ఆది పర్వము తృతీయాశ్వాసము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


తృతీయాశ్వాసం[మార్చు]

సభలోని వారికి భారత గాథను వినిపిస్తున్న వైశంపాయనుడు - రజ్మానామా నుండి ఒక దృశ్యం

అర్ధాంతరంగా ఆగిపోయిన సర్పయాగం తరువాత జనమేజయుడు ఋత్విక్కులకు దక్షిణాది సత్కారాలను చేసాడు. వ్యాస భగవానుని చూసి మీవంటి పూజ్యులచే పంచి ఇవ్వబడిన రాజ్యాన్ని పాలించకుండా కురు పాండవులు యుద్ధం ఎందుకు చేసారు అని అడిగాడు. వ్యాసుడు వైశంపాయుని చూసి జనమేజయునకు భారత కథను వివరించమని ఆదేశించాడు. జనమేజయుడు వైశంపాయునకు పూజలు చేసి బంధు మిత్ర పురోహిత సహితంగా భారతగాధను వినడానికి అతని ముందు కూర్చున్నాడు.

ఉపరిచరవసువు[మార్చు]

చేది రాజ్యాన్ని పాలిస్తున్న వసువు ఒక నాడు వేటకు వెళ్ళి అక్కడ తపమాచరిస్తున్న మునులను చూసి ముచ్చట పడి తాను కూడా తపస్సు చేయడం మొదలు పెట్టాడు. అది చూసిన ఇంద్రుడు రాజా ! రాజ్యపాలన చేయవలసిన నీకు ఈ తపసేమిటి నాతో స్నేహం చేస్తే నేను నీకు ఓ దివ్య విమానమును ఇస్తాను. దానితో ఇంద్రలోకానికి వస్తూ పోతూ ఉండచ్చు అని చెప్పి ఇంద్రుడు వసువుకు, యుద్ధంలో ఏ ఆయుధంతో దెబ్బ తగలకుండా చేసే ఎప్పటికి వాడని వైజయంతి అనే పూల మాలనూ,సర్వకోరికలను తీర్చి రక్షించే సామర్థ్యం కలిగిన వేణు ఇష్టి (వెదురు కర్ర)ను ఇచ్చి వెళ్ళాడు. వసువు ఆ విమానం ఎక్కి ఇంద్ర లోకానికి రాకపోకలు సాగించడంతో అతనికి ఉపరిచర వసువు అనే నామాంతరం కలిగింది. ఆ తరువాత అతడు ప్రతి సంవత్సరం రాజ్యంలో ఇంద్రోత్సవాలు జరిపించ సాగాడు. చేది రాజ్యానికి సమీపంలో కోలాహలము అనే పర్వతాన్ని ఆనుకుని శుక్తిమతి అనే నది ప్రవహిస్తుండగా కోలాహలుడు ఆ నది అందానికి మురిసి ఆమెను మోహించి నదికి అడ్డం పడ్డాడు. అటుగా వచ్చి అది చూసిన వసువు నదికి అడ్డంగా ఉన్న పర్వతాన్ని తొలగించాడు. శుక్తిమతి కోలాహలునికి జన్మించిన గిరిక అనే ఆడపిల్లను వసుపదుడు అనే మగ పిల్ల వాడిని శుక్తిమతి వసువుకు బహూకరించింది. వసువు గిరికను వివాహమాడి వసుపదుడిని సేనాధిపతిని చేసాడు. ఒక రోజు వేటకు వెళ్ళిన వసువుకు భార్య గుర్తుకు వచ్చి వీర్య పతనం జరుగగా వసువు దానిని ఒక దోనెలో భద్రపరచి ఒక డేగకు ఇచ్చి గిరికకు పంపించాడు. మార్గమధ్యంలో మరొక డేగ దానిని తినే పదార్ధమని భ్రమించి కలహించడంతో ఆ దొప్పలోని వీర్యం నేరుగా బ్రహ్మ శాపవశాన చేపగా మారి యమునా నదిలో తిరుగుతున్న అద్రిక అనే అప్సర నోట్లో నేరుగా పడింది. అద్రిక గర్భం దాల్చింది. జాలరి వాళ్ళ వలలో పడిన అద్రిక గర్భంలో ఉన్న ఆడపిల్లనూ మగ పిల్లవాడిని చూసి జాలర్లు వారిని దాశరాజుకు సమర్పించారు. ఆ పిల్లవాడు పెరిగి మత్స్యదేశ రాజైనాడు. దాశ రాజు ఇంట మత్స్యగంధి పేరిట ఆ పిల్ల పడవ నడుపుతూ ఉంది.

వ్యాసజననం[మార్చు]

మత్స్యగంధి పడవ నడిపే తరుణంలో ఒక రోజు ఆ పడవలో వశిష్ట మహాముని కుమారుడైన శక్తి మహాముని కుమారుడు పరాశరుడు ప్రయాణిస్తూ మత్స్య గంధిని చూసి మోహించి ఆమెతో సంగమించగా వారిరువురికి వ్యాస భగవానుడు జన్మించాడు. పుట్టగానే వ్యాసుడు తల్లికి నమస్కరించి తనను తలచిన మరుక్షణం ఆమె ఎదుట ఉంటానని మాటిచ్చి తపసు చేసుకోవడానికి వెళ్ళాడు. ఆ పై వైశంపాయనుడు దేవ దానవ అంశలతో పాండవులు కౌరవులు పుట్టారని చెప్పగా జనమేజయుడు దేవాంశతో పుట్టిన వారు యుద్ధం ఎందుకు చేశారని సందేహం వెలుబుచ్చాడు. సమాధానంగా వైశంపాయనుడు పరశురామ దండయాత్రకు క్షత్రియులంతా బలి కాగా రాజుల భార్యలు వంశాభివృద్ధి కొరకు ఆ కాల ధర్మం అనుసరించి ఉత్తములైన బ్రాహ్మణుల అనుగ్రహంతో సంతానవతులైయ్యారు. మరలా రాజులు ధర్మపరిపాలన సాగించగా భూమి సుభిక్షంగా ఉండి ప్రజల ఆయుర్ధాయం పెరిగి మరణాలు తగ్గాయి భూభారం ఎక్కువైంది. భూదేవి త్రిమూర్తుల వద్దకు వెళ్ళి భూభారాన్ని తగ్గించమని వేడుకొనగా వారు భూదేవితో దేవతల అంశంతో పాండవాది రాజులు రాక్షసాంశతో కౌరవాది రాజులు పుట్టి పరస్పరం కలహించుకొని కురుక్షేత్రమనే యుద్ధం చేస్తారు. ఆ యుద్ధంలో జనక్షయం జరిగి భూభారం తగ్గకలదని భూదేవితో చెప్పారు.

దేవదానవ జననం[మార్చు]

అదితి కుమారుడు దేవతల రాజు ఇంద్రుడు

జనమేజయుడు దేవదానవ జన్మ వృత్తాంతం వివరించమని వైశంపాయనుని కోరాడు. ఆయన ఇలా చెప్పాడు. సృష్టికి మూలం బ్రహ్మ దేవుడు. ఆయన మానస పుత్రులు మరీచి, అంగీ రసుడు, అత్రి, పులస్త్యుడు, పులహుడు, క్రతువు అనే ఆరుగురు. మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మ దేవుని కుడి బొటనవ్రేలి నుండి దక్షుడు ఎడమ బొటన వ్రేలి నుండి ధరణి జన్మించారు. వారిరువురికి వెయ్యిమంది మహా పురుషులు జన్మించారు. దక్షునికి ఏభై మంది కుమార్తెలు జన్మించారు. వారిలో పదమూడు మందిని కశ్యప ప్రజాపతికి ఇచ్చాడు. వారిలో దితికి హిరణ్య కశిపుడు అతనికి ప్రహ్లాదుడు అతనికి విరోచనుడు అతని కొడుకు బలి చక్రవర్తి అతని కొడుకు బాణాసురుడు. దను అనే మరో భార్యకు 40 మంది దానవులు జన్మించారు. సింహిక అనే దానవ వనితకు రాహువు జన్మించాడు. వినతకు గరుత్మంతుడు, అనూరుడు జన్మించారు. కద్రువకు నాగ కుమారులు జన్మించారు. బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగీరసునకు ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తనుడు అనే కుమారులు కలిగారు. బృహస్పతి ఇంద్రునికి గురువైయ్యాడు. మూడవ మానస పుత్రుడైన అత్రికి అనేక మంది మహా మునులు జన్మించారు. నాల్గవ మానస పుత్రుడైన పులస్త్యునకు రాక్షసులు పుట్టారు. ఐదవ మానస పుత్రునికి కిన్నెరలు, కింపురుషులు పుట్టారు. క్రతువు అనే మానస పుత్రునికి పక్షి జాతి పుట్టింది. దేవ్బుడు అనే వసువు కొడుకు ప్రజాపతి అతనికి అష్ట వసువులు జన్మించారు. వారిలో ప్రభావసునికి విశ్వకర్మ జన్మించాడు. బ్రహ్మ హృదయం నుండి భృగు మహర్షి జన్మించాడు. భృగువు కుమారుడు కవి అతని కుమారుడు శుకృడు. శుకృడు రాక్షస గురువైయ్యాడు. భృగువు కుమారుడు చ్యవనుడు అతని కుమారుడు ఔర్యుడు. ఔర్యుని కుమారుడు జమదగ్ని. జమదగ్ని కుమారుడు పరశురాముడు. ఇక భూమి పైన దేవ దానవాంశలతో రాజులు జన్మించారు. విష్ణు మూర్తి అంశతో కృష్ణుడు, ఆదిశేషుని అంశతో బలరాముడు, లక్ష్మీ దేవి అంశతో రుక్మిణీ, అప్సరసల అంశతో పదహారు వేల గోపికలు, ప్రభాసుని అంశతో భీష్ముడు, బృహస్పతి అంశతో ద్రోణుడు జన్మించారు. ద్రోణునికి కామ క్రోధములు కలసి అశ్వత్థామగా జన్మించాడు. మరుత్తుల అంశతో విరాటుడు, సాత్యకి, దృపదుడు జన్మించారు. సిద్ధి బుద్ధి అంశతో కుంతి మాద్రి జన్మించారు. ఏకాదశాంశతో కృపాచార్యుడు, సూర్యుని అంశతో కర్ణుడు జన్మించారు. హంసుడు అనే గంధర్వుడు దృతరాష్ట్రునిగానూ మతి అనే దేవత గాంధారిగానూ జన్మించారు. కలి అంశతో దుర్యోధనుడు,హిరణ్యకశిపుడు శిశుపాలునిగా, ప్రహ్లాదుడు శల్యునిగా, కాలనేమి అంశతో కంసుడు, విప్రచిత్తి అనే దానవుడు జరాసంధుడిగా పుట్టారు. అశ్వపతి కృతవర్మగా గుహ్యకుడు శిఖండిగా, మరుద్గణాంశతో పాండురాజు జన్మించారు.మాండవ్యముని శాపకారణంగా యమ ధర్మరాజు విదురుడిగా జన్మించాడు. యముడి అంశతో ధర్మరాజు, వాయుదేవుని అంశతో భీముడు, ఇంద్రుని అంశతో అర్జునుడు, అశ్వినీ దేవతల అంశతో నకుల సహదేవులు జన్మించగా శ్రీ అంశతో ద్రౌపది, అగ్ని అంశతో ధృష్టద్యుమ్నుడు జన్మించారు.

భారత చక్రవర్తులు[మార్చు]

ఊర్వశీ పురూరవులు - రాజా రవి వర్మ చిత్రం

అదితి కశ్యపుల పుత్రుడైన వివస్వతుని కుమారుడైన వైవస్వత మనువుకు చతుర్వర్ణాలు కలిగిన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య,శూద్రులు కలిగారు. చంద్రుడి కొడుకు బుధుడు. బుధుని కుమారుడు పురూరవుడు. అతడు ధనాశాపరుడై బ్రాహ్మణ ధనాన్ని అపహరించగా అది బ్రహ్మదేవునకు తెలిసి విషయం తెలుసుకుని రమ్మని సనత్కుమారాది మునులను పురూరవుని వద్దకు పంపాడు. పురూరవునిచే పరిహసించబడిన మునులు కోపించి పురూరవుని వెర్రివాడివి కమ్మని శపించారు. పురూరవుని భార్య ఊర్వశి అనే అప్సర. వారికి ఆరుగురు కుమారులు. వారిలో ఆయుషుడు అనే కుమారునికి కలిగిన నహుషుడు చక్రవర్తి అయ్యాడు. నహుషుని భార్య ప్రియంవద. వారి పుత్రుడు యయాతి. యయాతికి దేవయాని వలన ఇద్దరు కుమారులు కలిగారు. వృషపర్వుడనే రాక్షస రాజు కుమార్తె శర్మిష్ట వలన ముగ్గురు కుమారులు కలిగారు. శుకృని శాపం వలన యయాతికి ముసలి తనం వచ్చింది. యయాతి తన కుమారులను పిలిచి వారి యవ్వనాన్ని తనకు ఇమ్మని అడిగాడు. వారిలో పూరుడు తన యవ్వనాన్ని తండ్రికి ఇచ్చి అతని ముసలితనాన్ని గ్రహించాడు. అప్పుడు జనమేజయుడు వైశంపాయినుని వద్ద ఒక సందేహం వెలిబుచ్చాడు. మహర్షీ క్షత్రియుడు చక్రవర్తీ అయిన యయాతి బ్రాహ్మణుడు రాక్షస గురువూ అయిన శుకృని కుమార్తెను ఎలా వివాహమాడాడు " అని అడిగాడు. సమాధానంగా వైశంపాయనుడు ఇలా చెప్పాడు.

కచ దేవయానుల వృత్తాంతం[మార్చు]

దస్త్రం:Shukracharya and Kacha.jpg
శుక్రాచార్యుడు, కచుడు

వృషపర్వుడు అనే రాక్షస రాజుకు శుక్రాచార్యుడు గురువుగా ఉన్నాడు. శుక్రాచార్యుని కుమార్తె దేవయాని. శుక్రాచార్యునికి మృతసంజీవిని తెలుసు. ఆ విద్యతో దేవాసుర యుద్ధంలో మరణించిన రాక్షసులను బ్రతికిస్తూ వచ్చాడు. అందు వలన రాక్షసబలం అంతకంతకూ పెరుగుతూ వచ్చింది. దేవతలు దేవగురువు కుమారుడైన కచుని వద్దకు వెళ్ళి అతనితో శుకృని వద్దకు వెళ్ళి అతని కుమార్తె దేవయాని అభిమానం సంపాదించి ఆమె ద్వారా మృతసంజీవని విద్య తెలుసుకు రమ్మని లేనియడల రాక్షసులను జయించుట కష్టమని అడిగారు. శుకృనికి దేవయాని మీద అత్యంత ప్రేమ కనుక ఇది సాధ్యం కాగలదని చెప్పారు. కచుడు సమ్మతించి శుకృని వద్దకు వెళ్ళి బృహస్పతి కుమారునిగా తనను తాను పరిచయం చేసుకుని శిష్యుడుగా చేరాడు. క్రమంగా కచుడు దేవయాని శుకృల అభిమానం చూరకొన్నాడు. అది మిగిలిన రాక్షస శిష్యులకు నచ్చక అతనిని అనేక యాతనలకు గురిచేసి చివరకు అతనిని చంపి బూడిద చేసి శుకృనికి మద్యంలో కలిపి ఇచ్చారు. దేవయాని ద్వారా అది తెలుసుకున్న శుకృడు ఆమె దిగులు పోగొట్టటానికి తన కడుపులోని కచునకు మృతసంజీవిని నేర్పాడు. కచుడు ఆవిద్యతో బయటకు వచ్చి తిరిగి శుకృని బ్రతికించాడు. కొంత కాలానికి కచుడు శుకృని వద్ద శలవు తీసుకుని తన లోకానికి పోయే సమయంలోదేవయాని అడ్డు వచ్చి అతనిని పోవద్దని తనను వివాహ మాడమని బ్రతిమాలింది. కచుడు గురుపుత్రి సోదరితో సమానం కనుక వివాహం పొసగదని చెప్పాడు. అందుకు కోపించిన దేవయాని తన దయతో సంపాదించిన మృతసంజీవని అతనికి పనిచేయకూడదని శపించింది. కచుడు అది తనకు ఉపయోగించక పోయినా తన వద్ద ఉపదేశం పొందిన వారికి పనిచేస్తుందని చెప్పి, తనకు కలిగిన శాపానికి ప్రతి శాపంగా దేవయానిని క్షత్రియుడు పెళ్ళాడతాడని చెప్పి తన లోకానికి వెళ్ళాడు.

శర్మిష్ఠ దేవయానీ[మార్చు]

ఒక రోజు రాక్షసరాజ పుత్రి శర్మిష్ట గురు పుత్రి దేవయాని వేయి మంది చెలికత్తెలతో వన విహారానికి వెళ్ళారు. అక్కడ కొలను తీరంలో వారు దుస్తులు విడిచి స్నానం చేస్తున్న తరుణంలో గాలికి బట్టలన్నీ కలసి పోయాయి. బయటకు వచ్చిన దేవయాని దుస్తులు శర్మిష్ట వేసుకుంది. కానీ దేవయాని తాను బ్రాహ్మణ కన్యనని ఒకరు విడిచిన దుస్తులు వేయనని చెప్పింది. శర్మిష్ట కోపగించి నా తండ్రి దగ్గర సేవచేసే బ్రాహ్మణుని పుత్రికి నా దుస్తులు పనికి రాలేదా అని నిందించి ఆమెను ఒక పాడు బడ్డ బావిలో త్రోసి చెలికత్తెలతో వెళ్ళి పోయింది. ఆ సమయానికి అటుగా వచ్చిన యయాతి మహారాజు ఆమెను రక్షించి ఆమె వృత్తాంతం తెలుసుకుని తనరాజ్యానికి వెళ్ళాడు. ఆ తరువాత దేవయాని అక్కడకు వచ్చిన తన చెలికత్తెతో తాను తిరిగి వృషపర్వుని రాజ్యానికి రానని తన తండ్రికి చెప్పమని చెమ్మంది. శుకృడు దేవయానిని ఎంత అనునయించినా నిఫలం కావడంతో శుకృడు కూడా నగరాన్ని విడిచి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. విషయం తెలిసి అక్కడకు వచ్చిన వృషపర్వుడు శుకృని దయలేకుండా తాము జీవించలేమని వారు ఏది కావాలన్నా ఇస్తానని వేడుకున్నాడు. శుకృని తరఫున దేవయాని శర్మిష్ట వేయి మంది చెలికత్తెలతో తనని సేవిస్తే తామిరువురు నగరంలో ఉంటామని చెప్పింది. వృషపర్వుడు అందుకు అంగీకరించాడు.

యయాతీ దేవయానుల వివాహం[మార్చు]

దేవయాని తన చెలికత్తెలతో అదే వనవిహారానికి వెళ్ళి అక్కడ తిరిగి యయాతిని చూసింది. దేవయాని యాయాతితో తామిరువురికి ఒకసారి పాణి గ్రహణం జరిగింది కనుక తనను అతడు వివాహం చేసుకోవాలని కోరింది. యయాతి బ్రాహ్మణుడు క్షత్రియ కన్యను వివాహమాడవచ్చు కాని క్షత్రియుడు బ్రాహ్మణ కన్యను వివాహమాడటం ధర్మం కాదని చెప్పాడు. పట్టువదలని దేవయాని తన తండ్రిని రప్పించి తండ్రిచే అందుకు అంగీకారాన్ని పొంది యయాతిని వివాహమాడింది. యయాతి తన భార్యతోనూ ఆమె చెలికత్తెలతో తన రాజ్యానికి చేరుకోవడానికి ఆయత్తమైన సమయంలో శుకృడు శర్మిష్ట వృషపర్వుని కూతురని ఆమెను దూరంగా ఉంచమని ప్రత్యేకంగా చెప్పాడు.

యదువంశజులు[మార్చు]

దస్త్రం:Sharmista was questined by Devavayani.jpg
శర్మిష్టను అడుగుచున్న దేవయాని

దేవయానీ యయాతికి యదువు, తుర్వసుడు అనే ఇద్దరు కుమారులు పుట్టారు. శర్మిష్ట తన జీవితం వృధా అయినందుకు బాధ పడి ఒంటరిగా ఉన్న యయాతి మహారాజుని కలసి దేవయాని చెలికత్తె కనుక తాను కూడా భార్యతో సమానమని చెప్పి అతనిని ఒప్పించి అతని వలన దృహ్వుడు, అనువు, పూరుడు అనే ముగ్గురు పుత్రులను పొందింది. మొదట దేవయానికి ఆ విషయం దాచి ఒక ముని వలన సంతానం కలిగిందని అబద్ధం చెప్పింది. కానీ శర్మిష్ట పుత్రులను అడిగి విషయం గ్రహించిన దేవయాని జరిగినది తన తండ్రికి చెప్పగా అతడు యయాతికి శాపం ఇచ్చాడు. శాపవశాన వచ్చిన ముసలితనాన్ని శర్మిష్ట కుమారుడైన పూరునికి ఇచ్చి అతడి యవ్వానాన్ని తాను గ్రహించి వేయి సంవత్సరముల తరువాత పూరునికి యవ్వనాన్ని తిరిగి ఇచ్చి కృతజ్ఞతగా అతనిని చక్రవర్తిని చేసాడు. యయాతి కోరికకను నిరాకరించిన అతని కుమారులు నలుగురికి శాపం ఇచ్చాడు. శాపకారణంగా యదు వంశస్థులు రాజ్యార్హత శాశ్వతంగా పోగొట్టుకున్నారు, తుర్వసులు కిరాతకులకు రాజులయ్యారు, ద్రూహ్యులు అతని వంశస్థులు జలమయ ప్రదేశాలకు రాజలయ్యారు, అనువు వంశజులు యవ్వనంలోనే మరణం పాలయ్యారు. శర్మిష్ట కుమారునికి రాజ్యం ఇవ్వనచ్చని ప్రజలకు నచ్చ చెప్పి యయాతి తపోవనానికి వెళ్ళి వేయి సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మ లోకానికి వెళ్ళాడు. అక్కడ కొన్ని కల్పములు ఉండి ఇంద్ర లోకానికి వెళ్ళాడు. ఇంద్రుడు యయాతిని పరీక్షించడానికి నీ తపస్సు చాలా గొప్పది కనుక స్వర్గ లోక భోగాలనుభవిస్తున్నావని అన్నాడు. అందుకు యయాతి కొంచం అతిశయించి దేవ, మానవ, మునిగణాలలో ఎవరూ తనకు మించిన తపస్సు చేయలేదని చెప్పగానే అతని పుణ్యం నశించింది. ఇంద్రుడు యయాతిని తిరిగి మానవ లోకానికి వెళ్ళమనగా యయాతి తాను తిరిగి మానవలోకానికి వెళ్ళలేనని నక్షత్ర లోకానికి వెళతానని ఇంద్రుని కోరాడు. ఇంద్రుని అనుమతితో నక్షత్రలోకం చేరిన యయాతి అక్కడ అతడు తన దహోత్రులను చూసి వారికి తన వృత్తాంతం త్తెలిపాడు. వారు యయాతిని అడిగి అనేక ధర్మ సూత్రాలు పిండోత్పత్తి రహస్యాలు తెలుసుకున్నారు. యయాతి సాహచర్యంతో పుణ్యం కలిగి అతని మనుమలు అష్టకుడు మొదలైన వారు తిరిగి యయాతితో పుణ్యలోకాలకు వెళ్ళారు.

బయటి లింకులు[మార్చు]