పరిగణిస్తారు. అనేక సాయుధ పోరాటాలు, అహింసాయుత పద్ధతిలో జరిగిన ఉద్యమాలు భారత స్వాతంత్ర్యోద్యమములో భాగాలు. భారత ఉపఖండంలోని బ్రిటిష్ మరియు ఇతర వలసపాలకుల పాలనను అంతమొందంచటానికి వివిధ సిద్దాంతాలను అనుసరించే అనేక రాజకీయపక్షాలు ఉద్యమించాయి. 16వ శతాబ్దములో బుడతగీచు (పోర్చుగీసు) వారి ఆక్రమణలకు వ్యతిరేకంగా అబ్బక్కరాణి చేసిన పోరాటాలను, 17వ శతాబ్దం మధ్యలో బెంగాల్ లో ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా జరిగిన సాయుధ పోరాటాలను వలస పాలనపై వ్యతిరేకతకు మొదటి అడుగులుగా చెప్పవచ్చు. మొదటి సంఘటిత సాయుధ పోరాటం బెంగాల్ లో ప్రారంభమై తరువాత రాజకీయ పోరాటంగా పరిణామం చెంది భారత జాతీయ కాంగ్రెస్ గా ఆవిర్భవించింది. 20వ శతాబ్దం మెదట్లో ఈ పద్దతులలో మౌలికమైన (రాడికల్) మార్పులు వచ్చాయి. కాంగ్రెసులో అతివాదులైన లాలా లజపతిరాయ్, బాలగంగాధర తిలక్, బిపిన్ చంద్ర పాల్, (లాల్ బాల్ పాల్) విదేశీవస్తు బహిష్కరణ, సమ్మె, స్వావలంబన మొదలైన పద్ధతులను అవలంబిస్తే, అరబిందో వంటివారు తీవ్రవాద మార్గాలను అవలంబిచారు. మెదటి దశకాలలో సాయుధ విప్లవ పోరాటాలు ప్రారంభమయ్యాయి. మొదటి ప్రపంచయుద్ధ సమయంలో జర్మనీ, అమెరికాల లోని భారత స్వాతంత్రయోధులు ప్రారంభించిన గదర్ పార్టీ సహకారంతో జరిగిన సంఘటిత భారతసిపాయిల తిరుగుబాటు జాతీయోద్యమంలో వచ్చిన మౌలిక మార్పుగా చెప్పవచ్చు.


(ఇంకా…)

34వ వారం
రంగారెడ్డి జిల్లా

రంగారెడ్డి జిల్లా తెలంగాణ ప్రాంతంలోని జిల్లాలలో ఒకటి. 1978లో హైదరబాదు జిల్లా నుంచి విడదీసి దీన్ని ఏర్పాటుచేశారు. హైదరాబాదు జిల్లా చుట్టూ నలువైపుల రంగారెడ్డి జిల్లా ఆవరించి ఉన్నది. హైదరాబాదు నగరమే ఈ జిల్లాకు కూడా పరిపాలనా కేంద్రముగా ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం 52,96,741 జనాభాతో ఇది రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన జిల్లాగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, తమిళనాడు గవర్నరుగా పనిచేసిన మర్రి చెన్నారెడ్డి, తెలంగాణ పితామహుడిగా పేరుగాంచి, ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన కొండా వెంకట రంగారెడ్డి, దేశంలోనే తొలి మహిళా హోంశాఖ మంత్రిగా పనిచేసిన సబితా ఇంద్రారెడ్డి, విమోచనోద్యమకారులు కాటం లక్ష్మీనారాయణ, వెదిరె రాంచంద్రారెడ్డి, గంగారాం ఆర్య, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఈ జిల్లాకు చెందినవారే. శ్రీరామునిచే ప్రతిష్టించబడిన కీసర లింగేశ్వరాలయం, అనంతగిరి, చిలుకూరు బాలాజీ, కీసర లాంటి పుణ్యక్షేత్రాలు, షాబాద్ నాపరాతికి, సిమెంటు కర్మాగారాలకు మరియు కందులకు ప్రఖ్యాతిగాంచిన తాండూరు ఈ జిల్లాలోనివే. జిల్లాలో 37 మండలాలు, 3 రెవెన్యూ డివిజన్లు, 2 లోకసభ నియోజకవర్గాలు ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాదుకు చెందిన 150 డివిజన్లలో 48 డివిజన్లు రంగారెడ్డి జిల్లాకు చెందినవి. ఈ జిల్లాలో ప్రవహించే ప్రధాన నది మూసీ.

(ఇంకా…)

35వ వారం

కాణిపాకం

కాణిపాకం ఆంధ్ర ప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా ఐరాల మండలానికి చెందిన గ్రామము. ఈ పుణ్యక్షేత్రం బహుదా నది ఉత్తరపు ఒడ్డున, తిరుపతి-బెంగళూరు జాతీయ రహదారిపై, చిత్తూరు నుండి 12 కి.మీ. దూరంలో ఉన్నది. కాణిపాకంలో అనేక ప్రాచీన ఆలయాలున్నాయి. ఇక్కడ జనమేజయుడు కట్టించాడని అనుకునే ఒక పాత దేవాలయము ఉన్నది. మణికంఠేశ్వర స్వామి ఆలయాన్ని చోళ రాజైన రాజరాజేంద్ర చోళుడు కట్టించాడు. ఈ ఆలయంలోని అద్భుతమైన శిల్పసంపద చోళ విశ్వకర్మ శిల్పిశైలికి తార్కాణంగా పేర్కొనబడుతుంది. ఇటీవల కాలంలో వరసిద్ధి వినాయకుని ఆలయం ప్రశస్తి పొందింది. ఈ పుణ్యక్షేత్రం తిరుపతి-బెంగళూరు జాతీయ రహదారిపై చిత్తూరు నుండి 12 కి.మీ. దూరంలో ఉన్నది. పూర్వం మూగ, గుడ్డి, చెవిటి అన్నదమ్ములకు కలిసి ఒక కాణి మడి ఉన్నది. వారు ఆ మడిని బావినీటి సరఫరాతో వ్యవసాయం చేసేవారు. ఒకసారి తీవ్రమన కరువు కారణంగా బావి ఎండిపోవడంతో వారు బావిని మరికొంత లోతు త్రవ్వుతున్న సనయంలో గునపానికి ఒకరాయి తగిలి అందులో నుండి రక్తం పైకి ఎగజిమ్మ అన్నదమ్ముల మిద పడగానే వారి అవకర్యాలు పోయి వారు ముగ్గురూ స్వస్థులైయ్యారు. వారు ఆనందంగా ఈ విషయం ఊరి వారికి తెలియజేయగా అనదరూ కలిసి అక్కడ వినాయకుని విగ్రహం ఉన్నదని తెఉసుకుని దానిని బయటకు తీసి అక్కడ ఆలయనిర్మాణం చేసి ఆరాధనలు ప్రారంభించారు. కాణి మడిలో లభించిన వినాయకుడు కనుక ఈ క్షేత్రం కాణిపాకంగా ప్రసిద్ధిచెందినది. ఈ ఆలయంలో అసత్యం పలికితే వినాయకుడు దండనకు గురిఔతారని విశ్వసించబడుతుంది. అందువలన ఇక్కడ భక్తులు అసత్యం చెప్పరు.


(ఇంకా…)

36వ వారం

చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి

చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి అవధాన విద్యకు రూపురేకలు తీర్చిదిద్ది, వన్నెవాసి సమకూర్చిన తిరుపతి వేంకట కవులలో ఒకరు. దివాకర్ల తిరుపతిశాస్త్రితో జంటగానూ, ఆయన మరణానంతరం విడిగానూ ఎన్నో పద్యనాటకాలు, కావ్యాలు, వచన రచనలు రచించారు. చెళ్లపిళ్ల తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేశారు. ఆయన శిష్యులుగా చదువుకున్నవారు చాలామంది ఆ తర్వాతి కాలంలో తెలుగు సాహిత్యరంగంలో, భాషాశాస్త్రంలోనూ కవులుగా, పండితులుగా ప్రఖ్యాతి పొందారు. కవనార్థం బుదయించినట్లు చెప్పుకున్న చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి జీవితంలో చాలావరకూ కావ్యరచన, ఆశుకవిత్వం చెప్పడం, నాటకాలు రచించడం, పలువురు సంస్థానాధీశుల సందర్శనాలు, వారి సముఖంలో అవధాన ప్రదర్శనలు, సాహిత్య స్పర్థలు, వివాదాలు వంటి వాటిలోనే గడిచాయి. శత్రువులను, మిత్రులను, శిష్యులను సంపాదించుకున్నా, ఏనుగునెక్కిన గౌరవం, కోర్టు మెట్లెక్కాల్సిన చికాకులు ఎదురైనా అన్నిటికీ సాహిత్యరంగమే మూలం. గురువు చర్ల బ్రహ్మయ్యశాస్త్రి ఆదేశంతో దివాకర్ల తిరుపతిశాస్త్రితో కలిసి అవధానాలు ప్రారంభించారు. 1891లో కాకినాడలో చేసిన శతావధానమే తిరుపతి వేంకటకవులుగా వీరి తొలి ప్రదర్శన. అందులో వారు చెప్పిన పద్యాల్లో వ్యాకరణ దోషాలున్నాయని పెద్ద పండితులు శంకించారు. తిరుపతి వేంకట కవులు కూడా నోరు మెదపకుండా అవి నిజంగా తప్పులే అని అందరికీ అనుమానం వచ్చేటట్టుగా ప్రవర్తించారు. శతావధానం చివరిలో ప్రధానసభకు ముందు జరిగిన ఉపసభలో ఆయా శంకలు అన్నీ వరుసగా చెప్తూ పూర్వ మహాకావ్యాల ప్రయోగాలు ఉదహరించి ఎగరగొట్టారు.

(ఇంకా…)

37వ వారం

హుసేన్ సాగర్

హుస్సేన్ సాగర్‌ హైదరాబాదు నగరపు నడిబొడ్డున ఒక మానవ నిర్మిత సరస్సు. ఈ జలాశయాన్ని 1562లో ఇబ్రహీం కులీ కుతుబ్ షా పాలనా కాలములో హజ్రత్ హుస్సేన్ షా వలీచే నిర్మింపబడింది. 24 చదరపు కిలోమీటర్ల వైశాల్యమున్న ఈ సరస్సు నగరము యొక్క మంచినీటి మరియు సాగునీటి అవసరాలను తీర్చటానికి మూసీ నది యొక్క ఒక చిన్న ఉపనదిపై నిర్మించబడింది. చెరువు మధ్యలో హైదరాబాదు నగర చిహ్నముగా ఒక ఏకశిలా బుద్ధ విగ్రహాన్ని 1992లో స్థాపించారు. దీనికి పక్కన నెక్ లెస్ రోడ్ ఉంది. 1562లో హుస్సేన్ సాగర్ నిర్మాణాన్ని ఇబ్రహీం కులీ కుతుబ్ షా కట్టించినా, దాని నిర్మాణ పర్యవేక్షణ మాత్రం ఇబ్రహీం కులీ అల్లుడు, పౌర నిర్మాణాల సూపరిండెంటైన హుస్సేన్ షా వలీ చేపట్టాడు.చెరువు తవ్వకం పూర్తయినా నీరు నిండకపోవటంతో మూసీ నదికి అనుసంధానం చేశారు. 24 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, 32 అడుగుల లోతుతో చెరువు ఉండేది. కుతుబ్ షా ఈ సరస్సుకు ఇబ్రహీం సాగర్ అని పేరుపెట్టాలని అనుకున్నాడు, కానీ హుస్సేన్ వలీ యొక్క ప్రాచ్యుర్యము వలన ప్రజలు ఆయన పేరు మీదుగా హుస్సేన్ సాగర్ చెరువు అని పిలవటం ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న సుల్తాను చెరువులకున్న ప్రజాదరణను గమనించి వెంటనే తన పేరు మీద గోల్కొండకు 16 మైళ్ళ దూరములో ఇబ్రహీంపట్నం చెరువును నిర్మింపజేశాడు.1568లో హుస్సేన్‌ సాగర్‌ చుట్టూ గట్టుగా నిర్మించబడిన రోడ్డును టాంక్ బండ్ అంటారు. ఈ రోడ్డు హైదరాబాదు మరియు సికింద్రాబాదు జంట నగరాలను కలుపుతుంది .


(ఇంకా…)

38వ వారం

బతుకమ్మ

బతుకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్రములో ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. ఈ బతుకమ్మ (గౌరి) పండగ లేదా సద్దుల పండుగ దసరాకి రెండు రోజుల ముందు వస్తుంది. సెప్టంబరు, అక్టోబరు నెలలు తెలంగాణ ప్రజలకు పండుగల నెలలు. ఈ నెలలలో రెండు పెద్ద పండుగలు జరపబడతాయి. ఈ పండుగలకు కనీసం పదిహేను రోజులు అటువైపు, ఇటువైపు అంతా పండుగ సంరంభాలు, కుటుంబ కోలాహలాలు, కలయకలుతో నిండిపోయుంటుంది. ఈ పండుగలలో ఒకటి బతుకమ్మ పండుగ, మరియొకటి దసరా (విజయ దశమి). అయితే బతుకమ్మ పండుగ మాత్రం, తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమయిన పండుగ. తెలంగాణ సాంస్కృతిక ప్రతీక ఈ పండుగ. ఇతర చోట్ల పూలు, నీళ్లతో జరుపుకునే పండుగలు ఎన్ని ఉన్నా, అవి ఏవీ కూడా బతుకమ్మ పండుగతో సరిపోలవు.ఈ పండుగ వర్షాకాలపు చివరిలో, శీతాకాలపు తొలి రోజులలో వస్తుంది. అప్పటికే వర్షాల వలన చెరువలన్నీ మంచి నీటితో నిండి ఉంటాయి. రకరకాల పువ్వులు రంగు రంగులలో ఆరుబయలలో పూసి ఉంటాయి. వీటిలో గునుక పూలు, తంగేడి పూలు బాగా ఎక్కువగా పూస్తాయి. బంతి, చేమంతి, నంది వర్ధనం లాంటి పూలకు కూడా ఇదే సమయం. సీతాఫలాలు (శిల్పక్క పండ్లు అంటారు) కూడా ఈ సమయంలో ఒక పెద్ద ఆకర్షణ.


(ఇంకా…)

39వ వారం

కొమురం భీమ్

కొమురం భీమ్ ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గిరిజనోద్యమ నాయకుడు. పశువుల కాపర్లపై విధించిన సుంకానికి వ్యతిరేకంగా ఉద్యమించి వీరమరణం పొందాడు. కొమురం భీమ్ గిరిజన గోండు తెగకు చెందిన కొమురం చిన్నూమ్ సోంబాయి దంపతులకు 1900 సంవత్సరంలో ఆదిలాబాద్ జిల్లా, ఆసిఫాబాద్ తాలూకా లోని సంకేపల్లి గ్రామం లో జన్మించాడు. భీం కుటుంబం పదిహేడేళ్ళ వయసులో అటవీశాఖ సిబ్బంది జరిపిన దాడిలో తండ్రి మరణించగా కరిమెర ప్రాంతంలోని సర్దాపూర్ కు వలస వెళ్లింది. అక్కడ వాళ్ళు సాగుచేసుకుంటున్న భూమిని సిద్దిఖీ అన్న జమీందారు ఆక్రమించుకోవడంతో ఆవేశం పట్టలేని భీమ్ అతన్ని హతమార్చి అస్సాం వెళ్ళిపోయాడు. అక్కడ ఐదేళ్ళపాటు కాఫీ, తేయాకు తోటల్లో పనిచేస్తూ గడిపిన భీమ్ తిరిగి కరిమెర చేరుకున్నాడు. నిజాం నవాబు పశువుల కాపర్లపై విధించిన సుంకానికి వ్యతిరేకంగా గిరిజనులను ఒక్కతాటిపై నడిపించి ఉద్యమించాడు. ఆసిఫాబాద్ పరిసర ప్రాంతాలు మరియు జోడేఘాట్ గుట్టలు కేంద్రంగా నిజాం నవాబు పై గెరిల్లా పోరాటాన్ని కొనసాగించాడు. కుర్దు పటేల్ అనే నమ్మకద్రోహి ఇచ్చిన సమాచారంతో నిజాం సైన్యం 1940 సెప్టెంబర్ 1 న జోడేఘాట్ అడవుల్లోని కొమురం భీమ్ స్థావరాన్ని ముట్టడించి భీమ్ ని హతమార్చాయి. అది గిరిజనులు పవిత్రంగా భావించే ఆశ్వీయుజ శుద్ద పౌర్ణమి కావడంతో అప్పటి నుండి ఆ తిధి రోజునే ఆదివాసీలు కొమురం భీమ్ వర్ధంతిని జరుపుకొంటూ వస్తున్నారు.



(ఇంకా…)

40వ వారం
జాషువా

ఆధునిక తెలుగు కవుల్లో ప్రముఖ స్థానం పొందిన కవి గుర్రం జాషువా (1895 - 1971). సమకాలీన కవిత్వ ఒరవడియైన భావ కవిత్వ రీతి నుండి పక్కకు జరిగి, సామాజిక ప్రయోజనం ఆశించి రచనలు చేసాడు. తక్కువ కులంగా భావించబడ్డ కులంలో జన్మించి, ఆ కారణంగా అనేక అవమానాలు ఎదుర్కొన్నాడు. అయితే కవిత్వాన్ని ఆయుధంగా చేసుకుని ఈ మూఢాచారాలపై తిరగబడ్డాడు జాషువా; ఛీత్కారాలు ఎదురైన చోటే సత్కారాలు పొందాడు. జాషువా 1895 సెప్టెంబర్ 28 న వీరయ్య, లింగమ్మ దంపతులకు ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు జిల్లా వినుకొండ లో జన్మించాడు.యాదవ తల్లిదండ్రులు వేరువేరు కులాలకు చెందిన వారు. తండ్రి యాదవ, తల్లి మాదిగ, ఈ ఒక్క విషయం చాలు, మూఢాచారాలతో నిండిన సమాజంలో అవమానాలు, ఛీత్కారాలు ఎదుర్కోడానికి. బాల్యం వినుకొండ గ్రామంలో పచ్చని పొలాల మధ్య హాయిగానే సాగింది. చదువుకోడానికి బడిలో చేరిన తరువాత జాషువాకు కష్టాలు మొదలయ్యాయి. ఉపాధ్యాయులు, తోటి పిల్లల నుండి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు.అయితే జాషువా ఊరుకొనేవాడు కాదు, తిరగబడేవాడు. అగ్రవర్ణాల పిల్లలు కులం పేరుతో హేళన చేస్తే, తిరగబడి వాళ్ళను కొట్టాడు. 1910లో మేరీని పెళ్ళి చేసుకున్నాడు. మిషనరీ పాఠశాలలో నెలకు మూడు రూపాయల జీతంపై ఉద్యోగం చేసేవాడు. ఆ ఉద్యోగం పోవడంతో రాజమండ్రి వెళ్ళి 1915-16 లలో అక్కడ సినిమా వాచకుడిగా పనిచేసాడు. టాకీ సినిమాలు లేని ఆ రోజుల్లో తెరపై జరుగుతున్న కథకు అనుగుణంగా నేపథ్యంలో కథను, సంభాషణలను చదువుతూ పోవడమే ఈ పని. జాషువ చాల గొప్ప వక్త.

(ఇంకా…)

41వ వారం

వేప నూనె

వేప నూనెను వేప గింజల నుండి తీస్తారు. ఇది శాక తైలం. వంటనూనె కాదు. దీన్ని పారిశ్రామికంగా వినియోగిస్తారు. వేపచెట్టు మెలియేసి కుటుంబానికి చెందినది. వృక్షశాస్త్ర నామం:అజాడిరక్టా ఇండికా.ఈ చెట్టు పుట్టుక స్థానం భారతదేశం.వేప ఉష్ణ మండలప్రాంతంలో పెరుగే సతతహరిత వృక్షం. వేపను నాలుగు వేల సంవత్సరాల నుండి ఆయూర్వేద వైద్య ప్రక్రియలో ఉపయోగిస్తున్నారు. వేపచెట్టు బెరడు,ఆకులు,వేరు ఓషధి గుణాలను పుష్కలంగా కలిగివున్నాయి. దీని పూలు చిన్నవిగా,తెల్లగా,గుత్తులుగా పూస్తాయి. పూత సమయం జనవరి నుండి ఏప్రిల్ నెల వరకు ఉంటుంది. ఎదిగినచెట్టు నుండి ఏడాదికి 50-60 కే.జీ.ల వేపపండ్లు లభిస్తాయి. మూడు-నాలుగు సంవత్సరాలకే పుష్పించడం మొదలైనప్పటికి, పళ్లదిగుబడి ఏడవ సంవత్సరం మొదలవుతుంది. వేపకాయలు మే-ఆగస్టు కల్లా పక్వానికి వస్తాయి. పండులో విత్తనశాతం 4:1 నిష్పత్తిలో వుంటుంది. ఎండిన వేప పండులో నూనె 20-22 ఉంటుంది. ఎండినపండు లో పిక్క 23-25శాతం, పిక్క లో నూనె 45శాతం ఉంటుంది. పండు పైపొర 4.5 శాతం, గుజ్జు 40 శాతం, గింజపెంకు 15-20 శాతం వరకు ఉంటుంది. వేపనూనెలో 'అజాడిరక్టిన్‌' అనే ట్రిటెరిపెంటెన్ 0.03-0.25 శాతం (32-2500 ppm) ఉంటుంది . పళ్ళు దీర్ఘ అండాకారంలో 1-2 సెం.మీ. పొడవు ఉంటాయి. కాయలు ఆకుపచ్చగా, పండిన తరువాత పసుపురంగులో ఉండి, చిరుచేదుతో కూడిన తియ్యదనం కల్గి ఉంటాయి. వేపగింజలోని విత్తనం గోధుమ రంగులో ఉంటుంది.


(ఇంకా…)

42వ వారం

పెళ్ళి

పెళ్ళి లేదా వివాహం అనగా సమాజంలో ఇద్దరు భాగస్వామ్యుల మధ్య హక్కులు, బాద్యతలను స్థాపించే ఒక చట్టబద్ధమైన ఒప్పందం. వివాహం నిర్వచనం వివిధ సంస్కృతులు ప్రకారం మారుతుంది, కానీ ప్రధానంగా వ్యక్తుల మధ్య సంబంధాలలో, సాధారణంగా సన్నిహిత మరియు లైంగిక సంబంధాలలో సంతరించుకున్న వ్యవస్థ. కొన్ని సంస్కృతులలో వివాహం ఒక సిపార్సు లేదా ఇద్దరు భాగస్వామ్యుల మధ్య లైంగిక సంబంధానికి ముందు తప్పనిసరిగా చేసుకొనే ఒప్పందం. విస్తారంగా వివరించుటకు వివాహం అనేది ఒక సాంస్కృతికంగా సార్వజనీనమైన కార్యం. హిందూ వివాహం ఒక పవిత్ర కార్యము అని గతంలో గుర్తింపు నివ్వడం జరిగినది. అయితే 1956 లో హిందూ వివాహ చట్టం రూపొందించిన తరువాత, వివాహానికి ఒక ప్రత్యేకమైన ప్రక్రియ గానీ, విధానంగానీ చెప్పబడలేదు. అంతే కాక హిందూ మత ఆచారానికి గుర్తింపునివ్వబడింది. హిందూ మతంలో ఉన్న విభిన్న సామాజిక వర్గాలు వేరువేరు వివాహ పద్ధతులను ఆచరించడాం జరుగుతుంది. హిందూ వివాహపు సరైన గుర్తింపు కోసం మతాచారాలను పాటించడం ప్రధానం. హిందూ వివాహం చెల్లుబాటు అగుటకు ఈ క్రిందినుదహరించిన పద్ధతులు పాటించాలి.ఆంధ్రప్రదేశ్ లో అన్ని వివాహాలను తప్పనిసరిగా నమోదు చేయాలని ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 35, మహిళా అభివృద్ధి, బాలలు మరియు వికలాంగుల సంక్షేమ విభాగం తేది.24.09.2003 ద్వారా నిర్దేశించింది.

(ఇంకా…)

43వ వారం

గుంటుపల్లి

గుంటుపల్లె లేదా గుంటుపల్లి, పశ్చిమ గోదావరి జిల్లా, కామవరపుకోట మండలానికి చెందిన గ్రామము. పురాతనమైన బౌద్ధరామ స్థానంగా ఈ గ్రామము చారిత్రకంగా ప్రసిద్ది చెందినది. జీలకర్రగూడెం గుంటుపల్లి గ్రామాలు ఒకే పంచాయితీ పరిధిలో ఉన్నాయి.ఈ బౌద్ద గుహలు గుంటుపల్లి గుహలుగా ప్రసిద్దికెక్కినా అవి నిజానికి జీలకర్రగూడెం ఊర్ని ఆనుకొనే ఉన్నాయి. గుంటుపల్లి నుండి దాదాపు మూడు కీలో మీటర్లు వెళితే కాని జీలకర్రగూడెం రాదు జీలకర్ర గూడెం మీదుగానే కొండ పైకి మార్గం కలదు. ఎర్రమట్టి కలిగిన కొండల అంచున ఉన్న ఈ గ్రామాలలో వ్యవసాయం ప్రధానంగా మెరక తోటల పెంపకం - టేకు, కొబ్బరి, పామాయిల్, మామిడి, సపోటా, జీడిమామిడి అధికంగా జరుగుతున్నది. చెరువు క్రింద వరి వ్యవసాయం సాగుతుంది.ఆంధ్ర దేశంలో బుద్ధుని కాలంనుండి బౌద్ధమతం జనప్రియమైన జీవనవిధానంగా విలసిల్లింది. ఆంధ్ర దేశంలో బయల్పడిన అనేక బౌద్ధ నిర్మాణ శిథిలావశేషాలు బౌద్ధమత చరిత్రలో ఆంధ్రుల విశిష్ట స్థానానికి నిదర్శనాలు. ఇటువంటి క్షేత్రాలలో బహుశా భట్టిప్రోలు అన్నింటికంటే ప్రాచీనమైనది.గుంటుపల్లి కూడా షుమారు అదే కాలానికి చెందినది. గుంటుపల్లిని ఇటీవలి వరకు బౌద్ధ క్షేత్రంగానే భావించారు. కానీ ఇటీవల లభ్యమైన మహామేఘవాహన సిరిసదా శాసనము, ఖారవేలుని శాసనాల వలన ఇక్కడ జైనమతం కూడా విలసిల్లిందని నిరూపితమౌతున్నది.

(ఇంకా…)

44వ వారం
దస్త్రం:Jayashankar.jpg
కొత్తపల్లి జయశంకర్

తెలంగాణ సిద్ధాంతకర్తగా పేరుపొందిన ప్రొఫెసర్‌ కొత్తపల్లి జయశంకర్ ఆగష్టు 6, 1934న వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేటలో జన్మించారు. తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో మంచి ప్రావీణ్యం ఉన్న జయశంకర్ తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేసి ఆజన్మ బ్రహ్మచారిగా జీవించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఆర్థికశాస్త్రంలో పీహెచ్‌డి పట్టా పొంది, ప్రిన్సిపాల్‌గా, రిజిష్ట్రార్‌గా పనిచేసి కాకతీయ విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ వరకు ఉన్నత పదవులు నిర్వహించారు. 1969 తెలంగాణ ఉద్యమంలోనూ, అంతకు ముందు నాన్ ముల్కీ ఉద్యమంలో, సాంబార్- ఇడ్లీ గోబ్యాక్ ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టి ఏర్పాటులో కె.చంద్రశేఖరరావుకు సలహాదారుగా, మార్గదర్శిగా వెన్నంటి నిలిచారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై పలు పుస్తకాలు రచించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కళ్ళారా చూడాలని తరుచుగా చెప్పే జయశంకర్ 2011, జూన్ 21న ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ముందే మరణించారు.


(ఇంకా…)

45వ వారం

కూబర్‌ పెడీ

ప్రపంచంలోనే భూగర్భంలో ఏర్పడిన ఏకైక పట్టణంగా పేరుతెచ్చుకున్న దాని పేరు 'కూబర్‌ పెడీ'. దీన్ని చూడాలంటే ఆస్ట్రేలియా వెళ్లాలి.ఈ నేలకింది పట్టణంలో ఇప్పుడు ఇళ్లు, హోటళ్లు, దుకాణాలు అన్నీ ఉన్నాయి. సుమారు 3000 మంది ఇక్కడ ఉంటున్నారు. రోడ్లు, ప్రార్థనాలయాలు, పాఠశాలలు, ఈతకొలనులు, గ్రంథాలయాలు కూడా ఇక్కడ కనిపిస్తాయి. ఆస్ట్రేలియాలో అడిలైడ్‌కి దగ్గర్లో ఎడారి నేలల కింద ఏర్పడిన ఈ పట్టణాన్ని చూడ్డానికి దేశదేశాల నుంచి వేలాది మంది పర్యాటకులు వస్తుంటారు. కూబర్ పెడీ నగరం దక్షిణ ఆస్ట్రేలియా లోని నగరం. యిది స్టువర్ట్ హైవే లో గల అడిలైట్ నుండి ఉత్తరగా 846 కి.మీ ల దూరంలో గల నగరం. 2011 జనాభా ప్రకారం ఈ నగర జనాభా 1,695 (953 పురుషులు,742 స్త్రీలు మరియు 275 ఇండిజెనస్ ఆస్ట్రేలియన్లతో కలిపి) ఈ నగరాన్ని ప్రపంచ స్ఫటిక రాజధాని గా పిలుస్తారు. ఎందుకంటే ఈ ప్రాంతంలో విలువైన స్ఫటికాల గనులు ఎక్కువగా ఉన్నాయి. ఈ నగరం "నేల క్రింది నగరం" గా కూడా పిలువబడుతుంది. ఈ నగరాన్ని నేలక్రింద నిర్మించారు. దీనికి కారణం దహించే పగటి ఉష్ణం నుండి రక్షించుకొనుటకు కొరకు.కూబర్ పెడీ అనే పదం ‘కుప-పిటి’ అనే మాట నుంచి వచ్చింది. అంటే ‘వైట్‌మ్యాన్స్ హోల్’, ‘వాటర్ హోల్’ అనే అర్థాలున్నాయి.

(ఇంకా…)

46వ వారం

ధర్మస్థల

ధర్మస్థల లేదా ధర్మస్థళ హిందువుల పవిత్రక్షేత్రం. ఈ నగరం కర్ణాటక రాష్ట్రంలో దక్షిణ కన్నడ జిల్లాలో బెల్తాంగడి తాలూకాలో నేత్రావతి నదీతీరంలో ఉంది. గ్రామపంచాయితీ మండలంలో ఉన్న ఒకే ఒక పంచాయితీ ధర్మస్థల. ఈ గ్రామం లో ప్రసిద్ధి చెందిన ధర్మస్థల ఆలయం ఉంది. ఈ ఆలయంలోశివుడు, మంజునాధుడు, అమ్మనవరు, చంద్రనాథ్ మరియు కళారాలు అనే ధర్మదైవాలు(ధర్మరక్షణ దైవాలు) , కుమారస్వామి మరియు కన్యాకుమారి మొదలైన దైవాల సన్నిధులు ఉన్నాయి. అసాధారణంగా ఈ ఆలయనిర్వహణ జైన్ మతస్థుల ఆధ్వర్యంలో పూజాదికాలు హిందూ పూజారులచేత నిర్వహించబడుతూ ఉన్నాయి. నవంబర్ మరియు డిసెంబర్ మాసాల మద్య నిర్వహించబడే లక్షదీపాల ఉత్సవం ఈ ఆలయ ప్రత్యేకత. ఆలయయం సందర్శించే భక్తులసంఖ్య ఒకరోజుకు దాదాపు 10,000. ఆలయంలోని యాంత్రికమైన ఆధునిక వంటశాలలో ఆలయసందర్శనానికి వచ్చే భక్తులందరికీ వంటలు తయారుచేసి భక్తులకు రోజూ ఉచితంగా అన్నప్రసాదం వడ్డిస్తారు. ఆలయదర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్ధం ఆధునిక సౌకర్యాలున్న అతిధిగృహ సౌకర్యం కూడా లభిస్తుంది. ధర్మస్థల మతసహనానికి ప్రతీక. ఈ ఆలయంలో జైనతీర్ధంకరుల సేవలను ధర్మదేవతలతో మంజునాధుడు కూడా అందుకుంటున్నాడు. ఇక్కడ పూజారులు వైష్ణవబ్రాహ్మణులు. ఆలయ ధర్మకర్త హెగ్డే. ఆలయానికి చెందిన ఆశ్రమాలలో నివసిస్తున్న వారికి ఉచితభోజనం, మరియు ఉచిత బస లభిస్తుంది.


(ఇంకా…)

47వ వారం
తెలంగాణ విమోచనోద్యమం
నిజాం సంస్థానం

హైదరాబాద్ సంస్థానాధీశుడు ఏడవ నిజాం నవాబు ఉస్మాన్ ఆలీ ఖాన్ నుంచి విముక్తి కోసం హైదరాబాదు సంస్థాన ప్రజలు 1946 నుంచి 1948 మధ్య చేసిన వీరోచిత పోరాటమేతెలంగాణ విమోచనోద్యమం. రెండు వందల సంవత్సరాల దోపిడి, అణిచివేతకు తిరుగుబాటు, సాయుధపోరాటం ఒక దశ మాత్రమే. హైదరాబాద్ సంస్థానంలో ప్రస్తుత తెలంగాణాతో పాటు మరాఠ్వాడ (మహారాష్ట్ర), బీదర్ (కర్ణాటక) ప్రాంతాలు ఉండేవి. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిననూ నిజాం సంస్థానంలోని ప్రజలకు మాత్రం స్వాతంత్ర్యం లేకపోవడాన్ని ఇక్కడి ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. దేశమంతటా స్వాతంత్ర్యోత్సవాలతో ప్రజలు ఆనందంతో గడుపుచుండగా నిజాం సంస్థాన ప్రజలు మాత్రం నిరంకుశ బానిసత్వంలో కూరుకుపోయారు. హైదరాబాదు రాజ్యాన్ని పాలిస్తున్న ఏడవ నిజామ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ రాజ్యాన్ని సొంతం చేసుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తూ రజాకార్లను ఉసిగొల్పాడు. నిజాంకు అండగా ఖాసిం రజ్వీ నేతృత్వంలోని రజాకార్లు గ్రామాలపైబడి దోపిడిచేయడం, ఇండ్లు తగలబెట్టడం హీనమైన బతుకులు వెళ్ళదీస్తున్న జనం గురించి అస్సలు పట్టించుకోకుండా ప్రజల నుండి బలవంతంగా వసూలుచేసుకున్న సొమ్ముతో విలాసాలు, జల్సాలు, భోగభాగ్యాలు చేసుకొనేవారు. దీనితో రామానందతీర్థ నేతృత్వంలో ఆర్యసమాజ్ ఉద్యమాలు, కమ్యూనిష్టుల ఆధ్వర్యంలో సాయుధపోరాటాలు ఉధృతమయ్యాయి. మొదట నల్గొండ జిల్లాలో ప్రారంభమైన ఉద్యమం శరవేగంగా నైజాం సంస్థానం అంతటా విస్తరించింది. రావి నారాయణరెడ్డి, చండ్ర రాజేశ్వరరావు, మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమలాదేవి, బొమ్మగాని ధర్మభిక్షం, మాడపాటి హనుమంతరావు, దాశరథి రంగాచార్య, కాళోజి నారాయణరావు, షోయబుల్లాఖాన్, సురవరం ప్రతాపరెడ్డి తదితర తెలంగాణ సాయుధ పోరాటయోధులు వారికి స్పూర్తినిచ్చే కవులు, రచయితలు మూలంగా 1948లో ఉధృతరూపం దాల్చి చివరికి భారత ప్రభుత్వం సైనిక చర్యతో నైజాం సంస్థానాన్ని సెప్టెంబర్ 18, 1948న భారత్ యూనియన్‌లో విలీనం చేసుకుంది.


(ఇంకా…)

48వ వారం
దస్త్రం:Sahasrarjun Image.jpg

క్షత్రియులు

క్షత్రియులు అనునది హిందూ మతములోని పురాణాల ప్రకారం చతుర్వర్ణాలలో రెండవది క్షత్రియ వర్ణం. "క్షత్రాత్ త్రాయత ఇతి క్షత్రః, తస్య అపత్యం పుమాన్ క్షత్రియః" - అనగా ప్రజలను సమస్త దుష్టత్వం నుండి రక్షించి పరిపాలించువాడు క్షత్రియుడు. వర్ణాశ్రమ ధర్మం ప్రకారం క్షత్రియులు యుద్ధ వీరులు, సామ్రాజ్యాలు పరిపాలించవలసినవారు. భారతీయ మత గ్రంధాలల్లో పేర్కొనబడిన శ్రీ కృష్ణుడు, శ్రీ రాముడు, గౌతమ బుద్ధుడు, వర్ధమాన మహావీరుడు వంటి ఎందరో దైవస్వరూపులు క్షత్రియులు గా జన్మించారు. వట వృక్షము (మర్రి చెట్టు), దండము మరియు రెండు ఖడ్గాలతో కూడిన డాలు క్షత్రియుల చిహ్నాలుగా నిలుస్తాయి. క్షత్రియుడు అనే పదానికి స్త్రీ లింగము - క్షత్రియాణి. ఆదిలో క్షత్రియులు అనునది ఆర్యుల తెగల్లో ఒక చీలికగాయున్నది. ఆర్యుల సమాజం వృత్తిని బట్టి కులవిభజన జరిగినప్పటికీ, తరువాత కాలంలో గుణమును బట్టి, మధ్యయుగంలో జన్మను బట్టి క్షత్రియ అనే పదము భావించబడినది. క్షత్రియ సామ్రాజ్యాల పతనానంతరం కాలక్రమేణా మధ్య యుగంలో ఆయా వంశస్తులు కులాలుగా ఏర్పడ్డారు. సప్త ఋషులు (లేక వారి ప్రవరలు) మూలపురుషులుగా ఉండి, క్షత్రియ ధర్మంతో పాటూ వైదిక ధర్మాలు ఆచరించిన కులాలు మాత్రం వైదిక క్షత్రియ కులాలుగా రూపాంతరం చెందాయి. నేడు స్వతంత్ర భారత దేశంలో అనేక క్షత్రియ కులాలు గుర్తింపబడ్డాయి. ప్రస్తుతానికి వివిధ రాష్ట్రాల్లో వైదిక క్షత్రియులు ఈ క్రింది విధాలుగా పిలువబడుచున్నారు.

(ఇంకా…)

49వ వారం

పల్లెల్లో వ్యవసాయ విధానాలు

ఒక నిర్ధిష్టమైన పద్ధతిలో మొక్కలను, జంతువులను పెంచి, పోషించి తద్వారా ఆహారాన్ని, మేత, నార మరియు ఇంధనాన్ని ఉత్పత్తి చేయటాన్ని వ్యవసాయం లేదా కృషి అంటారు. వ్యవసాయం యొక్క చరిత్ర మానవ చరిత్రలో అతి పెద్ద అంశము. ప్రపంచవ్యాప్త సామాజిక ఆర్ధిక ప్రగతిలో వ్యవసాయభివృద్ధి ఒక కీలకాంశము. వేటాడటం ద్వారా ఆహార సముపార్జన చేసుకొనే స్థితిలో ఉన్న సంస్కృతులలో కనిపించని సంపద సమకూర్చుకోవటం మరియు సైనిక కలాపాలవంటి ప్రత్యేకతలు వ్యవసాయం అభివృద్ధి చెందటంతోనే ప్రారంభమయ్యాయి. సమాజంలోని కొందరు రైతులు తమ కుటుంబ ఆహార అవసరాలకు మించి పండిచటం ప్రారంభించడంతో తెగ/జాతి/రాజ్యంలోని మిగిలిన వ్యక్తులకు ఇతర వ్యాపకాలను పోషించే వెసలుబాటునిచ్చింది. ఈ వ్యవసాయం చేయుటకు రైతులు వివిధ విధానాలను ప్రాంతాలవారీగా అనుసరిస్తారు. గతంలో అనగా సుమారు యాభై సంవత్సరాల క్రితం రాయల సీమ ప్రాంత పల్లె ప్రజలు అనగా రైతులు వారి వ్వవసాయ నీటి అవసరాలకు కాలువలు, చెరువులు, బావులు, కసిం కాలువలు, బోరు బావులు, కుంటలు, వాగులు, వంకలు, వంటి జల వనరులు పై ఆధార పడే వారు.. రైతులు కొన్ని ప్రాంతాలలో నీటి వసతి కొరకు చెరువులు, బావులు పైనే ఆధార పడి వుండే వారు. వర్షాకాలంలో చెరువులు నిండితే ఆరు నెలల వరకు నీళ్లు వుండేవి. చిన్న చిన్న వంకలు వాగులు వున్నాయి.

(ఇంకా…)

50వ వారం

నిడదవోలు

నిడదవోలు పట్టణం,మండలం పశ్చిమగోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలదు. నిడదవోలును పూర్వము నిరవద్యపురము అని పిలిచేవారు. 14వ శతాబ్దములో అనవోతారెడ్డి జయించేవరకు నిడదవోలును వేంగి చాళుక్యులు పరిపాలించేవారు. అనవోతారెడ్డి తరువాత ఆయన సోదరుడు అనవేమారెడ్డి నిడదవోలును తన రాజధానిగా చేసుకొని పరిపాలించినాడు. రాష్ట్రకూటులతొ జరిగిన యుద్ధములో రెండవ చాళుక్య భీముడు యీ నగరములోనే విజయసారధి గా పేరుపొందినాడు. తూర్పు చాళుక్య కాకతీయ "నిరవద్య పుర" సంక్షిప్త చరిత్ర ఇదే నేటి నిడదవోలు . మన నిడదవోలు చారిత్రక ప్రసిద్ధిగల నగరం.చాళుక్య పరిపాలనతో ఇది "నిరవద్య పురము "గా ఖ్యాతి గాంచిన జలదుర్గం. దీనినే కేంద్రముగా చేసుకొని అనేకమంది చాళుక్యరాజులు తమ రాజ్యాన్ని విస్తరింప చేసారు. విష్ణుకుండినుల వేంగిని చాళుక్య రెండవ పులకేసి ధ్వంసం చేసి తమ్మునికి కృష్ణ గోదావరి మధ్య ప్రాంతం అప్పగించాడు. ఆ కుబ్జవిష్ణువర్ధనుడే తూర్పు చాళుక్య మూలపురుషుడు. వారికి ప్రధాన జలదుర్గం నిరవద్యపురం. మెకంజీదొర కైఫియతును బట్టి నిడదవోలు చాలా ప్రాచీన నగరము. ఇంత ప్రాచీన నగరాలు దేశంలో అక్కడక్కడ మాత్రమే ఉన్నాయి.

(ఇంకా…)

51వ వారం

అసిటిలిన్

అసిటిలిన్ వాయువును ఎసిటెలిన్,అసిటిలీన్ అని స్వల్ప ఉచ్ఛరణ భేదంతో పిలుస్తుంటారు. అసిటిలిన్/ఎసిటిలీన్ కర్బన ఉదజని సమ్మేళనం వలన ఏర్పడిన వాయువు. ఇది ఒక హైడ్రోకార్బన్. చాలా త్వరగా, త్రీవంగా మండే గుణమున్నది. అందుచే అసిటిలిన్ వాయువును ఎక్కువగా ఇంధనంగా వినియోగిస్తారు ఇది కర్బన రసాయన శాస్త్రంలో ఆల్కైన్ సమూహం కు చెందినది. అసిటిలిన్ శాస్త్రియ పేరు ఈథైన్ మరియు కొన్ని రకాల రసాయన పదార్థాలను తయారు చేయుటకు కూడా వాడెదరు. స్వఛ్ఛమైన అసిటిలిన్ వాయువునకు వాసన లేదు. అయితే వ్యాపారత్మకంగా కాల్సియం కార్బైడ్ నుండి ఉత్పత్తి చేసె వాయువులో జనక పదార్థాలలో భాస్వరం వంటి మలినాలు వుండటం వలన ఘటైన వెల్లుల్లి వాసన వస్తుంది. అసిటిలిన్ ను మొదటగా ఎడ్మండ్ డేవి మొదటగా క్రీ.శ.1836లో గుర్తించాడు. ఆయన దాన్నిని న్యూ కార్బోరేట్ ఆఫ్ హైడ్రోజను అని పేర్కొన్నాడు. క్రీ.శ.1860 మరల దీనిని ఫ్రెంచి రసాయన శాస్త్రవేత్త మర్సెల్లి బెర్తెలెట్ కనుగొనటం జరిగినది ఆయనే ఈ వాయువునకు అసిటిలిన్ అనే పేరును నిర్ణయించాడు. అసిటిలిన్ వాయువునకు స్థిరత్వం తక్కువ కావున అసిటిలిన్ ను ఒక ప్రాంతం నుండిమరో ప్రాంతంకు రవాణా చెయ్యడం అసాధ్యంగా వుండేది. క్రీ.శ.1896 లో ఫ్రెంచి దేశానికి చెందిన శాస్త్రవేత్తలు క్లాడ్ మరియు హెస్ లు అసిటోన్ వాయువును సిలెండరులలో నిల్వవుంచి, రవాణా చెయ్యు పద్ధతిని కనుగొన్నారు.


(ఇంకా…)

52వ వారం

శారదా దేవి

శారదా దేవి ప్రసిద్ధ ఆధ్యాత్మిక గురువు రామకృష్ణ పరమహంస భార్య. యోగిని. శారదా మాతగా ప్రసిద్ధి. శారదాదేవి జన్మనామం శారదమణి ముఖోపాధ్యాయ. ఈవిడ భారతీయ ఆధ్యాత్మిక వారసత్వంలో బహుముఖ్యులైన శ్రీరామకృష్ణ పరమహంస సతీమణి. రామకృష్ణ సాంప్రదాయ అనుయాయులు శారదాదేవి ని శారదామాయి/శారదమాత/శ్రీ మా/హోలీ మదర్ అని పలుతీర్లుగా సంబోధిస్తారు. శారదాదేవి రామకృష్ణ బోధలు భావితరాలకు అందించడంలో, రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ లు విస్తరించడంలో ముఖ్యపాత్ర పోషించారు.శారదాదేవి జయరాంబాటిలో జన్మించారు. ఐదేళ్ళ బాల్యప్రాయంలో ఆవిడ వివాహం రామకృష్ణులతో జరిగింది. కాని కిశోరప్రాయం వరకూ రామకృష్ణులుండే దక్షిణేశ్వర్ కు వెళ్ళలేదు. రామకృష్ణ శిష్యులు పేర్కొన్న ప్రకారం, ఈ దంపతులిరువురూ జీవించినంతకాలం సన్యాసులవలే కఠోరబ్రహ్మచర్యం అవలంబించారు. రామకృష్ణుల మరణం తర్వాత ఈమె కొన్నాళ్ళు ఉత్తరభారతంలో తీర్థయాత్రలు చేసి, కొన్నాళ్ళు జయరాంబాటిలో, కొన్నాళ్ళు కలకత్తాలోని ఉద్బోధన్ కార్యాలయంలో ఉంటుండేవారు. రామకృష్ణులశిష్యులందరూ ఆమెను కన్నతల్లిలా చూసుకొన్నారు. వారి గురువు మరణం తర్వాత ఎలాంటి అధ్యాత్మిక సలహాలకైనా, సందేహనివృత్తికైనా శారదాదేవి దగ్గరకే వచ్చేవారు. రామకృష్ణ సాంప్రదాయం ఆచరించేవారు ఈవిడను ఆదిశక్తి అవతారంగా భావిస్తారు.


(ఇంకా…)

53వ వారం

క్రైస్తవ మతము

క్రైస్తవ మతం ప్రపంచంలో మానవాళి అత్యధికంగా వెంబడించే మతం అని చెప్పడంలో సందేహం లేదు. ఏసు క్రీస్తు బోధనల ప్రకారం జీవించేవారిని క్రైస్తవులు అని అనడం కద్దు. పరిశుద్ధ గ్రంధము (హోలీ బైబిల్) క్రైస్తవుల పవిత్ర గ్రంధము. ఆర్యుల వేద కాలంలో యూదుల మతము ఆవిర్భవించింది. బైబిలు పాత నిబంధనలో మొదటి ఐదు అధ్యాయాలైన ఆది కాండము, నిర్గమ కాండము, లేవీయకాండము, ద్వితియోపదేశకాండము, సంఖ్యాకాండము వంటి పుస్తకాలు యూదులు కు పవిత్రమైనవి. వీటిని ధర్మశాస్త్ర గ్రంధాలని యూదులు నమ్ముతారు. అయితే కాల క్రమేణా విగ్రహారాధన ఊపందుకొని యూదుల ఆచార వ్యవహారాలు చాలా మార్పులకు లోనయ్యాయి. నేడు హిందువులు తమ దేవతలని సంతృప్తి పరచడం కోసం జంతువులను బలి ఇస్తున్నట్లుగా ఆ కాలంలో యూదులు కూడా పాప పరిహారార్ధ జంతు బలులు అర్పించేవారు , యూదుల ఆచారాలు వెర్రి తలలు వేశాయి. ధనిక - పేద, యజమాని - బానిస వంటి అసమానతలు, వ్యాధి గ్రస్తుల పట్ల చిన్న చూపు, మూడ నమ్మకాలు ఏర్పడ్డాయి. పాత నిబంధనలో భాగమైన యోషయా గ్రంధం 7:14 లో "ఇదిగో ఒక కన్యక గర్భము ధరించి ఒక కుమారుని కనును, ఆయన ఇమ్మనుయేలు అని పిలుచును" అని వ్రాయబడినట్లుగానే , కొన్ని వందల సంవత్సరాల తర్వాత వ్రాయబడిన క్రొత్త నిబంధనలో భాగమైన మత్తయి సువార్త ప్రకారం యూదుల కులంలో కన్య అయిన "మరియ" (మేరీ) కు యేసు క్రీస్తు జన్మించడం జరిగింది.

(ఇంకా…)


ఇవి కూడా చూడండి[మార్చు]