ధవళేశ్వరం, తూర్పు గోదావరి జిల్లా, రాజమండ్రి నగర ప్రాంతం.[1][2][3] ఇది గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో భాగంగా కూడా ఉంది. ఈ పట్టణం చివరిలో ఆర్ఠర్ కాటన్ నిర్మించిన ధవళేశ్వరం ఆనకట్ట ఉంది. ఇది కాటన్ గోదావరి నది పై నిర్మించిన నాలుగు ఆనకట్టలలో మొదటిది. దీనిని దాటి వెళ్తే బొబ్బర్లంక, మద్దూర్లంక, విజ్జేశ్వరం అనకట్టలు వస్తాయి. ఈ ఆర్థర్ కాటన్ నిర్మించిన ఆనకట్టలని భారతప్రభుత్వం 1982 సంవత్సరంలో ఆధునికీకరించింది. గోదావరి నది నీటి పారుదల శాఖకు ఇది ముఖ్య కేంద్రం.
రాజమహేంద్రవరం రైలు స్టేషను దాటిన తరువాత ధవళేశ్వరం గ్రామం ప్రారంభం అవుతుంది. ఈ గ్రామానికి తూర్పున బొమ్మూరు గ్రామం, పశ్చిమాన గోదావరి నది, దక్షిణాన వేమగిరి గ్రామాలు ఉన్నాయి. ధవళేశ్వరం ఆనకట్ట మీదుగా వెళితే, పిచ్చుకలంక, బొబ్బర్లంక గ్రామాల మీదుగా విజ్జేశ్వరం వద్ద పశ్చిమ గోదావరి జిల్లా చేరుకోవచ్చు.
ధవళేశ్వరం తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ మండలంలో ఉన్న ఒక జనాభా లెక్కల పట్టణం. 2011 భారత జనాభా లెక్కల ప్రకారం, ధవళేశ్వరం పట్టణంలో మొత్తం 11,631 కుటుంబాలు నివసిస్తున్నాయి. పట్టణ పరధిలో మొత్తం జనాభా 44,637, అందులో 21,681 మంది పురుషులు కాగా, 22,956 మంది స్త్రీలు ఉన్నారు. పట్టణ సగటు లింగ నిష్పత్తి 1,059. పట్టణ పరిధిలో నగరంలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 4527, ఇది మొత్తం జనాభాలో 10%. 0-6 సంవత్సరాల మధ్య 2255 మంది మగ పిల్లలు, 2272 మంది ఆడ పిల్లలు ఉన్నారు. బాలల లింగ నిష్పత్తి 1,008, ఇది సగటు లింగ నిష్పత్తి (1,059) కంటే తక్కువ.పట్టణ అక్షరాస్యత మొత్తం రేటు 78.9%. తూర్పుగోదావరి జిల్లాలో 71%తో పోలిస్తే దౌలేశ్వరంలో అక్షరాస్యత ఎక్కువగా ఉంది. పురుషుల అక్షరాస్యత రేటు 83.02%, స్త్రీల అక్షరాస్యత రేటు 75.1%.
గ్రామంలో అనేక ప్రభుత్వ, ప్రయివేటు ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. బాలురకు, బాలికలకు విడివిడిగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉంది.
ధవళేశ్వరం గ్రామానికి మంచి రవాణా సదుపాయాలు ఉన్నాయి. ఈ గ్రామం గుండా పదహారవ నంబరు జాతీయ రహదారి పోతున్నది. ఈ రహదారి విశాఖపట్నం, విజయవాడలను కలుపుతుంది. రాజమహేంద్రవరం నుండి కాకినాడ, అమలాపురం, రామచంద్రపురం మొదలైన జిల్లాలోని ప్రధాన పట్టణాలకు పోవు రాష్ట్ర రహదారి ఈ గ్రామం మీదుగా వెళ్తుంది. ధవళేశ్వరం ఆనకట్ట మీదుగా బొబ్బర్లంక, విజ్జేశ్వరం వద్ద పశ్చిమ గోదావరి జిల్లాను చేరుకోవచ్చు. సమీపంలో రాజమహేంద్రవరంలో రైల్వే స్టేషన్, విమానాశ్రయం ఉంది.
ధవళేశ్వరం రాజమహేంద్రవరం పొలిమేర్లలో ఉండడం వల్ల బాగా అభివృద్ధి చెందుతున్నది. గ్రామానికి దగ్గర్లోని రైలు స్టేషను రాజమహేంద్రవరం. రాజమహేంద్రవరం నుండి ఈ గ్రామానికి తరచు బస్సు సదుపాయం ఉంది. గ్రామంలో ఒక బస్సు స్టాండు కూడా ఉంది. తొలి తెలుగు నవలగా పేరుగొన్న రాజశేఖర చరిత్రములో కథా స్థానంగా ధవళేశ్వరం వివరణ ఉంది. కందుకూరి వీరేశలింగం ఈ ఊరిలో నివసించాడు.
ధవళేశ్వరం బ్యారేజి: సాయంత్రం వేళ ఈ ఆనకట్ట చూడడానికి చాలా బాగుంటుంది. చుట్టుపక్క గ్రామంల నుండి చాలా మంది సందర్శకులు నిత్యం ఇక్కడకు వస్తారు. బ్యారేజి దిగువన గల ఇసుక తిన్నెలు పిల్లలకు పెద్దలకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి.
కాటన్ వాస్తుప్రదర్శనశాల, ధవళేశ్వరం కాటన్ మ్యూజియం: కాటన్ మ్యుజియం కాటన్ ఆనకట్ట గురించిన చరిత్రను వివరిస్తుంది. కాటన్ గారు అప్పట్లో వినియోగించిన వస్తువులు, ఆనకట్ట నిర్మాణ సామగ్రిని ఇక్కడ మనం చూడవచ్చు. ఆనకట్ట కట్టుటకు కాటన్ ఉపయోగించిన పద్ధతులు, అప్పటి పరిస్థితులను కళ్ళకు కట్టినట్లు చూపించే చిత్రాలు ఇక్కడ చాలా ఉన్నాయి. ఈ మ్యూజియంలో ఒక మంచి వనము కూడా ఉంది.
రామపాదాల రేవు - ప్రధాన పుష్కరాల రేవు,
జనార్ధనస్వామి ఆలయం: ఈ ఆలయం నవ జనార్ధన ఆలయములలో ఒకటి. ఈ ఆలయం 'ధవళగిరి' అను ఒక గుట్ట పైన ఉంది. స్వామి వారికి ప్రతి సంవత్సరం నిర్వహంచు కల్యాణం ఒక పెద్ద ఉత్సవం. ప్రతి సంవత్సరం భీష్మ ఏకాదశి దినమున జరుగు ఈ ఉత్సవం చుట్టు పక్కల జిల్లాల నుండి కూడా భక్తులను ఆకర్షిస్తుంది. ఆ రోజు జరుగు రథోత్సవం చాలా బాగుంటుంది. దీనినే తీర్థం అని కూడా అంటారు. మొదట్లో 5 రోజులు జరిగేదని పెద్దలు చెపుతారు. ఇపుడది 2 రోజులకు పరిమితమైంది. ప్రముఖులైన టంగుటూరి ప్రకాశం పంతులు గారు రాజమండ్రిలో చదువుకునే రోజుల్లో ఒకసారి ఈ తీర్థానికి విచ్చేశారు.
లూథరన్ చర్చి: ధవళేశ్వరం గ్రామంలో పురాతనమైన, అతి పెద్దదైన చర్చి ఉంది. దీనిని నిక్కం మెమోరియల్ ఇమ్మానుయెల్ లూథరన్ చర్చి అని అంటారు. విస్తీర్ణంలో పెద్ద కట్టడం అవడం వలన స్థానికులు దీనిని పెద్ద చర్చి అని అంటారు. ఇది ఆంధ్రా ఇవాంజిలికల్ లూథరన్ మిషన్ కు సంబంధించింది. మరొక ముఖ్యమైన విషయం, చర్చి కట్టడంలో ప్రముఖ విశేషం - చర్చి గోపురం, దానిలో ఉంచిన పెద్ద కంచు గంట. అ రోజులలో అంత భారీ గంటను అంత పైకి ఎక్కించటం అనేది నాటి పని వారి పనితనానికి మచ్చు తునక .
అగస్త్యేశ్వరస్వామి ఆలయం: పురాతన స్వయంభూ శివాలయం. శ్రీ అగస్త్యేశ్వర స్వామి అనే ముని వల్ల శివలింగం ఉద్భవించినది గనుక, ఈ గుడిని అగస్త్యేశ్వర స్వామి ఆలయం అని అంటారు.
సుందర చైతన్యానంద స్వామి ఆశ్రమం: సుందర చైతన్యానంద స్వామి ఆశ్రమం ఒక ఆధ్యాత్మిక ఆశ్రమం. ఇక్కడ గల వనం మానసిక ప్రశాంతతను కలుగజేస్తుంది.
కంట్రి క్లబ్ విహార కేంద్రం: గోదావరి నది ఒడ్డున గల కంట్రీక్లబ్ విహార కేంద్రంలో సేద తీరుటకు గల అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. ఒక మంచి రెస్టారెంట్ కూడా ఇక్కడ ఉంది.