జవహర్ నవోదయ విద్యాలయం

వికీపీడియా నుండి
(జవహర్ నవోదయ విద్యాలయాలు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
జవహర్ నవోదయ విద్యాలయం
స్థానం
భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలో (తమిళనాడు మినహా)

భారతదేశం
సమాచారం
ఇతరపేర్లుజేఎన్వీ, నవోదయ
రకంప్రభుత్వ రంగం
Mottoప్రజ్ఞానం బ్రహ్మ[lower-alpha 1]
("అత్యున్నత జ్ఞానమే బ్రహ్మము")
స్థాపన1986; 38 సంవత్సరాల క్రితం (1986)
స్థాపకులుభారత ప్రభుత్వం
పాఠశాల పరీక్షల బోర్డుసిబిఎస్సి
Chairmanధర్మేంద్ర ప్రధాన్
తరగతులుVI - XII
వయస్సు11 – 19 సంవత్సరాలు
విద్యార్ధుల సంఖ్య265,574 [1]
Campus sizeప్రతీ విద్యాలయం సుమారు 30 ఎకరాలు
Campus typeనివాసంతో కూడినది
Color(s)నేవీ నీలం,తెలుపు
Websitenavodaya.gov.in

జవహర్ నవోదయ విద్యాలయాలు (సంక్షిప్తంగా జె ఎన్ వి లు) భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల నుండి ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం కేంద్రప్రభుత్వం నడుపుతున్న పాఠశాలల వ్యవస్థ. ఈ పాఠశాలలను భారత ప్రభుత్వానికి చెందిన పాఠశాల విద్య, అక్షరాస్యత శాఖ, విద్యామంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చే నవోదయ విద్యాలయ సమితి అనే స్వతంత్ర సంస్థ నిర్వహిస్తుంది. జెఎన్వీలు గురుకుల పాఠశాల పద్ధతిలో, బాల బాలికలకు విద్యనందిస్తాయి. ఇక్కడ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) అనుసంధానంతో, ఆరో తరగతి నుండి 12వ తరగతి (ఇంటర్మీడియట్ ఆఖరి సంవత్సరం) వరకు చదువు చెప్తారు.

భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన పిల్లలను కనుగొనడం, వారి కుటుంబాల సామాజిక-ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా, ఉత్తమ రెసిడెన్షియల్ పాఠశాల వ్యవస్థతో సమానమైన విద్యను అందించడం జేఎన్వీలకు ప్రత్యేకంగా అప్పగించబడింది.[2] జేఎన్వీలలో విద్య, వసతి, కార్యకలాపాల కోసం నిధులు భారత ప్రభుత్వ విద్యా శాఖ అందిస్తుంది. ఇక్కడ విద్యార్థులు 7 సంవత్సరాల పాటు ఉచితంగా ఉండవచ్చు.

జేఎన్వీలు తమిళనాడు మినహా భారతదేశమంతటా ఉన్నాయి.[3] 2019 సెప్టెంబరు 30 నాటికి, 636 జేఎన్వీలు 265,574 మంది విద్యార్థులతో నమోదు చేయబడ్డాయి, అందులో 206,728 (~ 78%) గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చిన విద్యార్థులున్నారు. 2019 లో జేఎన్వీలు 10 వ, 12 వ తరగతుల్లో వరుసగా 98.57%, 96.62% ఉత్తీర్ణతతో సిబిఎస్సి పాఠశాలల్లో అగ్రస్థానంలో నిలిచాయి.[4][5]

చరిత్ర[మార్చు]

జవహర్ నవోదయ విద్యాలయాల ఆలోచన భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీది.[6][7] సామాజిక న్యాయంతో పాటు నైపుణ్యాన్ని అందించే లక్ష్యంతో 1986 జాతీయ విద్యా విధానంలో భాగంగా భారతదేశంలోని ప్రతి జిల్లాలో ఒక జేఎన్వీని తెరవాలనే ఆలోచన పుట్టింది.[8] తదనంతరం నవోదయ విద్యాలయ సమితి (ఎన్వీఎస్) సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్, 1860 కింద సొసైటీగా నమోదు చేయబడింది.[8] 13 ఏప్రిల్ రోజున నవోదయ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటారు.

ప్రభుత్వ విధానం ప్రకారం, దేశంలోని ప్రతి జిల్లాలో ఒక జేఎన్వీ ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రారంభంలో, 1985-86 సమయంలో, రెండు జవహర్ నవోదయ విద్యాలయాలు - ఝజ్జర్ (హర్యానా), అమరావతి (మహారాష్ట్ర) లలో స్థాపించబడ్డాయి.[8] 2015–16 విద్యా సెషన్ నాటికి, 576 జిల్లాలకు జేఎన్వీలు మంజూరు చేయబడ్డాయి. ఎస్టీ జనాభా అధికంగా ఉన్న జిల్లాలలో పది జేఎన్వీలు, SC జనాభా అధికంగా ఉన్న జిల్లాలలో పది, మణిపూర్‌లో రెండు ప్రత్యేక జేఎన్వీలు అదనంగా మంజూరు చేయబడ్డాయి, వీటితో మొత్తం మంజూరు చేయబడిన జేఎన్వీల సంఖ్య 598 కి చేరుకుంది.[9] వీటిలో 591 జేఎన్వీలు పనిచేస్తున్నాయి.[10] 2016 నవంబరు లో, ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ 62 మంజూరుకాని జిల్లాలలో జేఎన్వీలను తెరవడానికి ఆమోదం తెలిపింది.[10] ఇవి కార్యకలాపాలు ప్రారంభిస్తే మొత్తం జేఎన్వీల సంఖ్య 660 కి చేరుకుంటుంది.

సంస్థాగత నిర్మాణం[మార్చు]

ప్రభుత్వం ఆధ్వర్యంలో స్వయంప్రతిపత్తి కలిగిన నవోదయ విద్యాలయ సమితి (ఎన్వీఎస్) ద్వారా నవోదయ విద్యాలయాలు నిర్వహించబడుతున్నాయి. విద్యా మంత్రి ఈ సమితికి చైర్మన్.[11][12]

విద్యా మంత్రి అధ్యక్షతన ఎగ్జిక్యూటివ్ కమిటీ ద్వారా సమితి పనిచేస్తుంది. సమితికి నిధుల కేటాయింపుతో సహా అన్ని వ్యవహారాల నిర్వహణకు ఎగ్జిక్యూటివ్ కమిటీ బాధ్యత వహిస్తుంది, సమితి యొక్క అన్ని అధికారాలను ఉపయోగించుకునే హోదా ఉంది. దీనికి రెండు సబ్ కమిటీలు, ఫైనాన్స్ కమిటీ, అకడమిక్ అడ్వైజరీ కమిటీ సహాయాన్ని అందిస్తాయి.[12] కమిషనర్, పరిపాలనా కార్యనిర్వాహక అధిపతి. వీరు సమితి కార్యనిర్వాహక కమిటీ నిర్దేశించిన విధానాలను అమలు చేస్తారు. అతనికి/ఆమెకు ప్రధాన కార్యాలయ స్థాయిలో జాయింట్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్లు సహాయం చేస్తారు. సమితి వారి పరిధిలో నవోదయ విద్యాలయాల నిర్వహణ, పర్యవేక్షణ కోసం ఎనిమిది ప్రాంతీయ కార్యాలయాలను ఏర్పాటు చేసింది. ఈ కార్యాలయాలకు డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్లు నాయకత్వం వహిస్తారు.[12]

ప్రతి జేఎన్వీకి, విద్య, మౌలిక సదుపాయాలు, ఇతర సాధారణ కార్యకలాపాల విషయాలలో సహాయం కోసం ఒక విద్యాలయ సలహా కమిటీ, బడ్జెట్ తయారీ, తాత్కాలిక ఉపాధ్యాయుల ఎంపిక, పాఠశాల సరైన పనితీరు కోసం విద్యాలయ నిర్వహణ కమిటీ ఉంటాయి.[11] సాధారణంగా సంబంధిత జిల్లా కలెక్టర్ ఈ పాఠశాల స్థాయి కమిటీల ఛైర్మన్ గా ఉంటారు. స్థానిక విద్యావేత్తలు, ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు సభ్యులుగా ఉంటారు. కొన్ని జేఎన్వీలు విద్యాసంబంధిత పనితీరును చూసుకోవడానికి ఒక విద్యాలయ సమన్వయ కమిటీని కూడా నిర్మించుకుంటాయి.[11][12]

ప్రాంతాల వారీగా నవోదయ విద్యాలయాలు[మార్చు]

జేఎన్వీ పాఠశాలల జాబితా [12]
ప్రాంతాలు (జేఎన్వీల సంఖ్య) రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలు (సంబంధిత జేఎన్వీల సంఖ్య)
భోపాల్ (113) [13] ఛత్తీస్‌గఢ్ (28), మధ్యప్రదేశ్ (54), ఒడిశా (31)
చండీగఢ్ (59) చండీగఢ్ (1), హిమాచల్ ప్రదేశ్ (12), జమ్ము-కాశ్మీర్ (23), పంజాబ్ (23)
హైదరాబాద్ (77) అండమాన్ నికోబార్ దీవులు (3), ఆంధ్రప్రదేశ్ (15), కర్ణాటక (31), కేరళ (14),

లక్షద్వీప్ (1), పుదుచ్చేరి (4), తెలంగాణ (9)

జైపూర్ (65) ఢిల్లీ (9), హర్యానా (21), రాజస్థాన్ (35)
లక్నో (89) ఉత్తరాఖండ్ (13), ఉత్తర ప్రదేశ్ (76)
పాట్నా (85) బీహార్ (39), జార్ఖండ్ (26), పశ్చిమ బెంగాల్ (20)
పూణే (73) దాద్రా, నగర్ హవేలి, డామన్, డ్యూ (1+2), గోవా (2),

గుజరాత్ (34), మహారాష్ట్ర (34)

షిల్లాంగ్ (100) అరుణాచల్ ప్రదేశ్ (18), అస్సాం (28), మణిపూర్ (11),

మేఘాలయ (12), మిజోరాం (8), నాగాలాండ్ (11), సిక్కిం (4), త్రిపుర (8)

భారతదేశంలోని 638 జిల్లాలలో మొత్తం 661 క్రియాశీల రెసిడెన్షియల్ పాఠశాలలు, ఇందులో కొన్ని ప్రత్యేకంగా మంజూరు చేయబడ్డాయి. ఇవి ఎనిమిది ప్రాంతీయ కార్యాలయాలు, (పట్టిక చూడండి) వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలనతో నిర్వహించబడతాయి.[12]

ప్రవేశo[మార్చు]

జేఎన్వీల్లో ఆరవ తరగతి ప్రవేశానికి జేఎన్వీఎస్టీలో (JNVST) ఉత్తీర్ణత సాధించడం అవసరం, జేఎన్వీఎస్టీ సిబిఎస్సి ద్వారా రూపొందించబడి, అభివృద్ధిచేయబడి, నిర్వహించబడే ప్రవేశ పరీక్ష.[14][15] ప్రతి జేఎన్వీ కోసం 80 మంది ప్రతిభావంతులైన విద్యార్థులను ఎంపిక చేయడానికి దేశవ్యాప్తంగా ఏటా ఆరవ తరగతి జేఎన్వీఎస్టీ నిర్వహిస్తారు. నిర్దిష్ట రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో సెషన్ నిర్మాణంపై ఆధారపడి ఇది సంవత్సరానికి మూడు దశల్లో నిర్వహించబడుతుంది.[14][15] అభ్యర్థులు కేవలం ఒక్కసారి మాత్రమే తమ V తరగతిలో పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.[16] జేఎన్వీఎస్టీ 2015 పరీక్షను 1,878,150 మంది విద్యార్థులు రాయగా, అందులో 41,48 మంది విద్యార్థులు ఎంపికయ్యారు (అంటే సుమారు 2% ఉత్తీర్ణత),[14][15] దీన్నిబట్టి ప్రవేశ పరీక్షలో పోటీని అంచనావేయవచ్చు. పరీక్షలో మానసిక సామర్థ్య నైపుణ్యాలు (mental ability), గణితం, ప్రాంతీయ భాషకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. ఎన్వీఎస్ (NVS) విధానం ప్రకారం పాఠశాలలు రిజర్వేషన్లను అందిస్తాయి, ఇందులో ఓబిసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ ఉంటుంది.[16] గ్రామీణ ప్రాంతాల నుండి కనీసం 75% మంది విద్యార్థులను, పట్టణ ప్రాంతాల నుండి గరిష్ఠంగా 25%, మహిళా విద్యార్థులను 33%, 3% వికలాంగ విద్యార్థులను ఎంపికచేస్తారు.[16]

ఖాళీల భర్తీకోసం, సీట్లను ఉత్తమంగా నిమపడానికి, IX తరగతి [14][15] అడ్మిషన్లు సిబిఎస్సిచే అభివృద్ధి చేయబడిన జేఎన్వీఎస్టీ పరీక్షతో జరుగుతాయి (VI తరగతికి, IX తరగతికి వేరువేరు పరీక్షలు జరుగుతాయి), XI తరగతి పార్శ్వ అడ్మిషన్లు X తరగతి మెరిట్ ఆధారంగా జరుగుతాయి.[14]

జేఎన్వీలలో విద్య[మార్చు]

మూడు భాషల సూత్రం[మార్చు]

జేఎన్వీలకు ప్రత్యేకమైన వలస వ్యవస్థ ఉంది. దాన్ని సులభతరం చేయడానికి విద్యార్థులు ఆరవ నుండి తొమ్మిదో తరగతి వరకు మూడు భాషలు నేర్చుకుంటారు.[17] ఈ భాషలు A లెవెల్, B-I లెవెల్, B-II స్థాయిలుగా వర్గీకరించబడ్డాయి.

Jawahar Navodaya Vidyalayas are a system of central schools for talented students predominantly from rural area in India.
జవహర్ నవోదయ విద్యాలయం, వర్గల్, ఉమ్మడి మెదక్ జిల్లా

వివిధ వర్గాల రాష్ట్రాలు అనుసరించే నమూనా క్రింది పట్టికలో చూపబడింది. అయితే, పిల్లలు రెండు భాషలు మాత్రమే చదవాలని సిబిఎస్సి ఆదేశించింది. అందువల్ల, విద్యార్థులు సిబిఎస్సి పరీక్షలలో A స్థాయి, B-I స్థాయి భాషలకు హాజరవుతారు.[17]

జేఎన్వీల మూడు భాషల సూత్రం [17]
రాష్ట్ర వర్గం ఒక స్థాయి భాష B-I స్థాయి భాష B-II స్థాయి భాష
హిందీ మాట్లాడే రాష్ట్రాలు హిందీ ఆంగ్ల ప్రాంతీయ భాష
హిందీయేతర భాష మాట్లాడే రాష్ట్రాలు (ఈశాన్య రాష్ట్రాలు మినహా) ప్రాంతీయ భాష ఆంగ్ల హిందీ
ఈశాన్య రాష్ట్రాలు ఆంగ్ల హిందీ ప్రాంతీయ భాష

స్మార్ట్ తరగతులు[మార్చు]

నవోదయ విద్యాలయాలు శామ్‌సంగ్ ఇండియా సహకారంతో 2013 నుండి 2019 వరకు 450 జేఎన్వీలు, 7 నవోదయ లీడర్‌షిప్ ఇనిస్టిట్యూట్‌లలో స్మార్ట్ తరగతులను ఏర్పాటు చేశాయి.[18] సాధారణంగా స్మార్ట్ తరగతిలో ఒక ఇంటరాక్టివ్ స్మార్ట్ బోర్డ్, ల్యాప్టాప్లు /ట్యాబ్లెట్లు, వై-ఫై అనుసంధానం, పవర్ బ్యాకప్ సౌకర్యాలు ఉంటాయి. ఒక స్మార్ట్ తరగతి గణితశాస్త్రం, విజ్ఞానశాస్త్రం, సాంఘికం, ఇంగ్లీష్, హిందీలలో మామూలు పాఠాలకు అనుబంధంగా ఇంటరాక్టివ్ పద్ధతిలో వివరణకు తోడ్పడుతుంది. ఉపాధ్యాయులు పరికరాలను సమర్థవంతంగా ఉపయోగించుకునేలా శిక్షణనిస్తారు.[19]

సామాజిక, సాంస్కృతిక జీవితం[మార్చు]

జేఎన్వీల సామాజిక వాతావరణం భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుండి సమాజంలోని వివిధ వర్గాల కలయికతో నిర్వచించబడుతుంది, ఎందుకంటే ఈ పాఠశాలలు ధ్రువీకరణ చర్య విధానాన్ని (రిజర్వేషన్) అనుసరిస్తాయి, వివిధ భాషా ప్రాంతాల నుండి వలస వచ్చే విధానాన్ని కలిగి ఉంటాయి. దేశవ్యాప్తంగా ఎంపిక చేయబడిన ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి ఒకే క్యాంపస్‌లో నివసించడం, 24X7 వారికి అందుబాటులో ఉండటంవల్ల కుటుంబ భావన పెంపొందుతుంది.[20]

వలస విధానం ద్వారా జాతీయ సమగ్రతకు ప్రోత్సాహం[మార్చు]

జేఎన్వీల ముఖ్యమైన లక్షణాలలో ఒకటి వలస కార్యక్రమం, దీనిలో రెండు విభిన్న భాషా వర్గాల ప్రాంతాలను అనుసంధానం చేస్తారు, ఆ రెండు జేఎన్వీలు తమ విద్యార్థులను మార్చుకుంటాయి.[21] మార్పిడి కార్యక్రమం యొక్క లక్ష్యం "జాతీయ సమైక్యతను ప్రోత్సహించడం , సామాజిక భావనను సుసంపన్నం చేయడం".[17] ఈ పథకం ప్రకారం, ఎంచుకున్న 30% విద్యార్థులు అనుసంధానమున్న వేరే జేఎన్వీకీ వెళ్తారు. వలస వచ్చిన జేఎన్వీలో కూడా తమ సొంత జేఎన్వీలోలాగా అవే స్థాయిలలో మూడు భాషలను నేర్చుకుంటారు. VI నుండి IX తరగతి వరకు మూడు భాషలు నేర్చుకోవడం వలన సామాజిక, సాంస్కృతిక మార్పుకు అలవాటుపడటం సులువవుతుంది.[17] ప్రారంభంలో IX నుండి XII తరగతి వరకు విద్యార్థులు వలసవెళ్ళే విధంగా అనుకున్నారు; 1991–92లో ఇది రెండు సంవత్సరాలకు (IX, X తరగతులు) తగ్గించబడింది. చివరకు 1996-97లో ఇది క్లాస్ IX విద్యార్థులకు మాత్రమే పరిమితం చేయబడింది.[17]

విద్యార్థుల సంరక్షణపై ఆందోళనలు[మార్చు]

విద్యార్థులలో ఆత్మహత్య సంఘటనలను, ఆరోగ్యం, వివక్షకు సంబంధించిన సమస్యలను పరిష్కరించే సరైన విధానాలు లేకపోవడం పాఠశాలలను వేధిస్తోంది.[22] ఇది దళిత, గిరిజన విద్యార్థులను మరింతగా ప్రభావితం చేసింది. అలాంటి సంఘటనలను నివారించడానికి ఎటువంటి పద్ధతి లేదు.[23][24] విద్యార్థుల సంరక్షణను నిర్లక్ష్యం చేయడం, విద్యార్థులను దూషించడం చేసిన సిబ్బందిపై కేసులను నివేదించడానికి వ్యవస్థ లేదు. ఇలాంటి ఉల్లంఘనలు జరిగాక అప్పుడు పాఠశాల యంత్రాంగం తమ దృష్టి సారిస్తుంది.[25][26]

గుర్తింపు పొందిన పూర్వ విద్యార్థులు[మార్చు]

  • హిమదాస్, 2018 లో అండర్-20 వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ 400 మీటర్ల ఈవెంట్‌లో స్వర్ణ పతకం విజేత.
  • సురేంద్ర పూనియా, అంతర్జాతీయ అవార్డు గెలుచుకున్న క్రీడాకారుడు, లిమ్కా బుక్ రికార్డ్ హోల్డర్
  • సంజీవ్ మొహపాత్ర, భారతీయ సినిమాటోగ్రాఫర్
  • సి.కె వినీత్, భారత జాతీయ ఫుట్‌బాల్ జట్టు సభ్యుడు, కేరళ బ్లాస్టర్స్ ఆటగాడు
  • వి.టి బలరామ్, 2011 మే నుండి కేరళ, త్రిథాల నియోజకవర్గం యొక్క ప్రస్తుత ఎమ్మెల్యే
  • ధనంజయ్ కన్నౌజియా, 2017 మార్చి నుండి ఉత్తరప్రదేశ్‌లోని బెల్తారా రోడ్ నియోజకవర్గం ప్రస్తుత ఎమ్మెల్యే
  • ధీరజ్ సింగ్ మొయిరాంగ్‌థెమ్, భారత అండర్ -17 ఫుట్‌బాల్ జట్టు సభ్యుడు, ఎఫ్.సి గోవా ఆటగాడు
  • ఉమ్మర్ ఫయాజ్ పర్రే, కాశ్మీర్లో అపహరించబడి చంపబడ్డ భారత సైనికాధికారి.
  • లలిత్ ప్రభాకర్, మరాఠీ నటుడు
  • అభిలాష్ శెట్టి, చిత్ర నిర్మాత, స్క్రీన్ రైటర్.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. https://navodaya.gov.in/nvs/en/Academic/Student-Profile/
  2. "NVS Overview". Archived from the original on 30 March 2013. Retrieved 2 December 2011.
  3. "Navodyas in Tamil Nadu". 24 October 2011. Retrieved 10 March 2017.
  4. "Blueprint JNV 2.0". Retrieved 7 May 2020.
  5. "Establishment of JNVs". Archived from the original on 27 అక్టోబరు 2017. Retrieved 10 March 2017.
  6. "Chalking a new path". India Today. 15 June 1988.
  7. "29 years and 589 schools later, Rajiv brainchild a rural hit". The Times of India. 21 June 2015.
  8. 8.0 8.1 8.2 "MHRD Annual Report 2014-15" (PDF). MHRD, GoI. p. 67. Retrieved 11 March 2017.
  9. "Navodaya Vidyalaya Samiti". NVS. Archived from the original on 2017-10-27. Retrieved 2016-11-04.
  10. 10.0 10.1 "Cabinet approves setting up of Jawahar Navodaya Vidyalayas in 62 uncovered districts of the country". Press Information Bureau, Government of India. 23 November 2016. Retrieved 11 March 2017.
  11. 11.0 11.1 11.2 "Evaluation Study on Navodaya Vidyalaya Smiti(NVS)" (PDF). NITI Aayog. March 2015. pp. 16–20. Retrieved 11 March 2017.
  12. 12.0 12.1 12.2 12.3 12.4 12.5 Jawahar Navodaya Vidyalaya, NVS. "Regional Offices of NVS". Navodaya vidyalaya samiti. NVS. Retrieved 11 March 2017.
  13. jawahar navodaya vidyalaya, NVS. "Regional Offices of NVS". NVS.
  14. 14.0 14.1 14.2 14.3 14.4 "Jawahar Navodaya Vidyalaya Selection Test (JNVST Statistics)". navodaya.gov.in. Navodaya Vidyalaya Samiti (NVS). Retrieved 21 September 2023.{{cite web}}: CS1 maint: url-status (link)
  15. 15.0 15.1 15.2 15.3 "CBSE Annual Report 2015-16" (PDF). pp. 37–38. Archived from the original (PDF) on 12 మార్చి 2017. Retrieved 10 March 2017.
  16. 16.0 16.1 16.2 "Enrolment Policy". navodaya.gov.in. Retrieved 2021-08-10.
  17. 17.0 17.1 17.2 17.3 17.4 17.5 "Evaluation Study on Navodaya Vidyalaya Samiti(Ch-13)" (PDF). NITI Aayog, GoI. pp. 73–74. Retrieved 15 March 2017.
  18. "Replacing the chalk and the blackboard". The Hindu. 6 January 2017. Retrieved 18 March 2017.
  19. "Samsung Smart Class takes digital literacy to rural India". Economic Times. 27 November 2016.
  20. "Where the gates open to academic excellence". The Times of India. 28 June 2016.
  21. "Migartion of Students for National Integration". NVS, GoI. Retrieved 17 March 2017.
  22. "Navodayas struggle with student suicides: Overworked teachers, lack of counsellors". The Indian Express (in Indian English). 2019-02-04. Retrieved 2021-01-16.{{cite web}}: CS1 maint: url-status (link)
  23. "Suicides in Navodaya schools: 49 in 5 years, half of them Dalit and tribal students". The Indian Express (in Indian English). 2019-02-04. Retrieved 2019-10-03.
  24. "'This place is like hell': Navodaya Vidyalaya tribal student allegedly kills self in hostel, leaves 'note'". The New Indian Express. Retrieved 2019-10-03.
  25. "Lakhimpur: FIR against JNV teacher for 'molesting' Class 7 student". Hindustan Times (in ఇంగ్లీష్). 2018-04-26. Retrieved 2019-10-03.
  26. Pioneer, The. "Parents' demand for CBI probe forwarded to govt". The Pioneer (in ఇంగ్లీష్). Retrieved 2019-10-03.

బయటి లింకులు[మార్చు]


ఉల్లేఖన లోపం: "lower-alpha" అనే గ్రూపులో <ref> ట్యాగులు ఉన్నాయి గానీ, దానికి సంబంధించిన <references group="lower-alpha"/> ట్యాగు కనబడలేదు