కర్ణ పర్వము ప్రథమాశ్వాసము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


ప్రధమాశ్వాసం[మార్చు]

సంజయుడు రెండు రోజులు యుద్ధరంగమున పర్యటించి యుద్ధ విశేషములు ధృతరాష్ట్రుడికి చెప్పుటకు హస్థినకు వచ్చి ధృతరాష్ట్రుడికి వర్తమానం పంపాడు. ధృతరాష్ట్రుడు వెంటనే సంజయుని లోపలకు రమ్మని చెప్పాడు. సంజయుడు ధృతరాష్ట్రుడితో " మహారాజా ! రెండు రోజుల పాటు యుద్ధరంగమున పర్యటించి యుద్ధమును చూసి వచ్చాను. నేను చూసినది మీకు విన్నవిస్తాను " అన్నాడు.

ధృతరాష్ట్రుడు కర్ణ దుశ్శాసనుల మరణం గురించి వినుట[మార్చు]

సంజయుడు " మహారాజా ! కర్ణుడు అత్యంత పరాక్రమంతో పాండవసేనని చెదరగొట్టాడు. రెండు రోజులు పాండవసేనలను హడలగొట్టి చివరకు అర్జునుడి పరాక్రమానికి తలవంచి అతడి చేతిలో ప్రాణములు విడిచాడు. మదించిన ఆంబోతు పెద్ద పులికి ఆహారమైనట్లు అర్జునుడికి కర్ణుడు బలి అయ్యాడు. పాండవుల పగ చల్లారింది " అని చెప్పి తాను కూడా దుఃఖించాడు. ఒక నిట్టూర్పు విడిచి " మహారాజా ! ఇంకొక విషాద వార్త నీ కుమారుడి ఆశ అడుగంటి పోయేలా భీమసేనుడి చేతిలో దుశ్శాసనుడు హతుడయ్యాడు. భీమసేనుడు నీ కుమారుడి గుండెలు చీల్చి అతడి రక్తము తాగాడు. భీముడు నాడు నిండు సభలో చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నాడు. మహారాజా ! మీ వంతు వచ్చిన రాజ్యభాగమును మీరు అనుభవించక దురాశతో పాండుసుతుల రాజ్యం అపహరించ వలెనని మీరు చేసిన అకృత్యములకు ఫలితం అనుభవించక తప్పుతుందా " అన్నాడు.

దుశ్శాసనుడి మరణవార్త నిని ధృతరాష్ట్రుడు మూర్ఛిల్లుట[మార్చు]

దుశ్శాసనుడు మరణించాడు అని వినగానే సుయోధనుడు కూడా మరణించాడని తలచి ధృతరాష్ట్రుడు శరీరం కంపించగా మూర్ఛిల్లాడు. అప్పుడు అక్కడకు వచ్చిన విదురుడు సేవకుల సాయంతో ధృతరాష్ట్రుని శయ్యపై చేర్చి శైత్యోపచారాలు చేసారు. కొంతసేపటికి తేరుకున్న ధృతరాష్ట్రుడు తమకు ఈ దుస్థితి కల్పించిన విధిని తిట్టుకున్నాడు. కన్న కుమారులను అదుపులో పెట్టలేని తన అసమర్ధతను నిందించుకున్నాడు. పాడుసుతుల ధర్మనిరతిని, నీతిని మెచ్చుకున్నాడు. ఇంతటి వినాశనానికి కారణమైన శకునిని తిట్టాడు. తరువాత సంభాళించుకుని " సంజయా ! నీవు చెప్పినది సరిగా విన లేదు. సుయోధనుడు క్షేమమే కదా! లేక అతడు కూడా మరణించాడా " అన్నాడు. " మహారాజా ! రెండు రోజుల యుద్ధములో కర్ణుడు అతడి తమ్ములు కుమారులతో సహా మరణించాడు. భీమసేనుడు నీ కుమారుని దుశ్శాసనుడిని సంహరించి అతడి గుండెలు చీల్చి నెత్తురు తాగాడు. ఆ దృశ్యం చూడడానికి అసహ్యంగా, భయంకరంగా ఉంది " అని సంజయుడు చెప్పగానే " ఆపు సంజయా ! ఇక చాలు ఊరుకో నా మనసు కలత చెంది ఉంది. నీ మాటలు వినే స్థితిలో లేను " అన్నాడు ధృతరాష్ట్రుడు. సంజయుడు కొంత సేపు మౌనం వహించాడు. ధృతరాష్ట్రుడు తిరిగి " సంజయా ! నేను అనుసరించిన దుర్నీతి వలన సుయోధనుడి బుద్ధి హీనత వలన ఇలా జరిగింది. నాకు కలిగిన దుఃఖం ఉపశమించడానికి మార్గము కనిపించ లేదు. ఇరు పక్షములలో మరణించిన వారెవరు. జీవించి ఉన్న వారెవరు " అని అడిగాడు.

ధృతరాష్ట్రుడు ఇరుపక్షాలలో మరణించిన జీవించి ఉన్నవారి గురించి తెలుసుకొనుట[మార్చు]

సంజయుడు " మహారాజా ! మన పక్షమున భీష్మ, ద్రోణ, కర్ణ, వికర్ణ, వృషసేన, దుశ్శాసన, లక్ష్మణులు మరణించారు. వారిలో విరాజుడు, శతానీకుడు, విరాటుడు, ద్రుపదుడు, అభిమన్యుడు, ఘటోత్కచుడు, పాండ్యరాజులు మరణించారు " అన్నారు. ధృతరాష్ట్రుడు " సంజయా ! ప్రస్థుతం కురుసేనలో ఉన్న యోధులు ఎవరు " అని అడిగాడు. సంజయుడు " మహారాజా ! కౌరవసేనలో కృతవర్మ, శల్యుడు, శకుని, కృపాచార్యుడు, ఇంకా నీకుమారులు కొంత మంది కర్ణుడి కుమారులు కొంత మంది బ్రతికి ఉన్నారు. వీరి సాయంతో నీ కుమారుడు పాండవులను జయించగలను అని ధైర్యము వీడక ఆశతో ఉన్నాడు. ధృతరాష్ట్రుడు ఊరట చెంది " సంజయా ! మదించిన ఆంబోతువలె ఉన్న కర్ణుడు అర్జునుడి చేతిలో చావడం ఆశ్చర్యంగా ఉంది. కృష్ణార్జునులను ఇసుమంత కూడా లక్ష్యపెట్టని కర్ణుడు వారిని గెలుస్తానని చెప్తూనే మరణించాడు. ఈ కర్ణుడి అండ చూసుకునే కదా నా కుమారుడు పాండవులతో వైరము పెంచుకున్నది. అలాంటి కర్ణుడే లేనప్పుడు సుయోధనుడికి బ్రతుకెక్కడ. రేపటి నుండి యుద్ధము ఎలా చేయగలడు. ఇక యుద్ధము చేయడం వృధా.

ధృతరాష్ట్రుని నిరాశ[మార్చు]

సంజయా ! ఇన్ని వార్తలు విన్న తరువాత కూడా నా గుండె పగలేదంటే ఇది గుండేనా లేక పాషాణమా ! నా బ్రతుకు చూసావా ! నా కుమారులు మనుమలు చనిపోయారని విని శిలలా ఉన్నాను. ఇక నా వల్ల కాదు. ఎక్కడైనా దూకుతాను లేకపోతే విషం తాగుతాను. లేకున్న ప్రాయోపవేశం చేస్తాను. ఇంతటి వార్తలు వింటూ బ్రతకడం వృధా " అంటూ బలవన్మరణనానికి పాల్పడ్డాడు. సంజయుడు " మహారాజా ! ఏమిటీ వెర్రి. నీ లాంటి చక్రవర్తి మనోధైర్యం సడలి ఇలా బేలగా మారవచ్చా. నీవు చదివిన చదువులు నీ గొప్పదనం ఒక్క సారి గుర్తుకు తెచ్చుకుని ధైర్యంగా ఉండు " అన్నాడు. సంజయా ! కర్ణుడి మరణం నాలో నిరాశ మిగిల్చింది. ఇక నా కుమారుడు ఎవరున్నారన్న ధైర్యంతో యుద్ధం చేస్తాడు. అంతటి కర్ణుడు మరణించాక మనం ఇక ఓడిపోతాము అన్న భావన కలిగి నాలో నిరాశ ఆవహించింది. భయపడకు అయినా నేను చావనులే అంత త్వరగా చచ్చే వాడినే అయితే నా కుమారుడు దుశ్శాసనుడు, కర్ణుడు చనిపోయారన్న మాట విన్నప్పుడే నా గుండె ముక్కలైయ్యేది. నాకిక దీర్ఘాయువే. ఒకప్పుడు అందరి గౌరవ మర్యాదలను అందుకున్న నేను ఇక నన్ను చూసి జాలి పడే వారి జాలి చూపులు ఎదుర్కో వలసిన దుర్ధశ దాపురించింది. వారి జాలి చూపులు నేను భరించ లేను. అయినా భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, దుశ్శాసనుడు ఒకరి తరువాత ఒకరు మరణిస్తుంటే నేను ఎలా తట్టుకుంటాను . కర్ణుడి చావు నాకు ఆశా నిపాతం అయింది. సుయోధనుడు గెలుస్తాడు అనుకోవడం ఇక అడియాస కదా ! మన సాహసాలు కోల్పోయాము కదా ! సుయోధనుడు గెలుస్తాడని అనుకోవడమిక కుంటి వాడు నడుస్తాడని అనుకోవడమే. ముసలి వాడు పడుచు వేశ్యల కొరకు ఆశపడటమే కదా ! సంజయా ! అనాడు ధర్మరాజు మనలో మనకు కలహం ఎందుకు సామరస్యంగా ఉంటాము అని వర్తమానం పంపినా మూర్ఖత్వంతో తిరస్కరించాను. ఇప్పుడు అనుభవిస్తున్నాను. భీష్ముడు శరతల్ప గతుడైన సమయాన అర్జునుడు భూగర్భ జలమును తెచ్చాడు. అతడి ప్రతిభ చూసి భీష్ముడు యుద్ధము మాని సంధి చేసుకొమ్మని అన్నప్పుడైనా విని ఉంటే ఇప్పుడీ దుర్గతి పట్టక పోను.

దృతరాష్ట్రుడు కర్ణుడి మరణానికి ఆశ్చర్యపడుట[మార్చు]

సంజయా! గతజలసేతు బంధనమేల ! అసలు కర్ణుడు ఎలా చనిపోయాడు ? అర్జునుడు కపటోపాయంతో భీష్ముని చంపినట్లు కర్ణుడిని చంపడానికి కూడా కపటో పాయం పన్నాడా ! మన సైనికిలు వీరులూ కర్ణుని రక్షించడానికి ప్రయత్నించ లేదా ! కర్ణుడిని వంటరిగా వదిలి అందరూ పారిపోయారా ! సంజయా ! కర్ణుడు సామాన్యుడు కాదు. పరశురాముడి శిష్యుడై బ్రహ్మాస్త్రం పొందాడు, సర్పముఖ శాస్త్రం తెలిసిన వాడు. దివ్యాస్త్ర బల సంపన్నుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, ఉపాయశాలి. ఆ ఉపాయంతోనే అభిమన్యుడిని చంపాడు కదా ! అసురవీరుడూ, మాయావీ, నిశాచరుడు, యుద్ధవిద్యా నిపుణుడు అయిన ఘటోత్కచుని సంహరించిన వాడు. నకుల సహదేవుల గెలిచి వదిలిన వాడు. అతడి దివ్యాస్త్రాలు ఏమయ్యాయి. అవి నశించాయా ! లేక నిష్ప్రయోజనం అయ్యాయా ! అతడి రథము విరిగి పోయిందా ! సంజయా ! అతడి సారథి శల్యుడు ఏమి చేస్తున్నాడు. అర్జునుడు కర్ణుని చంపుతున్నప్పుడు శకుని, కృపాచార్యుడు, అశ్వత్థామ ఏమి చేస్తున్నారు. కృతవర్మను సుయోధనుడు ఎక్కువగా అభిమానిస్తుంటాడు. అతడు కూడా కర్ణుడిని కాపాడటానికి రాలేదా ! నా కుమారుడు సుయోధనుడు ఏమి చేస్తున్నాడు. అశ్వత్థామ, శకుని, కృపాచార్యుడు, కృతవర్మలు వెంట ఉండగా నిష్కారణంగా కర్ణుడు ఎలా చచ్చాడు. పాండవులు కర్ణుని మీద ఎలా దాడి చేసారు. కర్ణుడి సర్పముఖాస్త్రాన్ని అర్జునుడు ఎలా తప్పించుకున్నాడు. మిగిలిన పాండవులు కర్ణుడితో ఎలా యుద్ధము చేసారు. ఈ రెండు రోజుల యుద్ధము ఎలా జరిగింది " అన్నాడు.

కౌరవ సైన్యాధ్యక్ష నిర్ణయం[మార్చు]

సంజయుడు " మహారాజా ! ద్రోణాచార్యుడు పడిపోయిన తరువాత సాయంత్రం వరకు యుద్ధం జరిగింది ఆ తరువాత యుద్ధం చాలించి తమ తమ శిబిరాలకు వెళ్ళారు. సుయోధనుడు తమ శిబిరంలో అశ్వత్థామ, కర్ణుడు, దుశ్శాసనుడు, శకుని మొదలగు యోధులతో సమాలోచనలు జరిపి తరువాతి సైన్యాధ్యక్షుడు ఎవరిని నియమించాలి అని అశ్వత్థామను అభిప్రాయం అడిగాడు. అశ్వత్థామ సుయోధనుడు ఆలోచనకు అనుగుణంగా " సద్గుణ సంపన్నులైన భీష్ముడు, ద్రోణుడు వెళ్ళి పోయారు. మన సైన్యంలో సర్వ సైన్యాధ్యక్ష పదవికి అర్హులు ఎందరో ఉన్నారు. వారిలో ఒకరిని ఎంచుకో. నా అభిప్రాయం ప్రకారం కర్ణుడు ఇందుకు సమర్ధుడు. అతడి వద్ద అశేషమైన దివ్యాస్త్రసంపద ఉంది. శత్రు సైన్యమును నాశనం చేయడంలో మేటి. విశ్వాసపాత్రుడు, నీ ప్రియ మిత్రుడు. కనుక అతడిని సైన్యద్యక్షిడిని చెయ్యి " అన్నాడు. అశ్వత్థామ పలుకులు విని సుయోధనుడికి ఆనందానికి అవధులు లేక పోయింది. కర్ణుడిని చూసి " మిత్రమా కర్ణా ! భీష్మ, ద్రోణుల తరువాత అంతటి సమర్ధుడివి నీవే. ఇన్ని రోజులు భీష్మ, ద్రోణులు పాడవపక్షపాతంతో వారిని చంపక వదిలారని నీవు సేనాపతివి అయు ఉంటే పాండవ నిర్మూలనము ఎప్పుడో జరిగి ఉండేది. ఇప్పటికి యుద్ధము ముగిసి మనను విజయలక్ష్మి వరించేది " అన్నాడు. ఈ మాటలకు " కర్ణుడు పొంగి పోయి " సుయోధనా ! నేను నీకు పాండవులను అందరినీ జయిస్తాను అని మాట ఇచ్చాను. ఇప్పుడు ఆ మాట నెరవేర్చుకుని నిన్ను ఆనంద పరుస్తాను. ఈ యుద్ధానికి నేను ఒక్కడినే చాలు నీవు చూస్తూ పక్కన ఉంటే చాలు. పాండవులను జయించి నిన్ను సర్వంసహా భూమండలానికి పట్టాభి షిక్తుడిని చేస్తాను " అన్నాడు.

కర్ణుని సైన్యాధ్యక్షుని చేయుట[మార్చు]

సుయోధనుడు పుణ్య నదీ జలాలు తెచ్చి, ఉన్నతాసనము వేసి, కర్ణుని అందు ఆశీనుడిని చేసి, నదీ జలముతో అభిషేకము చేసి, పుణ్యాహవాచనము చేసి మొదలగు క్రతువులు చేయించి వంధి మాగధుల జయజయ ధ్వనుల మధ్య కర్ణుని సర్వ సైన్యాధ్యక్షుని చేసాడు. కర్ణుడు సుయోధనుడిని చూసి " మిత్రమా ! నాడు నన్ను అంగరాజ్యానికి అభిషిక్తుడిని చేసి పది మందిలో నా పరువు నిలిపావు. నేడు నన్ను సైన్యాధ్యక్షుడిని చేసి గౌరవించావు. ఇందుకు ప్రతిగా నేను నీకు ఏమి ఇవ్వగలను ? బంధు మిత్రసమేతంగా పాండవులను చంపి నిన్ను సమస్త కురు సామ్రాజ్యానికి చక్రవర్తిగా పట్టాభిషిక్తుని చేస్తాను నీవు పుత్ర పౌత్ర సమేతంగా సుఖంగా ఆచంద్రార్కం పాలించు " అన్నాడు. సుయోధనుడు ఆ మాటలకు పరమానంద భరితుడయ్యాడు.

ఇరుపక్షముల వ్యూహ రచన[మార్చు]

మరునాటి ఉదయం కర్ణుడు సైన్యాధ్యక్షుడుగా మకరవ్యూహాన్ని పన్నాడు. మొసలి నోరు భాగములో తాను నిలిచాడు. కళ్ళ భాగంలో శకుని, ఉలూకుడు నిలిచారు. తల భాగాన అశ్వత్థామ మెడ భాగాన తన తమ్ములను నిలిపాడు సుయోధనుడు. ముందరి కాళ్ళ భాగాన కృపాచార్యుడు, కృతవర్మలు, కడుపు భాగాన సుయోధనుడు, వెనుక కాళ్ళ భాగాన సుషేషణుడు, శల్యుడు తోక భాగాన చిత్రసేనుడు తమతమ సైన్యములతో నిలిచారు. మిగిలిన సేనలను వ్యూహము చుట్టూ నిలిపాడు. యుధిష్టరుడు కూడా తమ సైన్యముతో యుద్ధరంగమున నిలిచాడు. సైన్యాధ్యక్షుడుగా కర్ణుని చూసాడు. అంతకు ముందు యుధిష్టరుడికి కర్ణుడంటే భయం ఉండేది. ఇప్పుడది లేదు సహజ కవచకుండలములు లేవు, ఇంద్రుడిచ్చిన శక్తి లేదు, ద్రోణుని అండ లేదు. కనుక సులభంగా కడతేర్చవచ్చును అనుకున్నాడు. అర్జునుడిని చూసి " అర్జునా ! చూసావా ! కర్ణుడు సర్వసైన్యములకు అధిపతి అయ్యాడు. మన అరణ్యవాస, అజ్ఞాతవాసములకు, అవమానములకు, అనుభవించిన సకల కష్టాలకు మూల కారణం ఇతడే. ఇక నీవు అతడి మీద పగ తీర్చుకో. కౌరవ సేన తరఫున చెప్పుకోతగ్గ వీరుడితడే ఇతడిని వధించిన కౌరవులను మనం అనాయాసంగా జయించవచ్చు. కర్ణుడు పన్నిన మకర వ్యూహముకు తగిన వ్యూహమును రచించు " అన్నాడు. అర్జునుడు తన సేనలను అర్ధచంద్ర వ్యూహమున నిలిపాడు. ఎడమ కొమ్మున భీముని, కుడికొమ్మున ధృష్టద్యుమ్నుడిని, ధర్మరాజ నకుల సహదేవులను వ్యూహము వెనుక భాగమున నిలబెట్టాడు. అర్జునుడి చక్రరక్షకులుగా యుధామన్యుడు, ఉత్తమౌజుడు నిలిచారు. కర్ణుడి చేతిలో కృష్ణార్జునులు ఓడిపోతారని నీ కుమారుడు, అర్జునుడి చేతిలో కర్ణుడు ఓడగలడని ధర్మరాజు గట్టిగా నమ్మారు.

యుద్ధారంభం[మార్చు]

తమ తమ సైన్యాధ్యక్షులు ఇచ్చిన ఆజ్ఞతో ఇరు పక్షములు ఢీకొన్నాయి. ఏనుగులు రథములు, హయములు, కాల్బలములు క్షణంలో నాశనం ఔతున్నాయి. ఏనుగుల కాళ్ళ కింద రథచక్రముల కింద పడి సైనికులు చితికి పోతున్నారు. అర్జునుడు కర్ణుడు ఒకరికి ఒకరు తీసిపోకుండా యుద్ధము చేస్తున్నారు. సాత్యకి, ధృష్టద్యుమ్నుడు, చేకితానుడు, ఉపపాండవులు కలిసి కౌరవ సేనలో ఉన్న ప్రభధ్రక, చేది, మధ్య, పాండ్య, వంగ, చోళ మొదలైన సైన్యములను తరుముతున్నారు. భీమసేనుడు తన గజవాహనము మీద విహరిస్తున్నాడు. దానికింద పడి కౌరవ వీరులు మరణిస్తున్నారు.

క్షేమధూర్తి భీముని ఎదుర్కొనుట[మార్చు]

ఇంతలో కులూత దేశపు రాజు క్షేమధూర్తి ఏనుగు మీద వచ్చి భీమసేనుడిని ఎదుర్కొన్నాడు. ఇద్దరూ ఒకరి మీద ఒకరు ఈటెలు విసురుకున్నారు, ఒకరి విల్లు ఒకరు విరుచుకున్నారు. ఏనుగులు కూడా ఒక దానిని ఒకటి ఎదుర్కొన్నాయి. క్షేమదూర్తి భీమసేనుడి గుండెలలో ఈటెను దించి భీమసేనుడి ఈటెలను మధ్యలోనే విరుస్తున్నాడు. భీమసేనుడి శరీరం మీద అరవై బాణాలు వేసాడు. భీమసేనుడు క్షేమధూర్తి ఏనుగు శరీరం నిండా బాణములు వేసాడు. ఆ బాధకు తాళ లేక ఏనుగు అక్కడి నుండి పారిపోయింది. భీమసేనుడు క్షేమధూర్తి ఏనుగును తరిమాడు. క్షేమధూర్తి అతి కష్టము మీద ఏనుగును అదుపులోకి తెచ్చుకుని భీమసేనుడి మీద అతడి ఏనుగు మీద శరప్రయోగం చేసాడు. భీమసేనుడి ఏనుగు కింద పడింది. గద తీసుకుని కిందకు దిగిన భీమసేనుడు క్షేమధూర్తి ఏనుగును ఒక్క దెబ్బతో పడగొట్టాడు. క్షేమధూర్తి ఏనుగును దిగి కత్తి దూసాడు. భీమసేనుడు గద ఎత్తి క్షేమధూర్తి తల మీద మోదాడు. క్షేమధూర్తి అక్కడికక్కడే తల పగిలి మరణించాడు. క్షేమధూర్తి మరణం చూసి అతడి సైన్యాలు చెదిరి పోయాయి. భీమసేనుడు ఉత్సాహంతో కర్ణుడి వైపు పోయాడు.

కురు పాండవ యోధుల సమరం[మార్చు]

కర్ణుడు బాణములు వేసి పాండవ సేనలోని ఏనుగులను కొడుతున్నాడు. అవి తలలు పగిలి చచ్చి కిందపడుతున్నాయి. నకులుడు కర్ణుడిని ఎదుర్కొన్నాడు. సాత్యకి కేకయరాజులైన విందానువిందులను, భీమసేనుడు అశ్వత్థామను, చిత్రసేనుడు శ్రుతవర్మను, ప్రతివింద్యుడు చిర్తుడు అనే రాజును, సుయోధనుడిని యుధిష్టరుడు, అర్జునుడు సంశక్తులను, ధృష్టద్యుమ్నుడు కృపాచార్యుని, శిఖండి కృతవర్మను, శ్రుతకీర్తి శల్యుడిని, సహదేవుడు దుశ్శాసనుడిని ఎదుర్కొన్నారు. పోరు ఘోరమైంది.

సాత్యకి విందానువిందులు[మార్చు]

సాత్యకి విందానువిందుల విల్లులు నరికాడు. వారిశరీరముల నిండా బాణములతో ముంచెత్తాడు. విందాను విందులు తిరిగి విల్లందుకుని సాత్యకి మీద శరప్రయోగం చేసారు. సాత్యకి ఒక పదునైన బాణంతో అనువిందుడి తల నరికాడు. తమ్ముడు చనిపోయాడన్న కోపంతో విందుడు సాత్యకి అనేక బాణములతో కొట్టాడు. సాత్యకి విందుడు ఒకరి సారథిని ఒకరు చంపుకున్నారు. ఒకరి హయములను ఒకరు చంపారు. ఒకరి రథమును ఒకరు విరిచారు. ఇరువురు రథములు దిగి కత్తి దూసి యుద్ధము చేయసాగారు. ఆ యుద్ధములో సాత్యకి పక్కకు ఒంగినట్లు ఒంగి కత్తితో విందుని తల ఒక్క వేటుతో తుంచాడు. విందాను విందులను చంపి సాత్యకి పక్కనే ఉన్న యుధామన్యుడి రథము ఎక్కాడు. త్వరలో రథము సమకూర్చుకుని కేకయ సైన్యమును తరిమాడు.

శ్రుతకర్మ చిత్రుడిని చంపుట[మార్చు]

చిత్రసేన మహారాజు సహదేవుడి కుమారుడైన శ్రుతకర్మతో యుద్ధము చేస్తున్నాడు. చిత్రసేనుడు అయిదు వాడి అయిన బాణములతో శ్రుతకర్మను కొట్టాడు. శ్రుతకర్మ కోపించి చిత్రసేనుడిని మూర్ఛిల్లేలా కొట్టాడు. చిత్రసేనుడు తేరుకుని శ్రుతకర్మ విల్లు విరిచాడు. శ్రుతకర్మ మరొక విల్లందుకుని వాడి అయిన బాణంతో చిత్రసేనుడి తల ఎగురకొట్టాడు. తమ మహారాజు మరణించడం చూసి సైన్యం ఒక్కసారిగా విజృంభించి శ్రుతకర్మను చుట్టుముట్టాయి. శ్రుతకర్మ అమిత పరాక్రమంతో వారిని తరిమి కొట్టాడు. చిత్రుడితో యుద్ధము చేస్తున్న ప్రతి వింధ్యుడు చిత్రుడిథసారథి గుండెల్లో మూడు నారములు దించాడు. అతడి కేతనమును, వింటిని వ్రిచి, చిత్రుడు విసిరిన ఈటెను రెండు ముక్కలు చేసాడు. అందుకు కోపించిన చిత్రుడు తన గదను ప్రతి వింద్యుడి మీద విసిరాడు. ఆదెబ్బకు ప్రతివింద్యుడి రథము విరిగి సారథి మరణించాడు. ఆగ్రహించిన ప్రతి వింద్యుడు ఒక తోమరము విసిరి చిత్రుడి గుండెను చీల్చాడు. చిత్రుడు మరణించగానే కౌరవ సేనలు ప్రతివింద్యుడి మీద విరుచుకు పడ్డాయి. పాండవ సేనలు ప్రతివింద్యునకు సాయం వచ్చాయి. ప్రతివింధ్యుని ధాటికి కౌరవసేనలు పారి పోయాయి.

భీముడు, శ్రుతకీర్తిల యుద్ధము[మార్చు]

భీముడు అశ్వత్థామతో యుద్ధము చేస్తున్నాడు. అశ్వత్థామ భీముడిని రథమును తన బాణములతో కప్పాడు. భీమసేనుడు అశ్వత్థామ పై శరవర్షం కురిపించాడు. ఇరువురు ఒకరి కేతనము ఒకరు కొట్టారు. ఒకరి సూతుని ఒకరు గాయపరిచారు. ఒకరి దేషమును ఒకరు గాయపర్చుకున్నారు. అది చూసి సూతులు వారిరువురిని అక్కడి నుండి తప్పించారు. అర్జున కుమారుడు శ్రుతకీర్తి శల్యుడిని ఎదుర్కొన్నాడు. శల్యుడు శ్రుతకీర్తి విల్లు విరిచి అతడి మీద ఏడు బాణములు నాటాడు. శ్రుతకీర్తి మరొక విల్లు తీసుకుని అరవైనాలుగు బాణములు వేసాడు. శల్యుడు తిరిగి తొంభై బాణములు వేసి తిరిగి శ్ర్తికీర్తి విల్లు విరిచాడు. శ్రుతకీర్తి తనగదను తీసుకున్నాడు. శల్యుడు దానిని కూడా విరిచాడు. శల్యుడు శ్రుతకీర్తి సారథిని నరికాడు. రథాశ్వములు బెదిరి రథమును ఎటో లాక్కుని వెళ్ళాయి.

దుశ్శాసనుడు సహదేవుడిని ఎదుర్కొనుట[మార్చు]

సహదేవుడు దుశ్శాసనుడితో యుద్ధము చేస్తున్నాడు. దుశ్శాసనుడు సహదేవునిపై నిశిత బాణములు వేసాడు. సహదేవుడు కోపించి డెబ్భై బాణములతో దుశ్శాసనుడిని కొట్టాడు. దుశ్శాసనుడు సహదేవుడి విల్లు విరిచి డెబ్భై బాణములు అతడి మీద వేసాడు. సహదేవుడు కోపించి కత్తి తీసుకుని దుశ్శాసనుడి విల్లు విరిచాడు. దుశ్శాసనుడు కత్తి తీసుకుని సహదేవుని మీద విసిరాడు. సహదేవుడు దానిని మధ్యలోనే విరిచాడు. దుశ్శాసనుడు మరొక విల్లు తీసుకుని సహదేవుడిపై అరవైనాలుగు బాణములు ప్రయోగించాడు. సహదేవుడు వాటిని మధ్యలోనే తుంచాడు. సహదేవుడు నూరు శిలీఖములను దుశ్శాసనుడి మీద వేసాడు. దుశ్శాసనుడు వాటన్నిటినీ మూడు బాణములతో తుంచి రెండు సాయకములను సహదేవుడి మీద వేసాడు. సహదేవుడు కాంతులు వెదజల్లే ఒక అస్త్రమును దుశ్శాసనుడి మీద వేసాడు. ఆ అస్త్రము దుశ్శాసనుడి కవచము చీల్చి అతడిని మూర్ఛిల్లజేసింది. అతడి సారథి వణుకుతూ రథమును అక్కడి నుండి దూరంగా తీసుకు వెళ్ళాడు.

నకులుని భంగపాటు[మార్చు]

నకులుడు కర్ణుడిని ఎదుర్కొని " కర్ణా ! ఈ రోజు మంచి రోజు కనుక నువ్వు నా ఎదుట పడ్డావు. కురు పాండవుల వైరముకు మూల కారణం నీవు. నిన్ను చంపనిది నా కోపము చల్లారదు. నేటితో నీ ఆయువు సరి " అన్నాడు. కర్ణుడు " ఓ నకులరాజకుమారా ! మహాస్త్రకోవిదుడవైన నువ్వు ఇలా మాట్లాడటం సహజమే. రా మనిద్దరము యుద్ధము చేసి బలాబలాలు తేల్చుకుంటాము " అన్నాడు. కర్ణుడు నకులుని మీద డెబ్భై బాణములతో కప్పాడు. నకులుడు కూడడెబ్భై వాడి అయిన బాణాలు నకులుని మీద వేసాడు. మరొక బాణముతో కర్ణుడి ధనస్సు విరిచి మూడు వందల బాణములు కర్ణుడి మీద ప్రయోగించాడు. కర్ణుడు మరొక విల్లు తీసుకుని అయిదు బాణములు నకులుడి వక్షస్థలంలో దింపాడు. నకులుడు ఏడు బాణములతో కర్ణుడి విల్లు విరిచాడు. కర్ణుడు కర్ణుడు మరొక విల్లందుకున్నాడు. అప్పుడు ద్రుపదుడి సేనలు నకులుడికి సాయంగా వచ్చాయి. కర్ణుడు అతి క్రూరబాణ ప్రయోగం చేసి వారిని చెదరగొట్టాడు. కర్ణుడు నకులుడి విల్లు విరిచి అతడి హయములను చంపి, సారథిని గాయపరిచాడు, అతడి చక్రరక్షకులను చంపి, నకులుడి కేతనము విరిచాడు. నకులుడు కత్తి డాలు తీసుకుని కర్ణుడిని ఎదుర్కొన్నాడు. కర్ణుడు వాటిని ముక్కలు చేసాడు. నకులుడు గద తీసుకుని కర్ణుడిని ఎదుర్కొన్నాడు. కర్ణుడు దానిని ముక్కలు చేసి నకులుడి ఆయువు పట్టులో బాణములతో కొట్ట సాగాడు. నకులుడు ఆ దెబ్బలు భరించ లేక పారిపోయాడు. కర్ణుడు వెంబడించి పట్టుకుని " నకులా ! నన్ను ఇందాక అనవసరంగా అనరాని మాటలనడం తప్పు కదా ! మాటాడేటప్పుడు ఎవరితో మాట్లాడుతున్నవు, ఎన్ని మాటలు మాటాడాలి, ఎలా మాటాడాలి అని తెలుసుకుని మాట్లాడు. ఇప్పటికైనా నూవు నాకంటే తక్కువస్థాయి వీరుడవని తెలుసుకున్నావు. యుద్ధము చేసేటప్పుడు నీ బలము ఎదిరి బలము తెలుసుకుని యుద్ధము చెయ్యి. అంతే కాని నీకన్నా బలవంతుని ఎదుర్కొని ఇలా పారిపోకూడదు. నీవు నాకంటే చిన్న వాడివి కనుక నిన్ను నేను చంపను. కుమారా ! నీవు అర్జునుడి వద్దకు వెళ్ళు " అన్నాడు. నకులుడు సిగ్గుతో తలవంచుకుని ధర్మరాజు రథము ఎక్కాడు. నకులుడి పరాభవంతో కర్ణుడు విజృంభించి పాండవసేనను చిన్నాభిన్నం చేయసాగాడు. సారధులను చంపుతున్నాడు, రథికుల తలలు నరుకుతున్నాడు. హయములను చంపుతున్నాడు. రథములు విరుగ కొడుతున్నాడు. పాండవసేనను నిర్మూలం చేస్తున్నాడు.

ఉపపాండవుల సమరం[మార్చు]

యుయుత్సుడు ఉలూకుడిని ఎదుర్కొన్నాడు. ఉలూకుడు యుయుత్సుని విల్లు విరిచి కేతనము విరిచాడు. యుయుత్సుడు మరొక ధనస్సు తీసుకుని ఉలూకుడి వక్షస్థలము మీద అయిదు బాణములు గుచ్చాడు. ఉలూకుడు ఒకే బాణంతో యుయుత్సుడి సారథిని చంపాడు, తరువాత రథాశ్వములను చంపాడు. యుయుత్సుడు తన రథము దిగి వేరొక రథము ఎక్కాడు. ఉలూకుడు తన రథమును పాంచాల సేనల వైపు పోనిచ్చాడు. శ్రుతకర్మ నకులుడి కుమారుడైన శతానీకుడిని ఎదుర్కొని అతడి సారథిని, హయములను చంపాడు. శతానీకుడు తన గదను తీసుకుని శ్రుతకర్మ మీద విసిరి అతడి రథము విరిచి అతడి సారథిని రథములను చంపాడు. భీముడి కుమారుడు శ్రుతసోముడు శకునితో యుద్ధము చేస్తున్నాడు. శ్రుతసోముడు శకుని మీద అనేకాస్త్రములు ప్రయోగించాడు. వాటన్నిటినీ ముక్కలు చేసి శకుని వాడి అయిన బాణముతో శ్రుతసోముడి రథము విరిచి, కేతనము విరిచి, హయములను చంపాడు. శ్రుతసోముడు కిందకు దూకి నేల మీద నుండే శకుని మీద బాణవర్షం కురిపించాడు. శకుని పదునైన బాణముతో శ్రుతసోముని విల్లు విరిచాడు. శ్రుతసోముని కత్తిని శకుని ఒకే బాణముతో ఖండించాడు. విరిగిన కత్తిని విసిరి శకుని విల్లును విరిచి వెంటనే శ్రుతకీర్తి రథం ఎక్కాడు.

కృపాచార్యుడు, కృతవర్మల శౌర్యం[మార్చు]

కృపాచార్యుడు తన బావగారిని చంపిన ధృష్టద్యుమ్నుడిని చంపాలని శతవిధాల ప్రయత్నిస్తున్నాడు. అతడిని ఎదుర్కొని అతడి మీద అనేక పదునైన శరములు ప్రయోగించి సారథిని హయములను కొట్టాడు. ఇది చూసి ధృష్టద్యుమ్నుని సారథి అతడితో " ధృష్టద్యుమ్నా! ఈ బ్రాహ్మణుడు ప్రజ్ఞా శాలి, దివ్యాస్త్ర సంపన్నుడు. ఇతడితో యుద్ధము మంచిది కాదు. ఇతడిని నువ్వు చంప లేవు. ప్రష్తుతం మన రధమును అవతలకు తీసుకు వెళ్ళమంటావా ! " అని అడిగాడు. సారథి ఆలోచన సముచిత మని తలచిన ధృష్టద్యుమ్నుడు అతడి సూచనకు అంగీకారం తెలిపాడు. సారథి రథమును అక్కడ నుండి భీమసేనుడి వద్దకు తీసుకు వెళ్ళాడు. కృపాచార్యుడు మహోత్సాహంతో ధనుష్టంకారం చేసి శంఖం పూరించాడు. పాండవసేనలో చొరపడి సేనను నాశనం చేయసాగాడు. శిఖండి కృతవర్మను ఎదుర్కొన్నాడు. శిఖండి కృతవర్మ గుండెలకు గురి పెట్టి అయిదు బాణములు వేసాడు. కృతవర్మ అరవై బాణములతో శిఖండిని నిలువెల్లా కొట్టి అతడి విల్లు విరిచి అరవై బాణములతో శిఖండిని నిలువెల్లా కొట్టాడు. శిఖండి మరొక విల్లు తీసుకుని డెబ్భై బాణములతో కృతవర్మను శరీరం అంతా రక్తం కారేలా కొట్టాడు. కృతవర్మ ప్రయోగించిన నారాచముల ధాటికి శిఖండి మూర్ఛిల్లాడు. శిఖండిథసారథి రథమును అక్కడి నుండి తీసుకు వెళ్ళాడు. శిఖండి సైన్యం పారిపోయింది.

త్రిగర్త మహారాజు అర్జునుడిని ఎదుర్కొనుట[మార్చు]

దస్త్రం:Arjuna cuts head of Mitrasena.jpg
మిత్రసేనుని తలను ఖండిస్తున్న అర్జునుడు

అర్జునుడు త్రిగర్తలతో యుద్ధము చేస్తున్నాడు. త్రిగర్తులకు శిబి, సాళ్వ, సంశక్తక సైన్యములు తోడైనాయి. త్రిగర్త మహారాజు సోదరులైన సత్యదేవుడు, చంద్రదేవుడు, మిత్రదేవుడు, మిత్రవర్మ, సౌశ్రుతి, సువర్మ, సుశర్మ మొదలైన వారు అతడికి సాయంగా ఉన్నారు. వారంతా అర్జునుడి మీద శరవర్షం కురిపించాడు. ఆ శరములకు చలించక అర్జునుడు వారిపై బాణములు గుప్పించాడు. అయిదు బాణములు వేసి సౌశ్రుతిని చంపాడు. ఎనిమిది బాణములతో చంద్రదేవుని చంపాడు. శిలీఖములు వేసి శత్రుదేవుడిని చంపాడు. సత్యసేనుడు విసిరిన ఈటె కృష్ణుడి భుజమును చీల్చింది. కృష్ణుడి చేతి కొరడా కింద పడింది. అది చూసి అర్జునుడు కోపోద్రిక్తుడై ఒకే బాణము వేసి సత్యసేనుని తలనరికాడు. మరొక బాణంతో మిత్రవర్మను చంపాడు. అది చూసి త్రిగర్త సైనికులు అర్జునుడిని చుట్టుముట్టారు. అర్జునుడు తన బాణములతో వారిని చెల్లాచెదురు చేసి వెండి మొన గల బాణమును వేసి మిత్రసేనుడి తల నరికాడు. మరొక ఇనుప బాణం వేసి సువర్మ వక్షస్థలంలో కొట్టాడు. సంశక్తులు అర్జునుడిని చుట్టుముట్టి అర్జునుడి మీద అనేక బాణములు, అస్త్రములు వేసారు. వారి ఆర్భాటం చూసిన అర్జునుడు చిరు నవ్వు నవ్వి వారి మీద ఇంద్రాస్త్ర ప్రయోగం చేసాడు. ఆ ఇంద్రాస్త్రము నుండి అనేక భల్లము, అంజలికము, మొదలైన అనేక విధములైన ఆయుధములు వెడలి సంశక్తులను సంహరించసాగాయి. పతాకములు పతన మౌతున్నాయి, సారధులు మరణిస్తున్నారు, గజ, అశ్వ, సైనిక కళేబరములతో రణభూమి నిండి పోయింది. రక్తం ఏరులై పారసాగింది. అర్జునుడి అస్త్ర, శస్త్ర ధాటికి ఆగలేక సంశక్తులు ససైన్యంగా పారిపోయారు.

సుయోధనుడు ధర్మజుడిని ఎదుర్కొనుట[మార్చు]

సుయోధనుడు ధర్మరాజును ఎదుర్కొని ధర్మరాజు మీఊద తొమ్మిది బాణములు ప్రయోగించి ఒక బాణంతో సారథిని కొట్టాడు. అందుకు ధర్మజుడు కోపించి సుయోధనుడి హయములను, సారథిని కొట్టి, పతాకమును విరిచి, సుయోధనుడు పట్టుకున్న ఖడ్గమును విరుగ కొట్టాడు. సుయోధనుడు రథము దిగి యుద్ధము నుండి తొలగిపోయాడు. అది చూసి కర్ణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ ఇతర రాజులు సుయోధనుడికి సాయం వచ్చారు. భీమార్జున నకుల సహదేవులు ధర్మరాజుకు సాయం వచ్చారు. అప్పటికి అపహార్ణం అయింది. యయోధులంతా ఒక చోటుకు చేరుకుని ఒకరిని ఒకరు ఉత్సాహపరుస్తూ యుద్ధము చేస్తున్నారు. యుద్ధము భయంకరంగా జరుగుతూ ఉంది " అని చెప్తున్న సంజయుడి మాటలకు అడ్డు తగిలిన ధృతరాష్ట్రుడు " సంజయా ! అందరి గురించి చెప్తున్నావు మా సుయోధనుడు ఏమయ్యాడు " అని అడిగాడు. సంజయుడు " ధృతతాష్ట్ర మహారాజా ! సుయోధనుడు విరధుడు అయ్యాడే కాని యుద్ధము నుండి పారి పోలేదు. వేరొక రథము సమకూర్చుకుని ధర్మరాజును ఎదుర్కొన్నాడు. ధర్మరాజు సుయోధనుడిని దూరము నుండి చూసి సారథితో సుయోధనుడి రథము ముందుకు పోనిమ్మని చెప్పాడు. మహా కోపంతో సుయోధనుడు ధర్మరాజు విల్లు విరిచాడు. ధర్మరాజు మరొక విల్లందుకుని నీ కుమారుడి విల్లు తుంచాడు. నీ కుమారుడు మరొక విల్లందుకొని ధర్మరాజు పై బాణములు గుప్పించాడు. ఒకరి మీద ఒకరు బాణములు గుప్పించి తీవ్రంగా గాయపరచుకున్నారు. సుయోధనుడు విసిరిన బల్లెమును తుంచి ధర్మరాజు ఒక శిలీఖముతో సుయోధనుడిని శరీరం చీలేలా కొట్టాడు. సుయోధనుడు గదతో కిందికి దిగి ధర్మరాజు మీదకు రాసాగాడు. ధర్మరాజు శక్తి బాణమును సుయోధనుడి మీదకు వేసాడు. సుయోధనుడు తిరిగి రథము ఎక్కి ధర్మజుని మీద బాణప్రయోగం చేసాడు. కాని అప్పటికే సుయోధనుడికి బాగా రక్త స్రావం అయింది కనుక ఒకింత మూర్ఛిల్లాడు. అది చూసి కృతవర్మ ధర్మరాజును ఎదుర్కొన్నాడు. భీన్మసేనుడు కృతవర్మను అడ్డుకున్నాడు. అప్పుడు కౌరవ సైన్యము కృతవర్మకు సాయంగా వచ్చాడు.

|=== కురు పాండవుల సమరం === సుయోధనుడు తేరుకుని ఎదురుగా కనిపించిన అర్జునుడి మీద పదునైన బాణములు వేసాడు. వెంటనే అర్జునుడు సుయోధనుడి పతాకమును తుంచి సారథిని హయములను కొట్టాడు. అశ్వత్థామ ఆ బాణములను మధ్యలోనే కొట్టాడు. అశ్వత్థామ ఆబాణములను మధ్యలో తొంచాడు.అర్జునుడు సుయోధనుడిని వదిలి అశ్వత్థామను ఎదుర్కొని అతడి విల్లు విరిచి హయములను సంహరించాడు. ఇంతలో కృపాచార్యుడు అర్జునుడిని ఎదుర్కొన్నాడు. అర్జునుడు కృపాచార్యుని ధనస్సును ఖండించాడు. కృతవర్మ అర్జునుడిని ఎదుర్కొన్నాడు. అర్జునుడు కృతవర్మ విల్లు ఖండించి పతాకమును పడేలా కొట్టి హయములను చంపాడు. ఇంతలో తనను ఎదుర్కొన్న దుశ్శాసనుడిని అర్జునుడు ఎదుర్కొని అతడి విల్లు రెండుగా ఖండించాడు. అర్జునుడు వీరిని వదిలి కర్ణుడి వైపు తన రథము పోనిచ్చాడు. అది చూసి కర్ణుడు అర్జునుడిని మూడు బాణములతోను కృష్ణుడిని ఇరవై బాణములతోను శరీరం చీరుకు పోయేలా కొట్టాడు. కర్ణుడు అప్పటి వరకు సాత్యకితో యుద్ధము చేస్తూ అర్జునుడు రాగానే ఇరువురిని ఎదుర్కొన్నాడు. అది చూసి యుయుత్సుడు, శిఖండి, చేకితానుడు, నకుల సహదేవులు, ద్రౌపదేయులు, ధృష్టద్యుమ్నుడు, ఉత్తమౌజుడు, ప్రభద్రకము, ఛేది, కరూశ, మాత్స్య, కేకయ రాజకుమారులు అర్జునుడికి సాయంగా వచ్చికర్ణుడు మీద పలు అస్త్ర, శస్త్రములు ప్రయోగించారు. కాని కర్ణుడు అత్యంత చాకచక్యముతో ఆ అస్త్రములను తిప్పికొట్టి పాండవ యోధులను వారి సైన్యాలను కకా వికలు చేసాడు. అది చూసి అర్జునుడు, కర్ణుడు ప్రయోగించిన అస్త్రములను అన్నింటినీ నిర్వీర్యము చేసి తన శిలీఖములతో కౌరవసేనను చెదరగొట్టాడు. అప్పటికి సాయం సమయం అయింది నలుపక్కలా చీకట్లు కమ్మాయి. అర్జునుడి ధాటికి ఆగలేక కౌరవ సేనలు పారి పోయాయి. పాండవసేనలు తమ విడిదికి చేరాయి. ఇలా కర్ణుడి మొదటి రోజు యుద్ధము ముగిసింది " అని సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్పాడు.

ధృతరాష్ట్రుని సందేహం[మార్చు]

అది విన్న ధృతరాష్ట్రుడు " సంజయా ! నాకు తెలియక అడుగుతాను. అర్జునుడు కౌరవులను అందరిని చంపదల్చుకుంటే కర్ణుడు అడ్డు వచ్చినా అందరిని ఆరోజే చంపి ఉండేవాడు. దేవేంద్రుడి కొడుకైన అతడికి నాకుమారుల వంటి మానవమాతృలు ఒక లెక్కా ! అతడు సామాన్యుడా ! యాదవ వీరులను ఎదిరించి సుభద్రను వివాహమాడలేదా! ఇంద్రుడిని ఎదిరించి ఖాండవ వన దహనం చేయలేదా ! కిరాతరూపంలో ఉన్న పరమశివునితో యుద్ధము చేయలేదా! కాలకేయులను ఒంటి చేత్తో చంపలేదా! గంధర్వుల చేత చిక్కిన నా కుమారుడిని వారితో పోరి జయించ లేదా ! ఇన్ని చేసిన వాడికి ఈ యుద్ధము ఒక లెక్కా! అర్జునుడి చేతిలో ఓడిపోవడమూ కీర్తే కనుక మన వారిని అర్జునుడి చేతిలో ఓడారని నిందించ పనిలేదు " అన్నాడు. సంజయుడు తిరిగి " సుయోధనుడు ! ముఖ్యులతో ఆ రోజు విశేషములు చర్చిస్తున్నాడు. కర్ణుడు సుయోధనుడితో ఇలా అన్నాడు. " రారాజా ! మనమంతా ఒకటి గుర్తుంచుకోవాలి. అర్జునుడు అత్యంత శక్తి యుక్తులు కలవాడు. అందుకు తోడు అతడికి తగు సమయంలో సలహాలు ఇవ్వడానికి కృష్ణుడు ఉన్నాడు. నేను ఇంద్రప్రసాదిత శక్తిని అర్జునవధ కోసం అట్టిపెడితే దానిని ఘటోత్కచుడి మీద ప్రయోగించేలా చేసి మనలను వంచించి ఘటోత్కచుడిని చంపించి అర్జునుడిని రక్షించాడు. అయినా మన శక్తిని నమ్ముకుంటాము. నా అస్తశస్త్రములతో నేను రేపు కృష్ణార్జునులను రూపుమాపుతాను " అన్నాడు.

కర్ణసారధ్యంలో రెండవరోజు యుద్ధము[మార్చు]

మరునాడు ఉదయం ఇరు పక్షాలు యుద్ధానికి సిద్ధం అయ్యాయి.ధర్మరాజు పూర్వం బృహస్పతి పన్నిన దుర్జయ వ్యూహము పన్నాడు. అందుకు ప్రతిగా మరొక వ్యూహము కొరకు కౌరవసేనలు కర్ణుని ఆనతి కోసము ఎదురుచూస్తున్నాయి " అని సంజయుడు చెప్పగానే ధృతరాష్ట్రుడు " సంజయా ! కర్ణుడు వచ్చి మాత్రం చేసేది ఏముంది. తనను సర్వసైన్యాధ్యక్షునిగా చేసిన మొదటి రోజే సుయోధనుడికి పరాజయం మూటగట్టాడు. రెండవ రోజు మాత్రం ఏమి చేస్తాడు. అయినా నా కుమారుడు బుద్ధిహీనుడు కనుక అలాంటి వారిని నమ్మాడు. కర్ణుడి బాహుబలం, శకుని కపట నీతి గెలిపిస్తాయని నమ్మి ఈ యుద్ధానికి దిగాడు. జూదం ఆడిన రోజు నుండి మనకు దుర్ధశ మొదలైంది. అది ఇప్పటికి పెరిగి నిరంతర దుఃఖంగా మారింది. నేను, నా కుమారుడు కాని పనులు చేసాము ఫలితం అనుభవిస్తున్నాము. సంజయా ! ఇన్ని రోజుల యుద్ధములో పాండవులు ఒక్కరూ మరణించ లేదు. కాని నా కుమారులు అనేక మంది మరణించారు. భీష్మ, ద్రోణులు పడిపోయారు. పాండవులు మన వారి మధ్యలో అంతఃపుర స్త్రీలతో సరసమాడుతున్నట్లు హాయిగా తిరుగుతున్నారు. అంతా విధి విలాసము " అన్నాడు.సంజయుడు " మహారాజా ! జరిగిన దానికి వగచి ప్రయోజనము లేదు. అందుకు నీ కుమారుడైన సుయోధనుడిని మాత్రము నిందించి ప్రయోజనము లేదు. అతడు చెప్పిన దానికి అంతా నువ్వు తల ఊపి ఇంతటి అనర్ధము తీసుకు వచ్చినది నువ్వు కాదా ! నాడు విదురుని మాట విని జూదము ఆపిన ఇంత దూరము రాక పోను. పాండవులకు నీవు చేసిన అపరాధములు నిన్ను కట్టి కుడుపుతున్నాయి. తరువాతి యుద్ధ విశేషములు చెప్తాను విను.

కర్ణుడు శల్యుని తనకు సారధిని చెయ్యమని అడుగుట[మార్చు]

కర్ణుడు " సుయోధనా ! ఈ రోజు నుండి యుద్ధము నాకు అర్జునుడికి మధ్య మాత్రమే జరుగుతుంది. అర్జునుడిని చంపడమే నా లక్ష్యము. నా వద్ద ఇంద్ర శక్తి లేదని అర్జునుడు తప్పక విజృంభిస్తాడు. కనుక మనం అర్జునుడిని చంపుటకు ఉపాయం ఆలోచించాలి. నా వద్ద ఉన్న అస్త్రములు అర్జునుడి వద్ద ఉన్న అస్త్రములు సమానమే. యుద్ధములో చురుకుగా కదలడంలో అర్జునుడి కన్నా నేనే మిన్న. అర్జునుడికి గాండీవం ఉంది. నా వద్ద లేదు. పూర్వము విశ్వకర్మ,అ ఇంద్రుడికి ఒక అస్త్రము తయారు చేసి ఇచ్చాడు. దానితో ఇంద్రుడు అసురసంహారం చేసాడు. ఇంద్రుడు దానిని పరశురాముడికి ఇచ్చాడు. నా మీద కలిగిన వాత్సల్యంతో నా గురువైన పరశురాముడు దానిని నాకు నాకు ఇచ్చాడు. ఆ మహనీయచాపంతో నేను ఈ రోజు అర్జుడిని చంపి యుద్ధము పూర్తి చేసి నీకు కురుసామ్రాజ్యాన్ని కట్టబెడతాను. ఇక అర్జునుడికి ఎన్నటికీ మరణించని హయములు, అపూర్వమైన రధము, అక్షయ తుణీరములు ఉన్నాయి. వాటి గురించి నాకు భయము లేదు నా వెంట అనేక ఆయుధములున్న శకటములు ఉంటాయి. నిరంతరము నాకు ఆయుధములు అందుతూ ఉంటాయి కనుక అక్షయతుణీరముకు సమానమే. అనేక మేలు జాతి అశ్వములు నా వెంట ఉంటాయి కనుక అశ్వములు పడి పోగానే వేరు వాటిని సమ కూర్చుకుంటాను. అలాగే అనేక రధములు నా వెంట ఉంటాయి కనుక రధము విరిగిన వేరు రధమును ఏర్పరచు కొనగలను. అర్జుడికి కృష్ణుడి సారధ్యము ఉంది. నాకు అతడికి ధీటైన సారధి కావాలి. మధ్రదేశాధిపతి శల్యుడు అందుకు తగిన వాడు. అతడికి అశ్వహృదయం తెలుసు. రధము నడపడంలో కృష్ణుడికంటే నేర్పరి. కనుక నీవు అతడిని నాకు సారధిని చేయాలి. సుయోధనుడు " కర్ణా ! అదెంత పని. నేను ఇప్పుడే మధ్ర దేశాధిపతిని ఒప్పించి నీకు సారథిని చేస్తాను. నీ వెంట అనేక శకటములు ఆయుధములతో నడుస్తాయి. శతాధిక రథములు, అనేక అశ్వములు నీ వెంట ఉంటాయి. రా మనం శల్యుని వద్దకు పోతాము " అన్నాడు.

శల్యుని కర్ణుడికి సారధ్యం వహించమని కోరుట[మార్చు]

సుయోధనుడు శల్యునికి నమస్కరించి " మీరు మాకు పెద్దలు నిత్యసత్యవ్రతులు, పూజ్యులు కనుక నేను మిమ్ము అధికంగా గౌరవిస్తాను. ఇందరి మధ్య నేను మిమ్ము ఒక కోరిక అడుగుతున్నాను కాదనకుండా తీర్చండి. ఇతడు కర్ణుడు, నా మిత్రుడు, మన స్వర్వసైన్యాధ్యక్షుడు, అర్జునుడిని సంహారముకు దీక్షాబద్ధుడు, అర్జునుడి సారథి కృష్ణుడు, కృష్ణుడికి దీటుగా సారథ్యం చేయగల సామర్ధ్యం మీకే ఉంది. భీష్మ ద్రోణులు చని పోయిన తరువాత నేను నిన్ను, కర్ణుడిని నమ్మి యుద్ధము చేస్తున్నాను. మీరు కర్ణుడికి సారథ్యం వహిస్తేనే అతడు అర్జునుడిని వధించ కలడు " అన్నాడు. ఆ మాటలకు శల్యుడు కోపంతో ఊగిపోతూ " సుయోధనా ! నేనెవరో తెలిసీ నన్ను ఇలాంటి నీచపు కోరిక అడుగుతావా ! నీకు వర్ణాశ్రమ ధర్మాలు తెలువవా ! మద్రదేశాధిపతిని, సుక్షత్రియుని నన్ను ఒక సూతునికి సారథ్యం వహించి అతడిని సేవించమని అడుగుతావా! నేను ఒక సూతకుల సంజాతునికి సారథిగా ఉండలేను. నేను నీకు సాయం చేయ వచ్చాను. నువ్వు ఎవరితో యుద్ధం చేయమంటే వారితో యుద్ధం చేసి శత్రు సంహారం చేస్తాను. అందరిని ఒక్కసారిగా ఎదుర్కొనమని చెప్పినా చేస్తాను. నేను రణరంగమున అర్జునుడిని కృష్ణుడినే లెక్క చేయను నా బలములో పదహారవ వంతు కూడా శక్తి లేని ఈ కర్ణుడు నాకు ఎంత. తెలియక పోతే సరే అన్నీ తెలిసి నన్ను కర్ణుడికి సారథిగా ఉండమంటే నేను నా దారిన పోతాను. అంతే కాని ఇలాంటి నీచపు పని చెయ్యను " అని చెప్పాడు.

సుయోధనుడు శల్యుని నచ్చ చెప్పి ఒప్పించుట[మార్చు]

మద్రదేశాధీశా ! నేను ఆ ఉద్దేశ్యంతో అన లేదు. కర్ణుడొక్కడే కాదు ఈ భూమండలంలో నీకు సాటి రాగల వారెవరు. నీవు సార్ధక నామదేయుడవు. నీ కంటే కర్ణుడెక్కువ వాడు అని నేను ఇది అడగలేదు. అర్జునుడికి ధీటుగా యుద్ధం చేయగల వాడు కర్ణుడే. కాని కృష్ణుడు మన ఎత్తులన్నీ కృష్ణుడు తన నేర్పుతో భంగపరుస్తున్నాడు. కృష్ణుడికి సమంగా ఎత్తుకు పై ఎత్తు వేయగలిగిన సమర్ధత మీకు గాక ఎవరికి ఉంది. కనుకనే మిమ్ము అడిగాను కాని కర్ణుడికంటే మిమ్ము తక్కువ చేసి అవమానించడానికి కాదు. ఈ మహత్కార్యం చేయడానికి మీరు తప్ప వేరొకరు లేరు " అన్నాడు. ఆ పొగడ్తలకు పొంగి పోయిన శల్యుడు " సుయోధనా ! నీ మనసు తెలియక కోపగించుకున్నాను. కృష్ణుడికంటే నన్ను గొప్పవాడిని అని ప్రశంసించావు నాకు అదే చాలు. నేను నువ్వు అడిగినట్లు కర్ణుడికి సారధ్యం వహిస్తాను. కాని నాదొక్క నియమం నేను ఇతడితో నాకు ఇష్టము వచ్చిన రీతిలో మాట్లాడతాను. అతడు కోపగించక తనపని తాను చేసుకు పోవాలి " అన్నాడు. కాదంటే శల్యుడు ఎక్కడ కాదంటాడో అని సుయోధనుడు అందుకు అంగీకరించాడు.

త్రిపురాసుర వధ[మార్చు]

శల్యుడు కర్ణసారథ్యం వహించడానికి అంగీకరించిన తరుణంలో సుయోధనుడు " మద్రదేశాధీశా ! ఒక నాడు మార్కండేయ మహర్షి మా తండిగారితో చెప్తుంటే విన్నాను. దేవాసుర యుద్ధములో తారకాసురుడు మరణించాడు. అతడి ముగ్గురు కుమారులైన విద్యుమ్నాలి, తారకాక్షుడు, కమలాక్షుడు బ్రహ్మను గురించి అత్యంత నియమ నిష్టలతో తపస్సు చేసాడు. వారి తపస్సుకు బ్రహ్మదేవుడు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అయి వరం కోరుకొమ్మని అడిగిన తరువాత వారు ముగ్గురూ ఒక్కసారిగా " బ్రహ్మదేవా ! సకల భూతముల వలన సర్వకాలములో చావు లేకుండా వరం ఇవ్వండి " అన్నారు. బ్రహ్మదేవుడు " ఇలాంటి కోరిక ఎవ్వరైనా కోరతారా ! మీరు కోరిన కోరిక నేను ఇవ్వ కూడదు మీరు పుచ్చుకోకూడదు. నేను ఇవ్వడానికి అనువైన కోరిక కోరండి " అన్నాడు. వారు " అలా అయితే మా ముగ్గురికీ మూడు పురములు ఇవ్వండి. అవి మా ఇచ్ఛ వచ్చిన చోటికి పయనించేలా ఉండాలి. దేవ, దానవ, యక్ష, కిన్నెర, కింపురుష, గంధర్వ, ఉరగాదుల వలన ఆ నగరములు నశింపకుండా వరం ఇవ్వండి. అప్పుడు మేము నిర్భయంగా అంతటా సంచరించగలము " అని కోరారు. అందుకు బ్రహ్మగారు " అలాగే ఇస్తాను. కాని దేనికైనా ఒక అంతం ఉండాలి. ఆ మూడు పురములు ఒక చోట చేరిన సమయాన బలవంతులెవరిచే అయినా నాశననం కాగలవు. అవి విడి విడిగా ఉన్నంతవరకూ సురక్షితంగా ఉంటాయి. ఇక మీరు మీ ఇచ్ఛ వచ్చిన రీతిన పురములు నిర్మించుకున్న అవి మీరు కోరిన విధంగా ప్రతిభావంతులు కాగలవు " అని వరము ఇచ్చి బ్రహ్మదేవుడు అంతర్ధానం అయ్యాడు. బ్రహ్మవరాన్ని పొందిన ఆముగ్గురు రాక్షసులు మయుడి వద్దకు వెళ్ళి తమ కొరకు మూడు నగరాలు నిర్మించి ఇవ్వమని అడిగారు. మయుడు తారకాక్షుడికి సువర్ణపురమును, కమలాక్షునికి రజిత పురమును, విద్యున్మాలికి ఇనుప పురమును నిర్మించి ఇచ్చాడు. స్వర్ణ పురముతో దేవలోకములోను, రజిత పురముతో ఆకాశములోను, ఇనుప పురముతో భూలోకములోను సంచరించసాగారు. ఆ ముగ్గురూ మూడు లోకాలు ఆక్రమించుకుని యదేచ్ఛగా తిరుగుతూ కోట్ల సంవత్సరాలు గడిపారు.

హరి కోరిన వరం[మార్చు]

తారకాక్షుడికి హరి అను కుమారుడు కలిగాడు. అతడు బ్రహ్మను గురించి తపస్సు చేసాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షంగానే అతడు " త్రిపురాలలో ఎవరనా మరణిస్తే వారిని ఒక నూతిలో వేయగానే దాని నుండి చని పోయిన వాడి అంత బలంతో పది మంది జన్మించాలి. అలాంటి నూతులు మూడు పురములలో సర్వకాలమూ ఎండని జలములతో ఉండేలా అనుగ్రహించు " అని కోరాడు. ఈ విధంగా త్రిపురాలలో ప్రజలు చావులేని వారైనారు. ఒక వేళ చచ్చినా ఒకరికి పది మందిగా వృద్ధి చెందారు. వారిని చూసి దేవతలు కూడా హడలెత్త సాగారు. త్రిపురాలలో నుడి వారు దేవ, పితృ, ముని లోకాలను హింసించసాగారు. ఇంద్రుడు కూడా వారితో యుద్ధము చేసి పరాజితుడైనాడు. దేవతలు మునులు బ్రహ్మదగ్గరకు వెళ్ళి మొర పెట్టుకుని త్రిపురాధీశులను చంపే ఉపాయం చెప్పమని అడిగారు. బ్రహ్మ వారితో " వారి ముగ్గురిని ఒకే బాణంతో చంపాలి. ఆ పని ఒక్క రుద్రుడే చేయాలి. కనుక మీరు శివుడి వద్దకు వెళ్ళి ప్రార్థించండి " అన్నాడు.

దేవతలు బ్రహ్మదేవునితో చేరి ఈశ్వరుడిని వేడుకొనుట[మార్చు]

దేవతలు, మునులు, ఇంద్రుడు, బ్రహ్మదేవునితో చేరి శివుని వద్దకు చేరి " పరమేశ్వరా ! నీవు జ్ఞానమూర్తివి, సత్యస్వరూపుడవు నీకు తెలియనిది లేదు " అని స్తుతించగా ఈశ్వరుడు " సంతోషించి ఏమి కావాలి ? " అన్నాడు. బ్రహ్మ పరమేశ్వరునితో " పరమేశ్వరా ! నీవు నన్ను ప్రజాపతిగా చేసావు. ఆ అధికారమును వినియోగించి నేను ఈ ముగ్గురు రాక్షసులకు వరములు ప్రసాదించాను. వారు ఆ వరగర్వంతో మూడు పురములు నిర్మించుకుని ముల్లోకాలను గడగడలాడిస్తున్నారు. ఇంద్రునికి కూడా అతడిని గెలువ శక్యము కాలేదు. నీవుగాక వారిని సంహరించగల వారు లేరు. కనుక అందరమూ నిన్ను శరణు జొచ్చాము. ఆ రాక్షసులను సంహరించి ముల్లోకములను కాపాడాలి " అని వేడుకున్నారు. ఈశ్వరుడు " బ్రహ్మదేవా ! నీను చెప్పినది నిజమే. వారు చంపదగిన వారే అయినా వారు మహాబలవంతులు నేను ఒక్కడినే వారిని జయించ లేను. కనుక నేను నా తేజస్సులో సగభాగము ఇస్తాను మీరంతా వారిని సంహరించండి " అన్నాడు. దేవతలు " పరమేశ్వరా ! ఆ మువ్వురి బలముకంటే మా బలము సగమే ఉంది కనుక మేము వారిని గెలువలేము. నీ మహా తేజస్సు మేము భరించరానిది. కనుక మా శక్తులను మీకు ధార పోస్తాము. కనుక నీవే వారిని సంహరించు " అన్నాడు. ఆ మాటలకు శివుడు " దేవతలారా ! నాకు మీరు రాక్షసులు సమానమే. అంతే కాదు నాకు సర్వప్రాణులు నాకు సమానమే. అందరికీ సమానంగా ఆనందం కలిగిస్తాను కనుక నాకు శివుడు అనే నామం వచ్చింది. దుష్టశిక్షణ శిష్టరక్షణ నా కర్తవ్యం. పరులను పీడించే దుర్జనులను సంహరించి ధర్మవర్తనులైన మిమ్ము రక్షిస్తాను. కనుక మీరంతా మీ తేజస్సు బుజ బలము నాకు చెందేలా చేయండి. నేను ఈ కార్యము నిర్వహించడానికి ముల్లోకములకు పశుత్వము నాకు పశుపతిత్వము కావాలి నేను ఈ కార్యము చేయడానికి నాకు పశుపతిత్వము కావాలి ఈ లోకాలకంత పశుత్వము కావాలి. అప్పుడు కాని పశువులను చంపిన పాపం నన్ను అంటదు. మీరందరూ కలిసి నాకు ఒక దివ్యరధమును, ఒక సారథిని, దివాశ్వములను, ఒక విల్లు, ఒక బాణం కావాలి. అప్పుడు నేను ఆ రాక్షసుల మూడు పురములను ఒక్కసారిగా నాశనం చేయగలను.

పాశుపత వ్రతము[మార్చు]

శివుని మాటలు విన్న దేవతలు సంకోచిస్తూ తలలు వంచుకున్నారు. తమకు కూడా పశుత్వము వస్తుంది అని శకించారు. వారి అనుమానం అర్ధం చేసుకున్న శివుడు దేవతలారా ! మీరు భయపడ వద్దు. మీకు కలిగిన పశుత్వము నుండి బయటపడటానికి ఒక మార్గం ఉంది. మీరంతా పాశుపత వ్రతం ఆచరించి మీ పశుత్వము పోగొట్టుకొని మోక్షము పొంద వచ్చు. ఆ వ్రతము పన్నెండు సంవత్సరములు చేయవలెను. చేసే వారి నిష్టానుసారం ఒక సంవత్సరము కాని ఆరు నెలలు కాని, ఒక రుతువులో కాని, ఒక మాసముకాని, కనీసం పన్నెండు దినములలో కాని ఫలితం ఇస్తుంది. ఆ మాటలకు దేవతలు సమ్మతించి అన్ని లోకములకు పశుత్వము రావడానికి అంగీకరించి. శివునకు పశుపతిత్వము కలగడానికి ఒప్పుకుని అతడిని పశుపతిగా కీర్తించారు. దేవతలంతా తమ తేజస్సులో సగము శివునకు ధారపోసారు. ఆ తేజస్సును అందుకున్న పరమ శివుడు తేజోవంతుడయ్యాడు. ఇంద్రుడు దేవతలతో కూడి శివుడిని త్రిపురాసుర సంహారానికి అభిషేకించారు. దేవతలందరూ త్వష్ట ప్రజాపతిని చూసి శివుడికి మహోత్కృష్టమైన ఒక విల్లును, ఒక రథమును, అమ్మును, హయములను తయారు చేసి ఇమ్మని అడిగారు.

త్రిపురాసుర సంహారానికి కావలసిన రధము[మార్చు]

దేవతల కోరిక మన్నించి త్వష్ట ప్రజాపతి విశ్వంభరా చక్రమును రథముగా చేసాడు. సూర్య చంద్రులను చక్రములుగా చేసి మహాసముద్రాలను ఇరుసులుగా చేసాడు. హిమవత్పర్వతము, వింధ్యాచలము, అస్తాచలమును స్తంభములుగా చేసాడు. త్రేతాగ్నులను హశ్వములకు త్రాళ్ళుగా చేసాడు. మేరు పర్వతమును ఛత్రముగా అమర్చాడు. నాలుగు వేదములను నాలుగు అశ్వములుగా అమర్చాడు. ఒక సంవత్సర కాలమును విల్లుగా చేసి విష్ణుమూర్తిని బాణంగా ఉండమని కోరాడు. ఈ విధంగా రథమును చేసాడు త్వష్ట ప్రజాపతి. అది చూసి శివుడు సంతోషించిన పరమశివుడు గ్రహమండలమును ఉపాదానముగా చేసి విశ్వకర్మ చేసిన కవచమును తొడుగుకొన్నాడు. వృషభమును ధ్వజము మీద నిలిపి త్వష్టప్రజాపతి తన కొరకు రూపొందించిన రథము అధిరోహించి విల్లును పట్టుకున్నాడు. శివుడు ఇంద్రుడితో " దేవేంద్రా ! నాకు సారధి ఎవరు " అని అడిగాడు. ఇంద్రుడు " నీకు ఇష్టము అయిన వాడిని ఎన్నుకో " అన్నాడు. శివుడు " దేవేంద్రా ! నా సారధి నాకంటే అధికుడై ఉండాలి. అలాంటి వాడిని నాకు సారధిగా నియమించండి " అన్నాడు. దేవతలు మునులతో సంప్రదించి బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి " బ్రహ్మదేవా ! నీవు కోరిన ప్రకారము ఆ దేవదేవుడు మా కోరిక మన్నించి త్రిపురాసుర సంహారముకు అంగీకరించారు. మేము అతడు కోరినట్లు రధమును సమకూర్చాము. కాని ఆయన కోరినట్లు మాకు అతడిని మించిన సారధి దొరక లేదు. రుద్రుడికి సారధ్యం వహించడానికి మీకంటే ఎవరూ మాకు కనిపించుట లేదు కనుక మీరు రుద్రుడికి సారధ్యం వహించాలి " అప్పుడు బ్రహ్మదేవుడు వారి కోరిక మన్నించి రుద్రుడికి సారథిగా ఉండటానికి అంగీకరించాడు. బ్రహ్మదేవుడు సారథిగా రథమును అధిరోహించగానే రథాశ్వములు ఇద్దరు మూర్తులను భరించ లేక కింద పడుకున్నాయి. బ్రహ్మదేవుడు ఆ అశ్వములను లేపి వాటికి బలము, శౌర్యము ఇచ్చి త్రిపురాసురులతో యుద్ధానికి సన్నద్ధం చేసాడు. అప్పుడు పరమశివుడు " బ్రహ్మ దేవా ! ఆ రాక్షసులు ఉన్న వైపు రధము పోనిమ్ము " అన్నాడు. బ్రహ్మదేవుడు వాయువేగ మనో వేగాలతో రథమును తోలాడు. అధర్వుడు, అంగీరసుడు తనకు చక్రరక్షకులుగా రాగా పరమేశ్వరుడు రాక్షసులతో యుద్ధానికి వెళ్ళాడు. అప్పుడు పరమేశ్వరుడు తన విల్లు ఎక్కు పెట్టి పాశుపతమును మనసున స్మరించి ఆ మూడు పురములను తలిచాడు. వెంటనే పరమశివుని సంకల్పము మేరకు మూడు పురములు ఒక చోట చేరాయి. అప్పుడు రుద్రుడు పాశు పతమును ప్రయోగించి త్రిపురములను దగ్ధం చేసాడు. కాని ఆ పాశుపతాగ్ని జ్వాలలకు మూడు లోకములు దహించుకు పోసాగాయి. అప్పుడు శివుడు ఆ అగ్ని జ్వాలలను ఆర్పి వేసాడు. మహా మునులు, దేవతలు పరమశివుని స్తుతించారు. కనుక శల్య మహారాజా మీరు కర్ణుడి కంటే అర్జునుడి కంటే కృష్ణుడి కంటే బలము శౌర్యములో గొప్ప వాడివి. నా జీవితము, నా రాజ్యము మీ చేతిలోఉన్నాయి.

భార్గవరాముని కథ[మార్చు]

సుయోధనుడు శల్యునితో భార్గవ రాముని గురించి చెప్పసాగాడు. " నా తండ్రి గారికి ఒక ధర్మ ప్రవీణుడగు బ్రాహ్మణుడు చెప్పగా విన్నాను. జమదగ్ని మహామునికి రాముడనే నిర్మల హృదయుడు పుత్రునిగా అవతరించాడు. అతడి శివుడి గురించి తపస్సు చేసి శివుని ప్రత్యక్షము చేసుకుని తనకు దివ్యాస్త్రములు ప్రసాదించమని కోరాడు. మహాశివుడు నేను ప్రసాదించు దివ్యాస్త్రాలు అశుచిగా ఉన్న వారిని దహిస్తాయి కనుక నీవు శుచి అయి వచ్చిన దివ్యాస్త్రములు లభించగలవు " అన్నాడు. రాముడు " నేను ఈ అస్త్రములు గ్రహించుటకు ఎప్పుడు పాత్రుడను అని నీవు తలుస్తావో అప్పుడే వాటిని నాకు ప్రసాదించ వచ్చు " అన్నాడు. ఒక రోజు శివుడు పార్వతికి పరశురాముని చూపి " దేవీ ఇతడు రాముడు. నన్ను నిష్కలంక చిత్తముతో ఆరాధిస్తున్నాడు. నాకు పరమ భక్తుడు " అన్నాడు. ఆ సమయంలో దేవతలు తమను రాక్షస బాధ నుండి రక్షించమని శివుని వేడారు. శివుడు భార్గవరాముని చూసి " వెంటనే నీవు వెళ్ళి రాక్షస సంహారం చెయ్యి " అన్నాడు. అందుకు రాముడు " దేవా ! నేను ఏ అస్త్రములు అభ్యసించ లేదు కనుక బలవంతులైన రాక్షసులను నేను సంహరించగలనా ! " అని సందేహం వెలిబుచ్చాడు. పరమశివుడు " రామా ! నేను నా సంకల్పము నీ మీద ఉంచుతాను. నా సంల్ప బలం చేత నీవు రాక్షసులను నిర్జించు " అన్నాడు. రాముడు రాక్షసులతో భయంకర యుద్ధము చేసి వారిని నిర్జించాడు. అప్పుడు రామునికి అయిన గాయాలను అతడి శరీరం అంతా శివుడు నిమరగానే మాయం అయ్యాయి. రామా నా స్పర్శ పొందిన నీకు ఎలాంటి ఆయుధములు తగిలినా గాయము కాదు. నా వద్ద వరములు పొందుటకిది తగిన సమయము " అన్నాడు. అప్పుడు రాముడు శివుడిని కోరి అనేక దివ్యాస్త్రములను ఆయుధములను పొంది తన ఆశ్రమముకు వెళ్ళాడు. తరువాత కర్ణుడు భార్గవ రాముని సేవించి అనేక దివ్యాస్త్రములను పొందాడు. హీనకులజుడైన కర్ణుడికి భార్గవరాముడు దివ్యాస్త్రములను ఎందుకు ఇస్తాడు. భార్గవ రాముని ఆదరణ పొందిన అతడు ఉత్తమ కులజుడనే తలుస్తాను. అతడి ఆజానుబాహువైన ఆకారము దేవకుమారుని తలపిస్తుంది. ఒక సాధారణ స్త్రీ సకజ కవచకుండలములతో సూర్యప్రభలా వెలిగి పోయే బిడ్డను కనగలదా ! సూతుని చేత పెంచబడటము వలన కర్ణుడికి సూతుడనే అపవాదు వచ్చింది. కనుక శల్య మహారాజా ! శివుడి శిష్యుడైన భార్గరాముని శిష్యుడైన కర్ణుడికి సారధివై రుద్రుడికి బ్రహ్మదేవుడు సారధి అయినట్లు రధికుడికంటే సారధి గొప్పవాడన్న కీర్తి నిలబెట్టు " అన్నాడు.

కర్ణ సుయోధనులు శల్యుని శ్లాఘించుట[మార్చు]

సుయోధనుడి యుక్తాయుక్తమైన మాటలకు శల్యుడు పొంగి పోయాడు. సుయోధనుడిని ఆదరంతో కౌగలించుకున్నాడు. సుయోధనా ! నన్నూ నా పరాక్రమాన్ని నీవు గ్రహించి మెచ్చుకుని నాకు ఆనందం కలిగించావు. కాని ఒక్క మాట నేను నాకు తోచినట్లు మాట్లాడి సలహాలు ఇస్తుంటాను. మీరు కోపించక ఓపికగా ఏమీ అనుకోకుండా వినాలి " అన్నాడు. కర్ణుడు " మహానుభావా ! ఆ పరమేశ్వరునికి బ్రహ్మవలె, అర్జునుడికి శ్రీకృష్ణుడి వలె నాకు సారథ్యం వహించు " అన్నాడు. శల్యుడు " నేను ఇంద్రుడికైనా ! సారథ్యం వహించ గలను. నా రథికుని క్షణమైనా ఏమరిపాటుగా ఉండనివ్వను. కృష్ణుడి సారథ్యంలో ఘనుడైన అర్జుడిని గెలువడానికి నా సారథ్యము కోరుతున్నావు కనుక నేను నీకు సారథ్యం వహిస్తాను " అని అన్నాడు. సుయోధనుడు " కర్ణా ! కృష్ణుడికంటే శల్యుడు సారథ్యంలో సమర్ధుడు. ఇంద్రుడి సారథి మాతలికంటే కూడా శల్యుడు ఘనుడు అటువంటి మహాఘనుడు నీ భాగ్యవశాత్తు నీకు సార్ధ్యం వహిస్తున్నాడు. ఇక నీవు అర్జునుడిని గెలువగలవు " అన్నాడు. వెంటనే శల్యుడు కర్ణ సార్ధ్యానికి తగిన రధమును సమాయత్తం చేయమని చెప్పాడు. రధముకు పూజాది కార్యములు నిర్వహించారు. కర్ణుడు రధముకు ప్రదిక్షిణము చేసి శల్యుని ముందుగా రధమును అధిరోహించమని తాను తరువాత రధుమును అధిరోహించాడు. ఆ ప్రకారముగా శల్యుడి సారధ్యంలో కర్ణుడి రధము యుద్ధముకు కదిలింది " అన్నాడు సంజయుడు.

బయటి లింకులు[మార్చు]